దావీదు జీవితం పూర్తి వివరణ
దావీదు జీవితం పూర్తి వివరణ
పరిచయం
దావీదు బేత్లెహేము నివాసి, యిషాయి ఎనిమిదిమంది కుమారులలో చివరివాడు. యిస్రాయేలీయుల రెండవ రాజు. సంగీత విద్వాంసుడు. గొర్రెల కాపరి. కీర్తన కారుడు. అన్నింటి కంటే యిస్రాయేలు చరిత్రతో అత్యంత గొప్ప రాజు. బైబుల్ దావీదును దేవుని మనసుకు నచ్చిన వ్యక్తి అని చెబుతుంది. సమూవేలు దావీదు అన్నదమ్ములను చూచి అయన వారిని ఎన్నుకుంటాడు అనుకున్నాడు. దావీదును దేవుడు ఆకారం, రూపం కాకుండా హృదయాంతరంగం చూసి ఎన్నుకున్నాడు.
దావీదు గొప్ప యుద్ధ వీరుడు. దావీదు జీవితములో అనేక యుద్దాలు చేసాడు. తన రాజుతోటి, తన కుమారునితో కూడా యుద్ధం చేసినవాడు. దావీదు గోల్యాతుతో చేసిన యుద్ధం దావీదును ఒక విరునిగా గుర్తించేలా చేసింది. దావీదుకు సైనికునిగా ఎటువంటి శిక్షణ లేకున్నను దేవుడు అతనికి అంతటి గొప్ప విజయాన్ని ఇచ్చాడు.
దావీదుని ఎన్నిక
పవిత్ర గ్రంధంలో దావీదు జీవితం సౌలు దేవుని ఆజ్ఞలను ధిక్కరించడంతో, దేవుని ఆజ్ఞలను పాటించే ఒక యువకుని ఎన్నుకోవడంతో మొదలవుతుంది. ఆ యువకుడే దావీదు. దావీదుని ఎన్నిక ఏవిధంగా జరిగినది అంటే, సౌలును దేవుడు అమాలేకీయులతో యుద్ధం చేసి వారిని వారి పశువులను నాశనం చేయమని చెప్పాడు, కాని సౌలు వారి పశువులలో శ్రేష్టమైన వాటిని అంటిపెట్టుకున్నారు. దేవుని ఆజ్ఞలను విధేయించలేదు. కనుక దేవుడు సౌలు రాజరికాన్ని తిరస్కరించాడు. దేవుడు సమూవేలుతో సౌలును నేను తిరస్కరించాను, నీవు అతని కోసం దుఃఖించుట మాని, కొమ్మును తైలముతో నింపుకొని బేత్లెహేములోని యిషాయి కుమారులలో ఒకనిని రాజుగా ఎన్నుకొంటిని, అతనిని నీవు అభిషికించాలి అని చెప్పాడు. అందుకు సమూవేలు ఇది సౌలుకు తెలిసినచో నన్ను చంపివేయును, నేను వెళ్ళను అని చెప్పాడు. కానీ దేవుడు చెప్పినట్లుగా బేత్లెహేము వెళ్ళాడు. సమూవేలు వెళ్ళగానే అక్కడ ప్రజలు భయపడ్డారు. నీవు మా క్షేమం కోరి వచ్చావా? లేక మా నాశనము కోరి వచ్చావా అని అడిగారు. అందుకు సమూవేలు మీ క్షేమం కోరే వచ్చాను. ఇక్కడ బలి అర్పించడానికి వచ్చాను అని చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే యిషాయి తోటి తన కుమారులను పిలవమని చెప్పాడు. యిషాయి కుమారులందరు సమూవేలు ముందు నిలబడినప్పటికీ దేవుడు వారిని ఎవరిని ఎన్నుకొనలేదు. దేవుడు ఇషాయి చిన్న కుమారుడు దావీదు తన తండ్రి గొఱ్ఱెలను మేపుటకు వెళ్ళాడు. దావీదును పిలువుటకు యిషాయి కొందరిని పంపాడు. సమూవేలు దావీదు వచ్చిన వెంటనే దేవుడు నేను ఎన్నుకున్నది ఇతనినే , ఇతనిని అభిషేకించమని చెప్పాగా సమూవేలు తైలపు కొమ్ము తీసుకొని అతనిని అభిషేకము చేసాడు. అప్పటి నుండి యావే ఆత్మ దావీదును ఆవహించి ఉంది. దాని తరువాత సమూవేలు రామాకు వెళ్ళాడు.
దావీదు యువకునిగా యిస్రాయేలుకు గొల్యాతును చంపడం ద్వారా ఒక గొప్ప విజయాన్ని అందించాడు. దావీదు జీవితం దేవుడు మనలను ఎలా ఉండాలని కోరుకుంటున్నారో తెలుసుకోవచ్చు. సౌలు యుద్దాలు గెలిచి ఉండవచ్చు, దేశాన్ని తన వెనుక నడిచేలా చేసి ఉండవచ్చు కానీ దేవునికి విధేయించి జీవించలేదు. సమూవేలుతో దేవుడు నేను సౌలును తిరస్కరిస్తున్నాను అని చెప్పాడు. దేవుడు తన మనసుకు నచ్చిన వాడిని ఎన్నుకున్నాను అంటున్నాడు. దేవుని మనసుకు నచ్చడము అంటే ఏమిటి? ఇక్కడ మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే దేవుడు మనిషి అంతరంగాన్ని చూస్తాడు. మనిషి మరియొక మనిషి హృదయంలో ఏమి ఉన్నదో చూడలేడు, కానీ దేవుడు మాత్రం మనిషి అంతరంగాన్ని చూడగలడు.
