కార్మెల్ మాత మరియు ఉత్తరీయం ప్రాముఖ్యత | Our Lady of Mount Carmel| కార్మెల్ శోభ
కార్మెల్ మాత - ఆమె ప్రాముఖ్యత
పరిచయం
ప్రతి సంవత్సరం జూలై 16న
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది కాథలిక్ విశ్వాసులు కార్మెల్ మాత పండుగను వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా కర్మెలీయ సన్యాస కుటుంబానికి
చెందిన సన్యాసులు, సన్యాసినులు, ఉత్తరీయం
ధరించే సామాన్య విశ్వాసులు ఈ పండుగను తమ
ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన దినంగా భావిస్తారు. ప్రపంచంలోని అనేక
దేశాలలో ఈ దినాన ప్రత్యేక ఊరేగింపులు, దివ్య పూజలు,
ఉత్తరీయం ఆశీర్వాద
కార్యక్రమాలు నిర్వహించబడతాయి. భారతదేశంలో, ముఖ్యంగా
కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
రాష్ట్రాలలో కూడా ఈ పండుగను అనేక కర్మెలీయ దేవాలయాలలో, మఠాలలో
భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
అయితే, కార్మెల్ మాత' అనే మాత ఎక్కడి నుండి వచ్చింది? ఈ మాటకు , ఆ చిన్న కాఫీ రంగు వస్త్రం (స్కాపులర్)కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? కర్మెలీయ సన్యాస కుటుంబం ఎలా ఆరంభమైంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే, మనం మూడు వేల సంవత్సరాల క్రితం నాటి బైబిల్ చరిత్రలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఈ వ్యాసంలో కార్మెల పర్వతం యొక్క బైబిల్ నేపథ్యం నుండి, మధ్యయుగపు సన్యాస కుటుంబ ఆవిర్భావం వరకు, సెయింట్ సైమన్ స్టాక్ దర్శనం నుండి, నేటి ఆధునిక భక్తి పద్ధతుల వరకు గల పూర్తి ప్రయాణాన్ని తెలుగులో వివరంగా, లోతుగా తెలుసుకుందాం.
కార్మెల్ పర్వతం — బైబిల్ చారిత్రక నేపథ్యం
కార్మెల్ పర్వతం ఇశ్రాయేలు దేశంలో, మధ్యధరా
సముద్ర తీరానికి సమీపంలో, హైఫా నగరానికి దగ్గరగా ఉన్న ఒక పొడవైన
పర్వత శ్రేణి. హీబ్రూ భాషలో 'కర్మెల' అనే
పదానికి 'దేవుని ద్రాక్షతోట' లేదా 'సారవంతమైన తోట' అని
అర్థం. ఈ పర్వతం తన పచ్చదనానికి, సౌందర్యానికి, సారవంతమైన
నేలకు పురాతన కాలం నుండి ప్రసిద్ధి చెందింది. పాత నిబంధన కాలం నుండి ఈ పర్వతం
సౌందర్యానికి, శక్తికి, దేవుని
సన్నిధికి చిహ్నంగా పరిగణించబడింది. పరమగీతం గ్రంథంలో, యెషయా,
యిర్మీయా వంటి ప్రవక్తల గ్రంథాలలో కూడా కర్మెల పర్వతం సౌందర్యానికి,
సమృద్ధికి ఉదాహరణగా ప్రస్తావించబడింది.
అయితే, ఈ
పర్వతానికి అత్యంత ప్రసిద్ధి తీసుకువచ్చినది ఏలీయా ప్రవక్త జీవితంలో జరిగిన ఒక
అద్భుతమైన సంఘటన. ఇశ్రాయేలు రాజు అహాబు, అతని భార్య యెసేబెలు,
ప్రజలను బాలు దేవత ఆరాధన వైపు మళ్ళించినప్పుడు, ఏలీయా ప్రవక్త ఒంటరిగా నిలబడి, నిజమైన
దేవుడు ఎవరో నిరూపించడానికి కార్మెల్ పర్వతంపైనే ఒక సవాలు విసిరాడు (1 రాజులు 18వ
అధ్యాయం). బాలు దేవత ప్రవక్తలు 450 మంది, తమ దేవతను ఎంతగా వేడుకున్నా, వారి బలిపీఠంపై అగ్ని దిగిరాలేదు. కానీ ఏలీయా ప్రార్థించినప్పుడు,
ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి, నీటితో
తడిసిన బలిని కూడా పూర్తిగా దహించివేసింది. దీనిని చూసిన ఇశ్రాయేలు ప్రజలు యావే నిజమైన దేవుడని ఒప్పుకున్నారు.
ఆ తరువాత, దీర్ఘకాలంగా
ఆ ప్రాంతంలో ఉన్న కరువు ముగియాలని, వర్షం కురియాలని ఏలీయా దేవుని
వేడుకున్నాడు. అతడు తన సేవకుడిని ఏడుసార్లు సముద్రం వైపు చూడమని పంపాడు. ఆరుసార్లు
సేవకుడు 'ఏమీ కనిపించడం లేదు' అని చెప్పాడు, కానీ ఏలీయా నిరుత్సాహపడకుండా మళ్ళీ మళ్ళీ
ప్రార్థించాడు. ఏడవసారి, సేవకుడు 'మనిషి
చేతి అరచేయి అంత చిన్న మేఘం' సముద్రం నుండి లేస్తున్నట్లు చూశాడు. ఆ
చిన్న మేఘం త్వరలోనే ఆకాశమంతా కమ్మేసి, పెద్ద వర్షంగా
మారి, సంవత్సరాల తరబడి ఎండిన భూమిపై సమృద్ధిగా కురిసింది.
ఏడవసారి అతడు, 'ఇదిగో,
మనిషి అరచేయి అంత చిన్న మేఘం సముద్రం నుండి లేస్తున్నది' అని చెప్పెను — 1 రాజులు 18:44
కర్మెలీయ సంప్రదాయంలో, ఈ చిన్న మేఘం పరిశుద్ధ కన్యామరియ మాతకు సూచనగా శతాబ్దాలుగా ధ్యానించబడింది. ఏలీయా చూసిన ఆ చిన్న మేఘం సముద్రం నుండి, అంటే మానవ కళ్ళకు ఏ మాలిన్యం అంటకుండా, స్వచ్ఛంగా లేచింది. అదే విధంగా, మరియ మాత కూడా జన్మతః పాపమాలిన్యం అంటకుండా, పరిశుద్ధంగా ఉద్భవించిందని కర్మెలీయ ఆధ్యాత్మికవేత్తలు బోధించారు. ఆ మేఘం తెచ్చిన వర్షం భూమిని సారవంతం చేసినట్లే, మరియ ద్వారా వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తు, పాపము వలన ఎండిపోయిన మానవ హృదయాలపై దేవుని కృపావర్షంగా కురిసాడని వారు వ్యాఖ్యానించారు. ఈ లోతైన ప్రతీకాత్మక అనుసంధానం వలననే కార్మెల్ పర్వతానికి, పరిశుద్ధ కన్యామరియకు మధ్య విడదీయరాని ఆధ్యాత్మిక బంధం ఏర్పడింది.
తొలి సన్యాసులు — కార్మెల్ సన్యాస కుటుంబం ఆరంభం
పన్నెండవ శతాబ్దం చివరిలో, సిలువ యుద్ధాల (Crusades) కాలంలో, కొందరు క్రైస్తవ యాత్రికులు, సైనికులు, తీర్థయాత్రికులు కర్మెల పర్వతంపైకి వచ్చారు. యుద్ధాల భయానకతను,
లోకపు గందరగోళాన్ని చూసిన వీరిలో కొందరు, ప్రవక్త
ఏలీయా మాదిరిని అనుసరిస్తూ, లోకాన్ని పూర్తిగా విడిచి ఏకాంత
జీవితాన్ని ఎంచుకున్నారు. వారు కార్మెల్ పర్వతంలోని సహజ గుహలలో నివసిస్తూ, నిరంతర ప్రార్థనలో, ధ్యానంలో, మౌనంలో,
కఠోర తపస్సులో జీవించారు. ఆహారం కొరకు వారు చుట్టుపక్కల చిన్న తోటలు
పండించుకుంటూ, రోజంతా దేవుని సన్నిధిలో గడిపేవారు.
