3, ఆగస్టు 2024, శనివారం

18 వ ఆదివారం

 18 వ ఆదివారం 

నిర్గమ ఖాండం 16:2-4,12-15 ఎఫెసి 4:17,20-24  యోహాను 6: 24-35

అక్కడ యేసుగాని , శిష్యులు గాని లేకుండుటచూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫ ర్నామునకు పోయిరి.  ప్రజలు సరస్సు  ఆవలివైపున యేసును కనుగొని  "బోధకుడా!  మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి?" అని అడిగిరి. "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు అని  మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత  భోజనమునకై శ్రమింపుడు. మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన  తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు  ముద్రను వేసియున్నాడు"  అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు "దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలయును?" అని వారడుగగా, యేసు "దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు. అదియే దేవుడు మీ నుండి కోరునది"  అని చెప్పెను. అంతట "నిన్ను   విశ్వసించుటకు మాకు ఎట్టిగురుతు నిచ్చెదవు? ఏ క్రియలు చేసెదవు?" అని వారు మరల ప్రశ్నించిరి. "వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను. అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను" అని వారు ఆయనతో చెప్పిరి. "పరలోకమునుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషేకాదు. కాని, నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకమునుండి దిగివచ్చి, లోకమునకు జీవమును ఒసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను"  అని యేసు వారితో అనెను. "అయ్యా ! ఎల్లప్పుడును ఆ ఆహారమును మాకు ఒసగుము" అని వారు అడిగిరి. అందుకు యేసు "నేనే జీవాహారమును, నాయొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు. నన్ను విశ్వసించువాడు  ఎన్నడును దప్పికగొనడు" 

ఈనాడు దేవుడు మనకు ఇచ్చే సందేశం. 

మొదటి పఠనం : దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరీక్షిస్తున్నాడు. 

రెండవ పఠనంలో మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొని క్రీస్తునందు నూతన  జీవితాన్ని ప్రారంభించండి. 

సువిశేష పఠనం: దేవుడు తనను వెదుకుతూ వచ్చిన ప్రజలకు అశాశ్వతమైన  భోజనముకై శ్రమింపుడు అంటు నేనే జీవము గల ఆహారాన్ని అని  తెలియజేశాడు. 

ప్రియా విశ్వాసులారా మొదటి పఠనములో ఇశ్రాయేలు ప్రజలు మోషే మరియు అహరోనులు మీద నేరము మోపుతున్నారు. ఎందుకు అంటే వారు మోషేతో మేము ఐగుప్తులో చచ్చిన బాగుండేది. అక్కడ మేము మాంసమును , రొట్టెను కడుపారా భుజించితిమి. ఇప్పుడు మేమందరం ఈ ఎడారిలో ఆకలితో మలమల మాడి చంపబడడానికి మీరిద్దరు మమ్ము ఇక్కడకు తీసుకొని వచ్చారా అని దూషించారు. యిస్రాయేలు ప్రజలు, శరీరానికి దాని అవసరాలకు లొంగిపోయి, వారు పొందిన స్వతంత్రాన్ని, బానిసత్వము నుండి  రక్షణను, విడుదలను మర్చిపోయిదైవసేవకులను  దూషించారు. కాని  దేవుడైన యావే నిర్గమ  16:4లో వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై వారిని  ఈ విధంగా పరీక్షింతును అని అంటున్నాడు. ప్రభువు ప్రేమతో వారికి ఆకాశము నుండి మన్నాను మరియు వారు కడుపునిండా భుజించడానికి పూరేడు పిట్టలను దయచేసి, యావేనైన నేను మీ దేవుడనని తెలియజేశాడు. 

దేవునికి అంత తెలుసు. మనకు ఏమికావలెనో,ఎప్పుడు కావలెనో ఏమి ఇవ్వాలో తెలుసు. కాబట్టి  దేవుడు మనలను  పరీక్షిస్తున్నాడని మనకు అనిపిస్తే మనము దేవుని ధర్మములను అంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తే చాలు. అంత దేవుడే ఇస్తాడు. కాబట్టి పరీక్షింపబడినప్పుడు గొణుకుతూ, సణుగుతూ , ఎదురు తిరుగుతూ నేరం మోపుతూ కాకుండా దేవుని చిత్తానుసారం,  ఆజ్ఞానుసారం నడుచుకుందాం. 

సువిశేషంలో ప్రజలు క్రీస్తు ప్రభువును వెదుకుతూ వచ్చినప్పుడు, ప్రజలు ఎందుకు వచ్చారో వారి మనస్సులోని ఆలోచనలను తెలుసుకోని, మీరు రొట్టెను తిని సంతృప్తులైనందున నన్ను వెదుకుచున్నారు.  కాని నా సూచక క్రియలను చూసి కాదు అని ప్రజలకు చెప్పియున్నాడు. దీని ద్వారా మనము ఏమి తెలుసుకోవాలంటే, దేవునికి  మనము ఏమి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, మన మనస్సులోని ఆలోచనలు, ఆశలు ఏంటో తెలుసు. దేవుడు   మన ఉద్దేశాలు  ఎలాంటివి, మంచివా?  కాదా? అని ఖచ్చితంగా చెప్పగలడు. 

ఈనాడు ఎంతో  మంది ప్రజలు తమ స్వలాభాల కోసం, స్వష్టతల కోసం  దేవుని  వెదుకుచు వస్తున్నారు, కాని  నిజంగా దేవుణ్ణి నమ్మి రావడంలేదు. దేవునికి తెలుసు .  దేవుని దగ్గర నుండి అది కావాలి, ఇది కావాలి అని అడుగుతున్నారు. దేవా! నాకు నీవు కావాలి అని   ఎంత మంది అడుగుతున్నారు? వరాలు కావాలి, దీవెనలు కావాలి అని దేవుని దగ్గరకు వెళ్లేవారు చాలా మంది ఉన్నారు.  కాని ఆ వారలను దీవెనలను ఇచ్చే వార ప్రధాతను నాకు నీవు కావాలి అని ఎంత మంది అడుగుతున్నాం. 

క్రీస్తు ప్రభువు అంటున్నాడు, అశాశ్వతమైం దానికై శ్రమింపవలదు. మిత్రులారారా !  ఈనాటి సమాజంలో ఎంతో మంది అశాశ్వతమైన ఈలోక  వస్తువులు, ఈలోక,  వ్యామోహం ఈలోక  సంపదల కోసం శ్రమిస్తున్నారు. ఈ లోకం శాశ్వతంకాదు. మనము ఎల్లకాలం ఈలోకంలో ఉండము. ఈ అశాశ్వ తమైన వాటి కొరకు మనం పడే శ్రమ వృధా! కాని  క్రీస్తు ప్రభువు చెబుతున్నాడు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత  భోజనముకై శ్రమింపుడు అని అంటున్నాడు. మనము ఏ రకమైన  పనులు చేయాలి ఈ నిత్య జీవమును పొందాలంటే యోహాను 6: 35 వచనములో చెబుతున్నాడు. "నేనే జీవాహారమును, నాయొద్దకు వచ్చువాడు ఎప్పటికి ఆకలిగొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు. దీని అర్ధం ఏమిటంటే మనము దేవుని యొద్దకు రావాలి, దేవుని విశ్వసించాలి. అపుడు మనకు జీవం లభిస్తుంది. 

రెండవ పఠనంలో: మనము వింటున్నాం మన పాత స్వభావమును విడిచి, మీ మనస్తత్వమును నుత్నికరించుకొనుడు. అన్యుల వలె  ఆలోచనలు గలవారిగా మీరు ప్రవర్తించకండి. మీరు సత్యమైన నీతిని మరియు పరిశుద్దతను కలిగి క్రొత్త స్వభావమును ధరింపుము. దేవుని పోలికలా  జీవించండి అని పౌలుగారు తెలుయజేస్తున్నారు. మొదటి పఠనములో యిస్రాయేలు ప్రజలు తమ పాత స్వభావమును మార్చుకోవాలి. వారు దేవుని విధులను పాటించాలని సువిశేషంలో జనులు శాశ్వతమైన వాటికొరకు శ్రమించాలని చెబుతూ మనము నీతితో పరిశుద్ధతతో క్రొత్త స్వభావమును ధరించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. 

ప్రార్ధన: పరిశుద్దుడైన తండ్రి మా జీవితాలు  పరీక్షలకు గురైనప్పుడు మాకు ఓర్పును, శనమును దయచేయండి. మీ గొప్ప కార్యాలు మాయందు జరిగింపుము/ మేము మీ యొద్దకు వచ్చుటకు, మిమ్ము విశ్వసించుటకు జీవం పొందుటకు కావలసిన నీతిని పరిశుద్దతను మాకు దయచేయండి, మా పాట పాపపు  స్వభావమును మార్చుకొని నీ పోలిక  క్రొత్త స్వభావమును మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. 

