10, ఆగస్టు 2024, శనివారం

19వ సామాన్య ఆదివారం

19వ సామాన్య ఆదివారం 
1 రాజులు 19:4-8, ఎఫేసీ 4:30-5:2, యోహాను 6:41-51

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు మరొకసారి దేవుని యొక్క దివ్య భోజనము గురించి బోధిస్తున్నాయి. గత మూడు వారముగా తల్లి శ్రీ సభ  దివ్యసప్రసాదం యొక్క ఔన్నత్యమును మనకు తెలియజేస్తూ ఉన్నది. 

ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఏలియా ప్రవక్తను రొట్టెతోను మరియు నీటితోనూ పోషించిన విధానం చదువుకుంటున్నాము. ఏలియా ప్రవక్త కార్మెల్ కొండపై 450 మంది బాలు ప్రవక్తలతో సవాలు చేసిన తర్వాత నిజమైనటువంటి దేవుని యొక్క సాన్నిధ్యం రుజువు చేసి ఆ 450 మంది బాలు ప్రవక్తలను హతమార్చారు దాని తరువాత ఆహాబు రాజు యొక్క భార్య అయిన యెసెబేలు రాణి తన సైనికులను పంపించి ఏలియాను ఏ విధముగానైనా సరే చంపాలని చూసింది. ఏలియా ప్రవక్త తాను ఈ వార్తను గ్రహించి తన యొక్క ప్రాణములను దక్కించుకొనుట నిమిత్తమై దూరముగా పారిపోవుచున్నారు. 
ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకున్నట్లయితే ఏలీయా ప్రవక్త 450 మంది ప్రవక్తలను చంపిన సమయంలో భయపడలేదు కానీ ఒక రాణి యొక్క మూర్ఖత్వము గ్రహించి ఆయన పారిపోతున్నారు. కొద్దిగా ఆలోచన చేసినట్లయితే ఎందుకని ఏలియా పారిపోతున్నారు? తన దేవుడి మీద నమ్మకం లేఖనా, లేదా ఇంకేమైనా కారణమా? ఎంతో ధైర్యంగా ఉన్న ఏలియా ఎందుకు ఒక్కసారిగా బలహీనపడుచున్నాడు? 
ఏలియా ప్రవక్త ఒక్కసారిగా తన యొక్క ప్రాణం మీదకు వచ్చినప్పుడు భయపడుచున్నారు. తన యొక్క కష్ట సమయంలో దేవుని యొక్క స్వరమును గుర్తించలేకపోయారు, దేవుని కార్యములు జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. ఆయన నిరాశలో ఉంటున్నారు అందుకని ప్రాణభయం మీద ఉన్న ఒక ఆశ వలన దూరంగా ప్రయాణమై పోతున్నారు. మొదటి పఠణంలో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు ఏమిటంటే;
1. ఏలియా ప్రవక్త యొక్క భయం. తన బలహీనత ద్వారా భయపడ్డారు కానీ ప్రభువు అతనికి దర్శనమిచ్చి, ధైర్యం నుంచి ముందుకు నడిపారు. ఏసుప్రభు మరణం తరువాత కూడా శిష్యులు భయపడిన సమయంలో ఏసుప్రభు పునరుత్థానమైన  తరువాత దర్శనం ఇచ్చి బలపరిచారు (యోహాను 20:19)
2. దేవుడు ఏలియాను విశ్రాంతి తీసుకోమని చెప్పుట. ఆయన దేవుని కార్యము ముగించే అలసట చింది ఉన్నారు కాబట్టి దేవుడు ఏలియాను కొద్దిపాటి సమయము విశ్రాంతి తీసుకోమని తెలుపుచున్నారు.  ఏసుప్రభు యొక్క శిష్యులు కూడా పరిచర్య చేసి అలసిపోయిన సందర్భంలో ఏసుప్రభు వారిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మని పలికారు (మార్కు 6:31). ప్రభువు మన యొక్క ఆరోగ్య పరిస్థితులను అర్థం చేసుకొని మనము సంతోషముగా ఉండుట నిమిత్తమై మనకు సహాయపడతారు.
3. దేవుడు పరిగెత్తే వారి వెనకాల వెళతారు. ఏలియా ప్రవక్త దూరంగా వెళ్లేటటువంటి సమయంలో దేవుడు అతడిని విడిచిపెట్టలేదు. తన యొక్క బలహీన సమయాలలో తోడుగా ఉన్నారు. తాను పరిగెత్తే సమయంలో తన వెనకాలే వస్తున్నారు. యోనా ప్రవక్త కూడా దేవునికి దూరంగా వెళ్లే సమయంలో దేవుడు అతని వెంట వస్తున్నారు. (యోనా 1:3, 2:10)
4. ప్రభువు ఇచ్చిన ఆహారము ద్వారా ఏలీయా ప్రవక్త 40 రోజుల పాటు శక్తిని పొందుకొని తన యొక్క గమ్యమును చేరుకున్నారు. ప్రభువు ప్రసాదించే ఆహారము మన అందరి యొక్క బలహీనతను తొలగించి మనకు బలమును ఒసగుతుంది.
5. దేవుడు మనల్ని ఎన్నటికీ మరువరు. మనము ఉన్నటువంటి అపాయములో ప్రభువు మనకు చేరువలోనే ఉంటారు. దేవుని యొక్క కనుల నుండి మనము దూరముగా వెళ్లలేము ఆయన మనలను పరిశీలిస్తూనే ఉంటారు. ఏలియా ప్రవక్త కూడా తాను ఉన్నటువంటి పరిస్థితిలో అతనిని విడిచి పెట్టకుండా తన చెంతకు వచ్చి తనను ఆదుకుంటున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో పవిత్రాత్మను విచారణమున ఉంచరాదని పౌలు గారు తెలుపుతున్నారు. పవిత్ర ఆత్మ మనలను బలపరచి ఈ లోకంలో ఎన్ని శోధనలను ఎదుర్కొనటానికి సహాయపడతారు. దేవుడు ఒసగిన ఆత్మ ద్వారా మనందరం కూడా దేవునికి చెందిన వారముగా మరియు దేవుడు మన యొక్క యజమానిగా ఉంటారు కాబట్టి మనము మన యొక్క జీవితములో ఒకరి ఎడల ఒకరు దయను చూపించుకునే విధంగా, అందరితో మంచిగా మాట్లాడుతూ, ఒకరిని ఒకరు క్షమించుకుంటూ, ప్రేమించుకుంటూ దేవుడిని పోలిన వ్యక్తులుగా జీవించమని పౌలు గారు తెలుపుచున్నారు. దేవుని పోలిన వ్యక్తులుగా అనగా దేవుని యొక్క వాక్యమును మన జీవితంలో ఆచరించి పాటించి జీవించటం.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు తానే జీవాహారము అని ప్రజలకు తెలిపిన విధానము చదువుకుంటున్నాం. ఏసుప్రభు తాను జీవాహారము అని పలికిన సందర్భంలో చాలామంది ఆయన ఈ లోక సంబంధమైన ఆహారం ఇస్తారు అని భావించారు కానీ ఆయన ఆధ్యాత్మిక సంబంధమైన ఆహారమును గురించి తెలిపారన్న సత్యమును గ్రహించలేకపోయారు. ప్రభువు ఏ విధంగా మనకు జీవాహారము అవుతారు అంటే;
1. ఆయన యొక్క వాక్కును వినుట ద్వారా, విశ్వసించుట ద్వారా, ఆచరించుట ద్వారా మనకు జీవాహారముగా మారతారు. 
2. ప్రభువు యొక్క శరీర రక్తములను స్వీకరించుట ద్వారా ప్రభువు మనకు జీవాహారమవుతారు. ఆయన దివ్య శరీర రక్తములు మనలను ఆధ్యాత్మికంగా బలపరుస్తాయి. 
3. ప్రార్థించుట ద్వారా. ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మనలో ఉన్నటువంటి కొరతను తొలగించి మనలను తన యొక్క సాన్నిద్యంతో నింపుతారు. 
4. దేవుని మీద మనసును హృదయమును లగ్నము చేసి ఆయన కొరకు జీవించినట్లయితే ప్రభువు మన యొక్క జీవాహారము అవుతారు. 
ఈ విధముగా ప్రభువును మన హృదయంలోనికి స్వీకరించినట్లయితే ఇక మనకి ఈ లోక సంబంధమైన ఎటువంటి ఆకలి ఉండదు ఎందుకనగా దేవుడే మనలను తనతో నింపుతారు. కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చి మనకు ఆహారమైన క్రీస్తు ప్రభువును స్వీకరించటానికి మనము ప్రతినిత్యం కూడా సిద్ధముగా ఉండాలి. 
Fr. Bala Yesu OCD

యోహాను 12: 24-26

యోహాను 12: 24-26    (10 ఆగస్టు 2024)

 నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమన:గోధుమగింజ భూమిలోపడి నశించనంతవరకు అది అట్లే ఉండును. కాని అది నశించినయెడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కాని ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్యజీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరించును. అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించినయెడల వానిని నాతండ్రి గౌరవించును. 

ధ్యానము: ఈరోజు మనము  పునీత లారెన్స్ గారి మహోత్సవమును జరుపుంటున్నాము. ఎవరు పునీత లారెన్స్ గారు అంటే యేసు ప్రభువు వలే జీవించడానికి ఆయన నిజ అనుచరునిగా జీవించిన వ్యక్తి. ఆయన 32 సంవత్సరాల వయసులో మరణించాడు. రోమపుర ఆర్చ్ డికనుగా సేవ చేసాడు. యేసు ప్రభువు మరణించిన రెండువందల సంవత్సరాల తరువాత ఈయన జీవించాడు. ఆనాటి రోజులలో తిరుసభకు స్వతంత్రం లేదు, తిరుసభ మొత్తం  రహస్యంగా దేవుణ్ణి ఆరాధించారు. క్రైస్తవులను అనేక విధాలుగా హింసించారు. ఎంతో గోరంగా హింసించారు అంటే కొంత మందిని మంటలలో కాల్చారు. కొంతమందిని అడవి మృగాలకు  ఆహారంగా ఇచ్చారు. కొంతమందిని నూనెలో కాల్చారు. క్రైస్తవుల మీద హింస వలేరియన్, డైక్లిషియన్లు చక్రవర్తులుగా ఉన్నప్పుడు ఎక్కువగా జరిగింది.  వలేరియన్ చక్రవర్తి  మేత్రానులను , గురువులను, డికనులను చంపాలి అని శాసనము చేసాడు. 258వ సంవత్సరంలో సిక్స్టాస్ పోపుగారిని బంధించారు. ఆది చూచిన  లారెన్స్ పోపుగారి వెంట వెళుతూ నన్ను వదలి ఎలా వెళతారు తండ్రిగారా అని అడిగితే ఆ పోపుగారు లారెన్స్ తో, కుమారా నేను నిన్ను వదలి పెట్టను, నీకు ఎక్కువ హింసలు రాబోతున్నవి.   నీవు ఇంకా ఎక్కువుగా ప్రభువుకు సాక్షమివ్వడానికి వస్తావు అని చెప్పాడు. కనుక లారెన్స్ గారికి వచ్చేటువంటి హింస ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసు.  

లారెన్స్ రోమాపూరి ఆర్చి డికను, రోమా పూరి తిరుసభ   సంపదమొత్తం లారెన్స్ ఆదీనంలో ఉన్నది.  లారెన్స్ ఆ సంపదను పేదలకు పంచుతూ ఉండేవాడు.  అప్పుడు ఆ సంపదను అక్కడి అధికారులు కావాలని అడిగినప్పుడు లారెన్సు వారిని  మూడు రోజులు సమయం అడిగి,  ఆ సమయంలో ఆ సంపదను మొత్తాన్ని పేదలకు పంచి ఇచ్చాడు. తరువాత  రోములో ఉన్న పేదలను మొత్తాన్ని తీసుకొని వచ్చి ఇదే తిరుసభ సంపద అని వారి ముందు ఉంచాడు.  లారెన్స్ గారికి తనకు ఏమి జరుగుతున్నదో ఖచ్చితముగా తెలుసు. అయినప్పటికి అతనికి ఎదురయ్యే సమస్యలను హింసను పట్టించుకోకుండా, యేసు ప్రభువు నిజమైన అనుచరునిగా ఉండటానికి సిద్ధపడ్డాడు. 

ఆది మొత్తం పరిశీలిస్తున్న అధికారి లారెన్స్ గారిని బంధించాడు. ఆయన్ను ఒక మాంసపు ముక్కను నిప్పుల మీద కాల్చినట్లు ఒక ప్రక్క కాల్చగా, నేను ఈ ప్రక్కన కాలిపోయాను, ఇప్పుడు అవతలి ప్రక్కన కాల్చమని అడిగాడు. వారు అటులనే వేరొక ప్రక్కన కాల్చడం జరిగినది. ఎంతటి బాధనైనా తట్టుకోవటానికి పునీత లారెన్స్ గారు సిద్ధపడ్డాడు. తాను పొందే హింస తక్కువ అన్నట్లు హింసించే వారిని ఇంకా ఎక్కువగా హింసించేలా ప్రేరేపించాడు. వారితో పరిహాసం ఆడాడు. అయన దృష్టిలో  యేసు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వడం అనేది ఆయన జీవితంలో అత్యంత ముఖ్యమైనది. వారు పెట్టె హింసలు చాలా కఠినమైనవి ఐన ప్రభువు సాక్షిగా నిలబడటానికి ఆనందంగా వాటిని భరించాడు అవి ఆయనకు అల్పమైనవిగా కనపడినవి. ప్రభవు మీద అతని ప్రేమ అంత గొప్పది. యేసు ప్రభువు అనుచరునిగా జీవించాడు. అందుకే పునీత లారెన్స్ గారు హాస్య కళాకారులకు పాలక పునీతునిగా ప్రసిద్ధి. 

ఈనాటి సువిశేషంలో ప్రభువు తన అనుచరుల లక్షణాల గురించి చెబుతున్నాడు. గోధుమగింజ భూమిలో పడి నశించనంతవరకు అది ఫలించదు. అంటే నేను నా బాహ్య పొరను వదిలించుకొని రావాలి అప్పుడు మాత్రమే నేను పూర్తిగా ఫలించడానికి సిద్దము అవుతాను. ఏమిటి ఈ బాహ్యపొర ఎలా దానిని నేను కోల్పోవాలి? ప్రభువే నాకు అది నేర్పుతున్నారు. ఎలా నన్ను నేను రిక్తుని చేసుకోవాలో చెబుతున్నాడు. నెను ఈ లోక జీవితం నాకోసము కాదు, ఈ లోకంలో నేను కేవలం నాకోసమే జీవించినట్లయితే  నా జీవితం  ఫలించదు. ఈ జీవితంలో నన్ను నేను ఇతరుల కోసం ఇవ్వాలి. యేసు ప్రభువు వలె జీవించాలి. ఆయన తన ప్రాణమును, తన సమయాన్ని, తన శక్తిని, తన యుక్తిని, తన జీవితాన్ని మన కోసం హెచ్చించాడు. తన ప్రాణమును కూడా కోల్పోయాడు కాని తండ్రి ఆయనకు తన ప్రాణమును ధారపోయుటకు మరల తీసుకొనుటకు అధికారం ఇచ్చాడు.

ఈ లోకములో తన జీవితమే ముఖ్యం, తన ప్రాణమే ముఖ్యం అనుకునే వారు అందరు స్వార్ధంతో జీవించువారే, వారు దేవుని అనుగ్రహములను కోల్పోతున్నారు. యేసు ప్రభువు చెప్పినట్లు జీవిస్తే ఆయనతో పాటు మనము ఉండవచ్చు. యేసు ప్రభువుతో పాటు ఉంటే తండ్రి దేవుడే మనలను గౌరవిస్తారు. యేసు ప్రభువును అనుసరిస్తూ, నన్ను నేను కోల్పోయిన నాకు లాభమే. ఎందుకంటే పరలోకమున నేను నా ప్రాణమును పొందుతాను. మరల ప్రభువుతో కలసి ఉంటాను, ఈ మహాద్భాగ్యం ఏమిచ్చి నేను పొందగలను. కేవలము ఆ ప్రభువును అనుసరించుటం వలన మాత్రమే. అంతే కాదు అప్పుడు తండ్రి దేవుడు నన్ను గౌరవిస్తారు అని ప్రభువు చెబుతున్నారు. 

ప్రార్ధన : సకల వర ప్రధాత అయిన ప్రభువా! నేను నా జీవితములో ఉహించలేనటువంటి గొప్ప అనుగ్రహాలు నాకు దయచేసి ఉన్నారు.  మీరు వాగ్దానము చేసిన వాటిని పొందుటకు నాకు అర్హత లేదు ప్రభువా కాని , పునీతుల జీవితాలు చూసినప్పుడు నేను కూడా అలా జీవించాలి అనే కోరిక నాలో కూడా పుడుతుంది, వారి వలె మిమ్ములను సంపూర్ణంగా అనుసరించే అనుగ్రహం దయచేయండి. మిమ్ములను అనుసరిస్తూ, ఎల్లప్పుడూ మీతో ఉండే అనుగ్రహం దయచేయండి. ఆమెన్ 

సామాన్యకాలపు 5 వ ఆదివారం

సామాన్యకాలపు 5 వ ఆదివారం   యెషయా 6:1-6  1కొరింథీయన్స్ 15:3-8,11 లూకా 5:1-11 క్రీస్తునాదునియందు  ప్రియా సహోదరి సహోదరులా, ఈనాడు మనమందరమూ కూడా ...