ఈ తొలి సన్యాసులు తమ చిన్న సన్యాసాశ్రమానికి
మధ్యలో ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించుకొని, దానిని
పరిశుద్ధ కన్యామరియకు అంకితం చేశారు. వారు తమను తాము 'కార్మెల్ పర్వతంపై నివసించే పరిశుద్ధ కన్యమరియ సోదరులు'
అని పిలుచుకున్నారు, మరియు ఆమెను తమ ప్రత్యేక పోషకురాలిగా,
తల్లిగా, ఆధ్యాత్మిక మాతృకగా స్వీకరించారు. వారికి మరియ మాత కేవలం ఒక పూజ్యనీయ వ్యక్తి మాత్రమే కాదు,
తమ సన్యాస కుటుంబానికి నిజమైన 'ఇంటి
యజమానురాలు' అనే భావన వారిలో బలంగా ఉండేది.
13వ శతాబ్దం ఆరంభంలో, యేరూషలేము పాట్రియార్క్ అయిన పునీత ఆల్బర్ట్, ఈ సన్యాసుల కొరకు ఒక అధికారిక నియమావళి (Rule of Life) రూపొందించాడు. ఈ నియమావళి మౌనం, ఏకాంతం, పేదరికం, నిరంతర ప్రార్థనలపై గట్టి ప్రాధాన్యతనిచ్చింది, మరియు ఇది నేటికీ కర్మెలీయ సన్యాస జీవితానికి పునాదిగా నిలిచింది. అయితే, ముస్లిం సైన్యాల దాడులు తీవ్రమవడంతో, 13వ శతాబ్దం మధ్యలో ఈ సన్యాసులు కార్మెల్ పర్వతంలో సురక్షితంగా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు క్రమంగా పరిశుద్ధ భూమిని విడిచి, సముద్ర మార్గం ద్వారా ఐరోపాకు వలస వెళ్ళవలసి వచ్చింది. వారు తమతో పాటు కార్మెల్ మాత భక్తిని, తమ ఆధ్యాత్మిక వారసత్వాన్ని కూడా ఐరోపా అంతటా తీసుకువెళ్ళారు, తద్వారా ఈ చిన్న సన్యాస సమూహం క్రమంగా ప్రపంచవ్యాప్త సన్యాస కుటుంబంగా విస్తరించింది.
పునీత సైమన్ స్టాక్ మరియు పవిత్ర ఉత్తరీయ వరం
కర్మెలీయ సన్యాసులు ఐరోపాకు వచ్చిన
తరువాత, స్థానిక సంఘాల నుండి కొంత వ్యతిరేకతను,
సందేహాన్ని ఎదుర్కొన్నారు. వారు 'పరిశుద్ధ
భూమి నుండి వచ్చిన కొత్త, అపరిచిత సన్యాస కుటుంబం'గా భావించబడేవారు, మరియు అప్పటికే స్థిరపడిన ఫ్రాన్సిస్కన్,
డొమినికన్ సన్యాస కుటుంబాల మధ్య తమకంటూ ఒక స్థానం సంపాదించుకోవడం
వారికి కష్టతరంగా ఉండేది. కొన్ని ప్రాంతాలలో వారికి మఠాలు నిర్మించుకోవడానికి,
కొత్త సభ్యులను చేర్చుకోవడానికి కూడా అనుమతి నిరాకరించబడింది. సభలో చాల
గందరగోళ పరిస్థితి నెలోకొన్నది.
ఈ తీవ్ర కష్టకాలంలో, ఆంగ్లేయుడైన పునీత సైమన్
స్టాక్ అనే వృద్ధ కర్మెలీయ సన్యాసి, తమ సన్యాస కుటుంబం
మనుగడ కొరకు పరిశుద్ధ మరియ మాతను రాత్రింబవళ్ళు హృదయపూర్వకంగా వేడుకున్నాడు. అతడు
ఆమెను తమ కుటుంబానికి ఏదైనా ప్రత్యేక సహాయం, ఒక
ప్రత్యేక చిహ్నం ఇవ్వమని మనసారా ప్రార్థించాడు.
సంప్రదాయం ప్రకారం, 1251వ సంవత్సరం జూలై 16న, ఇంగ్లాండులోని
కేంబ్రిడ్జి పట్టణంలో, పరిశుద్ధ మరియ మాత దేవదూతల సమూహంతో పునీత సైమన్ స్టాక్కు దర్శనమిచ్చింది. ఆమె తన చేతిలో కాఫీ
రంగు స్కాపులర్ (రెండు చిన్న వస్త్ర
ముక్కలు ఒక దారంతో కలిపి, ఛాతీపై ఒక భాగం, వీపుపై
మరొక భాగం ఉండేలా భుజాలపై ధరించే వస్త్రం) పట్టుకొని, దానిని
అతనికి అందించింది. ఆమె ఈ మాటలు పలికిందని చెబుతారు: 'ఇది
నీకు, నీ సన్యాస కుటుంబం అందరికీ ఒక ప్రత్యేక గుర్తు, దీనిని విశ్వాసంతో ధరించువారు నిత్య రక్షణకు,
ప్రమాదాల నుండి రక్షణకు నా ప్రత్యేక సంరక్షణలో ఉన్నట్లు భావించవచ్చు.'
ఈ దర్శనం తరువాత, కర్మెలీయ సన్యాసులపై ఐరోపా సంఘాల వైఖరి
క్రమంగా మారింది, అనేక కొత్త మఠాలు స్థాపించబడ్డాయి,
మరియు సన్యాస కుటుంబం స్థిరపడి, వేగంగా
విస్తరించడం ఆరంభమైంది.
ఉత్తరీయం మొదట్లో సన్యాసుల అధికారిక వస్త్రంలో పెద్ద భాగంగా ఉండేది, కానీ కాలక్రమేణా, సామాన్య విశ్వాసులు కూడా చిన్న, సులభంగా ధరించగల పరిమాణంలో స్కాపులర్ను ధరించడం ఆరంభించారు. తద్వారా వారు కూడా కర్మెలీయ ఆధ్యాత్మిక కుటుంబంలో 'మూడవ శాఖ' సభ్యులుగా, పరిశుద్ధ మరియ మాత ప్రత్యేక రక్షణలో జీవించే వారిగా భావించుకున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది విశ్వాసులు ఈ 'బ్రౌన్ స్కాపులర్'ను ధరిస్తున్నారు, మరియు ఇది కాథలిక్ సంఘంలో అత్యంత ప్రాచుర్యం పొందిన భక్తి చిహ్నాలలో ఒకటిగా నిలిచింది.
'కార్మెల్ రాజ్ఞి ' అనే బిరుదు వెనుక ఆధ్యాత్మిక అర్థం
పరిశుద్ధ మరియమాత 'కర్మెల పర్వత రాణి'గా
పిలవడంలో లోతైన ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంది. మొదటిగా, ఇది
ఆమెను కర్మెలీయ సన్యాస కుటుంబానికి ప్రత్యేక తల్లిగా, రక్షకురాలిగా
గుర్తిస్తుంది. ఏ విధంగానైతే ఒక రాజ్యానికి రాణి తన ప్రజలను పరిపాలిస్తూ, పోషిస్తుందో, రక్షిస్తుందో, అదే
విధంగా మరియ మాత తన కర్మెలీయ బిడ్డలను ఆధ్యాత్మికంగా పోషిస్తుంది, నడిపిస్తుంది, కాపాడుతుంది.
రెండవదిగా, మరియ మాతను 'పరిపూర్ణ
ఆధ్యాత్మిక జీవితానికి మాతృక'గా చూపుతుంది. కర్మెలీయ ఆధ్యాత్మికత
మౌనం, ఏకాంతం, నిరంతర
ప్రార్థన, దేవునితో వ్యక్తిగత సాన్నిహిత్యంపై
ఆధారపడి ఉంటుంది. మరియ మాత , తన
జీవితమంతా దేవుని చిత్తానికి పూర్తిగా లోబడి, మౌనంగా,
ధ్యానపూర్వకంగా జీవించింది. లూకా సువార్తలో రెండుసార్లు 'మరియ ఈ సంగతులన్నిటిని తన హృదయంలో
దాచుకొని ధ్యానించుచుండెను' అని వర్ణించబడింది. కనుక ఆమె కర్మెలీయ
సన్యాసులకు, వారి ఆధ్యాత్మిక ప్రయాణానికి పరిపూర్ణ
మాదిరిగా నిలిచింది.
మూడవదిగా, 'రాణి' అనే మాత మరియ మాత పరలోక మహిమను కూడా సూచిస్తుంది. దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో వర్ణించబడిన 'సూర్యుని ధరించిన స్త్రీ' దర్శనం, కర్మెలీయ సంప్రదాయంలో మరియను మాత పరలోక రాణిగా, చీకటి శక్తులపై విజయం సాధించిన స్త్రీగా చిత్రీకరించే బలమైన ప్రతీకగా ఉపయోగించబడింది. ఈ దర్శనంలో స్త్రీ సూర్యుని ధరించి, చంద్రుని పాదాక్రాంతం చేసుకొని, పండ్రెండు నక్షత్రాల కిరీటం ధరించి కనిపిస్తుంది. ఈ చిత్రణ మరియ మాత మహిమను, ఆమె రక్షణ శక్తిని కర్మెలీయ విశ్వాసులకు నిత్యం గుర్తుచేస్తుంది.
ఉత్తరీయ వరాలు - విశ్వాసులకు వాగ్దానాలు
కర్మెలీయ సంప్రదాయంలో, స్కాపులర్తో ముడిపడిన అనేక ఆధ్యాత్మిక వరాలు, వాగ్దానాలు
తరతరాలుగా బోధించబడ్డాయి. మొదటిది, సెయింట్ సైమన్ స్టాక్ దర్శనంలో మరియ మాత ఇచ్చిన వాగ్దానం. స్కాపులర్ను విశ్వాసంతో ధరించి, మరణించే విశ్వాసులకు ఆమె ప్రత్యేక సంరక్షణ, నిత్య
రక్షణ కొరకు మధ్యవర్తిత్వం వహిస్తుందని నమ్మకం. రెండవది, తరువాతి
శతాబ్దాలలో పోప్ జాన్ XXII కాలంలో ప్రచారంలోకి వచ్చిన 'సబ్బాటిన్ వరం' (Sabbatine Privilege) అనే
సంప్రదాయంలో స్కాపులర్
ధరించి, పవిత్రంగా జీవించిన ఆత్మలకు మరణానంతరం
త్వరితగతిన శుద్ధీకరణ కలుగుతుందని బోధిస్తుంది.
అయితే, కర్మెలీయ
ఆధ్యాత్మికవేత్తలు ఎల్లప్పుడూ స్పష్టం చేసినదేమిటంటే, స్కాపులర్
ఎటువంటి 'మంత్రశక్తి' వస్త్రం
కాదు, కేవలం దానిని ధరించినంత మాత్రాన రక్షణ లభించదు. స్కాపులర్ నిజమైన
అర్థం, మరియ మాదిరిని అనుసరించి, పవిత్రమైన,
ప్రార్థనాపూర్వక జీవితాన్ని జీవించాలనే హృదయపూర్వక నిబద్ధతలో ఉంది.
ఇది ఒక బాహ్య చిహ్నం మాత్రమే, వెనుక ఉన్న అంతరంగిక అంకితభావమే నిజమైన ఆధ్యాత్మిక
ఫలాన్నిస్తుంది.
తిరుసభ సంప్రదాయం ప్రకారం, స్కాపులర్ను మొదటిసారి ధరించే ముందు, అధికారికంగా నియమించబడిన యాజకుడు దానిని ఆశీర్వదించి, ఒక చిన్న న ప్రార్థన ద్వారా విశ్వాసిని కర్మెలీయ ఆధ్యాత్మిక కుటుంబంలో చేర్చుకుంటాడు. ఈ చిన్న కార్యక్రమం ద్వారా, ఆ విశ్వాసి కేవలం ఒక వస్త్రాన్ని ధరించడం మాత్రమే కాక, తన జీవితాన్ని కార్మెల్ మాత మార్గదర్శకత్వానికి, ఆమె ఆధ్యాత్మిక కుటుంబానికి అధికారికంగా అంకితం చేసుకుంటాడు. ఒకసారి ఆశీర్వదించి నమోదు చేసిన తరువాత, ఆ ఉత్తరీయం పాతబడినా, మారినా, తిరిగి ఆశీర్వదించవలసిన అవసరం ఉండదు — ఎందుకంటే ఆ నమోదు వ్యక్తికి సంబంధించినది, వస్త్రానికి కాదు.
కర్మెలీయ సాధువులు మరియు మాత భక్తి
కర్మెలీయ సన్యాస కుటుంబం చరిత్రలో గొప్ప
ఆధ్యాత్మికవేత్తలు, సాధువులు కార్మెల్ మాతపై తమ భక్తిని
వ్యక్తం చేశారు. ఆవిలాపూరి తెరేసమ్మ (Teresa
of Ávila), 16వ శతాబ్దంలో కర్మెలీయ సన్యాస సంస్కరణకు నాయకత్వం వహిస్తూ, మరియ మాతను తన ఆధ్యాత్మిక తల్లిగా, మార్గదర్శిగా
భావించింది.
సిలువ యోహాను (John of the Cross), తెరేసమ్మతో కలిసి సంస్కరణ ఉద్యమంలో పాల్గొంటూ, తన ఆధ్యాత్మిక రచనలలో మరియ మాతను విశ్వాసపు చీకటి రాత్రిలో కూడా దేవుని వైపు నడిపించే జ్యోతిగా వర్ణించాడు. అతని ప్రసిద్ధ రచన 'కార్మెల్ పర్వతారోహణ' (Ascent of Mount Carmel) పేరు కూడా ఈ పవిత్ర పర్వతం నుండే ప్రేరణ పొందింది.
భారతదేశంలో, తెలుగు రాష్ట్రాలలో కర్మెల రాణి మాత భక్తి
భారతదేశానికి కర్మెలీయ సన్యాస కుటుంబం
16వ శతాబ్దంలో పోర్చుగీసు మిషనరీలతో పాటు వచ్చింది, మరియు
కేరళ రాష్ట్రంలో లోతైన వేళ్ళూనుకుంది. కాలక్రమేణా, ఈ
ఆధ్యాత్మిక వారసత్వం దేశంలోని ఇతర ప్రాంతాలకు, తమిళనాడు,
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
రాష్ట్రాలకు కూడా విస్తరించింది. నేడు అనేక కర్మెలీయ మఠాలు, దేవాలయాలు,
పాఠశాలలు తెలుగు రాష్ట్రాలలో సేవలందిస్తున్నాయి, మరియు కార్మెల్ మాత భక్తి
తెలుగు కాథలిక్ విశ్వాసుల హృదయాలలో లోతైన స్థానం సంపాదించుకుంది.
తెలుగు కుటుంబాలలో అనేక మంది తమ ఇళ్ళలో కార్మెల్ మాత చిత్రపటాన్ని ఉంచుకొని, ప్రతిరోజూ ప్రార్థన చేస్తారు. చిన్నపిల్లలకు కూడా చిన్న వయస్సులోనే ఉత్తరీయం ఆశీర్వదించి ధరింపజేయడం అనేక తెలుగు కాథలిక్ కుటుంబాలలో ఒక పవిత్ర ఆచారంగా కొనసాగుతోంది. జూలై 16 పండుగ దినాన, అనేక తెలుగు కర్మెలీయ దేవాలయాలలో ప్రత్యేక నవదిన ప్రార్థనలు, దివ్య పూజలు, ఊరేగింపులు ఘనంగా నిర్వహించబడతాయి.
పండుగ, ఆచారాలు, నేటి భక్తి పద్ధతులు
1726వ సంవత్సరంలో, పోప్
బెనెడిక్ట్ XIII, జూలై 16ను కార్మెల్ మాత'
పండుగగా విశ్వవ్యాప్త కాథలిక్ సంఘం మొత్తానికి అధికారికంగా
ప్రకటించాడు. అంతకుముందు ఇది కర్మెలీయ సన్యాస కుటుంబం లోపల మాత్రమే జరుపుకునే
పండుగగా ఉండేది. అప్పటి నుండి, ఈ దినాన ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక దివ్య
పూజలు, ఊరేగింపులు, స్కాపులర్ ఆశీర్వాద కార్యక్రమాలు
నిర్వహించబడుతున్నాయి.
నేడు అనేక మంది విశ్వాసులు ఈ పండుగకు ముందు తొమ్మిది రోజుల నవదిన ప్రార్థన చేస్తారు, స్కాపులర్ను నూతనంగా ఆశీర్వదించుకుంటారు, కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా ఇటలీలో, ఈ దినాన సముద్ర తీర ఊరేగింపులు కూడా నిర్వహించబడతాయి, ఎందుకంటే మత్స్యకారులు కూడా కార్మెల్ మాతను తమ సముద్ర ప్రయాణాలలో రక్షకురాలిగా ప్రార్థిస్తారు. కొన్ని దేశాలలో ఈ దినాన స్కాపులర్ను మొదటిసారి ధరించే వారికి ప్రత్యేక ఆశీర్వాద కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి.
నేటి విశ్వాసులకు ప్రాముఖ్యత
ఆధునిక కాలంలో, జీవితం
వేగవంతంగా, గందరగోళంగా మారిన నేపథ్యంలో, కార్మెల్ మాత భక్తి మనకు మౌనం, ప్రార్థన,
దేవునితో వ్యక్తిగత సాన్నిహిత్యం యొక్క ప్రాముఖ్యతను
గుర్తుచేస్తుంది. సామాజిక మాధ్యమాల శబ్దం, ఉద్యోగ ఒత్తిడులు,
కుటుంబ బాధ్యతల మధ్య, ఏలీయా ప్రవక్త కార్మెల్ పర్వతంపై కనుగొన్న ఆ ఏకాంత మౌన క్షణాలు మనందరికీ
ఎంతో అవసరం.
ఆమె ఉత్తరీయం ధరించడం కేవలం ఒక బాహ్య ఆచారం కాదు, అది మరియ మాత మాతృకను అనుసరించి, దేవుని చిత్తానికి పూర్తిగా లోబడి జీవించాలనే అంతర్గత నిబద్ధతకు చిహ్నం. ఏలీయా ప్రవక్త చూసిన చిన్న మేఘం చివరికి పెద్ద వర్షంగా మారినట్లే, మన చిన్న విశ్వాసం కూడా, మరియ మాత మధ్యవర్తిత్వం ద్వారా, దేవుని సమృద్ధ కృపగా మారుతుందని ఈ పండుగ మనకు బోధిస్తుంది. కార్మెల్ మాత జీవితం, ఆమె పేరుతో ముడిపడిన ప్రతి చిహ్నం, పర్వతం, మేఘం, ఉత్తరీయం ఇవి అన్నీ కూడా విశ్వాసంతో ఓపికగా వేచియుండటం, దేవుని చిత్తానికి పూర్తిగా లోబడటం అనే ఒకే ఆధ్యాత్మిక సందేశాన్ని పదే పదే మనకు గుర్తుచేస్తాయి.
నేటి కర్మెలీయ సన్యాస కుటుంబం — రెండు శాఖలు
శతాబ్దాల చరిత్రలో, కర్మెలీయ సన్యాస కుటుంబం రెండు ప్రధాన శాఖలుగా కొనసాగుతోంది. మొదటిది,
'కర్మెలీయులు' అనే
సభ , ఇది తొలి నియమావళిని కొంత సడలించిన రూపంలో పాటిస్తుంది. రెండవది,
16వ శతాబ్దంలో ఆవిలాపురి తెరేసమ్మ, సిలువ
యోహాను నాయకత్వంలో ఆరంభమైన నిష్పాధుక
కార్మెలీయులు' సభ,
ఇది తొలి నియమావళిని మరింత కఠినంగా, మూలరూపంలో
పాటించాలనే లక్ష్యంతో స్థాపించబడింది.
నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు సభలకు చెందిన సన్యాసులు, సన్యాసినులు, మరియు గృహస్త సభ్యులు (Third Order / Lay Carmelites) కోట్లాది మంది ఉన్నారు, మరియు వారందరూ తమ దైనందిన జీవితంలో ఏలీయా ప్రవక్త మౌనాన్ని, మరియమాత వినయాన్ని ఆదర్శంగా తీసుకుంటూ, ప్రార్థనాపూర్వక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. భారతదేశంలో కూడా ఈ రెండు సభలకు చెందిన మఠాలు, సన్యాస కుటుంబాలు అనేక రాష్ట్రాలలో సేవలందిస్తున్నాయి, యువ సన్యాసులకు ఆధ్యాత్మిక శిక్షణనిస్తూ, కార్మెల్ మాత భక్తిని కొత్త తరాలకు అందిస్తున్నాయి.
ముగింపు ప్రార్థన
ఓ కార్మెల్ మాత , ఏలీయా
ప్రవక్త నుండి నేటి వరకు గల ఆధ్యాత్మిక వారసత్వంలో మమ్మల్ని భాగస్వాములను చేయుము.
నీ ఉత్తరీయపు రక్షణలో మా జీవితాలను
కాపాడుము, మరియు నీ జీవిత ఆదర్శమును అనుసరించి, మౌనంలో,
ప్రార్థనలో దేవుని చిత్తానికి పూర్తిగా లోబడే హృదయాన్ని మాకు దయచేయుమని
మీ కుమారున్నీ వేడుకోనండి. ఆమెన్.
Fr. Amruth Raju Vellaturi, OCD
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment