యేసును ప్రేమించే వారితో ఆయన నివసిస్తాడు | యోహాను 14:23-29 Telugu | Carmel Shobha

 పాస్క కాల 6 వ ఆదివారం 

యోహను 14:23-29 

 అపో 15:1-2,22-29 దర్శన 21:10-14,22-23 లేక దర్శన 22:12-14,16-17,20 యోహను 14:23-29 
సువిశేషం:అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చేను: "నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. కాని నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు. నన్ను పంపిన నా తండ్రిది. మీతో ఉండగనే నేను ఈ మాటలు మీతో చెప్పితిని. కాని నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడుఅనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించినేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని  మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను యిచ్చుట లేదు. మీ హృదయములు కలవర పడవలదు. భయపడవలదు. నేను వెళ్ళి మరల మీ వద్దకు మీ యొద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు  వినియున్నారుగదా!తండ్రి నా కంటే గొప్ప వాడు. కనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెల్లుచున్నందుకు మీరు సంతోషించేదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంబవింపక పూర్వమే ఇపుడు మీతో చెప్పుచున్నాను. 

యేసు ప్రభువు మూడు బహుమతులు గురించి వింటున్నాం. 1. ఆయన మనతో కలిసి జీవించడం. 2. ఆయన తన శిష్యులకు ఇచ్చే శాంతి 3. పవిత్రాత్మను పంపుట ఈ మూడు బహుమతులు యేసు ప్రభువు తన శిష్యులకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. 
 ఆదాము పాపము చేయక ముందు దేవుడు మానవునితో కలిసి జీవించాడు. కానిపాప కారణముగా  దేవునితో ఉన్న సామీప్యాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు.  మరల అది సాధ్యం కావాలి అంటే మనం ఆయన  ఆజ్ఞను పాటించాలి. 

యెషయా ప్రవక్త , మీ పాపములు దేవుని నుండి మిమ్ములను  వేరు చేస్తున్నాయి  అని చెబుతున్నారు. యేసు ప్రభువు,  ఈ మాటలను చివరి తీర్పు సమయంలో చెప్తున్నారు?  గొర్రెలను, మేకలను వేరు చేస్తాను అని చెబుతున్నారు.  యేసు ప్రభువు తనను ప్రేమించె వారి వద్దకు తండ్రితో  వచ్చి వారితో ఉంటానని చెపుతున్నారు.
యేసు ప్రభువును ప్రేమించడం అంటే ఏమిటి ? వారి వద్దకు ఎందుకు యేసు ప్రభువు వస్తాను అని అంటున్నారు. మనం ఆయన ఇచ్చిన ఈ ఆజ్ఞను తిరస్కరించి నేను ఆయనను ప్రేమిస్తున్నాను అని చెప్పినట్లయితే, మనం అబద్ధం ఆడిన వారము అవుతాము. ఒక వ్యక్తి యొక్క వ్యవహారం శైలి , వారి క్రియలు వారు యేసు ప్రభువును ప్రేమిస్తున్నారా, లేదా   తెలుపుతాయి. 

ఆయన్ను ప్రేమించే కుటుంబంలో ఆయన సభ్యుడని అవుతానని  ప్రభువే చెబుతున్నారు. ఆయనను ప్రేమించడం అంటే  ఆయన ఆజ్ఞలను పాటించడమే అని యేసు ప్రభువు చెబుతున్నారు.

యేసు ప్రభువు నేను వారి వద్దకు వస్తాను అంటున్నారు అంటే ఏమిటి? మనలను ఆయనతో పాటు జీవించడానికి, యేసు ప్రభువు ఆహ్వానిస్తున్నారు. అంటే మనలను ఆయన వలె జీవించడానికి ఆహ్వానం, మరియు ఆయన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అలవరచుకోవాలని చెబుతున్నారు.  ఒక వ్యక్తి ఆయనను అనుసరించక పోతే వారు తండ్రిను అనుసరించడం లేదు, అని యేసు ప్రభువు చెబుతున్నారు. యేసు ప్రభువు మాటలు తండ్రి మాటలు అని మనకు ఇక్కడ తేటతెల్లం అవుతుంది.
ఇక్కడ మనకు ఒక విషయం అర్ధం కావాలి అది ఏమిటి అంటే ఆయన మనతో ఎలా ఉంటారు. ఇవి  కేవలం మాటలు మాత్రమేనా? లేక ఏమైనా ఇతర అర్ధం ఉన్నదా? నిజానికి యేసు ప్రభువును ప్రేమించిన కొంత మంది పునీతులు ఈ మాటలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చి వారి జీవితాలలో ఆయనను అనుభవించారు, వారు ఈలోకంలో ఉండగానే. 

వారిలో కొంతమంది పునీత ఆవిల పురి తెరేసమ్మ, ఎలిజబెత్ ఆఫ్ థ ట్రినిటీ వంటి వారు. అందుకే ఆమె నా పరలోకాన్ని భూమి మీద కనుగొన్నాను అని చెబుతుంది. ఎందుకంటే ఆమె హృదయం లో ఉన్న దేవున్ని ఆమె ప్రతి నిత్యం అనుభవించింది. అదే విధంగా తెరేసమ్మ గారు, దేవున్ని చూడాలంటే మనకు పరలోకం పోవడానికి రెక్కలు అవసరం లేదు, నీ హృదయంలోనికి వెళితే సరిపోతుంది అని చెబుతుంది.
 వీరు ప్రార్ధనలో మన హృదయంలో ఉన్న దేవున్ని కనుగొన వచ్చో చెబుతున్నారు. పునీత ఫ్రాన్సిస్ గారు ఏ విధంగా జీవిస్తే ఆయన మనతో ఉంటారో తన జీవితం ద్వారా చెబుతున్నారు. వారందరూ యేసు ప్రభువును అనుభవించిన వారే.

ఇక్కడ యేసు ప్రభువు నేను మీకు శాంతిని ఇస్తాను అని చెప్పారు. లోకం ఇచ్చేలా కాదు. మీరు భయ పడవలదు  అని చెపుతున్నారు. ఇది ఆయన తన శిష్యులకు ఇచ్చే ఒక బహుమతిశాంతి కోసం మనం ఎక్కడకు ఎల్లాలి? ఈలోకం  ఈ శాంతి ఇవ్వలేదు అది కేవలం యేసు ప్రభువులో మాత్రమే దొరుకుతుంది.

నేను మీకు శాంతిని ఇస్తాను నా శాంతి మీకు ఇస్తాను అని చెపుతున్నారు ఆయన శాంతి అంటే ఏమిటి?  ఆయనను ప్రేమించే వారు భయ పడరు, ఎందుకంటే ఆయనను ప్రేమించే వారికి ఆ శాంతి ఉంటుంది. ఈరోజు అందరు శాంతి కోసం అందరు  వెదుకుతున్నారు కాని వెదకవలసిన చోట వెదుకట లేదు. 

ఆయన ప్రేమ మరియు క్షమ మనలను సమాధానంతో ఉండేలా చేస్తుంది.  యేసు ప్రభువు, నేను నన్ను ప్రేమిచ్చే వారి వద్దకు వచ్చి వారితో నివాస ముందును అంటున్నారు. దాని ద్వారా మనకు శాంతి వస్తుంది. 

లోకం నిజమైన శాంతిని ఎరుగదు. ఎందుకంటే లోకానికి శాంతి అంటే ఎటువంటి అలజడి లేకుండా ఉండటం, గొడవలు, యుద్దాలు  లేక పోవడం మాత్రమే. కానీ యేసు ప్రభువు ఇచ్చే శాంతి ఇటువంటిది కాదు ఆయన ఇచ్చే శాంతి ,అంతరంగీకమైనది.
 
ఆయన మన  వద్ద ఉండటం. ఎందుకు అంటే ఆయన  శిష్యుల వద్ద ఉంటే వారు ఎంతో ఆనందంగా ఉన్నారు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ సమాధానంతో వెళుతుంది, ఎందుకంటే ఆమెను ఆయన క్షమిస్తున్నారు.  యేసు ప్రభువు మన వద్దకు వచ్చి మనతోనే ఉంటాను అంటున్నారు. 

ఎలా ఆయన మనతో ఉండేలా చేయాలి. యేసు ప్రభువే మనకు ఒక జవాబు ఇస్తున్నాడు, ఎలాగా అంటే ఆయన ఆజ్ఞలను పాటించుట ద్వారా ఆయన మనతో ఉంటారు. ఎందుకు ఆయన మనతో ఉండాలి ? ఆ అవసరం ఏమి ఉంది అంటే, ఆయన మనతో ఉంటే మనం ఎక్కువ ఫలవంతం అవుతాము. సమృద్దిగా ఫలమిస్తాము.

యేసు ప్రభువు శిష్యులకు పవిత్రాత్మను లేక ఆదరణ కర్తను పంపు తాను అని వాగ్ధానం చేస్తున్నారు. ఇక్కడ పవిత్రాత్మ ఏమి చేస్తుందో కూడా యేసు ప్రభువు చెపుతున్నారు. పవిత్రాత్మ వారికి యేసు ప్రభువు చెప్పిన అన్నీం టిని గుర్తు చేస్తుంది. పవిత్రాత్మ శక్తి శిష్యులకు ఉత్సాహం ఇచ్చి సువార్తను ప్రకటించడానికి ఉపయోగపడుతుంది.

 మీకు ఆధరణ కర్తను పంపుతాను అని యేసు ప్రభువు చెపుతున్నారు. పరక్లీత అని అరమయిక్ బాషలో అంటారు పరక్  అంటే రక్షించు , లేక కాపాడు, లేత అంటే శపించబడిన వారిని , లేక దేవుని మార్గమునకు దూరముగా ఉన్నవారిని  కాపాడువారు అని అర్ధం. 

అంటే పవిత్రాత్మ ఈ శిష్యులను ప్రోత్సహించి వారు సువార్తను ప్రకటించే విధంగా చేస్తుంది. పవిత్రాత్మ శిష్యులకు యేసు ప్రభువును అనుసరించడం అంటే ఏమిటో తెలుపుతుంది. మరియు సువార్తను ఏ విధంగా ప్రకటించాలో తెలుపుతుంది. పవిత్రాత్మ వారికి ఏ విధంగా ఉండాలో నేర్పుతుంది.వారికి శాంతిని తీసుకువస్తుంది. వారికి నిజమైన శాంతి ఇస్తుంది.

 యేసు ప్రభువు తన శిష్యులను వదలి తండ్రి వద్దకు వెల్లుచు,  తన శిష్యులను ఆయన  వదలి పెట్టుటకు ఆయన ఇష్ట పడుటలేదు. యేసు ప్రభువు లేని సమయంలో శిష్యులు ఎలా ఉండాలో యేసు ప్రభువు ముందుగానే నిశ్చయించారు. వారికి అంతకు ముందుగానే అనేక సార్లు దాని గురించి  వివరించారు. ఆయన వారి నుండి వెళ్ళే సమయంలో వారికి ఆయన  నామమున తండ్రి పవిత్రాత్మను పంపుతున్నారు. 

ఈ పవిత్రాత్మ  వారికి అవసరం ఎందుకంటే  యేసు ప్రభువు ప్రేమించిన విధంగా వారికి  ప్రేమను నేర్పాలి.మీ హృదయములను కలవర పడనియకుము , భయ పడవలదు. 

యేసు ప్రభువు ఈ మాటలు చెప్పడానికి కారణం ఏమిటి? ఈ సమయంలో శిష్యులు శ్రమలుకు గురి కావడం లేదు. పరిసయ్యులు , సద్దుకయ్యులు యేసు ప్రభువును అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కాని యేసు ప్రభువు వారి వద్ద నుండి వెడలి పోయిన తరువాత వీరు అనేక కష్టాలకు గురి అవుతారు, దానికోసం వారిని సిద్ధం చేస్తున్నారు. 

మరల వారికి దేవుని ప్రేమను తెలియచేస్తున్నాడు.  దేవుడు మనలను ప్రేమిస్తున్నారు, మనతో ఉంటాను అన్నారు. కాని దానికి మనం సిద్ధంగా ఉన్నమా? ఆయన అజ్ఞాలను పాటిస్తున్నమా?

 దేవునికి మనకు ఏమి కావాలో తెలుసు కానీ అంత కన్నా మనకు ఏమి అవసరమో ప్రభువుకు తెలుసు.  ఆయనను ప్రేమించి , ఆయన ఆజ్ఞలకు పాటించి, ఆయనతో కలసి జీవించి, ఆయన పంపే ఆదరణ కర్తను ఆహ్వానించి, పవిత్రాత్మ ఫలాలను పొంది మన జీవితాలను ఫలవంతం చేసుకొని నిజమైన క్రీస్తు అనుచరులగా జీవించడానికి సిద్ధ పడుదాం. ఆమెన్
 
Fr. Amruth
Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు