26, అక్టోబర్ 2024, శనివారం

30వ సామాన్య ఆదివారం

30వ సామాన్య ఆదివారం 
యిర్మియా 31:7-9, హెబ్రీ 5:1-6, మార్కు 10:46-52
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని నమ్ముకుని ఆయన మీద ఆధారపడినటువంటి వారికి చేసేటటువంటి మేలులను తెలియజేస్తున్నాయి. మానవ శక్తి మీద, ఆలోచన మీద కాక సంపూర్ణముగా దేవుడి మీద ఆధారపడితే ప్రభువు వారిని ఆశీర్వదిస్తారు. 
ఈనాటి మొదటి పఠణంలో యిర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు సంతోషకరమైన వార్తను తెలియజేస్తున్నారు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం నుండి 34వ అద్యాయాలను ఓదార్చేపుస్తకమని, ప్రశాంత పరిచే పుస్తకమని అదేవిధంగా ఇశ్రాయేలీయులను తిరిగి తమ వారితో ఐక్యపరిచుటను తెలియచేయు పుస్తకమని అంటారు. ఎందుకనగా ఈ నాలుగు అధ్యాయాలలో ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు సంతోషకరమైనటువంటి మాటలను తెలియజేశారు.యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అస్సిరీయుల బానిసత్వం నుండి వారి యొక్క సొంత భూమికి తీసుకొని వెళతారు అనే సంతోషకరమైన విషయం తెలుపుచున్నారు. ఈ యొక్క అస్సిరీయులు, ఇశ్రాయేలును పూర్తిగా ధ్వంసం చేసి అక్కడివారిని బానిసలుగా కొనిపోయారు. ఇలాంటి ఒక బాధకరమైన సమయంలో యిర్మియా ప్రవక్త దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానము మరువడని, ఆయన దయ కలిగిన దేవుడని, ప్రజల యొక్క పాపములను క్షమించి మరలా వారిని తన చెంతకు చేర్చుకుంటారని ప్రవచించారు. దేవుడు ఎవరిని మరువకుండా, విడిచిపెట్టకుండా, కుంటి వారిని, గ్రుడ్డివారిని ఏ విధముగా గర్భవతులను సైతము అందరిని కూడా సొంత భూమికి తీసుకొనివస్తారని వాగ్దానం చేశారు. ప్రభువు ఇస్రాయేలు ప్రజల పట్ల ఎల్లప్పుడూ విశ్వాసనీయుడుగానే ఉన్నారు ఆయన సీనాయి పర్వతం దగ్గర చేసినటువంటి వాగ్దానమును ఎన్నడూ మరువలేదు. ప్రభువు వారిని విముక్తులను చేసినందుకుగాను ప్రతిఫలముగా ఇశ్రాయేలు ప్రజలు ప్రభువునకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థనలు సమర్పిస్తారన్నారు. అదే విధముగా దేవుడే స్వయముగా తన ప్రజలను నడిపిస్తారని తెలిపారు అలాగే వారు పడిపోకుండా, మార్గము తప్పిపోకుండా ఆయనే ఒక మార్గ చూపరిగా ఉంటూ తమ యొక్క సొంత ప్రాంతమునకు నడిపించారు అని యిర్మియా ప్రవక్త ఆనాటి ప్రజలకు ఈ యొక్క సంతోషకరమైన అంశమును తెలియజేశారు. తండ్రి తన బిడ్డలను చూసుకున్న విధముగా దేవుడు కూడా ఇశ్రాయేలును తన సొంత బిడ్డల వలె కాచి కాపాడుతూ వారి వెన్నంటి ఉంటారని పలికారు. 
ఈనాటి రెండవ పఠణంలో  యాజకత్వమును గురించి తెలుపుచున్నది. ప్రతి యాజకుడి యొక్క యాజకత్వము దేవుడి నుండి వచ్చినదని తెలుపుతూ వారు బలహీనులైనప్పటికీ తమ కొరకు తాము, తన పాపముల కొరకు అదేవిధంగా ఇతరుల యొక్క పాపముల కొరకు బలిని అర్పింపవలెనని తెలిపారు. యాజకత్వము అనే దైవ పిలుపు ప్రభువునుండే స్వయముగా వచ్చినది. దేవుడే ప్రతి ఒక్క యాజకుడిని నియమించారు. తండ్రి కుమారుడను నియమించిన విధముగా మనలను దేవుడు యాజకులుగా నియమిస్తున్నారు. 
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు బర్తిమయి అను గుడ్డివానికి దృష్టిని బసగిన అంశమును చదువుకుంటున్నాము. ఈయన యొక్క జీవితంలో మనము గ్రహించవలసినటువంటి కొన్ని అంశములు;
1. గ్రుడ్డివాడు గ్రహించగలిగాడు. బర్తి మయి అనే బిక్షకుడు తనకు చూపు లేకపోయినా యేసు ప్రభువు యొక్క దైవత్వమును గ్రహించగలిగాడు. ఎందరికో కన్నులున్నప్పటికీ వారు ఏసుప్రభు యొక్క కార్యములను చూసి గుర్తించలేకపోయారు కానీ ఈ బర్తిమయి కేవలం యేసు ప్రభువును గూర్చి విని ఆయన గొప్పతనం గ్రహించ గలిగాడు. వినుట వలన విశ్వాసము కలుగును.
2. విశ్వాసము కలిగి దేవుడిని ఆశ్రయించారు. బర్తిమయి ప్రభువు నందు ఆచంచలమైన విశ్వాసము కలిగి ఉన్నాడు కాబట్టే ప్రభువు తన చెంతకు వచ్చిన వెంటనే తనకు చూపునివ్వమని విశ్వాసముతో ప్రార్థించాడు. 
3. బర్తిమయి ప్రభువును తనకు ఏది ముఖ్యమో దాని కొరకు మాత్రమే ప్రార్థించారు. ఆయన ప్రభువుని దానం చేయమని అడగలేదు, తన యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని అడగలేదు కానీ తనకు చూడటానికి చూపును ఇవ్వమని కోరాడు. తన యొక్క జీవితంలో చూపు అనేది ముఖ్యము కాబట్టి దాని కొరకే బర్తిమయి ప్రార్థించాడు. బహుశా ఆయన కూడా ప్రభువుని చూడాలని ఆరాటపడి ఉండవచ్చు అందుకే కేవలం చూపు అని మాత్రమే ప్రసాదించమని అడిగాడు.
4. బర్తిమయి పట్టుదల - తన తోటి వారు తనను ఎంత నిశ్శబ్దముగా ఉండాలని ప్రయత్నం చేసిన  బర్తిమయి పట్టుదలతో ఎవరి మాటను పట్టించుకోకుండా ఆయన అనుకున్నది సాధించడానికి గొంతెత్తి మరి ప్రభువుని పిలిచారు. 
5. బర్తిమయి ప్రభువు యొక్క కనికరము కొరకు ప్రార్థించారు. ఆనాటి కాలంలో ఎవరికైనా ఏదైనా లోపం(అనారోగ్యం) ఉంటే దానిని దేవుని శిక్షగా భావించేవారు అందుకే ఒకవేళ ఆయన మీద దేవుని శిక్ష ఉండిన యెడల దానిని తీసివేయమని, కరుణతో క్షమించమని ప్రభువు కరుణ కొరకు వేడుకున్నాడు. 
6. ప్రభువుని అనుసరించుట- బర్తిమయి ఏసుప్రభు తన జీవితంలో చేసిన మేలులు తలంచుకొని ప్రభువుని వెంబడిస్తున్నారు. మేలులు పొంది తిరిగిపోయిన వారి కన్నా, మేలు చేసినటువంటి దేవుడిని వెంబడించినటువంటి గొప్ప వ్యక్తి ఈ బర్తిమయి.
7. ప్రభువు మన చెంతకు వచ్చినప్పుడు ఆయనను మనము భర్తిమయి వలే గుర్తించాలి. అనేక సందర్భాలలో దేవుడు దివ్య బలి పూజ ద్వారా, ప్రార్థన ద్వారా మన చెంతకు వస్తారు ఆయనను మనము గుర్తించి కలుసుకున్నప్పుడు మన యొక్క జీవితంలో భర్తిమయి వలె మేలులు కలుగును.
8. దేవుడి మీద ఆధారపడుట- బర్తిమయి సంపూర్ణముగా దేవుని యొక్క శక్తి మీదే ఆధారపడ్డాడు కాబట్టి ప్రభువు ఆయన్ను దీవించారు. 
మన యొక్క అనుదిన జీవితంలో కూడా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుతూ, విశ్వాసముతో ప్రార్థిస్తూ, దేవుని యొక్క కరుణ కోరుకుంటూ ఆయన యొక్క దీవెనలు పొందాలి. 
Fr. Bala Yesu OCD.

19, అక్టోబర్ 2024, శనివారం

ఇరవై తోమ్మిదవ సామాన్య ఆదివారము

ఇరవై తోమ్మిదవ 
సామాన్యకాలపు ఆదివారము 

యెషయా 53:10-11
హెబ్రీయులకు 4:14-16
మార్కు 10:35-45

క్రీస్తునాధునియందు ప్రియ దేవుని బిడ్డలరా, ఈనాడు మనమందరము సామాన్య కాలపు ఇరవై తోమ్మిదవ ఆదివారంలోనికి ప్రవేశించి యున్నాము, ఈనాటి మూడు పఠనలు కూడా ఒకే తీరు మాటల గురించి మాట్లాడుతున్నాయి: అవి ఏమిటంటే త్యాగం, సేవ, మరియు విముక్తి అనే అంశాల గురించి మనకు వివరిస్తున్నాయి.
               ముందుగా మొదటి పఠనములో యెషయా గ్రంధములో మనము గమనించవలసిన అంశం చుసినట్లయితే యెషయా ప్రవక్త యేసు క్రీస్తు గూర్చి ముందుగా ప్రజలందరికి కూడా వివరిస్తున్నాడు. ఏవిధంగానంటే బాధామయ  సేవకుని జీవితంలో ఏవిధంగానైతే బాధలు అనుభవిస్తాడో అదేవిధమైనటువంటి బాధలను క్రీస్తు ఎదుర్కొంటాడు  అనే దానిని క్లుప్తంగా వివరిస్తున్నాడు. ఎందుకంటే, దేవుడు  తన సేవకున్నీ  బాధలు అనుభవింపచేల చేస్తున్నాడు . అందుకనే సేవకుడు తన ప్రాణాన్ని పాప బలిగా ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు, దేవుడు ఆయనకు తగిన ప్రతిఫలముగా సేవకుని మహిమపరుస్తాడు. ఎందుకంటే ఈ దుఃఖం, బాధ, వేదన ద్వారా దేవుడు తన ప్రణాళికను తన సేవకుని ద్వారా నెరవేర్చాడు. మన పాపాల కోసం క్రీస్తు తన జీవితాన్ని మరియు తన సర్వస్వాన్నీ ఇచ్చేందుకు వెనుకంజ వేయలేదు, అది దేవుని ప్రేమ, కృపా  సారాంశం. క్రీస్తు తన ప్రాణాన్ని అర్పించి, మన పాపాలను తుడిచివేశాడు మరియు తన అర్పణకు ప్రతిఫలంగా దేవుడు ఆయనకు విజయాన్ని ఇచ్చాడు. యేసు మన పాపాల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి, బాధను అనుభవించాడు. ఆయన త్యాగం ద్వారా మనకు విముక్తి మరియు క్షమాపణ లభించాయి.
       రెండొవ పఠనని గ్రహించినట్లయితే హెబ్రీయులకు వ్రాసిన లేకలో, యేసు మన ప్రధానయాజకుడిగా మన బలహీనతలను మరియు మనలో ఉన్న నైపుణ్యాలను అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే ఆయన కూడా ఒక మానవునివలె మన మాదిరిగా ఈ లోకానికి వచ్చి అన్ని పరీక్షల్ని, అవమానలను అనుభవించి కూడా ఏ  పాపం చేయలేదు. అందువల్ల,  ఆయనను ఆశ్రయించి, ఆయన వద్దకు వచ్చినవారికి ఆయన కృప తోటి సహాయపడతాడు. ఈ వచనాలు మనలను ఆయన  కాపాడే కృపను, అయన యొక్క దయను తెలుపుతున్నాయి. మనకు అయన కృపను అందించే ప్రయత్నం చేస్తాడు. ఆయన త్యాగం మనకు ధైర్యం, ఆశ కలిగిస్తుందని రెండొవ పఠనం మనకు పూర్తిగా వివరిస్తున్నాయి.
              చివరిగా సువిశేష పఠనములో యేసు ప్రభు ఒక నిజమైన సేవకుడిగా తన జీవితాన్ని త్యాగం చేయడం ద్వారా ఇతరులకు అయన ఒక ఉదాహరణ ఉంటున్నారు ఎందుకంటే మానవుల యొక్క బలహీనతలను అర్థం చేసుకుంటు, ఆయన కూడా మనవుని మాదిరిగా శరీరాన్ని  ధరించి అన్ని కష్టాలను, పరీక్షల్ని  అనుభవించాడు, కానీ అయన మాత్రం మనలాగా పాపం చేయలేదు. అందువల్ల,  ఆయనను ఆశ్రయించి, అయన యొక్క కృప మరియు దయను పొందేందుకు,  ఆయన దగ్గరకు వచ్చినవారికి ఆయన సహాయపడతాడు. ఈ వాక్యాలు అన్ని కూడా మనకు ఆయన  కృపను మరియు దయను తెలుపుతున్నాయి. యేసయ్య తన ప్రాణాన్ని అనేకమందికి రక్షణగా మరియు విముక్తిగా ఇచ్చాడు, ఇది క్రైస్తవ జీవితంలో అనుసరించాల్సిన మార్గాన్ని అయన మనకు ఒక ఉదాహరణగా తన జీవితం ద్వారా చూపిస్తున్నాడు.

           కాబ్బటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ, త్యాగం, మరియు సేవ మన జీవితాలలో కీలకమైనవి అని ఈయొక్క మూడు పఠనలు కూడా మనకు వివరిస్తున్నాయి. అందుకని మనము దేవునికి ఇష్టనుసరంగా జీవించలని మనం ఈ దివ్య బలి పూజలో ప్రార్దించుకుందాము.

Fr. Johannes OCD

29 వ సామాన్య ఆదివారం


యెషయా 53:10-11, హెబ్రి 4:14-16,మార్కు 10:35-45
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు ప్రభువుని అనుసరించేవారు సేవక రూపం కలిగి జీవించాలి అనే అంశమును, అదేవిధంగా అధికారం ఉన్నటువంటి వారు సేవకులు వలె తమ యొక్క అధికారమును సద్వినియోగపరుచుకోవాలని వినయంతో సేవ చేయాలని కూడా  తెలుపుతున్నాయి.
ఈనాటి మొదటి పఠణంలో  బాధామయ సేవకుని యొక్క జీవితం గురించి తెలుపుచున్నది ఈ యొక్క బాధామయ సేవకుడు మరెవరో కాదు క్రీస్తు ప్రభువే ఆయన అందరి కోసం అనుభవించేటటువంటి శ్రమలను గురించి యెషయా ప్రవక్త తెలియజేశారు. క్రీస్తు ప్రభువు యొక్క మరణము పాప పరిహార బలి అయ్యింది. అందరి యొక్క పాపముల నిమిత్తమై ప్రభువు మరణించారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి కొందరికి సంతోషంగా ఉన్న సమయంలో శ్రమలు వస్తాయి, కొందరికి జీవితం యధావిధిగా సాగించే సమయంలో శ్రమలు వస్తుంటాయి. కొంతమందికి శ్రమలు అప్పుడప్పుడు మరి కొంతమందికి శ్రమలు తరచుగా వస్తాయి. కొంతమంది శ్రమలు తట్టుకొని జీవిస్తే మరి కొంతమంది శ్రమలను తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటారు. మరికొందరు విశ్వాసాన్ని కూడా కోల్పోతారు.
కొన్ని కొన్ని సందర్భాలలో మనము ఇతరులకు మేలు చేయుట కొరకు శ్రమలు అనుభవించవచ్చు. పునీత చిన్న తెరెసమ్మ గారు తన యొక్క జీవితంలో కొన్ని సందర్భాలలో తాను తప్పు చేయనప్పటికీ దానిని అంగీకరించుకొని ఆ యొక్క బాధలను పాపుల యొక్క హృదయ పరివర్తనం కొరకై సమర్పించేవారు. ఈనాటి మొదటి పఠణంలో బాధామయ సేవకుడు ఎటువంటి తప్పిదము చేయనప్పటికీ కేవలము ఇతరుల యొక్క శ్రేయస్సు కొరకై, రక్షణ కొరకై తన యొక్క ప్రాణములను త్యాగం చేశారు. ఈనాటి రెండవ పఠణంలో హెబ్రీలకు రాయబడిన లేఖలో రచయిత యేసు ప్రభువు యొక్క యాజకత్వమును గురించి తెలుపుచున్నారు. ఆయన మనవలె శోధింపబడినప్పటికీ పాపము చేయనటువంటి ప్రధాన యాజకుడు కాబట్టి ఆయన చెంతకు చేరి ఆయన కృపను పొందుదుమని తెలుపుచున్నారు. ఆయన ప్రధాన యాజకుడిగా ఉంటూ తానే ఒక బలిగా ఇతరుల కొరకు సమర్పించుకున్నారు.
ఈనాటి సువిశేష భాగములు యేసు ప్రభువు యొక్క శిష్యులు యోహాను యాకోబులు, ప్రభువు స్థాపించబోయే రాజ్యంలో అగ్రస్థానాల కొరకై ఆశపడ్డారు ఆయన రాజ్యాన్ని ఇహలోక సంబంధమైన రాజ్యముగా, సిరిసంపదలతో కూడిన రాజ్యముగా, శాంతిభద్రతలతో తులతూగే ఒక గొప్ప రాజ్యంగా భావించారు అట్టి రాజ్యములో వీరికి ముఖ్యమైనటువంటి స్థానములను ఇవ్వమని ప్రభువును అడుగుచున్నారు. యోహాను, యాకోబులకు దేవుడు మొదటి స్థానం పేతురుకు ఇచ్చారు అని తెలుసు తరువాత రెండవ- మూడవ స్థానములను యోహాను యాకోబులకు ఇవ్వమని వారు అధికారం కోసం అడుగుచున్నారు. అనేక సందర్భాలలో యోహానును యాకోబును ఏసుప్రభు తనతో తీసుకుని వెళ్లారు. పేతురు అత్త అస్వస్థతతో ఉన్న సమయంలో వీరిద్దరిని తనతో పాటు తీసుకెళ్లారు, యాయీరు కుమార్తె అస్వస్థతతో ఉన్న సమయంలో వీరిద్దరూ ప్రభువుతో ఉన్నారు, దివ్యరూపధారణ సమయంలో కూడా మీరు ఏసుప్రభు తోనే ఉన్నారు. కాబట్టి వీరు కూడా ప్రభువు మాకు ప్రాముఖ్యతనిచ్చారు అయినప్పటికీ అధికారం కొరకు ఆశించారు.
ఇక్కడ ఏసుప్రభు నిజమైన అధికారమంటే పెత్తనం చెలాయించటం కాదు సేవ చేయటం అని తెలియపరుస్తున్నారు. ఈ సువిశేష భాగములో మనము గ్రహించవలసినటువంటి కొన్ని విషయాలు. 
1. ప్రతి శిష్యుడు/ అధికారి సేవకు రూపం దాల్చాలి. దేవుడిని వెంబడించేటటువంటి సమయములో ఎటువంటి పదవులను ఆశించకుండా కేవలము సేవకుని వలె దేవుడి యొక్క బాధ్యతను నెరవేర్చాలి. 
2. ఇచ్చిన అధికారమును వినయముతో నెరవేర్చాలి. కొన్ని సందర్భాలలో అధికారము వచ్చిన తర్వాత అనేక మందికి గర్వం వస్తూ ఉంటుంది కాబట్టి ప్రభువు చెప్పే అంశం ఏమిటంటే వినయంతో అధికారమును వినియోగించుకోవాలి అని తెలుపుచున్నారు. తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క గొప్పతనము చాటి చెప్పాలి.
3. ప్రతి అధికారంలో త్యాగపూరితమైన ప్రేమ ఉండాలి అనగా ఇతరులకు మేలు చేయు సమయంలో తాను (అధికారంలో ఉన్న వ్యక్తి)ఎన్ని బాధలైనా పొందవలసి వస్తే పొందటానికి సిద్ధముగా ఉండాలి. 
4. ప్రతి సేవకుడిలో/అధికారి వినయం ఉండాలి ఎందుకంటే ఏసుప్రభు నేను ఈ లోకంలో సేవ చేయడానికి వచ్చాను సేవింపబడుటకు రాలేదు అని తెలిపారు. కాబట్టి ఏసుప్రభుని వెంబడించే ప్రతి ఒక్క శిష్యుడు- శిష్యురాలు ఆయన వలె వినియం కలిగి జీవించాలి. 
5. నిస్వార్థ సేవను చేయాలి. ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా ప్రభువు యొక్క సేవ చేయాలి.
6. ఏసుప్రభు వలై నిస్సహాయులను అనాధలను స్వీకరించి వారికి మేలు చేయాలి. 
ప్రతి క్రైస్తవుడు అధికారాన్ని సేవగా భావించి క్రీస్తు వలే కష్టాలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. సమాజములో జరుగుతున్నటువంటి అన్యాయమును ఎదుర్కొని న్యాయం కొరకు పోరాడాలి. పేదల పట్ల బలహీనుల పట్ల దయా కనికరము కలిగి వారి కొరకు పోరాడటానికి ప్రయత్నించాలి. 

Fr. Bala Yesu OCD

12, అక్టోబర్ 2024, శనివారం

28 వ సామాన్య ఆదివారం


సొలోమోను జ్ఞాన గ్రంధం 7:7-11
హెబ్రీ 4:12-13, మార్కు 10:17-30
ఈనాటి పరిశుద్ధ గ్రంథములో మన యొక్క జీవితములో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి, ఆయనను కలిగి ఉండుట కొరకు దేనినైనా వదులుకుని జీవించాలి అనే అంశమును గురించి తెలుపుచున్నవి. ప్రతి ఒక్కరి యొక్క అనుదిన జీవితంలో రోజు ఈ లోక సంబంధమైనటువంటి విషయములతో ప్రాముఖ్యతను ఇచ్చి జీవిస్తారు. కొందరికి బంగారము అంటే విలువ ఎక్కువ, అందరికీ వెండి అంటే ఇష్టం, మరికొందరికి పదవులు ఇంకొందరికి సుఖ భోగాలు, గౌరవ మర్యాదలు ఇష్టం అందుకని వాటికి ప్రాముఖ్యతను, విలువనిచ్చి అవి కలిగి ఉండుట కొరకు ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈనాటి మొదటి పఠణంలో సొలోమోను తన యొక్క జీవితంలో ఏది ముఖ్యమైనది అని తెలుసుకొని దానికి విలువనిచ్చి ఆ యొక్క వరము కొరకు ప్రార్థించాలి. సొలోమోను దైవ భక్తుడిగా, నీతిమంతుడు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు, ఆయనయే స్వయంగా తెలుపుతున్నటువంటి మాటలు ఏమిటంటే నేను ప్రార్థించినప్పుడు వివేక వరము నాకు లభించినది. దేవుడిని ప్రార్ధించినది వివేకము కొరకు. జ్ఞానము తాను సంపాదించినట్లయితే ఇంక తన జీవితంలో ఏదీ కూడా అవసరం లేదు అని సొలోమోను గ్రహించాడు కాబట్టి జ్ఞానమును సంపాదించుట కొరకు దేవుని ప్రార్థించారు. మన యొక్క అనుదిన జీవితంలో కూడా మనం దేనికొరకు ప్రార్థిస్తున్నాము అని మనము ఒకసారి పరిశీలించుకోవాలి. సొలోమోను రాజు ఆయన తన యొక్క వివేకము ద్వారా తెలుసుకున్న సత్యమేమిటంటే ఈ లోక పదవుల కన్నా, సంపదల కన్నా, సింహాసనములకన్నా, రాజు దండనముకన్నా విలువైనది జ్ఞానము అని తెలుసుకున్నారు అందుకని దానిని పొందుట కొరకై దేనినైనా సరే వదులుకొనుటకు సిద్ధపడుతున్నారు. సొలోమోను యొక్క విజ్ఞానము వలన తెలుసుకున్న విషయం ఏమిటంటే ఈ లోక సంపదలు ఏవి కూడా జ్ఞానముతో సరిపోవని తెలిపారు. జ్ఞానముతో పోల్చినప్పుడు బంగారమంతా వట్టి ఇసుక ముద్ద, వెండి అనేది మట్టి పెళ్లతో సమానం. ఆయన తన యొక్క జీవితంలో ఆరోగ్యము కంటే సౌందర్యం కంటే ఎక్కువగా జ్ఞానమునే పొందాలని ఆశించాడు. మన యొక్క జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనకి ఏది కావాలో అనే అవగాహన లేదు. కొన్ని సందర్భాలలో సంపదలకే ఎక్కువ విలువ ఇస్తాము, కానీ సొలోమోను మాత్రం విజ్ఞానమునకు మొదటి స్థానమును ఇచ్చారు ఎందుకనగా విజ్ఞాన ద్వారా అంతా కూడా సంపాదించవచ్చు. ఆయనకు ఉన్నటువంటి విజ్ఞానమును బట్టి షెభారాణి కూడా ఆయనను చూడటానికి వచ్చారు. ఇంగ్లీష్ లో ఒక సామెత one idea can change your life ఇది ఎలా సాధ్యమంటే మనకు విజ్ఞానం ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే. మనము కూడా విజ్ఞానమును దేవుని యొక్క కృప వలన పొందాలి. విజ్ఞానము కొరకు ప్రార్థించాలి ఈ యొక్క విజ్ఞానముతో మన యొక్క జీవితములో ఏది ఉత్తమమైనదో అది తెలుసుకొని దాని ప్రకారంగా జీవింప సాగాలి. విజ్ఞానము మనకు నేర్పిస్తుంది మన జీవితంలోను సరి చేస్తూ ఉన్నది కావున సొలోమోను ఏ విధముగానయితే దేవుని యొక్క జ్ఞానమునకు ప్రధాన స్థానమును ఇచ్చి దానిని సర్వస్వంగా భావించి దానిని పొందుట కొరకై దేవుడిని ప్రార్థించి వేడుకున్నాడో అదేవిధంగా మనం కూడా దేవుడిని ప్రార్థించి విజ్ఞానాన్ని పొంది మంచి విశ్వాసులుగా జీవించాలి. 
ఈనాటి రెండవ పఠణంలో దేవుని యొక్క వాక్కు సజీవమైనది చైతన్యవంతమైనది అని తెలుపుచున్నది. ఆయన యొక్క వాక్కు మన జీవితంలో ఉన్నటువంటి చెడును తొలగిస్తుంది మనలో హృదయ పరివర్తన కలుగచేస్తుంది. ఆ విలువైనటువంటి దేవుని యొక్క వాక్కు కొరకు మనము తపించాలి. మన జీవితములను సరిచేసుకోవాలి. 
ఈనాటి సువిశేష పఠణములో ఒక యువకుడు నిత్యజీవితము పొందుటకు నేనేమి చేయాలి అని ప్రభువుని అడుగుతున్నారు. అందుకు తనను, ఏసుప్రభు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించమని తెలుపుతున్నారు ఆ యువకుడు అవి అన్నియు చిన్ననాటి నుండే పాటిస్తున్నాడని తెలిపారు. అప్పుడు ప్రభువు ఆయనకు తన దగ్గర ఉన్నటువంటి ధనము పేదలకు దానం చేసి ఇవ్వమని తెలిపారు కానీ అతడు దానికి ఇష్టపడలేదు. ఈ యువకుడు యొక్క ఉద్దేశ్యము నిత్య జీవము పొందుట మరి ఆ ఉద్దేశం కొరకు ఎందుకు ఆయన తన దగ్గర ఉన్నటువంటి ధనమును విడిచిపెట్టలేదు? ఈ యువకుడు ధనమే ముఖ్యమని భావించాడు. ధనము ఉన్న ఎడల తనకు మంచి గౌరవము అదే విధముగా తన భవిష్యత్తు బాగుంటుందని భావించాడు అందుకే ధనానికి ప్రాముఖ్యతను ఇచ్చి దానిని విడిచిపెట్టడానికి సిద్ధపడలేదు. వాస్తవానికి ధనపేక్ష అన్నది సర్వ అనర్ధాలకు మూలం. ఈ యువకుని యొక్క హృదయం ధనాశతో నిండి ఉన్నది కాబట్టి దానిలో దేవునికి స్థానము ఇవ్వలేదు. ధనాపేక్ష అతని పట్టి పీడిస్తుంది. ఈయొక్క ధనం వలనే ఆయన ఉదార స్వభావిగా జీవించి లేకపోయాడు. ఈ యొక్క యువకుడు తన యొక్క జీవితంలో ధనం కన్నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని భావించినట్లయితే ఆయన మీద ఆధారపడి జీవించేవాడు, ఆయనకు నిత్యజీవం లభించేది కానీ ఈ యొక్క యువకుడు దేవుని కన్నా ధనానికే ప్రాముఖ్యతనిచ్చి జీవించాడు అందుకనే విలువైన నిత్య జీవితాన్ని కోల్పోయాడు. ఈ యువకునికి దేనికి ప్రాముఖ్యత నివ్వాలో, దేనిని కలిగి జీవించాలో తెలుసుకోలేక పోయాడు అందుకే తన జీవితంలో సరి అయిన నిర్ణయం తీసుకోలేకపోయాడు. ఏసుప్రభు తన కొరకు ఎవరైతే సమస్తము విడిచిపెడతారో వారు నూరంతలుగా ఆశీర్వాదం పొందుతారని తెలిపారు (మార్కు 10:28-31). ఈ విషయాన్ని ఆ యువకుడు మరిచిపోయారు. మన యొక్క జీవితంలో దేవునికి విలువ నుంచి జీవించాలి అప్పుడు దేవుడు మనకు సమస్తము కూడా సమకూర్చును.
Fr. Bala Yesu OCD

ఇరవై ఎనిమిదవ ఆదివారము


సొలొమోను జ్ఞానం గ్రంధం 7:7-11
హెబ్రియులు 4:12-13
మార్కు 10:17-30 

క్రీస్తునాదునియాందు ప్రియా సహోదరి సహోధులరా, ఈనాడు మనమందరం కూడా సామాన్య కాలపు ఇరవై ఎనిమిదవ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈనాటి మూడు పఠనలను శ్రద్దగా గమనించినట్లయితే, మూడు పఠనలు కూడా ఆధ్యాత్మిక జీవితంలో నిజమైన సంపద, జ్ఞానం మరియు దేవుని వాక్యానికి సంబంధించిన గొప్పతనాన్ని గురించి వివరిస్తాయి. ఎందుకంటే సొలొమోను జ్ఞానగ్రంధంలో జ్ఞానాన్ని భౌతిక సిరి సంపదల కంటే గొప్పగా భావించడం చూస్తున్నాము, రెండవ పఠనంలో హీబ్రీయులకు వ్రాసిన లేఖలో దేవుని వాక్యం, మన జీవితాలను మర్చి పరిశీలించగల శక్తి గురించి చూపిస్తుంది. చివరిగా సువిశేష పఠనములో యేసు ధనవంతులకున్న సవాళ్లను ప్రస్తావించి, *వారినందరిని కూడా హెచ్చరిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో సంపదకు నిర్బంధం వద్దని* తెలియజేస్తున్నాడు. ముందుగా మొదటిపఠనమును ద్యానించినట్లయితే, సొలొమోను జ్ఞానగ్రంధంలో చూస్తున్నాము, సొలొమోను తన జీవితంలో జ్ఞానాని ఏవిధంగా దేవుని దగ్గరనుండి పొందడో మరియు దాని విలువ ఎంత గొప్పదో చెప్పే వాక్యాలను చూస్తున్నాము. ఈ గ్రంథంలోని ఈ యొక్క భాగం మనకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక గుణ పాఠాన్ని నేర్పిస్తుంది. సత్యమైన జ్ఞానం లేదా బుద్ధి అనేది దేవుని నుండి లభించేది, మరియు అది భౌతిక సంపదల కంటే చాలా ఇలువైనది మరియు చాలా గొప్పది. ఎందుకంటే, 7:7 లో సొలొమోను జ్ఞానం కోసం ప్రార్థించాను అని చెబుతుంటాడు. దీనిలోని సారాంశం ఏమిటంటే మనం నిజమైన జ్ఞానాన్ని పొందడానికి దేవుని మీద ఆధారపడి జీవించాలి, ఆవిధంగానైతే సొలొమోను తనను తాను తగ్గించుకొని దేవుని మందట మొకరించి భక్తి విశ్వాసలా తోటి జ్ఞానం కోసం, దేవుని దగ్గర ప్రార్థించడం వలన దేవుడు అతని ప్రార్థనను ఆలకించి, తన యొక్క కృపను అయనపై కుమ్మరించి దివించటం చూస్తున్నాము. సొలొమోను తాను పొందినటువంటి జ్ఞానాన్ని గురించి ఎంతో విలువైనదిగా చెప్పడం చూస్తున్నాము, ఎందుకంటే బంగారమును జ్ఞానముతో సమానంగా చూడలేము, సొలొమోను సంపద మరియు భౌతిక వసతులకంటే అయన పొందినటువంటి జ్ఞానం చాలా గొప్పదిగా మరియు విలువైనదిగాను స్పష్టం చేసి యున్నాడు. దీనిని మనం ఒక ఉదాహరణగా  తీసుకుంటె మన జీవితంలో నిజమైన సంపద అనేది దేవుని జ్ఞానములోనే ఉందని గుర్తుచేస్తుంది.

రెండొవ పఠనములో హెబ్రీయులకు వ్రాసిన లేఖలో 4:12-13 రెండు వాక్యాలు, దేవుని వాక్యానికి మరియు దాని శక్తికి సంబంధించినవిగా కనిపిస్తున్నాయి. ఈ వాక్యాలు మన ఆధ్యాత్మిక జీవనంలో గంభీరమైన ప్రభావాన్ని చూపుతాయి.
ఇది కేవలం ఒక మానవ జ్ఞానానికి సంబంధించినది కాదు, దేవుని వాక్యం మన హృదయంలో ఉన్న అత్యంత ఆంతరంగిక భావాలను కూడా పరిశీలించగలిగేది. ఇది మన ఆత్మను మరియు మన జీవితాన్ని పరిశీలించి దేవుని ముందు మన జీవితం ఏవిధంగా ఉందొ తెలియజేస్తుంది. ఎందుకంటే 
దేవుని దృష్టిలో ఏది కూడా దాచబడదు, ఎందుకంటే మనకు దేవుని న్యాయ స్థానం ముందు, మనం ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలో స్పష్టతనిస్తుంది. పాపమును మనం దాచుకోవాలనుకున్నా, దేవుని కళ్లకు అది దాగదని ఈ వాక్యం గట్టిగా హెచ్చరిస్తుంది. కాబట్టి, దేవుని ముందు మనము నిజాయితీగా, పవిత్రంగా ఉండేలా మన మనసును పరిశీలించుకోవాలి.
దేవుని వాక్యం మనలోని లోతులు, మనసు, ఆత్మ, మరియు ఆలోచనలను పరిశీలించుకోవడానికి ఒక పిలుపుగా ఉన్నాయి.

చివరిగా సువిశేష పఠనము మార్కు 10:17-30 వచనలలో యేసు మరియు ఒక ధనవంతుడు మధ్య సంభాషణను గురించి చూస్తున్నాము. ఒక ధనవంతుడు యేసు వద్దకు వచ్చి నేను నిత్యజీవం పొందడానికి ఏం చేయాలి? అని ఆడిగినప్పుడు. యేసు ముందుగా ఇచ్చినటువంటి సమాధానం ఆజ్ఞలను పాటించాలని చెబుతాడు, కానీ ధనవంతుడు అన్నీ పాటించానని అంటాడు. దీంతో యేసు అతనికి తన ధనాన్ని పేదలకు ఇచ్చి, స్వర్గంలో నిధులు సొంతం చేసుకోవాలని చెప్పాడు. అయితే, ఆ ధనవంతుడు తన ఆస్తిని విడిచిపెట్టలేక బాధతో వెళ్ళిపోయాడు. ఇక్కడ యేసు ధనవంతులకు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టం అని చెబుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలరా మన జీవితంలో ఇది భౌతిక సంపదలను మనం ఎక్కువగా ప్రేమ చూపిస్తే, ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టడం కష్టం అవుతుందని సూచిస్తుంది. ఆస్తి మన మనసును దేవుని నుండి దూరం చేయగలదని తెలియజేస్తుంది. ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా గమనించలి ఎందుకంటే పేతురు మరియు ఇతర శిష్యులు తమ జీవితాలను యేసు కోసం విడిచిపెట్టినట్లు అని యేసుతో చెప్పినప్పుడు, యేసు వారికి ఒక గొప్ప భరోసాను ఇస్తున్నాడు, అదేమిటంటే ఇహలోకంలోనే వారు ఆశీర్వాదాలు పొందుతారు అని మరియు పునరుత్థానంలో నిత్యజీవం వారికి ఉంటుందని చెప్పారు. 
ప్రియా దేవుని బిడ్డలరా మన జీవితాలలో కూడా దేవుని జ్ఞానం, వాక్యం మరియు నిత్య జీవితం అనేవి ఎంతో గొప్పవి కాబట్టి మనం వాటి కొరకై దేవునితో సంఖ్యత కలిగి జీవించాలని ఈ పూజ బలిలో ప్రార్దించుకుందాము. 
Fr. Johannes OCD

5, అక్టోబర్ 2024, శనివారం

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము 
ఆదికాండము 2:18-24
హెబ్రీయులకు 2:9-11
మార్కు 10:2-16

క్రీస్తునాధునియందు ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుని బిడ్డలరా, ఈనాటి మూడు దివ్య గ్రంథ పఠనలను మనం గ్రహించినట్లయితే, మూడు పఠనాలు కూడా మనకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక బోధనలు లేదా అంశాలను అందజేస్తున్నాయి. 
ఈ మూడు పఠనలు కలిసి మనకు దేవుని త్యాగం, సంకల్పం మరియు శాంతి జీవనానికి కొన్ని గొప్ప మార్గదర్శకత్వలను ఇస్తున్నాయి. 
          త్యాగం అంటే ఏమిటి బైబిల్ ప్రకారం మనం చుసినట్లయితే త్యాగం అనేది. బైబిల్లో దేవుని త్యాగం అనేది మానవ జాతి పట్ల అయన మహోన్నతమైన ప్రేమ, కరుణ, మరియు రక్షణకు సంబంధించిన ఒక మహత్తర అంశం. ఈ త్యాగం ఎవరైతే పాపం మరియు దేవుని నుండి దూరమైనా మానవుని తిరిగి దేవుని చెంతకు తీసుకురావడం కోసం చేయబడింది. దేవుని త్యాగం అనేది ప్రధానంగా యేసు క్రీస్తు ద్వారా పరిపూర్ణతకు చేరింది. ఎందుకంటే అత్యంత పావనమైన మరియు పవిత్రమైన అంశం కాబట్టి. యేసు క్రీస్తు తన జీవితాన్ని మన కోసం అ సిలువపై అర్పించడం ద్వారా మనకు నిత్యజీవం పొందే మార్గాన్ని ఏర్పరచాడు. అయన త్యాగం ద్వారా మనకు దేవుని ప్రేమను, క్షమను, మరియు అనంతమైన రక్షణను తీసుకోని వచ్చియున్నాడు. ముందుగా మొదటి పఠనములో చుసినట్లయితే దేవుడు తన త్యాగం, ప్రేమ ద్వారా మానవుని ఆవిధంగా సృష్టించరో మనమందరము కూడా మొదటి పఠనంలో చూడవచ్చు. 

ఆదికాండము 2:18-24 వచనలలో దేవుడు సృష్టించినటువంటి సృష్టి యొక్క ముఖ్యమైనటువంటి భాగాన్ని మనం చూస్తాము. దేవుడు మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్పియున్నారు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనుషుల మధ్య ఉండవలసిన్నటువంటి సంబంధాలను, మరి ముఖ్యంగా దాంపత్య జీవితానికి లేదా బంధానికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తున్నారు.
 దేవుడు ఆదామునకు కావలసినటువంటి తోడుని లేదా తనలో సగం భాగంగా ఉండవలసినటువంటి సహాయకురాలిని సృష్టించాలని దేవుడు నిర్ణయించుకున్నారు. దేవుడు సృష్టించిన ప్రతి జీవిని ఆదాముకు జతగా చుస్తే, ఆడాముకు అంటే ఆయనకు ఒక సహచరుడిగా ఎవరూ సారిపోలేదు. ఇక్కడ నుండి మనం నేర్చుకోవలసినది ఏమిటంటే మన జీవితంలో ఉన్న సంబంధాలు దేవుని సంకల్పం ప్రకారం ఉండాలి, అవి మనకీ సమానంగా ఉండాలి. ఆలా ఉండాలి కాబ్బటే దేవుడు ఆదాముని నిద్రించలాగా చేసి అతని శరీరం నుండి ఒక ఎముక తీసి స్త్రీని సృష్టించారు. ఇక్కడ, స్త్రీను పురుషుని ఎముక నుండి తీసుకోవడం యొక్క అర్థం ఏమిటంటే, స్త్రీ మరియు పురుషుడు ఒకరికి ఒకరు సమానంగా ఉండాలని. ఇద్దరూ ఒకరిని ఒకరు కలిసినప్పుడు ఏక శరీరముగా ఉండటం అనేది దేవుని యొక్క సంకల్పం. ఎందుకంటే దేవుడు వీరిద్దరిని కూడా ఒక్కటిగా చేసెను అని చెప్పడానికి గుర్తు. వివాహం అనేది కేవలం శారీరక సంబంధం కాదని అది ఒక ఆత్మీయమైన, ఆధ్యాత్మికమైన కలయిక అని అర్ధం చేసుకోవాలి. ఈ వచనల ద్వారా మనం ప్రధానమైనటువంటి విషయాలను గ్రహీంచాలి.

1. పురుషునికి సహాయకురాలి అవసరం ఉండాలి.
2. ఇద్దరి మధ్య సమానత్వం అనేది ఉండాలి.
3. ఇద్దరు కూడా ఒక్కటిగా జీవించాలి.

అందువల్ల ఈ వాక్యం ద్వారా సృష్టి యొక్క గొప్పతనం, బంధం యొక్క పవిత్రత, అనుబంధం యొక్క ప్రాముఖ్యతను గురించి మనకు మొదటి పఠనం తెలియజేస్తుంది.
            రెండొవ పఠనము హెబ్రీయులకు వ్రాసిన లేఖ 2:9-11 వచనలలో యేసు ప్రభువు మన కోసం త్యాగాన్ని స్వీకరించినట్లు మనకు తెలియజేస్తుంది. యేసు దేవుని మహిమతో ఉన్నప్పటికీ, తనను తానే తాగించుకొని,ఈ యొక్క లోకానికి వచ్చి, మన కోసం మానవ రూపాన్ని ధరించి, ఆయన మన పాపాలను తన బుజాలపై మోసి, మనకు శాశ్వతమైన విముక్తిని అందించడానికి సిలువపై అవమానకరమైనటువంటి మరణాని మరనించాడు. ఈ త్యాగం ద్వారా మనం దేవుని కుటుంబంలో ఒక భాగమయ్యాము. అందువల్ల, ఈ వాక్యం మనకు యేసు ప్రేమ మరియు కరుణను గురించి తెలియజేస్తుంది అని రెండొవ పఠనం చెబుతుంది.
                చివరిగా సువిశేష పఠనమును ద్యానించ్చినాట్లయితే మార్కు 10:2-16 వచనలలో యేసు వివాహం మరియు పిల్లల విషయంలో ముఖ్యమైనటువంటి సూత్రాలను ప్రజలకు బోధిస్తున్నాడు. యూదులలో విడాకుల ప్రస్థావన వచ్చినప్పుడు యేసు దేవుని ఆరంభ సంకల్పం వైపు దృష్టి తీసుకెళ్ళి, వివాహం అనేది దైవిక కట్టుబాటుగా, స్త్రీ పురుషులు విడిపోకూడని సంబంధంగా చెబుతున్నాడు. ఎందుకంటే పెళ్లి అనే బంధం దేవుని ఆశీస్సులతో ప్రారంభమవుతుంది, కాబట్టి దానిని పవిత్రంగా ఉంచుకోవాలని క్రీస్తు ప్రభు అంటున్నారు. అదేవిదంగా పిల్లల విషయానికి వస్తే, యేసు పిల్లలను దగ్గరగా తీసుకోని, వారి మనస్సు వాలే దేవుని రాజ్యానికి చేరాలి అని చెప్పాడు. పిల్లల ద్రుష్టి, శ్రద్ధ మరియు నమ్మకాన్ని గుర్తించి, మనం కూడా దేవుని వైపు పిల్లలవలే విశ్వాసంతో నడవాలని గుర్తుచేస్తున్నాడు.
        కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా మన జీవితాలలో బంధం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది కాబట్టి దేవునికి ఇష్టనుసరంగా జీవించాలని భక్తి విశ్వాసల్లతోటి ప్రార్థించుకుందాము. 

---

ఈ మూడు వచనాలు కలిసి మనకు దేవుని సంకల్పం, త్యాగం, మరియు శాంతియుత జీవనానికి సంబంధించిన గొప్ప మార్గదర్శకతలను అందిస్తాయి.
Fr. Johannes OCD 

27 వ సామాన్య ఆదివారం

27 వ సామాన్య ఆదివారం 
ఆది కాండం 2:18-24, హెబ్రీ 2:9-11, మార్కు 10:2-16
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు "పరిశుద్ధ వివాహం" గురించి బోధిస్తున్నాయి. కుటుంబం అనేది ప్రభువును యొక్క ఉద్దేశంలో సృష్టి ప్రారంభం నుండి ఉన్నది. దేవుడు ఏర్పరచినటువంటి దివ్య సంస్కారాలలో మొదటిగా ఏర్పరచిన దివ్య సంస్కారము ఈ యొక్క వివాహ జీవితం ఎందుకనగా సృష్టి ఆరంభంలోనే స్త్రీ పురుషులు ఇద్దరిని సృష్టించి వారిని 
పవిత్ర వివాహము ద్వారా ఒకటి చేశారు. 
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఆదాముకు అవ్వమ్మను తోడుగా ఇచ్చిన అంశమును చదువుతున్నాం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఆయనకి తోడుగా ఉండుటకు, సహాయం చేయుటకు, తన కష్ట కాలములో, సంతోష సమయంలో, అండగా -నీడగా నిలబడటం నిమిత్తమై ఆదాము కొరకు అవ్వను ప్రభువు ఇస్తున్నారు. దేవుడు ఈ సృష్టిలో ఒక కుటుంబమునకు ప్రాముఖ్యత నుంచి ఆ కుటుంబమును ఏర్పరచుటకు సిద్ధపడ్డారు ఎందుకనగా కుటుంబమే అన్నిటికీ ప్రధానం. కుటుంబం నుండి అందరూ (గురువులైన, కన్య స్త్రీలైనా రాజకీయ నాయకులైనా, వైద్యులైనా ......) వస్తారు కాబట్టి ఆ కుటుంబం మంచిదైన యెడల ఈ ప్రపంచమే మంచిదిగా మారును అనే ఉద్దేశంతో ప్రభువు  బహుశా ఈ నిర్ణయం తీసుకున్నారేమో. దేవుడు సృష్టించినటువంటి ఆది తల్లిదండ్రులు ఇద్దరు ఒకరితో ఒకరు సగభాగమై, కలిసిమెలిసి జీవించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఆదాము యొక్క ప్రకటి ఎముకను తీసుకొని అవ్వను చేసిన సందర్భంలో ఆదాము ఈ విధంగా అంటున్నారు ఈమె నా ఎముకలో ఎముక, నాదేహంలో దేహం ఈమె నా వంటిదైనది అని పలికారు. దాంపత్య జీవితంలో ఇద్దరు వేరు వేరు చోట్ల జన్మించినటువంటి వారు ఒకటిగా అవ్వాలి అన్నది దాంపత్య జీవితం ప్రణాళిక. ప్రతి భార్య తన భర్త లాగా మారాలి అదేవిధంగా ప్రతి భర్త తన భార్య లాగా మారాలి. అందుకే ప్రభువు అంటున్నారు వివాహ బంధం ద్వారా భిన్న శరీరులుగా ఉన్న ఇద్దరూ ఏక శరీరులై జీవించబోతున్నారు. వివాహ బంధం అన్నది దేవుడు ఏర్పరిచిన బంధం. ఒక స్త్రీకి భర్తను అదే విధంగా ఒక పురుషుడికి భార్యను జత చేసేది దేవుడే ఎందుకనగా సృష్టి ప్రారంభంలోనే ఆదాముకు అవ్వే భార్యని దేవుడు వారిద్దరినీ జత చేసారు. ఆది తల్లిదండ్రులకు అంతయు క్రొత్తగా ఉన్నప్పటికీ వారిద్దరూ చివరి వరకు కలిసిమెలిసి జీవించారు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ప్రభువే స్వయంగా పలికారు ఎందుకన ఒంటరితనం బాధిస్తుంది, ఒంటరితనం మగవారు తట్టుకోలేరు అందుకే చాలా సందర్భాల్లో చూస్తాం ఒక భర్త చనిపోయినప్పుడు భార్య జీవించగలదు కానీ ఒక భార్య చనిపోయినప్పుడు భర్త దాన్ని తట్టుకొని జీవించటం చాలా కష్టం.
వివాహ జీవిత ముగింపు అనేది కేవలం మరణం ద్వారా సంభవించాలి కానీ విడాకులు అనేవి వివాహ జీవితంలో లేవు అని ప్రభువు స్పష్టం చేశారు. పరిసయ్యులు ఏసుప్రభువుని "భార్యను భర్త పరిత్యజించుట ధర్మమా అని ప్రశ్నించారు" ఎందుకంటే మోషే వారికి భార్యను పరిత్యజించే నియమము ఇచ్చారు కాబట్టి. మోషే చట్టం ప్రకారము ఒకవేళ భార్య అపరిశుద్ధముగా ఉన్నట్లయితే విడాకులు ఇవ్వవచ్చని రాయబడి ఉన్నది ఇక్కడ అ పరిశుద్ధత అంటే ఒక విధముగా భార్య వ్యభిచారిని అయ్యి ఉండవచ్చు రెండవదిగా అపరిశుద్ధత అనగా భార్య తన జీవితంలో భర్త మాట వినకపోవడం, వంట సరిగా చేయకపోవడం, పరాయి పురుషులతో మాట్లాడటం, భర్త యొక్క బంధువులతో అమర్యాదగా మాట్లాడటం ఇవన్నీ కూడా ఆమె యొక్క అపరిశుద్ధతకు సూచనగా ఉన్నాయి. ఇలాంటి విపరీతార్ధాలు ఉండటం వలన యూదా ప్రజలలో విడాకులు ఎక్కువైనాయి. భర్తలు,భార్యలపై ఏదో ఒక సాకుమోపి విడాకులిచ్చేవారు వైవాహిక జీవితం ఇట్టి దుస్థితికి దిగజారి పోవటం వలన వివాహ జీవితం అద్వానంగా మారేది అందుకని స్త్రీలు వివాహమాడుటకు వెనుకంజ వేసేవారు. 
ఏసుప్రభు మాత్రము వివాహ బంధము విడదీయని బంధము అని స్పష్టము చేశారు అందుకే ప్రభువు అంటున్నారు దేవుడు జతపరిచిన జంటను మానవమాత్రుడు వేరుపరపరాదని. దేవుని దృష్టిలో విడాకులకు తావులేదు కానీ మానవులే స్వార్థం కోసం బలహీనత వలన విడాకులు తీసుకుని దైవ ప్రణాళికకు విరుద్ధంగా జీవిస్తున్నారు.
వివాహ జీవితంలో కష్టాలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి బాధలు ఉంటాయి కానీ అన్ని సందర్భంలో ఒకరికి ఒకరై తోడై ఉండాలి అది దేవుడు వివాహ జీవితం ద్వారా నేర్పిస్తున్న అంశం. వివాహం రోజున భార్యాభర్తలిద్దరూ కూడా దేవుని ముంగిట కష్టములోనూ సుఖములోనూ వ్యాధి లోను సౌఖ్యములోనూ నేను నీకు ప్రామాణికంగా ఉందునని ఇద్దరు కూడా ప్రమాణం చేస్తారు. కాబట్టి ఆ ప్రమాణం యొక్క అర్థమును ఎప్పుడూ కూడా గ్రహించి ఇద్దరు కూడా కలిసిమెలిసి చివరి వరకు జీవించాలి. వివాహ బంధము పరలోకమునకై ఏర్పరచబడినది. Marriages are not made in heaven but marriages are made for heaven. ఈ సత్యమును గ్రహించి దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు ఒకరి ఎడల ఒకరు విశ్వాస పాత్రులుగా జీవిస్తూ, పరస్పరం క్షమించుకుంటూ, అర్థం చేసుకుంటూ, ప్రేమించుకుంటూ జీవిస్తే వారు చివరి వరకు సంతోషంగా ఉంటారు.
Fr. Bala Yesu OCD

తపస్సుకాలపు రెండొవ ఆదివారము

తపస్సుకాలపు రెండొవ ఆదివారము ఆదికాండము 15:5-12, 17-18 ఫిలిప్పీయులు 3:17-4:1 లూకా 9:28-36           క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియ  దేవుని ...