26, ఫిబ్రవరి 2026, గురువారం

యోహాను 3:7-15

 యోహాను 3:7-15 

నీవు మరల జన్మింపవలెనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును విందువే కాని అది ఎక్కడ నుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అట్లే ఉండును అనెను. ఇది ఎట్లు సాధ్యమగును? అని నికోదేము అడిగెను. అందుకు యేసు నీవు యిస్రాయేలు బోధకుడవై యుండి దీనినేరుగవా? మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము. చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. కాని, మా సాక్ష్యము మీరంగీకరింపరని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పిన యెడల నమ్ముట లేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు  చెప్పిన యెడల ఎట్లు నమ్మెదరు? పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడు పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడు నిత్యజీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్త బడవలెను. 

చింతన  : యేసు ప్రభువు నికోదెముతో మరల జన్మించాలి అని చెప్పినందుకు ఆశ్చర్య పడవద్దు అని చెబుతున్నాడు.  ఎందుకంటే నికోదెము తాను ఎలా తల్లి గర్భంలోనికి వెళ్లగలనా అని ఆలోచిస్తున్నాడు. కాని యేసు ప్రభువు చెప్పినది ఎలా ఆత్మ వలన ఎలా జన్మించాలి అని చెబుతున్నారు. ఆత్మ వలన జన్మించడం అంటే జ్ఞానస్నానం వలన జన్మించడం. ఒక వ్యక్తి మారుమనసు పొంది, తన పాప జీవితము వదలినప్పుడు తాను పవిత్రంగా ఉండుటకు సిద్దపడుతున్నాడు.  అప్పుడు వారికి ఆత్మ ఇవ్వబడుతుంది. జ్ఞాన స్నానం మనలను పాపములనుండి శుద్ది చేస్తుంది. పవిత్రాత్మను మనకు ఇస్తుంది. పాపముల నుండి మనం శుద్ది పొందుట వలన, మనం నూతన సృష్టి అవుతున్నాము. మరియు పవిత్రాత్మను పొంది దేవుని బిడ్డలము అవుతున్నాము.  వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. వారి మార్పు ఇతరులకు తెలుస్తుంది కాని ఎందుకు, ఎలా అని తెలియదు. ఆత్మ వలన జన్మించిన వారు అందరూ అలానే ఉంటారు అని ప్రభువు చెబుతున్నారు. 

యేసు ప్రభువు నికోదెమును అవిశ్వాసం వదలి వేయమని చెబుతున్నాడు. యేసు ప్రభువును విశ్వసించుట వలన మాత్రమే మనం రక్షించ బడతాము మరియు ఇవన్నియు సాధ్యం అవుతాయి, కాని యూదులు యేసు ప్రభువును విశ్వసించుట లేదు, యేసు ప్రభువును విశ్వసించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఆయనలో మాత్రమే మనం రక్షించ బడుతాము ఆయన లేకపోతే మనకు రక్షణ ఉండదు. ఆయన మన అందరికోసం శిలువ మరణం అనుభవిస్తున్నారు. ఆయన శిలువ మీద ఎత్తబడుతున్నారు. ఆయనను చూసి ఎలా అయితే పాపం ద్వారా శిక్షను అనుభవిస్తున్న యిస్రాయేలు ప్రజలు మోషే ఎత్తిన కంచు సర్పమును చూసి విష సర్ప కాటు నుండి అంటే మరణము నుండి తప్పించు కుంటున్నారో అలానే కేవలము భౌతిక జీవితమునే కాక నిత్య జీవితమును యేసు ప్రభువును విశ్వసించుట వలన పొందుతారు అని చెబుతున్నారు. అందుకే యేసు ప్రభువును విశ్వసించడం అంత ముఖ్యం, యోహాను సువిశేషంలో అనేక సార్లు ఆయనను విశ్వసించే వారికి ఆయన నిత్యజీవం ఇస్తారు అని మనం వింటాము. 

ఎందుకు యూదులు ఆయనను విశ్వసించడం లేదు? యేసు ప్రభువు  నా సాక్ష్యం మీరు అంగీకరింపరు అని  చెబుతున్నారు, వీటికి కారణం మనం చూసినట్లయితే ప్రజలు చీకటినే ప్రేమించారు, యేసు ప్రభువు వెలుగు వలె ఈ లోకమునకు వచ్చిన ఆయన వెలుగులో వారు ఉండటానికి భయపడ్డారు ఎందుకంటే వెలుగులోనికి వచ్చినట్లయితే వారి పాప జీవితాలు ఎక్కడ బయటపడతాయో అని భయపడ్డారు, వారు చీకటినే ప్రేమించారు, వెలుగును ద్వేషించారు, నికోదెము కూడా చీకటిలోనే యేసు ప్రభువును కలవడానికి వచ్చారు, కాని యేసు ప్రభువు వద్దకు రావడం వలన చీకటి నుండి వెలుగు వద్దకు వచ్చినట్లు అయ్యింది. రక్షణకు మార్గం సిద్దపరుచుకున్నాడు. యేసు ప్రభువు వద్దకు వచ్చే ప్రతివారు అలానే వెలుగు దగ్గరకు వస్తున్నారు. దీని ద్వారా మనకు వారికి యేసు ప్రభువు చెప్పే మాటలు లేక చేసే పనుల మీద అంత ఇష్టం లేదు కారణం ఆయన వెలుగై ఉన్నాడు వారు చీకటిలో ఉన్నారు, ఆయన సాన్నిధ్యం వారికి ఒక రకమైన భయం కలిగిస్తుంది. వారి జీవితాలు మార్చుకోవడానికి వారు సిద్దంగా లేరు అనే విషయము అర్ధం అవుతుంది. పాపములోనే ఆనందం పొందడానికి వారు ప్రయత్నిస్తున్నారు,  కాని ఇది వారికి వారిని నాశనం చేస్తుంది అని వారు తెలుసుకోలేకపోతున్నారు.  పాపంలోనే మనం ఉన్నప్పుడు మనం ఒక రకమైన ఆజ్ఞానానికి లోనవుతాము, అందుకే పాపములోనే వారు ఆనందం వెదుకుతున్నారు. కాని యేసు ప్రభువు మనకు కనపడే విధంగా మనం ఆయనను చూడటానికి ఇష్టపడక పోయిన శిలువ మీద ఎత్తబడ్డాడు. మనము ఆయనను చూసేలా చేస్తున్నాడు. 

ప్రార్దన : ప్రభువా , మీరు నికోదెముతో ఆయన మరల జన్మించాలి అని చెప్పి, తన జీవితంలో రక్షణ పొందుటకు తాను మారు మనసు పొందాలని, జ్ఞానస్నానం పొందాలని, తాను పవిత్రాత్మను పొందాలని తెలియపరుస్తున్నారు. నేను కూడా ప్రభువా! రక్షణ పొందుటకు, మారు మనసు పొంది, పవిత్రంగా ఉండే విధంగా ఆశీర్వదించండి. నేను జ్ఞానస్నానం పొందిన సమయంలో మీ పవిత్ర ఆత్మతో , పవిత్రంగా ఉన్నానో అదేవిధంగా పవిత్రంగా ఉండేలా నన్ను దీవించండి. మిమ్ములను నా జీవితంలోనికి ఆహ్వానించి, మిమ్ములను అంగీకరించి మీ వెలుగులో నడిచేలా నన్ను దీవించండి. నా పాపములో నేను ఆనందిచే స్థితి నుండి మీ అజ్ఞలను పాటించుటలో ఆనందం పొందేలా దీవించండి. ఎప్పుడు మీ యందు విశ్వాసం వుంచి మీరు వాగ్దానం చేసే ఆ నిత్య జీవం పొందేలా నన్ను ఆశీర్వదించండి. మిమ్ములను చూస్తూ, మీకు సాక్షం ఇచ్చేలా చేయండి. ఆమెన్ 


యోహాను 3: 31-36

 యోహాను 3: 31-36 

పైనుండి  వచ్చు  వాడు అందరి కంటే అధికుడు.  భూలోకము నుండి వచ్చువాడు, భూలోకమునకు చెందినవాడు. అతడు భూలోక విషయములను  గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చు వాడు అందరి కంటే  అధికుడు. ఆయన తాను చూచిన, వినిన విషయములను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చు వాడు  అందరి కంటే అధికుడు. ఆయన తాను చూచిన, వినిన విషయములను గూర్చి సాక్ష్యము నిచ్చును. కాని , ఆయన సాక్ష్యమును ఎవరును అంగీకరింపరు. ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యసంధుడని నిరూపించును. దేవునిచే పంపబడిన వాడు దేవుని విషయములను గూర్చి చెప్పును. ఎలన, దేవుడు ఆయనకు తన ఆత్మను సమృద్దిగ ఒసగును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని విశ్వసించు వాడు నిత్య జీవము పొందును. ఆయనకు విధేయించని వాడు జీవమును చూడలేడు. దేవుని కోపము అతనిపై నిలచి ఉండును. 

ధ్యానము: ఈ సువిశేష భాగంలో యేసు ప్రభువు గురించి అనేక గొప్ప విషయాలు మనం చూస్తున్నాము. ఆయన పై నుండి వచ్చిన వాడు అని, అందరికంటే అధికుడు అని , ఆయన తన తండ్రి వద్ద చూచిన , వినిన విషయములను మాత్రమే మాటలాడుతాడు అని , ఆయన తాను చూసిన, వినిన విషయాలకు సాక్ష్యం ఇస్తున్నాడు అని, ఆయన సాక్ష్యం అంగీకరించిన వారు దేవుడు సత్య సంధుడు అని నిరూపిస్తారు అని, ఆయనకు ఆత్మ సమృద్దిగా ఇవ్వబడింది అని, తండ్రి ఆయనను ప్రేమిస్తున్నారు అని, సమస్తము మీద ఆయనకు అధికారం ఇవ్వబడింది అని , ఆయనను విశ్వసించు వారికి నిత్య జీవితం ఇవ్వబడుతుంది అని ఆయనను విశ్వాసించని వాని మీద దేవుని కోపం వుంటుంది అని ఈ సువిశేష భాగం తెలియచేస్తుంది. 

 "పైనుండి  వచ్చు  వాడు అందరి కంటే అధికుడు. భూలోకము నుండి వచ్చువాడు, భూలోకమునకు చెందినవాడు. అతడు భూలోక విషయములను  గూర్చి మాట్లాడును." ఇక్కడ యేసు ప్రభువు తను ఎక్కడ నుండి వచ్చినది మాటలాడుతున్నారు. అందరు ఆయన ఈలోక పుట్టు పూర్వోత్తరాల గురించి మాటలాడుతున్నారు. కాని ఆయన నిజముగా తండ్రి దేవుని నుండి వస్తున్న విషయాన్ని మరచిపోతున్నారు. ఆయన పరలోకము నుండి వస్తున్నారు. ఆయన తండ్రి నుండి వచ్చాడు కనుక ఆయన తన తండ్రి వద్ద ఉన్న విషయములను గురించి మాటలాడుతున్నారు. తన తండ్రి వద్ద అనేక నివాస స్థలాలు ఉన్నవి అని చెబుతున్నారు, మనము ఆ లోకానికి చెందిన వారిమి అని అక్కడ మనకు నివాసం ఏర్పాటు చేస్తాను అని చెబుతున్నాడు.  ఆయన పై నుండి వచ్చాడు, ఆయన అందరికంటే అధికుడు. ఆయన మన వలే కేవలం ఈలోకంలో పుట్టుట ద్వారా తన జీవితం మొదలు కావడం లేదు. ఆయన ఆది నుండి తన తండ్రితో ఉన్నాడు. కాని మనం ఈ లోకానికి చెందిన వారము. యేసు ప్రభువు అలా కాదు. ఆయన ఆది నుండి పరలోకానికి చెందినవాడు. 

యేసు ప్రభువు ఇచ్చే సాక్ష్యం చాలా ముఖ్యం. ఆయన చూసిన వానికి, వినిన వానికి  ఆయన సాక్షం ఇస్తున్నాడు. తాను తన ఇష్ట ప్రకారం లేక సొంతగా ఏమి చెప్పడం లేదు ప్రతిది తండ్రి నుండి చూసింది లేక వినినది మాత్రమే.  ఆయన చెప్పే ప్రతి దానిని మనం విశ్వసించాలి. ఎందుకంటే ఆయన మాత్రమే తండ్రి నుండి వచ్చినది. ఆయన తండ్రి చేత పంపబడిన వాడు కనుక ఆయన తండ్రి యొక్క మాటలను చెబుతున్నాడు. ఆయన మాటలు కూడా జీవం కలిగి ఉన్నాయి.  ఆయన ఈ లోకానికి వచ్చినది,  ఆయన ద్వారా ఈ లోకం రక్షించబడాలి అని. ఆయన మాటల ద్వారా తన పనుల ద్వారా ఆ పనిని చేస్తున్నాడు. ఆయన పవిత్రాత్మ కలిగి వున్నాడు. తండ్రి తన కుమారునికి పవిత్రాత్మను సమృద్దిగా ఇచ్చారు.  ఆయనను విశ్వసించిన వారికి ఆయన ఆ పవిత్రాత్మను ఇస్తాడు, పవిత్రాత్మ వారిని నడిపిస్తుంది.  యేసు ప్రభువును తండ్రి ప్రేమిస్తున్నారు. యేసు ప్రభువుని తండ్రి ఎంతలా ప్రేమిస్తున్నారు అంటే ఈ లోకం మీద, సర్వ అధికారం ఆయనకు ఇచ్చారు. యేసు ప్రభువుని సాక్ష్యంను అంగీకరించిన వారు దేవుడు సత్యసంధుడు అని నిరూపిస్తారు. 

ప్రార్ధన : ప్రభువా!  మీరు ఎవరు అని ఎంత గొప్ప వారు అని ఈ సువిశేష భాగం ద్వారా తెలుసుకుంటున్నాము. మీరు ఆది నుండి తండ్రితో ఉన్నారు. తండ్రి గురించి ఆయన ప్రేమ గురించి మీ ద్వారా మాత్రమే మేము తెలుసుకుంటున్నాము. కాని కొన్ని సార్లు మీరు మాకు చూపించిన తండ్రి ప్రేమను తెలుసుకోలేక పోతున్నాము. ఎంతగా తండ్రి మిమ్ములను ప్రేమిస్తున్నారో మేము వింటున్నాము అంతే కాదు తండ్రి మమ్ములను కూడా అలానే ప్రేమిస్తున్నారు అని మరచిపోతున్నాము, అటువంటి సమయాలలో మమ్ములను క్షమించండి. ప్రభువా ! మీకు సమస్తము మీద అధికారము ఇవ్వబడినది, నా మీద, జీవితం మీద కూడా మీకు పూర్తిగా అధికారం ఇవ్వబడింది, మీ మాటలను విశ్వసించే మంచి విశ్వసిగా నన్ను మార్చండి. నేను మీరు సత్య వాంతులు అని నిరూపించే మీ శిష్యునిగా నన్ను మార్చండి. మీరు ఎలా తండ్రిని ప్రేమిస్తున్నారో, ఆయన చిత్తం నెరవేర్చడానికి ఎంత కష్టపడ్డారో, నేను కూడా మీ చిత్తం నెరవేర్చడానికి కావలసిన అనుగ్రహాలు ఇవ్వండి, తద్వార , మీరు నాకు చూపించిన ప్రేమకు నాకు మీ మీద ఉన్న ప్రేమను వ్యక్త పరిచేలా నాకు సహాయం చేయండి. ప్రభువా ! తండ్రి మీకు సమృద్దిగా పవిత్రాత్మను ఇచ్చిన విధంగా నాకు కూడా ఆత్మను ఇవ్వండి ,  ఆత్మ నన్ను నడిపేలా దీవించండి.  ప్రభువా నేను ఎల్లప్పుడూ  మిమ్ములను విశ్వసిస్తూ, మీరు వాగ్ధానం చేసే నిత్య జీవం నేను పొందేలా నన్ను ఆశీర్వాదించండి. ఆమెన్ 


యోహాను 6:1-15

 యోహాను 6:1-15 

ఆ పిదప యేసు తిబేరియా అనెడి గలీలియ సరస్సు దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అధ్బుత కార్యములను చూచి గొప్ప జనసముహము ఆయనను వెంబడించేను. యేసు పర్వతమునెక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. యూదుల పాస్క పండుగ సమీపించినది. యేసు కనులేత్తి గొప్ప జనసముహము తన యొద్దకు వచ్చుట చూచి, పిలిప్పుతో వీరు భుజింపవలసిన అహర పదార్ధములను మనమెక్కడ నుండి కొని తెచ్చెదము? అనెను. పిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఏలన, తానేమి చేయబోవుచున్నది ఆయనకు తెలియును. ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైన రెండువందల వరహాల రొట్టెలు కూడ చాలవు అని పిలిప్పు ఆయనకు సమాధానము ఇచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు  సీమోను పేతురు సోదరుడు, అంద్రెయ : ఇక్కడ ఒక బాలుని యొద్ద ఐదు యవ (గోదుమ) రొట్టెలు, రెండు చేపలు కలవు. కాని, ఇంత మందికి ఇవి ఏమాత్రము? అని పలికెను. యేసు "అందరను భోజనమునకు కూర్చుండబెట్టుడు" అనెను. అచట ఇంచుమించు  ఐదు వేల మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అపుడు యేసు రొట్టెను తీసికొని, ధన్యవాదములు అర్పించి, కూర్చున్న వారికి వడ్డించేను. అట్లే చేపలను కూడ వారికి తృప్తి కలుగునంతగ వడ్డించేను. వారు తృప్తిగా భుజించిన పిదప, యేసు శిష్యులతో "ఏమి వ్యర్ధము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోవు చేయుడు" అని చెప్పెను. వారు భుజించిన పిదప ఐదు యవల రొట్టెలలో మిగిలిన ముక్కలను పండ్రెండు గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ అధ్భుతమును చూచి, వాస్తవముగ ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే" అని చెప్పిరి. ప్రజలు తనను బలవంతముగ రాజును చేయనున్నారని తెలిసికొని, యేసు మరల ఒంటరిగా పర్వతము పైకి వెళ్ళెను. 

ధ్యానము: యేసు ప్రభువు రోగుల పట్ల చేసిన అనేక అద్భుత కార్యములు చూసిన వారు, ఆయనను అనుసరిస్తూ వచ్చారు. ఈ ప్రజలు ఆయన దగ్గరకు అనేక కారణాలతో వచ్చారు. కొంత మంది ఆయన చేసిన అద్భుతాలు చూసి వారు జీవితాలలో కూడా స్వస్థత జరుగుతుంది అని వచ్చి ఉంటారు, కొంతమంది దేవుని వాక్కు వినాలి అని కోరికతో వచ్చి ఉంటారు. కొంత మంది ఈ అధ్బుతాలు చేసే ఆ వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడానికి వచ్చి ఉండవచ్చు. వారు ఎటువంటి కారణాలతో వచ్చిన యేసు ప్రభువు వారిని అదరిస్తున్నారు. అది ఎలాగంటే వారు తినుటకు ఏమి అయిన దొరుకుతుందా అని అడుగుతున్నారు. ప్రభువు ఎప్పుడు కూడా మన అవసరాలు చూసి, వాటిని తీర్చడానికి ఎంతో సహాయపడుతారు. ఇక్కడ యేసు ప్రభువు ప్రజలను చూసి వారు తినుటకు ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నారు. 

పిలిప్పుతో వారు భుజించుటకు కావలసిన ఆహార పదార్ధాలు మనము ఎక్కడ నుండి తీసుకొనిరావాలి అని అడుగుతున్నారు. వారికి సమృద్దిగా ఇవ్వక పోయిన, కొద్ది కొద్దిగా భుజించుటకు అయిన సుమారు రెండు వందల వరహాల రొట్టెలు  అయిన సరిపోవు అని చెబుతున్నారు. పురుషులు మాత్రమే సుమారు ఐదువేల మంది అక్కడ ఉన్నారు. కాని మిగిలిన వారు స్త్రీలు మరియు పిల్లలు కూడా ఉన్నారు, వారిని సహజముగా లెక్క పెట్టారు. విరందరికి సరిపడిన ఆహారం ఇవ్వడం అంటే సాధ్యం కాదు. ఎందుకంటే వారు ఉన్న ప్రదేశం మరియు సమయం కూడా అనుకూలముగా లేదు. కాని యేసు ప్రభువు వారి ఆకలిని చూస్తున్నారు. వారు సమృద్దిగా భుజించాలి అని కోరుకుంటున్నారు. ఎందుకు యేసు ప్రభువు వారి ఆకలి తీర్చాలి అని అనుకుంటున్నారు. యేసు ప్రభువు చేసిన ఏ అధ్భుతము కూడా తన మహిమను తెలియ పరుచుకోవడానికి చేయలేదు. ప్రజల అవసరం గ్రహించి, వారికి అప్పటి అవసరం తీర్చడానికి మాత్రమే చేశారు. ఇక్కడ కూడా ప్రజలు ఎంతో ఆకలితో ఉన్నారు. వారి ఆకలి తీర్చడం చాల అవసరం అక్కడ అందుకే వారి ఆకలి తీర్చడానికి సిద్దపడ్డారు. 

అంద్రేయ ఒక పిల్లవాని దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు కలవు అని చెబుతున్నారు.  అవి ఇంతమండికి ఏ మాత్రము అని చెబుతున్నాడు. అంటే మనము వీరి ఆకలి తీర్చలేము అనే భావనలో ఉన్నాడు.  అక్కడ వేల మంది ప్రజలు  మంది ఉన్నారు. వీరి ఆకలి మాత్రమే యేసు ప్రభువు చూస్తున్నారు.  వారి ఆకలి తీర్చడానికి ప్రభువు ఏమి చేయాలో ఆయనకి తెలుసు అందుకే అందరికీ భోజనానికి కూర్చోమని చెబుతున్నారు. ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను దీవించి యేసు ప్రభువు అందరు తృప్తి పడునంతగ వారికి వడ్డించారు. ఇది కేవలం ఒక అద్భుతము మాత్రమే కాదు. యేసు ప్రభువు మన జీవితాలలో ఉంటే మనకు ఎలా సమృద్ది దొరుకుతుందో మనము తెలుసుకోవచ్చు.  మెస్సీయ్యా వచ్చినప్పుడు అందరూ సమృద్దిగా ఉంటారు మరియు  తృప్తి చెందుతారు అనే ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. సమృద్ది మరియు తృప్తి అనెది యేసు ప్రభువుతోనే సాధ్యం అవుతుంది. 

యేసు ప్రభువు చేసిన ఈ అద్భుతము ఆయనకు తన తండ్రికి ఉన్న సంబంధమును తెలియజేస్తుంది. యేసు ప్రభువు రొట్టెలను పైకెత్తి దీవించిన వాటిని పంచిన అవి అయిపోలేదు ఇంకా పన్నెండు గంపలు మిగిలినవి. అంటే అందరూ భుజించిన ఇంకా రానివారికి, అక్కడ లేని వారికి కూడా మిగిలినవి. యేసు ప్రభువు వద్ద ప్రతిఒక్కరికి స్థానం ఉంటుంది, కేవలం కొంతమందికి లేక ఎన్నుకొన బడినవారికి అంటూ ఏమి ఉండదు. ప్రతి ఒక్కరూ ఆయన వద్ద స్థానం పొందవచ్చు ఆయన నుండి అన్నీ పొందవచ్చు.  ఇక్కడ యేసు ప్రభువు చేసిన ఈ అద్భుతం మన నుండి కూడా సహకారము కావాలి అని అడుగుతుంది. ఏవిధంగా అయితే ఒక చిన్న పిల్లవాడు తన వద్ద ఉన్న ఐదు రొట్టెలను రెండు చేపలను ప్రభువుకు ఇస్తున్నాడో మన వద్ద ఉన్న వాటిని ప్రభువుకు సమర్పించగలిగితే ఆయన మన ద్వారా ఎన్నో అద్బుతములను చేస్తారు. క్రీస్తు అనుచరులుగ మనం ఆయనకు ఎప్పుడు సహకరించాలి. 

యేసు ప్రభువు తన చేసిన స్వస్థతలు లేక అధ్బుతాలు ఏవి కూడా తన మహిమను చూపించడానికి చేయలేదు కేవలం ప్రజలు శ్రేయస్సు , మంచి కోసమే చేయడం జరిగినది. యేసు ప్రభువును ప్రజలు బలవంతముగ రాజును చేస్తున్నారని ఆయన అక్కడ నుండి వెళ్లిపోతున్నారు. ప్రజలలో రానున్న మెస్సీయ్యా , యేసు ప్రభువే అని అనుకున్న ఆయన గడియ వరకు ఆయన వేచి ఉన్నాడు గాని తన మహిమను చూపించాలి అనుకోలేదు, యేసు ప్రభువు నుండి మనం ఈ మాతృకను నేర్చుకోవాలి, ఆయన చేయవలసిన మంచి చేసి ఏమి ఆశించకుండా అక్కడ నుండి వెళ్లిపోతున్నారు. మనం కూడా అలానే ఎప్పుడు మంచి చేస్తూ ఇతరుల నుండి ఏమి ఆశించకుండా ఉండుటకు ప్రయత్నించాలి. 

ప్రార్ధన : ప్రభువా! మీరు మీ జీవితంలో అన్నీ అధ్భుతాలు మానవుని మంచికి, స్వస్థతకు, ఆకలి తీర్చుటకు మాత్రమే చేశారు. మా జీవితములలో కూడా మేము మా గొప్ప తనమును లేక మా ఆధిపత్యం చూపించుటకు కాక ఇతరులకు మంచి చేయడం కోసం పని చేసే మంచి మనసును మాకు ఇవ్వండి. ప్రభువా ! మీరు ఒక చిన్న బాలుడు ఇచ్చిన ఐదు రొట్టెలు రెండు చేపలను అక్కడ ఉన్న వారికి అందరు  సంతృప్తిగా భుజించునట్లు చేశారు. మా దగ్గర ఉన్న కొద్ది కొద్ది మంచి గుణాలను పరిపూర్ణంగా అయ్యేలా దీవించండి. మా జీవితాలలో ఉన్న లేమినంతటిని తీసివేసి సమృద్దిని దయచేయండి. ఆమెన్. 



యోహాను 6:22-29

 యోహాను 6:22-29 

మరునాడు, సరస్సు ఆవలి తీరమున ఉండిపోయిన జనసమూహము, అచటనున్న ఒకే ఒక పడవను చూసిరి. ఆ పడవలో  శిష్యులతోపాటు యేసు వెళ్లలేదని శిష్యులు మాత్రమే వెళ్ళుట చూచిరి. అయినను యేసు ధన్యవాదములు సమర్పించి, ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలము చెంతకు తిబేరియా  నుండి కొన్ని పడవలు వచ్చెను. అక్కడ యేసు గాని, శిష్యులుగాని లేకుండుట చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలివైపున యేసును కనుగొని "బోధకుడా! నీవు ఎప్పుడు ఇక్కడకు వచ్చితివి?" అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు. నా అద్భుత కార్యములను చూచి కాదు అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలన తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్ర వేసిఉన్నాడు." అని యేసు సమాధానమిచ్ఛెను. అప్పుడు "దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెను? అని వారడుగగా, యేసు "దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు. అదియే దేవుడు మీ నుండి కోరునది." అని చెప్పెను.

ధ్యానము : యేసు ప్రభువును వెదకుచు తిబేరియా నుండి ప్రజలు వస్తున్నారు. వారు, అక్కడ యేసు ప్రభువు లేరని గ్రహించి, అక్కడ నుండి యేసు ప్రభువును వెదకుచు కఫర్నాము  వెళ్లారు. వారు ఎందుకు యేసు ప్రభువును వేదకుచు వచ్చారు? వీరు అనేక కారణాలతో యేసు ప్రభువును వెదకుచు వచ్చి వుంటారు. కాని అన్ని  కారణాలు కూడా తాత్కాలికమైనవే. వారు యేసు ప్రభువును చూసి "బోధకుడా! నీవు ఎప్పుడు ఇక్కడకు వచ్చితివి? అని అడిగిరి." అందుకు ప్రభువు మీరు నా అధ్భుతములు చూసి కాదు, మీరు సంతృప్తిగా భుజించినందుకు నన్ను వెదకుచున్నారు అని వారితో చెబుతున్నారు. ఆనాటి ప్రజలు యేసు ప్రభువు దగ్గరకు వచ్చినది కూడా వారి యొక్క అవసరాలు తీరుస్తారని, లేక వారి కడుపు నింపుతారని లేక వారి తాత్కాలిక భాదల నుండి వారికి ఉపశమనం కలుగచేస్తారని వారు యేసు ప్రభువు దగ్గరకు వస్తున్నారు. అంతేకాని ఆయన వారికి శాశ్వతమైనవి ఇస్తారు అనే ఆలోచన వారికి లేదు. 

యేసు ప్రభువు నందు వారందరు కేవలం వారికి కావలసిన, తాత్కాలిక ఉపశమనం ఇచ్చే వ్యక్తిని మాత్రమే చూశారు. వారికి అంతకంటే ఎక్కువుగా ఏమి ఉంటుంది అని తెలియదు. ఎందుకంటే వారి  ఆలోచనలు ఎప్పుడు ఇహలోక విషయముల గురించి మాత్రమే.  నేను కూడా ఈరోజు ఇటువంటి ఆలోచనలు మాత్రమే కలిగిఉన్నానా? అని ఒక సారి ఆలోచిస్తే ఈరోజు ఎక్కువగా దేవాలయము వచ్చేది మరియు ప్రార్ధించేది కూడా ఇటువంటి ఆలోచనలతోనే, తాత్కాలికమైన వాటికోసమే మనం దేవున్ని కోరుకుంటున్నాము. యేసు ప్రభువు స్వస్థ పరచిన అనేక మంది తరువాత ఆయన వెంట ఏమి లేరు, దాని తరువాత వారి పనులలో వారు నిమగ్నమైపోతున్నారు. కాని యేసు ప్రభువు ఎవరు ? ఆయన కేవలం ఆరోగ్యాన్ని ఇచ్చేవాడేనా? లేక ఆకలి తీర్చే వాడు మాత్రమేనా? ఆయనను పూర్తిగా అర్ధం చేసుకోలేక పోతున్నాము. అయినప్పటికీ యేసు ప్రభువు అనేక సార్లు ఆయన ఎవరు ఆయన మనకు ఏమి ఇవ్వగలడు అని  తెలియజేస్తూనే ఉన్నారు, కాని అది మనం అర్ధం చేసుకోలేకపోతున్నాము. 

నా అధ్భుత కార్యములు చూసికాదు మీరు వచ్చినది అని యేసు ప్రభువు చెబుతున్నారు. యోహాను సువిశేషంలో యేసు ప్రభువు చేసిన ప్రతి అద్భుతం కేవలం ఆయన దేవుడు అని తెలియజేస్తుంది. ఆ అద్భుతాలలో ఇది ఏ మానవు మాతృడు చేయలేడు అనే అర్ధం వస్తుంది. యేసు ప్రభువు ప్రతి అధ్బుతం కూడా ఆయన దేవుడు అని తెలుపుతుంది. అటువంటి ప్రభువును మనము అర్ధం చేసుకోక ఆయన నుండి కేవలం ఇహలోక విషయములను మాత్రమే ఆర్ధిస్తున్నాం. ఆయన మనకు ఏమి ఇవ్వ గలడో మనం పూర్తిగా తెలుసుకోలేక పోతున్నాము. ఇహలోక సంబంధమైనవాటిని కాకుండా ఆయన మనకు ఏమి ఇవ్వగలడు? అని ఒక సారి పరిశీలించనట్లయితే యోహాను సువిశేషం మొత్తం కూడా అదే మనకు ఆయన చెబుతున్నాడు. 

"అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును." యేసు ప్రభువు మనకు ఏమేమి ఇవ్వగలడు మరియు మనము దేనికి శ్రమించాలి అనే విషయాలను ఇక్కడ యేసు ప్రభువు వెల్లడి చేస్తున్నారు. ఏమిటి శాశ్వతమైన భోజనం? ఆ భోజనము ఏమి ఇస్తుంది? యేసు ప్రభువు దీని గురించి తరువాత చెబుతారు , మోషే మీకు పరలోకము నుండి మన్న ఇవ్వలేదు. మనుష్య కుమారుడు మాత్రమే మీకు శాశ్వత భోజనము ఇస్తారు అని. ఆ శాశ్వత భోజనము ఏమి చేస్తుంది? అంటే నిత్య జీవనము ఇస్తుంది. యేసు ప్రభువు ప్రసాధించగలిగి మరలా ఎవరు ప్రసాదించలేనిది ఇదే. అదే నిత్య జీవము. ప్రభువు మనలను తన నుండి దానిని కోరుకోమని చెబుతున్నారు. ఎందుకంటే ఆయన మాత్రమే అది ప్రసాదించగలడు. అంతే కాదు తండ్రి దేవుడు ఆయనకు ఆ అధికారమును ఇచ్చిఉన్నారు.

దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెను అని వారు అడిగినప్పుడు యేసు ప్రభువు వారికి తనను విశ్వసించమని చెబుతున్నారు. ఇక్కడ యోహాను సువిశేషం మనకు యేసు ప్రభువును విశ్వసించడం గురించి మనకు అనేక సార్లు గుర్తుచేస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువును విశ్వసించే వారు ఎలా నిత్య జీవం పొందుతారో ఈ సువిశేషం మనకు వివరిస్తుంది. యేసు ప్రభువును విశ్వసించే వారు, విశ్వసించుట వలన నిత్య జీవం పొందుతారు, వారికి దేవుని బిడ్డలగు భాగ్యమును ఆయన ప్రసాదించారు. తండ్రి దేవుడు మన నుండి ఆశించేది ఏమిటి అంటే మనం తన కుమారుడయిన యేసు ప్రభువును విశ్వసించాలి అని, ఆ విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందాలి దేవుడు ఆశిస్తున్నారు. 

ప్రార్దన : ప్రభువా ! మీరు మా మీద ఎంతో ప్రేమతో మమ్ములను ఎల్లప్పడు మీతో ఉండేలా, నిత్య జీవితాన్ని మాకు ఇవ్వాలి అని మా దగ్గరకు వచ్చి , మీరు అనేక అధ్బుతలు చేసి మీరు మాకు ఏమి ఇవ్వగలరో చూపించన కాని మేము మిమ్ములను అర్ధం చేసుకోవడంలో విఫలం చెందాము, మా తాత్కాలిక భాదలు నుండి సమస్యల నుండి ఉపశమనాన్ని మాత్రమే మిమ్ము కోరుతూ ఉన్నాము. మా అజ్ఞానం మీకు తెలుసు ప్రభువా మేము ఏమి కోరుకోవాలో కూడా తెలుసుకోలేని పరిస్థితులలో మేము ఉన్నాము అటువంటి సమయాలలో మమ్ము క్షమించండి. మేము ఏమి అడగాలో , ఏది శాశ్వతమో అది అశాశ్వతమొ మాకు తెలియజేయండి. మేము ఎల్లప్పుడూ  అశాశ్వతమైన వాటి కోసం పని చేసే వారిగా మమ్ములను మలచండి. మీరు మాత్రమే ఇచ్చే ఆ నిత్యం జీవం కోసం పని చేసే వారిగా , మిమ్ము ఎప్పుడు విశ్వసించే వారిగా మమ్ము చేయండి. తండ్రి మా నుండి ఆశించే పనిని చెసేలా మమ్ము ఆశీర్వదించండి. ఆమెన్ 


అబ్రహాము జీవిత చరిత్ర

 అబ్రహాము జీవిత చరిత్ర 

అబ్రహాము తేరా చిన్న కుమారుడు. అబ్రహాము అసలు పేరు అబ్రం, ఆ పేరుకు గల అర్ధం ఉన్నతికి తండ్రి. దేవుడు అబ్రహాముకు అబ్రహాము అని పేరు మార్చినది తనకు లెక్కకు మిక్కుటముగా సంతానము కలుగ చేస్తాను అని చెప్పి తన పేరును మార్చి తనను అబ్రహాము అని పిలిచాడు, అనగా అనేక తెగలకు తండ్రి అని అర్ధం. 

అబ్రహాము దేవుని స్నేహితుడు 

అబ్రహామును దేవుడు ఒక క్రొత్త జీవన విధానానికి పిలుచుకున్నాడు. దేవుని మీద విశ్వాసముంచి జీవించే విధానం అబ్రహముతో మొదలవుతుంది. ఒక ఒడంబడిక విధానం కూడా అబ్రహాముతోనే మొదలవుతుంది. దేవునికి స్నేహితునిగా దేవునితో స్నేహితుని వలె మాటలాడిన మొదటి వ్యక్తిగా కూడా అబ్రహము ప్రసిద్ది చెందడం జరిగింది. 

అబ్రహాము తెరా ముగ్గురు కుమారులలో ఒకడు. మిగిలిన ఇద్దరు కుమారులు నహోరు మరియు హారను, హారను ఉరు పట్టణములోనే చనిపోయాడు. లోతు అను వాడు ఈ హారను కుమారుడు.   తెరా కల్దియుల దేశమైన ఉరు అనే ప్రాంతమునకు చెందిన వాడు. తరువాత కనాను దేశమునను వెళుతూ హారములో స్థిర పడిపోయారు. అబ్రహాము 73 సంవత్సరాల వయసులో ఉండగా దేవుని స్వరమును విన్నాడు. దేవుడు ఆయనతో తన దేశమును, పుట్టినింటిని, చుట్టపక్కాలను వదలి తాను చూపే దేశమునకు వెళ్ళమని చెప్పాడు. దాని ద్వారా ఆయనను ఒక గొప్ప జాతిగా తీర్చిదిద్దుతాను అని దేవుడు అబ్రహాముకు చెప్పడం జరిగింది. అబ్రహాము ఆ మాటలకు విలువనిచ్చి దేవుడు చెప్పినట్లు చేయడం జరిగింది. తాను హారనులో సంపాదించినది, తన సేవకులతో, భార్య సారా మరియు తన సోదరుని కుమారుడు  లోతుతో కలసి అబ్రహాము హారనును వదలినప్పుడు అబ్రహాము వయస్సు 75 సంవత్సరాలు. హారాను నుండి కనాను దేశములోని షెకెము అనే ప్రదేశం చేరి మోరే వద్ద సింధూర వృక్షము వద్ద ప్రభువు కనపడి ఈ దేశమును నీ సంతతికి ఇస్తాను అని చెప్పాడు. అక్కడ అబ్రహాము ఒక బలి పీఠము నిర్మించి బేతేలు , హాయికి మధ్య బలి పీఠము నిర్మించి దేవుని ఆరాధించి, అక్కడనుండి నెగెబు వెళ్ళాడు. అక్కడ కరువు రాగ ఐగుప్తు వెళ్ళి అక్కడ తన భార్య సారాను తన సోదరి అని చెప్పమని అడిగెను ఎందుకంటే ఆమె మిక్కిలి అందగత్తె, మరియు ఆమె నిమిత్తం అబ్రహము చంపుతారు ఏమో అని అతను భయపడెను. ఫరో రాజు వద్దుకు తన సేవకులు తీసుకోపొగా ఆమె వలన అతను అబ్రహాముకు మేలు చేయగా ఆయన గొర్రెలను  , పశువులను సంపాదించేను. దేవుడు ఆమెను కాపాడుటకు ఫరో రాజు కుటుంబంలో అనేక రోగముల పాలు చేయగా ఫరో నిజము తెలుసుకొని అబ్రహామును పిలిచి తన భార్యను తీసుకొని పొమ్మని చెప్పగా ఆయన అలాగే తన సంపద మొత్తం తీసుకొని అక్కడ నుండి మరల నెగెబుకు వెళ్ళి అక్కడ నుండి బేతెలు హాయికి మధ్య మొదట గుడారము ఏర్పాటు చేసిన ప్రదేశమునకు వచ్చెను. అక్కడ లోతు మరియు అబ్రహాము సేవకుల మధ్య గొడవలు జరుగగా కనుక అబ్రహాము లోతుతో మనము విడిపోవుట మేలు అని ఇక్కడ నుండి మన ముందు కావలసినంత నేల ఉంది. నీవు కుడి వైపుకు వెళ్ళిన నేను ఎడమ వైపు వెలుతాను, లేక నివు ఎడమ వైపు వెళ్ళిన కుడి వైపు వెలుతాను అని చెప్పగా లోతు యొర్దాను మైదానం వైపు చూచి అక్కడ నీటి వనరు ఉన్నదని గ్రహించి యొర్ధాను కోరుకొని అక్కడకు వెళ్ళడానికి కోరుకున్నారు. అబ్రహాము హెబ్రోనులో మమ్రె  వద్ద ఉండెను. 

అబ్రహాము యుద్దము చేయుట 

సొదొమ రాజు, గోమోర రాజు , అద్మా రాజు, సెబోయీము రాజు, బెలారాజగు సోయారులు ఏకమై వారిని అనేక సంవత్సరాలు సామంతులుగా చేసిన ఎలాము, గోయీము, షీనారు , ఎల్లాసరు రాజుల మీద యుద్దానికి వెళ్ళి మరల ఓడిపోవడం చేత శత్రువులు సొదొమో, గోమోరలో ఉన్న ఆస్తిని తీసుకొని పొతు వారు సొదొమలో ఉన్న లోతుని కూడా బంధించి తీసుకెళ్లారు. అది తెలిసిన అబ్రహాము తన ఇంట ఉన్న వారిని మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకొని పోయి రాత్రి వేళ వారిని ఎదురించి వారిని తరిమి కొట్టి లోతును అతని స్త్రీలను, ఆస్తిని విడిపించి తీసుకొని వచ్చారు. యుద్ధం నుండి పారిపోయిన సొదొమ రాజు అబ్రహాము చేసిన పని తెలుసుకొని అతని కలుసుకోవడానికి వచ్చి మనుషులను తనకి అప్పగించి వస్తువులను తీసుకోమని చెప్పినప్పుడు అబ్రహాము తన ప్రజలను మాత్రమే తీసుకొని మిగిలిన వాటిని సొదొమ రాజుకే ఇచ్చి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు నేను అబ్రహామును ధనవంతున్ని చేసాను అని అనకూడదు అని మొత్తం ఇచ్చి వేశాడు. అబ్రహము  షాలేము రాజు మెల్కిసెదేకు రొట్టెను ద్రాక్షసారాయమును కొనివచ్చి అబ్రహాముకు ఆశ్వీరచనములు పలికాడు. 

యిష్మాయేలు 

అబ్రహాముకు సారాతో పిల్లలు పుట్టక పోవడం వలన ఆమెకు ఉన్న ఒక ఐగుప్తు దాసి కన్య హాగారును స్వీకరించి తనకు బిడ్డలు కలుగ జేయమని కోరింది. ఆమె గర్భం దరించినప్పటి నుండి సారాను  చులకనగా చూడటం మొదలు పెట్టేది. సారాయి తరువాత ఆమెను పలు విధాలుగా ఇబ్బంది పెట్టగా ఆమె పారిపోయినది. 

ఒడంబడిక - సున్నతి 

అబ్రామునకు తొంబది తొమ్మిది సంవత్సరాల వయసులో దేవుడు అబ్రాముతో ఒక ఒడంబడిక ఏర్పాటు చేసుకొని ఆయన పేరును మార్చి అబ్రహాము అని పెట్టెను. ఇక నిన్ను అనేక జాతులకు తండ్రిగా చేసెదను అని చెప్పెను. నేను నీకు కానను భూమిని నీకు నీ సంతతికి ఇస్తాను అని చెప్పాడు. ఈ ఒడంబడిక గుర్తుగా సున్నతి చేసుకొనవలయును అని చెప్పారు. అలానే సారాయి పేరును సారా అని మార్చారు. ఆమె సకల జాతులకు తల్లి అగును అని చెప్పారు. 

అబ్రహాము వేడుకోలు 

మమ్రే యొద్ద ఉన్న సింధూర వృక్ష వనమున అబ్రహము తన గుడారము దగ్గర వుండగా ముగ్గురు వ్యక్తులు అక్కడ ఆయన ముందు వున్నారు. అబ్రహము గుడారము వెళ్ళి వారిని తన ఇంటిని సందర్శించమని అడిగి వారికి అతిధ్యమిచ్చారు. వారు తరువాత సారా గురించి వాకబు చేసి ఆమె మరుసటి సంవత్సరానికి ఆమె ఒక కుమారుని కనును అని చెప్పిరి. అది తలుపు చాటున నిలచి విన్న సారా తనలో తాను నవ్వుకుంది. అక్కడ నుండి సొదొమ వైపు వారు వెళుతూ అబ్రహాముకు తాము పోవుచున్న పని గురించి చెప్పారు. అక్కడి ప్రజలు పాపపు జీవితము గురించి తన చెవిన పడిన విషయమును అబ్రహముతో చెప్పడం జరిగినది. అబ్రహాము దేవునితో చెడ్డ వారితో పాటు మంచి వారిని కూడా నాశనం చేయుదురా అని ప్రశ్నించెను. ఆ పట్టణములో ఏబది మంది మంచి వారు ఉన్నచో ఆ నగరమును నాశనము చేయక కాపాడవా అని అడుగగా దేవుడు ఆ పట్టణమున ఏబది మంది మంచి వారు ఉన్నట్లయితే వారిని కాపాడుతానని చెప్పెను. ఆ విధంగా అడుగుతూ చివరకు పది మంది మంచి వారు ఉన్న ఆ పట్టణమును పాడు చేయవద్దని చెప్పగా దేవుడు దానికి ఒప్పుకోని అక్కడ నుండి వెళ్ళి పోవడం జరిగింది. 

అబ్రహాము - అబీమెలెకు 

అబ్రహాము అక్కడ నుండి నేగేబునకు వెళ్ళి కాదేషు , షూరు మధ్య ఉన్న గెరారులో పరదేశివలే నివసిస్తూ ఉన్నాడు. తన భార్యను చెల్లెలిగా చెప్పి అక్కడ జీవించేవాడు. గెరారు రాజు అబీమెలెకు సారాను తన అంతఃపురమునకు చేర్చుకున్నాడు. కాని దేవుడు ఆ రాజుకు కలలో కనపడి ఆమె వివాహిత అని చెప్పి, ఆమె వలన నీవు చనిపోతావు అని చెప్పగా అందుకు ప్రభూ నేను నిర్ధోషిని అని చెప్పి, అబ్రహామే ఆమె తన చెల్లి అని చెప్పిన సంగతి ఆమె కూడా అబ్రహాము తన  సోదరుడు అని చెప్పినందుకు దేవుడు అతనిని మన్నించి అబ్రహాముకు సారాను అప్పగించమని చెప్పి అబ్రహాము గొప్పతనను గురించి ఆయన ప్రవక్త అని , ఆయన కొరకు విన్నపములు చేస్తాడు అని చెప్పి, సారాను అబ్రహాముకు అప్పగింపకపోతే తాను మరణిస్తాడు అని చెప్పెను. అబిమేలేకు అబ్రహాముకు సారాను అప్పగించి గొర్రెలను, గోడ్లను, దాసిదాసులను అబ్రహాముకు ఇవ్వడం జరిగింది. అప్పుడు అబిమెలేకు ఇంటిలో ఉన్న వారు గర్భం ధరించారు. అంతకు ముందు దేవుడు వారి గర్భములను మూసివేసేను. 

అబ్రహామునకు వాగ్ధాన ఫలం 

దేవుడు అబ్రహామునకు మాటఇచ్చినట్లే దేవుడు సారా పట్ల కనికరం చూపి ఆమె గర్భం దాల్చి కుమారున్నీ కనింది, ఆ కుమారుడే ఈసాకు. ఈసాకు పుట్టినప్పుడు అబ్రహాము వయసు 100 సంవత్సరాలు. సారా అబ్రహాముతో హాగారును మరియు యిష్మాయేలును ఇంటి నుండి పంపించి వేయమని అడుగగా ఆయన చాలా బాధ పడ్డాడు. దేవుడు ఆయనకు ఈసాకే  తన వారసుడు అని చెప్పగా అలానే చేశాడు. కాని దేవుడు వాగ్ధాన ఫలముగా ఉన్న ఈసాకును బలిగా అర్పించమని అడిగారు. మోరియా ప్రదేశమున అబ్రహాము దేవుడు చూపించిన కొండ దగ్గరకు ఈసాకును బలి ఇవ్వడానికి  ఉదయాన్నే , ఒక గాడిద మీద బలికి కావలసిన అన్ని వస్తువులను తీసుకొని ఇద్దరు సేవకులతో బయలుదేరి వెళ్ళాడు. తన సేవకులను క్రిందనే ఉంచి ఈసాకుకు కట్టెల మోపును ఇచ్చి తాను కత్తి మరియు నిప్పు తీసుకొని కొండమీదకు వెళ్ళాడు. మార్గ మధ్యలో ఈసాకు తమకు బలికి కావలసిన బలి వస్తువు కొరకు అడుగగా దేవుడే సమకూరుస్తాడు అని సమాధానం  చెబుతాడు. ఆ కొండ మీదకు పోయిన తరువాత అక్కడ బలి ఇవ్వడానికి బలి పీఠం ఏర్పాటు చేసి  మొత్తం సమకూర్చిన తరువాత కుమారున్నీ బంధించి బలి ఇవ్వడానికి కత్తిని తీసుకొనగా అప్పుడు యావే దూత అబ్రహామును ఈసాకును ఏమి చేయవద్దని చెప్పి, అబ్రహాము హృదయం  తనకు తెలుసు అని, తన కుమారున్నీ కూడా చంపడానికి వెనుకాడ లేదని అక్కడ బలి ఇవ్వడానికి ఒక పొట్టేలు పొదలో ఉన్నదని తెలియ చేస్తుంది. అప్పుడు ఆ పొట్టేలును బలిగా అర్పించడం జరుగుతుంది. అక్కడ నుండి వచ్చే సమయంలో మరల దేవుని దూత ఆయనను దీవిస్తుంది. బెర్షాబా వచ్చి మరణించే వరకు అక్కడే ఉన్నారు. 

అబ్రహాము పండు ముసలి వయసుకు వచ్చినప్పుడు తన కుమారుడు పెండ్లి చేయావలేనని సంకల్పించి తాను తన తండ్రి స్వదేశమున ఒక అమ్మాయిని తన కుమారునికి ఇవ్వాలి అని సంకల్పించిన తాను వెళ్లలేని పరిస్తితిలో తన దగ్గర ఉన్న ప్రధాన సేవకుడిని పిలిచి తన తండ్రి ఇంటికి వెళ్ళి తన చుట్టాలలో ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఈసాకు పెండ్లి చేయాలి అని కోరడం జరిగింది. అయితే ఒక వేల అక్కడ ఎవరు ఇష్ట పడక పోయిన యెడల నీ కుమారుని అక్కడకు తీసుకువెల్లమందురా అని అడిగినప్పుడు అబ్రహాము దేవుడు అతనికి చేసిన వాగ్ధానం గుర్తు చేసుకొని దేవుడు తనను వదలి పెట్టి రమ్మనిన ప్రదేశమునకు మరల తిరిగి తన కుమారుని పంపించడానికి ఒప్పుకోలేదు. 

అబ్రహాము భార్యలు - మరణం 

సారా కనానులో హెబ్రోనులో  నూట ఇరవై ఏడేండ్లు వయసులో మరణించినది, ఆమెను మక్ఫెలాలో సమాది చేశారు.  అబ్రహాము చివరిగా కతూరా అను స్త్రీ ని వివాహమాడగా ఆమె అతనికి ఆరుగురు బిడ్డలను కన్నది. అబ్రహాము తనకు ఉన్నది అంతయు ఇస్సాకునకు ఇచ్చి మిగినలిన వారికి బాహుమనములను ఇచ్చి వారిని తూర్పు వైపుగా తూర్పు దేశము వైపు పంపి వేశాడు. ఆయన చనిపోయే సమయానికి అబ్రహాము వయస్సు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు. అబ్రహామును ఈసాకు , యిష్మయేలు  మమ్రేకు తూర్పున ఉన్న మక్ఫెలా గుహలో పాతిపెట్టారు. అతని భార్య సారాను కూడా అక్కడే పాతి పెట్టిరి. 

యోహాను 14:1-12

 యోహాను 14:1-12 

యేసు వారితో "మీ హృదయములను కలవరపడనియకుడు. దేవుని విశ్వసింపుడు. నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. లేకున్నచో నేను మీతో అటుల చెప్పను. నేను మీకొక నివాసస్థానమును సిద్దము చేయబోవుచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి, మరల వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును  మీరు ఎరుగుదురు." అనెను. తోమా ఆయనతో "ప్రభూ! మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు. ఇక మార్గమేట్లు ఎరుగుదుము?" అనెను. అందుకు యేసు, "నేనే మార్గమును, సత్యమును, జీవమును నా మూలముననే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. మీరు నన్ను ఎరగియున్నచో, నా తండ్రిని కూడా ఏరిగి యుందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు.  మీరు ఆయనను చూచి ఉన్నారు. అని పలికెను. అప్పుడు ఫిలిప్పు "ప్రభూ! మాకు తండ్రిని చూపుము. మాకు అది చాలును" అనెను. అందుకు యేసు ఇట్లనెను: "ఫిలిప్పు! నేను ఇంత కాలము మీతో  ఉంటిని. నన్ను తెలిసికొనలేదా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపుమని ఏట్లు అడుగుచున్నావు! నేను తండ్రియందు, తండ్రి నా యందు ఉన్నామని నీవు విశ్వసించుట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుట లేదు. కాని, నా తండ్రి నా  యందు నివసించుచు, తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాననియు, తండ్రి నా యందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టియైనను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెల్లుచున్నాను. కనుక, నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 

మీ హృదయములను కలవరపడనియకుడు 

యేసు ప్రభువు తన శిష్యులతో మీ హృదయములను కలవరపడనియకుడు అని చెబుతున్నారు. శిష్యులు కలవరపడవలసిన పరిస్తితి ఎందుకు వచ్చినది? ఎందుకంటే యేసు ప్రభువు వారి నుండి వెళ్లిపోతున్నాను అని చెప్పారు. మూడు సంవత్సరాలు వారు యేసు ప్రభువుతో కలిసి జీవించారు. ఆయన చేసిన అన్ని అద్భుతకార్యములకు, ఆయన చూపిన కారుణ్యమునకు వీరు సాక్షులు. శిష్యులకు ఆయన జీవితం భరోసా అయ్యినది. అటువంటి ప్రభువు ఇప్పుడు వారి నుండి వెళ్లిపోతున్నారు. ఇంకా ఎందుకు వీరు కలవరపడుతున్నారు? యేసు ప్రభువుకి పరిసయ్యులు, ధర్మ శాస్త్ర భోదకులు కొంత మంది సద్దుకయ్యులు శత్రువులుగా మారిపోయారు. ఇప్పుడు యేసు ప్రభువు వీరి నుండి వెళ్లిపోతే యేసు ప్రభువు శిష్యులు వారికి శత్రువులుగా మారిపోతారు. ఎందుకంటే వారికి యేసు ప్రభువు అంటే ఇష్టం లేదు. వారు యేసు ప్రభువు వారి నుండి వెళ్ళిన తరువాత వీరిని   శిక్షిస్తారు అని కలవరం వారికి ఉండవచ్చు.  యేసు ప్రభువుకు మరియు శిష్యులకు ఉన్న సంబంధం చాలా అన్యోన్యత కలిగిఉన్నది. ఈ అన్యోన్యత తెగిపోతుంది అని వారు కలవరపడి ఉండవచ్చు. యేసు ప్రభువుతో కలిసి వారు భుజించారు, కలిసి భుజించడం వారి సామాజిక పరిస్థితుల ప్రకారం వారి మధ్య ఉన్న అన్యోన్యత మరియు వారి స్నేహానికి గుర్తు. యేసు ప్రభువు శిష్యులను స్నేహితులులా చూశారు. ఈ స్నేహం తెగిపోబోతుంది. ఇవన్నీ వారి కలవరానికి కారణాలు. 

యేసు ప్రభువుతో పేతురు, తన గురువు కోసం  మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, అందరు వెళ్ళిపోయిన తాను వదలి వెళ్ళను అని అన్నాడు, దానికి యేసు ప్రభువు, పేతురు యేసు ప్రభువు ఎవరో కూడా తెలియదు అని చెప్పడానికి  కూడా వెనుకాడడు అని చెప్పారు. తనను యేసు ప్రభువు నమ్ముట లేదు అని, ఏమి జరుగబోవుతుందో అని కలవరపడిఉండవచ్చు.  తమ గురువును వారే అమ్మబోవుతున్నారు అని యేసు ప్రభువు చెబుతున్నారు, అది తలచుకొని వారు కలవరపడి ఉండవచ్చు. ప్రతి ఒక్కరికీ ఒక్కో కారణం ఉండి ఉండవచ్చు కలవరపడటానికి, అది వారికి యేసు ప్రభువుకు మధ్య ఉన్న అన్యోన్యత మరియు ప్రేమ మీద ఆధారపడుతుంది. యేసు ప్రభువు వీరికి కలవరపడవద్దు అని చెబుతున్నారు. 

నిత్యము మనలను కాపాడి  మన మధ్య ఉండే ప్రభువు - మనలను తనతో తీసుకుపోతారు 

యేసు ప్రభువు తన శిష్యులు కలవరపడకుండా ఉండుటకు ఆయన కారణం చెబుతున్నారు.  ఆయన వారి నుండి  పోవుతున్నది వారి కోసమే అని చెబుతున్నారు. వారు ఎందుకు కలవరపడనవసరం లేదంటే, ఆయన వారి నుండి వెల్లుతున్నది వారికి ఒక నివాసస్థానం ఏర్పాటు చేయడానికి. మరలా ఆయన వారి వద్దకు వచ్చును. ఆయన వుండే చోటూనే వీరు కూడా ఉండే విధంగా ఆయన చేస్తారు. కనుక వారు కలవరపడనవసరం లేదు. "నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. లేకున్నచో నేను మీతో అటుల చెప్పను. నేను మీకొక నివాసస్థానమును సిద్దము చేయబోవుచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి, మరల వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును." ఈ నివాస స్థానం పరలోకమే. దేవుని నివాస స్థానమే. అది మనకు నిజమైన, శాశ్వతమైన నివాసం. ఇది తండ్రి  మరియు కుమారునికి మధ్యగల సంబంధం తెలియజేస్తుంది. తండ్రి దగ్గర ఏమి ఉంది అనేది తెలిసినది పూర్తిగా కుమారునికి మాత్రమే.  అందుకే ఆయన "నా"తండ్రి గృహమున అనేక నివాసములు కలవు అని చెబుతున్నారు. ఈ సంబంధం గురించి ఆయన అనేక సార్లు చెప్పుటకు కారణం ఏమిటి అంటే తన తండ్రిని ఆయన అంతగా ప్రేమిస్తున్నారు అని తెలియచేయడమే, ఆయనే పనులను మాత్రమే కుమారుడు చేస్తున్నాడు. తండ్రికి తెలియకుండా ఏమి చేయుటలేదు. ఆయన తన తండ్రి గృహమున మనకు ఒక నివాసాన్ని ఏర్పాటుచేయడానికి కల్వరి కొండమీద శిలువ మరణం ద్వారా మనకు సిద్దపరుస్తున్నాడు. మూడు రోజులు భూగర్భంలో ఉండి మనకు నివాసాన్ని ఏర్పాటుచేస్తున్నాడు. 

"నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును." యేసు ప్రభువు ఇక్కడ చేసిన ఈ వాగ్ధానం తన శిష్యులకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆయన తన శిష్యులను వదలి వేయడం లేదు. ప్రత్యేకంగా వీరి కొరకు వస్తాను అని చెబుతున్నారు. ఇది లోకాంతంలో కాదు. ఇది తన శిష్యులు ఎప్పుడు కూడా ఆయన సాన్నిధ్యం పొందేలా చేస్తుంది. అంతేకాక వీరిని తన వద్దకు చేర్చుకుంటాను అని చెబుతున్నారు. యేసు ప్రభువు తన శిష్యులను , మరియు తన శిష్యుల ద్వారా ఆయన అనుచరులు అయిన వారికి ఇచ్చిన ఒక గొప్ప వరం ఇది. నేను ఉండు స్థలమునే మీరును ఉండునట్లు నా వద్దకు చేర్చుకొందును అనే వాగ్ధానం మరల ఆయన శిష్యులు ఎవరు నీరుత్సాహంలో లేకుండే చేసే వాగ్ధానం. కాని దీనిని ఎల్లప్పుడు గుర్తుంచుకోవడంలో మనం విఫలం  చెందుతున్నాము. యేసు ప్రభువు చేసిన ప్రతి వాగ్ధానం మనం గుర్తు చేసుకొని మనం జీవించినచో మన జీవితంలో ఎటువంటి అపాయంలో కూడా మనం కలవరపడకుండా ఉండగలం. 

తండ్రి మన గమ్యం కుమారుడే మార్గం- ఈ మార్గమే గమ్యం -దేవున్ని ఎలా తెలుసుకోవాలి? ఎలా దేవుని దగ్గరకు వెళ్ళాలి?

తోమా ఆయనతో "ప్రభూ! మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు. ఇక మార్గమేట్లు ఎరుగుదుము?" అనెను. తోమస్సు యేసు ప్రభువు చెప్పిన మాటలు అర్ధం చేసుకోలేక పోయాడు. అందుకే ఆయనే  ఎక్కడకు వెళుతున్నారో తెలియదు అని చెబుతున్నారు. తోమసు మొదటి నుండి తనకు అర్ధం కాని విషయములను అడుగుటకు సిగ్గుపడలేదు. ప్రభువు ముందు తనను ఏప్పుడు గొప్పవాడిగా లేక మొత్తం తెలిసిన వానిగా చూపించుకోవాలని చూడలేదు, తన నిజ స్తితి ఎప్పుడు బహిర్గతం చేస్తునే ఉన్నాడు. అందుకే ప్రభూ మీరు ఎక్కడకు వెళుతున్నారో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు ఎరగుదుము అని అంటున్నారు. అందుకు ప్రభువు నేనే మార్గము సత్యము జీవము. నా మూలమునే తప్ప ఎవడును తండ్రి దగ్గరకు రాలేడు అని చెబుతున్నాడు. యేసు ప్రభువు జీవితం మొత్తం కూడా తండ్రిని తెలియపరచడమే. తండ్రి ఎలా ప్రేమిస్తారు, తండ్రి ఎలా క్షమిస్తారు, తండ్రి ఎలా మనలను దగ్గరకు తీసుకుంటారు, తండ్రి ఎలా మన కోసం పరితపిస్తారు అనే విషయాలు యేసు ప్రభువు ద్వారానే మనం తెలుసుకుంటున్నాము. ఈ విషయాలు ఇంతకు ముందు చెప్పిన అవి వారికి అర్ధం కాలేదు. మరలా యేసు ప్రభువు వారికి తెలియజేస్తున్నారు. యేసు ప్రభువు ద్వారా మాత్రమే మనం తండ్రిని ఆయన పూర్తి ప్రేమను తెలుసుకోగలం, యేసు ప్రభువు నేనే మార్గం అని చెబుతున్నారు. 

దేవున్ని మనం ఎలా తెలుసుకోగలము? ఆయన దగ్గరకు మనం ఎలా వెళ్లగలము? ఆయన ఎవరు? అనే ప్రశ్నలకు యేసు ప్రభువు మాటలలో మనకు సమాధానం దొరకుతుంది. అంతేకాక ఆ సమాధానం ఆయనే అవుతున్నారు. యేసు ప్రభువే తండ్రి దగ్గరకు వెళ్ళుటకు మార్గం, మరియు ఆయన మన గమ్యంగా ఉంటారు, ఎందుకంటే ఆయనను చేరుకున్నప్పుడు తండ్రిని చేరుకున్నట్లే, ఆయన తండ్రి యందు తండ్రి ఆయన యందు ఉన్నారు. ఆయనే సత్యము, ఆయన కేవలం సత్యమును తెలియజేయుటకు మాత్రమే రాలేదు, ఆయనే సత్యం, ఆయన మాత్రమే నిత్యుడు, ఆయన మనకు జీవం ఇచ్చువాడు మాత్రమే కాదు ఆయనే జీవము. కనుకనే యేసు ప్రభువు మాత్రమే తండ్రి దేవుని దగ్గరకు మార్గం, ఆయన ద్వారా మాత్రమే మనం తండ్రిని చేరుకోగలం. 

ప్రభువే మార్గం 

నేనే మార్గం, సత్యం, జీవం. నా ములమున తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు.  యేసు ప్రభువు ఇక్కడ తోమసు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు. నేనే మార్గం అని చెబుతున్నారు. తండ్రి దగ్గరకు పోవుటకు యేసు ప్రభువు మాత్రమే మార్గం. ఎందుకంటే తండ్రి గురించి పూర్తిగా తెలిసినది కుమారునికి మాత్రమే. యేసు ప్రభువు ఇతర ప్రవక్తల వలె, నాయకుల వలె, న్యాయాధిపతుల వలె కాక తండ్రి ప్రేమను, కరుణను, కృపను, తండ్రి అయిన దేవున్ని చూపించడంలో విఫలం చెందక, పూర్తిగా దానిలో సఫలీకృతం అయ్యి తండ్రిని తన మాటల ద్వారా, పనుల ద్వారా మరియు అద్భుతాల ద్వారా, కరుణ ద్వారా మరియు తాను చూపించిన ప్రేమ ద్వారా తెలియ పరిచారు. ఎవరు ఈ తండ్రి అని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం యేసు ప్రభువు జీవితం ద్వారా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చేసిన పనులన్నీ తండ్రి ద్వారానే చేశారు, తానకై తాను చేయక, తండ్రి ఇష్టప్రకారమే అన్ని చేశాడు. అలా తండ్రిని తన ద్వారా చూపించాడు. ఆ తండ్రి దేవున్ని తెలుసుకోవడానికి మార్గం కేవలం యేసు ప్రభువు మాత్రమే. యేసు ప్రభువు దేవున్ని తెలుసుకోవడానికి మార్గం మాత్రమే కాదు, ఆయన గమ్యం కూడా. ఈ మార్గం మనలను ఎక్కడకు తీసుకుపుతున్ననది, అంటే తండ్రి దగ్గరకు. తండ్రి మరియు కుమారుడు ఎప్పుడు ఏకమై ఉన్నారు. ఆ విధంగా ఆయనే మనం మార్గం మరియు గమ్యంగా ఉన్నారు. ఆయనను అనుసరించినచో మనము ఎప్పటికీ మార్గమును తప్పక, ఆయనను అనుసరించిన ప్రతి ఒక్కరూ గమ్యం చేరుకుంటారు.