పిలిస్తియులు యిస్రాయేలీయులును అవమానించుట
దావీదు యుద్ధ శిబిరం వెళ్ళుట
గొల్యాతు సవాలు దావీదు స్వీకరించుట
దావీదు సౌలుతో గొల్యాతు గురించి ఎవ్వరు భయపడనక్కరలేదు. అనుమతిచ్చినచొ, ఈ దాసుడు గొల్యాతునితో పోరాడగలడు అని చెప్పాడు. అప్పుడు దావీదుతో సౌలు, ఆ పిలిస్తియుని ఎలా ఎదిరింపగలవు? నీవు బాలుడవు , అతడు బాల్యమునుండి యుద్ధమున కాకలుతీరినవాడని చెప్పాడు. దానికి దావీదు 'నా తండ్రి మందలను కాయుచున్నప్పుడు సింగముకాని, ఎలుగుబంటి కాని గొర్రెలను ఎత్తుకెళ్లునప్పుడు, నేను వన్య మృగములను తరిమి , వాటి నోటినుండి గొర్రెను విడిపించుకొని వచ్చేవాడిని. అవి నా మీద తిరుగపడితే వాటి జూలు పట్టి చంపెడివాడను. సున్నతి సంస్కారములేని ఈ ఫిలిస్తీయుడు అలానే చచ్చును, వీడు సజీవ దేవుని సైన్యములను సవాలు చేయువాడ అని అన్నాడు. అపుడు సౌలు అటులయిన పోయి పోరాడు, యావే నీకు తోడుగానుండునుగాక అని చెప్పి, తన ఆయుధములను ఇచ్చాడు. తలమీద శిరస్త్రాణము, రొమ్మున కవచము దానిమీద కత్తిని వ్రేలాడగట్టాడు. కాని దావీదుకు అవి అలవాటు లేకపోవుట వలన వానితో నడవలేకపోయి, ఇవి నాకు అలవాటు లేవు అనిచెప్పి వానిని తొలగించాడు.
దావీదు- గొల్యాతు
దావీదు తన కర్ర తీసుకొని ఏటిఒడ్డునుండి ఐదు నున్నని రాళ్లు ఏరుకొని తన సంచిలో వేసుకున్నాడు. ఒడిసెల తీసుకొని పిలిస్తియునివైపు వెళ్లగా గొల్యాతు తన డాలు మోస్తున్న బంటుతో ముందు నడుస్తూ , మెల్లగా అడుగులేస్తు దావీదును సమీపించి కర్రనెత్తుకొని నా మీదికి రావడానికి నేను కుక్కననుకోంటివా? అని దావీదును దేవర పేరుతో శపించి " ఇటురమ్ము, నీ కండలు కోసి ఆకాశపక్షులకు, అడవి మృగలకు ఆహరముగా ఇచ్చేదను" అని శపించాడు.
గొల్యాతు ముందుకు వస్తున్నప్పుడు,,, దావీదు పరిగెత్తి సంచిలో చేయి పెట్టి ఒక రాయి తీసి వడిసెలలో వేసి విసిరాడు. ఆ రాయి గొల్యాతు నుదుటిలో దిగబడింది. అతడు నేలకూలాడు. దావీదు పరిగెత్తి వెళ్ళి గొల్యాతు ఖడ్గం తీసి అతని తల నరికాడు. ఎంతో గొప్ప వీరుడుగా పేరొందిన ఆ గొల్యాతు ఒక చిన్న బాలుని, దేవుడు తమకు విజయాన్ని ఇస్తాడు అనే విశ్వాసం ముందు ఓడిపోయాడు. ఇది మొత్తాన్ని చూస్తున్న పిలిస్తియులు, తమ వీరుని మరణం చూసి పారిపోయారు. యిస్రాయేలు సైన్యం అరుస్తూ, వారి వెనక పడింది. ఆ రోజు ఒక గొప్ప విజయం. ఒక బాలుని విశ్వాసం మహాయుద్ధాన్ని జయించింది. దావీదు గొల్యాతు తలను యెరుషలేమునకు తీసుకెళ్లాడు. గొల్యాతు తలను తెచ్చిన దావీదును సైన్యాధిపతి అబ్నేరు సౌలు వద్దకు తీసుకొనివేళ్ళాడు. అప్పుడు సౌలు నీవు ఎవరి కుమారుడవని అడుగగా దావీదు బెత్లెహేము నివాసియగు యిషాయి కుమారుడను అని చెప్పాడు. సౌలు దావీదును కోరిక మీద అక్కడే ఉండిపోయాడు. ఈ సమయములోనే దావీదు మరియు యోనాతాను స్నేహం ఏర్పాడింది.
సౌలు అసూయ
ఒకసారి దావీదు ఫిలిస్తియులను గెలిచి వస్తుండుగా యిస్రాయేలు పట్టణ స్త్రీలు వాయిధ్యములతో సౌలు వెయ్యి మందిని చంపేను కాని దావీదు పదివేలమందిని చంపేను అని పాడుటతో, ఆ మాటలు సౌలుకు నచ్చలేదు, అపుడు సౌలుకు అసూయ పుట్టి రాజరికం తప్ప అన్నీ వైభవములు దావీదుకు చెందినవి కదా అనుకున్నాడు. అప్పటి నుండి దావీదు మీద అసూయతో రగిలి పోవుతుండేవాడు, తన చేతిలో ఉన్న ఈటెతో దావీదును పొడవలని విసరగా దావీదు రెండుమారులు తప్పించుకున్నాడు.
దావీదు బాల్యం, రాజుగా ఉన్న సౌలు అసూయ, ఏమి దావీదు ఉన్నతిని ఆపలేకపోయాయి. యావే దావీదుకు తోడుగా ఉన్నాడు. సౌలు దావీదును తన ఇంటి నుండి తొలగించి, వెయ్యి మంది సైనికులకు అధిపతిని చేశాడు. దావీదు చేపట్టిన అన్నీ పనులలో విజయాన్ని పొందటం చూచి సౌలు మరింత భయపడ్డాడు. సౌలు దావీదుతో తన పెద్ద కూతురును ఇచ్చి పెండ్లి చేస్తాను, నీవు మాత్రం యావే యుద్ధములు నడపాలి అని అని చెప్పాడు. కానీ తన మనసులో ఫిలిస్తీయులే దావీదును చంపుతారనుకున్నాడు. దావీదు, నేను రాజు కుమార్తెను చేసుకొనుటకు ఏమాత్రం వాడను అన్నాడు. సౌలు మాట తప్పి సౌలు తన పెద్ద కూతురును మేరబుకు అద్రియేలుకు ఇచ్చి పెళ్లి చేసాడు. సౌలు మరొక కూతురు మీకాలు దావీదును ప్రేమించినదని తెలుసుకొని మీకాలును ఎరగా పెట్టి పిలిస్తియుల మీదకు యుద్దానికి పంపాడు, అలా పిలిస్తియులు దావీదును చంపుతారనుకున్నాడు. సైనికులతో సౌలు తన రెండవ కూతురును దావీదుకు ఇస్తున్నట్లు చెప్పాడు. ఈ విషయమై సైనికులు దావీదుకు నీవు పెండ్లి కానుక ఇవ్వనవసరం లేదు ఫిలిస్తీయుల చర్మాగ్రములు వంద ఇచ్చిన చాలని సౌలు వారితో అన్నట్లు చెప్పారు. కాని దావీదు రెండు వందల మంది చర్మాగ్రములు తెచ్చి సౌలు ముందట లెక్కించాడు. సౌలు మాట ఇచ్చిన ప్రకారం తన కుమార్తె మీకాలును ఇచ్చి దావీదుకు పెళ్లి చేసాడు. దావీదు పేరు వీరునిగా అంతటా ప్రాకినది.
దావీదు యోనాతానుల అమర స్నేహం
గొల్యాతును చంపిన తర్వాత, దావీదు సౌలు రాజప్రసాదంలో ఉండిపోయాడు. ఆ సమయంలో సౌలు కుమారుడు యోనాతాను దావీదును చూశాడు. దావీదు యోనాతానుల స్నేహం చాలా గొప్ప బంధంగా మిగిలిపోయింది. వారి స్నేహం రెండు శరీరాల ఒక ఆత్మలా, ఒక ఆలోచనలా కలసిపోయాయి. సౌలు యోనాతానుతో మరియు సేవకులతో దావీదును వధించమని చెప్పాడు, అప్పడు యోనాతాను దావీదుతో, తన తండ్రి దావీదును చంపవలెనని కోరుతున్నాడని చెప్పి , దావీదును ఎక్కడైన దాగుకొనమని చెప్పాడు. సౌలుతో యోనాతాను దావీదుకు ఎటువంటి హాని చేయవద్దని, అతడు ఎలా యిస్రాయేలు ప్రజలను కాపాడినది వివరించాడు, సౌలు సంతృప్తి చెందాడు. దావీదును యోనాతాను పిలిపించి జరిగిన విషయం చెప్పగా అప్పుడు దావీదు సౌలు ముందు మరల పరిచర్య చేసాడు.
మీకాలు కాపాడుట
మరల సౌలు దావీదును చంపడానికి ఈటెతో ప్రయత్నించాడు. ఆ రాత్రి దావీదును చంపించడానికి ప్రయత్నిస్తు, దావీదు ఇంటికి సైనికులను పంపించాడు. అప్పుడు దావీదు భార్య మీకాలు రాత్రి సమయంలోనే పారిపోమ్మని చెప్పగా, దావీదు ఆ రాత్రినే పారిపోయాడు. తరువాత దావీదు రామా వద్ద సమూవేలును కలుసుకున్నాడు.
యోనాతాను మరల సాయం చేయుట
దావీదు రామా నుండి యోనాతాను వద్దకు వచ్చాడు. వచ్చి ఎందుకు నన్ను నీ తండ్రి చంపగోరుతున్నాడు? అని అడిగాడు అందుకు యోనాతాను అది నిజము కాదు, నాకు తెలియకుండా అతడు ఏమి చేయడు అని చెప్పాడు. అప్పుడు దావీదు,, మరుసటి రోజు అమావాస్య నేను రాజుతో కూర్చొని విందులో ఉండాలి, నేను అక్కడకు రాను కనుక నీవు నా గురించి రాజుతో మాట్లాడి, రాజు నా మీద కోపంతో ఉన్నడో, లేడో తెలుసుకొని, నాకు చెప్పు అని యోనాతానుతో చెప్పాడు. దానికి యోనాతాను దావిదుకు మాట ఇచ్చి, నేను ఈ ఆపద నుండి నిన్ను తప్పింపకపోతే ప్రభువు నన్ను ఆపదపాలు చేస్తాడని చెప్పి, నేను చనిపోయిన నా కుటుంబంపై కరుణింపుము, దావీదు శత్రువులను నాశనము చేసినప్పుడు యోనతాను కుటుంబము నాశనం కాకూడదని, అట్లయిన యావేకు సమాధానం చెప్పాలని చెప్పాడు. మరల యోనతాను యావే పేరిట ప్రమాణం చేశాడు. అమావాస్య తరువాత ఎలా కలుసుకోవాలో చెప్పి అక్కడ నుండి వెళ్ళాడు. మొదటి రోజు సౌలు దావీదు గురించి మాటలాడలేదు. రెండవ రోజు దావీదు భోజనమునకు రాలేదు ఏమి అని యోనాతానును అడుగగా, అతడు బలి అర్పించుటకు వెళ్ళాడు అని యోనాతాను చెప్పాడు. అపుడు సౌలు కోపపడి యోనాతానును, అతని తల్లిని తిడుతూ , దావీదు బ్రతికి ఉంటె నీవు , నీ రాజ్యము నిలువదు. దావీదును ఇక్కడకు రమ్మను, ఇక వాడు బ్రతకకూడదు అని చెప్పాడు. కాని యోనాతాను సౌలును వారిస్తూ దావీదు చేసిన తప్పు ఏమిటి? అతనిని ఎందుకు చంపాలి అని అడిగాడు. అపుడు సౌలు ఈటెతో యోనాతానును పొడవడానికి ప్రాయత్నించగా, యోనాతాను అక్కడ నుండి వెళ్ళిపోయాడు. దావీదును చంపడానికి సిద్దపడ్డాడనే విషయాన్నీ దావీదుకు చెప్పాడు. ఇద్దరు ఒకరినొకరు ముద్దుపెట్టుకొని ఒకరినుండి మరియొకరు వీడ్కోలు తీసుకున్నారు.
దావీదు కష్టాలు
దావీదు కేయీలా నగరము రక్షించుట
సౌలును క్షమించుట
నాబాలు - అభిగాయీలు
దావీదు సౌలును మరల వదలి పెట్టుట
దావీదు పిలిస్తియుల దేశమున వశించుట
తన వారిని విడిపించుకొనుట
సౌలు మరణం మరియు దావీదు రాజ్యారోహణం
ఫిలిస్తియులు యిస్రాయెలుపై పెద్ద యుద్ధం ప్రారంభించారు. గిల్బోవా కొండపై ఘోర యుద్ధం జరిగింది. సౌలు అతని కుమారులు యోనాతాను, అబీనాదాబు, మేల్కీషువ చనిపోయారు. సౌలు తన ఆయుధాలు మోసే సేవకునితో, నీ ఖడ్గంతో నన్ను పొడువు, అని చెప్పిన అతడు భయపడి చేయలేదు, అప్పుడు సౌలు తన ఖడ్గంపైన పడిపోయి చనిపోయాడు.మరుసటి రోజు పిలిస్తియులు సౌలు చనిపోయిన విషయాన్ని తెలుసుకొని సౌలు తల నరికారు. ఈ వార్త చెప్పడానికి దేశనలుమూలల దూతలను పంపారు. సౌలు శవమును బెత్ షా ప్రాకారమునకు వ్రేలాడగట్టారు. యాబేషు పౌరులు సౌలను అవమనపరచిరని విని, సౌలు శవమును అతని కుమారుల శవములను యాబేషుకు తెచ్చి అక్కడ దహనము చేశారు.
ఒక వ్యక్తి దావీదు వద్దకు వచ్చి జరిగిందంతయు వివేదించాడు. దావీదు తన బట్టలు చించుకున్నాడు. సౌలును చంపినట్లు సైనికుడు చెప్పిన దాని ప్రకారం, అభిషిక్తుడను చంపినందుకుగాను, దావీదు తన సైనికునితో అతనిని వధించమని చెప్పాడు. దావీదు, సౌలు యోనాతానుల మరణం గురించి శోకించాడు. యిస్రాయేలు తేజస్సును యూదా కొండలపై మట్టుపెట్టిరి, మహా వీరులు కూలిరి కదా, అని శోకించాడు. యోనాతాను అనిన దావీదునకు మిక్కిలి ఇష్టము, నా పట్ల నీవు చూపిన ప్రేమ వనితల వలపు కంటే గొప్పదని యోనాతానును గురించి శోకించాడు.
దావీదు హెబ్రోను వెళ్ళుట
దేవుడు దావీదును హెబ్రోనుకు వెళ్ళమన్నాడు. యూదా పెద్దలు వచ్చి దావీదును యూదా జనుల రాజుగా అభిషేకించారు. దావీదు, యాబేషుగిలాదకు దూతలను పంపి సౌలురాజును ఖననం చేసినందుకు వారిని అభినందిస్తూ వర్తమానం పంపాడు. సౌలు సైన్యాధిపతి అబ్నేరు, సౌలు కుమారుడు ఈష్భోషేతును గిలాదు, ఆషేరు, యెస్రేయేలు, ఏప్రాయీము, బెన్యామీను మండలములకు రాజును చేశారు. అతడు రెండేళ్లు ఏలాడు. యూదా మాత్రము దావీదును ఎన్నుకున్నారు. దావీదు హెబ్రోను నుండి రాజుగా ఏడు సంవత్సరాల ఆరు నెలలు పాలించాడు. యూదియులకు యిస్రాయేలియులకు గిబ్యోను వద్ద పోరు జరిగినది, యిస్రాయేలు దండు యూద దండు ముందు నిలువలేకపోయారు. దావీదు పక్షము వారికి, సౌలు పక్షమున ఉన్నవారికి చాలకాలము పోరునడిచినది. రోజురోజుకు దావీదు పక్షము బలము పొందగా సౌలు పక్షము బలహీనంగా మారింది.
దావీదుకు హెబ్రోనులో అహీనోవాము వలన అమ్నోను, అభిగాయీల వలన కిల్యాబు, మాకా వలన అభ్షాలోము, హగ్గిత్తు వలన అదోనీయా, అభిటాలు వలన షెపట్యా, ఎగ్లా వలన ఈత్రేయాము జన్మించారు.
అబ్నేరు- దావీదు
ఈష్బోషేతు అబ్నేరును తన తండ్రి ఉంపుడుకత్తెతో ఎలా శయనించావు అని ప్రశ్నించినందుకు అతడు కోపపడి ఈష్బోషెతుతో చాల పరుషంగా మాట్లాడాడు. అతడు దావీదు వద్దకు దూతలను పంపి, మీకు సహాయము చేసి, యిస్రాయేలు అందరిని దావీదు పక్షమున చేరుస్తానని కబురు పంపాడు. దావీదు అందుకు అతను వచ్చునప్పుడు మీకాలును తన వద్దకు తీసుకువచ్చిన తనతో ఒడంబడిక చేసికొందును అని చెప్పాడు. దావీదు సౌలు కుమారుడు ఈష్బోషెతు వద్దకు కూడా దూతలను పంపి తన భార్య మీకాలును పంపమని చెప్పాడు. అప్పుడు ఈష్బోషెతు ఫల్తీయేలు నుండి మీకాలును పిలిపించెను. మీకాలు భర్త ఫల్తీయేలు ఆమెవెంట ఏడుస్తూ వచ్చాడు, కాని అబ్నేరు తనని వెళ్ళమని చెప్పగా అతడు వెళ్ళిపోయాడు. అబ్నేరు యిస్రాయేలు పెద్దలతో మరియు బెన్యామీనీయులతో మాట్లాడి దావీదు వద్దకు వెళ్ళాడు. దావీదు అబ్నేరుకు విందు ఏర్పాటు చేసాడు, అబ్నేరు దావీదుతో, యిస్రాయేలు అందరిని దావీదు పక్షమునకు తీసుకువస్తాను అని చెప్పి దావీదు వద్ద నుండి సెలవు తీసుకొనివెళ్ళాడు.
దావీదు సైనికులకు అబ్నేరు వచ్చిన విషయం తెలియదు. యోవాబు వచ్చి దావీదుతో అబ్నేరును ఎలా వదలివేసితివని, చెప్పి వెళ్లి సీరా నూతి దగ్గర అబ్నేరును కలుసుకొని, యోవాబు అతనితో మాటలాడుకొనుచున్నాడని చెప్పి నగర ద్వారము వద్దకు తీసుకొని రాగా, యోవాబు కత్తితో పొట్టలో పొడవడంతో అబ్నేరు అక్కడే చనిపోయాడు. అది తెలుసుకొన్న దావీదు ఈ హత్యకు నేను, నా రాజ్యము బాధ్యులం కాదు. యోవాబు అతని కుటుంబం బాధ్యులు అని ప్రకటించాడు. అబ్నేరును హెబ్రోనున పాతిపెట్టారు. దావీదు అబ్నేరు సమాధి వద్ద విలపించాడు. అది చూసిన ప్రజలు దావీదుకు అబ్నేరును చంపడం ఇష్ఠము లేదని తెలుసుకున్నారు. ఇది తెలుసుకున్న ఈష్బోషెతు గుండె చెదిరింది. ఒకరోజు బెన్యామీనుకు చెందిన రేకాబు, బానా, మిట్ట మధ్యాహ్నము వేడికి పడక మీద సేద తీరుతున్న ఈష్బోషెతును తల నరికి దావీదు వద్దకు తీసుకొని వెళ్లారు. దావీదు వారిని చూచి బందిపోటులు, ఒక నిర్దోషిని పండుకొనిన పడక మీదనే చంపారని, వారిని సైనికులతో మట్టుపెట్టించాడు. ఈష్బోషెతు శిరస్సును అబ్నేరు సమాధిలో పెట్టారు.
యెరూషలేము రాజు – రాజ్య స్థాపన
చివరకు యిస్రాయేలు పెద్దలు అందరూ హెబ్రోనుకు వచ్చి దావీదుతో నిబంధన చేసుకున్నారు. దావీదు ముప్పై సంవత్సరాల వయసులో యిస్రాయేలు మొత్తానికి రాజుగా అభిషేకించబడ్డాడు. ఆ సమయం నుండి దావీదు యెరూషలేమును స్వాధీనపరచుకుని అక్కడికి వెళ్ళాడు. అక్కడ తూరు రాజు దావీదుకు దేవదారు కలపతో ప్రాసాదము నిర్మించారు. యెరుషలేములో దావీదుకు భార్యలు, ఉంపుడుకత్తెలను తీసుకున్నాడు. ఇక్కడ కుమారులు కుమార్తెలు కలిగారు. దావీదు రాజు అయ్యాడని తెలుసుకున్న పిలిస్తియులు రెండుసార్లు దావీదు మీదకు యుద్దానికి వచ్చిన, దావీదు వారిని తరిమి కొట్టాడు.
మందసము యెరూషలేము చేరుట
యెరూషలేము అప్పటికి యెబూసీయుల నగరం. వారు దావీదుకు సవాలు విసిరారు: "అంధులు, కుంటివాళ్ళు కూడా నిన్ను తిప్పికొట్టగలరు." అన్నారు. దావీదు దాన్ని జయించి "దావీదు పట్టణం" అని పేరు పెట్టాడు. అక్కడ గోడలు కట్టించాడు, దావీదు గొప్ప రాజ్యానికి పునాది వేయబడింది.
దావీదు దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకురావాలని కోరుకున్నాడు. మొదటి ప్రయత్నంలో, ముప్పై వేలమందితో బాలాకు వెళ్లి మందసాన్ని కొత్త బండి వెక్కించుకొని, అబీనాదాబు ఇంటి నుండి తీసుకొస్తున్నప్పుడు, ఉస్సా అను అబీనాదాబు కుమారుడు మందసము కింద పడునేమోనని పట్టుకోవడానికి చేయి చాచాడు. అప్పుడు అతడు అక్కడే చనిపోయాడు, దావీదు భయపడి, మందసాన్ని ఓబేదెదోము ఇంట్లో ఉంచాడు. . మూడు నెలలు ఆ ఇల్లు దీవెనలు పొందింది. అప్పుడు దావీదు మళ్ళీ మందసాన్ని అక్కడనుండి తీసుకువస్తూ, మందసము మోయువారు ఆరేసి అడుగులు వేసిన తరువాత కోడెను , పొట్టేలును బలి ఇచ్చాడు. రాజు, యాజకులు ధరించే నార బట్టలు వేసుకొని నాట్యమాడాడు. సౌలు కూతురు మీకాలు అది చూచి దావీదును ఏవగించుకున్నది. మందసమును ముందుగానే సిద్దము చేసిన గుడారమున ప్రతిష్టించారు. దావీదు అందరిని దీవించగా, దావీదు కుటుంబము వచ్చినది, అపుడు మీకాలు దావీదును ఎగతాళిగా బట్టలు ఊడిన కూడా పనికెత్తేల ముందు పిచ్చివాడిలా నాట్యమాడి గొప్ప గౌరవము తెచ్చుకున్నావని అనగా, దావీదు అందుకు యావే ముందు ఏమైనా చేస్తాను. దేవుడు నీ తండ్రి కుటుంబమును కాదని, నన్ను ఎన్నుకున్నాడు అని చెప్పాడు. మీకాలుకు పిల్లలు పుట్టలేదు.
నాతాను ప్రవచనం
ఒక రోజు దావీదు ప్రవక్త నాతానుతో "నేను దేవదారు కలప ఇంట్లో నివసిస్తున్నాను, కానీ దేవుని మందసం గుడారంలో ఉంది." అన్నాడు. నాతాను దానికి నీకు ఇష్టము వచ్చినట్లు చేయుము అని చెప్పాడు. కాని ఆ రాత్రి దేవుడు నాతానుకు, దావీదుకు పుట్టిన కుమారుడు తనకు మందిరము నిర్మిస్తాడు అని చెప్పమని కలలో చెప్పాడు. ఆ విషయాన్నీ దావీదుకు నాతాను తెలియపరిచాడు. దావీదు ప్రభు గుడారమలోకి పోయి తనను, తన వంశమును దీవించమని, తన వాగ్దానమును నిలబెట్టుకోమని ప్రార్ధన చేసి వచ్చాడు. దావీదు పిలిస్తియులను, మోవాబీయులను సోబా రాజును ఓడించాడు. తరువాత ఆర్మీయులను ఓడించాడు ఆర్మీయులు దావీదుకు కప్పము కట్టేవారు. యుద్ధము నుండి వచ్చిన తరువాత దావీదు ఎదోమీయులను ఓడించాడు. దావీదుకు యావే విజయములను ఇచ్చాడు.
యోనాతాను కుటుంబమును గుర్తుంచుకొనుట
దావీదు సౌలు కుటుంబంలో ఎవరైన మిగిలి ఉన్నారా? యోనాతానును గుర్తుంచుకొని కరుణింతును అని చెప్పాడు. సౌలు కుటుంబమునకు సేవ చేయు సీబా, దావీదుతో యోనాతాను కుమారుడు ఒకడు ఉన్నాడు వాడు కుంటివాడు అని చెప్పాడు. అతని పేరు మెఫీబోషెతు , దావీదు అతనిని పిలిపించి భయపడవద్దు అని చెప్పి సౌలు భూములన్నీ అతనికి ఇప్పించాడు. అతను ప్రతిరోజు దావీదు ఇంటనే భుజించుచుండెను. అతనికి మీకా అను కుమారుడు ఉన్నాడు.
అమ్మోనీయులతో యుద్ధం
అమ్మోనీయుల రాజు చనిపోయిన తరువాత అతని కుమారుడు రాజు అయ్యాడు. దావీదు సంతాప సందేశాన్ని తన దూతల అతనికి పంపించాడు. ఆ యువ రాజును తన సహాయకులు తప్పుగా దావీదు గురించి చెప్పి, ఆ దూతలను అవమానపరచి, వారి గడ్డములు ఒక పక్క గొరిగించి, అది పెరిగిన తరువాత మీ దేశమునకు వెళ్ళండని చెప్పాడు. అది తెలుసుకొని దావీదు కొంతమంది సైనికులను యోవాబుతో, అరామీయుల మీదకు పంపగా, అభిషాయితో కొంతమందిని అమ్మోనీయుల మీదకు పంపాడు. రెండింటీ మీద దావీదు సైన్యం గెలిచింది. ఆరామియులు మరల వారివారానందరిని పిలవగా, దావీదు అది తెలుసుకొని, వారిమీదకు వెళ్ళినప్పుడు వారు దావీదును ఎదుర్కోలేకపోయారు.
దావీదు పాపం
అమ్మోనీయులుతో వసంత కాలంలో, దావీదు కోరికతో యోవాబు సైన్యము అమ్మోనీయులపై దాడి చేసి రబ్బాను ముట్టడించారు. దావీదు ఇంటివద్దనే ఉన్నాడు. అప్పుడు దావీదు ప్రాసాదము పైకి ఎక్కి పచారు చేయుచుండగా, ఇంటి పక్క స్నానమాడుచున్నా స్త్రీని చూచాడు. ఆమె గురించి విచారించగా, ఆమె హిత్తియుడైన ఊరియా భార్య బత్షెబ అని చెప్పిరి. రాజు ఆమె కొరకు సేవకులను పంపగా ఆమె రాజు వద్దకు వెళ్ళినది. దావీదు ఆమెతో శయనించాడు. ఆమె గర్భందాల్చింది. ఆ విషయం ఆమె దావీదుకు తెలియజేయగా, దావీదు ఊరియాను యుద్దము నుండి రప్పించి, ఇంటికి పోయి సేదతీర్చుకోమని చెప్పాడు. ఊరియా మాత్రం రాజ ప్రాసాదములోనే ఉండిపోయాడు. అది తెలుసుకున్న దావీదు ఇంటికి వెళ్ళావా అని అడుగగా అతడు, అందరు యుద్దములో ఉండగా నేను ఇంటికి పోవుట తగదు అని చెప్పాడు. తర్వాత దావీదు ఒక లేఖ రాసి ఇచ్చి అది, యోవాబుకు ఇవ్వమని చెప్పాడు. అందులో పోరు ముమ్మరంగా జరుగుచోట, ఊరియాను ముందు వరుసలో పెట్టి చనిపోవునట్లు చేయమని రాసాడు. అట్లే ఊరియా ఆ యద్దములో చనిపోయాడు. యోవాబు ఆ వార్తను దావీదుకు చేరవేయుటకు దూతను పంపాడు. బత్షెబ భర్త చనిపోయాడని విని శోకించింది. తరువాత దావీదు ఆమెను నగరమునకు రప్పించి పెళ్లికి చేసుకున్నాడు. ఆమె బిడ్డను కన్నది. దావీదు చేసిన ఈ పని యావేకు కోపం కలిగించినది. దావీదు దగ్గరకు నాతాను ప్రవక్త యావే పంపగా వచ్చి, దావీదు చేసిన పనిని తెలిపి, కత్తి ఇక నీ కుటుంబమును విడువదు, నీ కుటుంబము నుండియే నీకు కీడు ఉంటుంది, నీ భార్యలను ఇంకొకరి వశము చేసెదను అని, నీవు చేసిన ఈ పని అందరి ముందే చేసెదను అని చెప్పాడు. అప్పుడు దావీదు క్షమాపణ కోరాడు. నాతాను నీ పాపము ప్రభువు క్షమించాడు, కాని ఆ బిడ్డ చనిపోతాడు అని చెప్పాడు. బాలుడు జబ్బు పడ్డాడు. దావీదు ఏడు రోజులు ఉపవాసం ఉండి దేవుని వేడుకున్నాడు. నేలపై పడుకున్నాడు. పెద్దలు లేచి తినమని అడిగినా వినలేదు. ఏడవ రోజున బాలుడు చనిపోయాడు. సేవకులు దావీదుకు చెప్పడానికి భయపడ్డారు. కానీ దావీదు జరిగినది అర్థం చేసుకున్నాడు. లేచి, స్నానం చేసి, వస్త్రాలు ధరించి, దేవుని ఇంటికి వెళ్ళి ఆరాధించాడు. సేవకులు ఆశ్చర్యపోయారు: దావీదు బాలుడు చనిపోయాడు ఇక నేను ఎందుకు ఉపవాసము చేయాలని చెప్పాడు. తర్వాత బత్షేబా మళ్ళీ గర్భవతి అయింది. మరో కుమారుడు పుట్టాడు. అతడే సొలొమోను. దేవుడు అతనిని ప్రేమించాడు. నాతాను ద్వారా దేవుడు అతనికి "యెదీద్యా". యోవాబు రబ్బాను ముట్టడిచ్చి దావీదునకు కబురు పంపు ఆ నగరమును వశము చేసుకొనుటకు రమ్మని చెప్పాడు. ఆ రాజు కిరీటమును కూడా వారు దావీదు శిరస్సునకు అలంకరించారు.
అబ్షాలోము తిరుగుబాటు – తండ్రి హృదయ వేదన
దావీదు పెద్ద కుమారుడు అమ్నోను, తన మారు చెల్లి, అబ్షాలోముచెల్లెలు అయిన తామారు పై మోహపు కోరిక కలిగిఉన్నాడు. అది గమనించిన యోనాదాబు, ఎలా ఆమెను చెడచాలో చెప్పిన ప్రకారం తామారును చెరిచాడు. తామారును చెడిచిన తరువాత అమ్నోను తామారును ఇంటి నుండి సేవకులతో బయటకు నెట్టించాడు. తామారు తలపై దుమ్ము పోసుకొని పెద్దగా ఏడ్చినది. దావీదుకు తెలిసి కోపపడ్డాడు కానీ అమ్నోనును శిక్షించలేదు. తామారు అన్న అబ్షాలోముకు రెండు సంవత్సరాలు ఓపిక పట్టి తన అన్న అమ్నోనును చంపాడు. తర్వాత పారిపోయి గేషూరులో మూడేళ్ళు ఉన్నాడు.
యోవాబు మధ్యవర్తిత్వంతో అబ్షాలోము తిరిగి వచ్చాడు. కానీ దావీదు రెండు సంవత్సరాలు అభ్షాలోము ముఖం చూడలేదు. చివరకు అబ్షాలోము దావీదును కలిశాడు. కానీ ఆ కలయిక అతని హృదయంలో రగిలే కోపాన్ని చల్లార్చలేదు. అబ్షాలోము మిక్కిలి అందంగా ఉండేవాడు. అతని జుట్టు ఇశ్రాయేలు అంతటా ప్రసిద్ధమైంది.
అబ్షాలోము ప్రజల హృదయాలను పన్నాగములతో గెలుచుకున్నాడు. వివాదాలు తీర్పు కోసం వచ్చేవారిని పలకరించి, వారితో మీ వ్యాజ్యాయం మంచిదే , కానీ రాజుకు వినే సమయం లేదు. నేను రాజైతే అందరికీ న్యాయం చేసేవాడిని అనేవాడు, ఆ విధంగా ప్రజల మనసులు మార్చేవాడు . తర్వాత నాలుగు సంవత్సరాలకు అతడు హెబ్రోనులో తిరుగుబాటు ప్రకటించాడు. మొదట మొక్కు తీర్చుకొనుటకు వెళుతున్నానని చెప్పి వెళ్ళాడు. చాలా మంది అతని వెంట వెళ్ళారు. అక్కడ రాజుగా ప్రకటించుకున్నాడు. పరిచారకుడు ఒకడు వచ్చి యిస్రాయేలీయులు అబ్షాలోముతో చేరిపోయారని చెప్పగా, దావీదు మిగిలినవారితో యెరూషలేము వదలి భయంతో వెళ్లిపోయారు.
దావీదు నగ్న పాదాలతో, తల కప్పుకుని, ఏడ్చుకుంటూ ఒలీవ కొండ ఎక్కాడు. ప్రజలు కూడా ఏడ్చారు. మందసాన్ని తీసుకువెళ్ళాలని సాదోకు, అబ్యాతారు వచ్చారు. దావీదు వారిని వెనక్కు పంపాడు: "మందసాన్ని పట్టణానికి తీసుకెళ్ళండి. దేవుడు నన్ను ప్రేమిస్తే, అతడు నన్ను తీసుకువస్తాడు" అని చేప్పాడు. షిమీ ఇక్కడ దావీదును అవమానపరిచాడు.
అబ్షాలోము యెరూషలేముకు వచ్చాడు. అహితోఫెలు అనే దావీదు యొక్క గొప్ప సలహాదారు అబ్షాలోముకు సహాయపడ్డాడు. ఆ ద్రోహం దావీదుకు మిక్కిలి దుఃఖం తెచ్చింది. కానీ దేవుడు అహితోఫెలు సలహాను వ్యర్థం చేశాడు. హూషయి అనే దావీదు స్నేహితుని మాటలు అబ్షాలోమును తప్పుదోవ పట్టించాయి.
యుద్ధం ఎఫ్రాయిము అడవిలో జరిగింది. దావీదు సేనలు అబ్షాలోము సేనలను జయించాయి. పారిపోతున్న అబ్షాలోము జుట్టు ఒక సిందూరపు చెట్టు కొమ్మలో తగులుకుని గాలిలో వేలాడ పడ్డాడు. యోవాబు అతనిని చంపాడు. ఒక కబురంటు వచ్చి దావీదుకు "అబ్షాలోము చనిపోయాడు" అని చెప్పాడు. దావీదు "నా కొడుకా అబ్షాలోమా, నా కొడుకా అబ్షాలోమా! నీ బదులు నేను చనిపోయి ఉంటే బాగుండేది" అని విలపించాడు.
దావీదు చివరి సంవత్సరాలు
అబ్షాలోము తిరుగుబాటు అణచబడిన తర్వాత దావీదు మళ్ళీ యెరూషలేముకు తిరిగి వచ్చాడు. కానీ అతని రాజ్యం మళ్ళీ పూర్తిగా ఐక్యం కాలేదు. మరో తిరుగుబాటు వచ్చింది, అది కూడా అణచబడింది. దావీదు వయసు మళ్ళింది. ఒకసారి ఫిలిస్తియులతో యుద్ధంలో అతడు అలసిపోయాడు. సైనికులు మీరు ఇకపై మాతో యుద్ధానికి రావద్దు, యిస్రాయేలు దీపం ఆరిపోకూడదు అని చెప్పారు.
దావీదు యిస్రాయేలు జనాభా లెక్కించమని యోవాబుకు చెప్పాడు. ఇది దేవుని దృష్టిలో తప్పు, ఎందుకంటే అది దేవుని మీద కాక తన సైన్యబలం మీద నమ్మకం చూపించింది. అందుకు దేవుడు మూడు శిక్షలలో ఒక్కదాన్ని ఎంచుకోమన్నాడు.మొదటిగా ఏడూ సంవత్సరాలు కరువు, రెండవదిగా మూడు నెలలు శత్రువులు తరుముతుండగా పారిపోవుట, మూడవదిగా మూడు రోజుల అంటురోగముల బారిన పడుట, దావీదు మూడు రోజుల అంటురోగమును ఎన్నుకున్నాడు. అపుడు డెబ్భై వేలమంది మరణించారు.
దావీదు దేవుని మందిరం కట్టించాలని చాలా కాలం కోరుకున్నాడు. కానీ దావీదు తన కుమారుడు సొలొమోను కట్టే దేవాలయం కోసం గారు, వెండి, రాగి, ఇనుము, కలప, రాళ్ళు సమకూర్చాడు..
దావీదు మరో కుమారుడు అదోనియా తన అన్నలను, పెద్దలను విందుకు పిలిచి రాజు కాబోతున్నాడని ప్రకటించాడు. కానీ బత్షేబా, నాతాను దావీదు దగ్గరికి వెళ్ళి సొలొమోనే రాజు అవుతాడని మీరే చెప్పారు కదా అని గుర్తుచేశారు. దావీదు సాదోకు యాజకుణ్ణి, నాతాను ప్రవక్తను పిలిచి, సొలొమోనును గిహోనుకు తీసుకెళ్ళి, రాజుగా ఎక్కించి అభిషేకించమని చెప్పాడు. సొలొమోను రాజుగా అభిషేకించబడ్డాడు. దావీదు తన కొడుకు సొలొమోనుకు చివరి ఉపదేశాలు ఇచ్చాడు. నలభై సంవత్సరాలు పరిపాలించిన దావీదు మరణించాడు.
దేవుని హృదయానికి నచ్చిన మనిషి
సమూయేలు గ్రంధంలో దేవుడు దావీదు గురించి చెప్పిన మాట: "అతడు నా హృదయానికి నచ్చినవాడు." ఒక రాజు గురించి కాదు, ఒక యోధుడు గురించి కాదు, ఒక కవి గురించి కాదు – ఒక మనిషి హృదయం గురించి. దావీదు పాపాలు చేశాడు, తప్పులు చేశాడు, కానీ అతని హృదయం ఎల్లప్పుడూ దేవుని వైపే తిరిగింది.
దావీదు జీవితంలోని గొప్పతనం అతని నిష్కళంకత్వంలో లేదు. అతని గొప్పతనం అతని ప్రేమలో ఉంది. రెండు సార్లు సౌలును చంపగలిగినా చంపలేదు. అతడు పశ్చాత్తాపంలో నిజాయితీగా ఉన్నాడు. పాపం చేసిన వెంటనే ఒప్పుకున్నాడు.
యోనాతాను మరణానంతరం, దావీదు యోనాతాను కుమారుడు గురించి అడిగాడు. మెఫీబోషెతు రెండు పాదాలూ అంగవైకల్యంతో ఉండేవాడు. దావీదు అతన్ని రాజ మందిరానికి పిలిపించి,సౌలు భూమి అతనికి ఇచ్చాడు. అతన్ని తనతోనే తినమని చెప్పాడు. దావీదు నలభై సంవత్సరాలు పరిపాలించాడు. అతని అత్యంత గొప్ప విజయం రాజ్యం కాదు, యుద్ధాలు కాదు.
దేవునిముందు సాక్షిగా జీవించాడు. కష్టాలలో, సంతోషాలలో, పాపాలలో, పశ్చాత్తాపంలో అతడు దేవుణ్ణి వెదుకుతూనే ఉన్నాడు.
బేత్లెహేము సందుల్లో నడిచిన ఒక చిన్న పిల్లవాడు, అడవులలో గొర్రెలను కాచిన ఒక కాపరి, దేశాన్ని ఐక్యపరచిన ఒక రాజు, కీర్తనలు పాడిన ఒక కవి. ఆయన రాసిన కీర్తనలలో వేల సంవత్సరాలు గడిచినా, దావీదు పాటలు మారుమోగుతూనే ఉన్నాయి
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి