27, జులై 2024, శనివారం

17వ సామాన్య ఆదివారం


2 రాజుల 4: 42-44, ఎఫేసి 4:1-6, యోహాను 6:1-15
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు మానవుల యొక్క ఆకలిని సంతృప్తి పరచు విధానం గురించి తెలుపుచున్నవి. ఆకలితో అలమటిస్తున్నటువంటి వారి యెడల దేవుడు తన యొక్క కనికర హృదయమును ప్రదర్శిస్తూ వారి యొక్క శారీరిక ఆకలిని సంతృప్తి పరుస్తున్నారు. 
ఈనాటి మొదటి పఠణములో ఎలీషా ప్రవక్త దేవుని అనుగ్రహము ద్వారా చేసినటువంటి ఒక గొప్ప అద్భుతమును చదువుకుంటున్నాం. ఎలీషా ప్రవక్త క్రీస్తుపూర్వం తొమ్మిదవ శతాబ్దంలో దేవుని సందేశమును ప్రకటించారు.  ఆయన ప్రవచించే సందర్భంలో కరువు సంభవించినది. ఒకరోజు బాల్షాలిషా నుండి ఒక భక్తుడు ఏలీషా ప్రవక్తకు కానుకగా 20 రొట్టెలను, ధాన్యాన్ని సమర్పించారు. ఎలీషా ప్రవక్త ఈ యొక్క రొట్టెలను తన చెంతకు వచ్చిన ప్రవక్తలకు పంచి పెట్టమని చెప్పారు కానీ వారి సంఖ్య అధికముగా ఉండుటవలన ఇవి సరిపడమని భావించి సేవకుడు 100 మందికి ఇవి ఏ పాటివి అని ప్రశ్నించారు. వాస్తవానికి ఎలీషా ప్రవక్త దేవునియందు నమ్మకం ఉంచి అవి సరిపోతాయి అని శిష్యుడికి తెలుపుచున్నారు. ఎలీషా ప్రవక్త తనకు ఇవ్వబడినది, ఇతరులకు పంచి ఇచ్చి ఉన్నారు కాబట్టి దేవుడు ఆయన యొక్క మంచితనము మరియు విశ్వాసమును బట్టి అద్భుతం చేశారు. 
ఈ యొక్క మొదటి పఠణము ద్వారా మనము గ్రహించవలసిన కొన్ని అంశములు ఏమిటంటే 
1. ఎలీషా ప్రవక్త యొక్క ఉదారత. ఏమియు ఆశించకుండా ఇతరులకు మేలు చేయాలని కోరుకున్నాడు.
2. ఎలీషా ప్రవక్త యొక్క విశ్వాసం. శూన్యము నుండి సృష్టిని చేసిన దేవుడు 20 రొట్టెలను 100 మందికి సమకూరుస్తారు అని ఎలీషా విశ్వసించారు. ఎడారిలో మన్నాను ఇచ్చిన దేవుడు అవి మిగులు లాగిన చేశారు అలాగే ఈ రొట్టెలు కూడా ఇంకా మిగులుతాయి అని చెప్పారు.
3. ఆకలిని సంతృప్తి పరచాలి అనే కోరిక ఎలీషా ప్రవక్తకు ఉన్నది. ఇతరుల యొక్క ఆకలి గుర్తించి వారికి ఆహారము ఇచ్చారు.
4. సేవకుని యొక్క విధేయత. యజమానుడి యొక్క మాటను నమ్మి ఆయనకు సంపూర్ణంగా విధేయత చూపారు.
ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు మనందరినీ కూడా దేవుడు, మన కొరకు ఏర్పరిచినటువంటి అంతస్తుకు తగిన విధంగా జీవించమని తెలుపుచున్నారు దానిలో భాగంగా మనము సాధువులు గను, సాత్వికులుగను, సహనశీలురులుగా ఉంటూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ప్రేమను పంచుకోవాలి అని పౌలు గారు కోరారు.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు 5000 మందికి(స్త్రీలను, చిన్న బిడ్డలను లెక్కించకుండా) ఆహారమును ఒసగిన విధానము చదువుకుంటున్నాము. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారు సంతృప్తిగా పోషింపబడతారు అని కూడా ప్రభువు తెలుపుతున్నారు అయితే ఈ యొక్క సువిశేష భాగములో ఏసుప్రభు అద్భుతం చేయుటకు కారణము ఒక బాలుడు తన వద్ద ఉన్నటువంటి ఐదు రొట్టెలను రెండు చేపలను ఇతరుల కొరకై సమర్పించిన విధానం.  ఈ యొక్క సువిశేష భాగములో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు; 
1. ఏసుప్రభు యొక్క కనికర హృదయం. ఆయన తన ప్రజల మీద జాలి కలిగి ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆకలిని సంతృప్తి పరచాలని భావించారు.
2. బాలుని యొక్క త్యాగ గుణం. తన దగ్గర ఉన్నది కొంచెమైనప్పటికీ కూడా, అదియు తన కొరకు తెచ్చుకున్నటువంటి ఆహారమైనప్పటికీ ఆయన  త్యాగం చేసి ఇతరుల కొరకు శిష్యులకిస్తున్నారు. 
3. బాలుడు యొక్క ఉదార స్వభావం. ఈ యొక్క బాలుడు సంతోషముగా ఇతరుల యొక్క శ్రేయస్సు కొరకై తన వంతు, తన దగ్గర ఉన్నటువంటి భాగమును సమర్పిస్తున్నారు. 
ఒకరోజు కలకత్తాపురి మదర్ తెరెసా గారు తన జీవిత సంఘటన తెలుపుచున్నారు అది ఏమనగా; మదర్ థెరీసా గారు ఒక పేద కుటుంబమును సందర్శించి వారికి ఒక బియ్యం బస్తాను ఇచ్చారు. వారు దాదాపుగా ఒక వారం రోజుల పాటు భోజనం చేయడం లేదని గ్రహించి వారి యొక్క దీనస్థితిని గుర్తించి మదర్ తెరెసా వారికి సహాయం చేశారు. ఆ సహాయము పొందినటువంటి కుటుంబము ఆ బస్తా బియ్యంలో సగం బియ్యమును తీసుకొని వేరే వారికి ఇంకొక సగం బస్తా బియ్యమును ఇచ్చారు. ఎందుకు నువ్వు ఈ విధంగా చేసావు అని  అడిగినప్పుడు ఆ యొక్క తల్లి చెప్పిన మాట, మేము కేవలం వారం రోజుల నుండి పస్తులు ఉంటున్నాం కానీ మా కన్నా ఎక్కువగా మా యొక్క పొరుగువారు పస్తులు ఉంటున్నారు అదేవిధంగా వారి కుటుంబంలో కూడా పిల్లలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్లకి కూడా ఆహారం దొరుకుతుంది అనే ఉద్దేశంతో మాకు ఉన్న సగం ఇచ్చాను అని తెలుపుచున్నది. ఈ యొక్క సంఘటన ద్వారా మదర్ తెరెసా గారు ఉన్నదాంట్లో ఇతరులకు దానం చేస్తే దానిలో నిజమైన సంతోషం ఉందని  గ్రహించింది. ఈ యొక్క బాలుడు కూడా తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు రెండు చేపలను ఇతరుల యొక్క సంతోషం కొరకై ఉదారంగా ఇచ్చారు. 
4. ఐదు రొట్టెలు రెండు చేపలు తిరు సభలో ఉన్న ఏడు దివ్య సంస్కారాలకి ప్రతిరూపం. ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు ఆనాటి ప్రజల యొక్క ఆకలిని సంతృప్తి పరచిన విధముగా ఈ యొక్క ఏడు దివ్య సంస్కారాలు ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తి పరుస్తుంది. వాటిని స్వీకరించటానికి మనము సిద్ధముగా ఉండాలి.
ఈ యొక్క పరిశుద్ధ గ్రంధం పట్టణముల ద్వారా మనం కూడా మన జీవితంలో ఇతరులను యొక్క ఆకలి బాధను చూసి వారికి ఆహారమును ఇవ్వాలి. ఎంత ఇచ్చాము అన్నది ప్రభువు చూడరు కానీ వారికి మంచి చేశామా అన్నది ప్రభువు చూస్తారు కాబట్టి మన అందరిలో కూడా త్యాగం చేసేటటువంటి గుణం, కనికరం కలిగిన హృదయం, ఉదారంగా ఇచ్చే మనసు ఎప్పుడూ ఉండాలి అప్పుడే మనం కూడా ఇంకా అధికముగా దీవించబడతాం. మనం చేసే మనిషి వలన ఇతరులు సంతోషము ను పొందుతారు కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి వరములను ఇతరులతో పంచుకుంటూ సోదర ప్రేమ కలిగి జీవించటానికి ప్రయత్నించుదాం. 
Fr. Bala Yesu OCD

20, జులై 2024, శనివారం

16వ సామాన్య ఆదివారం


యిర్మియా 23:1-6, ఎఫేసి 2:1-6, మార్కు 6:30-34

ఈనాటి పరిశుద్ధ గ్రంథము పఠణములు దేవుడు మంచి కాపరిగా ఉంటూ తన ప్రజలకు అన్నియు సమకూర్చి వారిని కాపాడుతుంటారు అని అంశమును తెలుపుచున్నవి. దేవునికి ప్రజలకు ఉన్నటువంటి బంధము ఏ విధంగా ఉన్నదంటే కాపరికి మందకు ఉన్నటువంటి బంధం ఇవి రెండూ కూడా ఎప్పుడు కలసి ఉంటాయి. 
ఈనాటి మొదటి పఠణంలో యిర్మియా ప్రవక్త యొక్క మాటలను చదువుకుంటున్నాము. యిర్మియా ప్రవక్త క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో యూదా రాజధాని అయినటువంటి యెరుషలేములో పరిచర్యను చేశారు. ఆయన అనేక మంది రాజులను, ప్రజలను, నాయకులను దేవునికి విశ్వాస పాత్రులుగా జీవించమని తెలిపారు. దేవుని యొక్క దృష్టిలో ఏది  ఉత్తమం దానిని ప్రకటించారు. యిర్మియ సత్యమును ప్రకటించుటవలన అనేక బాధలను అనుభవించవలసి వచ్చింది. యిర్మియా ప్రవక్త సెద్కియా కాలంలో ప్రవచించారు. ఆయన ఒక బలహీనమైన రాజు, నిలకడత్వం లేని వ్యక్తి. ప్రవక్త యొక్క సందేశాన్ని ఆలకిస్తాడు కానీ దానిని ఆచరణలో ఉంచడు. అప్పుడు యూదా రాజ్యం బాబిలోనియా చక్రవర్తికి లోబడుతుంది. యిర్మియా ప్రవక్త రాజును బాబిలోని రాజుకు లోబడి జీవించమని తెలిపినప్పుడు దానిని ఆచరించలేదు దానికి బదులుగా రాజభవనంలో ఉన్న కొంతమంది సలహాదారులు ఐగుప్తు సహాయం రాజు సహాయం కోరమని తెలియజేశారు కానీ యుద్ధం చేసిన తర్వాత యూదా ప్రజలు ఓడిపోయారు దానికి గాను బాబిలోనికి బానిసత్వానికి వెళ్లారు. 
నాయకులు ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉండేవారు కాబట్టి ప్రభువే స్వయముగా తన గొర్రెలను ప్రోగు చేసి వారి కొరకు కాపరులను నియమిస్తాను అని తెలుపుచున్నారు. దేవుడే స్వయముగా ఒక కాపరిగా ఉంటూ తన ప్రజలకు అన్నియు సమకూర్చుతారు అనేటటువంటి అంశమును కూడా తెలుపుచున్నారు (కీర్తన 23). ఆయన యొక్క శ్రద్ధ వలన తన మంద పోషించబడుతుంది, అభివృద్ధి చెందుతుంది. తన మందను ఎన్నడూ విడిచి పెట్టినటువంటి కాపరులను కూడా నియమిస్తానని తెలుపుచున్నారు. యావే ప్రభువు తనకు ఉన్నటువంటి ప్రేమ వలన ప్రజల కొరకు మంచి కాపరులను నియమిస్తానని తెలుపుచున్నాను.
దేవుడు ఎవరికి అయితే తమమందనం చూసుకొనమని బాధ్యతను అప్పగించి ఉన్నారో వారు సరిగా వ్యవహరించకపోతే దేవుడు వారిని శాపగ్రస్తులుగా చేస్తుంటారు అని పలికారు. దేవుడు నమ్మి బాధ్యతను అప్పగించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానిని సక్రమంగా నెరవేర్చాలి. తండ్రికి కుటుంబ బాధ్యతను అప్పగించారు, గురువుకు విచారణ బాధ్యతను అప్పగించారు, ఉపాధ్యాయునికి పిల్లల బాధ్యతను అప్పగించారు, వైద్యులకు రోగుల బాధ్యతను అప్పగించారు, రాజకీయ నాయకులకు దేశ ప్రజల బాధ్యతను అప్పగించారు ఈ విధముగా చాలా విధములైనటువంటి బాధ్యతలు దేవుడు ఇచ్చి ఉన్నారు కాబట్టి వానిని మనము సక్రమముగా ప్రజల యొక్క, ఇతరుల యొక్క శ్రేయస్సు కొరకై వినియోగించాలి. 
అందరి కొరకై దేవుడు దావీదు వంశము నుండి మంచి కాపరి అయినటువంటి ఏసుప్రభువును, మనలను పరిపాలించు నిమిత్తము పంపిస్తారు అని కూడా యిర్మియా ప్రవక్త ద్వారా తెలుపుచున్నారు. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుడు ఉత్తమ కాపరిగా ఉంటూ యూదులను అన్యులను ఐక్యము చేశారు అని తెలిపారు. ఏసుప్రభు యూదులను మరియు అన్యులను సఖ్యపరచి వారిని ఒకటిగా చేశారు. ఏసుప్రభు నందు విశ్వాసము ఉంచినటువంటి వారందరూ కూడా ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఒకే ప్రజగా జీవిస్తారు అని తెలిపారు  (గలతి 3:28-29). క్రైస్తవులుగా మారిన యూదులు ఏసుప్రభువును మెస్సయ్యగా గుర్తించి అంగీకరించారు, అదే విధముగా అప్పటివరకు అన్య దైవములను పూజించిన అన్యులు కూడా యేసు ప్రభువును రక్షకునిగా గుర్తించి విశ్వసించి ఆయనను వెంబడించారు.
ఈనాటి సువిశేష భాగంలో ఏసుప్రభు యొక్క శిష్యులు పరిచర్యను ముగించుకొని తిరిగి వచ్చినటువంటి సంఘటనను చూస్తున్నాం. శిష్యులు యేసు ప్రభువు యొక్క నామమున అనేక రకములైన అద్భుతములు చేసి దయ్యములను వెళ్లగొట్టి రోగులను స్వస్థపరచి తిరిగి వచ్చారు వారి యొక్క స్థితిని చూసినటువంటి ప్రభువు వారికి కొద్దిపాటి విశ్రాంతి కావాలి అని భావించారు. అందుకే ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని భావించారు కానీ అదే సందర్భంలో ప్రజలు అనేకమంది ప్రభువు కొరకు ఎదురుచూస్తూ ఉన్నారు. 
ఇక్కడ గమనించవలసిన కొన్ని అంశములు ఏమిటంటే 
1. ఏసుప్రభువుకు తన శిష్యులు మీద ఉన్నటువంటి గొప్ప ప్రేమ.  ( వారి యొక్క శారీరక బలహీనతను అర్థం చేసుకున్నారు)
2. ప్రతి ఒక్కరి జీవితంలో కొద్ది సమయం విశ్రాంతి (A time of introspection) తీసుకోవాలి ఎందుకంటే ఆ విశ్రాంతి సమయంలో మనం ఎలాగ జీవించాము అని ఆత్మ పరిశీలన చేసుకొనుట కొరకై.
3. ప్రభువు తన యొక్క ప్రజల యొక్క అవసరతను గుర్తించి వారికి బోధించారు. 
4. దేవుని యొక్క వాక్కు కొరకై ప్రజలకు ఉన్నటువంటి గొప్ప తపన. 
5. దేవుని కొరకై తపించేవారు ఎప్పుడు దేవుని విషయంలో ముందే ఉంటారు. ప్రజలు ఏసుప్రభువు చూడటానికి వారి కంటే ముందుగా కాలినడక మీదనే వచ్చారు.
6. ఏసుప్రభు యొక్క సహనము మనము అర్థం చేసుకోవాలి అలసిపోయినప్పటికీ ప్రజల యొక్క పరిస్థితిని చూసినప్పుడు వారికి ఇవ్వవలసిన సమయం దేవుడు వారికి ఇస్తున్నారు. 
7. ప్రభువు కాపరి వలె తన మందమీద కనికరమును చూపించారు మనం కూడా అదే విధంగా జీవించాలి.
ఈ యొక్క పరిశుద్ధ పఠణముల ద్వారా దేవుడు మనందరిని కూడా కాపరులుగా ఉంచుతూ మనకు ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమముగా నెరవేర్చమని తెలుపుచున్నారు. 
యిర్మియా తన బాధ్యతను నెరవేర్చిన విధంగా, పౌలు తన బాధ్యతను నెరవేర్చిన విధంగా మరియు శిష్యులు తమకు ఇచ్చిన పనిని సక్రమంగా చేసిన విధంగా మనకి కూడా దేవుడు ఇచ్చిన ప్రతి బాధ్యతను కాపరి వలె మంచి చేస్తూ మంద కొరకు జీవించే వ్యక్తులుగా ఉండాలి. 
Fr. Bala Yesu OCD

17వ సామాన్య ఆదివారం

2 రాజుల 4: 42-44, ఎఫేసి 4:1-6, యోహాను 6:1-15 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు మానవుల యొక్క ఆకలిని సంతృప్తి పరచు విధానం గురించి తెలుపుచున్...