దుఃఖాల తల్లి హృదయం
దుఃఖాల తల్లి హృదయం
యేసు ప్రభువు సిలువ మీద మరణించే సమయంలో సిలువ దగ్గర నిలబడిన ఆ తల్లి, మరియమాతను ఊహించుకోండి. ఆమె పరిగెత్తలేదు, కేకలు వేయలేదు, మూర్ఛపోలేదు. యోహాను సువార్త ఈ విషయమును గురించి ఒక్క మాటలో "యేసు సిలువ దగ్గర ఆయన తల్లి నిలిచియుండెను అని చెబుతుంది. (యోహాను 19:25). సిలువ దగ్గర నిలబడి ఉంది. కాని ఆ నిశ్శబ్ద నిలుకడలోనే మరియ మాత హృదయం మనకు ఎంతో బోధిస్తుంది.
మనం కూడా జీవితంలో సిలువ దగ్గర
నిలబడవలసిన క్షణాలు ఎదుర్కొంటాము.
ప్రియమైన వారి అనారోగ్యం, కుటుంబంలో విరిగిపోయిన సంబంధాలు, ఆర్థిక భారాలు, భవిష్యత్తు గురించి భయం. అలాంటప్పుడు మనం
ఏమి చేయాలో తెలియక కుప్పకూలిపోతాము. కానీ మరియ మాత మనకు వేరే మార్గం చూపిస్తుంది:
పారిపోకుండా, నిలబడటం. అర్థం కాకపోయినా, నమ్మకం వదలకపోవడం.
" ఒక ఖడ్గము నీ హృదయమును
దూసికొనిపోనున్నది." - లూకా 2:35
మరియమాతను దేవాలయంలో సిమియోను ఈ మాటలను మరియమాతకు
చెప్పినప్పుడు, యేసు ప్రభువు పసి బాలుడు. ఆ ఖడ్గం
ఏనాటికి వస్తుందో ఆమెకు తెలియదు. కానీ ఆ మాట ఆమె హృదయంలో ఎప్పుడూ నిలిచి ఉండేది .
నొప్పి ఎప్పుడైనా రావచ్చు అని ఎరిగి ఆమె ప్రతి రోజూ జీవించింది. మనం కూడా అనిశ్చిత
భవిష్యత్తును ఎదుర్కొంటూనే, ప్రస్తుత క్షణంలో నమ్మకంగా జీవించాలని
ఆమె జీవితం మనకు గుర్తుచేస్తుంది.
ఈ రోజు, మీ
హృదయంలో ఏదైనా 'ఖడ్గం' గుచ్చుకుంటున్నట్లు
అనిపిస్తే, మరియమాత దగ్గరకు వెళ్ళవచ్చు. ఆమెకు మన
పరిస్థితి వివరించాల్సిన అవసరం లేదు. మనం
ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో ఆమెకు
తెలుసు. కేవలం ఆమె పక్కన నిలబడి,
ఆమెతో పాటు మౌనంగా ఉన్నట్లయితే, దుఃఖంలో కూడా విశ్వాసం కోల్పోకుండా ఎలా
నిలబడాలో ఆమె మనకు నేర్పిస్తుంది.
ప్రార్థన
దుఃఖాల తల్లీ, సిలువ
దగ్గర నిలబడిన నీ ధైర్యాన్ని మాకు దయచేయుమని, మా
హృదయాన్ని గుచ్చే ప్రతి ఖడ్గాన్ని నీతో పాటు మౌనంగా భరించే శక్తినివ్వమని, మేము ఎప్పుడూ పారిపోకుండా, విశ్వాసంతో మీ వలె
నిలబడునట్లు మమ్మును కాపాడుమని ప్రభువుకు మా కొరకు వెదుకొనండి. ఆమెన్.
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment