యిర్మీయా 26:11-16,24 మత్తయి 14:1-12 (3 ఆగస్టు 2024)
ఆ కాలమున గలిలీయ ప్రాంత పాలకుడగు హేరోదు యేసు ప్రఖ్యాతిని విని, "ఇతడు స్నాపకుడగు యోహానే. అతడే మృతులనుండి లేచియున్నాడు. కావున, అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి" అని తన కోలువుకాండ్రతో చెప్పెను. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియ కారణముగా యోహానును బంధించి చెరలో వేయించెను. ఏలయన, "ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు" అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను. కాని అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను. హేరోదు జన్మదినోత్సవమున హేరోదియ కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు ఒసగెదను అని అతడు ప్రమాణ పూర్వకముగా వాగ్దానము చేసెను. అపుడు ఆమె తల్లి ప్రోత్సాహమువలన "స్నాపకుడగు యోహాను శిరస్సును ఒక పళ్ళెరములో ఇప్పుడు ఇప్పింపుము" అని అడిగెను. అందుకు ఆ రాజు దుఃఖించెను. కాని, తన ప్రమాణముల కారణముగ, అతిధుల కారణముగ ఆమె కోరిక తీర్చ ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలోనున్న యోహానును శిరచ్చేదనము గావించెను. వారు అతని తలను పళ్ళెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతట యోహాను శిష్యులు వచ్చి అతని భౌతికదేహమును తీసుకొనిపోయి భూస్థాపనము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్లి ఆ విషయమును తెలియజేసిరి.
ప్రియమైన దైవ ప్రజలారా! ఈనాడు మొదటి పఠనంలో మనము యిర్మీయా ప్రవక్తను చూసి, ఆయన చెప్పిన దైవ సందేశాన్ని విని భయంతో, కోపంతో, అసూయతో, గర్వంతో యిర్మీయా ప్రవక్తను చంపివేయాలని యాజకులు ప్రవక్తలు, నాయకులను ప్రజలను రెచ్చగొట్టడం చూస్తున్నాము. ఎందుకంటే యిర్మీయా ప్రవక్త చాలా కఠినమైన సందేశాన్ని వారికి వినిపించారు. ఆ సందేశం ఏమిటంటే వారు వారి మార్గములను, క్రియలను మార్చుకొని దేవునికి విధేయులు కాకపోతే నాశనము చేయబడుదురు. వారి దేవాలయం నాశనము చేయబడుతుంది. పదే పదే ఆయన ప్రజలను హెచ్చరిస్తున్నాడు. యిర్మీయా ప్రవక్త వారిని, మీరు మీ మార్గాలను, మీ పాపపు పనులను మీ గర్వాన్ని వదలిపెట్టి మారు మనసు పొంది దేవునికి విధేయతతో జీవిస్తే మిమ్మి అయన రక్షిస్తాడు, మీ శిక్షను తొలగిస్తాడు అని బోధిస్తున్నాడు. ఈ సంగతులెల్ల మీకు తెలియజేయుటకు ప్రభువు నన్ను పంపాడు అని చెబుతున్నాడు. ఇది విని నాయకులు, ప్రజలు తమ యొక్క నాయకులు ప్రవక్తలతో యిర్మీయాకు మరణ శిక్ష విధించుట తగదు. ఎందుకు అనగా అతడు మన దేవుడైన ప్రభువు పేరు మీదుగా మాట్లాడేను అంటున్నారు.
సువిశేష పఠనంలో మనము స్నాపకుడగు యోహాను గారి శిరచ్చేదనము గురించి వింటున్నాం. యోహాను గారు దైవ సందేశాన్ని భయపడకుండా ధైర్యంతో భోదించినందుకు తన ప్రాణమును కోల్పోయాడు. హేరోదురాజు యేసు ప్రభువుని పేరు ప్రఖ్యాతులను విని ఖచ్చితముగా యోహానే మృతలనుండి లేచి, ఇన్ని అద్భుతశక్తులు కలిగిఉన్నాడు అని తన సేవకులతో చెబుతున్నాడు. యోహాను గారు రాజైన హేరోదుతో నీ సోదరుడగు ఫిలిప్పు భార్యను నీవు ఉంచుకొనుట ధర్మముకాదు అని అధర్మాన్ని ఖండించి, హెచ్చరించాడు. అందువలన హేరోదు యోహానును చంపుటకు నిర్ణయం తీసుకున్నాడు, కాని భయ పడ్డాడు ఎందుకంటే యోహాను నిజమైన దేవుని ప్రవక్త అని హేరోదు అర్ధం చేసుకున్నాడు. యోహానును చరసాలలో బంధించారు. హేరోదియ కూడా యోహాను పట్ల కోపం, ఈర్ష్య ద్వేషంతో యోహానును చంపాలని చూసింది. ఆమె కూతరు హేరోదు రాజును నాట్యంద్వారా మెప్పించి,సంతోష పెట్టినందుకు నీము ఏమి కావాలో కోరుకో అని ప్రమాణం చెయ్యగా తన తల్లి మాట మీదగా స్నాపకుడగు యోహాను తనను ఒక పళ్లెంలో ఇవ్వమని అడిగింది.
హేరోదు తన ప్రమాణము కారణంగా, అతిధుల ముందు మాటను ఇచ్చి ఉండటంవలన ఆమె కోర్కెను తీర్చాడు. దేవుని సత్య సువార్తను ధైర్యంగా బోధించి సత్యంకోసం తన రక్తాన్ని కార్చిన స్నాపకుడగు యోహాను వారి వలె, మనము అధర్మాన్ని ఎదిరించి తప్పును తప్పు అని చెప్పగలమా! ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం భయంతో ఉంటె సత్యానికి, సత్య సువార్తకు సాక్షులుగా ఉండలేం. కనుక యిర్మీయా ప్రవక్త వలె స్నాపకుడగు యోహాను వలె మనము కూడా దేవుని వాక్కుని విని, పాటించి ధైర్యంగా ఏ భయం , ఆందోళన లేకుండా నిజమైన సత్య సువార్తను బోధించుదాం. సత్యానికి సాక్షులుగా నిలబడదాం. సత్యం ధర్మం కొరకు మన ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా వెనుకడుగు వేయకుండా ఉందాం. దేవుడు తన సత్య సువార్తను మన హృదయాలలో నింపి మనలను నడిపించులాగున ప్రార్ధించుదాం.
ప్రార్ధన: సత్య స్వరూపుడైన తండ్రి, మమ్ము మీ సత్య వాక్కుతో నింపుము.మేము అన్ని వేళలలో సత్యానికి సాక్షులుగా జీవిస్తూ సత్య సువార్త బోధిస్తూ, ప్రజలను మీ సత్యపు వెలుగు లోనికి నడిపించడానికి మాకు శక్తిని, బలమును, ధైర్యమును దయచేయుము. తద్వారా ఎన్నో ఆత్మలను రక్షించుటలో మా వంతు బాధ్యతను నెరవేర్చుటకు మీ అనుగ్రహం దయ చేయండి. ఆమెన్
ఫా. సురేష్ కొలకలూరి OCD