ఐదు రొట్టెలు, రెండు చేపలు అద్భుతం | యోహాను 6:1-15 ధ్యానం

 యోహాను 6:1-15 

ఆ పిదప యేసు తిబేరియా అనెడి గలీలియ సరస్సు దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అధ్బుత కార్యములను చూచి గొప్ప జనసముహము ఆయనను వెంబడించేను. యేసు పర్వతమునెక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. యూదుల పాస్క పండుగ సమీపించినది. యేసు కనులేత్తి గొప్ప జనసముహము తన యొద్దకు వచ్చుట చూచి, పిలిప్పుతో వీరు భుజింపవలసిన అహర పదార్ధములను మనమెక్కడ నుండి కొని తెచ్చెదము? అనెను. పిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఏలన, తానేమి చేయబోవుచున్నది ఆయనకు తెలియును. ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైన రెండువందల వరహాల రొట్టెలు కూడ చాలవు అని పిలిప్పు ఆయనకు సమాధానము ఇచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు  సీమోను పేతురు సోదరుడు, అంద్రెయ : ఇక్కడ ఒక బాలుని యొద్ద ఐదు యవ (గోదుమ) రొట్టెలు, రెండు చేపలు కలవు. కాని, ఇంత మందికి ఇవి ఏమాత్రము? అని పలికెను. యేసు "అందరను భోజనమునకు కూర్చుండబెట్టుడు" అనెను. అచట ఇంచుమించు  ఐదు వేల మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అపుడు యేసు రొట్టెను తీసికొని, ధన్యవాదములు అర్పించి, కూర్చున్న వారికి వడ్డించేను. అట్లే చేపలను కూడ వారికి తృప్తి కలుగునంతగ వడ్డించేను. వారు తృప్తిగా భుజించిన పిదప, యేసు శిష్యులతో "ఏమి వ్యర్ధము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోవు చేయుడు" అని చెప్పెను. వారు భుజించిన పిదప ఐదు యవల రొట్టెలలో మిగిలిన ముక్కలను పండ్రెండు గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ అధ్భుతమును చూచి, వాస్తవముగ ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే" అని చెప్పిరి. ప్రజలు తనను బలవంతముగ రాజును చేయనున్నారని తెలిసికొని, యేసు మరల ఒంటరిగా పర్వతము పైకి వెళ్ళెను. 

ధ్యానము: యేసు ప్రభువు రోగుల పట్ల చేసిన అనేక అద్భుత కార్యములు చూసిన వారు, ఆయనను అనుసరిస్తూ వచ్చారు. ఈ ప్రజలు ఆయన దగ్గరకు అనేక కారణాలతో వచ్చారు. కొంత మంది ఆయన చేసిన అద్భుతాలు చూసి వారు జీవితాలలో కూడా స్వస్థత జరుగుతుంది అని వచ్చి ఉంటారు, కొంతమంది దేవుని వాక్కు వినాలి అని కోరికతో వచ్చి ఉంటారు. కొంత మంది ఈ అధ్బుతాలు చేసే ఆ వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడానికి వచ్చి ఉండవచ్చు. వారు ఎటువంటి కారణాలతో వచ్చిన యేసు ప్రభువు వారిని అదరిస్తున్నారు. అది ఎలాగంటే వారు తినుటకు ఏమి అయిన దొరుకుతుందా అని అడుగుతున్నారు. ప్రభువు ఎప్పుడు కూడా మన అవసరాలు చూసి, వాటిని తీర్చడానికి ఎంతో సహాయపడుతారు. ఇక్కడ యేసు ప్రభువు ప్రజలను చూసి వారు తినుటకు ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నారు. 

పిలిప్పుతో వారు భుజించుటకు కావలసిన ఆహార పదార్ధాలు మనము ఎక్కడ నుండి తీసుకొనిరావాలి అని అడుగుతున్నారు. వారికి సమృద్దిగా ఇవ్వక పోయిన, కొద్ది కొద్దిగా భుజించుటకు అయిన సుమారు రెండు వందల వరహాల రొట్టెలు  అయిన సరిపోవు అని చెబుతున్నారు. పురుషులు మాత్రమే సుమారు ఐదువేల మంది అక్కడ ఉన్నారు. కాని మిగిలిన వారు స్త్రీలు మరియు పిల్లలు కూడా ఉన్నారు, వారిని సహజముగా లెక్క పెట్టారు. విరందరికి సరిపడిన ఆహారం ఇవ్వడం అంటే సాధ్యం కాదు. ఎందుకంటే వారు ఉన్న ప్రదేశం మరియు సమయం కూడా అనుకూలముగా లేదు. కాని యేసు ప్రభువు వారి ఆకలిని చూస్తున్నారు. వారు సమృద్దిగా భుజించాలి అని కోరుకుంటున్నారు. ఎందుకు యేసు ప్రభువు వారి ఆకలి తీర్చాలి అని అనుకుంటున్నారు. యేసు ప్రభువు చేసిన ఏ అధ్భుతము కూడా తన మహిమను తెలియ పరుచుకోవడానికి చేయలేదు. ప్రజల అవసరం గ్రహించి, వారికి అప్పటి అవసరం తీర్చడానికి మాత్రమే చేశారు. ఇక్కడ కూడా ప్రజలు ఎంతో ఆకలితో ఉన్నారు. వారి ఆకలి తీర్చడం చాల అవసరం అక్కడ అందుకే వారి ఆకలి తీర్చడానికి సిద్దపడ్డారు. 

అంద్రేయ ఒక పిల్లవాని దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు కలవు అని చెబుతున్నారు.  అవి ఇంతమండికి ఏ మాత్రము అని చెబుతున్నాడు. అంటే మనము వీరి ఆకలి తీర్చలేము అనే భావనలో ఉన్నాడు.  అక్కడ వేల మంది ప్రజలు  మంది ఉన్నారు. వీరి ఆకలి మాత్రమే యేసు ప్రభువు చూస్తున్నారు.  వారి ఆకలి తీర్చడానికి ప్రభువు ఏమి చేయాలో ఆయనకి తెలుసు అందుకే అందరికీ భోజనానికి కూర్చోమని చెబుతున్నారు. ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను దీవించి యేసు ప్రభువు అందరు తృప్తి పడునంతగ వారికి వడ్డించారు. ఇది కేవలం ఒక అద్భుతము మాత్రమే కాదు. యేసు ప్రభువు మన జీవితాలలో ఉంటే మనకు ఎలా సమృద్ది దొరుకుతుందో మనము తెలుసుకోవచ్చు.  మెస్సీయ్యా వచ్చినప్పుడు అందరూ సమృద్దిగా ఉంటారు మరియు  తృప్తి చెందుతారు అనే ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. సమృద్ది మరియు తృప్తి అనెది యేసు ప్రభువుతోనే సాధ్యం అవుతుంది. 

యేసు ప్రభువు చేసిన ఈ అద్భుతము ఆయనకు తన తండ్రికి ఉన్న సంబంధమును తెలియజేస్తుంది. యేసు ప్రభువు రొట్టెలను పైకెత్తి దీవించిన వాటిని పంచిన అవి అయిపోలేదు ఇంకా పన్నెండు గంపలు మిగిలినవి. అంటే అందరూ భుజించిన ఇంకా రానివారికి, అక్కడ లేని వారికి కూడా మిగిలినవి. యేసు ప్రభువు వద్ద ప్రతిఒక్కరికి స్థానం ఉంటుంది, కేవలం కొంతమందికి లేక ఎన్నుకొన బడినవారికి అంటూ ఏమి ఉండదు. ప్రతి ఒక్కరూ ఆయన వద్ద స్థానం పొందవచ్చు ఆయన నుండి అన్నీ పొందవచ్చు.  ఇక్కడ యేసు ప్రభువు చేసిన ఈ అద్భుతం మన నుండి కూడా సహకారము కావాలి అని అడుగుతుంది. ఏవిధంగా అయితే ఒక చిన్న పిల్లవాడు తన వద్ద ఉన్న ఐదు రొట్టెలను రెండు చేపలను ప్రభువుకు ఇస్తున్నాడో మన వద్ద ఉన్న వాటిని ప్రభువుకు సమర్పించగలిగితే ఆయన మన ద్వారా ఎన్నో అద్బుతములను చేస్తారు. క్రీస్తు అనుచరులుగ మనం ఆయనకు ఎప్పుడు సహకరించాలి. 

యేసు ప్రభువు తన చేసిన స్వస్థతలు లేక అధ్బుతాలు ఏవి కూడా తన మహిమను చూపించడానికి చేయలేదు కేవలం ప్రజలు శ్రేయస్సు , మంచి కోసమే చేయడం జరిగినది. యేసు ప్రభువును ప్రజలు బలవంతముగ రాజును చేస్తున్నారని ఆయన అక్కడ నుండి వెళ్లిపోతున్నారు. ప్రజలలో రానున్న మెస్సీయ్యా , యేసు ప్రభువే అని అనుకున్న ఆయన గడియ వరకు ఆయన వేచి ఉన్నాడు గాని తన మహిమను చూపించాలి అనుకోలేదు, యేసు ప్రభువు నుండి మనం ఈ మాతృకను నేర్చుకోవాలి, ఆయన చేయవలసిన మంచి చేసి ఏమి ఆశించకుండా అక్కడ నుండి వెళ్లిపోతున్నారు. మనం కూడా అలానే ఎప్పుడు మంచి చేస్తూ ఇతరుల నుండి ఏమి ఆశించకుండా ఉండుటకు ప్రయత్నించాలి. 

ప్రార్ధన : ప్రభువా! మీరు మీ జీవితంలో అన్నీ అధ్భుతాలు మానవుని మంచికి, స్వస్థతకు, ఆకలి తీర్చుటకు మాత్రమే చేశారు. మా జీవితములలో కూడా మేము మా గొప్ప తనమును లేక మా ఆధిపత్యం చూపించుటకు కాక ఇతరులకు మంచి చేయడం కోసం పని చేసే మంచి మనసును మాకు ఇవ్వండి. ప్రభువా ! మీరు ఒక చిన్న బాలుడు ఇచ్చిన ఐదు రొట్టెలు రెండు చేపలను అక్కడ ఉన్న వారికి అందరు  సంతృప్తిగా భుజించునట్లు చేశారు. మా దగ్గర ఉన్న కొద్ది కొద్ది మంచి గుణాలను పరిపూర్ణంగా అయ్యేలా దీవించండి. మా జీవితాలలో ఉన్న లేమినంతటిని తీసివేసి సమృద్దిని దయచేయండి. ఆమెన్. 

Fr. Amruth 



Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభౄద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలు అందించడే ఈ బ్లాగ్ లక్ష్యం.

🔪 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నితన పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు