మత్తయి 16:24-28 వివరణ - నిజమైన శిష్యరికం మరియు సిలువ మార్గం|కార్మెల్ శోభ
మత్తయి 16:24-28
“నన్ను అనుసరింపగోరువాడు తనను తాను
పరిత్యజించుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడు కొనచూచువాడు,
దానిని
పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును ధారపోయువాడు,
దానిని దక్కించు కొనును. మానవుడు
లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఈయగలడు? మనుష్య
కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతియొక్కనికి వాని క్రియలను
బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇచ్చటనున్న
వారిలో కొందరు మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచునంతవరకు మరణింప
బోరని నిశ్చయముగా చెప్పుచున్నాను” అని యేసు శిష్యులతో పలికెను.
మత్తయి సువార్త గ్రంథంలో 16వ అధ్యాయం యేసుక్రీస్తు పరిచర్యలోనే అత్యంత
ప్రాధాన్యత కలిగిన ఒక మలుపు. అంతవరకు యేసు ప్రభువు చేసిన అద్భుతాలు, ఉపమానాలు, స్వస్థతలను చూసిన శిష్యులు ఆయనను ఒక గొప్ప
ప్రవక్తగా లేదా లౌకిక విమోచకుడిగా భావించారు. అయితే, కైసరయ పిలిప్పు ప్రాంతంలో పేతురు ప్రభువును "సజీవుడగు
దేవుని కుమారుడవైన క్రీస్తువు (మెస్సీయ)" అని ప్రకటిస్తున్నాడు. (మత్తయి 16:16). ఈ మహత్తర ప్రకటన ముగిసిన
వెంటనే, యేసు ప్రభువు తన రాకడ యొక్క నిజమైన ఉద్దేశాన్ని బయలుపరచడం
ప్రారంభించాడు. తాను యెరూషలేమునకు వెళ్లి, పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, ధర్మ శాస్త్ర బోధకుల చేత అనేక శ్రమలు పొంది, చంపబడి, మూడవ నాడు లేపబడవలసి ఉందనే
సత్యాన్ని స్పష్టం చేశాడు (మత్తయి 16:21).
యూదుల నమ్మకం ప్రకారం, మెస్సీయ అంటే రోమన్ పరిపాలనను కూలదోసి, దావీదు సింహాసనాన్ని పునరుద్ధరించే రాజకీయ యోధుడు. అందువల్ల, "మరణం మరియు శ్రమలు" అనే మాటలు శిష్యులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయి. పేతురు తక్షణమే యేసు ప్రభువును ప్రక్కకు తీసుకెళ్ళి, "ప్రభూ, ఇది నీకు జరగకుండును గాక!" అని చెప్పడం ప్రారంభించాడు (16:22). యేసు ప్రభువు పేతురులోని ఆ లౌకిక ఆలోచనను, అపవాది శోధనను గు గుర్తించి, "సాతానా, నా వెనుకకు పొమ్ము" అని గద్దించాడు (16:23).
ఈ సంఘటన తదనంతరం, యేసు ప్రభువు కేవలం మెస్సీయ మాత్రమే కాదు, ఆయనను అనుసరించే శిష్యుల జీవిత మార్గం కూడా ఎలా ఉండబోతోందో స్పష్టం చేయడానికి 16:24-28 వచనాల్లోని "శిష్యరికాపు లక్షణాలను " బోధించాడు. క్రీస్తు మార్గంలో కిరీటం కంటే ముందు సిలువ ఉందనే సత్యాన్ని ఆయన వివరించాడు.
" నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని,
తన
సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను."
ఈ వచనంలో యేసుక్రీస్తు నిజమైన క్రైస్తవ జీవితానికి అవసరమైన మూడు స్పష్టమైన నిబంధనలను విధించాడు. ఇక్కడ "ఎవడైనను" పదమును గమనిస్తే యేసు ప్రభువు ఎవరినీ బలవంతం చేయడం లేదని అర్థమవుతుంది. ఇది ఒక స్వచ్ఛంద పిలుపు, కానీ నిబంధనలు మాత్రం మార్చలేనివి.
తనను తాను పరిత్యజించుకొని (Aparnesasthō): గ్రీకు భాషలో Aparnesasthō అంటే కేవలం కొన్ని అలవాట్లను లేదా ఆహార నియమాలను వదులుకోవడం కాదు దీని అర్థం "తన స్వంత హక్కులను, అహంకారాన్ని, స్వార్థపూరిత కోరికలను పూర్తిగా వదులుకోవడం." దీనికి అర్థం 'నేను ఇకపై నా జీవితానికి యజమానిని కాను' అని ఒప్పుకోవడం. అపోస్తలుడైన పౌలు ఈ భావాన్నే వ్యక్తపరుస్తూ: " క్రీస్తుతోపాటు నేనును సిలువవేయబడితిని.కనుక ఇక జీవించునది నేను కాదు. " (గలతీ 2:20) అన్నాడు.
తన సిలువను ఎత్తుకొనుట:
ఆధునిక సమాజంలో "సిలువ" అనే పదాన్ని చిన్న చిన్న అనారోగ్యాలు, ఆర్థిక కష్టాలు లేదా కుటుంబ సమస్యలకు రూపకంగా వాడుతుంటారు. కానీ, మొదటి శతాబ్దపు రోమన్ సామ్రాజ్యంలో సిలువ మోయడం అంటే మరణశిక్ష పడిన నేరస్థుడు తన సిలువ యొక్క అడ్డమానును మోస్తూ, నగర వీధుల గుండా అవమానకరంగా తన మరణ స్థలానికి నడవాలి. యేసు ప్రభువు "తన సిలువను ఎత్తుకొనుట" అని చెప్పినప్పుడు, శిష్యులకు అది తక్షణమే అర్థమైంది. క్రీస్తు నిమిత్తం నిందలు, అవమానాలు, సామాజిక బహిష్కరణ, ఆఖరికి మరణాన్ని (Martyrdom) సైతం అంగీకరించడానికి సిద్ధపడటమే సిలువ మోయడం. లూకా సువార్త 9:23 లో దీనికి "ప్రతిదినము" అనే పదం జోడించబడింది, అంటే ఇది ఒకసారి చేసే పని కాదు, రోజువారీ సమర్పణ.
నన్ను అనుసరింపవలెను (Akoloutheitō):
ఇక్కడ ఉపయోగించిన గ్రీకు క్రియాపదం వర్తమాన కాలంలో ఉంది. అనగా, ఇది ఒకసారి తీసుకునే తాత్కాలిక నిర్ణయం కాదు; జీవితాంతం క్రమబద్ధంగా, నిరంతరం క్రీస్తు అడుగుజాడల్లో నడవడం.
ఆత్మీయ జీవిత వైరుధ్యం
"తన
ప్రాణమును కాపాడుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును;
నా
నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును."
ఈ వచనంలో లోక ఆలోచనా విధానానికి, దేవుని ఆలోచన విధానానికి మధ్య ఉన్న పరస్పర విరుద్ధమైన వైరుధ్యాన్ని యేసు ప్రభువు ఆవిష్కరించాడు.
- ప్రాణము: గ్రీకు భాషలో ప్రాణము అంటే కేవలం శ్వాస లేదా భౌతిక శరీరము మాత్రమే కాదు; మనిషి యొక్క ఆత్మ, వ్యక్తిత్వం, ఆశలు, ఆశయాలు మరియు నిత్యజీవ ఉనికి.
- లోకపు నియమం: తన భౌతిక జీవితాన్ని, స్వార్థాన్ని, లోక భోగాలను ఏమైనా కాపాడుకోవాలని చూస్తాడు.
- క్రీస్తు నియమం: క్రీస్తు నిమిత్తం మరియు సువార్త నిమిత్తం తన లౌకిక జీవితాన్ని, స్వార్థ ఆశలను భోగాలను ధారపోసేవాడు నిజమైన నిత్యజీవాన్ని దక్కించుకుంటాడు.
- యోహాను 12:24-25 లో యేసు ఇదే సత్యాన్ని వివరిస్తూ, " గోధుమగింజ భూమిలోపడి నశించనంతవరకు అది అట్లే ఉండును. కాని అది నశించిన యెడల విస్తారముగ ఫలించును.
తన
ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కాని, ఈలోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని
నిత్యజీవమునకై కాపాడుకొనును. " అని చెప్పాడు. త్యాగం లేకుండా ఫలం లేదు, మరణం లేకుండా పునరుత్థానం లేదు.
"మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను
కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి?
తన
ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఈయగలడు?"
ఇక్కడ యేసు ప్రభువు వ్యాపార, ఆర్థిక పరిభాషను ఉపయోగించి ఆత్మ విలువను లెక్కించాడు. ఒక త్రాసులో ప్రపంచంలోని సమస్త ఆస్తులు, సామ్రాజ్యాలు, అధికారాలు, కీర్తి ప్రతిష్టలను ఉంచి, మరొక త్రాసులో ఒకే ఒక్క మానవ ఆత్మను ఉంచితే, ఆత్మ వైపే త్రాసు మొగ్గు చూపుతుంది.
కీర్తనకారుడు కీర్తనలు 49:7-8 లో అన్నట్లు: " నరుడు డబ్బు చెల్లించి తన ప్రాణములు నిలబెట్టుకోలేడు. దేవునికి సొమ్ము చెల్లించి అసువులు నిలుపుకోలేడు.నరుడు తన ప్రాణములు నిలుపుకొనుటకు ఎంత మూల్యము చెల్లించినను చాలదు" లోకమంతటినీ సంపాదించిన వ్యక్తి మరణించినప్పుడు దానిలో ఏ ఒక్కటినీ తనతో తీసుకెళ్లలేడు. మానవుడు కోల్పోయిన ఆత్మను తిరిగి కొనడానికి ప్రపంచంలో ఏ సంపదా సరిపోదు; అందుకే క్రీస్తు తన రక్తమునే విమోచన క్రయధనంగా చెల్లించవలసి వచ్చింది (1 పేతురు 1:18-19).
నిత్యత్వపు తీర్పు మరియు మహిమకరమైన రాకడ
"మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతియొక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును."
"బాధమయ సేవకునిగా" తనను తాను పరిచయం చేసుకున్న యేసు ప్రభువు, ఇక్కడ "సార్వభౌమ న్యాయధిపతిగా" (Sovereign Judge) తన రెండో రాకడను ప్రకటిస్తున్నాడు. సార్వభౌమధికారం: ఆయన కేవలం సిలువలో చనిపోయిన బాధమయ సేవకుడు మాత్రమే కాదు, అంతిమ డినమున సమస్త మానవాళికి తీర్పు తీర్చే రాజులకు రాజు.
క్రియల చొప్పున ప్రతిఫలం: దేవుడు ప్రతి ఒక్కరి క్రియలను బట్టి ప్రతిఫలమిస్తాడు. దీని అర్థం రక్షణ క్రియల ద్వారా వస్తుందని కాదు (ఎఫెసీ 2:8-9), ప్రతి విశ్వాసి యొక్క నిజమైన విశ్వాసానికి వారి క్రియలే ఆధారాలుగా ఉంటాయని అర్థం (యాకోబు 2:18). క్రీస్తు కొరకు పడిన శ్రమలు, చేసిన త్యాగాలు ఏవీ వ్యర్థం కావు.
"ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచిచూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను."
ఈ వచనం బైబిలు వ్యాఖ్యాతల మధ్య ఎంతో చర్చకు దారితీసిన భాగం. యేసు చెప్పిన "తన రాజ్యముతో వచ్చు దృశ్యము" దేనిని సూచిస్తోంది? ప్రధానంగా మూడు వివరణలు ఉన్నాయి:
- క్రీస్తు రూపాంతర దృశ్యం (Transfiguration):
అత్యంత ప్రామాణికమైన వివరణ ఇది. ఈ మాట చెప్పిన
సరిగ్గా ఆరు రోజుల తర్వాత యేసు ప్రభువు పేతురు, యాకోబు, యోహానులను కొండపైకి తీసుకెళ్ళి వారి ఎదుట
రూపాంతరం చెందాడు (మత్తయి 17:1-8). అక్కడ వారు క్రీస్తు యొక్క
పరలోక మహిమను, దేవుని రాజ్య ప్రత్యక్షతను కళ్లారా చూశారు. 2 పేతురు 1:16-18 లో పేతురు ఈ సంఘటనను
ప్రస్తావిస్తూ, తాము ఆయన మహిమను చూసిన ప్రత్యక్ష సాక్షులమని
ధృవీకరించాడు.
- పెంతెకోస్తు దినం (Day of Pentecost):
యేసు పునరుత్థానము మరియు ఆరోహణము తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు శక్తితో దిగివచ్చి తన సంఘము
స్థాపించబడినప్పుడు దేవుని రాజ్యం భూమిపై శక్తివంతంగా ప్రారంభమైంది.
- యెరూషలేము నాశనం (క్రీ.శ. 70):
రోమన్ సైన్యాల ద్వారా యెరూషలేము మరియు దేవాలయం నాశనమవ్వడం ద్వారా పాత నిబంధన వ్యవస్థ ముగిసి, క్రీస్తు రాజ్యపు నూతన యుగం అధికారికంగా స్థిరపడింది.
ఈ మూడింటి సారం ఒక్కటే: దేవుని రాజ్యం అనేది కేవలం దూరపు భవిష్యత్తులో ఉండేది మాత్రమే కాదు, అది క్రీస్తు పరిచర్య ద్వారా ఇప్పటికే లోకంలోనికి ప్రవేశించింది.
1. పవిత్ర గ్రంధంలో ఈ వాఖ్య భాగం ప్రాముఖ్యత
సువిశేషకారులైన మార్కు, మత్తయి, లూకా ముగ్గురు ఈ విషయాన్ని రాస్తున్నారు. ఇది మార్కు 8:34-38 మరియు లూకా 9:23-27 లలో కూడా కనిపిస్తుంది. ఇది పాత నిబంధన ప్రవచనాలైన యెషయా 53 (బాధమయ సేవకుడు) మరియు దానియేలు 7లో మహిమగల మనుష్య కుమారుడుల సమాహారం, క్రొత్త నిబంధనలను అనుసంధానిస్తూ, రక్షణ చరిత్రలో సిలువ మరియు మహిమల ప్రాముఖ్యతను ఇది స్పష్టం చేస్తుంది.
ఈ వాక్యభాగం ఒక తార్కిక ప్రవాహంలో సాగుతుంది: యేసు ప్రభువు ఇక్కడ శిష్యరికాన్ని సులభమైన మార్గంగా చిత్రీకరించలేదు. "శ్రమలు లేని మెస్సీయ" అనే ఆలోచన దేవుని నుండి వచ్చింది కాదు, అది సాతాను ఆలోచన అని ఆయన నిరూపించాడు. శిష్యుల జీవితాలలో శ్రమలు ఖచ్ఛితముగా ఉంటాయి అనే గమనించాలి. సౌకర్యవంతమైన శిష్యరికములో ఉన్నాము అంటే అది శిష్యరిక కాదని గమనించాలి.
3. ఆధ్యాత్మిక కోణం
ప్రతి విశ్వాసి జీవితంలో ఈ
వాక్యభాగం ఒక అద్దం లాంటిది:
- అహం పై విజయం: క్రైస్తవ జీవితంలో అతిపెద్ద శత్రువు సాతాను లేదా లోకం కంటే ముందుగా మనలోని "అహం".
- అంతరంగ పరివర్తన: ప్రతిదినం మన చిత్తాన్ని దేవుని చిత్తానికి లోబరచడమే సిలువ మార్గం.
- ఆత్మీయ ప్రాధాన్యతలు: లోక సంబంధమైన విజయాల కంటే ఆత్మ రక్షణకు, దేవుని రాజ్యానికి ప్రథమ స్థానం ఇవ్వడం.
4. సామాజిక కోణం
సందర్భం: నాటి సమాజంలో సిలువ అనేది సమాజంలో అత్యంత తక్కువ
స్థాయి వ్యక్తులకు, తిరుగుబాటుదారులకు విధించే శిక్ష. "సిలువ
మోయండి" అని చెప్పడం ద్వారా యేసు ప్రభువు లోకపు సామాజిక హోదాలను, గౌరవ-అవమాన ప్రమాణాలను తలకిందులు చేశాడు.
- నేటి సమాజం: నేటి ప్రపంచం "నిన్ను నీవు ప్రేమించుకో, నీ సుఖమే ముఖ్యం" అనే వినియోగదారీ సంస్కృతిని (Consumerism) ప్రచారం చేస్తోంది. ఈ వాతావరణంలో, క్రీస్తు "నిన్ను నీవు త్యాగం చేసుకో" అని ఇచ్చే పిలుపు ఒక గొప్ప ఆత్మీయ విప్లవం.
లౌకిక ఆలోచన - క్రీస్తు ప్రమాణం
లౌకిక మనస్తత్వం
అనేది స్వయం (తన సుఖభోగాలు, హెచ్చింపు), భౌతిక సంపదలు, లోకంలో హోదా మరియు తాత్కాలిక భద్రత
చుట్టూ తిరుగుతుంది. ఈ ఆలోచనా విధానంలో సిలువ అనేది ఒక అవమానం, బలహీనత మరియు నివారించాల్సిన శ్రమగా
కనిపిస్తుంది. లౌకిక
మనస్తత్వం ద్వారా పొందే లోకసంబంధమైన గుర్తింపు ఎంత ఉన్నప్పటికీ,
దాని అంతిమ పరిణామం
ఆత్మ నష్టం మరియు నిత్య నిరాశ మాత్రమే.
దీనికి
పూర్తి భిన్నంగా, క్రీస్తు చేసిన ప్రమాణం (సువార్త సత్యం) మనల్ని
దేవుని చిత్తానికి లోబడి, పరిత్యాగంతో
జీవించమని పిలుస్తుంది. ఇందులో సిలువ అనేది అవమానం కాదు; అది రక్షణ మార్గం, దైవ శక్తి మరియు ఆత్మీయ విజయానికి
చిహ్నం. భౌతిక విషయాల కంటే ఆత్మ యొక్క నిత్యత్వ విలువకు, దేవుని రాజ్యానికి ప్రాధాన్యతనిస్తూ
జీవించడమే క్రీస్తు మార్గం. క్రీస్తు నిమిత్తమే బ్రతికే ఈ జీవితానికి అంతిమంగా మహిమకరమైన
ప్రతిఫలం మరియు నిత్యజీవ ఆనందం లభిస్తుంది. ఈ సువిశేష భాగం నుండి మనం నేర్చుకొనవలసినది.
శిష్యరికం జీవం ఆత్మ తీర్పు రాజ్యం
- శిష్యత్వానికి వెల చెల్లించాలి: యేసు ప్రభువును అనుసరించాలంటే ఒక వ్యక్తి తనను తాను త్యజించి, సిలువను మోయక తప్పదు.
- త్యాగంలోనే నిజమైన జీవం ఉంది: స్వార్థపూరితంగా బ్రతికేవాడు తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు; క్రీస్తు కొరకు తన జీవితాన్ని సమర్పించేవాడు నిత్యజీవాన్ని పొందుకుంటాడు.
- ఆత్మ యొక్క విలువ అపారమైనది: ప్రపంచంలో ఏ ఆస్తి, అంతస్తు కూడా ఒక మానవ ఆత్మ విమోచనకు సమానం కాదు.
- అంతిమ న్యాయం ఖాయం: క్రీస్తు మహిమతో తిరిగి వస్తాడు; ప్రతి విశ్వాసి నమ్మకమైన సేవకు తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటాడు.
- దైవ రాజ్యము ఇప్పటికే అందుబాటులో ఉంది: దేవుని రాజ్యం కేవలం మరణానంతర నిరీక్షణ మాత్రమే కాదు, అది పరిశుద్ధాత్మ ద్వారా నేడే మన జీవితాల్లో క్రియాశీలకంగా ఉంది.
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment