పేజీలు
24, మే 2025, శనివారం
పాస్కాకాలపు ఆరవ ఆదివారము
17, మే 2025, శనివారం
ఆదిమ క్రైస్తవ విశ్వాసం - నూతన ఆజ్ఞ
పాస్కకాలపు ఐదవ ఆదివారం
సువిశేషం: యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను: “ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పరుపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమ పరుపబడెను. ఆయన యందు దేవుడు మహిమ పరుపబడిన యెడల, దేవుడు తన యందు ఆయనను మహిమ పరుచును. వెంటనే ఆయనను మహిమ పరుచును. చిన్న బిడ్డలారా !నేను కొంత కాలము మాత్రమే మీతో ఉందును . మీరు నన్ను వేదకెదరు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరి నొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగియున్నచో, దానిని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలిసికొందురు."
ఆదిమ క్రైస్తవ జీవిత ఔన్నత్యం
మొదటి పఠనంలో పౌలు మరియు బర్నబాలు, వారి సువార్త పరిచర్యలో అనేక మందిని తమ శిష్యులుగా చేశారు. నూతనముగా క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చిన వారు విశ్వాసంలో జీవించాలని వారిని ప్రోత్సహించి వారికి ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నారు. అది ఏమిటి అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు మనము పెక్కు శ్రమలను అనుభవించాలి అని వారికి భోదిస్తున్నారు. అపో 14:22. ప్రియ మిత్రులారా ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఈ రోజు మనం అనుకున్నది జరగనప్పుడు, మనం జీవితంలో కష్టం వచ్చినప్పుడు, నేను ఎందుకు దేవుడిని నమ్మాలి , విశ్వాసించాలి అని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. అటువంటి ప్రశ్నలకు ఈ మొదటి పఠనం సమాధానం చెబుతుంది.
క్రైస్తవుల మీద రాజ్య హింసలు
ఆదిమ క్రైస్తవులు ఎన్నో కష్టాలు పడి వారి విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. ఎటువంటి కష్టాలు వీరు అనుభవించారు అంటే, ఆదిమ క్రైస్తవ చరిత్ర ఒకసారి పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. ఆదిమ క్రైస్తవులను రాజులు , రాజ్యాలు, దేశ, రాజ్య వ్యతిరేకులుగా పరిగణించేవారు. కొంత మంది రాజులు చాలా క్రూరంగా క్రైస్తవులను హింసించేవారు. వలెరియన్, డైయక్లేషీన్ అనేటువంటి చక్రవర్తులు ఎక్కువగా క్రైస్తవులను హింసించారు. వీరికి విధించిన శిక్షలు ఏమిటి అంటే, క్రూర మృగాలకు వీరిని ఆహారముగా వేసేవారు, లేక అగ్నిలో కాల్చి చంపేవారు. ఇటువంటి కష్టాలను అనుభవించడానికి కూడా వారు సిద్దపడ్డారు. కానీ వారి విశ్వాసాన్ని కోల్పోలేదు. వీరి జీవితాలను చూస్తే మనకు ఎలియజరు, దానియేలు స్నేహితులు, ఏడుగురు కుమారులు ప్రాణాలను అర్పించడం లాంటివి మనకు గుర్తుకు వస్తాయి.
విశ్వాసానికి కట్టుబడిన జీవితాలు
ఇక్కడ ఆదిమ క్రైస్తవ జీవితాలలో ఒకరు అయిన సీప్రియన్ అనే పునీతుని జీవితాన్ని గమనించినట్లేయితే మనకు వారి విశ్వాసం ఎంత గట్టిదొ తెలుస్తుంది. పునీత సీప్రియన్ ఒక అన్యుడు మరియు చాలా పేరు పొందిన లాయరు. ఆయన గొప్ప లాయరుగా చాలా ప్రసిద్ధి చెందినవారు. ఆయన యేసు ప్రభువును తెలుసుకొని తన జ్ఞానంతో యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని క్రైస్తవునిగా మారాడు. అది తెలుసుకున్న అక్కడి పెద్దలు మరల ఆయనను, తన పాత విశ్వాసానికి తిరిగి రావాలని, తన పాత జీవితానికి వచ్చినట్లయితే అతనికి డబ్బులు , సంపదలు, ఇస్తాము అని చెప్పారు. కానీ తాను యేసు ప్రభువును వీడాటానికి సిద్ధపడలేదు. ఎప్పుడైతే వారు ఆయనను మారమని అడుగుతున్నరో ఆయన తన విశ్వసాన్ని ఇంకా ఎక్కువగా వ్యక్తపరిచాడు. వారికి ఆయన ఒక మాట చెప్పాడు. అది ఏమిటి అంటే దేవున్ని తెలుసుకున్న ఒక మంచి ఆత్మను మార్చలేరు. అలానే ఆయన్ను మార్చలేక ఆయన్ను శిక్షించాలని నిర్ణయించి అందరు చూస్తుండగా తన తలను నరికివేయడం జరిగింది.
ఇటువంటి శిక్ష ఉంటుంది అని తెలిసికూడా వారు తమ విశ్వాసాన్ని ప్రకటించారు. ఆదిమ క్రైస్తవ జీవితాలు మనకు మార్గ చూపరిగా ఉంటాయి. ఇంతటి గడ్డుకాలంలో వారు జీవించిన ఇతరులకు కీడు చేయాలి అని వారు అనుకోలేదు. కానీ ఈరోజు మనం మనకు వ్యతిరేకముగా ఏమైనా జరిగితే ఇంకా నేను ఎందుకు దేవాలయం రావాలి ? నేను ఎందుకు దేవున్ని నమ్మాలి అని అనుకుంటాం. వీరు ఎందుకు నమ్మారు దేవున్ని అంటే కేవలం ఈ లోకం కోసం మాత్రమే కాదు అని వారి విశ్వాసం తెలియచేస్తుంది. ఈనాటి సువిశేషం మనం ఇంత గొప్ప జీవితం, జీవించే మార్గం చూపుతుంది.
నూతన ఆజ్ఞ
యేసు ప్రభువు తన శిష్యులను ఒకరి నొకరు ప్రేమించుకొనుడు అని చెప్పారు.యేసు ప్రభువు యొక్క బోధన మోషే ధర్మ శాస్త్రం మీద ఆధారపడి వుంది. ఎందుకంటె ఇది లెవీయా కాండం లో , ద్వితీయోపదేశ కాండంలో ఈమాటలు చెప్పబడ్డాయి. కానీ యేసు ప్రభువు చెప్పే ప్రేమ మొత్తం కూడా మోషే ధర్మ శాస్త్రం చెప్పేదాని కన్నా గొప్పది. ఎందుకంటే యేసు ప్రభువు ప్రజలను తన కన్నా ఎక్కువగా ప్రేమించాడు. యోహను సువిశేషంలో యేసు ప్రభువు ఇతరులను మీ కన్నా ఎక్కువగా ప్రేమించండి అని చెపుతున్నారు. యోహను 13: 34. యేసు ప్రభువు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నారు.ఇక్కడ అంత క్రొత్త ధనం ఏముంది? ఈ నూతన ఆజ్ఞలో అంటే యేసు ప్రభువు తనను తాను పరిత్యాగం చేసుకుంటున్నారు మన కోసం. ఆయన ప్రేమను తన మరణం ద్వార వ్యక్త పరుస్తున్నారు.
యేసు ప్రభువును అనుసరించే వారి అందరి జీవితాలు కూడా ఇటువంటి ప్రేమ కలిగిఉండాలి అని ఈ నూతన ఆజ్ఞ తెలియ జేస్తుంది. ఈ నూతన ఆజ్ఞ, క్రైస్తవులను తమ పొరుగువారిని, వారికంటే ఎక్కువగా ప్రేమించమని పిలుస్తుంది. ఎవరిని శత్రువులుగా కానీ , ప్రేమకు అనర్హులుగా కానీ చూడదు. ఇది నిజానికి యేసు ప్రభువు యొక్క వీడ్కోలు భోధనలో భాగము అంటే చివరిగా యేసు ప్రభువు తన శిష్యులకు ఇచ్చిన సందేశం. లూకా సువిశేషంలో 10:27 దీనినే మనకు అత్యున్నతమైన ఆజ్ఞగా చెప్పబడుతుంది. ఇక్కడ ఉదాహరణగా మంచి సమరియుని కథను చెప్పబడింది. నీకు సంబందం లేని వారికొరకు కూడా నీవు సహాయం చేయాలి అని తెలియజేస్తుంది.
అత్యున్నత ఆజ్ఞ
యేసు ప్రభువుని ప్రశ్న అడిగిన ధర్మ శాస్త్ర భోదకుడు ద్వితీ 6:5, లెవీ19:18 గురించి మాటలాడుతున్నాడు. మత్తయి సువిశేషంలో పరిసయ్యుడు యేసు ప్రభువును పరీక్షింప కోరి అత్యున్నతమైన ఆజ్ఞ ఏది అని అడిగారు , మత్తయి 22:35 , దానికి యేసు ప్రభువు ద్వితీ 6:5 చెబుతున్నాడు. కాని యోహను సువిశేషంలో యేసు ప్రభువే తన శిష్యులకు బోధిస్తారు,ఈ ఆజ్ఞ గురించి మిగిలిన సువిశేషాలలో, ధర్మ శాస్త్ర భోదకులు యేసు ప్రభువుని ప్రశ్నిస్తారు . దానికి జవాబుగా యేసు ప్రభువు సమాధానం చెబుతారు. ఇక్కడ యేసు ప్రభువు తన శిష్యులను ఒక నూతన సమాజంగా తయారు చేస్తున్నారు. యూదుల వలె కాకుండా వీరి జీవిత విధానం యేసు ప్రభువు వలె ఉండేలా చేయలని ప్రయత్నిస్తున్నారు. అంటే క్రైస్తవులు ఒక ప్రత్యేకమైన సమూహం.
యేసు ప్రభువు స్థాపించే ఈ సమూహంలోని శిష్యులు, యేసు ప్రభువు వారిని ఏవిధంగా ప్రేమించారో, వారుకూడా ఒకరి నొకరు అధేవిధంగా ప్రేమించుకోవాలసి ఉంటుంది. నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరును ఒకరి నొకరు ప్రేమించు కోవాలి అంటే యేసు ప్రభువుని ప్రేమ, మన ప్రేమకు కొలమానం కావాలి. పాత నిబందనలో ప్రేమకు కొలమానం ధర్మ శాస్త్రం. కానీ నూతన ఆజ్ఞలో ప్రేమకు కొలమానం యేసు ప్రభువుని ప్రేమ. నూతన ఆజ్ఞ , పరస్పర ప్రేమ కలిగి ఉండాలి అని కోరుతుంది. ప్రేమించడం ప్రేమించబడటం అనేది ఈ నూతన సమూహాన్ని యేసు ప్రభుని నిజమైన అనుచరులనుగా చేస్తుంది. అందుకే యేసు ప్రభువు , తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ఇచ్చువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవ్వడు లేడు అని యోహను 15:13-15 లో చెబుతున్నారు. యేసు ప్రభుని అనుచరులు ఆయన ప్రేమను కొనసాగించేవారిగా ఉండాలి. ప్రేమ ఆజ్ఞను అవలంబించడం ద్వారా శిష్యులు దేవుని ప్రేమకు ప్రతినిధులుగా ఉంటారు. ఈ ఆజ్ఞను అనుసరించడమే క్రీస్తు నాధుని అనుసరణగా వారి జీవితాలు మారాలి.
యేసు ప్రభువు ఎంతగా మనలను ప్రేమించారు
యేసు ప్రభుని ప్రేమ స్వభావం ఏమిటి? ఏలా ఆయన ప్రజలను ప్రేమించారు? ఇది మూడు విధాలుగా జరిగిఉండవచ్చు. మొదటిగా యేసు ప్రభువు తన శిష్యులను తన కంటే తక్కువ ప్రేమించి ఉండాలి, లేక తన వలె ప్రేమించి ఉండాలి లేక తన కంటే ఎక్కువగా ప్రేమించి ఉండాలి. ఆయన జీవితం ద్వారా మనకు తెలిసేది ఏమిటి అంటే ఆయన తన శిష్యులను ఆయన కంటే ఎక్కువగా ప్రేమించారు. యోహను 3:16 లో దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ఇచ్చెను అని వింటున్నాం. యోహను 15:13 తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ఇచ్చువానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవరు లేరు అని కేవలం మాటలు చెప్పలేదు, తన ప్రాణమును ధారపోస్తున్నాడు.
ఆయన అనుచరులు ఎందుకు ఈ విధంగా జీవించాలి అంటే వారు పరిపూర్ణులుగా ఉండాలి. మత్తయి 5:46 వ వచనం మిమ్ములను ప్రేమించే వారినే మీరు ప్రేమించినచో మీ ప్రత్యేకత ఏమి ఉంటుంది అని అడుగుతుంది. అందరు అది చేస్తారు కాదా! నీవు ఏ విధంగా జీవించాలో ఒక కొలమానం ఉంది , అది పరిపూర్ణత కలిగి ఉండటం. యేసు ప్రభువు వలె జీవించడం. మత్తయి 5:48లో యేసు ప్రభువు చెప్పే ఈ ప్రేమ, మనకు సాధ్యమా? దీనిని అంత సులువుగా సాధించగలమా? ఇది అంత సులువైన పని ఏమి కాదు, కానీ ఇది యేసు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ దీనిని పాటించడం వలన అందరు మనం క్రీస్తు అనుచరులం అని గ్రహించ గలుగుతారు. శిష్యులు ఇది చేయగలిగితే వారు లోకములో వెలుగువలె ప్రకాశిస్తారు. మత్తయి 5:15. లోకం అది చూసి వెలుగు దగ్గరకు వస్తుంది. ఈ ఆజ్ఞ ఇచ్చే ముందుగానే యేసు ప్రభువు తన శిష్యులకు ఒక మాతృకను చూపిస్తున్నారు. తాను వారి పాదాలు కడుగుట ద్వారా, ముందుగానే వారిని సిద్ధం చేస్తున్నారు.
యేసు ప్రభువు శిష్యులనుఎలా తెలుసుకోవచ్చు?
నూతన ఆజ్ఞ శిష్యులకు ఒక సవాలు. నిజముగా వారు ఆయన అనుచరులేనా? లేదా? అని తెలుసుకునే సాధనం కూడా. యేసు ప్రభువుకు యూద, తనను శత్రువులకు అప్పగించనున్నాడని తెలిసికూడా ఆయనను కించ పరచలేదు. అతన్ని అగౌరపరచలేదు. ఎటువంటి వ్యత్యాసం చూపించలేదు. తనని శత్రువుగా చూడలేదు. మనం చేయవలసినది కూడా అదే. ఎవరిని శత్రువుగా భావించి, వారికి వ్యతిరేకముగా జీవించనవసరం లేదు. మన జీవితం మనం క్రీస్తు అనుచరులుగా జీవిస్తే చాలు. యోహను మొదటి లేఖలో ఈ నూతన ఆజ్ఞ క్రైస్తవ సంఘానికి ఒక శాసనం అయ్యింది. 1 యోహను 4:7-8 వచనలలో మీరు మీ సోదరి సోదరులను ప్రేమించకుండా దేవున్ని ప్రేమిస్తున్నాం అని చెప్పకూడదు అంటున్నారు.
ఎవరు యేసు ప్రభువు శిష్యులు అవుతారు?
ఎవరు మేము యేసు ప్రభువు అనుచరులం అని చెప్పుకోవడానికి అర్హులు అంటే ఇతరులను ప్రేమించే వారు, ఎవరిని ద్వేషించనివారు, శపించని వారు, ఇతరులను తృణీకరించనివారు, మోసం చేయనివారు, హింసించనివారు.
యేసు ప్రభువును అనుసరించే వారికి, ఆయనను విశ్వసించే వారికి, అందరికి యేసు ప్రభువు ఈ ఆజ్ఞను ఇస్తున్నారు. ఆయన వలె జీవించవలసిన అవసరం ఉంది, ఆయన అనుచరులం అని చెప్పుకున్నప్పుడు. మనం మన పొరుగువారిని ఎక్కువగా ప్రేమించాలి. ఎంత వరకు ప్రేమించాలి అని అంటే మన ప్రాణమును పొరుగువారి కొరకు ఇచ్చేంతగా ప్రేమించాలి. ఆ విధంగా జీవిద్దాం. నిజమైన క్రీస్తు అనుచరులగా నిలుద్దాం.
16, మే 2025, శుక్రవారం
యేసు క్రీస్తును చూచుటయే దేవున్ని చూచుట
యోహాను 14:6-14
యేసు ప్రభువు దేవున్ని లోకానికి ఎరుక పరిచారు
యేసు ప్రభువే తండ్రికి మార్గం
యేసు ప్రభువు మాత్రమే సత్యం
యేసు ప్రభువే జీవం
యేసు ప్రభువుని చూడటం తండ్రిని చూడటమే
15, మే 2025, గురువారం
కలవరపడకుడు యేసు మీతో ఉన్నాడు
యోహాను 14: 1-6
యేసు వారితో "మీ హృదయములను కలవరపడనియకుడు. దేవుని విశ్వసింపుడు. నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. లేకున్నచో నేను మీతో అటుల చెప్పను. నేను మీకొక నివాసస్థానమును సిద్దము చేయబోవుచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి, మరల వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు." అనెను. తోమా ఆయనతో "ప్రభూ! మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు. ఇక మార్గమేట్లు ఎరుగుదుము?" అనెను. అందుకు యేసు, "నేనే మార్గమును, సత్యమును, జీవమును నా మూలముననే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు.
శిష్యుల ఎందుకు కలవరపడుతున్నారు?
యేసు ప్రభువు తన శిష్యులతో మీ హృదయములను కలవరపడనియకుడు అని చెబుతున్నారు. వీరు కలవరపడవలసిన పరిస్తితి ఎందుకు వచ్చినది? ఎందుకంటే యేసు ప్రభువు వారి నుండి వెళ్లిపోతున్నాను అని చెప్పారు. మూడు సంవత్సరాలు వారు యేసు ప్రభువుతో కలిసి జీవించారు. ఆయన చేసిన అన్ని అద్భుతకార్యములకు, ఆయన చూపిన కారుణ్యమునకు వీరు సాక్షులు. శిష్యులకు ఆయన జీవితం భరోసా అయ్యినది. అటువంటి ప్రభువు ఇప్పుడు వారి నుండి వెళ్లిపోతున్నారు. ఇంకా ఎందుకు వీరు కలవరపడుతున్నారు? యేసు ప్రభువుకి పరిసయ్యులు, ధర్మ శాస్త్ర భోదకులు కొంత మంది సద్దుకయ్యులు శత్రువులుగా మారిపోయారు. ఇప్పుడు యేసు ప్రభువు వీరి నుండి వెళ్లిపోతే యేసు ప్రభువు శిష్యులు వారికి శత్రువులుగా మారి వీరిని, శిక్షిస్తారు అని కలవరం వారికి ఉండవచ్చు. యేసు ప్రభువుకు మరియు శిష్యులకు ఉన్న సంబంధం చాలా అన్యోన్యత కలిగిఉన్నది. ఈ అన్యోన్యత తెగిపోతుంది అని వారు కలవరపడి ఉండవచ్చు.
ఎందుకు ప్రభువు శిష్యులు కలవరపడకూడదు
యేసు ప్రభువుతో పేతురు తన కోసం మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, అందరు వెళ్ళిపోయిన, తాను వదలి వెళ్ళను అని అన్నాడు, దానికి యేసు ప్రభువు, పేతరు తనను ఎరుగనని చెబుతున్నారు ఏమి జరుగబోవుతుందో అని కలవరపడిఉండవచ్చు. తమ గురువును వారే అమ్మబోవుతున్నారు అని యేసు ప్రభువు చెబుతున్నారు, అది తలచుకొని వారు కలవరపడి ఉండవచ్చు. ప్రతి ఒక్కరికీ ఒక్కో కారణం ఉండి ఉండవచ్చు కలవరపడటానికి , అది వారికి యేసు ప్రభువుకు మధ్య ఉన్న అన్యోన్యత మరియు ప్రేమ మీద ఆధారపడుతుంది. యేసు ప్రభువు వీరికి కలవరపడవద్దు అని చెబుతున్నారు. వీరు కలవరపడకుండా ఉండుటకు ఆయన కారణం చెబుతున్నారు. ఆయన వారి నుండి పోవుతున్నది వారి కోసమే అని చెబుతున్నారు. వారు ఎందుకు కలవరపడనవసరం లేదంటే, ఆయన వారి నుండి వెల్లుతున్నది వారికి ఒక నివాసస్థానం ఏర్పాటు చేయడానికి. మరలా ఆయన వారి వద్దకు వచ్చును. ఆయన వుండే చోటునే వీరు కూడా ఉండే విధంగా ఆయన చేస్తారు. కనుక వారు కలవరపడనవసరం లేదు.
యేసుప్రభువు శాశ్వత నివాసము ఏర్పాటు చేయుటకు వెళుతున్నారు.
"నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. లేకున్నచో నేను మీతో అటుల చెప్పను. నేను మీకొక నివాసస్థానమును సిద్దము చేయబోవుచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి, మరల వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును." నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. యేసు ప్రభువు తన తండ్రి గురించి ఎప్పుడు చెబుతూనే ఉన్నారు. ఇక్కడ కూడా మనం చూసేదీ తండ్రికి మరియు కుమారునికి మధ్యగల సంబంధం, అందుకే ఆయన "నా"తండ్రి గృహమున అనేక నివాసములు కలవు అని చెబుతున్నారు. ఈ సంబంధం గురించి ఆయన అనేక సార్లు చెప్పుటకు కారణం ఏమిటి అంటే తన తండ్రిని ఆయన అంతగా ప్రేమిస్తున్నారు అని తెలియచేయడమే, ఆయనే పనులను మాత్రమే కుమారుడు చేస్తున్నాడు. తండ్రికి తెలియకుండా ఏమి చేయుటలేదు. ఆయన తన తండ్రి గృహమున మనకు ఒక నివాసాన్ని ఏర్పాటుచేయడానికి కల్వరి కొండమీద శిలువ మరణం ద్వారా మనకు సిద్దపరుస్తున్నాడు. మూడు రోజులు భూగర్భంలో ఉండి మనకు నివాసాన్ని ఏర్పాటుచేస్తున్నాడు.
యేసు ప్రభువుతో ఎల్లప్పుడు ఉండుట
"నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును." యేసు ప్రభువు ఇక్కడ చేసిన ఈ వాగ్ధానం తన శిష్యులకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆయన తన శిష్యులను వదలి వేయడం లేదు. ప్రత్యేకంగా వీరి కొరకు వస్తాను అని చెబుతున్నారు. ఇది లోకాంతంలో కాదు. ఇది తన శిష్యులు ఎప్పుడు కూడా ఆయన సాన్నిధ్యం పొందేలా చేస్తుంది. అంతేకాక వీరిని తన వద్దకు చేర్చుకుంటాను అని చెబుతున్నారు. యేసు ప్రభువు తన శిష్యులను , మరియు తన శిష్యుల ద్వారా ఆయన అనుచరులు అయిన వారికి ఇచ్చిన ఒక గొప్ప వరం ఇది. నేను ఉండు స్థలమునే మీరును ఉండునట్లు నా వద్దకు చేర్చుకొందును అనే వాగ్ధానం మరల ఆయన శిష్యులు ఎవరు నీరుత్సాహంలో లేకుండే చేసే వాగ్ధానం. కాని దీనిని ఎల్లప్పుడు గుర్తుంచుకోవడంలో మనం విఫలం చెందుతున్నాము. యేసు ప్రభువు చేసిన ప్రతి వాగ్ధానం మనం గుర్తు చేసుకొని మనం జీవించినచో మన జీవితంలో ఎటువంటి అపాయంలో కూడా మనం కలవరపడకుండా ఉండగలం.
తోమా ఆయనతో "ప్రభూ! మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు. ఇక మార్గమేట్లు ఎరుగుదుము?" అనెను. తోమస్సు యేసు ప్రభువు చెప్పిన మాటలు అర్ధం చేసుకోలేక పోయాడు. అందుకే ఆయనే వేరే ఎక్కడకు వెళుతున్నారో తెలియదు అని చెబుతున్నారు. తోమసు మొదటి నుండి తనకు అర్ధం కాని విషయములను అడుగుటకు సిగ్గుపడలేదు. ప్రభువు ముందు తనను అప్పుడు గొప్పవాడిగా లేక మొత్తం తెలిసిన వానిగా చూపించుకోవాలని చూడలేదు, తన నిజ స్తితి ఎప్పుడు బహిర్గతం చేస్తునే ఉన్నాడు. అందుకే ప్రభూ మీరు ఎక్కడకు వెళుతున్నారో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు ఎరగుదుము అని అంటున్నారు. అందుకు ప్రభువు నేనే మార్గము సత్యము జీవము. నా మూలమునే తప్ప ఎవడును తండ్రి దగ్గరకు రాలేడు అని చెబుతున్నాడు.
యేసు ప్రభువు మాత్రమె దేవునికి మార్గం
దేవున్ని మనం ఎలా తెలుసుకోగలము? ఆయన దగ్గరకు మనం ఎలా వెళ్లగలము? ఆయన ఎవరు? అనే ప్రశ్నలకు యేసు ప్రభువు మాటలలో మనకు సమాధానం దొరకుతుంది. అంతేకాక ఆ సమాధానం ఆయనే అవుతున్నారు. యేసు ప్రభువే తండ్రి దగ్గరకు వెళ్ళుటకు మార్గం, మరియు ఆయన మన గమ్యంగా ఉంటారు, ఎందుకంటే ఆయనను చేరుకున్నప్పుడు తండ్రిని చేరుకున్నట్లే, ఆయన తండ్రి యందు తండ్రి ఆయన యందు ఉన్నారు. ఆయనే సత్యము, ఆయన కేవలం సత్యమును తెలియజేయుటకు మాత్రమే రాలేదు, ఆయనే సత్యం, ఆయన మాత్రమే నిత్యుడు, ఆయన మనకు జీవం ఇచ్చువాడు మాత్రమే కాదు ఆయనే జీవము. కనుకనే యేసు ప్రభువు మాత్రమే తండ్రి దేవుని దగ్గరకు మార్గం, ఆయన ద్వారా మాత్రమే మనం తండ్రిని చేరుకోగలం.
ప్రార్ధన : ప్రభువా! మీరు మీ శిష్యులకు కలవరపడకుడు అని చెబుతున్నారు, వారికి మరలా మీ దగ్గరకు వస్తాను అని అభయమిస్తున్నారు, వారికి నివాసస్థానము తయారు చేస్తాను అని వాగ్ధానం చేస్తున్నారు. మా జీవితములవ కూడా ప్రభువా మేము అనేక విషయముల గురించి కలవరపడుతున్నాము. మా జీవితములలో వచ్చే సమస్యలతో మేము కలవరపడుతున్నాము. అప్పుడు మాకు తోడుగా ఉండండి. మాకు కూడా మీ భరోసా ఇవ్వండి. మాకు కూడా మీ రాజ్యంలో నివాసస్థానం ఏర్పాటు అనుగ్రహించండి. మాకు మార్గ చూపరిగా ఉండండి. మాకు మార్గం, సత్యం, జీవమై మమ్ము దీవించండి. ఆమెన్.
14, మే 2025, బుధవారం
యేసు ప్రభువుని వ్యక్త పరచుట- శిష్యుల కర్తవ్యం
యోహాను 13: 16-20
దాసుడు తన యజమానునికంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులను మీరు ఎరుగుదురు. వీని ప్రకారము నడుచుకొనినచో మీరు ధన్యులు. నేను మీ అందరి విషయమై మాటాడుట లేదు. కాని 'నాతో భుజించువారు నాకు విరుద్ధముగా లేచును. అను లేఖనము నెరవేరుటకై ఇట్లు జరుగుచున్నది. అటుల జరిగినపుడు నేనే ఆయనను అని మీరు విశ్వసించుటకై ఇది జరుగుటకు పూర్వమే మీతో చెప్పుచున్నాను. నేను పంపిన వానిని స్వీకరించువాడు నన్నును స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపినవానిని స్వీకరించుచున్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."
సువిశేషంలోని ఈ భాగము యేసు ప్రభువునకు మరియు శిష్యులకు ఉన్న బంధమును , తన శిష్యులను స్వీకరించువానికి సంబంధించి బోధిస్తున్నాయి. యేసు ప్రభువుతో ఉండి ఆయనకు వ్యతిరేకంగా యూదా చేయు పనిని తెలియజేస్తూ , తరువాత శిష్యులు దైర్యంగా ఉండుటకు , స్వార్ధం లేకుండ ఉండుటకు ముందుగానే వారిని హెచ్చరిస్తున్నారు. ఎవరు అయితే యేసు ప్రభువును స్వీకరించారో వారు తండ్రిని స్వీకరించారని, యేసు ప్రభువు శిష్యులను స్వీకరించువారు యేసు ప్రభువును స్వీకరిస్తున్నారని ప్రకటిస్తున్నారు. ఇది యేసు ప్రభువు మరియు శిష్యుల అన్యోన్యతను మరియు ప్రభువు తన శిష్యుల ద్వారా ఇతరులకు తెలియపరచబడాలని కోరుకుంటున్నాడు అని తెలియజేస్తుంది.
శిష్యుల ప్రవర్తన ఎలా ఉండాలి
యేసు ప్రభువు తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఇవి. శిష్యుడు గురువు కంటే గొప్పవాడు కాదు. యేసు ప్రభువును లోకం ఎలా చూసినదో, శిష్యులను కూడా అలానే చూస్తుంది. అప్పుడు ఈ శిష్యులు రాబోయే కష్టాలు, నష్టాలు బాధలు చూసి చెదిరిపోకుండా ఉండాలి. ప్రభువు శ్రమలకు గురైనట్లే వీరుకూడా శ్రమలకు గురవుతారు. యేసు ప్రభువు ఎలా సేవ చేశారో, వీరు కూడా అలానే చేయాలి, ఆయన గురువు, బోధకుడు అయ్యివుండి కూడా వారి కాళ్ళు కడిగారు, వారి మీద పెత్తనం చేయలేదు. వారి అవసరంలో ఆదుకున్నాడు. క్రీస్తు విశ్వాసికి, శిష్యునకు గర్వం లేక అహంకారం ఉండకూడదు. ప్రభువు పట్ల వినయం, ప్రజల పట్ల సేవభావం మాత్రమే వారికి ఉండాలి.
ప్రభువు మాటను ఆచరించుట గొప్ప ధన్యత
యేసు ప్రభువు తన శిష్యులను అన్నివిధాలుగా సిద్దపరిచాడు. ఏవిధంగా వారు ధన్యులు అవుతారో వారికి తెలియజేస్తున్నారు. కేవలం యేసు ప్రభువు వద్ద నుండి వారు చూచిన ఈ ప్రేమ గురించి, ఈ వినయం గురించి తెలుసుకోవడం వలన వారు గొప్ప వారు కారు, ఎప్పుడైతే ఆయన శిష్యులు యేసు ప్రభువు వలే ప్రేమ జీవితం జీవిస్తూ, ఇతరులకు సేవ చేస్తూ, అహం లేకుండ ఉంటారో అప్పుడు వారు గొప్పవారు అవుతారు. కేవలము యేసు ప్రభువు చేసిన లేక చెప్పిన మాటలను తెలుసుకోవడం వలన కాక వాటిని పాటించడం ద్వారా మనం ధన్యులం అవుతాం. కనుక ఆయన వలె జీవించుట, మనం అలవాటు చేసుకోవాలి. అందుకే పవిత్ర గ్రంధంలో మంచి చెడులు తెలిసినవారు కాదు జ్ఞానులు, మంచి చెడులు తెలిసి మంచి మాత్రమే అనుసరించు వారిని జ్ఞానులు అంటారు.
ఎప్పుడు శిష్యులు ప్రభువుకు వ్యతిరేకంగా జీవిస్తారు
"నాతో భుజించువారు నాకు విరుద్ధముగా లేచును" యేసు ప్రభువు ఈమాటలను తనను అప్పగించబోతున్న యూదా గురించి చెబుతున్నారు. తనను ఎవరు అప్పగించబోవుతున్నారో ప్రభువుకు ముందుగానే తెలుసు. యేసు ప్రభువు ఈ విషయమును ముందుగానే తన శిష్యులకు ఏమిజరుగబోతున్నదో తెలియజేస్తున్నాడు. తరువాత వారు ప్రభువు ముందుగానే ఈ విషయమును వారికి తెలియజేసి వారిని అన్నిటికి సిద్ధపడేలా జేస్తున్నాడు. యూదా గురించి ప్రభువు ముందుగానే తెలుసు అందుకే మీరు శుద్ధులై ఉన్నారు కాని అందరు కాదు అని చెప్పారు. యూదా యేసు ప్రభువుతోటి కలిసి జీవించాడు, కలిసి తిన్నాడు కాని, తన స్వార్ధానికి తనను నమ్మిన ప్రభువును అమ్ముకుంటున్నాడు. ప్రభువులో ఏ లోపం చూసి యూదా యేసు ప్రభువుకు వ్యతిరేఖంగా మారలేదు, కేవలం స్వార్ధం, అసూయ, స్వలాభం అనేక గుణాలను పెంపొందించుకొన్నాడు. ప్రభువు గురించి తెలిసి కూడా తన స్వార్ధముననే నిలబడ్డాడు. లేఖనము నెరవేరుటకై ఇవన్నీ జరగాలి అని ప్రభువు చెబుతున్నారు. అంటే ప్రభువు మనలను రక్షించుటకు అన్నిటికి సిద్దపడిఉన్నాడు. ఇవన్నీ జరిగినప్పుడు వారు ప్రభువు వారికి ఇవ్వన్నీ చెప్పారు అని వారు తెలుసుకున్నారు.
ప్రభువును స్వీకరించుట
యేసు ప్రభువున శిష్యులు గురువు, రాజు, ప్రవక్త, క్రీస్తుగా స్వీకరించారు. యేసు ప్రభువును ఈవిధంగా స్వీకరించడం ద్వారా యేసు ప్రభువును గౌరవిస్తున్నారు. దేవునితో ఆయనకు ఉన్న సంబంధమును అంగీకరిస్తున్నారు. కేవలం అంగీకరించడమే కాక వారుకూడా ఆ బంధములో ఉండాలనే కోరికను వెల్లడిచేస్తున్నారు. తనను స్వీకరించువారు తన తండ్రిని స్వీకరిస్తున్నారు అని చెబుతున్నారు. యేసు ప్రభువు తండ్రి తరపున, తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు. యేసు ప్రభువు తన శిష్యులను అన్ని విధాలుగా సిద్ధపరచే సమయం కడరా భోజన సమయం. అందుకే ఇక్కడ వారితో చెబుతున్నాడు. మిమ్ములను స్వీకరించువాడు నన్ను స్వీకరిస్తున్నాడు అని అంటున్నాడు. యేసు ప్రభువు శిష్యులు ఆయన ప్రతినిధులుగా వున్నారు. వారి జీవితం, మాటలు, పనుల ద్వారా ప్రభువును వ్యక్తపరచాలి. శిష్యులు ప్రభువుతో సంభందం కలిగివున్నారు. దేవుని వాక్కును బోధించుట, దేవుని అనుభవించిన వారి కర్తవ్యం. అది ధన్యమైన జీవితం. వారిని గౌరవించడం అందరి విధి.
ప్రార్ధన : ప్రభువా! మీ శిష్యులను అన్ని విధాలుగా మీవలే గొప్ప జీవితం జీవిస్తూ, ఇతరుల రక్షణ కొరకు పాటుపడాలని కాక్షించారు. వారు మీరు వాక్కును బోధిస్తూ ఉన్నత జీవితం జీవించారు. మీ వలె కొన్నిసార్లు తిరస్కరించబడ్డారు. మా జీవితాలలో కూడా మిమ్ములను ఇతరులకు తెలియపరచాలని కోరుకుంటున్నాము. అందుకు మీలాంటి జీవితం జీవించాలని ఆశపడుతున్నాము. కాని కొన్ని సార్లు మాలో ఉన్న స్వార్ధం మమ్ములను మీకు దూరంగా చేస్తుంది. అటువంటి సమయాలలో మమ్ము క్షమించి, మేము మీ నిజమైన శిష్యులుగా జీవించుటకు కావలసిన అనుగ్రహము దయచేయండి. మేము మీ వాక్కును బోధించేవారిని గౌరవించి, మిమ్ములను స్వీకరించేలా మమ్ములను మార్చండి. ఎప్పుడు మీతో ఉండాలనే మమ్ము దీవించండి. ఆమెన్
యేసులా జీవించుట -దేవుని స్నేహితుడవుట
యోహాను 15: 9-17
నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొనియుండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని యుండునట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొనియుందురు. "నా ఆనందము మీయందు ఉండవలయుననియు, మీ ఆనందము పరిపూర్ణము కావలయుననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినటులనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితులకొరకు తన ప్రాణమును ధారపోయువానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడును లేడు. నేను ఆజ్ఞాపించినవానిని పాటించినచో మీరు నా స్నేహితులైయుందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇకమీదట నేను మిమ్ములను దాసులని పిలువక, స్నేహితులని పిలిచెదను. ఏలయన, నేను నా తండ్రివలన వినినదంతయు మీకు విశదపరచితిని.మీరు నన్ను ఎన్నుకొనలేదు. కాని, నేను మిమ్ము ఎన్నుకొంటిని. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్లి ఫలించుటకును, మీఫలము నిలిచియుండుటకును, మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమకలిగి ఉండవలయునని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను.
యోహాను సువిశేషంలోని ఈ భాగం యేసు ప్రభువు మరియు తండ్రి మధ్య ప్రేమ, అయన మనలను ఎలా ప్రేమించారో అటువంటి ప్రేమ ఒకరిమీద ఒకరు కలిగి ఉండటం గురించి బోధిస్తుంది. ఆయన వలె ఎలా మనము కూడా ప్రేమించగలం అంటే కేవలం ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారానే, అపుడే ఆయన ప్రేమలో నెలకొని ఉండటం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది.
యేసు ప్రభువు మరియు తండ్రి మధ్య ప్రేమ
నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొనియుండుడు. యేసు ప్రభువు నిత్యము తండ్రి ప్రేమను అనుభవిస్తూనేఉన్నాడు. అది ఎలా అంటే వారి ఇద్దరి యేసు ప్రభువు ఈలోకంలో జన్మించినప్పుడు దేవుని దూతలు తమ ఆనందమును వ్యక్తం చేశారు. యేసు ప్రభువు బాప్తిస్మము తీసుకునేటప్పుడు ఇతను నా ప్రియమైన కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని దేవుని స్వరము వినిపించింది. యేసు ప్రభువు అలవాటు చొప్పున ఉదయమునే దేవాలయమునకు వెళ్లడం లేదా ఒంటరిగా ప్రార్ధనకు వెళ్లడం మనకు ఆయన తండ్రితో ఎంత సాన్నిహిత్యాన్ని కోరుకున్నాడు, అనేది మనకు తెలుస్తుంది. యేసు ప్రభువు అద్భుతం చేసిన తరువాత తండ్రికు కృతజ్ఞత తెలియజేస్తుంటాడు. తండ్రి చిత్తమును తన ఆహారముగా మార్చుకొని, తండ్రి చిత్తమును నెరవేర్చడమే తన ధ్యేయం చేసుకున్నాడు. యేసు ప్రభువు శ్రమలు అనుభవించాలని తెలిసికూడా, వాటి ద్వారా తన తండ్రి కోరుకున్న మానవ రక్షణ జరుగుతుంది అని వాటిని అనుభవించడానికి నిశ్చయించుకున్నాడు. ఇక్కడ యేసు ప్రభువు తాను తండ్రి ఎప్పుడు ఏకమై ఉన్నాము అని చెప్పుచున్నాడు.
దేవుని ఆజ్ఞలు పాటించుట- నిత్యానందకారకం
మీరు నా ప్రేమయందు నెలకొనియుండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని యుండునట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొనియుందురు. యేసు ప్రభువు ఎలా తన తండ్రి ప్రేమలో ఉన్నాడో మనకు వివరంగా చెబుతున్నారు. ఇది కేవలం తండ్రి ఆజ్ఞలను పాటించడం వలన యేసు ప్రభువు తండ్రి ప్రేమలోనే నెలకొనియున్నాడు. యేసు ప్రభువు, నేను ఎందుకు తండ్రి సంకల్పం నెరవేర్చడానికి పూనుకోవాలి అని అనుకోలేదు. తండ్రి చిత్తమును నెరవేర్చడమే తన కర్తవ్యం అని దానిని నెరవేర్చడానికి ఏమి చేయడానికైన సిద్ధపడ్డాడు. మరణించడానికి సిద్ధపడ్డాడు. దానిద్వారా ఆయన తండ్రికి ఎప్పుడు దూరంగా లేడు. ఎల్లప్పుడు తండ్రితో కలిసియున్నాడు. తద్వారా నిత్యానందము పొందుతున్నాడు. యేసు ప్రభువుని మాటలను మాటలను విని, ఆయన వలె, పాటించినట్లయితే మనము కూడా నిత్యము ఆనందంగా ఉండవచ్చు. నేను నా ప్రభువుని చిత్తమును నెరవేర్చాను అనే ఆనందం ఎల్లపుడు మనతో ఉంటుంది.
యేసు ఆజ్ఞల అనుసరణ - ఆయన స్నేహితునిగా మార్పు
యేసు ప్రభువు ఇచ్చిన ప్రేమ ఆజ్ఞ చాల ఉన్నతమైనది. నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు అని చెబుతున్నారు. అంతేకాదు తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ధారపోయువానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడు లేడు అని చెబుతున్నాడు. మనలను తన స్నేహితులను చేస్తున్నాడు. యేసు ప్రభువు మన కోసం తన ప్రాణమును అర్పించాడు. మనము ప్రభువునకు ప్రియమైన వారమని తెలియజేస్తున్నాడు. మనము కూడా ప్రభువు చెప్పినట్లు ఆయన ఆజ్ఞలనుపాటిస్తే మనము ఆయన స్నేహితులము అవుతాము అని చెబుతున్నాడు. పాత నిబంధనలో అబ్రాహామును కూడా దేవుని స్నేహితుడు అని ఆంటారు. దేవుని ఆజ్ఞలు పాటించుట వలన ఆయన స్నేహితులం అవుతాము.యేసు ప్రభువు మనం ఆయన స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నాడు.
ప్రార్ధన: ప్రభువా! మీరు తండ్రితో ఎప్పుడు సాన్నిహిత్యం కలిగివున్నారు. తండ్రి కూడా మిమ్ముల్ని ఎంతగానో ప్రేమించాడు. మీరు చేసిన అన్ని పనులు తండ్రి అనుమతి ఉంది. మీరు తండ్రి ప్రేమయందు ఉన్నట్లు, మేము మీ ఆజ్ఞలను అనుసరిస్తూ మీ ప్రేమను ఇతరులకు చూపిస్తూ మీ స్నేహితులుగా జీవించేలా చేయండి. ఆమెన్.
12, మే 2025, సోమవారం
క్రీస్తు -నిత్యజీవ ప్రధాత మన కాపరి
యోహాను 10:22-30
యెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను. అది శీతకాలము. యేసు దేవాలయమున సోలోమోను మంటపమున నడుచుచుండెను. యూదులు ఆయన చుట్టు గుమికూడి, "నీవు ఎంత కాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచేదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగ చెప్పుము" అని అడిగిరి. అందుకు యేసు వారితో, "నేను మీకు చెప్పితిని. కాని, మీరు నమ్ముట లేదు. నా తండ్రి పేరిట నేను చేయు క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నా గొర్రెలలో చేరినవారు కారు. కనుక, మీరు నమ్ముట లేదు. నా గొర్రెలు నా స్వరమును వినును. నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్యజీవము ప్రసాదింతును. కనుక, అవి ఎప్పటికీ నాశము చెందవు. వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరి కంటే గొప్పవాడు. కనుక, వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేను, నా తండ్రి ఏకమైయున్నాము" అని చెప్పెను.
ఎందుకు యిస్రాయేలు కాపరులు విఫలం అయ్యారు?
"యెరూషలేములో దేవాలయయెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను. అది శీతకాలము. యేసు దేవాలయమున సోలోమోను మంటపమున నడుచుచుండెను." దేవాలయ ప్రతిష్టోత్సవము యిస్రాయేలు పండుగలలో చాలా ముఖ్యమైన పండుగ. అది వారు యేరుషలేము దేవాలయాన్ని మక్కబియుల కాలంలో పునః ప్రతిష్ట చేసిన సమయాన్ని గుర్తు చేస్తూ పండుగ జరుపుకునే సమయం. ఈ సమయాలలో వారు యెహెజ్కేలు గ్రంధంలో యిస్రాయేలు ప్రజలకు దేవుడు తానే కాపరిగా ఉంటాను అనే మాటలను ధ్యానించేవారు, వారి కాపరులు ఎలా కాపరులగా విఫలం చెందారో ధ్యానించేవారు. ఈ సంధర్భంలో జరుగుతున్న సువిశేషం భాగం ఇది. ఎవరు నిజమైన కాపరి. ఎలా కాపరులు విఫలం చెందారు? అంటే యిస్రాయేలు కాపరులు స్వార్ధంతోటి జీవించి వారి బాధ్యతను విస్మరించారు.
సంపూర్ణమైన విశ్వాసం
"యూదులు ఆయన చుట్టు గుమికూడి, "నీవు ఎంత కాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచేదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగ చెప్పుము" అని అడిగిరి." ఇక్కడ కొంతమంది యేసు ప్రభువు దగ్గరకు వచ్చి నీవు క్రీస్తువా? అని అడుగుతున్నారు. ఎందుకు వారు ఆయనను అడుగుతున్నారు అంటే ఆయన వారికి అప్పటికె కాపరి గురించి, యిస్రాయేలు కాపరి గురించి చెప్పాడు. యేసు ప్రభువే వారికి కాపరిగా కావాలని వుంది. ఆయన చేసిన పనులను బట్టి ఆయన వారి కాపరి అయితే వారికి దేవుని నుండి వచ్చే మేలుల గురించి వారికి ఒక అవగాహన ఉంది, కనుక వారు యేసు ప్రభువును నీవు క్రీస్తువా? అని అడుగుతున్నారు. కాని యేసు ప్రభువు అనేక సార్లు తన పనులు తాను క్రీస్తు అని చెబుతున్నాయి అని వ్యక్తం చేశారు. అయినప్పటికీ వారు మరల ఆయనను ఇదే ప్రశ్న అడుగుతున్నారు. యేసు ప్రభువు వారిని సంధిగ్ధావస్థలో ఉంచలేదు. పూర్తిగా యేసు ప్రభువుకు చెందిన వారిగా ఉండుటకు వారు నిశ్చయించుకోలేదు అందుకే వారు అలా మాటలాడుతున్నారు. ప్రభువును విశ్వసించిన వారికి ఆయన మీద ఎటువంటి అపనమ్మకం లేదు. ఆయన పనులను మొత్తాన్ని వారు నమ్ముతారు.
ప్రభువు అతీతమైన శక్తి గలవాడు
"అందుకు యేసు వారితో, "నేను మీకు చెప్పితిని. కాని, మీరు నమ్ముట లేదు. నా తండ్రి పేరిట నేను చేయు క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. " యేసు ప్రభువు మరల వారికి ఆయన ఎవరు అనే విషయం తేటతెల్లం చేస్తున్నారు. నేను మీకు ముందే చెప్పితిని అని అంటున్నారు. కాని వారు ఆయన మాటలను నమ్మని విషయాన్ని ఆయన వారికి చెబుతున్నారు. యేసు ప్రభువు ఇక్కడ తాను చేసే పనులు తన గురించి సాక్ష్యం ఇస్తున్నవి అని చెబుతున్నారు. ఇది ఇక్కడ మాత్రమే కాదు యేసు ప్రభువు చేసిన ప్రతి పని కూడా ఆయన ఎవరు ? అని ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి పని కూడా మానవ మాత్రుడు ఎవరు చేయలేనటువంటి పని. ఆయన ప్రతి కార్యం కూడా రక్షణ ఇచ్చే కార్యం. దాని ద్వారం ఆయన దేవుడు అని తెలుస్తుంది. ఇవి అన్ని చూసి కూడా ఆయనను మరలా అదే ప్రశ్న వారు అడుగుతున్నారు. వారు ఆయనను నమ్ముటకు సిద్ధంగా లేరు. వారు ఆయనను ఎందుకు నమ్ముట లేదు అంటే వారు ఆయనకు చెందిన వారు కాదు.
"మీరు నా గొర్రెలలో చేరినవారు కారు. కనుక, మీరు నమ్ముట లేదు. నా గొర్రెలు నా స్వరమును వినును. నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును." ఆయనకు చెందిన వారు అయితే ఆయన మాటలను విశ్వసించేవారు. ఆయనను వెంబడించేవారు. కాని ఆయనకు చెందిన వారిగా ఉండుటకు వారికి ఇష్టం లేదు. ఆయన అనుచరులుగా ఉండేవారికి, ఆయనను అనుసరించే వారికి ఆయన ఎవరు అని తెలుసు, ఆయన చేసే పనులన్నీ కూడా దేవునికి మాత్రమే సాధ్యం, మానవ మాత్రుడు ఎవరు కూడా ఆయన చేసే పనులని చేయలేరు. ఎందుకు కొంతమంది ఆయనను నమ్ముట లేదు? దీనికి కారణం ఏమిటి అంటే ఆయనను నమ్మని వారు వారి జీవితాలను మార్చుకోవడానికి సిద్ధంగా లేరు, ఆయనకు పూర్తిగా చెందిన వారిగా ఉండుటకు ఇష్ట పడలేదు. ఎందుకంటే ఆయనకు చెందిన వారిగా ఉండాలి అంటే ఆయన మాటలకు అనుకులమూగ జీవించాలి. ఆయన చెప్పినట్లుగా జీవించుటకు వీరు సిద్ధముగా లేరు కనుక ఆయనను వారు నమ్మక మరలా ఆయనను ప్రశ్నిస్తున్నారు. కాని యేసు ప్రభువుకు చెందిన వారు ఆయనను ఎప్పుడు వెంబడిస్తూనే వుంటారు.
నిత్యజీవ ప్రదాత ప్రభువు
"నేను వానికి నిత్యజీవము ప్రసాదింతును. కనుక, అవి ఎప్పటికీ నాశము చెందవు." యేసు ప్రభువు తనను అనుసరించే వారికి నిత్యజీవము ఇస్తాను అని వాగ్ధానం చేస్తున్నాడు. కనుక వారు ఎల్లకాలము జీవిస్తారు. వారు నాశము చెందక జీవిస్తారు. ఎందుకు వారు నాశము చెందరు, అంటే ఆయనే జీవం, ఈ జీవంతో ఉన్న వారు ఎవరు కూడా నాశము చెందరు. ఈ జీవం మనలను ఎల్లపుడూ జీవించాడానికి మనతో పాటు ఉంటుంది. ఇది అందరికీ కాక ఆయనకు చెందిన వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇది యేసు ప్రభువు మనకు చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. మనం కూడా ఈ జీవం కలిగి ఉండటానికి సిద్దపడుతున్నామా! లేక ఈ లోక విషయాలలోనే సంతృప్తి పడుటకు ఇష్టపడుతున్నామా? ఈ ప్రశ్నలను ప్రతి నిత్యం మనం అడగవవలసిన అవసరము ఉన్నది.
"వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరి కంటే గొప్పవాడు. కనుక, వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేను, నా తండ్రి ఏకమైయున్నాము" అని చెప్పెను. ఇక్కడ మనం యేసు ప్రభువుని శిష్యులు లేక ఆయన అనుచరులను, ఆయనకు చెందిన వారిని ఎవరు ఆయన నుండి అపహరించలేరు అని అంటున్నారు దానికి కారణం ఏమిటి అంటే ఆయనను వారు అంతగా అనుభవించారు, ఆయనను వారు అంతగా అనుభవ పూర్వకముగా తెలుసుకున్నారు కనుక ఆయన నుండి ఎవరు వారిని వేరు చేయడానికి ప్రయత్నించిన అది కుదరదు, దైవ అనుభవం అంత గొప్పది. పునీత పౌలు మరియు అనేక మంది పునీతులు ఇలా జీవించిన వారే. వారికి క్రీస్తు తప్ప మిగిలినది మొత్తం వ్యర్ధమే. అంతేకాదు యేసు ప్రభువు నుండి తీసుకొనుట అంటే తండ్రి నుండి తీసుకొనుట రెండు కూడా సాధ్యం కాదు. ఇక్కడ యేసు ప్రభువు తండ్రితో తనకు ఉన్న ఐక్యతను, వారు ఇద్దరు ఏకమై ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు.
ప్రార్ధన : ప్రభువా మీరు మా నిజమైన కాపరి అని మేము తెలుసుకుంటున్నాము. కొన్ని సార్లు మా స్వార్ధ బుద్ధితో ఎక్కడ మా జీవితములో మిమ్ములను అనుసరించినట్లయితే మమ్ములను మేము మార్చుకోవాలి ఏమో, అనే ఆలోచనలతో మీ కాపుదలలో ఉండకుండా మీరు ఎవరో తెలియదు అనే విధంగా మేము జీవిస్తున్నాము అటువంటి సమయాలలో మమ్ములను క్షమించండి. మేము మిమ్ములను మా కాపరిగా అంగీకరించి జీవించే విధంగా మమ్ములను దీవించండి. మేము మీ పనుల, ద్వారా, మీ మాటల ద్వారా మీరే రక్షకుడు అని తెలుసుకుంటున్నాము. మమ్ములను మీ అనుచరులుగా, మీ మందలోనివారినిగా చేయండి. మేము మీ నుండి ఎవరిచేత అపహరింపకుండా ఉండేలా కాపాడండి. దాని ద్వారా మేము ఎప్పటికీ నాశము చెందక మీరు చెప్పిన నిత్యం జీవం పొందేలా మరియు మేము ఎప్పుడు మీ స్వరమును విని పాటించే విధంగా మమ్ము దీవించండి. ఆమెన్.
11, మే 2025, ఆదివారం
రక్షకుడైన యేసు ప్రభువు- మంచి కాపరి
యోహాను 10: 27-30
నా గొఱ్ఱెలు నా స్వరమును వినును. నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్యజీవము ప్రసాదింతును. కనుక, అవి ఎప్పటికిని నాశనము చెందవు. వానిని ఎవడును నా చేతినుండి అపహరింపలేడు. వానిని నా కిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. కనుక, వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేనును, నా తండ్రియు ఏకమైయున్నాము" అని చెప్పెను.
నా గొర్రెలు నా స్వరము వినును:
యేసు ప్రభువు శిష్యులు తన స్వరం వినును అంటున్నారు. వినటం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడం, ఆయన చెప్పినట్లు చేయడం. వినటం వలన విశ్వాసం వస్తుంది. అబ్రాహాము దేవుని మాటలను విన్నాడు. దేవుడు చెప్పినట్లు చేసాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. సమూవేలు ప్రభువును మాటలను విన్నాడు వాటిని పాటించాడు గొప్ప యాజకునిగా, న్యాయాధిపతిగా ఎదిగాడు. మోషే దేవుని మాటను విన్నాడు గొప్ప నాయకునిగా ఎదిగాడు. యేసు ప్రభువు శిష్యులు తమ గురువు స్వరమును వినిన ఆయన మాటలను పాటించిన వారు కూడా గొప్ప వారు అవ్వుతారు.
నేను వానిని ఎరుగుదును.
నా గొర్రెలను నేను ఎరుగుదును: ఈ మాటలు ప్రభువుకు ప్రతి శిష్యుడు, అనుచరుడు వ్యక్తిగతంగా తెలుసు అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ప్రభువుకు తన అనుచరుల సంతోషాలు, కష్టాలు నష్టాలు, బాధలు అన్ని తెలుసు. వారు ఎంతటి బలవంతులు, బలహీనులు అనే విషయంకూడా ప్రభువుకు తెలుసు. గొఱ్ఱెలు తమ కాపరిని అనుసరిస్తాయి. తమ కాపరి స్వరము వాటికి తెలుస్తుంది. తమ కాపరి ఎటువంటి అపాయకారి పరిస్థితులలో కూడా తమను విడువడు అని వాటికి అనుభవపూర్వకంగా తెలుసు. వాటిని ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. కాపరికి గొర్రెలకు ఉన్న సంబంధములో గొర్రెలను కాపాడుటకు, వన్య మృగములనుండి రక్షించుటకు కాపరి తన ప్రాణమును కూడా పణంగా పెడుతాడు. ఇది ప్రభువుకు తన అనుచరులకు మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధం. ప్రభువు తన అనుచరులను ఎప్పుడు వదలి పెట్టలేదు. ఎప్పుడు వారితోనే ఉన్నాడు. అందుకే ప్రభువు నన్ను ప్రేమించువాడు నామాట పాటించును వాని వద్దకు నేను తండ్రి వచ్చి వానితో నివసింతుము అని చెప్పాడు.
నా గొఱ్ఱెలు నన్ను వెంబడించును
యేసు ప్రభువు తన గొర్రెలు తనను వెంబడించును అని ప్రకటిస్తున్నారు. ఇక్కడ ఈ గొఱ్ఱెలు సాధారణమైనటువంటివి కావు. ఎందుకంటే వాటికి తమ కాపరి ఎవరో తెలుసు. ఎవరిని వెంబడించాలో తెలుసు. ప్రక్కతోవను పట్టని గొర్రెలు ఇవి. ఎందుకు ఈ గొఱ్ఱెలు ప్రత్యేకంగా ఉంటాయి అంటే అవి తమ కాపరిని ఎప్పుడు అనుసరిస్తూనే ఉన్నాయి. తనకు దగ్గరగా ఉన్నాయి. తమ కాపరితో ఉన్న ఆ సాన్నిహిత్యం వారిని ఎప్పుడు ఆ కాపరిని కోరుకునే విధంగా చేస్తాయి. ఇది యేసు ప్రభువుకు తన శిష్యులకు ఉన్న సాన్నిహిత్యం గురించి తెలియజేస్తున్నది. ఒకసారి ప్రభువుని స్వరమును విని, ఆయనను వెంబడించిన వారి జీవితం సాధారణ వ్యక్తుల జీవితం వలే ఉండదు. వారు ప్రభువుని నిజమైన అనుచరులు కనుక ఆయన అనుచరులుగా, ఆయన జీవితం తెలిసిన వారిగా, ఈ అనుచరుల జీవితం కూడా ప్రభువుని జీవితం వలే ఉంటుంది. పరిపూర్ణంగా ప్రభువును వెంబడించేవారి జీవితం ద్వారా ప్రభువు ఇతరులకు సాక్షాత్కరము అవుతారు.
వారిని ఎవడును ఎప్పుడును అపహరింపడు
ప్రభువు అనుచరులను ఎవరు అపహరించలేరు. ఎందుకంటే తండ్రి ప్రభువునకు తన అనుచరులను ఇచ్చాడు. తండ్రి అందరికంటే గొప్పవాడు. ఎవరు తండ్రి నుండి వారిని అపహరింపలేరు. ప్రభువుతో వున్న వారిని సాతాను ఎంత ప్రయత్నించిన ఏమి చేయలేదు. వారు ప్రభువు మాటలను, ఆజ్ఞలను ఎప్పుడు అనుసరిస్తారు. ఎప్పుడు కూడా వారు ప్రభువు మాటను జవదాటరు కనుక వారికి అటువంటి అపాయము రాదు. ప్రభువు వారిని ఎప్పుడు పచ్చికబయళ్లలో మేపుతారు. నేను తండ్రి ఒకటై ఉన్నాము అని ప్రభువు చెబుతున్నాడు. ప్రభువు శిష్యులతో తన తండ్రితో తనకు ఉన్న సంబంధం గురించి చెబుతున్నారు. అటులనే తన శిష్యులు కూడా ఐక్యంగా ఉండాలని ప్రభువుకోరుతున్నారు.
ప్రార్ధన: ప్రభువా! మీరు ఈలోకంలో ఉండగా అనేక విధాలుగా మీ శిష్యులను కాపాడుతూ, మీ మాటలను ఆలకించి జీవించుట వలన వారికి వచ్చే అనుగ్రహాల గురించి చెబుతూనే ఉన్నారు. ప్రభువా! ఎల్లప్పుడు మీ స్వరమును ఆలకించి, మీరు నడిచినట్లు మీ మార్గమును అనుసరించి మా జీవితాన్ని మీ వలె మార్చుకునేల చేయండి. ప్రభువా! మీతో ఎల్లప్పుడు సాన్నిహిత్యంగా ఉండి, మీరు ఇచ్చే నిత్య జీవం పొందేలా చేయండి. ఆమెన్.
10, మే 2025, శనివారం
పాస్కా కాలపు నాలుగవ ఆదివారము
యోహాను 10:27-31
జీవవాక్కు
యోహాను 6: 60-69
ఆయన శిష్యులలో అనేకులు ఇవివినినప్పుడు "ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు?" అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీనిని గురించి గొణుగుచున్నారు అని గ్రహించి యేసు "ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా? అట్లయిన మనుష్యకుమారుడు తాను పూర్వము ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూచినచో ఇక ఏమందురు? జీవమును ఇచ్చునది ఆత్మయే. శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కాని, మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు" అని పలికెను. ఆ విశ్వసింపనివారు ఎవరో, తన్ను అప్పగింపబోవువాడు ఎవడో మొదటినుండియు యేసుకు తెలియును. కనుకనే "తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడును నాయొద్దకు రానేరడు అని మీతో చెప్పితిని" అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్లి మరెన్నడును ఆయనను వెంబడింపరైరి. అపుడు యేసు తన పన్నిద్దరు శిష్యులతో "మీరును వెళ్ళిపోయెదరా?" అని అడుగగా, సీమోను పేతురు, "ప్రభూ! మేము ఎవరియొద్దకు పోయెదము? నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు. మేము విశ్వసించితిమి. నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి" అనెను.
యోహాను సువిశేషంలో ఈభాగం యేసు ప్రభువు జీవ వాక్కు అని వెల్లడిచేస్తుంది. ఆయన మాటలు కొందరికి కఠినముగా ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నది. ప్రభువును కఠినమైన మాటలు మనకు జీవము ఇచ్చేవి అని తెలుస్తుంది. యేసు ప్రభువు మాటలు నిత్య జీవము ఇచ్చేవి అని, ఆయన దేవుని నుండి వచ్చిన పవిత్రుడు అని తెలియపరుస్తుంది.
యేసు ప్రభువును శరీరమును భుజించుట ఆయన రక్తమును పానము చేయుట
యేసు ప్రభువు తన శరీరమును భుజించాలి, తన రక్తమును పానము చేయాలి అని చెప్పినప్పుడు అనేక మంది శిష్యులు ఆ మాటలు కఠినముగా ఉన్నవి అని, ఆయనను అనుసరించడం సాధ్యం కాదు అని వదలిపెట్టి వెళ్లిపోతున్నారు. ఈ మాటలను అర్ధం చేసుకునుటకు వారికి ప్రత్యేక దైవ జ్ఞానము కావలి. యేసు ప్రభువుతో సాన్నిహిత్యము కలిగినవారు ఆ మాటలు అర్ధం చేసుకోగలుగుతారు. తన శరీరమును భుజించటం అంటే ప్రభువు జీవంలో పాలు పంచుకోవడం. రక్తంలో ప్రాణం ఉంటుంది అని యూదులు నమ్మేవారు. యేసు ప్రభువు మీరు నా రక్తమును పానము చేయాలన్నప్పుడు దాని అర్ధం ప్రభువు జీవము మనలో ఉంటుంది అని అంటున్నారు. అందుకే ప్రభువు నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసిన వారు నాయందును నేను వాని యందును ఉంటాము అని ప్రభువు చెప్పారు. ప్రభువు శరీరము మరియు రక్తము మనలను తనతో ఉండేలా చేస్తాయి. మనము ఎల్లప్పుడూ జీవించేలా చేస్తాయి.
ఎందుకు కొంతమంది ఈ మాటలు కఠినముగా ఉన్నవి అని ప్రభువును విడిచి పెడుతున్నారు? యేసు ప్రభువు మాటలను వారు సరిగా అర్ధం చేసుకోలేకపోయారు. యిస్రాయేలు ప్రజలు రక్తమును భోజన పదార్ధముగాలేక పానీయముగా తీసుకోరు. లేవియఖాండం 17వ అధ్యాయంలో రక్తములో ప్రాణము ఉంటుంది కనుక అది నిషేధించబడింది. ఇక్కడ ప్రభువు నా రక్తమును పానము చేయాలి అని అంటున్నప్పుడు వారు అర్ధం చేసుకోలేకపోయారు. యేసు ప్రభువు చెప్పేది ఆధ్యాత్మికమైన విషయం. దివ్యసత్ప్రసాదము గురించి ప్రభువు చెబుతున్నారు. వారు పొందే శ్రమలు గురించి ప్రభువు చెబుతున్నారు.
తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రానేరడు అని మీతో చెప్పితిని అని అంటున్నాడు. ప్రభువు దగ్గరకు రావాలంటే ఆ వ్యక్తికి పశ్చాత్తాపం ఉండాలి, మనస్సు మార్చుకోవాలనే కోరిక ఉండాలి. దానికి ప్రేరణ దేవుడే మనలో పుట్టిస్తాడు. అందుకే తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవరు నావద్దకు రాలేరు అని చెబుతున్నారు. మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని ప్రభువు చెబుతున్నారు. అనేక గొప్ప కార్యములను ప్రజలు చూసారు, ఆయనతో పాటు వారు తిరిగారు. ఆయన ఇచ్చిన ఆహారం వారు తిన్నారు. అయినప్పటికీ కొంతమంది యేసు ప్రభువు మాటలను విశ్వసించుటలేదు. విశ్వాసం చాల ముఖ్యం. విశ్వాసం వలన మాత్రమే మనం ప్రభువుతో ఉండగలం, ప్రభువు వద్ద ఉండగలం మరియు ఆయన చెప్పే నిత్యజీవమునకు అర్హులం కాగలం.
యేసు ప్రభువు మీరును వెళ్లిపోయెదరా? అని శిష్యులను అడుగుతున్నారు. అందుకు పేతురు మేము ఎవరి యొద్దకు వెళ్ళెదము? నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు అని చెబుతున్నాడు. పేతురు తన జీవితంలో యేసు ప్రభువులాంటి వ్యక్తిని చూడలేదు. ఒక యూదయ వ్యక్తిగా తన మత గురువులు, పెద్దలు అతనికి తెలిసిఉండవచ్చు. కాని వారు ఎవరు నిత్య జీవం ఇచ్చేవారు కారు. అందుకే ప్రభువుతో పేతురు మేము ఎవరి వద్దకు వెళ్ళెదము, అని అంటున్నాడు. ఎవరి వద్దకు వెళ్లిన యేసు ప్రభువు ఇచ్చే వాగ్దనం వారు ఇవ్వలేరు. ఇస్తాము అని కూడా చెప్పలేరు. ఎందుకంటే ప్రభువు మాత్రమే జీవం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు జీవమై ఉండెను అని పవిత్ర గ్రంధం చెబుతుంది. ఆ జీవము, ఆ వాక్కు యేసు ప్రభువే అని తెలుసుకున్న పేతురు ఎక్కడకి వెళ్లక ప్రభువుతో మేము విశ్వసించాము అని చెబుతున్నాడు.
ప్రార్ధన: ప్రభువా! మీరు జీవవాక్కు. మీ మాటలు మాకు నిత్యజీవమును ఇస్తాయి. మీ మాటలు మా జీవితమునకు మార్గముగా ఉన్నాయి. మీ మాటలు మాకు కఠినముగా ఉన్నప్పటికీ అవి జీవమును ఇచ్చేవి అని తెలుసుకునేలా దీవించండి. ప్రభువా! మీరే మాకు ఆధారం, మీరే మాకు మార్గం. మేము ఎక్కడికి వెళ్ళగలం. మీ వలే ఎవరు మా భౌతిక ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుతూనే ఉన్నారు. అంతేకాకుండా మాకు నిత్యజీవము ఇస్తాను అని వాగ్దానము చేస్తున్నారు. అటువంటి మిమ్ములను కాదని మేము ఎక్కడకు వెళ్ళగలం. మీమీద పూర్తి విశ్వాసం ఉంచి , మారు మనసు పొంది మీమీద ఆధారపడి జీవించే అనుగ్రహం దయచేయండి. ఆమెన్
4, మే 2025, ఆదివారం
నిత్య జీవము ఎలా వస్తుంది
యోహాను 6: 22-29
మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యేసు వెళ్లలేదనియు, శిష్యులు మాత్రమే వెళ్ళుటకు చూచిరి. అయినను యేసు ధన్యవాదములు సమర్పించి, ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలముచెంతకు తిబెరియానుండి కొన్ని పడవలువచ్చెను. అక్కడ యేసుగాని, శిష్యులుగాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలివైపున యేసును కనుగొని "బోధకుడా! మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి?" అని అడిగిరి. "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్నువెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసియున్నాడు" అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు "దేవుని కార్యములను వేరవేర్చుటకు మేము ఏమి చేయవలయును?" అని వారడుగగా, యేసు, దేవుడు పంపినవానిని విశ్వసింపుడు. అదియే దేవుడు మీ నుండి కోరునది" అని చెప్పెను.
ఈ సువిశేష భాగంలో యేసు ప్రభువును అన్వేషించడం మరియు ఎటువంటి పరిస్థితులలో మనం యేసు ప్రభువును అన్వేషిస్తున్నాము , ఎప్పుడు ఆయనను అన్వేశించాలి , శాశ్వతమైనది ఏమిటి అని తెలుసుకొని దాని కోసమై అన్వేషించాలి అని సువిశేషం వివరిస్తుంది.
దేవుని కోసం వెదకుట
ఈ సువిశేష భాగంలో యేసు ప్రభువును వెదకుచు అనేక మంది వస్తున్నారు. వారు ఎందుకు యేసు ప్రభువును అన్వేషిస్తున్నారు ఆంటే అంతకు ముందు రోజు ప్రభువు వారి ఆకలిని తీర్చారు. కేవలం ఐదు రొట్టెలతో 5000 మందికి ఆహారమును ఇచ్చాడు. ఇతనిని అనుసరిస్తే మాకు కావలసిన ఆహరం దొరుకుతుంది అని వారు ఆయన కోసం వెతుకుచున్నారు. అంతకు ముందు వారిలో కొంతమంది వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులను చేసాడు. ఇతనిని అనుసరిస్తే మాకు ఎటువంటి అనారోగ్యం ఉండదు అని ఆయన కోసం వెదకుచుండవచ్చు. యేసు ప్రభువు చెప్పే మాటలు ఎలా సాధ్యం అని తెలుసుకొనుటకు, ఆయనను అడుగుటకు వారిలో ఉన్న కొన్ని సందేహాలు తీర్చుకొనుటకు ప్రభువును వెదుకుచుండవచ్చు. ప్రభువు దేవాలయములో ఉన్న వ్యాపారులను పంపిచివేస్తున్నారు కనుక అనేక మంది దేవుని ఆలయంలోవెళ్ళుటకు ఆవకాశం ఇచ్చాడు కనుక ఇంకా వారి అవసరాలను చెప్పుకొనుటకు ప్రభువును వెదకుచు ఉండవచ్చు. ఇతను రాజు అయితే మాకు అన్ని సమకూరుతాయి అని ప్రభువును వెదకుచు ఉండవచ్చు. అందుకే ప్రభువు వారితో అంటున్నారు "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్నువెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు" అని అంటే మనం ప్రభువును వెదకవలసినది, అద్భుతాలు చూడాలనో, ఆహారం కోసమో కాదు. ఆయన అంతకంటే చాలా గొప్పవి ఇచ్చేటువంటి ప్రభువు. ప్రభువు తానె జీవ జలము అనే చెబుతున్నాడు. నేను ఇచ్చే జలమును త్రాగితే మరల దప్పిక కలుగదు అని చెబుతున్నాడు. నేను జీవాహారము అని చెబుతున్నాడు. నన్ను భుజించువాడు ఎన్నటిని మరణింపడు అని చెబుతున్నాడు. ప్రభువు మనకు శాశ్వతమైన వాటిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, వాటిని ఎలా పొందాలో అన్వేషించమంటున్నాడు, వాని కోసము పనిచేయమంటున్నాడు. దేవున్ని వెదకడం అంటే నిత్య జీవమును వెదకటం. అందుకే ప్రభువు చెబుతున్నాడు నేనే జీవమును అని.
శాశ్వతమైనది- అశాశ్వతమైనది
ఇక్కడ యేసు ప్రభువు తనకోసం వచ్చిన వారితో "అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు." అని చెబుతున్నాడు. యేసు ప్రభువు తన అనుచరులకు ఈలోక విషయములు అశాశ్వతమైనవి అని, శారీరక విషయాలు, అవసరాలు, సంపదలు అశాశ్వతమైనవి అని చెబుతున్నాడు. అందుకే ఈలోక సంపదలు కాక పరలోక సంపదలు కూడపెట్టుకోమని చెబుతారు. "ఈలోక సంపదలు కూడపెట్టుకొనవలదు. చెదపురుగులు, త్రుప్పు వానిని తినివేయును." "నీ సంపదలు పరలోకమందు కూడబెట్టుకొనుము. అచట వానిని చెదపురుగులు, త్రుప్పు తినివేయవు." ఈనాటి సువిశేషంలో మాత్రం ప్రభువు మనలను శాశ్వత భోజనముకై శ్రమించమని చెబుతున్నారు. నిజానికి చాలా మంది పేరు ప్రఖ్యాతలు కోసం శ్రమిస్తుంటారు. అవికూడా శాశ్వతం కాదు. అప్పుడు ఏమిటి శాశ్వతమైనవి ఏమిటి అంటే పరలోక రాజ్యము, నిత్య జీవము ఇవి మనకు శాశ్వతమైనవి.
శాశ్వతమైనవి అయితే అవి మనకు ఎవరు ఇస్తారు
యేసు ప్రభువు తన దగ్గరకు వచ్చిన వారితో ఆయన "మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును." అని చెబుతున్నాడు. ప్రభువు మాత్రమే దానిని ప్రసాదించగలరు. ఎందుకంటే ఆయనకు మాత్రమే అది ప్రసాదించే అధికారం ఉన్నది. శాశ్వతమైనవి దైవికమైనవని వారికి అర్ధం అయ్యింది. కనుక వారు దేవుని కార్యములు నెరవేర్చుటకు మేము ఏమి చేయాలని అడుగుతున్నారు. అందుకు యేసు ప్రభువు దేవుడు పంపిన వానిని విశ్వసించండి అదే దేవుడు మీ నుండి కోరుకుంటున్నారు అని చెబుతున్నాడు. నిత్య జీవం కావాలంటే లేక శాశ్వతమైన ఆహారం కావాలంటే చేయవలసినది యేసు ప్రభువును విశ్వసించడం. యేసు ప్రభువును విశ్వసించడం అంటే ఆయన చెప్పినట్లు మారుమనస్సు పొంది, ఆయన ఆజ్ఞలను పాటించడం. అప్పుడు మనం ఆ నిత్య జీవానికి అర్హులము అవుతాము.
ప్రార్ధన: ప్రభువా! మా జీవితాలలో అనేక విషయాలలో మీ సహకారం కోసం మిమ్ములను ఆశ్రయిస్తున్నాము. అనేక సార్లు మేము మిమ్ములను మా భౌతిక అవసరములనే కోరుకుంటున్నాము. మేము ఏమి కోరుకోవాలో నేర్పించండి. మీరు చెప్పినట్లుగా శాశ్వతమైన వాటిని వెదకుచు, వాని కొరకు పాటుపడేలా మమ్ము మార్చండి. నిత్య జీవితం మీద ఆశ కలిగి, మిమ్ములను విశ్వసించి, మీ ఆజ్ఞలకు అనుకూలంగా జీవించేలా మమ్ము మార్చండి. ఆమెన్
30, ఏప్రిల్ 2025, బుధవారం
దేవుడు తన కుమారున్ని ఎందుకు పంపాడు?
దేవుడు తన కుమారున్ని ఎందుకు పంపాడు?
యోహాను 3: 16-21
దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అటుల చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని, దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలయన, దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసమునుంచలేదు. ఆ తీర్పు ఏమన, లోకమున వెలుగు అవతరించినది. కాని మనుష్యులు దుష్క్రియలు చేయుచు, వెలుగు కంటె చీకటినే ఎక్కువగ ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయల్పడకుండునట్లు వెలుగును సమీపింపడు. కాని, సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగ చేయబడినవని ప్రత్యక్షమగుటకు వెలుగును సమీపించును" అని సమాధానమిచ్చెను.
ఈ వాక్యాలు దేవుడు ఎంతగా ఈ లోకమును ప్రేమించినది, అదేవిధంగా మానవుడు నాశనము చెందకుండా తన కుమారుణ్ణి పంపిన విషయం, ఆ కుమారుణ్ణి విస్వసించుట ద్వారా వారు నిత్యజీవము పొందుతారని, ప్రభువు లోకమునకు వెలుగుగా వచ్చారని దుష్క్రియలు చేసేవారు, ఆ వెలుగు దగ్గరకు వచ్చుటకు ఇష్టపడక అవి బయట పడతాయి చీకటిలోనే ఉన్నాడు. సత్యవర్తనుడు వెలుగును సమీపిస్తున్నాడు. జీవితాన్ని మార్చుకుంటున్నాడు అని తెలియజేస్తున్నాయి.
దైవ ప్రేమ
దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని రక్షించడానికి తన కుమారుడిని ఈలోకానికి పంపాడు. కుమారుడు తన తండ్రి సంకల్పమైన లోక రక్షణము నెరవేర్చడానికి మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. దేవుని కుమారుడు తన తండ్రి చిత్తాన్ని పూర్తి చేసి అంత సమాప్తం అయినది అని చెప్పాడు. ఆయనను కలుసుకున్న, వినిన , చూసిన ప్రతివాడు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణను సిమియోను ప్రవక్త వలే చూసారు. ఆయనను విశ్వసించిన వారు రక్షణ పొందుతున్నారు.
దేవుడు లోకాన్ని ఖండించడానికి తన కుమారున్ని పంపలేదు
దేవుడ సృష్టి ఆరంభం నుండి మానవున్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎన్నడు విడనాడలేదు. దేవుడు ఎప్పుడు పాపి మరణించాలని, లేక నాశనం కావాలని కోరుకొనలేదు. ఆయన మానవుణ్ణి సన్మార్గంలో పెట్టదలచి క్రమ పద్దతిలో పెట్టగ దేవుడు శిక్షించినట్లుగా అనుకున్నాడు. దేవున్ని ఒక కఠిన యజమానిగా చూసాడు కాని దేవుని ప్రేమను, తండ్రి వాత్స్యాల్యాన్ని అర్ధం చేసుకోలేదు. అనేక సార్లు దేవుడు తన రాయబారులను పంపాడు. కాని మానవుడు దేవుడు పంపిన వారిని లెక్క చేయలేదు. తరువాత తన కుమారుణ్ణి పంపుతున్నారు. ఈ లోకాన్ని నాశనం చేయక తన కుమారుని జీవితం ద్వారా, మనకు ఎలా జీవించాలో తెలియజేస్తున్నాడు, తన మరణం ద్వారా మనకు పాపములను క్షమిస్తున్నారు. తన మీద విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం పొందే అనుగ్రహం ఇస్తున్నాడు.
విశ్వాసం యొక్క ప్రాముఖ్యత
రక్షణ యేసు ప్రభువును విశ్వసించడం వలన వస్తుంది. యోహాను ఈ విషయాన్ని తన సువిశేషంలో చాలా సార్లు లిఖించడం జరిగింది. ప్రతి అధ్యాయంలో విశ్వాసం గురించి చెబుతూ, సువిశేష ఆరంభంలో, మధ్యలో మరియు చివరిలో యేసు ప్రభువును విశ్వసించడం వలన నిత్య జీవం వస్తుంది అని ప్రకటిస్తున్నారు. క్రైస్తవ జీవితంలో విశ్వాసానికి ఉన్న ప్రాముఖ్యత అటువంటిది. ప్రభువు కొన్ని సందర్భాలలో ఇది నీవు విశ్వసిస్తున్నావా? అని అడుగుతున్నారు. వారు స్వస్తత పొందిన తరువాత మీ విశ్వాసమే మిమ్ములను స్వస్థపరిచింది అని అంటున్నారు. ప్రభువుని యందు మనకు విశ్వాసము ఉండటం వలన నిత్యజీవమే కాక ఈ లోకములో అనేక విషయాల్లో విజయాన్ని పొందుతాము.
వెలుగు- చీకటి
యేసు ప్రభువు నేనే లోకమునకు వెలుగును అని ప్రకటించాడు. యోహాను సువిశేషంలో మొదటి అధ్యాయంలో ఆయన ఈ లోకమునకు వెలుగాయను అని వింటాము. ప్రభువు దగ్గరకు నీకొదేము చీకటి వేళలో వస్తున్నాడు. అతను చీకటి నుండి వెలుగు దగ్గరకు వస్తున్నాడు. ప్రభువు దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా చీకటి నుండి వెలుగు దగ్గరకు వస్తున్నాడు. కాని చీకట్లో ఉన్నవారు వెలుగు దగ్గరకు రావడానికి ఇష్టపడటలేదు. వెలుగు దగ్గరకు వస్తే వారి ఎటువంటి వారు అనేది, లేక వారి జీవితం అందరికి తెలిసిపోతుంది అని భయపడేవారు. కాని ప్రభువు దగ్గరకు వచ్చినట్లయితే వారు చేసిన తప్పులు ఏమి అందరికి తెలుస్తాయి అని భయపడనవసరం లేదు. ప్రభువు దగ్గరకు వచ్చే సమయంలో ఆ వెలుగులో మనలో వున్న చేడు, మలినం లేక తొలగిపోతుంది. ప్రభువు నీకొదేము వచ్చినపుడు తాను చీకటిలో వచ్చిన, ప్రభువు దగ్గర ఉండటం వలన తనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాడు. కాని ఎవరు అయితే చెడు పనులు చేస్తున్నారో, ప్రభువు దగ్గరకు రావడానికి ఇష్టపడటం లేదో వారు చెడునే ప్రేమిస్తున్నారు. వారు మారటానికి ఇష్టపడటం లేదు. వారి పనులు ఎవరికీ తెలియకూడదు అని వారు వెలుగును సమీపించడం లేదు. ప్రభువు దగ్గరకు రాకపోతే, మనలో ఉన్న ఆ చెడు ఎప్పటికి వెళ్లిపోదు. దాని ద్వారా ప్రభువు మనకు ఇచ్చే ఆ రక్షణ పొందలేము. సత్య వర్తనము కలిగి జీవించడము అనేది చాలా ముఖ్యము. అప్పుడు మనం చేసే పనులు దేవునికి ఇష్టమవుతాయి.
ప్రార్ధన: ప్రభువా ! మీరు లోకమును ఎంతగానో ప్రేమించి మీ ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకమునకు దానిని రక్షించుటకు పంపారు. ఆయనను విశ్వసించిన వారంతా నిత్యజీవం పొందుటకు మీరు అటుల చేశారు. ప్రభువా మిమ్ములను మీ కుమారుణ్ణి మేము విశ్వసిస్తున్నాము. కొన్ని సార్లు వెలుగైన మీ కుమారుని దగ్గరకు రావడానికి మేము భయబడ్డాము. ఆ వెలుగులో నా పాపము ఎక్కడ బయటపడుతుందో అని సందేహించాము. కాని ప్రభువా! ఆ వెలుగు మా లోని పాపమును దహించివేసి మమ్ములను పరిశుద్దులనుగా చేస్తుంది అని మరిచిపోయాము. అటువంటి సందర్భంలో మమ్ములను క్షమించండి. మేము మీ దగ్గరకు వచ్చి ఎల్లప్పుడు వద్ద ఉంటూ, మిమ్ము విశ్వసించి మీరు ఏర్పాటు చేసిన రక్షణ పొందేలా మమ్ము దీవించండి .ఆమెన్
28, ఏప్రిల్ 2025, సోమవారం
నూతనంగా జన్మించుట
యోహాను 3: 7-15
నీవు మరల జన్మింపవలయునని నేను చెప్పిన్నందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును వినెదవే కాని అది ఎక్కడనుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మవలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును" అనెను. "ఇది ఎటుల సాధ్యమగును?" అని నికోదేము అడిగెను. అందులకు యేసు: "నీవు యిస్రాయేలు బోధకుడవైయుండియు దీనిని ఎరుగవా? మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము. చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము. కాని, మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పిన మీరు నమ్ముట లేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన యెడల ఎట్లు నమ్మెదరు. పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. "మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవము పొందుటకు అట్లే మనుష్యకుమారుడును ఎత్తబడవలెను.
నూతన జీవితం - క్రీస్తు ఎత్తబడటం
ఈ సువిశేష భాగంలో నూతన జీవితం ఎలా మొదలవుతుంది, దానికి ఏమి చేయాలి అని మరియు ఏవిధంగా క్రీస్తు మోషే కంచు సర్పమును ఎత్తినట్లు ఎత్తబడతాడు అనే విషయాలను మనము చూస్తాము. యేసు ప్రభువు నికోదేముకు ఎలా ఒక వ్యక్తి నూతనంగా జన్మించాలి అని చెబుతున్నాడు. అటులనే ఈ నూతన జీవితం పొందేవాడు నిత్యజీవానికి అర్హుడు అవుతాడు, ప్రభువు అందుకుగాను వారి కొరకై సిలువ మీదకు ఎత్తబడతాడు, ప్రభువుని సిలువ మరణం మానవునికి ఈ నిత్య జీవమును ఇచ్చుటకే అనే విషయం స్పష్టము అవుతుంది.
ఎందుకు మరల జన్మించాలి ?
యేసు ప్రభువు ఈ లోకంలో ఉండగా దేవుని రాజ్యం యొక్క గొప్ప తనాన్ని అందరికి ప్రకటించారు. ఆ రాజ్యంలో ప్రవేశించడానికి ఒక వ్యక్తి దేనినైన కోల్పోవడానికి సిద్ధంగా ఉంటాడు కాని ఆ రాజ్యం కావాలనికోరుకుంటాడు. దేవుని రాజ్యం అంటే అంతటి గొప్పది కనుక యేసు ప్రభువు చెప్పిన అనేక ఉపమానాలలో దాని విలువ తెలిసిన వ్యక్తులు, ఏమి కోల్పోయిన దానిని పొందుటకు ప్రయత్నిస్తారు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రధానమైన అర్హత నూతన జన్మను పొందాలి అని ప్రభువు చెబుతున్నారు. అందుకే ఈ నూతన జన్మ ముఖ్యమైనది. మానవుడు తన సొంత బలం ద్వారా ఈ నూతన జన్మను పొందలేడు, జీవించలేడు. దేవుని తోడ్పాటు ఎంతగానో అవసరం ఉంటుంది. ఇది పూర్తిగా హృదయ పరివర్తనతోనే మొదలవుతుంది, అందుకే ప్రభువు తన పరిచర్యలు మొదట హృదయ పరివర్తన పొందాలి అని చెబుతున్నారు.
ఆత్మతో జన్మించువారు
ఆత్మతో జన్మించువారిని ప్రభువు గాలితో పోల్చుతున్నారు. గాలి ఎక్కడ నుండి వస్తుందో, ఎక్కడకు వెళుతుందో మనకు తెలియదు, అటులనే ఆత్మతో జన్మించువారు, లేక నూతన జన్మ పొందిన వారు, మారు మనసు పొందినవారు ఎలా ఉంటారో మనము చూస్తాము. వారి జీవితాల్లో ఉన్న మార్పు, వారి పరివర్తన మనకు కనపడుతునే ఉంటుంది, అంటే మనం ఆత్మను చూడము కానీ వారి జీవితంలో వచ్చే మార్పును బట్టి వారు నూతన జీవితం జీవిస్తున్నారు అని తెలుసుకొనవచ్చు. మగ్దలా మరియ, పౌలు వారి జీవితాలలో వచ్చిన మార్పును, జక్కయ్య జీవితంలో వచ్చిన మార్పును మనం చూసినప్పుడు వారు, హృదయ పరివర్తన చెందారు అని , నూతన జీవితం వారు జీవిస్తున్నారు అని మనము తెలుసుకుంటాము. ఆత్మ ద్వారా జన్మించిన వారి జీవితాలలో కూడా ఈ మార్పును మనం చూడవచ్చు. ఆత్మ ఫలాలు వారి జీవితాల్లో సుష్పష్టంగా కనిపిస్తాయి. వారు పాపమునకు బానిసలుగా కాక స్వతంత్రంగా జీవిస్తారు.
యేసు ప్రభువు ఎదుట నికోదేము సందేహంను వేలిబుచ్చుట
యేసు ప్రభువు ఆత్మ వలన జన్మించుటకు గురించి చెప్పిన తరువాత నీకొదేము ఇది ఎలా సాధ్యము అని అడుగుతున్నాడు. ప్రభువు అతనికి అది క్రొత్త విషయము ఏమి కాదు అని తెలియజేస్తూనే, నీవు బోధకుడివి కదా! ఈ విషయం తెలియదా అని అడుగుచున్నాడు. పాత నిబంధనలలో కూడా మనం మారు మనస్సు గురించి వింటాము. మరి ఎందుకు వీరు అవి ఏమి తెలియక ఉన్నారు అంటే వారు ఎప్పుడు ఈ లోక విషయాలు, మరియు స్వార్ధ పూరిత ఆలోచనలతో ఉన్నారు. కానుక అనేక దైవ విషయాలు, దైవ జ్ఞానం గురించి అజ్ఞానములో ఉన్నారు. దైవ జ్ఞానము కోసం మనము ఎంతగానో శ్రమించాలి. ఆయనను వేదకాలి అటువంటి వారికి ప్రభువు ఆ జ్ఞానమును ఇస్తారు.
పరలోక విషయాల గురించి యేసు ప్రభువు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే ఆయన మాత్రమే పరలోకం నుండి వచ్చినవారు. ఆయనే చెప్పేవి మాత్రమే ప్రామాణికం, అటువంటి వాటి గురించి జ్ఞానము కావాలి అంటే ప్రభువుని మాటలను వినాలి. ప్రభువును విశ్వసించాలి, ప్రభువు చెప్పినట్లు చేయాలి. కాని అనేక సార్లు ప్రభువుని మాటలను మనం పెడచెవిన పెట్టి పరలోక జ్ఞానమును పోగొట్టుకుంటున్నాము. నికోదేముతో ప్రభువు అంటున్నారు మేము చూచిన విషయాలను చెప్పిన మీరు నమ్ముటలేదు అని. అంటే మనం కొన్ని సార్లు ఎంతో కరుడుగట్టిన హృదయాలు కలిగిన వారిగా ఉంటున్నాము. ప్రభువు మాత్రమే పరలోకము నుండి వచ్చినవాడు మరియు తిరిగి పరలోకమునకు వెళ్లినవాడు. ఆయనకు పోయిన చోటుకు వెళ్ళుటకు ఆయనను మాత్రమే అనుసరించాలి.
యేసు ప్రభువు ఎత్తుబడుట
పాత నిబంధనలో దేవునికి మాటకు ఎదురుతిరిగిన వారు పాము కాటుకు గురయ్యి మరణిస్తుంటే, మోషే దేవునికి మొరపెట్టగా, వారిని రక్షించుటకు మోషేతో దేవుడు ఒక కంచు సర్పము తయారు చేసి దానిని చూచిన వారు రక్షించబడ్డారు. అటులనే పాపం చేసిన మానవుని రక్షించడానికి ప్రభువు సిలువ మీద మరణించారు. ఇది ప్రభువును విశ్వసించువారు అందరు నిత్య జీవం పొందుటకు ఆయన సిలువ మీద మరణించారు. మనందరికీ ఆయన నిత్య జీవాన్ని సాధ్యం చేశారు.
ప్రార్ధన: ప్రభువా! మీరు నికోదేముతో మరల జన్మించుట యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. ప్రభువా మీ మాటలు విని అనేక మంది పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుటకు దేనిని కోల్పోవడానికి అయినా సిద్ధపడ్డారు. నేను కూడా నా జీవితాన్ని మార్చుకొని, నూతన హృదయం కలిగి జీవించి, మిమ్ములను అనుసరించి మీరు నా కోసం మరణించి, నాకు సాధ్యం చేసిన ఆ నిత్యజీవాన్ని పొందే అనుగ్రహం చేయండి. ఆమెన్
27, ఏప్రిల్ 2025, ఆదివారం
నీటివలన ఆత్మ వలన నూతన జీవం
యోహాను 3:1-8
వెలుగు దగ్గరకు వచ్చుట
ప్రభువు గొప్పతనాన్ని ఒప్పుకొనుట
నీటివలన ఆత్మవలన పుట్టుట
ఆత్మను గుర్తించగలుగుట
26, ఏప్రిల్ 2025, శనివారం
యేసు ప్రభువు దర్శనములు
మార్కు 16: 9-15
ఆదివారము ప్రాతఃకాలమున పునరుత్తానుడైన యేసు, తాను ఏడూ దయ్యములను వెళ్లగొట్టిన మగ్ధలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను. ఆమె వెళ్లి ఆయనతో ఉండినవారును, దుఃఖసాగరంలో మునిగియున్న ఆయన శిష్యులకును ఈ సమాచారమును అందచేసెను. ఆయన జీవించి ఉన్నాడనియు, ఆమెకు దర్శనమిచ్చెననియు విని వారు నమ్మరైరి. పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్లుచున్న ఇద్దరు శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చెను. వారు ఇద్దరు తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయమును తెలియపరచిరి. కానివారు నమ్మలేదు. తదుపరి పదునొకండుగురు శిష్యులు భోజనము చేయుచుండగా, యేసు వారికి ప్రత్యక్షమై, సజీవుడై లేచివచ్చిన తనను చూచిన వారి మాటలను కూడ నమ్మనందున వారి అవిశ్వాసమునకును, హృదయకాఠిన్యముకును వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను: "మీరు ప్రపంచ మందంతట తిరిగి, సకలజాతి జనులకు సువార్తను బోధింపుడు.
ఈ వచనాలు యేసు ప్రభువు పునరుత్థానము నిద్ధారణము మరియు శిష్యులకు ఓదార్పును తెలియజేస్తూ, వారు చేయవలనసిన కర్తవ్యము గురించి తెలియజేస్తున్నాయి. ఈ దర్శనములు వారిలో ఉన్న అపనమ్మకమును తీసివేయుటకు ఆయన సువార్తను బోధించుటకు వారిని మరల ప్రభువు ప్రోత్సహిస్తున్నాడు.
మగ్ధలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను
యేసు ప్రభువు మొదటగా ఒక స్త్రీకి దర్శనము ఇస్తున్నాడు. యూదయ సమాజంలో, మరియు యేసు ప్రభువు కాలములో ఒక స్త్రీకి సమాజంలో అంతటి ప్రాముఖ్యత ఉండేది కాదు. మరియు ఈ మరియమ్మ నుండి ప్రభువు దయ్యములను వదలకొట్టాడు. ప్రభువు మనకు దర్శనము ఇవ్వడడానికి మన గత జీవితం ఏమిటి? మనకు సమాజం ఇచ్చే ప్రాముఖ్యత ఏమిటి? అనేవి ఏమి ప్రభువు పరిశీలించరు. మనకు ప్రభువు మీద చూపించిన ప్రేమకు కృతజ్ఞత కలిగిఉంటే చాలు. ఆయన మనము మరచిపోలేని మేలులను మనకు చేస్తారు. అంతేకాక మనలను ప్రత్యేక వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు. అనేక మందికి ఆదర్శవంతులుగా తయారుచేస్తారు. ఈ మరియమ్మ అనేక బంధనాలనుండి విముక్తి పొందింది. ప్రభువు మాటలకు అణువుగా మనం ఉంటే మన జీవితం కూడా ఎటువంటి లోక శక్తులకు బానిసలు కాకుండా ఎల్లప్పుడు స్వతంత్రులుగా జీవించగలుగుతాం.
ప్రభువు దర్శనం గురించి నమ్మక పోవుట
దుఃఖంలో ఉన్న శిష్యులకు ప్రభువు ఓదార్పు ఇవ్వడానికి ఎంతగానో వారికి అనేక పర్యాయాలు కనబడుతున్నప్పటికీ శిష్యులు నమ్మలేదు. వారికి నమ్మకము కలుగక పోవడానికి కారణం పకృతి విరుద్ధంగా ఉన్న మరణం నుండి లేవడం అనేది నమ్మదగినదిగ లేకపోవడం. అంతేకాక ప్రభువే ఇటువంటివి చేశారు. ఆయనే మరణించిన తరువాత ఎవరు అలా చేయగలరు? అనేక ప్రశ్నలు వారిలో ఉన్నవి. వీరిలో ఉన్న ఈ భయాలు మరియు యేసు ప్రభువు చెప్పిన మాటలు నేను మూడవ రోజున తిరిగి లేస్తాను అని చెప్పిన మాటలు ఆసరాగా తీసుకొని ఎవరైన పుకార్లు పుట్టిస్తున్నారు అనే అనుమానాలు ఇవాన్నీ శిష్యులలో ఉండవచ్చు అందుకే వారు అన్నింటిని నమ్మలేని పరిస్థితుల్లో లేరు.
ఇద్దరు శిష్యులకు దర్శనం
యేసు ప్రభువు గ్రామమునకు వెళుతున్న ఇద్దరు శిష్యులకు దర్శనం ఇస్తున్నారు. లూకా సువిశేషంలో ఎమ్మావు వెళుతున్న ఇద్దరు శిష్యులు అని మనం చదువుతాం. ప్రభువు వారితో మాట్లాడుతున్న సమయంలో వారు ప్రభువును గుర్తించలేకపోయారు. తరువాత రొట్టెను విరిచి ఇస్తున్నప్పుడు వారు ప్రభువును గుర్తించారు. అనేక సార్లు ప్రభువు మనతో ఉన్నప్పుడు మనము ప్రభువును గుర్తించలేపోతున్నాము కారణము కేవలం ప్రభువుకు సంబంధించిన విషయాలలో మనం ప్రేక్షకులుగా మాత్రమే ఉంటున్నాము. ప్రభువుతో వ్యక్తిగతంగా సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఇద్దరు శిష్యులు కూడా ప్రభువు వారికి దర్శనము ఇచ్చిన విషయం గురించి ఇతర శిష్యులకు చెప్పినప్పుడు వారు నమ్మలేదు. శిష్యులు ఏక్కువ నమ్మనది వారికి స్వయంగా ప్రభువు ఇచ్చిన దర్శనమును. వారు స్వయనుభవంకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రభువు మాత్రము మనకు ఇతరుల సాక్ష్యంను కూడా నమ్మమని చెబుతున్నారు.
ప్రభువుని సందేశం
యేసు ప్రభువు పదకొండు మంది శిష్యులకు దర్శనము ఇచ్చి వారి అవిశ్వాసమును ఖండించారు. యేసు ప్రభువు వారి హృదయ కాఠిన్యము, అవిశ్వాసమును గద్దించారు. హృదయ కాఠిన్యము చాల మందిలో పెరుగుతున్నది. హృదయ కాఠిన్యము పెరిగినప్పుడు మనము దేనికి స్పందించము. ఇతరుల అవసరములలో ఉన్న , కష్టాలలో ఉన్నా నాకు ఎందుకులే? అనే ధోరణిలో ఉంటాము. క్రీస్తు అనుచరులలో ఉండకూడనిది ఈ హృదయ కాఠిన్యము. అందుకే దేవుడు యిస్రాయేలుకు వారి రాతి గుండెను తీసి మాంసంతో కూడిన హృదయము వారికి ఇస్తాను అని చెప్పినది. క్రైస్తవుల హృదయం ఎప్పుడు ప్రభువు వలె ఇతరుల జీవితాలు చూసినప్పుడు వారి సమస్యలు , లేక సౌఖ్యాల అనుకూలంగా స్పందించ కలగాలి. ప్రభువు వారితో సకల జాతి జనులకు సువార్తను ప్రకటించండి అని చెబుతున్నాడు. శిష్యులకు ఉన్న ప్రధాన లక్ష్యం సువార్తను ప్రకటించడం. ఎందుకు ఇది ప్రధానమైన లక్ష్యం అంటే ప్రభువు ఇచ్చే రక్షణ అందరికి, కేవలం ఒక జాతి, ప్రాంతం, వర్గమునకు మాత్రమే చెందినది కాదు. ఆ విషయం ఈ శిష్యుల ప్రపంచమంతట తిరిగి అందరికి తెలియజేస్తూ, వారు సాక్ష్యం ఇవ్వాలి. ఈ సాక్ష్యం ఇతరుల అనుభవాలు మాత్రమే కాక వారు కూడా స్వయంగా ప్రభువును పునరుత్థానం అయిన తరువాత చూసారు, విన్నారు మరియు ఆయన నుండి వారి కర్తవ్యము ఏమిటో తెలుసుకున్నారు. వీరు మాత్రమే కాక ప్రభువును తెలుసుకున్న వారు అందరు ఈ కర్తవ్యము కలిగివున్నారు. వారు అందరు ఆయనను ప్రకటించవలసి బాధ్యత ఉంది.
ప్రార్థన : ప్రభువా! మీరు ఈ లోకమున ఉండగా అనేకమందిని పాపము నుండి సాతాను బంధనముల నుండి విముక్తిని కలిగించారు. అదేవిధంగా వారిని స్వతంత్రులనుచేశారు. మీరు చూపించిన కరుణకు స్పందిస్తూ, మంచి జీవితం జీవించిన వారిని మీరు అనాధారం చేయలేదు. మగ్ధలా మరియమ్మకు దర్శనము ఇవ్వడం, శిష్యులకు దర్శనం ఇవ్వడం, ఇవాన్నీ మీరు మమ్ములను విడిచిపెట్టడం లేదు అని తెలుపుతున్న, మిమ్ములను నమ్మడంలో, విశ్వసించడంలో అనేకసార్లు విఫలం చెందుతున్నాం. దానికి మాకు ఉన్న అనేక భయాలు కారణం అయ్యివుండవచ్చు. ప్రభువా! మీరు మాతో ఎప్పుడు ఉంటారు అనే విషయాన్ని తెలుసుకొని, మీరు ప్రసాధించిన రక్షణ అందరికి అని, మీ సువార్తను ప్రకటించే భాద్యత, మాకు ఇచ్చినందుకు కృతఙ్ఞతలు, మీ సువార్తను ఇతరులకు ప్రకటించుటకు కావలసిన అనుగ్రహము దయచేయండి. ఆమెన్.