నీ పాపములు క్షమింపబడినవి: లూకా 5:17-26 ధ్యానం | కార్మెల్ శోభ

 లూకా 5:17-26 

ఒకనాడు ఆయన బోధించుచుండగా యేరుషలేము, గలిలీయ, యూదయాలోని గ్రామముల నుండి వచ్చిన పరిసయ్యులును, ధర్మశాస్త్ర బోధకులును ఆయన ఎదుట కూర్చుండియుండిరి. స్వస్థతనిచ్చు ప్రభుశక్తి ఆయనయందుండెను. అపుడు కొందరు పక్షవాత రోగినొకనిని పడకపై మోసికొని వచ్చి, ఇంటిలోపల బోధించుచున్న ఆయనచెంతకు చేర్చ ప్రయత్నించిరి. ఆ ఇల్లు జనసమూహముచే క్రిక్కిరిసి ఉన్నందున అది వారికి సాధ్యపడలేదు. అపుడు వారు ఇంటిపైకి ఏక్కి, కప్పును తీసివేసి మంచముతో పాటు రోగిని ఆయన ముందుట దించిరి. యేసు వారి విశ్వాసమును చూచి, "ఓయీ! నీ పాపములు క్షమింపబడినవి" అని అతనితో చెప్పెను. అందుకు పరిసయ్యులు, ధర్మశాస్త్రబోధకులు "దైవ దూషణములు పలికెడి ఇతడెవరు?దేవుడు తప్ప మరెవ్వరు పాపములు క్షమింపగలరు?' అని లోలోన తర్కించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి "మీ హృదయములలో ఏల తర్కించుకొనెదరు? ఏది సులభ్యతరము? నీ పాపములు క్షమింబడినవి అనుటయా? కాని, భూలోకమునయ మనుష్యకుమారునకు పాపములు క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును"అని చెప్పి, పక్షవాత రోగితో "నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పుచున్నాను" అని పలికెను. ఆ పక్షవాత రోగి తక్షణమే లేచి, పడకను తీసుకొని దేవుని స్తుతించుచు తన ఇంటికి వెళ్ళెను. వారందరు ఆశ్చర్యచకితులై భయపడుచు "నేడు మనమెట్టి వింతలను చూచితిమి" అని దేవుని పొగడిరి. 

పరిశీలన : యేరుషలేము, గలిలీయ, యూదయాలోని గ్రామముల నుండి వచ్చిన పరిసయ్యులును, ధర్మశాస్త్ర బోధకులును  యేసు ప్రభువు ఎదుట ఆయన బోధించుచుండగా కూర్చొని ఉన్నారు. ఎందుకు వీరు అక్కడ కూర్చొని ఉన్నారు? ఆయన బోధనలు ఆలకించడానికే వీరు వచ్చారా? ఈ ప్రశ్నలు మనం అడిగినప్పుడు మనకు వచ్చే సమాధానం ఏమిటి అంటే ఆయన మాటలు వినడానికి వారు రాలేదు. వీరు మతపరమైన నాయకులు. వీరు ఎక్కువ సమయాన్ని వారి నియమాల గురించి సంప్రదాయల గురించి మాటలాడేవారు. వారు మనిషి చేసిన నియమాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. కాని దేవుని వాక్కుకు ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. యేసు ప్రభువు బోధనలను వారికీ వ్యతిరేఖముగా ఉన్నవి అని వారు అనుకునేవారు. యేసు ప్రభువు బోధనలను వినడానికి ప్రజలు గుంపులు గుంపులుగా రావడం వారని ఒక రకమైన భయం లోనికి నెట్టింది. కనుక వారు యేసు ప్రభువు మాటలను తప్పు పట్టడానికి, ఎవరెవరు ఆయన మాటలను వింటున్నారని తెలుసుకోవడానికి వస్తున్నారు.  

స్వస్థతనిచ్చు ప్రభుశక్తి ఆయనయందుండెను. యేసు ప్రభువు చేసిన అన్ని  పనులు  దేవుని తోడ్పాటుతో జరుగుతున్నావి. ఆయన చేసిన పనులు మాత్రమే కాదు, ఆయనతో తండ్రి, పవిత్రాత్మ ఎప్పుడు తొడుగానే ఉన్నారు. ఆయన చేసిన ప్రతి పని ఆయన శక్తినే కాదు, దేవుని శక్తి తెలియజేస్తుంది. అందుకే ఆయన చేసే పనులు దైవ కార్యములే. ఆయన మాటలు కూడా దైవ మాటలే. అందుకే ఆయన ఒక మాట చెప్పగానే అది జరుగుతుంది. ఇది ఆదిలో దేవుడు సృష్టిని చేసినప్పుడు ఇలానే జరుగుతుంది. 

కొందరు పక్షవాత రోగినొకనిని పడకపై మోసికొని వచ్చి, ఇంటిలోపల బోధించుచున్న ఆయనచెంతకు చేర్చ ప్రయత్నించిరి. ఆ ఇల్లు జనసమూహముచే క్రిక్కిరిసి ఉన్నందున అది వారికి సాధ్యపడలేదు. అపుడు వారు ఇంటిపైకి ఏక్కి, కప్పును తీసివేసి మంచముతో పాటు రోగిని ఆయన ముందుట దించిరి. ఆనాటి కాలంలో యిస్రాయేలు ప్రజలు ఇళ్ల కప్పును మట్టి మరియు ఎండిన గడ్డితో కలిపిన మిశ్రమంతో చేసేవారు. ఆ కప్పును తీసివేసి పక్షవాత రోగిని ప్రభువు ముందు తీసుకొని వస్తున్నారు. యేసు ప్రభువు ఒక బోధకునిగా వారికి దేవుని గురించి, దైవ రాజ్యం గురించి చెబుతున్నారు.  ప్రజలు అందరు ఆయన బోధనల యందు ఎంత ఆశక్తి కలిగి ఉన్నారో వారికి ఉన్న అనారోగ్య సమస్యలు తీర్చుకోవడానికి కూడా అంతే  ఆసక్తి కలిగి ఉన్నారు. కారణం ఏమిటి అంటే మెస్సీయ్యా కాలంలో జరుగుతుంది అని వారు వినిన అన్ని స్వస్థతలు యేసు ప్రభువు ద్వారా జరుగుతున్నవి. 

యేసు వారి విశ్వాసమును చూచి, "ఓయీ! నీ పాపములు క్షమింపబడినవి" అని అతనితో చెప్పెను. యేసు ప్రభువు ఆ పక్షవాత రోగి విశ్వాసము చూసి కాదు, అతనిని తీసుకొని వచ్చిన వారి విశ్వాసము చూచి ఆ వ్యక్తితో నీ పాపములు క్షమించబడినవి అని అంటున్నారు. యేసు ప్రభువు ఒక మాట అంటున్నారు అంటే అది వెంటనే జరుగుతుంది. ఆయన మాట్లాడిన వెనువెంటనే అది కార్య రూపం దాల్చుతుంది. కనుక ఆ వ్యక్తి పాపములు క్షమించబడినవి. 

ఈ మాటలను వినిన ధర్మ శాస్త్ర బోధకులు, పరిసయ్యులు, ఖచ్ఛితముగా ఇటువంటి మాటలు ఆయన నుండి వచ్చిన వెంటనే ఆయనను తప్పు పట్టాలని అనుకుంటున్నారు. ఇప్పుడు వారికి  యేసు ప్రభువును తప్పు పట్టుటకు ఒక అవకాశం దొరికింది కనుకనే వారు, ఇతను ఎవరు పాపములు క్షమించడానికి, అది దేవుడు మాత్రమే చేయగలడని, దేవుడు చేసే పని, ఇతను తాను చేస్తాను అని అంటున్నాడు అంటే ఇది దైవ దూషణం అని వారు వారిలో వారు తర్కించుకొంటున్నారు. అది గ్రహించిన యేసు ప్రభువు తనకు ఉన్న శక్తిని గురించి చెప్పడమే కాదు. ఆయనకు మానవుని పాపములను క్షమించే అధికారం ఉన్నదని తెలియజేస్తున్నాడు. అది ఎలా అంటే, ఆ వ్యక్తి పాపము వలనే ఆ సమస్య వచ్చినట్లయితే, పాపము తొలగిన వెంటనే తన ఆరోగ్యం పొందగలుగుతాడు.  ఆ వ్యక్తి పాపముల క్షమించబడితేనే  స్వస్థత పొందుతాడు. అందుకే యేసు ప్రభువు "నీ పడకను ఎత్తుకొని ఇంటికి వెళ్లిపో" అని చెబుతున్నాడు. ఆయన చెప్పినట్లే ఆయన చేస్తున్నాడు. దీని ద్వారా యేసు ప్రభువు, దేవుడు చేసిన పనులు చేస్తాడని ఆయన దేవుడని మనకు అర్ధం అవుతుంది. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ప్రభువా! మీరు మొదటి నుండి మీ దైవత్వాన్ని చూపిస్తున్నకాని మేము మాత్రం అనేక అనుమానలతో , అపనమ్మకంతో మీ మిమ్ములను అగౌరపరిచాము. మీమాటలకు, చేతలకు తేడా లేకున్న మేము మాత్రము మీ మాట వెంటనే కార్య రూపం దాల్చుతున్నది అని గ్రహించడంలో విఫలం అయ్యాము. ప్రభువా ధర్మ శాస్త్ర భోదకులు , పరిసయ్యుల వలె, సాంప్రదాయాలకు , మనిషి చేసిన నియమాలకు ప్రాముఖ్యత ఇచ్చి దైవవాక్కును అశ్రద్ద చేశాము. ప్రభువా పక్షవాత రోగిని క్షమించినట్లు, మమ్ములను కూడా క్షమించండి. మేము మీ దైవత్వాన్ని ఎప్పుడు అనుభవిస్తూ మీ అనుగ్రహాలు పొందేలా మమ్ము దీవించండి. ఆమెన్ 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభౄద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలు అందించడే ఈ బ్లాగ్ లక్ష్యం.

🔪 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నితన పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు