బాహ్య ఆచరణ కాదు హృదయ శుద్ధి ముఖ్యం - మత్తయి 5:20-26 ధ్యానం

 దేవుని ఆజ్ఞలు- బాహ్య ఆచరణ, ఆంతరంగిక శుద్ధి

మత్తయి 5: 20-26

ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. "నరహత్యచేయరాదు, నరహత్యకావించు వాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాశింపబడిన మాట మీరు వినియున్నారుగదా!నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా: తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. అదే విధముగా తన సోదరుని 'వ్యర్థుడా!' అని అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. కనుక, బలిపీఠసన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్దయున్నట్లు నీకు స్ఫురించినచో, ఆ కానుకను పీఠము చెంతనే వదలిపెట్టి, పోయి,  మొదట నీ సోదరునితో సఖ్యపడి, తిరిగివచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగనే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును. న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.  నీవు చెల్లింపవలసిన ఋణములో కడపటి కాసు చెల్లించువరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నొక్కి వక్కాణించుచున్నాను.  

ఈ సువిశేషభాగంలో ఆంతరంగిక శుద్దిగురించి, మనం గొప్పవారిగా పరిగణించేవారి కంటే మనం మనం మంచి జీవితం జీవించాలని, సోదర ప్రేమ మరియు క్షమాగుణం కలిగి ఉండాలని, మొదట మనమే మనకు వ్యతిరేకంగా ఉన్నవారితో సఖ్యత ఏర్పరుచుకోవాలని ప్రభువు కోరుతున్నాడు. 

మీ నీతి బాహ్య ఆచరణ  లేక హృదయ శుద్ధి ఆవిష్కృతమా?

ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. యేసు ప్రభువు ప్రధానమైన బోధ పరలోక రాజ్యము. ఈ రాజ్యములో ప్రతివక్కరికి  శాంతి సమాధానము ఉంటుంది. ఈ రాజ్యములో ప్రవేశించడానికి ధర్మ శాస్త్ర బోధకులకంటే పరిసయ్యులకంటే నీతి వంతమైన జీవితం జీవించాలని ప్రభువు చెబుతున్నాడు.  పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు నీతివంతమైన జీవితంలో ఏమైన లోపమున్నదా?  అంటే మరియొక సందర్భంలో ప్రభువు వారు చెప్పునది చెయ్యండి కాని వారు చేసేది కాదని చెప్పారు. ఈ ధర్మశాస్త్ర బోధకులు మరియు పరిసయ్యులు బాహ్యంగా మంచి పేరు పొందాలనే ఆశతో అనేక ఆధ్యాత్మిక పనులు చేస్తూ ఉన్నారు కాని వారి నీతి హృదయపూర్వకమైనది కాదు, కేవలం బయట కనపడుటకు మాత్రమే చేస్తున్నారు. అందుకే ప్రభువు వారితో మీ నీతో వారికంటే గొప్పగా ఉండాలి అని చెబుతున్నారు. దీనికి మనం చేయవలసినది హృదయ పరివర్తన కలిగివుండటం. మనం చేసే పని హృదయపూర్వకంగా చేయడం. దేవుని ఆజ్ఞలను ప్రేమతో పాటించాలి. నీతి అంటే మనం చేయవలసిన పని , లేక బాధ్యతను ఖచ్చితంగా, ఎటువంటి కపటత్వం లేకుండా చేయడం. ఇందుకు మనలోని కోపం, అసూయ, మొహలను త్యజించుకోవాలి. 

నీ సోదరుని గౌరవించుట 

 "నరహత్యచేయరాదు, నరహత్యకావించు వాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాశింపబడిన మాట మీరు వినియున్నారుగదా!నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా: తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. అదే విధముగా తన సోదరుని 'వ్యర్థుడా!' అని అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును.  ఈమాటలు పాత నిబంధనలో ఉన్న నరహత్య చేయరాదు అనే ఆజ్ఞకు నూతన వివరణ ప్రభువు ఇచ్చాడు.  ఒక సోదరుని వ్యర్థుడా అని చెప్పిన కూడా అది నేరంగా పరిగణించబడుతుందని ప్రభువు చెబుతున్నాడు. దీనినుండి మనం ఏ వ్యక్తిని కించపరచడం లేక అవమానించడం అనేవి కూడా దేవుడు మన నుండి ఆశించడం లేదు. నరహత్య చేయువాడు తీర్పునకు గురియగును అని పాత నిబంధన చెబుతుంటే ప్రభువు సోదరుణ్ణి వ్యర్థుడా అని సంబోధించినవాడు నరకాగ్నిలో మండును అని చెబుతున్నాడు. మన సోదరులను, బంధుమిత్రులను లేక ఈ లోకంలో ఏ వ్యక్తిని కించపరచడం, అవమానించడం అనేవి మనలను నరకాగ్నిలో మండేలా చేస్తాయి. మన సోదరులను గౌరవిస్తూ, మనకు సాధ్యమైనంత వరకు వారికి మంచి చేయుటకు ప్రయత్నించాలి. 

సఖ్యత కలిగి ఉండాలి

బలిపీఠసన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్దయున్నట్లు నీకు స్ఫురించినచో, ఆ కానుకను పీఠము చెంతనే వదలిపెట్టి, పోయి,  మొదట నీ సోదరునితో సఖ్యపడి, తిరిగివచ్చి నీ కానుకను చెల్లింపుము. ఈ మాటలు మన సోదరులతో మనకు ఉండవలసిన బాంధవ్యాలను గురించి తెలియజేస్తుంది. పవిత్ర గ్రంథంలో సహోదరుల మధ్యలో అమరికలు ఉండటం ఒకరి నాశనము మరియొకరు కోరుకోవడం ఎప్పుడు హర్షించలేదు. వారిని శిక్షించుటకు వెనుకాడలేదు. దైవ రాజ్యంలో చేరుటకు, దేవుడు మన ప్రవర్తను హర్షించుటకు మరియు మనలను శిక్షించకుండ ఉండుటకు ఏమి చేయవచ్చో యేసు ప్రభువు ఈ సువిశేషభాగంలో తెలియజేస్తున్నాడు. అది ఏమిటంటే మన సోదరులతో ఎప్పుడు సఖ్యత కలిగివుండటం. మన సోదరులకు మన మీద మనస్పర్ధ ఉందని మనకు తెలిస్తే ఆ సోదరునితో మొదటగా సఖ్యపడాలి. సఖ్యత, సమాధానం మన సోదరులతో ఎల్లపుడు మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అది జరిగిన తరువాతనే మనం దేవునికి అర్పించే బలి అర్పించాలని చెబుతున్నారు. అపుడు దేవునికి బలి అర్పించే సమయంలో మన మనసులో ఏ చెడు ఆలోచనకాని, అసూయకాని మనలో ఉండదు. అది మనము పరలోక రాజ్యంలో చేరుటకు అర్హతను సాధిస్తుంది. 

నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగనే అతనితో సత్వరము సమాధానపడుము. ఏ వ్యక్తి కూడా నాశనము కావడం ప్రభువుకు ఇష్టంలేదు. కనుక యేసు ప్రభువు మనము ఏమి చేయాలో చెబుతున్నాడు. మన ప్రతివాదులతొ ముందుగానే సమాధాన పడాలి అని చెబుతున్నాడు. దాని ద్వారా మనం రానున్న శిక్షనుండి తప్పించుకొనవచ్చు. ఎల్లప్పుడూ మనం అందరితో సమాధానపడి జీవించుదాం. 

ప్రార్థన: 

ప్రభువా! మానవులు అందరు మీ రాజ్యంలో ఉండాలని కోరుకున్నారు. అందుకు మేము ఏమిచేయాలో నేర్పుతున్నారు. మా మనసు ఎల్లప్పుడు ఎటువంటి కల్మషం, అసూయా, ఇతరుల చేదు లేకుండా ఉండాలని కోరుతున్నారు.  మేము ఎటువంటి కపటత్వం లేకుండా ఉండాలని, హృదయ శుద్ధి కలిగి జీవించాలని కోరుతున్నారు. మా సోదరులలో సఖ్యత కలిగి ఉండాలని, ఎవరిని అవమానించకుండా, గౌరవించాలని నేర్పుతున్నారు. కేవలం చెప్పడమే కాక మీరు మాకు ఎలా జీవించాలో చూపించారు.  ప్రభువా మీరు చూపించిన జీవితానికి కృతజ్ఞతలు, మీ మాటలను, జీవితమును ఆదర్శముగా  తీసుకొని జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించండి. ఆమెన్ 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభౄద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలు అందించడే ఈ బ్లాగ్ లక్ష్యం.

🔪 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నితన పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు