యోహాను 19: 25-34
యేసు సిలువ చెంత ఆయన తల్లియు, ఆమె సోదరి, క్లొఫా భార్యయగు మరియమ్మయు, మగ్ధలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట యేసు చూచి, యేసు తన తల్లితో, "స్త్రీ! ఇదిగో నీ కుమారుడు!" అనెను. ఆ తరువాత శిష్యునితో "ఇదిగో నీ తల్లి" అనెను. శిష్యుడు ఆ గడియనుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసికొనిపోయెను. పిదప, యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, "నాకు దాహమగుచున్నది." అనెను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని 'హిస్సోపు' కొలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని "సమాప్తమైనది" అని తలవంచి, ప్రాణము విడిచెను. అది పాస్కపండుగకు సిద్దపడు దినము. అందుచే యూదులు పిలాతును, "రేపటి విశ్రాంతి దినము గొప్పదినము. ఆనాడు దేహములు సిలువ మీద ఉండరాదు. కాళ్ళు విరుగగొట్టి వానిని దింపి వేయుటకు అనుమతినిండు" అని అడిగిరి. కావున సైనికులు వెళ్లి, యేసుతో పాటు సిలువవేయబడిన మొదటివాని కాళ్ళను, మరియొకని కాళ్ళను విరుగగొట్టిరి. కాని వారు యేసువద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి, ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు. అయితే, సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బళ్లెముతో పొడిచెను. వెంటనే రక్తము, నీరు స్రవించెను.
మరియమాత శ్రీ సభ తల్లి
యేసు ప్రభువు మరణించే ముందు సిలువ మీద ఉన్నప్పుడు తాను ప్రేమించిన శిష్యుడు యోహానును పిలిచి ఇదిగో నీ తల్లి అని, మరియు మరియమాతతో యోహాను చూపిస్తూ ఇదిగో నీ కుమారుడు అని చెబుతున్నాడు. మరియమాత మనకు తల్లిగా తిరుసభను అన్ని విధాలుగా మనలను ఆదరిస్తుంది. ఎప్పుడు తిరుసభకు తోడుగా ఉంటూ, తిరుసభకు అవసరమైన వాటికోసం ప్రార్థిస్తుంది.
ఇదిగో నీ కుమారుడు: పునీత యోహాను యేసు ప్రభువు ప్రేమించిన శిష్యుడు, కడరా భోజన సమయంలో యేసు ప్రభువుని హృదయమునుకు దగ్గరగా ఉన్నవాడు, ప్రభువుని ముఖ్యమైన ముగ్గురు శిష్యులలో ఒకడు. యేసు ప్రభువుని శ్రమల సమయంలో రహస్యంగా ప్రభువును అనుసరించినవాడు. ప్రభువు సిలువ మీద ఉన్నప్పుడు సిలువ క్రింద ఉన్నవాడు. అటువంటి శిష్యుని ప్రభువు తన తల్లికి అప్పగిస్తూ ఇదిగో నీ కుమారుడు అని చెబుతున్నాడు. మరియమాతకు కుమారునిగా ఇచ్చినది కేవలం యోహానును కాదు, తాను ప్రేమించితిన శిష్యుడను, ఇక్కడ ప్రభువుచే ప్రేమించబడిన ఆ శిష్యుడు తిరుసభకు గుర్తు. ప్రభువు మరియమాతకు ఇచ్చినది యోహాను రూపంలో తిరుసభను. యోహాను ప్రభువును విశ్వసించే ప్రతి విశ్వాసికి ప్రతిరూపంగా ఉన్నాడు.
నిన్ను వీడని తల్లి
తల్లిగా మరియమాత ఎప్పుడు తన కుమారున్ని విడువలేదు. యేసు ప్రభువును ఈ లోకములోనికి తీసుకొనిరావడానికి మరియమాత తాను పొందబోయే అవమానమునుకాని కష్టమును కాని ఆమె పట్టించుకొనలేదు. కేవలం ప్రభువును అంటిపెట్టుకొని ఉండుటకు ఆమె ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చింది. యేసు ప్రభువు పసిబాలునిగా ఉన్నప్పుడు హేరోదు ఆయనను చెంపుటకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె యోసేపుతో కలిసి ప్రభువును కాపాడుటకు రాత్రి పగలు తేడాలేకుండా ప్రభువును తీసుకొని సురక్షితమైన ప్రాంతమునకు పోయేది. యేసు ప్రభువును అన్ని సమయాలలో ప్రభువును గురించే ఆమె ఆలోచించేది. ప్రభువు తన ప్రేషిత కార్యం ప్రారంభించినప్పుడు ఆయన గురించి తెలుసుకొనుటకు ప్రభువు దగ్గరకు వెళుతుంది. ప్రభువు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు శిష్యులు అందరు ఆయనను వదలి వెళ్ళిపోయినా తల్లి మాత్రము ఆయనను వెంబడిస్తూనే ఉంది. సిలువ క్రింద ప్రభువు చనిపోయే సమయంలో కూడా ఆమె ఉంది. ప్రభువును ప్రతి క్షణము అంటిపెట్టుకొని ఆమె జీవించేది. అటువంటి ఆమెను యేసు ప్రభువు తాను ప్రేమించిన శిష్యునికి తల్లిగా ఇస్తున్నాడు. ఆయనను ఎలా ఎప్పుడు వెన్నంటివున్నదో అదే విధముగా ఆ శిష్యునికి మరియు ఆయన శిష్యులందరికి ఆమె తోడుగా, వారి బాధలలో ఓదార్పుగా, వారికి ఆదర్శముగా ఉండుటకు ప్రభువు ఆమెను తన శిష్యునికి తల్లిగా ఇస్తున్నాడు.
తల్లిగా శ్రీ సభతో మరియమాత
మరియమాత పెంతుకోస్తు రోజున శిష్యులందరు, యూదుల భయంతో ఉన్నప్పుడు, మరియమాత వారితో ఉండి ప్రార్ధన చేస్తుంది. పవిత్రాత్మతో తిరుసభ పుట్టిన రోజన మరియమాత అక్కడనే ఉన్నది. వారితో పాటు ఉండి వారికి ధైర్యమును ఇస్తుంది. అందరు మనలను అపార్ధం చేసుకున్నాకాని ఎలా దైవ చిత్తమును నెరవేర్చుటకు ధైర్యంగా ఉండాలో నేర్పుతుంది. శిష్యులు భయంతో ఉన్నప్పుడు ఆమె వారికి ధైర్యమును ఇస్తుంది. ప్రభువును పవిత్రంగా ఈ లోకమునకు తీసుకురావడానికి ఆమె కన్యగా గర్భం ధరించడానికి ఆమె ధైర్యంగా ఒప్పుకున్నది. అలానే శిష్యులు ప్రభువు అజ్ఞానుసారం జీవించేలా ఆమె ధైర్యం ఇస్తుంది. ఆమె కేవలం వారికి తోడుగా మాత్రమేకాక తన జీవితం ద్వారా ఆదర్శమును చూపిస్తుంది.
Fr. Amruth