ఫా. సురేష్ కొలకలూరి OCD

18వ సామాన్య ఆదివారం

18వ సామాన్య ఆదివారం 
నిర్గమ 16:2-4,12-15, ఎఫేసీ 4:17,20-24, యోహాను 6:24-35

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు మానవుల కొరకై ఏర్పరచినటువంటి పరలోక విందు గురించి తెలుపుచున్నవి.
ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎడారిలో మన్నాను, పూరేడు పిట్టలను ఇచ్చిన విధానము చదువుకుంటున్నాం. ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాత భూమికి ప్రయాణమైనప్పుడు ఎడారిలో ఆకలిగొనిన సందర్భంలో వారు మోషే ప్రవక్తకు విరుద్ధముగా దేవునికి విరుద్ధముగా నడుచుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఆకలి బాధకు తట్టుకోలేక ఐగుప్తులో వారు భుజించిన మాంసాహార భోజనాన్ని మరియు రొట్టెలను తలచుకొని అచటనే ఉండి దేవుని చేతిలో చనిపోయిన బాగుండేది అని గొణగసాగిరి. అందుకుగాను దేవుడు వారికి స్వయముగా పరలోక దూతలు భుజించే భోజనము ఒసగి ఉన్నారు. ఈ యొక్క మొదటి పఠణంలో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు.
1. ఎడారిలో మన్నా అనేది ఒక విశ్వాస పరీక్ష ఎందుకనగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కావలసినది మొత్తం కూడా ఒక్కసారి సమర్పించవచ్చు కానీ అలాగా చేయలేదు. ఏనాటికి మన్నా ఆనాటికే ప్రభువు ఇచ్చారు అనగా వారు దేవుడి మీద ఆధారపడుతూ దేవుడి యందు విశ్వాసము కలిగి జీవించాలి అనే ఉద్దేశ్యం కొరకు. అదేవిధంగా ఎవరికి ఎంత కావాలో అంతే దేవుడు ఉండేలాగా చేస్తున్నారు
2. దేవుని యొక్క ఉదార స్వభావము. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరుద్ధముగా మాట్లాడినప్పటికీ ప్రభువు వారి యొక్క మాటలను పట్టించుకోకుండా ఇంకా సమయం వేచి ఉండకుండా వెంటనే సహాయము చేస్తూ వారి యొక్క ఆకలిని సంతృప్తి పరుస్తున్నారు. ఎదుటివారు చేసిన తప్పిదమును గుర్తించకుండా వారి యొక్క ఆకలిని తీర్చుట చాలా గొప్పది.
3. ఫిర్యాదు చేయటం. ఇది సర్వసాధారణంగా చాలామంది యొక్క జీవితంలో చూస్తూ ఉంటా. ఇశ్రాయేలు ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు, మార్తమ్మ మరియమ్మ మీద ఫిర్యాదు చేస్తున్నారు అలాగే యోహాను శిష్యులు యేసు ప్రభువు యొక్క శిష్యులు ఉపవాసము ఉండటం లేదని ఫిర్యాదు చేస్తున్నారు ఈ విధంగా చాలామంది దేవునికి ఫిర్యాదు చేస్తూనే ఉంటారు కానీ అది మంచిదా లేక చెడా అని కొంతమంది మాత్రమే గ్రహిస్తారు. మన జీవితంలో ఏదైనా కొరతగా అనిపిస్తే వెంటనే మనము దేవునికి ఫిర్యాదు చేయటానికి ముందుంటాం కానీ ఆయనను అర్థం చేసుకునటానికి ప్రయత్నం చేయము.
4. ఇశ్రాయేలీయుల యొక్క అప నమ్మకం. దేవుడు వారిని ఎర్ర సముద్రం గుండా కాపాడిన విషయం మరచితిరి, ఫరో సైన్యమును నాశనము చేసిన విధానం మరిచితిరి అలాగే దేవుడు వారిని ఆదుకుంటారు అనే విషయంలో కూడా మరచి జీవించారు అందుకే ప్రభువు వారి విశ్వాసాన్ని ఇంకా బలపరచడానికి ఆకాశము నుండి అద్భుత రీతిగా ఈ యొక్క పరలోక భోజనమును ప్రసాదిస్తున్నారు.
5. దేవుడు మనలను పోషిస్తాడు అనే నమ్మకం లేక ఇశ్రాయేలు ప్రజల వలె మనం కూడా ఆకలి దప్పులతో ఉన్నప్పుడు, కష్ట సమయంలో ఉన్నప్పుడు గొణుగుతూ అపనమ్మకంతో జీవిస్తుంటాం. ఈ యొక్క శారీరక సంబంధమైన ఆకలి దప్పులను గురించే ఆలోచిస్తుంటాము గాని దేవుని వైపు మన యొక్క దృష్టి మరల్చి ఆయనపై నమ్మకంతో మన కష్టాలను ఆయన చేతులలో ఉంచడానికి వెనుకంజ వేస్తాం. మన యొక్క భౌతిక భోజనమునకు ఆరాటపడతాం కానీ ఆధ్యాత్మిక భోజనం గురించి చింతించం మన గమ్యాన్ని మరచిపోయి భౌతిక చింతలకే ప్రాధాన్యతనిస్తాం.
  ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు పాత స్వభావమును విడిచి కొత్త స్వభావమును కలిగి జీవించమని తెలుపుచున్నారు. మన యొక్క పాత స్వభావమును విడిచి పెట్టకపోతే మనలో నూతనత్వము ఉండదు.  గోధుమ గింజ భూమిలో పడి నశించకపోతే అది అట్లే ఉండును కానీ నశించిన దానియందు ఒక కొత్త జీవము ఉద్భవించును అలాగే మనలో పాపము ఉన్నంత కాలము మనము క్రీస్తునకు జన్మించలేం మన యొక్క పాపమునకు మరణించిన సందర్భంలో క్రీస్తు ప్రభువు మనకు జన్మించిన వారముగా ఉంటాము. దివ్య సత్ప్రసాద స్వీకరణ ద్వారా క్రీస్తు ప్రభువు మనలోనికి వేంచేసి మన యొక్క జీవితములను నూతన పరచున్నారు. పునీత పౌలు గారు తన యొక్క పాత స్వభావమును విడిచిపెట్టి క్రీస్తు ప్రభువును వెంబడించారు.
ఈనాటి సువిషేశ పఠణంలో ఏసుప్రభు 'నేనే జీవాహారము' అని పలుకుచున్నారు. ఏసుప్రభు 5000 మందికి ఆహారమును వసగిన తర్వాత ఆయన కఫర్నామునకు వెళ్ళినప్పుడు చాలా మంది ప్రజలు ప్రభువును వెంబడించారు ఆ సందర్భంలో అడిగినా ప్రశ్న" ప్రభువా, మీరు ఎప్పుడూ ఇక్కడికి వచ్చితిరి? " ఈ ప్రశ్న వారు ఏసుప్రభు యొక్క బోధనలు వినటానికి అడగలేదు కేవలము వారు పోషింపబడ్డారు కాబట్టి ఏసుప్రభు దగ్గరికి వస్తే మరల వారి యొక్క శారీరక ఆకలి తీరిపోతుంది అనే ఉద్దేశంతో ప్రభువుని ప్రశ్న అడిగారు దానికి గాను ప్రభువు శాశ్వతమైన భోజనము కొరకు శ్రమింపుడు పలికారు. 
ప్రజలు తమ యొక్క పొట్టలను నింపిన రొట్టెలను గురించి  ఆలోచిస్తున్నారు కానీ ఆ పొట్టల నింపినటువంటి దేవుడిని మాత్రము తలంచలేదు. రొట్టెలను రొట్టెలగానే స్వీకరించారు కానీ అవి దేవుని యొక్క వరము అని విశ్వసించలేకపోయారు.
ఏసుప్రభు తానే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము అని తెలుపుచూ ఈ యొక్క ఆహారమును భుజించిన అతడు ఎన్నటికీ ఆకలిగొనడు అని ప్రభువు తెలుపుచున్నారు. మన యొక్క అనుదిన జీవితంలో కూడా దేవుడు మన కొరకై ప్రసాదించిన దివ్య సత్ప్రసాదం మనము ఎప్పుడు స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల పాటు ఈ యొక్క మన్నాను భుజించి వాగ్దాత భూమికి చేరుకున్నారు. మనము కూడా ఏసుప్రభు మన కొరకై వసగిన తన యొక్క దివ్య శరీర రక్తములను భుజించి మన జీవితములను మార్చుకొని పరలోక రాజ్యములో ప్రవేశించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దివ్యసప్రసాదము పట్ల ప్రేమను గౌరవమును అలవర్చుకొని జీవించాలి.
Fr. Bala Yesu OCD

సామాన్యకాలపు 5 వ ఆదివారం

సామాన్యకాలపు 5 వ ఆదివారం   యెషయా 6:1-6  1కొరింథీయన్స్ 15:3-8,11 లూకా 5:1-11 క్రీస్తునాదునియందు  ప్రియా సహోదరి సహోదరులా, ఈనాడు మనమందరమూ కూడా ...