మత్తయి 15:21-28 వ్యాఖ్యానం: కనానీయ స్త్రీ విశ్వాసం|కార్మెల్ శోభ



మత్తయి 15:21-28 

యేసు అచట నుండి తూరు, సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతె ఆయన వద్దకు వచ్చి, “ప్రభూ! దావీదు కుమారా! నాపై దయచూపుము. నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది” అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక్క మాటైనను మాట్లాడలేదు. అపుడు ఆయన శిష్యులు సమీపించి “ఈమె మన వెంటబడి అరచుచున్నది, ఈమెను పంపివేయుడు” అనిరి. “నేను యిస్రాయేలు వంశమున చెదరిపోయిన గొఱ్ఱెలకొరకు మాత్రమే పంపబడితిని” అని ఆయన సమాధానము ఇచ్చెను. అపుడు ఆమె వచ్చి, ఆయన పాదములపై పడి “ప్రభూ! నాకు సాయపడుము” అని ప్రార్థించెను. “బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయతగదు” అని ఆయన సమాధానమిచ్చెను. అందుకు ఆమె, “అది నిజమే ప్రభూ! కాని తమ యజమానుని భోజనపు బల్లనుండి క్రిందపడిన రొట్టెముక్కలను కుక్క పిల్లలును తినునుగదా!" అని బదులు పలికెను. యేసు ఇది విని “అమ్మా! నీ విశ్వాసము మెచ్చదగినది. నీ కోరిక నెరవేరునుగాక!” అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను.

కనానీయ స్త్రీ విశ్వాసం

తూరు, సీదోను ప్రాంతాలు అన్యుల నివాస స్థలాలు. ఇశ్రాయేలీయుల సంస్కృతికి, ఆరాధనా క్రమానికి దూరంగా ఉన్న అన్యజనుల భూమి అది. అటువంటి ప్రాంతంలో ఒక  కుమార్తె దయ్యము  పట్టి  అలమటిస్తోంది. ఆ బాధను చూస్తున్న తల్లి ఎంతో వేదనతో ఉంది. ఆ  ప్రాంతపు దారిలో ఆ తల్లి  పరుగెత్తుకుంటూ వస్తున్న దృశ్యాన్ని ఒక్కసారి మనసులో నిలిపి చూద్దాం. ఆమె జుట్టు చెదిరిపోయి ఉంది. ఆమె స్వరం బొంగురుపోయేంతగా అరుస్తోంది. వెనుక ఇంటిలో ఆమె కుమార్తె దయ్యం పట్టి కొట్టుకుంటూ, కేకలు వేస్తూ బాధపడుతోంది. ఆ తల్లి హృదయం ఎలా ముక్కలైపోయి ఉంటుందో ఊహించడం కష్టం కాదు. ప్రతి తల్లి  తన తనయుడు లేదా తనయ నొప్పితో బాధపడుతుంటే, తానే ఆ నొప్పిని భరించాలని కోరుకుంటుంది. కానీ ఈ తల్లి తన బిడ్డ బాధను తాను తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఆమెకు ఒకే ఒక ఆశ మిగిలింది.  ఆ ఊరిలోనికి యేసు అనే భోదకుడు వచ్చాడని విన్నది. తాను విన్న ఆ ఇశ్రాయేలు బోధకుడు, "దావీదు కుమారుడు" నా కుమార్తెను స్వస్థపరచగలడెమో అనే ఆశ. కాని ఆయన దగ్గరకు పోవడం కుదురుతుందా?  యూదులకు, అన్యులకు నడుమ తీవ్రమైన వైరుధ్యం  ఉన్న రోజుల్లో, ఒక అన్యస్త్రీగా యూదుల  బోధకుని వద్దకు వెళ్లడం సామాజికంగా ఎంతో ప్రమాదకరం. అయినా, తన బిడ్డపై ఉన్న ప్రేమ ఆమెను ఆ అడ్డంకులన్నీ దాటేలా చేసింది. ఆ తల్లి ప్రేమ గొప్పది అది అనేక అడ్డంకులను, సామాజిక అవరోదలను దాటుకుంటూ ప్రభువు దగ్గరకు వస్తుంది. 

మౌనం అనే అగ్నిపరీక్ష- మొదటి అడ్డంకి 

ఆమె యేసు ప్రభువు దగ్గరకు వచ్చింది.  కేకలు వేసింది. మళ్ళీ మళ్ళీ కేకలు వేసింది. కానీ యేసు ప్రభువు  నుండి ఒక్క మాట కూడా రాలేదు. ఆమె పిలుస్తున్న కొద్ది  ప్రభువు  మౌనం వహించడం  ఆమెకు  ఎంతో  భారంగా అనిపించి ఉంటుంది. ఆమె హృదయంలో సందేహాలు తలెత్తి ఉండవచ్చు: "నేను సరైన మనిషిని అడుగుతున్నానా? నా మాటలు ఆయనకు వినపడుతున్నాయా? నేను అన్యజాతిదాననని ఆయన నన్ను పట్టించుకోవడం లేదేమో?"

మనం కూడా జీవితంలో ఇలాంటి క్షణాలను ఎదుర్కొంటాం. ఆసుపత్రి గదిలో కూర్చుని, పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తూ ప్రార్థించినప్పుడు; ఉద్యోగం పోయి, రేపటి భోజనం బెంగతో మోకరిల్లినప్పుడు; ఏదో పోగొట్టుకున్న  దారిలో నడుస్తుంటే కంటతడి పెట్టుకుని దేవుణ్ణి వేడుకున్నప్పుడు,  దేవుని  నుండి ఏ సమాధానం రానట్టు అనిపించే క్షణాలు మనందరికీ తెలుసు. ఆ మౌనం మనల్ని కృంగదీస్తుంది. "దేవుడు నా మాట వినడం లేదా?" అనే ప్రశ్న మనసును తొలిచేస్తుంది.

కానీ ఈ కనానీయ స్త్రీ కథ మనకు ఒక అమూల్యమైన సత్యాన్ని బోధిస్తుంది. దేవుని మౌనం ఆయన నిర్లక్ష్యానికి గుర్తు కాదు. అది తిరస్కారం అంతకన్నా కాదు. అది ఒక్కోసారి, మన విశ్వాసాన్ని పరీక్షించి, దానిని మరింత స్వచ్ఛంగా, మరింత లోతుగా మలచడానికి ఆయన ఎంచుకునే బాట. కుండ మంటలో కాలినపుడే గట్టిపడుతుంది. బంగారం అగ్నిలో శుద్ధి అవుతుంది. మన విశ్వాసం కూడా, జవాబు రాని ఆ నిశ్శబ్ద క్షణాలలోనే దాని అసలైన బలాన్ని కనుగొంటుంది.

శిష్యుల మాటలు- రెండవ అడ్డంకి 

ఆమెను మరింత గాయపరిచింది ఎవరో తెలుసా? స్వయంగా యేసు శిష్యులు. "ఈమెను పంపివేయుము, ఈమె మన వెంట కేకలు వేస్తోంది" అని వారు విసుక్కున్నారు. ఎంత విషాదకరం! దేవుని దగ్గరకు వెళ్ళే దారిలో, తరచుగా మనకు ఎదురయ్యే మొదటి అడ్డంకి  ఆయన సన్నిహితులమని చెప్పుకునే మనుషుల నుండే వస్తుంది. "నీకు ఈ దీవెన అర్హత లేదు." "నీ గతం చూస్తే నీవు దేవుని ముందుకు రాలేవు." "నీవు ఈ సమాజానికి చెందిన వాడివి కాదు."  ఇలాంటి మాటలు  లోకంలో నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.

కానీ ఆ తల్లి శిష్యుల మాటలకు వెనుదిరగలేదు. ఆమె లక్ష్యం స్పష్టంగా ఉంది.  తన బిడ్డ విడుదల ఆమెకు కావాలి.  ఆ లక్ష్యం ముందు, చుట్టూ వినిపించే నిరాకరణ స్వరాలు ఆమెను ఆపలేకపోయాయి. ఇది మనకు ఒక గొప్ప పాఠం. మన ప్రార్థన లక్ష్యం స్పష్టంగా, నిజాయితీగా ఉన్నప్పుడు, చుట్టూ ఉన్న నిరుత్సాహపరిచే స్వరాలను దాటి ముందుకు సాగే ధైర్యం మనకు లభిస్తుంది.

నేను ఇశ్రాయేలు గొఱ్ఱెల కొరకే పంపబడితిని- మూడవ అడ్డంకి 

యేసు  ప్రభువు మాటలు ఇంకా కఠినంగా అనిపించాయి  "నేను ఇశ్రాయేలులో తప్పిపోయిన గొఱ్ఱెల కొరకు మాత్రమే పంపబడితిని." ఇది ఆమెకు మరో అడ్డంకిలా అనిపించి ఉండవచ్చు. కానీ ఇక్కడ మనం ఆలోచించాలి,  దేవుడు తన సొంత ప్రణాళికను, తన సొంత సమయాన్ని కలిగి ఉంటాడు. కొన్నిసార్లు మనం అడిగే విధానంలో సమాధానం రాదు; అది వేరే క్రమంలో, వేరే సమయంలో వస్తుంది. అయితే అది రాదని కాదు.

ఆ స్త్రీ ఈ మాటలను కూడా అడ్డంకిగా కాక ఒక అవకాశంగా మలచుకుంది. ఆమె వాదించలేదు, నిరసించలేదు. ఆమె మరింత దగ్గరగా వచ్చి, ఆయన పాదాలపై పడింది.

పాదాల చెంత - నిజమైన ప్రార్థన మొదలయ్యే స్థానం

"ఆమె వచ్చి, ఆయన పాదములపై పడి, ప్రభూ నాకు సహాయము చేయుము అని ప్రార్థించెను"  ఈ ఒక్క వాక్యం యావత్తు ఆధ్యాత్మిక జీవితానికి ఒక బోధనశాలగా  నిలుస్తుంది. ఆమె వాదన చేయలేదు. తన హక్కులను సమర్థించుకోలేదు. తన గౌరవాన్ని కాపాడుకోవాలని చూడలేదు. ఆమె కేవలం దేవునిపై పూర్తిగా ఆధారపడిఉన్న విషయం తెలియజేస్తుంది.  

నిజమైన ప్రార్థన మొదలయ్యేది ఇక్కడే, మన స్వంత శక్తి, మన స్వంత వాదనలు, మన స్వంత అర్హతలు అన్నీ వదిలిపెట్టి, "ప్రభూ, నాకు సహాయం చేయుము" అని కేవలం ఆయన కృపను మాత్రమే ఆధారం చేసుకున్నప్పుడు మనకు ఆయన కృప దొరుకుతుంది. మనం ఎన్నో సార్లు దేవుని ముందు మన మంచి పనుల జాబితాను, మన అర్హతలను ప్రదర్శించాలని చూస్తాం. కానీ ఈ తల్లి మనకు నేర్పే పాఠం సరళమైనది, లోతైనది,  ఆయన ముందుకు  మనం తీసుకురావలసినది మన అర్హత కాదు, మన అవసరమే.

"బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయతగదు" - నాలుగవ అడ్డంకి- గాయపరిచే మాటలో దాగిన కృప

యేసు ప్రభువు మాటలు మరింత పరుషముగా ఉన్నాయి. "బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయుట తగదు" అన్నారు. ఈ మాట వినగానే చాలామంది కోపంతో వెనుదిరిగి ఉండేవారు. "నన్ను కుక్కతో పోల్చావా?" అని ఆత్మగౌరవం దెబ్బతిని వాదనకు దిగేవారు. కానీ ఆమె ప్రతిస్పందన అమూల్యమైనది. "అది నిజమే ప్రభూ! కానీ యజమానుని బల్ల నుండి పడు రొట్టెముక్కలను కుక్కపిల్లలు తినును గదా" అని జవాబు చెప్పింది.

ఇక్కడ ఆమె చూపిన జ్ఞానం అపారమైనది. ఆమె వాదించలేదు, తన హక్కు కోసం పోరాడలేదు. బదులుగా ఆమె దేవుని కృప యొక్క పరిమాణాన్ని సరిగ్గా అంచనా వేసింది, ఆయన బల్ల నుండి పడే ఒక్క చిన్న ముక్క కూడా, తన కుమార్తెను విడిపించడానికి సరిపోతుందని ఆమె నమ్మింది. ఇదే నిజమైన విశ్వాసపు గాడత. దేవుని కృప ఎంత సమృద్ధిగా ఉందంటే, దాని అతి చిన్న భాగం కూడా మన అతి పెద్ద సమస్యను పరిష్కరించగలదు అని నమ్మడం ఆ గొప్ప స్త్రీకి ఉన్న లక్షణం.

మనం కూడా జీవితంలో ఎన్నోసార్లు, "నాకు ఇంత పెద్ద అద్భుతం ఎందుకు జరుగుతుంది?" అని సందేహపడతాం. కానీ ఈ స్త్రీ మనకు గుర్తుచేసేది, దేవుని కృప ముందు మన సమస్య ఎంత పెద్దదైనా, అది ఆయన బల్ల నుండి పడే ఒక్క రొట్టెముక్కకు సమానమే.

"నీ విశ్వాసము మెచ్చదగినది" - దీర్ఘకాలిక పోరాటానికి ప్రతిఫలం

చివరకు యేసు ప్రభువు  పలికిన మాటలు ఆమె హృదయాన్ని నింపేసి ఉంటాయి.  "అమ్మా! నీ విశ్వాసము మెచ్చదగినది. నీ కోరిక నెరవేరునుగాక!" ఆ క్షణమే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. ఆమె ఇంటికి బయలుదేరిన ఆ ప్రయాణం ఎంత తేలికగా, ఎంత ఆనందభరితంగా సాగి ఉంటుందో ఊహించుకోగలం. కొన్ని గంటల క్రితం భారమైన హృదయంతో, కన్నీళ్లతో వచ్చిన ఆ దారిలోనే, ఇప్పుడు ఆమె పాదాలు గాలిలో తేలుతున్నట్టు నడిచి ఉంటాయి.

ఈ సంఘటటం మనకు గుర్తుచేసేది ఏమిటంటె  దేవుడు మౌనంగా ఉన్నాడని అనిపించే క్షణంలో, శిష్యులు (లేదా లోకం) నిన్ను నిరుత్సాహపరుస్తున్న క్షణంలో, పరిస్థితులు కఠినంగా కనిపిస్తున్న క్షణంలో, కూడా వెనుదిరగకుండా, పట్టుదలతో, వినయంతో ఆయన పాదాల చెంతకే తిరిగి తిరిగి రావడమే నిజమైన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని దేవుడు ఎన్నటికీ నిర్లక్ష్యం చేయడు.

మన హృదయాలకు ఈ  సంఘటన  ఇచ్చే ఆహ్వానం

ఈ కనానీయ స్త్రీ కథ చదివేటప్పుడు, మనలో ప్రతి ఒక్కరం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి.  నా జీవితంలో ఇప్పుడు దేవుని మౌనాన్ని ఎదుర్కొంటున్నది ఏమిటి ? నా బిడ్డ కొరకా, నా కుటుంబం కొరకా, నా సొంత ఆత్మ విముక్తి కొరకా  నేను ఎంతకాలంగా మోకరించి ఉన్నాను?

ఈ స్త్రీ మనకు బోధించే నాలుగు అమూల్యమైన సత్యాలు ఉన్నాయి.  మౌనాన్ని తిరస్కారంగా భావించకుండా విశ్వాసంతో వేచి ఉండటం; చుట్టూ వినిపించే నిరుత్సాహపరిచే స్వరాలను దాటి ముందుకు సాగడం; అర్హతను కాక అవసరాన్నే ఆయన ముందుకు  తీసుకురావడం; మరియు దేవుని కృప ఎంత చిన్నదిగా కనిపించినా అది మన అతిపెద్ద అవసరాన్ని తీర్చగలదని నమ్మడం. ఈ నాలుగు సత్యాలను హృదయంలో నింపుకుంటే, మనం కూడా ఆ తల్లిలా, "ప్రభూ, నాకు సహాయము చేయుము" అని పూర్ణ విశ్వాసంతో ఆయన పాదాల చెంతకు రాగలం.

దేవుని బల్ల ఎంతో విశాలమైనది. ఆ బల్ల వద్ద ఎవరూ పరాయివారు కారు. జాతి, భాష, గతం, హోదా  ఏదీ ఆయన కృపకు అడ్డంకి కాదు. కావలసినదల్లా ఒక్కటే, ఆ తల్లి చూపిన పట్టుదల, వినయం, మరియు అచంచలమైన నమ్మకం, మనం అలవరచుకోవాలి.

ఈ తల్లికి ప్రభువు మాత్రమే తన బిడ్డను స్వస్థ పరుస్తాడు అని తెలుసు, సామాజిక అడ్డంకులు ఉన్న, పరుష మాటలు వచ్చిన, తన బిడ్డకు స్వస్థత ఇక్కడే దొరుకుతుంది అని తెలిసినప్పుడు, అది పొందేవరకు ప్రభువు విడిచి పెట్టలేదు, మన సమస్యలకు పరిష్కారం ప్రభువు దగ్గరే లభిస్తుందని తెలిసి కూడా మనం అనేక సార్లు ప్రభువును సమీపించం, ఈ స్త్రీ నుండి ప్రభువు దగ్గర ప్రభువును ఎలా సమీపించాలో తెలుసుకోవచ్చు. అధ్యాత్మికంగా కానను అంటే నైతికత లేనిదని అర్ధం నిజానికి  ఈ స్త్రీ ప్రభువుతో మాటలాడటం ద్వారా ఆమెకు సంబంధించిన అన్నీ రకాల అపవిత్రతల నుండి విముక్తి పొందుతుంది. మరియు ఈ సంభాషణ ద్వారా ప్రభువు శక్తితో పవిత్రురాలు అవుతుంది. తన కుమార్తెకు స్వస్థత జరిగేలా చూస్తూంది. ఆమెకు వచ్చిన ప్రతి అడ్డంకి కూడా పవిత్రురాలుగా మారడానికి సహాయపడుతున్నాయి. కనానియ స్త్రీగా వచ్చి పవిత్ర మూర్తిగా వెళుతుంది. ప్రభువు దగ్గర పవిత్రంగా మారి వెలుగు తీసుకొని వెళుతుంది. 

ప్రార్థన

ప్రభువా, నీ మౌనంలో కూడా నీవు నా వెంటే ఉన్నావని నమ్మే విశ్వాసం నాకు దయచేయుము. చుట్టూ వినిపించే నిరుత్సాహపరిచే స్వరాలను దాటి, ఆ కనానీయ తల్లిలా పట్టుదలతో నీ పాదాల చెంతకు రాగల ధైర్యం నాకివ్వుము. నా అర్హతలపై కాక, నీ అపారమైన కృపపైనే నేను ఆధారపడేలా నా హృదయాన్ని తగ్గించుము. నా కుటుంబం కొరకు, నా ప్రియులైనవారి విడుదల కొరకు మధ్యవర్తిత్వంతో ప్రార్థించే శక్తిని నాకు అనుగ్రహించుము. నీ బల్ల నుండి పడు చిన్న కృప కూడా నా జీవితంలో గొప్ప మార్పు తేగలదని నమ్ముచున్నాను. నా విశ్వాసమును బలపరచుము ప్రభూ, నేను ఎన్నటికీ నిరాశ చెందకుండా, నీ సన్నిధిలోనే నా విశ్రాంతిని కనుగొనేలా నడిపించుమని వేడుకొనుచున్నాను. ఆమెన్

గత పోస్టును చదవండి 


Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు