మత్తయి 10:7-15 అంతరార్థం: పరలోక రాజ్య ప్రకటన మరియు దేవుని పరిచర్య సూత్రాలు| కార్మెల్ శోభ
మత్తయి సువార్త 10:7-15 పరలోక రాజ్య ప్రకటన
పరలోకరాజ్యము సమీపించినదని ప్రకటింపుడు,వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను ఎల్లగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి. ఉచితముగానే ఒసగుడు. మీతో బంగారమును గాని, వెండిని గాని, రాగిని గాని కొనిపోవలదు. ప్రయాణమునకై జోలెనుగాని, రెండు అంగీలనుగాని, పాదరక్షములనుగాని, చేతికర్రను గాని తీసికొని పోవలదు. ఏలయన, పనివాడు తన బత్తెమునకు అర్హుడు. ఏ పట్టణమునుగాని, ఏ పల్లెనుగాని మీరు ప్రవేశించినపుడు అందు యోగ్యుడగు వానిని వెదకి కొనుడు. అచటినుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండుడు. మీరొక యింటిలోనికి ప్రవేశించి నపుడు, ఆ యింటిని దీవింపుడు, ఆ ఇల్లు యోగ్య మైనదైతే మీ శాంతి దాని మీదికి వచ్చును. లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగిచేరును. ఎవడైనను మిమ్ము ఆహ్వానింపక, మీ ఉపదేశములను ఆలకింపక పోయినచో, ఆ ఇంటినిగాని, పట్టణమునుగాని విడిచి పొండు. మీ పాదధూళిని సైతము అచటనే విదిలించి పొండు. తీర్పు దినమున ఆ పురవాసుల గతికన్న సొదొమ గొమొర్రా ప్రజల గతియే మెరుగుగా నుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
మత్తయి సువార్త 10వ
అధ్యాయం దేవుని రాజ్య ప్రణాళికలో అత్యంత కీలకమైన భాగం. దీనిని "ప్రేషిత కార్య
ప్రణాళిక" అని పిలవవచ్చు. అంతకుముందు అధ్యాయంలో యేసుక్రీస్తు ఇశ్రాయేలు
ప్రజలను చూసి, వారు కాపరి లేని గొర్రెలవలె ఉన్నారని
కనికరపడతాడు. "కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందే" అని
శిష్యులతో చెప్పిన వెంటనే, ఆయన 10వ
అధ్యాయంలో తన పన్నెండు మంది శిష్యులను అపొస్తలులుగా పిలిచి, వారికి
అధికారాన్ని ఇచ్చి పరిచర్యకు సిద్ధపరుస్తాడు.
మత్తయి 10:7-15 వచనాలు. ఈ ప్రేషిత ప్రయాణానికి సంబంధించిన ఆచరణాత్మక ఆదేశాలు. ఈ భాగం కేవలం మొదటి శతాబ్దపు యూదయ గ్రామాలకు మాత్రమే కాదు, శతాబ్దాలుగా క్రైస్తవ ప్రేషిత కార్యానికి ఒక ప్రాథమిక నమూనాగా నిలిచింది.
1. చారిత్రక మరియు సాంస్కృతిక నేపథ్యం
మొదటి శతాబ్దపు యూదయ రాజకీయ, ఆత్మీయ స్థితి
యేసుక్రీస్తు కాలంలో, ఇశ్రాయేలు
రోమన్ సామ్రాజ్యం యొక్క కఠినమైన పాలనలో ఉండేది. యూదులు రాజకీయ స్వాతంత్ర్యం కోసం
మరియు ప్రవక్తలు ప్రవచించిన రక్షకుడి రాక కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే,
ప్రజల ఆత్మీయ స్థితి దయనీయంగా ఉంది. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని కేవలం బాహ్య ఆచారాలకే పరిమితం చేసి,
సామాన్య ప్రజలపై మోయలేని భారాలను మోపారు. ఈ నేపథ్యంలో యేసుప్రభువు తన
శిష్యులను పంపి, "పరలోకరాజ్యం సమీపించింది" అని
ప్రకటించమనడం యూదుల గుండెల్లో ఒక నూతన ఆశను రేకెత్తించింది.
ప్రాచీన ఆతిథ్య సంప్రదాయం
యూదుల సమాజంలో, ప్రయాణీకులకు మరియు దైవజనులకు ఆతిథ్యం ఇవ్వడం ఒక పవిత్రమైన మరియు సామాజిక బాధ్యతగా భావించబడేది. సంచార బోధకులు లేదా యాత్రికులు గ్రామంలోకి వచ్చినప్పుడు, స్థానిక ప్రజలు వారిని తమ ఇళ్లకు ఆహ్వానించి, భోజనం మరియు వసతి కల్పించేవారు. యేసుప్రభువు శిష్యులను పంపినప్పుడు ఈ సాంస్కృతిక ఆచారాన్ని పరిగణనలోకి తీసుకున్నాడు. అయితే, నాటి కాలపు గ్రీకో-రోమన్ సంచార తత్వవేత్తలు ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తూ, పెద్ద సంచులతో ప్రయాణించేవారు. యేసుప్రభువు తన శిష్యులను అటువంటి పద్ధతులకు భిన్నంగా, సంపూర్ణ సరళతతో జీవించాలని ఆజ్ఞాపించాడు.
2. ప్రకటించవలసిన సందేశం:దేవుని రాజ్య ప్రకటన
"పరలోకరాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడు."
• ఇది ఒక నిరంతర క్రియ. శిష్యులు తమ దైనందిన ప్రయాణంలో, జీవిత గమనంలో సువార్తను ఒక భాగంగా మార్చుకోవాలి.
• ప్రకటించుడి: దీని అర్థం ఒక రాజు నియమించిన చాటింపు వేయువాడు
రాజ్యాజ్ఞను అధికారపూర్వకంగా ప్రజలకు వినిపించడం. శిష్యులు తమ సొంత ఊహలను లేదా
తత్వాన్ని బోధించకూడదు. వారు కేవలం యేసుప్రభువు తరపున రాయబారులు.
• పరలోకరాజ్యము సమీపించింది: బాప్తిస్మ మిచ్చు యోహాను, యేసుక్రీస్తు ఇద్దరూ ఇదే సందేశంతో తమ పరిచర్యను ప్రారంభించారు. పరలోకరాజ్యం సమీపించింది అనగా, దేవుని పరిపాలన, సార్వభౌమాధికారం మరియు సాతాను శక్తులపై విజయం క్రీస్తు రూపంలో మానవాళి మధ్యకు వచ్చేసింది అని అర్థం.
అధికారము మరియు ఉచిత కృప
" వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను
శుద్ధులను గావింపుడు, దయ్యములను ఎల్లగొట్టుడు. మీరు ఉచితముగా
పొందితిరి. ఉచితముగానే ఒసగుడు. "
• నాలుగు అద్భుత క్రియలు: పరలోకరాజ్యం కేవలం మాటలకే పరిమితం కాలేదు,
అది శక్తితో కూడినదని నిరూపించడానికి యేసు ప్రభువు తన శిష్యులకు ఈ అద్భుతాలు చేసే అధికారమ ఇచ్చాడు. యెషయా గ్రంథంలో రక్షకుడి రాకడకు
చెప్పబడిన గుర్తులు ఇవే.
• కుష్ఠురోగులను శుద్ధి చేయడం: ధర్మశాస్త్రం ప్రకారం కుష్ఠురోగులు
సమాజం నుండి, దేవుని మందిరం నుండి వెలివేయబడేవారు.
వారిని శుద్ధి చేయడం ద్వారా దేవుని రాజ్యం మనుషులను తిరిగి దేవునితో మరియు సమాజంతో
పునరుద్ధరిస్తుందని రుజువైంది.
• మృతులను లేపడం: ఇది ఎలీషా, ఏలీయా వంటి పాత
నిబంధన ప్రవక్తల శ్రేష్ఠమైన పరిచర్యను గుర్తుచేస్తుంది.
• ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి: ఇది పరిచర్యలో అత్యంత
ప్రాముఖ్యమైన నైతిక చట్టం. శిష్యులు పొందిన అధికారం, రక్షణ,
మరియు కృప వారి స్వంత యోగ్యత వల్ల వచ్చినవి కావు; అవి దేవుని ఉచిత బహుమతులు. కాబట్టి, వారు
సువార్తను లేదా స్వస్థత పరిచర్యను వ్యాపారంగా మార్చకూడదు. దేవుని సేవ ఎన్నటికీ ధన
సంపాదనకు సాధనం కాకూడదనే సత్యాన్ని ఇది నొక్కిచేబుతుంది.
3. సేవకుని జీవన విధానం :
విలాసాల నిరాకరణ – సంపూర్ణ విశ్వాసం
" మీతో బంగారమును గాని, వెండిని గాని, రాగిని గాని కొనిపోవలదు. ప్రయాణమునకై
జోలెనుగాని, రెండు అంగీలనుగాని, పాదరక్షములనుగాని, చేతికర్రను గాని తీసికొని పోవలదు. ఏలయన,
పనివాడు తన బత్తెమునకు అర్హుడు."
• డబ్బు మరియు వస్తువులపై నిషేధం: నడుముకట్టులో బంగారం, వెండి, రాగి నాణేలను ఉంచుకోవడం ఆ కాలపు ఆచారం.
యేసు ప్రభువు వాటిని నివారించమన్నాడు.
అలాగే, అదనపు ప్రయాణ సంచి, రెండు అంగీలు, అదనపు
చెప్పులు లేదా చేతికర్రను కూడా సంపాదించుకోవద్దన్నాడు. దీని అర్థం, ప్రయాణం కొరకు కొత్తగా ఎలాంటి అదనపు సామాగ్రిని సమకూర్చుకోకుండా,
ఉన్నవాటితోనే తక్షణమే బయలుదేరాలని అర్థం.
•పనివాడు తన ఆహారమునకు పాత్రుడు: ఇది పాత నిబంధనలోని ధర్మశాస్త్రనికి అనుసంధానమై ఉంది. ఆలయంలో సేవ చేసే లేవీయులు ప్రజల ద్వారా పోషించబడేవారు. అదేవిధంగా, దేవుని పరిచర్య చేసే సేవకులను దేవుడు తన ప్రజల ద్వారా పోషిస్తాడు. సేవకుడు లోకసంబంధమైన భద్రతలపై ఆధారపడకుండా, దేవుని ఆదరణపైనే పూర్తి విశ్వాసం ఉంచాలి. ఈ వచనాన్ని అపొస్తలుడైన పౌలు కూడా తన పత్రికలలో ఉల్లేఖించాడు.
3. ప్రజలతో సంబంధం
ఆత్మీయ వివేచన మరియు శాంతి దీవెన
" ఏ పట్టణమునుగాని, ఏ
పల్లెనుగాని మీరు ప్రవేశించినపుడు అందు యోగ్యుడగు వానిని వెదకి కొనుడు. అచటినుండి
వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండుడు. మీరొక యింటిలోనికి ప్రవేశించి నపుడు, ఆ యింటిని దీవింపుడు, ఆ ఇల్లు యోగ్య మైనదైతే మీ శాంతి దాని
మీదికి వచ్చును. లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగిచేరును."
• యోగ్యుడైన వానిని వెదకుట: ఇక్కడ యోగ్యుడు అనగా ధనవంతుడు లేదా సమాజంలో హోదా ఉన్నవాడు అని
కాదు. దేవుని వాక్యాన్ని, పరలోకరాజ్య సందేశాన్ని అంగీకరించడానికి
సిద్ధంగా ఉన్న ఆత్మీయ దాహం గల హృదయం అని అర్థం.
• అక్కడనే బసచేయుడి: శిష్యులు ఒక ఇంట్లో బస చేసిన తర్వాత, అంతకంటే మంచి వసతి లేదా రుచికరమైన భోజనం దొరికిందని ఇల్లు
మార్చకూడదు. అలా ఇల్లు మార్చడం ఆతిథ్యమిచ్చిన వారిని అవమానించినట్లు అవుతుంది
మరియు పరిచర్య యొక్క ఏకాగ్రతను దెబ్బతీస్తుంది.
• సమాధానము: యూదుల సాంప్రదాయంలో సమాధానం అని పలకరించడం కేవలం ఒక సాధారణ మర్యాదపూర్వక మాట కాదు. అది దేవుని దైవిక ఆశీర్వాదం, ఆరోగ్యం, క్షేమం మరియు రక్షణను ఆ ఇంట ఉంచడం. సువార్తను చేర్చుకునే ఇల్లు ఆ దైవిక శాంతిని పొందుకుంటుంది. ఒకవేళ ఆ ఇల్లు సువార్తను తిరస్కరిస్తే, ఆ దీవెన వ్యర్థం కాదు; అది తిరిగి దేవుని సేవకులకే వస్తుంది. దేవుని వాక్యం ఎన్నటికీ నిష్ఫలంగా తిరిగి రాదనే ప్రవచనానికి ఇది ఒక ఆచరణాత్మక రూపం.
4. తిరస్కరణకు స్పందన మరియు దేవుని తీర్పు
తిరస్కరణకు స్పందన
" ఎవడైనను మిమ్ము ఆహ్వానింపక, మీ ఉపదేశములను ఆలకింపక పోయినచో, ఆ
ఇంటినిగాని, పట్టణమునుగాని విడిచి పొండు. మీ
పాదధూళిని సైతము అచటనే విదిలించి పొండు.
తీర్పు దినమున ఆ పురవాసుల గతికన్న సొదొమ గొమొర్రా ప్రజల గతియే మెరుగుగా
నుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."
• పాదముల ధూళి దులుపుట: చారిత్రకంగా, ఒక
యూదుడు అన్యజనుల ప్రాంతాలకు వెళ్లి తిరిగి పరిశుద్ధమైన ఇశ్రాయేలు దేశంలోకి
ప్రవేశించేటప్పుడు, అన్యజనుల అపవిత్రత తమకు అంటకూడదని
సరిహద్దు వద్ద తమ పాదాల ధూళిని దులుపుకునేవారు. యేసు ఈ చిహ్నాన్ని తన శిష్యులకు
నేర్పాడు. సువార్తను తిరస్కరించే యూదుల పట్టణాలను కూడా అపవిత్రమైనవిగా పరిగణించమని
దీని అర్థం. ఇది కోపంతో చేసే ప్రతీకారం కాదు, కానీ
"మీ నాశనానికి మీరే బాధ్యులు, మా బాధ్యత తీరిపోయింది" అని
ప్రకటించే సాక్ష్యార్థమైన చర్య.
• సొదొమ గొమొఱ్ఱాల కంటే ఘోరమైన తీర్పు: దీనిని వెలుగుకు అనుగుణమైన తీర్పు బాధ్యత అని పిలుస్తారు. సొదొమ గొమొఱ్ఱా ప్రజలు ప్రాకృతిక పాపాలు చేశారు, కానీ వారికి రక్షకుడి సువార్త వినే అవకాశం లభించలేదు. అయితే, యేసు శిష్యుల ద్వారా దేవుని రాజ్యాన్ని ప్రత్యక్షంగా చూసి, అద్భుతాలు గమనించి కూడా తిరస్కరించే పట్టణాలకు లభించిన వెలుగు చాలా ఎక్కువ. ఎక్కువ ఇవ్వబడిన వాని యొద్ద ఎక్కువ అడగబడును. దేవుని కృపను తెలిసికని తృణీకరించడం ఎంత భయంకరమైన తీర్పుకు దారితీస్తుందో ఈ హెచ్చరిక తెలియజేస్తుంది.
5. ఆధ్యాత్మిక అంతరార్థాలు
మత్తయి 10:7-15
వచనాల నుండి నేటి క్రైస్తవ సంఘం మరియు ప్రతి విశ్వాసి నేర్చుకోవలసిన నాలుగు
ప్రాథమిక ఆత్మీయ సత్యాలు ఉన్నాయి:
• ఎ. పరిచర్యకు పునాది: దైవ
అధికారం: శిష్యులు తమంతట తాము పరిచర్యకు వెళ్లలేదు; వారు
యేసు ప్రభువు ద్వారా పంపబడ్డారు. క్రైస్తవ
సేవ అనేది మానవ ఆలోచనల వల్ల లేదా స్వంత వ్యాపార వ్యూహాల వల్ల జరిగేది కాదు. దేవుని
పిలుపు, ఆయన వాక్యము, మరియు
పరిశుద్ధాత్మ ఇచ్చిన అధికారమే నిజమైన సువార్త పరిచర్యకు పునాది.
• బి. ఆర్థిక క్రమశిక్షణ మరియు పవిత్రత: "ఉచితముగా పొందితిరి,
ఉచితముగా ఇయ్యుడి" మరియు "బంగారమును వెండిని
సంపాదించుకొనవద్దు" అనే ఆజ్ఞలు నేటి ఆధునిక శ్రీ సభకు ఒక సవాలు. సువార్తను
వ్యాపారీకరణ చేయడం, ప్రసంగాలను లేదా స్వస్థత ప్రార్థనలను
ధనార్జనకు సాధనాలుగా మార్చడం క్రీస్తు బోదనలకు పూర్తిగా వ్యతిరేకం. సేవకులలో
లోభత్వం ప్రవేశించినప్పుడు పరిచర్య తన ఆత్మీయ శక్తిని కోల్పోతుంది. దేవుని పనిని
దేవుని పద్ధతిలో చేసినప్పుడు, ఆయన అవసరాలను తీరుస్తాడు.
• సి. విశ్వాస యాత్ర మరియు నిరాడంబరత : అదనపు అంగీలు, చెప్పులు వద్దు అనడంలో యేసు శిష్యులకు సరళమైన జీవనశైలిని నేర్పాడు.
భౌతికమైన వనరులు, సంపద, ఆధునిక
సదుపాయాలు ఎక్కువగా ఉన్నప్పుడే సేవ జరుగుతుందనే భ్రమను ఈ వచనాలు పటాపంచలు
చేస్తున్నాయి. పరిచర్యకు కావాల్సింది భౌతిక భద్రత కాదు, దేవునిపై
ఉన్న అచంచలమైన విశ్వాసం.
• డి. సువార్త యొక్క గంభీరత మరియు స్వేచ్ఛా ఎంపిక: దేవుడు మానవునికి స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు. సువార్తను బలవంతంగా ఎవరిపైనా రుద్దకూడదు. సేవకులు సమాధానాన్ని అందించాలి; దానిని స్వీకరించడం లేదా తిరస్కరించడం ప్రజల ఇష్టం. అయితే, ఆ ఎంపికకు తగిన భయంకరమైన ఫలితం ఉంటుందని సొదొము ఉదాహరణ స్పష్టం చేస్తోంది.
6. నేటి ఆధునిక క్రైస్తవులకు ఆచరణాత్మక అన్వయం
ఈ వాక్య భాగంలోని కొన్ని ఆజ్ఞలు ఆ
నిర్దిష్ట సమయానికి మరియు తక్షణ పరిచర్యకు సంబంధించినవి. ఎందుకంటే, సిలువ మరణానికి ముందు యేసు ప్రభువు
తన శిష్యులతో మాట్లాడుతూ పరిచర్య వ్యూహాన్ని మార్చాడు, అప్పుడు సంచియు జోలెయు తీసుకొని వెళ్లవలెనని ఆజ్ఞాపించాడు.
అయినప్పటికీ, దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక మూలసూత్రాలు
నేటికీ మారలేదు. వాటిని మన జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చో చూద్దాం:
• చురుకైన రాజ్య ప్రకటన: నేటి సంఘం కేవలం చర్చి నాలుగు గోడల మధ్య
ఆరాధనలకే పరిమితం కాకూడదు. ప్రతి విశ్వాసి తన దైనందిన జీవితంలో, పొరుగువారి మధ్యక్రీస్తు ప్రేమను, పరలోక
రాజ్య విలువలను మాటల ద్వారా, క్రియల ద్వారా ప్రకటించాలి.
• ఉదార స్వభావం: దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన రక్షణ, సమయం, మరియు ఆర్థిక దీవెనలను మనం స్వార్థంతో
దాచుకోకూడదు. సమాజంలోని పేదలకు, రోగులకు, వెలివేయబడిన
వారికి ఉచితంగా సేవ చేయడానికి మన హృదయాలను తెరవాలి.
•ఆత్మీయ వివేచన: సువార్త పరిచర్యలో లేదా వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో కాలయాపన చేయకుండా, వాక్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న హృదయాలపై ఎక్కువ సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి. నిరాకరణలు ఎదురైనప్పుడు నిరుత్సాహపడకుండా, కోపగించుకోకుండా, ప్రతీకారం దేవుని తీర్పుకు వదిలివేసి ముందుకు సాగాలి.
ప్రార్ధన
ప్రభువా మీరు మీ శిష్యులను ఒక పరిపూర్ణమైన ఆత్మీయ క్రమశిక్షణలో
నడిపించాడు. దేవుని రాజ్య సువార్త అనేది మాటల చాతుర్యం కాదు, అది దైవ శక్తి అని, అది వ్యాపారం కాదు, ఉచిత కృప అని . అది భౌతిక వనరులపై ఆధారపడేది కాదు, దేవుని సంరక్షణపై నడిచే విశ్వాస యాత్ర. అని నేర్పించారు. వారిని
ఆమోదించకపోయిన వారి పనిని మాత్రమే వారు చేయాలని చెప్పారు. మేము కూడా మీ ఆజ్ఞలకు
అనుకూలంగా మీ పరలోక రాజ్యాన్ని ప్రకటిస్తూ, మా
వంతు పరిచర్య చేసేలా దీవించండి. ఆమెన్
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment