స్వదేశంలో యేసుకు నిరాదరణ దైవ ధ్యానం (లూకా 4) | కార్మెల్ శోభ

 

1 కొరింతి 2:1-5, లూకా 4:16-30

తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్ధనామందిరమునకు వెళ్లెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా, యెషయా ప్రవక్త గ్రంధమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. "ప్రభువు ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగ చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను." దీనిని చదివి యేసు గ్రంధమును మూసి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరు, ఆయనవంక తేరిచూచుచుండగా, ఆయన వారితో "నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది"అని  పలికెను. అది వినిన ప్రజలందరు దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి "యితడు యోసేపు కుమారుడు కాడా ?" అని చెప్పుకొనసాగిరి. అంతట యేసు వారితో 'ఓ వైద్యుడా! నీకు నీవే చికిత్స చేసికొనుము అను సామెతను చెప్పి, "నీవు కఫర్నాములో ఏ యే  కార్యములు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములనెల్ల ఇచట నీ స్వదేశంలో సైతము చేయుము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవము ఏమనగా, ఏలీయా కాలమున మూడు సంవత్సరములు ఆరు మాసములు అనావృష్టివలన దేశమంతట గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు యిస్రాయేలీయులలో పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సీదోనులోని సరేఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలీయా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలములో యిస్రాయేలీయులలో చాలామంది కుష్ఠ రోగులు ఉన్నను, సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరును స్వస్థత పొందలేదు" అని పలికెను. అపుడు ప్రార్ధనామందిరములోని ప్రజలు అందరు యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకునెట్టుకొని పోయి, తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకొనివెళ్ళి, అచట నుండి తలక్రిందుగా  పడత్రోయతలచిరి. కాని యేసు వారి మధ్య నుండి తొలగి తనదారిన తాను వెళ్లిపోయెను. 

యేసు ప్రభువు నజరేతుకు తిరిగి వచ్చాడు — తాను పెరిగిన ఊరికి, తనను తెలిసిన మనుషుల మధ్యకు వచ్చాడు. ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరానికి వెళ్ళే అలవాటు ప్రకారం ఆయన అక్కడికి వెళ్ళాడు. యెషయా గ్రంథం తెరచి చదివాడు. 'ప్రభువు ఆత్మ నాపై ఉంది' అని ప్రకటించాడు. అక్కడివారందరు  మొదట ఆశ్చర్యపడ్డారు — ఇతను 'యోసేపు కుమారుడు కాడా?' అని ముచ్చటపడ్డారు. కానీ కొద్దిసేపట్లోనే మండిపడి ఆయనను చంపాలని ప్రయత్నించారు.

ఈ సంఘటన మనకు రెండు ముఖ్యమైన సత్యాలు నేర్పుతుంది: మొదటిది — దేవుని వాక్యం ఎల్లప్పుడూ స్వీకరించబడదు. రెండవది — మన విశ్వాసం మానవ జ్ఞానంపై కాదు, దేవుని శక్తిపై ఆధారపడాలి. ఈ రెండు సత్యాలను నేటి పఠనాలు లోతుగా వివరిస్తున్నాయి.

 

 యెషయా లేఖనం — యేసు ప్రభువుని ప్రేషీత కార్య  ప్రకటన

యేసు ప్రభువు  చదివిన వాక్యాలు యెషయా 61:1-2 నుండి వచ్చాయి. ఇవి కేవలం పాత నిబంధన  మాటలు కావు  — యేసు ప్రభువుని కర్తవ్యాన్ని, తాను ఈలోకంలో చేసే పనులను గురించి ఇచ్చిన ఒక ప్రకటన.   

'పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగ చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను.'

ఈ వాక్యాలలో ఐదు పనులు ఉన్నాయి: పేదలకు సువార్త, బందీలకు విడుదల, గ్రుడ్డివారికి దృష్టి, పీడితులకు విమోచన, ప్రభు సంవత్సరం ప్రకటన. ఇవి సహజ  అర్థంలో మాత్రమే కాదు — ఆధ్యాత్మికముగా కూడా మనం అర్ధం చేసుకోవాలి.  అవి  పాపానికి బందీలైన వారికి విడుదల, ఆత్మీయ అంధత్వంలో ఉన్నవారికి దృష్టి, అణచివేతలో ఉన్నవారికి విమోచన.

'నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది' అని ప్రభువు చెప్పిన  ఈ మాటలు అద్భుతమైనవి. యేసు చదివిన తర్వాత గ్రంథం మూసి కూర్చున్నాడు. అందరి దృష్టి ఆయనపై ఉంది. తర్వాత  'ఈ రోజే  ఇది నెరవేరింది'  అని వారి ఎదుట చెప్పాడు. ఇది క్రీస్తు యొక్క అత్యంత ధైర్యోపేతమైన ప్రకటన.

 

నజరేతు ప్రజల స్పందన — మొదట ఆనందం, తర్వాత క్రోధం

 ఈ మాటలు విన్న ప్రజలు మొదట  ఆశ్చర్యపడ్డారు. 'దయాపూరితమైన మాటలు' విన్నారు. యోసేపు కొడుకు ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడని ముచ్చటపడ్డారు. ఇది మానవ స్వభావం — కొత్తగా ఉన్నప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది కాని అది మనల్ని సవాలు చేసినప్పుడు కోపం మనకు కోపం వస్తుంది. నీవు గొప్ప వాడివలె మాటలాడుతున్నావు, నీవు మాకు తెలియవా అని అనుకుంటాము. 

యేసు ప్రభువు వారి మనసుల్లో ఉన్న ప్రశ్నను గుర్తించాడు: 'వైద్యుడా! నీకు నీవే చికిత్స చేసుకో' — అంటే 'కఫర్నాంలో చేసినట్లు ఇక్కడ కూడా చేసి చూపించు.' ప్రజలు అద్భుతాలు చూడాలని కోరుకున్నారు — ఆయన వారి నుండి  సత్యం వినాలని కోరుకున్నారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసము ఉంది.  

యేసు ప్రభువు  ఏలీయా మరియు ఎలీషా ఉదాహరణలు చెప్పాడు, దేవుని కృప ఇజ్రాయేలు మాత్రమే అందుకోలేదు, వేరే దేశాల వారు, జాతులవారు  కూడా అందుకున్నారు అనే విషయాన్ని వారికి స్పష్టం చేశాడు. ఇది నజరేతు ప్రజలకు భరించడం కష్టమైంది. 'మేము ప్రత్యేకులం' అనే భావన సవాలు చేయబడింది.   అందుకే వారు ప్రభువు మీద కోపపడ్డారు. 

 

'ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడు'

ఈ మాటలు  కేవలం యేసు  ప్రభువుకు మాత్రమే వర్తించే మాటలు  కాదు. ఇవి  సత్యం చెప్పే ప్రతి వారికి వర్తిస్తాయి.  స్వదేశంలో తిరస్కరణ అనేది అనేక కారణాల వల్ల జరుగుతుంది: పరిచయం గౌరవాన్ని  తగ్గిస్తుంది ('ఇతడు మనకు తెలిసినవాడే కదా'),  ఆ వ్యక్తిలో వచ్చే మార్పు అసౌకర్యం కలిగిస్తుంది,  యేసు ప్రభువు లేక ఆ వ్యక్తి చెప్పే సత్యం, వారి  అహాన్ని తాకుతుంది, అది వారికి కంఠగింపు అవుతుంది. 

మన జీవితంలో కూడా ఇది జరుగుతుంది. మనం   సత్యాలు చెప్పినప్పుడు, మన చుట్టు  ఉన్నవారు ఒక్కోసారి వినరు.   పరాయి వారు వింటారు. ఇది నిరుత్సాహపరచకూడదు. యేసు తిరస్కరింపబడ్డాడు.  ఆయన పని ఆపలేదు. యేసు ప్రభువు ఇతరులు ఆయనను అంగీకరించిన, లేకపోయిన తన కర్తవ్యాన్ని మాత్రము ఆపలేదు. 

 

పౌలు బోధన — మానవ జ్ఞానం కాదు, దేవుని శక్తి

మొదటి పఠనంలో పౌలు కొరింతు సంఘానికి రాసిన మాటలు నేటి సువార్తకు అద్దం పడుతున్నాయి.  నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు, మాటల గారడితొగాని, మానవ జ్ఞానంతో కాని రాలేదు అని చెబుతున్నారు. 

పౌలు ఒక మేధావి — గమాలీయేలు వద్ద చదివాడు, ధర్మశాస్త్రంలో నిపుణుడు. అయినా కొరింతులో అతడు తన జ్ఞానాన్ని ప్రదర్శించలేదు. ఎందుకు? ఎందుకంటే మానవ జ్ఞానం మనుషుల్ని మారుస్తుందని అతనికి నమ్మకం లేదు.   పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే హృదయాలను మారుస్తుంది.

'మన విశ్వాసం మానవ జ్ఞానంపై కాదు, దేవుని శక్తిపై ఆధారపడాలి' అని పౌలు చెబుతున్నాడు.   ఈ రోజు ఆకర్షణీయమైన మాటలు చెప్పే బోధకులు ఉన్నారు. కానీ మాటల వెనక పరిశుద్ధాత్మ ఉందా? అది ముఖ్యమైన ప్రశ్న. ఆ పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండాలి. అందుకు మనము కృషి చేయాలి. 

 పౌలు అనుభవం ఇదే చెప్తోంది: అతడు విద్వాంసుడు.  కానీ క్రీస్తును అనుభవించిన తర్వాత, తన విద్యను కాదు, క్రీస్తు శిలువను మాత్రమే ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే శిలువలోనే దేవుని శక్తి ఉంది. శిలువ లోనే రక్షణ ఉన్నదని తెలుసుకున్నాడు. 

 

 మన జీవితానికి పిలుపు

నేటి పఠనాలు మనల్ని మూడు విషయాలకు పిలుస్తున్నాయి:

మొదటిది — యేసు ప్రభువుని ప్రేషిత కార్యంలో భాగస్వాములు కావడం కోసం . ఈ ప్రేషిత కార్యం పేదలకు సువార్త, బందీలకు విడుదల, అంధులకు దృష్టి  ఇవ్వడం, ఇది  కేవలం యేసు ప్రభువుని  పని మాత్రమే కాదు, ఆయన మనకు అప్పగించిన పని. మన దగ్గర  బాధలో ఉన్నవారికి సహాయం చేయడం ఈ బాధ్యత. 

రెండవది — తిరస్కరణకు సిద్ధంగా ఉండటం. మనం సత్యం చెప్పినప్పుడు, మంచి పని చేసినప్పుడు అందరూ మెచ్చుకోరు. యేసు ప్రభువు  నజరేతులో తిరస్కరించబడ్డాడు — కానీ తన పని ఆపలేదు. మనం కూడా తిరస్కరణకు భయపడి సత్యం చెప్పడం ఆపకూడదు.

మూడవది — పరిశుద్ధాత్మపై ఆధారపడటం. మన మాటలు, మన పని, మన సాక్ష్యం — అన్నీ పరిశుద్ధాత్మ శక్తితో  జరగాలి. మానవ ప్రణాళికలు, గొప్ప  మాటలు, మేధావుల  వాదనలు హృదయాలను మార్చవు.   పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే మారుస్తుంది. ప్రభువుకి సాక్షిగా జీవించడం మార్చుతుంది. 

 ముగింపు ప్రార్థన

ప్రభువా! నజరేతులో మీరు  తిరస్కరించబడ్డారు.  అయినా మీ  ప్రేషిత కార్యాన్ని  ఆపలేదు. మేమూ తిరస్కరణకు భయపడి సత్యం చెప్పడం ఆపకుండా నిలబడడానికి ధైర్యం ఇవ్వు. మా విశ్వాసాన్ని మానవ జ్ఞానంపై కాకుండ, నీ శక్తిపై ఉండేలా తయారు చేయండి. పరిశుద్ధాత్మను మా హృదయాల్లో నింపి, మీ ప్రేషిత కార్యంలో  సాధనాలుగా చేయి. ఆమెన్.

 

— ఫా. అమ్రుత్ రాజు వెల్లటూరి OCD

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభౄద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలు అందించడే ఈ బ్లాగ్ లక్ష్యం.

🔪 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నితన పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు