వినయపు రాజు - ఆత్మానుసారమైన జీవితానికి ఇచ్చే విశ్రాంతి | మత్తయి 11:25-30| కార్మెల్ శోభ

 


వినయపు రాజు ఆత్మానుసారమైన జీవితానికి ఇచ్చే విశ్రాంతి  

పఠనాలు: జెకర్యా 9:9-10 | రోమా 8:9, 11-13 | మత్తయి 11:25-30

1. మూడు పఠనాలు - ఒకే సందేశం

ఈనాటి మూడు పఠనాలు వేర్వేరు అంశాలను చర్చిస్తున్నట్టు అనిపించినప్పటికీ, లోతుగా పరిశీలిస్తే ఇవన్నీ ఒకే గొప్ప సత్యాన్ని వివిధ కోణాల నుండి మనకు చూపిస్తాయి.  దేవుని రాజ్యం అనేది  అధికారం, బలవంతం, గర్వం ద్వారా స్థాపించబడదు; అది వినయం, దేవునికి అనుకూలంగా జీవించడం ,  దేవుని మీద పసిపిల్లల నమ్మకం ద్వారా మన హృదయాల్లో స్థాపించబడుతుంది.

దేవుని ముందు మనం ఎంత చిన్నవారమైతే, ఆయన కృప మనలో అంత గొప్పగా పనిచేస్తుంది. జెకర్యా ప్రవచనం మనలను మెస్సీయ్యా రాక కోసం సిద్ధం చేస్తుంది. పౌలు పత్రిక ఆ మెస్సీయ మనలో నివసించడం ద్వారా కలిగే మార్పును వివరిస్తుంది. మత్తయి సువార్తలో స్వయంగా యేసు ప్రభువు మనకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నాడు.

2. వినయపు రాజు (జెకర్యా 9:9-10)

"సీయోను కుమారీ, నీవు మిగుల సంతసింపుము.... నీ రాజు  నీ చెంతకు వచ్చుచున్నాడు. ఆయన వినయాత్ముడై గాడిద పై  ఎక్కి వచ్చును...

జెకర్యా ప్రవక్త బాబిలోను చెరనుండి యూదులు తిరిగివచ్చిన కాలంలో జీవించాడు. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు రాజకీయంగా బలహీనంగా ఉండి, రోమా చక్రవర్తుల్లా, అలెగ్జాండర్ మహారాజులా గుర్రాల దళాలతో, యుద్ధరథాలతో వచ్చే శక్తివంతమైన రాజు కోసం ఆశపడ్డారు. కానీ జెకర్యా ప్రవచించిన రాజు పూర్తిగా భిన్నమైనవాడు. ఆయన "గాడిదపిల్ల"పై స్వారీ చేస్తూ వస్తాడు.

  • గాడిదపిల్ల - వినయానికి సంకేతం: ఆనాటి రాజులు తమ శక్తిని ప్రదర్శించడానికి యుద్ధగుర్రాలను ఉపయోగించేవారు. కానీ గాడిద సామాన్య ప్రజల, రైతుల వాహనం; ఇది శాంతికి సంకేతం. రాబోయే మెస్సీయ శక్తి ప్రదర్శన ద్వారా కాదు, వినయం, కరుణ ద్వారా తన రాజ్యాన్ని స్థాపిస్తాడని దేవుడు దీని ద్వారా తెలియజేశాడు.
  • ప్రవచన నెరవేర్పు: ఈ ప్రవచనం యేసు క్రీస్తు యెరూషలేములోకి గాడిదపిల్లపై స్వారీ చేస్తూ ప్రవేశించినప్పుడు అక్షరాలా నెరవేరింది (మత్తయి 21:5).
  • యుద్ధ సాధనాల నిర్మూలన: "నేను ఇశ్రాయేలు నుండి  రథములను యెరూషలేము  నుండి యుద్ద గుఱ్ఱమును తొలగింతును" అని దేవుడు చెప్తాడు. ఈ కొత్త రాజు కత్తితో కాకుండా, శాంతి ప్రకటన ద్వారా రాజ్యాన్ని స్థాపిస్తాడు.

పునీత అవిలా తెరేసమ్మ తన రచనల్లో, "వినయం అంటే సత్యంలో నడవడమే" అని పదే పదే నొక్కి చెప్పింది. ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించాలంటే, మనం మన బలహీనతను, దేవుని ముందు మన శూన్యతను గుర్తించాలి. యేసు ప్రభువు తన జీవితమంతా ఈ వినయపు రాజరికాన్నే జీవించి చూపాడు. ఆయన పశువుల కొట్టంలో జన్మించాడు, వడ్రంగి కుమారునిగా పెరిగాడు, చివరికి శిష్యుల పాదాలు కడిగి సేవకుడిగా జీవించాడు.

3. ఆత్మానుసారమైన జీవితం (రోమా 8:9, 11-13)

పునీత పౌలు ఈ వాక్యభాగంలో మనకు రెండు జీవన విధానాలను చూపిస్తున్నాడు:

శరీరానుసారమైన జీవితం

దేవుని నుండి వేరుగా, స్వార్థపూరితంగా, పాపముతో జీవించే మానవ స్వభావం.

ఆత్మానుసారమైన జీవితం

పరిశుద్ధాత్మ నడిపింపులో, దేవుని చిత్తానికి లొంగి జీవించే ఆత్మీయ జీవితం.

బాప్తిస్మ సంస్కారంలో మనం క్రీస్తుతో కలిసి చనిపోయి, ఆయనతో కలిసి లేచాము. అందుకే పౌలు, "మృతులలోనుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించుచున్నది" అని చెపుతున్నాడు. మనం మన స్వంత శక్తితో పాపాన్ని జయించడానికి ప్రయత్నించడం లేదు, పునరుత్థాన శక్తి  కలిగిన దేవుని ఆత్మ మనలో పనిచేస్తున్నది.

అయితే, "మీరు శరీరానుసారులై జీవించినచో  తప్పక మరణింతురు" అని పౌలు హెచ్చరిస్తున్నాడు. ప్రతిరోజూ మన స్వార్థాన్ని, గర్వాన్ని, పాపపు కోరికలను సిలువ వేసుకుని, పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వాలి.

పునీత సిలువ యోహాను తన "కార్మెల్ పర్వతారోహణం" గ్రంథంలో దేవునితో పరిపూర్ణ ఐక్యత చెందాలంటే, ఆత్మ తన సొంత కోరికలను, ఇంద్రియ సంతృప్తులను త్యజించాలని, దీనినే "ఇంద్రియాల గాఢాంధకార రాత్రి" అంటారని పేర్కొన్నాడు. ఈ ప్రక్రియ బాధాకరమైనదే అయినా, దీని ఫలితం స్వేచ్ఛ మరియు పరిశుద్ధాత్మ నిండైన జీవితం. పరిశుద్ధాత్మ ఇప్పుడు మనలో నివసిస్తూ, భవిష్యత్తులో మన మర్త్య శరీరాలను కూడా పునరుత్థానం చేస్తుంది.

4. విశ్రాంతినిచ్చే యేసు ఆహ్వానం (మత్తయి 11:25-30)

ఈ వాక్యభాగాన్ని రెండు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు:

 తండ్రికి యేసు ప్రభువు ప్రార్థన

దేవుని రహస్యాలు "జ్ఞానులకును వివేకులకును" కాకుండా "పసిబిడ్డలకు" బయలుపరచబడ్డాయని యేసు ప్రభువు ప్రకటిస్తాడు. దేవుని రాజ్యం మానవ తెలివి, గొప్పతనం ద్వారా కాకుండా, పసిపిల్లల వంటి నమ్మకం, వినయం ద్వారానే అర్థమవుతుంది.

పునీత చిన్న  తెరేసమ్మ తన "చిరు  మార్గం" (Little Way) ద్వారా ఈ వాక్యాన్ని జీవించి చూపింది. ఆమె పెద్ద తపస్సులు, గొప్ప ఆధ్యాత్మిక ఘనకార్యాల కోసం వెతకలేదు; ప్రతి చిన్న విషయంలో తండ్రి  దేవుని ప్రేమపై పూర్తిగా ఆధారపడటాన్ని ఎంచుకుంది.

 యేసు ప్రభువు  ఇచ్చిన గొప్ప ఆహ్వానం

" భారముచె అలసి సొలసి యున్న  సమస్త జనులారా, నా యొద్దకు రండి; మీకు విశ్రాంతి నోసగెదను ."

ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతాయి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, భయాలు లేదా పాపభావన వంటి ఏదో ఒక భారాన్ని మోస్తున్నారు. యేసు ఈ భారాలను మాయం చేస్తానని అనడం లేదు; వాటిని మోయడంలో మనతో పాటు ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు.

  • నా కాడిని  మీరు  ఎత్తికొనుడు: కాడి అనేది రెండు ఎద్దులను కలిపి కట్టే పరికరం. యేసు మనల్ని తన కాడి కిందకు ఆహ్వానిస్తున్నప్పుడు, ఆయన మన పక్కన నిలబడి ఆ భారాన్ని పంచుకుంటాడని అర్థం.
  • సుళువైన కాడి: పరిసయ్యులు తమ అసంఖ్యాకమైన నియమాలతో మతాన్ని భారంగా మార్చారు. యేసు ప్రభువు  తన కాడి సుళువైనదని చెప్తూ, మతాన్ని "దేవుణ్ణి ప్రేమించడం, పొరుగువానిని ప్రేమించడం" అనే సరళమైన సూత్రానికి కుదించాడు.
  • నానుండి  నేర్చుకొనుడు: యేసు ప్రభువు  మనలను తన శిష్యులుగా జీవించమంటున్నాడు. యేసు  ప్రభువు  సాత్వికుడు, దీనమనస్సు గలవాడు. యేసు ప్రభువు దిన మనస్సు మనం ఎక్కడ చూడలేం.

5. వినయం ద్వారా విజయం

ఈ మూడు పఠనాలను కలిపి చూస్తే ఒకే సూత్రం కనిపిస్తుంది: దేవుని రాజ్యం, దేవుని శక్తి, దేవుని విశ్రాంతి అన్నీ వినయం ద్వారానే మనకు దక్కుతాయి. మనం మన స్వంత జ్ఞానం, శక్తిపై ఆధారపడినప్పుడు భారాలతో అలసిపోతాము. కానీ పసిపిల్లల్లా దేవుని ముందు వినయంగా నిలబడినప్పుడు నిజమైన విశ్రాంతి దొరుకుతుంది.

ఎలీయా ప్రవక్త కార్మెల్ పర్వతంపై గొప్ప విజయం సాధించిన తర్వాత, ఎసెబేలు  బెదిరింపుకు భయపడి ఎడారిలోకి పారిపోయాడు. అక్కడ అలసిపోయి, నిస్సహాయుడై దేవుని ముందు తన బలహీనతను ఒప్పుకున్నాడు. అప్పుడే దేవుడు అతనికి ఆహారం ఇచ్చి, విశ్రాంతినిచ్చి, మెల్లని నిశ్శబ్ద స్వరంలో దర్శనమిచ్చాడు.

ఈ మూడు పఠనాలు ఒకే ప్రయాణాన్ని చూపిస్తాయి: జెకర్యా మనకు దూరం నుండి వస్తున్న వినయపు రాజును చూపిస్తాడు. పౌలు మన అంతరంగిక మార్పును సిద్ధం చేస్తాడు. మత్తయి సువార్త మనలను నేరుగా ఆ రాజు సన్నిధిలో నిలబెట్టి, "నా యొద్దకు రండి" అనే  ఆయన స్వరాన్ని వినిపిస్తుంది. అలాగే, ఈ పఠనాలు  తండ్రి, ఆత్మ(పరిశుద్ధాత్మ), కుమారుడు అనే దేవుని జీవితంలోకి మనలను ఆహ్వానిస్తున్నాయి.

6. మన జీవితంలో ఈ సందేశం అర్థం ఏమిటి?

ఈ వాక్యభాగాలు మనలను మూడు లోతైన ప్రశ్నలు అడుగుతున్నాయి.  

1.నేను ఏ రాజును అనుసరిస్తున్నాను? ఈ లోకపు డబ్బు, అధికారం, ఖ్యాతి అనే రాజులనా, లేక వినయపు రాజైన యేసునా?

2.     నేను ఏ ఆత్మ ప్రకారం జీవిస్తున్నాను? నా నిర్ణయాలు, మాటలు శరీరపు స్వార్థం నుండి వస్తున్నాయా, లేక పరిశుద్ధాత్మ నడిపింపు నుండి వస్తున్నాయా?

3.     నేను ఎవరి కాడి కింద నడుస్తున్నాను? నా సొంత భారాలను ఒంటరిగా మోస్తూ అలసిపోతున్నానా, లేక యేసుతో పంచుకుంటున్నానా?

కుటుంబం లేదా సంఘం "శరీరానుసారంగా" జీవించినప్పుడు కలహాలు, అహంకారంతో సంఘం లేక కుటుంబం నిండిపోతుంది. అదే "ఆత్మానుసారంగా" జీవించినప్పుడు క్షమాపణ, సహనంతో ఆ సంఘం లేక కుటుంబం  వృద్ధి చెందుతుంది.

చాలామంది క్రైస్తవులు భయంతో తమ సమస్యలను యేసు ప్రభువుకు పూర్తిగా అప్పగించలేరు. కానీ పునీత అవిలా తెరేసమ్మ అన్నట్టు: "ఏమీ నిన్ను కలవరపెట్టనివ్వకు, ఏమీ నిన్ను భయపెట్టనివ్వకు... దేవుడు ఒక్కడే సరిపోతాడు." ఒక తల్లి, ఒక ఉద్యోగి లేదా పాపభారంతో ఉన్న ఏ వ్యక్తి అయినా తమ బాధ్యతలను, ఆందోళనలను ప్రార్థనలో దేవునికి అప్పగించినప్పుడు ఈ విశ్రాంతిని అనుభవించవచ్చు. నిజమైన జ్ఞానం తలలో కాదు, వినయంతో ఉన్న  హృదయంలో ఉంటుంది.

7. ఆహ్వానం

ఈ పఠనాలు యెహోషువ నాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన సవాలు గుర్తు చేస్తుంది,  ఈరోజు మనకు కూడా ఇది  వర్తిస్తుంది: "మీరు యావేను పూజింప నోళ్లనిచో మరియెవరిని పూజింప గోరుదురో నేడే నిర్ణయించుకొనుడు " (యెహోషువ 24:15).

యేసు ప్రభువు ఇక్కడ ఇచ్చిన  ఆహ్వానం సాధారణమైనది కాదు, అది వ్యక్తిగతమైనది. మన హృదయ నియంత్రణను, యేసు ప్రభువుకు అప్పగించినప్పుడే మనకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. ప్రతి రోజు ఉదయం మనం లేవగానే మనం ప్రభువును ఎవరిని ఎంపిక చేసుకోవాలని, ఏ రాజును అనుసరిస్తాను? ఎవరి కాడిని మోస్తాను? అని నిర్ణయించుకొనుటకు ఆహ్వానిస్తున్నాడు. మనం సమాధానం ఇవ్వాలి.

8.  వినయపు రాజుతో నడక

కార్మెల్ సభ ఆధ్యాత్మిక గురువులైన అవిలా తెరేసమ్మ, సిలువ యోహాను, చిన్న  తెరేసమ్మ మరియు ఎలీయా ప్రవక్త, వీరందరూ స్వీయ శక్తిని విడిచిపెట్టి, దేవుని కృపకు పూర్తిగా లొంగిపోయే మార్గాన్నే నడిచారు.

ఒక రైతు కాడి కింద అనుభవం లేని లేగదూడను, అనుభవజ్ఞుడైన బలమైన ఎద్దుతో జతచేస్తాడు. ఆ లేగదూడ ఒంటరిగా నాగలిని లాగలేదు, కానీ బలమైన ఎద్దుతో కలిపి కట్టబడినప్పుడు, అది క్రమంగా నడవడం నేర్చుకుంటుంది; బలమైన ఎద్దు ఎక్కువ భారాన్ని మోస్తూనే ఉంటుంది.

యేసు ప్రభువు  మనకు సరిగ్గా అలాంటి బలమైన సహచరుడు. మనం ఆయనతో కాడి కింద కట్టబడినప్పుడు, ఆయనే ఎక్కువ భారాన్ని మోస్తాడు. ఈ వారం అంతా ఈ ప్రశ్నను మన  హృదయంలో  అడగాలి అది ఏమిటంటే "నేను ఈరోజు యేసు ప్రభువు  కాడి కింద నడుస్తున్నానా?"

ఆయన తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాడు (ప్రకటన 3:20). మీరు ఆ తలుపు తెరుస్తారా?

9. ప్రార్థన

ప్రభువా! వినయాత్ముడా!

గాడిదపిల్లపై శాంతితో వచ్చిన నా రక్షకుడా, ఈ రోజు నేను నా సొంత శక్తిని, నా సొంత గర్వాన్ని నీ ముందు ఉంచుతున్నాను. నా శరీరపు కోరికలను సిలువ వేసుకుని, నీ పరిశుద్ధాత్మకు నా హృదయాన్ని తెరుస్తున్నాను.

నేను నా భారాలను ఒంటరిగా మోయడం మానుకుంటున్నాను. నీ సాత్వికమైన, దీనమైన కాడిని నేను స్వీకరిస్తున్నాను. ఈ క్షణం నుండి, పసిపిల్లల నమ్మకంతో నిన్ను వెంబడించడానికి నిర్ణయించుకుంటున్నాను.

అవిలా తెరేసమ్మ వలె నీకు పూర్తిగా అప్పగించుకోవడానికి, సిలువ యోహాను వలె నా స్వార్థాన్ని త్యజించడానికి, చిన్న  తెరేసమ్మ వలె పసిపిల్లలా నీపై ఆధారపడటానికి నాకు  మీ కృపను అనుగ్రహించుము. నేనును నా యింటివారును నిన్నే సేవించెదము, ప్రభూ. ఆమేన్.

 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు