బాహ్య ప్రదర్శన వద్దు - ఆంతరిక భక్తే ముఖ్యం! | కొండమీది బోధన | Carmel Shobha
మత్తయి 6:1-6, 16-18
"మనుష్యుల కంట బడుటకై వారి యోదుట మీ భక్తి కార్యములు చేయకుండ జాగ్రత్త పడుడు. లేనియెడల పరలోక మందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బాహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్ధన మందిరములలో, వీధులలోను డాంబికులు చేయునట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయునపుడు నీ కుడిచేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము. అట్లయిన రహస్య కార్యముల నెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము నొసగును." కపట భక్తుల వలె మీరు ప్రార్ధన చేయవలదు. ప్రార్ధన మందిరములలో, వీధుల మలుపులలో నిలబడి, జనులు చూచుటకై ప్రార్ధనలు చేయుట వారికి ప్రీతి, వారికి తగిన ఫలము లభించేనని మీతో వక్కాణించు చున్నాను. ప్రార్ధన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి, తలుపులు మూసికొని అదృశ్యూడై యున్న నీ తండ్రిని ప్రార్ధింపుము. అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము ఒసగును. "మీరు ఉపవాసము చేయునపుడు, కపట వేషధారుల వలె విచార వదనములతో నుండకుడు. వారు పరుల కంట పడుటకై విచార వదనములతో ఉపవాసము ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించేనని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయునపుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. అందు వలన అదృశ్యూడై యున్న నీ తండ్రియే కాని, మరెవ్వరు నీవు ఉపవాసము చేయుచున్నవని గుర్తింపరు. రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బాహుమానమును ఒసగును."
బాహ్య ప్రదర్శన - ఆంతరిక వాస్తవికత
మానవ
చరిత్రలో సంస్కృతులు, నాగరికతలు మారిన మారకుండా స్థిరంగా ఉన్న ఒక బలహీనత – కీర్తి
కాంక్ష. సమాజంలో నలుగురూ నన్ను గుర్తించాలి, నా భక్తిని, నా దాతృత్వాన్ని మెచ్చుకోవాలి అనే తపన మనిషి అంతరంగంలో నిరంతరం ఉన్న కోరిక .
యేసు ప్రభువు ఈ సువిశేష భాగంలో ఈ మానవ
మనస్తత్వం ఎలా ఉండాలో చెబుతున్నారు. ఆధ్యాత్మిక
సాధనలో ముఖ్యమైనవిగా బావించే మూడు
ప్రాథమిక స్తంభాలు ధర్మకార్యాలు, ప్రార్థన, ఉపవాసంను గురిచి
వివరిస్తున్నారు. ఇక్కడ మతం ఎలా ఒక 'నాటక రంగం'గా మారుతుందో, దానిని 'ఆధ్యాత్మిక సంభాషణ'గా ఎలా మార్చుకోవాలో ప్రభువు వివరిస్తున్నారు.
ఈ బోధన
యొక్క ప్రధాన సూత్రం ఒక్కటే: "మనుషులకు కనబడవలెనని వారి యెదుట మీ నీతి
కార్యములను చేయకుండ జాగ్రత్తపడుడి." యేసు ప్రభువు
ఇక్కడ నీతి కార్యాలను (Righteous
Acts) చేయవద్దని
చెప్పడం లేదు; ఆ కార్యాల వెనుక ఉన్న ఉద్దేశాన్ని (Motive) ప్రశ్నిస్తున్నారు. బాహ్యంగా కనిపించే భక్తి
కంటే ఆంతరికంగా ఉండే పవిత్రతే దేవునికి ఇష్టమైనదని ప్రభువు చెబుతున్నారు.
1. దానధర్మాలు:
అహంకార రహిత త్యాగం
చారిత్రక నేపథ్యం మరియు కపటత్వం
యూదా
సంప్రదాయంలో దానధర్మానికి అత్యున్నత స్థానం ఉంది. ఇది కేవలం దయతో చేసే పని కాదు, సామాజిక
న్యాయాన్ని పునరుద్ధరించే ఒక పవిత్రమైన విధి. అయితే, యేసు ప్రభువు కాలం నాటికి ఈ పవిత్ర విధి కాస్తా 'ఆత్మప్రదర్శన'గా రూపాంతరం
చెందింది. సమాజంలో మత పెద్దలుగా చలామణీ అయ్యే పరిసయ్యులు, ధర్మశాస్త్ర
బోధకులు తాము పెద్ద మొత్తంలో ధర్మం చేస్తున్నప్పుడు వీధుల్లో బూరలు ఊదించేవారు.
పేదవాడి ఆకలి తీర్చడం వారి ప్రాధాన్యత కాదు; తాము ఎంత గొప్ప దాతలమో లోకానికి చాటడమే వారి అసలైన లక్ష్యం.
యేసు వీరిని 'కపటవేషధారులు' hypocrites అని పిలిచారు. గ్రీకు రంగస్థలంపై ముసుగులు ధరించి నటించే నటులను ఈ పదంతో
పిలిచేవారు. అంటే, వీరు భక్తులు కారు, భక్తి అనే ముసుగు వేసుకున్న నటులు! వీరి ప్రేక్షకులు దేవుడు కాదు, సమాజంలోని
తోటి మనుషులు.
"కుడిచేయి – ఎడమచేయి" రహస్యం
"నీ కుడిచేయి
చేయునది నీ ఎడమచేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము."
- అహంకారాన్ని
చంపడం: నేను ఒకరికి సహాయం చేశాను
అనే ఆలోచన మన స్వంత మనస్సులోకూడా పుట్టకూడదు. కుడిచేయి చేసేది ఎడమచేతికి
తెలియకపోవడం అంటే, మన అహం ఆ
సత్కార్యాన్ని రికార్డ్ చేయకూడదు.
- కృతజ్ఞతను
ఆశించకపోవడం: సహాయం పొందిన వ్యక్తి మనకు
దాసుడిగా ఉండాలని లేదా ఎల్లప్పుడూ కృతజ్ఞతతో వంగిపోవాలని ఆశించకపోవడమే నిజమైన
ధర్మం.
- ఆత్మస్తుతిని
విడనాడటం: మనం చేసిన సహాయాన్ని మన
మనసులోనే పదే పదే తలచుకుంటూ మనల్ని మనం గొప్పగా భావించుకోకూడదు.
యేసు ప్రభువు ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తారు: లోకపు
మెప్పు కోసం చేసేవారికి ఆ మెప్పే పూర్తి ప్రతిఫలం. పరలోకంలో వారికి ఎలాంటి
బహుమానముండదు. ఎందుకంటే వారు దేవుని మహిమను మనుషుల పొగడ్తలతో సరిపుచ్చుకుంటున్నారు.
2. ప్రార్థన:
హృదయ అంతరాళాల నిశ్శబ్ద సంభాషణ
ప్రార్థన
ప్రార్థన
అనేది సృష్టికర్తతో మనం జరిపే అత్యంత
సాన్నిహితమైన సంభాషణ. కానీ, నాటి సమాజంలో అది కూడా ఒక ప్రదర్శన వస్తువుగా మారింది. నాలుగు రోడ్ల
కూడళ్లలో, ప్రార్థన మందిరాల ముఖద్వారాల వద్ద నిలబడి, చేతులెత్తి, సుదీర్ఘమైన అలంకారిక పదజాలంతో ప్రార్థించడం ఒక
ఫ్యాషన్గా మారింది. జనం చూసి "ఆహా! ఎంతటి దైవభక్తి, ఎంతటి
జ్ఞానము!" అని అనుకోవాలనే తపన వారి ప్రార్థనలను కలుషితం చేసింది. వారి
ప్రార్థన దేవుని సింహాసనాన్ని చేరడానికి బదులు, మనుషుల చెవులను చేరి అక్కడే ఆగిపోయింది.
ఏకాంత గది అనుభవం
"నీవు
ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోకి వెళ్లి, తలుపు వేసి, అదృశ్యుడిగా ఉన్న నీ తండ్రికి ప్రార్థించు."
ఇక్కడ 'గది' అంటే కేవలం
ఇటుకలతో కట్టిన భౌతికమైన గది మాత్రమే కాదు. అది మన 'అంతరంగ
హృదయం'.
నిజమైన
ప్రార్థనకు పెద్ద పెద్ద నిఘంటువుల పదాలు అవసరం లేదు. దేవుని ముందు మన ముసుగులను
తీసేసి, మన బలహీనతలను, పాపాలను ఒప్పుకుంటూ చేసే నిశ్శబ్ద ఆక్రందనే నిజమైన ప్రార్థన. జనుల ముందు
నీతిమంతుడిగా నటించడం చాలా సులువు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని ముందు నిలబడినప్పుడే మన అసలు స్వరూపం
బయటపడుతుంది.
3. ఉపవాసము:
ఆత్మశిక్షణ
ఉపవాసం యొక్క అసలు ఉద్దేశం
ఉపవాసం అనేది
కేవలం అన్నపానీయాలను మానేసే ఒక శారీరక ప్రక్రియ కాదు. అది భౌతికమైన కోరికలను, ఇంద్రియాలను
అదుపులో ఉంచుకుని, ఆత్మ యొక్క ఆకలిని పెంచుకునే ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ (Spiritual
Discipline). ఉపవాసం ద్వారా మనిషి తన శరీరానికి "నువ్వు కాదు, నా ఆత్మ
ప్రధానమైనది" అని స్పష్టం చేస్తాడు. ఇది దేవుని సాన్నిధ్యాన్ని
అనుభవించడానికి, పశ్చాత్తాపపడటానికి చేసే ఒక పవిత్రమైన సాధనం.
విచార వదనాల ప్రదర్శన
కానీ, యేసు ప్రభువు కాలంలోని కొందరు భక్తులు తాము ఉపవాసం
ఉంటున్నామని లోకానికి చాటి చెప్పడానికి ముఖాలు ముడుచుకొని, తలలు
దించుకొని, విచార వదనాలతో తిరిగేవారు. బూడిద పూసుకుని, తాము ఎంతగా దేవుని కోసం త్యాగం చేస్తున్నామో
జనులు చూసి సానుభూతి చూపాలని ఆరాటపడేవారు. ఈ ప్రవర్తన ఉపవాసం యొక్క పవిత్రతనే
అపహాస్యం చేసింది.
ముఖము కడుగుకొని, నూనె రాసుకొనుట: ఒక విప్లవాత్మక మార్పు
"నీవు
ఉపవాసము చేయునప్పుడు మనుష్యులకు కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడునట్లు, నీ తలకు
నూనె రాసుకొని, నీ ముఖము కడుగుకొనుము."
ప్రాచీన
యూదా సంప్రదాయంలో తలకు నూనె రాసుకోవడం, ముఖం కడుక్కోవడం అనేది ఆనందోత్సవాలకు, పండుగలకు చిహ్నం. యేసు ప్రభువు బోధన ప్రకారం, ఉపవాసం అనేది ఒక దుఃఖకరమైన విధి కాదు; అది
దేవునితో గడిపే ఒక సంతోషకరమైన పండుగ. మన త్యాగం పక్కన ఉన్నవారికి కనీసం అనుమానం కూడా రాకూడదు. బాహ్యంగా
చిరునవ్వు చిందిస్తూనే, ఆంతరికంగా దేవునికి దగ్గరవ్వడమే నిజమైన ఉపవాసం.
4. రహస్య
కార్యాలను చూచు దేవుడు
ఈ మూడు
అంశాలలోనూ (దానం, ప్రార్థన, ఉపవాసం) ఒకే ఒక వాక్యం పదే పదే పునరావృతమవుతుంది:
"రహస్యమందు
చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును."
ఈ పునరావృతం
దేవుని యొక్క రెండు ప్రధాన లక్షణాలను మనకు గుర్తుచేస్తుంది:
ఎ) దేవుని అంత తెలుసు అంతటా ఉన్నాడు
మానవుడు
కేవలం బాహ్య రూపాన్ని, పైపై ఆడంబరాలను చూసి మోసపోతాడు. కానీ దేవుడు హృదయాంతరాళాలను పరిశీలించేవాడు.
మనం ఎవరికీ తెలియకుండా చీకటి గదిలో కార్చే కన్నీటి చుక్క అయినా, రహస్యంగా
పేదవాడి చేతిలో పెట్టే నాణెమైనా ఆయన లెక్కిస్తాడు. ఆయన దూరంగా ఉండే ఒక క్రూరమైన
పాలకుడు కాదు; మన ప్రతి అంతర్గత కదలికను గమనించే ప్రేమగల తండ్రి.
బి) ఉద్దేశాల శుద్ధి
మనం చేసే
పని ఎంత గొప్పదైనా, దాని వెనుక ఉన్న ఉద్దేశం స్వార్థపూరితమైనదైతే, దేవుని
దృష్టిలో దానికి ఎటువంటి విలువ లేదు. వంద రూపాయలు దానం చేసి వేల రూపాయల ప్రచారం
కోరుకోవడం వ్యాపారం అవుతుంది కానీ భక్తి అవ్వదు. దేవుడు మన పనుల పరిమాణాన్ని చూడడు, వాటి వెనుక
ఉన్న నాణ్యతను మరియు ఉద్దేశాన్ని చూస్తాడు.
5 ఆధునిక కపటత్వం - ఆంతరిక సత్యం
నేడు ఒక పేదవాడికి ఒక పూట అన్నం పెడుతూ, లేదా ఒక పండు ఇస్తూ పది మంది ఫోటోలు దిగి మీడియాలో పెట్టడం సర్వసాధారణమైపోయింది. సహాయం పొందిన వ్యక్తి యొక్క ఆత్మగౌరవాన్ని బజారున పెట్టి, తన దాతృత్వాన్ని ప్రదర్శించుకునే ఈ సంస్కృతిని యేసు నాడే ఖండించారు. నిజమైన సహాయం కుడిచేయి చేసేది ఎడమచేతికి తెలియకుండా ఉండాలి.
మైకుల ముందు ప్రార్థనలు - అంతరంగ ప్రార్థన: వేదికలపై, కెమెరాల ముందు సుదీర్ఘమైన, భావోద్వేగభరితమైన ప్రార్థనలు చేస్తూ, తాము ఎంతటి భక్తిపరులమో నిరూపించుకోవాలనే తపన నేటికీ కనిపిస్తుంది. కానీ దేవుడు కోరుకునేది ఒంటరి గదిలో కన్నీటి ధారలు.
యేసు ప్రభువు నిజమైన మతం యొక్క స్వభావాన్ని పునర్నిర్వచించారు:
- మతం ఒక
సంబంధం, ప్రదర్శన
కాదు: మతం అనేది దేవునికి, మనిషికి
మధ్య ఉండే అత్యంత వ్యక్తిగతమైన పవిత్ర బంధం. అది సమాజంలో గుర్తింపు
తెచ్చుకునే సాధనం కాదు.
- దేవుని మన తండ్రి : యేసు ప్రభువు దేవుణ్ణి 'రాజు' గానో, 'న్యాయాధిపతి' గానో
మాత్రమే కాకుండా 'తండ్రి' (Abba)
గా
పరిచయం చేశారు.
- నిజమైన
ప్రతిఫలం: మనుషులు ఇచ్చే గౌరవం, కీర్తి
ప్రతిష్ఠలు తాత్కాలికమైనవి. ఈ రోజు పొగిడిన నోళ్లే రేపు విమర్శించవచ్చు. కానీ, దేవుడు
ఇచ్చే ప్రతిఫలం శాశ్వతమైనది. అది అంతర్గత శాంతి, ఆత్మసంతృప్తి
మరియు దైవ సాన్నిధ్యం రూపంలో లభిస్తుంది.
ఆత్మపరిశీలనకు పిలుపు
ఈ వచనాలు
కేవలం చదివి వదిలేసే ఉపదేశాలు కావు; అవి ప్రతి క్రైస్తవున్ని నిరంతరం హెచ్చరించే ఆధ్యాత్మిక
అద్దాలు. ఈ వాక్యాలు మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోమని కోరుతున్నాయి. "నేను చేసే
ప్రార్థనలు, నేను ఇచ్చే విరాళాలు, నేను చేసే ఉపవాసాలు దేవుని ప్రీతి కోసమా? లేక సమాజంలో నా హోదా కోసమా?" అని ప్రతి
ఒక్కరూ తమ హృదయాలను ప్రశ్నించుకోవాలి.
నిజమైన భక్తి అనేది ప్రదర్శన వస్తువు కాదు, అది ఒక
నిశ్శబ్ద జీవన విధానం. బాహ్య ఆడంబరాలు, కపట వేషధారణలు మనుషులను మోసం చేయగలవు కానీ అంతర్యామి అయిన దేవుడిని కాదు.
ఎప్పుడైతే మనిషి లోకపు మెప్పును, ఆశించకుండా, కేవలం దేవుడు ప్రీతి చెందలని జీవించడం నేర్చుకుంటాడో, అప్పుడే నిజమైన
ఆధ్యాత్మిక పరిపక్వత లభిస్తుంది.
ప్రార్థన:
పరలోకమందున్న
మా ప్రియమైన తండ్రీ, బాహ్య
ప్రదర్శనల కంటే హృదయాంతరాళాల పవిత్రతను చూసే మీ ప్రేమను బట్టి మీకు వందనాలు.
ప్రభువా, లోకపు
మెప్పు, కీర్తి
కాంక్ష అనే కపటత్వాన్ని మా నుండి దూరం చేయండి.
మేము
చేసే దానధర్మాలు అహంకారం లేకుండా, కుడిచేయి
చేసేది ఎడమచేతికి తెలియకుండా ఉండేలా సహాయం చేయండి. మా ప్రార్థనలు, ఉపవాసాలు మనుషుల గుర్తింపు కోసం కాక,
మీతో మేము జరిపే
అంతరంగిక, నిశ్శబ్ద
ఆధ్యాత్మిక సంభాషణలుగా మార్చండి.
పైపై
ఆడంబరాలతో మిమ్మల్ని మోసం చేయలేమని గ్రహించి, హృదయశుద్ధితో, వినమ్రతతో మీ ఆమోదాన్ని పొందే
భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ శాశ్వతమైన బహుమానమే మాకు కొండంత ఆశ్రయం. ఆమెన్
Comments
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:
Post a Comment