20 వ సామాన్య ఆదివారము
హెబ్రీ 12 :- 1 - 4
లూకా 12 :- 49 - 53
ఈ నాటి దివ్య పఠనాలు దేవుని కొరకు జీవిస్తే వారి జీవితంలో ఎదురయ్యే పరిణామాల గురించి తెలియజేస్తున్నాయి.
క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవునికి సాక్షులై జీవిస్తే వారి జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కోవాలి, అదే విధంగా హింసలకు గురి అవ్వాలి ఎన్ని నిందలైన, అవమానాలైన,దైవ శక్తితో ఎదుర్కొని దైర్యంగా నిలబడాలన్నదే ఈ నాటి దివ్య పఠనాల సారాంశం.
చాల సందర్భాలలో మనం దేవునికి సాక్షులుగా జీవించలేము ఎందుకంటె వచ్చే కష్టాలు, నిందలు అవమానాలు శారీరక హింసలు చాలా మందికి ఇష్టం ఉండవు అందుకే మధ్యలోనే విశ్వాసం కోల్పోతారు.
ఈ నాడు మనమందరం కూడా దేవుని కొరకు దైర్యంగా నిలబడటం గురించి ధ్యానించాలి. మనం దైర్యంగా దేవుని కొరకు మరణించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనే అంశం అందరు ధ్యానించాలి.
ఈ నాటి మొదటి పఠనంలో దేవుని కొరకు పని చేస్తున్న యిర్మీయా ప్రవక్త ఎదుర్కొనిన కష్టకాలం గురించి బోధిస్తుంది.
యిర్మీయా ప్రవక్త క్రీస్తు పూర్వం 650 వ సవత్సరంలో 580 మధ్య కాలములో జీవించారు. ఆ కాలములో బాబిలోనీయుల యొక్క రాజ్యం గొప్పగా విస్తరిల్లినది. నెబుకద్నెసరు బాబిలోనియా దేశానికి చెందిన శక్తివంతుడైన రాజు ఆయన క్రీస్తు పూర్వం 587 వ సంవత్సరములో యోహాయాకీమును బందీగా చేసుకొని అతని స్థానములో సిద్కియా అనే వ్యక్తి రాజుగా నియమించారు.
సిద్కియా రాజు ఉన్న సమయంలో యిర్మీయా ప్రవక్త యూదాలో ప్రవచించారు అలాంటి సందర్భంలో రాబోయేటటువంటి వినాశనం గురించి ప్రవక్త ముందుగానే హెచ్చరించారు.
ప్రవక్త సత్యమును బోధించిన సందర్బములో తన సొంతవారే తనకు వ్యతిరేకముగా మారారు. యిర్మీయా ప్రవక్త రాజును బాబిలోనియా రాజు దెగ్గర లొంగిపోమని చెప్పిన సందర్బములో అక్కడి రాజోద్యోగులు ఐగుప్తు రాజు యొక్క సహాయం కోరమని పలికారు దానికి కూడా వ్యతిరేకముగా అక్కడి రాజోద్యోగులు యిర్మీయా రాజద్రోహం చేస్తున్నాడని అతనిని హింసించారు. దైవ శక్తి మీద ఆధారపడకుండా మానవ శక్తి మీద ఆధారపడ్డారు యూదా ప్రజలు.
యిర్మీయా కేవలం దేవుని యొక్క మాటలనే బోధించారు అయినప్పటికీ వారు ప్రవక్త మాటను వినలేదు యిర్మీయా బాబిలోనియా రాజుకు లొంగిపోయి ప్రాణహాని కలగకుండా చూసుకోమని ముందుగానే హెచ్చరించినప్పటికీ కొందరి స్వార్థం వలన ఆయన శారీరక హింసలు పొందాడు.
ప్రవక్త మాటలు దేవుని మాటలైనప్పటికీ అవి వారు గ్రహించలేక పోయారు అందుకే ఆయనను బావిలో పడవేశారు తన జీవితంలో ఎన్నిఇబ్బందులు వచ్చిన సరే యావే దేవుని యొక్క పిలుపును స్వీకరించి ఆయనకు సాక్షమిచ్చారు.
అనేక బాధలు పది ప్రభువుకు నిజమైన సేవకుడిగా నిలిచిపోయాడు యిర్మీయా ప్రవక్తను దేవుడు పిలిచినప్పుడు అతనికి తోడుగా ఉంటానని వాగ్దానం చేసారు కానీ తన జీవితంలో అనేక కష్టాలు అనుభవించారు. తన యొక్క వ్యక్తి గత సువార్త సేవలో యిర్మీయా ప్రవక్త దేవుని యొక్క సేవ ఎట్టి పరిస్థితిలో మానుకోలేదు యిర్మీయా 20 ; 9
ఈ నాడు యిర్మీయా జీవితం ద్వారా మనమందరం కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలి.
1.దేవునికి విధేయతచూపుట: యిర్మీయా దేవుని యొక్క ప్రణాళికలు మాత్రమే యూదా ప్రజలకు ప్రకటించారు దేవుడు చేయమని చెప్పిన వన్నిసక్రమంగా నెరవేర్చారు.
2.సత్యమును ప్రకటించుట:యిర్మీయా ప్రవక్త కేవలం సత్యమునే బోధించాడు, అన్యాయముకు దూరంగా ఉన్నారు. దైర్యంగా దేవుని సత్యం ప్రకటించారు.
3. తిరస్కరణ అంగీకరించుట: దేవుని కొరకు ఎన్ని రకాలైన సవాలులు, నిందలు ఎదుర్కొనటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు తన సొంత ప్రజలే తనను నిరాకరించిన సరే దేవునితో సంతోషమును వెదుకుతూ ముందుకు సాగారు.
4. భయపడకుండుట: తాను పిలిచినా దేవుడు తోడుగా ఉంటారు అనే నమ్మకంతో అదే విధంగా తనను రక్షిస్తారనే ఆశతో యిర్మీయా దేనికి భయపడలేదు. మన జీవితములో కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేనికి కూడా బయపడనవసరం లేదు దేవుడు మనలను ఆదుకుంటారు.
5. ఓర్పు కలిగి జీవించుట: తన యొక్క పరిచర్యలో శ్రమలు అనుభవించే సందర్బములో ఇశ్రాయేలు ప్రజలవలె దేవుడిని దూషించలేదు, దేవుని మనస్సును అర్ధం చేసుకొని అన్ని ఓర్పుతో భరించారు.
యిర్మీయా ఏమి తప్పు చేయనప్పటికీ కష్టాలు అనుభవించారు అది ఆయనకు దేవుని యెడల ఉన్న ప్రేమకు చిహ్నం కాబట్టి ఆయన దేవునికి ఏ విధంగా నైతే సాక్షి అయి జీవించారో మనమందరం అదే విధంగా జీవించాలి.
రెండవ పఠనంలో క్రొత్తగా క్రైస్తవులుగా ,మారిన యూదమతస్తులను బాల పరచటానికి రచయిత క్రీస్తు ప్రభువు యొక్క శ్రమల జీవితం గురించి బోధిస్తున్నారు.
రచయిత క్రీస్తు ప్రభువు యొక్క జీవితం గురించి ఇందుకు తెలుపుచున్నారంటే అప్పటి కాలంలో కొంతమంది యూదులు క్రైస్తవులుగా మారిన యూదులను తిరస్కరించే వారు, వారిని ప్రార్థనా మందిరముల నుండి వెడలగొటే వారు, వారి యొక్క కుటుంబాల నుండి వేరు చేసేవారు కాబట్టి వారిని ప్రోత్సహించుటకు వారి విశ్వాసాన్ని బలపరచుటకు ఈ విధంగా క్రీస్తు ప్రభువును కూడా తిరస్కరించారు మీరు నిరాశకు గురి కాకూడదు అని రచయిత తెలియచేశారు.
క్రీస్తు ప్రభువును కూడా సొంత ప్రజలే నిరాకరించారు కాబట్టి మీ జీవితంలో కూడా తిరస్కరణ ఎదుర్కోవాలి అని తెలిపారు అందుకే మన యొక్క ద్రుష్టి క్రీస్తు ప్రభవు మీద ఉండాలి.
క్రీస్తు ప్రభువు మీద దృష్టిని ఉంచి ఆయన వాలే ముందుకు దైవ చిత్తమును నెరవేర్చ సాగాలి.
క్రీస్తును అనుసరించే సందర్బములో మార్గ మధ్యలో ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా కానీ వాటిని ఆనందముతో తట్టుకొని ముందుకు వెళ్ళాలి అని యూదా మత క్రైస్తవులను ప్రోత్సహించారు.
క్రీస్తు ప్రభువు వలెమనమందరం కూడా దైవమును ప్రేమిస్తూ దేవునికి సాక్షులై జీవించాలి అని రచయిత తెలుపుచున్నారు కాబట్టి ఆయన కొరకు జీవిస్తూ సాక్ష్యమిచ్చి జీవించాలి. మనం దేవుని మీద దృష్టిని ఉంచి ముందుకు సాగాలి మన ద్రుష్టి దేవుని నుండి మరలితే అన్ని కష్టాలు వస్తాయి, సంతోషంగా ఉండదు.
పేతురు గారు ప్రభువును చూస్తూ నడిచినంత సమయం వరకు తాను పడిపోలేదు, ఎప్పుడైతే ప్రక్కకు చూసాడో అప్పుడు మునగ సాగాడు అదే విధంగా మనం క్రీస్తు ప్రభువును చూస్తూ నడిచినంత కాలం మనం దైర్యంగా ముందుకు సాగుతాం కాబట్టి ప్రభువును ఆదర్శంగా చేసుకొని మనం మన యొక్క విశ్వాస జీవితాన్ని జీవించాలి "never lose the sight of God".
ఈ నాటి సువిశేష భాగంలో ప్రభువు రెండు ముఖ్యమైన విషయాలు తెలుపు చున్నారు.1 . ఆయన వచ్చింది నిప్పును అంటించుటకు అని
2 . ఆయన వల్ల విభజన ఏర్పడుతుందని
ఈ రెండు విషయాలు అర్ధం చేసుకొనుటకు మనకి కొంచెం కష్టతరంగా ఉంటుంది కానీ ఆ రెండు మాటలు (అగ్నివిభజన) అర్ధం చేసుకుంటే దానిలోనే నిజమైన క్రైస్తవ జీవితం దాగి ఉన్నది.
పవిత్ర గ్రంధములో అగ్నికి వివిధ రకాలైన అర్దాలున్నాయి.
1 . అగ్ని శుద్ధి చేస్తుంది సంఖ్య 31 : 23 , యెహెఙ్కేలు 22 : 19 - 22 .
2 . అగ్ని దేవుని యొక్క తీర్పుకు గుర్తు మత్తయి 5 : 22 , 18 : 9 , యెషయా 66 : 16 , ఆమోసు 7 : 4 , 2 పేతురు 3 : 7
3 . అగ్ని దేవుని యొక్క మహిమకు గుర్తు యెహెఙ్కేలు 1 : 4 , 13
4 . అగ్ని దేవుని యొక్క సంరక్షణకు గుర్తు 2 రాజు 6 : 17
5 . అగ్ని దేవుని పవిత్రతకు గుర్తు ద్వితీ 4 : 24
6 . అగ్ని పవిత్రతకు గుర్తు అపో 2 : 3
ప్రభువు అగ్నిని అంటించుటకు వచ్చారు అని అన్నారు అంటే అగ్ని ఏవిధంగా ఐతేఅన్నింటిని బయలు పరచి తేట తెళ్లము చేస్తుందో అదే విధంగా క్రీస్తు ప్రభువు కూడా తన యొక్క జీవితం ద్వారా, పరిచర్య ద్వారా మంచి ఏదో, చేదు ఏదో, పాపమేదో, పుణ్యమేదో అనే అంశాలు ప్రజలకు తేట తెల్లము చేశారు. అగ్ని శుద్ధి చేసిన విధంగా ప్రభువు తన యొక్క వాక్కు ద్వారా మనలనుశుద్ధి చేసారు మనలను పవిత్రులుగా, పుణ్యాత్ములుగా చేసారు.
యేసు క్రీస్తు యొక్క మరణం మనమందరం పాపాత్ములం అనే అంశం తెలుపుచున్నది. ఆయన మరణం మనల్నిమనం పాపులుగా తీర్పు చేసేలా ఉంటుంది మనమందరం ఆధ్యాత్మికంగా మరణించిన పాపాత్ములమే కాబట్టి యేసు ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని మనలో క్రొత్త జీవితమును పుట్టిస్తుంది.
అగ్ని మనల్ని ముందుకు వెలుగులాగా నడిపించిన విధంగా క్రీస్తు ప్రభువు యొక్క జీవితం మనల్ని పరలోకమునకు నడిపిస్తుంది.
రెండొవదిగా ప్రభువు ఈ లోకములో విభజన తీసుకొని వస్తున్నారు అంటే ఎవరైతే క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా ఉండాలనుకుంటారో ఎవరైతే సత్యంకోసం జీవిస్తారో వారుఈలోకం నుండి, కుటుంబ సభ్యుల నుండి విభజింపబడతారు.
క్రీస్తు ప్రభువు యొక్క రాక ద్వారా ప్రజలలో విభజన ఏర్పడింది తన కొరకు జీవించే వారు ఒక ప్రక్కన అదేవిధంగా అధికారుల వైపు జీవించే వారు ఒక ప్రక్కకు.
పునీత ఎడిత్ స్టెయిన్ గారు క్రీస్తు ప్రభువు కోసం జీవించే సందర్బములో తన యొక్క కుటుంబ సభ్యులు తనకు వ్యతిరేకముగా మారారు.
సాదు సుందర్ సింగ్ యేసు ప్రభువు కొరకు జీవించే సమయములో ఆయన యొక్క కుటుంబ సభ్యులు ఆయనకు దూరమయ్యారు.
మనం కూడా సత్యం కోసం జీవించేటప్పుడు ఇతరులు అసత్యం కోసం జీవించే సందర్బములో ఇద్దరి మధ్య సంధి కుదరదు అందుకే విభజన వస్తుంది.
ఈ ప్రపంచం కోసం జీవించే వారు క్రీస్తు కొరకు జీవించే వారి మధ్య విభేదాలు వస్తాయి.
కుటుంబాలలో క్రీస్తు ప్రభువు కొరకు జీవించే వారు వేరే మతం కోసం జీవించే వారి మధ్య విభేదాలు వస్తాయి.
మన యొక్క క్రైస్తవ జీవితంలో ప్రభువు కొరకు జీవించే సందర్భాలలో కొన్ని వ్యతిరేకతలు వస్తాయి అయినప్పటికీ మనం దేవునికి సాక్షులుగా జీవించాలి.
దేవుని కొరకు జీవించే దానియేలుకుకష్టాలు ఎదురయ్యాయి దేవుని కొరకు జీవించే ప్రవక్తల జీవితాలలో కష్టాలు ఎదురయ్యాయి.
సైఫాను జీవితములో, ఆపోస్టుల జీవితములో అదే విధంగా తొలి క్రైస్తవుల జీవితములో కూడా కష్టాలు వచ్చాయి ఐన వారు దేవునికి సాక్షులుగా ఉన్నారు మనం కూడా దేవునికి సాక్షులుగా ఉండాలి.
ఫాదర్. బాల యేసు. ఓ సి డి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి