24, ఆగస్టు 2024, శనివారం

21వ సామాన్య ఆదివారం

21వ సామాన్య ఆదివారం 
యెహోషువ 24:1-2,15-18, ఎఫేసీ 5:21-32, యోహాను 6: 61-70

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనములు మన యొక్క జీవితంలో తీసుకునే నిర్ణయం గురించి తెలుపుచున్నవి. గత నాలుగు ఆదివారాలుగా ఏసుప్రభువు దివ్యసప్రసాదం యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలుపుచు, దివ్య సత్ప్రసాదమును స్వీకరించుట ద్వారా కలుగు ప్రయోజనములను వివరిస్తూ ఈనాటి ఆదివారములో మనందరికీ కూడా ఈ దివ్య సత్ప్రసాద స్వీకరణను గురించి ఒక నిర్ణయం తీసుకొనమని తెలుపుచున్నారు.
మన యొక్క అనుదిన జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రించే వరకు ఎన్నో రకాలైనటువంటి అంశాల మధ్య మనము నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. ఉదాహరణకు ఏమి తినాలా? ఏమి త్రాగాలా, ఎలాంటి వస్త్రాలు ధరించాలి? ఎవరితో మాట్లాడాలి? ఎలా చదవాలి? ఎలా ప్రయాణం చేయాలి? ఎలా ప్రార్థించాలి?  ఆదివారం దేవాలయానికి వెళ్లాలా? ఈ విధంగా అనేక అంశాల గురించి మనందరం కూడా రోజు వివిధ రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. మనము తీసుకునేటటువంటి నిర్ణయము మీదే మన యొక్క జీవితము ఆధారపడి ఉంటుంది ఎందుకనగా మనము సరియైన నిర్ణయాలు తీసుకుంటే మన జీవితాలు సంతోషంగా ఉంటాయి సరియైనటువంటి నిర్ణయం తీసుకోపోతే జీవితాంతం మనం బాధపడాల్సి వస్తూ ఉంటుంది.
 ఈనాటి మొదటి పఠణంలో యెహోషువా ప్రవక్త న్యాయాధిపతులను, పెద్దలను అందరినీ షెకెము వద్ద సమావేశపరచి ఏ దేవుడిని ఆరాధించాలో నిర్ణయం తీసుకొనమని తెలుపుచున్నారు. అన్య దైవములను పూజించాలా? లేక యావే దేవుడిని ఆరాధించాలా? అనే ఒక ప్రశ్న ఇశ్రాయేలు ప్రజల ముందు యెహోషువ ప్రవక్త ఉంచుతున్నారు. యెహోషువ దేవునితో సంభాషించారు, దేవుని యొక్క అద్భుత కార్యములు కనులారా చూసారు, దేవుడు రక్షించిన విధానమును ఎల్లప్పుడూ గుర్తుంచుకున్నాడు , ఐగుప్తు బానిసత్వం నుండి స్వేచ్ఛను కలిగించిన విధానమును మననం చేసుకున్నారు అందుకనే ఆయన నేను నా కుటుంబమును యెహోవాను మాత్రమే ఆరాధించుదము అని పలికారు. ఆయన తన జీవితంలో ఉత్తమ నిర్ణయం తీసుకున్నాడు. అదే సమయంలో అక్కడి ప్రజలందరూ కూడా  మమ్ము రక్షించినటువంటి యావే దేవుడిని మేము సేవింతుము అని పలికారు. ఈ మొదటి పఠణంలో ఎలాంటి దేవుడిని అనుసరించాలి అని వారు సరి అయినటువంటి నిర్ణయం తీసుకున్నారు. అన్యదైవములకు మరియు నిజమైన దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసంలో వారు నిజ దేవుని యొక్క గొప్పతనమును గ్రహించి యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తాము అని ఒక నిర్ణయం తీసుకున్నారు. 
ఒక నిర్ణయం మన జీవితాన్ని మార్చి వేస్తుంది.
 1. ఆదాము అవ్వ తీసుకున్నటువంటి, పండు తినాలి అని నిర్ణయం వారి జీవితంలో చాలా కోల్పోయేలాగా చేసింది.
2.అబ్రహాము యొక్క మంచి నిర్ణయం తనను విశ్వాసులకు తండ్రిగా చేసింది. 
3. ఏసావు  తప్పుడు నిర్ణయం తన యొక్క అధికారం, దీవెనలు కోల్పోయేలాగా చేసింది.
4. సౌలు యొక్క మూర్ఖ నిర్ణయం తన యొక్క పదవి కోల్పోయేలాగా చేసింది. 
5. మోషే ప్రవక్త యొక్క నిర్ణయం తనను నాయకుని చేసింది. 
6. దానియేలు యొక్క మంచి నిర్ణయం తనను దేవునికి సాక్షిగా చేసింది.
7. మరియ తల్లి తన జీవితంలో తీసుకున్న ఉత్తమ నిర్ణయం ద్వారా మనకు రక్షకుడు తన ద్వారా జన్మించారు.
8. పేతురు తీసుకున్న నిర్ణయం తనను అపోస్తులలకు నాయకునిగా చేసింది. 
9. అననీయ సఫీరాల నిర్ణయం దేవుడిని మోసం చేసేలా చేసింది. 
వారు తీసుకున్నటువంటి నిర్ణయములను బట్టి వారి జీవితాన్ని యొక్క ప్రతిఫలం అనేది నిర్దేశించబడినది.
 చాలా సందర్భాలలో సరియైన నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం కాబట్టి ప్రార్థిస్తూ, దేవుని సహాయం కోరుతూ, మన జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుని యొక్క కుటుంబము విధేయత కలిగిన కుటుంబం లాగా జీవించమని తెలుపుచున్నారు. వారు (భార్యా-భర్తలు) వివాహ రోజున దేవుని ముంగట తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఒకరి ఎడల ఒకరు పరస్పర ప్రేమ కలిగి, విధేయత కలిగి ఒక ఆదర్శవంతమైన దేవుని కుటుంబ జీవితమును ప్రేమానురాగములతో జీవించమని తెలుపుచున్నారు. దేవుని ముంగిట తీసుకున్న నిర్ణయములో వారు ఎల్లప్పుడూ కూడా విశ్వాస పాత్రులుగా ఉండాలి. తీసుకున్న నిర్ణయమునకు కట్టుబడి జీవించాలి.
ఈనాటి సువిశేష భాగములో అనేకమంది ప్రజలు ఏసుప్రభు యొక్క మాటలు విని ఈయన బోధనలు కఠినమైనవి అని పలికి ప్రభువుని విడిచి వెళ్ళిపోయారు. ఏసుప్రభు ఇచ్చిన ఆహారమును భుజించారు, ఆయన యొక్క అద్భుత కార్యములు చూశారు అయినప్పటికీ కూడా వారిలో విశ్వాసము కలగలేదు. అనేకమంది శిష్యులు ఏసుప్రభును విడిచి వెళ్లి మరెన్నడను వెంబడింపరైరి. ఆ సమయములో ఏసుప్రభు తన 12 మంది శిష్యులను మీరు కూడా వెళ్లిపోయిదరా? అని అడగగా పేతురు, ప్రభువు మేము ఎవరి వద్దకు పోగలము "నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు" మేము నిన్నే అనుసరింతుము అని పలికెను. పేతురు తన యొక్క జీవితంలో ఒక సరైన నిర్ణయం తీసుకుంటున్నారు. దేవుని యొక్క శక్తిని గ్రహించిన వ్యక్తి, అద్భుత కార్యములు చూసిన వ్యక్తి, యేసు ప్రభువుని సజీవ దేవుని కుమారుడు ఒక మెస్సయ్య అని గుర్తించినటువంటి పేతురు మేము నిన్ను మాత్రమే అనుసరిస్తాము అని ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు.
మన యొక్క అనుదిన జీవితంలో కూడా అనేక సందర్భాలలో మనం సరైన నిర్ణయం తీసుకోక రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేసే వ్యక్తులుగా ద్వంద స్వభావం కలిగిన జీవితం జీవిస్తూ ఉంటాం. ఇటు క్రైస్తవ సాంప్రదాయాలు పాటిస్తాం అదేవిధంగా అటు ఇతర మతముల యొక్క ఆచారమును కూడా పాటిస్తూ ఉంటా కానీ నేడు ప్రభువు మనల్ని కూడా ఒక సరియైనటువంటి నిర్ణయం తీసుకొని మనం తెలుపుతున్నారు. మనలో నిజముగా దివ్యసప్రసాద అనుభూతి కలిగినట్లయితే మనం కూడా దేవుడిని అంటిపెట్టుకొని జీవించగలుగుతాం, ఆయన యొక్క శక్తిని గ్రహించగలుగుతాం కాబట్టి నా జీవితంలో సరైన నిర్ణయం తీసుకొని దివ్య బలి పూజలో పాల్గొని, దేవుని యొక్క దీవెనలు పొందాలి.
Fr. Bala Yesu OCD

23, ఆగస్టు 2024, శుక్రవారం

దర్శన గ్రంథము 21:9- 14 యోహాను1:45-51

పునీత బర్తలోమయి అపోస్తులుడు 

దర్శన గ్రంథము 21:9- 14 యోహాను1:45-51

ఫిలిప్పు నతనయేలును కనుగొని, "మోషే ధర్మశాస్త్రమునందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడినవానిని మేముకనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడును, నజరేతు నివాసియునగు యేసు" అని చెప్పెను. "నజరేతునుండి ఏదైనా మంచి రాగలదా? అని నతనయేలు అడుగగా, "వచ్చి చూడుము" అని ఫిలిప్పు పలికెను. నతనయేలు తన యొద్దకు వచ్చుటను చూచి, అతనిని గూర్చి యేసు "ఇదిగో!కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు" అని చెప్పెను. "మీరు నన్ను ఎట్లు  ఎరుగుదురు?" అని నతనయేలు అడుగగా యేసు, "ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే, నీవు అంజూరపుచెట్టు క్రింద ఉండుటను నేను  చూచితిని" అని సమాధానమిచ్చెను. "బోధకుడా! నీవు దేవుని కుమారుడవు, యిస్రాయేలు రాజువు" అని   నతనయేలు పలికెను. "నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని, అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నావా?  ఇంతకంటే గొప్పకార్యములను నీవు చూడగలవు" అని యేసు చెప్పెను. ఇంకను, "మీరు పరమండలము తెరువబడుటయు, దేవునిదూతలు మనుష్యకుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటయు చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అని పలికెను. 

ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాడు మనం పునీత బర్తలోమియో గారి పండుగను కొనియాడుకుంటున్నాము. పునీత బర్తలోమయి గారు పన్నెండు మంది శిష్యులలో ఒకరు. ఈయన గలిలియాలోని కానా గ్రామ నివాసి. వీరికి మరో పేరు నతనయేలు. నతనయేలు పవిత్ర జీవితం గడుపుతున్న యూదుడు. ఆయన రక్షకుడి  రాకకోసం నిత్యం ప్రార్ధనలు చేసే భక్తుడు. ఫిలిప్పుగారికి ఆప్తమితృడు. అదేవిధంగా బాప్తిస్మ యోహాను శిష్యుడు. ఫిలిప్పు గారు మేము మెస్సియ్యను కనుగొంటిమి అని చెప్పగానే నతనయేలు యేసు ప్రభువును కలుసుకునేందుకు ఫిలిప్పు గారితో పాటు బయలు దేరాడు. యేసు ప్రభువు వారిని చూడగానే ఇదిగో కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు అని అంటున్నాడు.  నతనయేలు అనగా నిష్కళంకమైన నిజాయితీ కలవాడని అర్ధం. నతనయేలు బోధకుడా! నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు. క్రీస్తు కొరకు ఎదురు చూసి ఆయనను కనుకొని ఆయన కొరకు జీవిస్తూ, ఆయన క్రీస్తు సేవ చేసి, క్రీస్తు ప్రభువుని సాక్షిగా తన ప్రాణమును ధారపోసి రక్త సాక్షిగా మరణించాడు. 

క్రిస్తునాధుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా పవిత్ర నగరమైన యెరూషలేమును గూర్చి వింటున్నాం. ఆ యెరూషలేము నగరము ఒక అమూల్యమైన రత్నము వలెను, సూర్యకాంతమణి వలెను.  స్ఫటికము వలే స్వచ్ఛముగను ఆ నగరము ప్రకాశించెను అని ఆ యెరూషలేము యొక్క విశిష్టతను వింటున్నాం. పండ్రెండు ద్వారములు. వాటిపై పండ్రెండు మంది దేవదూతలు, ఆ ద్వారములపై పండ్రెండు గోత్రముల పేర్లు వ్రాయబడినవి అని అదే విధంగా ఒక్కొక్క ప్రక్కకు మూడేసి ద్వారములు ఉండెను. తూర్పున మూడు, దక్షిణమున మూడు ఉత్తమున మూడు పశ్చిమమున  మూడు అన్ని కలిపి  పండెండు ద్వారములు, ఆ నగరపు గోడ 12 శిలలపై నిర్మింపబడినది. ఆ రాళ్లపై క్రీస్తు ప్రభువుని  పండ్రెండు మంది అపొస్తలుల పేర్లు వ్రాయబడి ఉన్నవి.. 

ప్రియా విశ్వాసులారా 12 అనే సంఖ్య పరిపూర్ణతకు గుర్తు, అధికారానికి గుర్తు, పండ్రెండు యిస్రాయేలీయుల తెగలు, పండ్రెండు మంది అపోస్తులులు, పండ్రెండు ద్వారములు, పండ్రెండు పునాదులు ఇక్కడ 12 అంటే దేవుని చిత్తం పరిపూర్ణము అని అర్ధం. ఎంతో మంది ఆ నూతన యెరూషలేములో చేరాలని, ప్రవేశించాలని ప్రయత్నించారు. ఇప్పుడు క్రైస్తవులమైన మనం ఆ అందమైన దేవుని రాజ్యంలో చేరాలంటే దేవుని అనుసరించి, మంచి మార్గంలో నడవాలి అప్పుడు ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాము. 

ఈనాటి సువిశేష పఠనంలో దేవుడు క్రీస్తు ప్రభువు తన వద్దకు వచ్చుచున్న నతనయేలును చూసి ఇదిగో కపటము లేని నిజమైం యిస్రాయేలీయుడు అని చెప్పాడు. ఈనాడు మనం వాక్యంలో వింటున్నాము. ఫిలిప్పు ఎప్పుడైతే నతనయేలును కలిసి మేము మెస్సియ్యను కనుగొంటిమి . ఆయన  యేసు నజరేతు నివాసి అని చెప్పగానే అక్కడ నుండి మంచి ఏదైనా రాగలదా ? అని నతనయేలు అనగానే వచ్చి చూడుము అని ఫిలిప్పు పలికాడు. 

ప్రియా విశ్వాసులారా మన సంఘలలో మన జీవితాలలో మన కుటుంబాలలో మనం నిజమైన మెస్సియ్యను కనుగొనాలంటే మనము కూడా దేవుని సన్నిధానానికి వచ్చి చూసి ఆయన గొప్ప కార్యాలు, మహిమ శాంతిని అనుభవించాలి. క్రీస్తు చెంతకు రావాలి. నతనయేలు క్రీస్తు ప్రభుని చెంతకు వచ్చి, ఆ దేవుని అనుభవించి,  క్రీస్తు ప్రభువునితో బోధకుడా నీవు దేవుని కుమారుడవు యిస్రాయేలు రాజువు అని సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మనం మన జీవితాలలో,  నీ , నా మన అనుభవం ఏమిటి?  ఆ నజరేయుడైన యేసును అనుభవిస్తున్నామా! ఆయన దేవుని కుమారుడని, యిస్రాయేలు రాజు అని గుర్తించగలుగుతున్నామా! లేదా ! ఆత్మ పరిశీలన చేసుకుందాం.     

ప్రార్ధన: ప్రేమమయుడవైన దేవా నీవు దేవుని కుమారుడవు, లోక  రక్షకుడవు, యిస్రాయేలు రాజువు. మేము నీవద్దకు వచ్చి మిమ్ము ప్రేమిస్తూ, సేవిస్తూ  నిన్ను మా జీవితాలలో తెలుసుకొనే భాగ్యం మాకు దయచేయండి. నతనయేలు మిమ్ము తెలుసుకొని, నీ శిష్యుడుగా మారి, నీ  వాక్యాన్ని లోకాన బోధించి ఒక గొప్ప   పునీతుడుగా మారినట్లు మేము కూడా మారె భాగ్యం మాకు దయచేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

The Feast of Epiphany

The Feast of Epiphany  క్రీస్తు సాక్షాత్కార పండుగ యెషయా 60:1-6,ఎఫేసీ3:2-3, మత్తయి 2:1-12 ఈనాడు తల్లి శ్రీ సభ ముగ్గురు జ్ఞానులపండుగను కొనియాడ...