యేసు ప్రభువు సత్య స్వరూపుడు  

యేసు ప్రభువు నేనే సత్యం అని చెబుతున్నారు. ఏమిటి ఈ సత్యం? యేసు ప్రభువును సత్యమనగా ఏమిటి? అని పిలాతు అడుగుతున్నారు. యేసు ప్రభువు తనను తాను లోకమునకు  వెలుగు అని చెబుతున్నారు. ఆయనలో అంధకారం అనేది ఏమి లేదు.  నేనే సత్యం అని యేసు ప్రభువు చెబుతున్నప్పుడు ఆయనలో అసత్యం అనేది ఏమి లేదు. ఆయన పూర్తిగా సత్యం. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా సత్యం. ప్రతిదీ కూడా జరిగితీరుతుంది. మన మాటలలో అనేక అసత్యాలు ఉంటాయి కాని యేసు ప్రభువు సత్యం. ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా యేసు ప్రభువు వలె సత్యం కాదు, వారి వారి జీవితాలలో అనేక సార్లు అసత్యం అడినవారే. సత్యం మనలను స్వతంత్రులను చేస్తుంది. సత్యం మనకు దేవున్ని తెలియపరుస్తుంది. సత్యమును అన్వేషించే ప్రతి వారు కూడా దేవున్ని అన్వేషించే వారే. దేవుడు సత్య స్వరూపుడు. అందుకే యేసు ప్రభువు తాను సత్యమును అని చెపుతున్నారు.  అసలు సత్యం అంటే ఏమిటి? తత్వశాస్త్రంలో అరిస్టాటిల్ సత్యం గురించి  ఉన్నదానిని ఉన్నది అని చెప్పడం, తెలుసుకోవడం సత్యం అని చెబుతారు. పునీత  అక్విన  తోమసు గారు సత్యం గురించి నిత్యం ఉండునది సత్యం అని చెబుతున్నారు. కేవలం దేవుడు మాత్రమే నిత్యం ఉండేది. అందుకే యేసు ప్రభువు నేనే సత్యము అని చెబుతున్నారు. 

యేసు ప్రభువే జీవం 

నేనే జీవం అని యేసు ప్రభువు చెబుతున్నారు. దేవుడు జీవం, మనందరికీ జీవం ఉంది. కాని దేవుడు జీవం. మన నుండి ఈ జీవం వెళ్ళి పోతుంది. కాని దేవుడే జీవం కాబట్టి ఆయన నుండి అది వెళ్లిపోదు, అందుకే మనం ఆయనను స్వయంబు అని చెబుతున్నాము. తాను జీవించుటకు ఎవరి మీద ఆధారపడలేదు. కాని మనం మన జీవించుటకు వేరే వారి మీద ఆదరపడిఉంటాం.  మనం కూడా ఈ జీవంతో ఎల్లప్పుడు  ఉండాలి అనే కోరిక ఉంటుంది అది ఆయన మనకు ఇస్తాడు ఎందుకంటే ఆయన జీవం కాబట్టి. అందుకే యేసు ప్రభువు నేనే జీవం అని చెబుతున్నారు. యేసు ప్రభువు ఈ విషయం గురించి అనేక సార్లు చెప్పారు. పాత నిబంధనలో కూడా దేవుని గురించి మోషే అడుగుతున్నప్పుడు దేవుడు ఆయన ఎవరు అని చెబుతున్నారు. మోషే , దేవునితో నిన్ను ఎవరు పంపారు, ఆయన పేరు ఏమిటి అని అడిగితే నేను ఏమి చెప్పాలి అని అడుగుతున్నప్పుడు దేవుడు ఆయనకు చెబుతున్నారు. "నేను ఉన్నవాడను" అని. ఇక్కడ ఉన్నవాడు అంటే కలకాలం ఉండేవాడు అని అర్ధం. ఆయన గతించిన కాలంలో ఉన్నాడు, భవిష్యత్తు కాలంలో ఉంటాడు, మరియు వర్తమాన కాలంలో ఉన్నాడు అని అర్ధం. ఇలా ఎందుకు అంటే ఆయన జీవం కాబట్టి. ఏవరు అయితే కలకాలం ఉండాలి అంటే ఆయన దగ్గరకు వెళ్ళాలి. 

ఇవి  అన్ని కూడా దేవుని లక్షణాలు,   యేసు ప్రభువు తన జీవితం ద్వారా తండ్రిని మనకు తెలియజేస్తున్నాడు. అందుకే యేసు ప్రభువు మాత్రమే దేవుని దగ్గరకు మనలను తీసుకువెలుతారు, ఎందుకంటే యేసు ప్రభువుకు మాత్రమే తండ్రి పూర్తిగా తెలుసు. అందుకే యేసు ప్రభువు ములమునే మనం తండ్రి దగ్గరకు వెల్లగళం. తండ్రిని మనం తెలుసుకోవాలి అనుకున్న, లేక తండ్రిని చూడాలి అని అనుకున్నా మనం యేసు ప్రభువును తెలుసుకోవాలి, మరియు చూడాలి. అందుకే పిలిప్పు తండ్రిని చూపించమని అడుగుతున్నప్పుడు యేసు ప్రభువు, పిలిప్పు నీవు నన్ను చూడలేదా? అని అడుగుతున్నారు. యేసు ప్రభువు మాటలు మొత్తం తండ్రి మాటలు, యేసు ప్రభువు పనులు మొత్తం తండ్రి పనులు. ఇక్కడ యేసు ప్రభువు ఇంకొక మాట చెబుతున్నారు. అది ఏమిటి అంటే నేను తండ్రి యందు మరియు తండ్రి నా యందు ఉన్నాము అని చెబుతున్నారు. యేసు ప్రభువు అనేక సార్లు తండ్రితో తన ఐక్యత గురించి చెప్పారు. యేసు ప్రభువు తన శిష్యులను ఆయన చేసిన పనులను బట్టి అయిన తనని విశ్వసించమని చెబుతున్నారు. ఆయనను విశ్వసించిన వారి ద్వారా మరియు తన శిష్యుల ద్వారా ఆయన అనేక మంచి పనులను చేస్తారు. ఆయన శిష్యులు ఆయనను ఏమి అడిగిన అది దయచేస్తాను అని వాగ్ధానం చేస్తున్నారు. 


ఈసాకు జీవిత చరిత్ర

 ఈసాకు జీవిత చరిత్ర 

వాగ్ధాన ఫలం 

అబ్రహాము సారాలు అనేక సంవత్సరాలు సంతానం కోసం ఎదురుచూశారు. అబ్రహాము సారాలను  దేవుడు ఆశీర్వాదించి వారికి ఒక బిడ్డను వారి వృద్ధాప్యంలో ప్రసాదించాడు. ముసలితనంలో సారాకు  ఈసాకు జన్మించాడు. ఈసాకు జన్మించినప్పుడు అబ్రహాము వయసు 100 సంవత్సరాలు. ఈసాకు అను పేరును ఆయన పుట్టక పూర్వమే దేవుడు వారికి సూచించాడు. ఈసాకు  అంటే  "ఆయన నవ్వాడు" అని అర్ధం. సారా  జీవితంలో జరిగిన ఈ సంఘటన తనకు కూడా ఒక వింతలా ఉన్నది. అసంభవం అయినటువంటి సంఘటనకు ఆమెకే నవ్వు వచ్చింది. ఈ వయసులో  నేను గర్భం దాల్చడం ఏమిటో అనే ఆలోచనతో ఆమె నవ్వుకుంది.  పుట్టుకతోనే తల్లిని ఈసాకు నవ్వించినవాడు. ఈసాకు ఒడంబడిక పుత్రుడు మరియు దైవ వాగ్ధాన ఫలం.  సారా తన కుమారుడే అన్నింటికీ వారసుడు కావాలి అని అనుకున్నది అందుకే, ఆమె యిష్మాయేలును అక్కడ నుండి పంపించమని చెప్పినందుకు, అబ్రహము దానికి ఇష్ట పడకపోయిన దేవుడు ఆయనకు సారా చెప్పినట్లు చేయమని చెప్పారు. 

తండ్రి మాటకు కట్టుబడే  కుమారుడు 

అబ్రహము  బలి అర్పించటానికి మోరియా వెళుతున్నప్పుడు, అక్కడకు చేరిన తరువాత కొండ మీదకు అక్కడ సేవకులను, గాడిదను అక్కడ వదలి పైకి వెళుతున్నారు, మార్గ మధ్యలో ఈసాకు తన తండ్రిని బలి ఇవ్వడానికి గొర్రె పిల్ల ఎక్కడ అని అడుగగా ఆయన దేవుడే ఇస్తాడు అని చెబుతున్నాడు.  ఈసాకు కొండ మీదికి వెళ్ళిన తరువాత బలికి సిద్ధం చేసిన తరువాత ఈసాకు ఆ పీఠం మీద బలి వస్తువుగా పడుకుంటున్నాడు. బలికి సిద్ధమవుతున్నాడు. తన తండ్రి చిత్తానికి తన జీవితాన్ని అర్పిస్తున్నాడు. ఈసాకు యేసు ప్రభువు వలె తన తండ్రి ఏమి చెప్పిన చేయడానికి సిద్ధం అవుతున్నాడు. 

ఈసాకుకు 8వ రోజున సున్నతి చేశారు. అబ్రహాము తన కుమారున్ని, దేవునికి బలిగా అర్పించడానికి తీసుకొని పోయినప్పుడు, ఈసాకు  మారు మాట్లాడకుండా తండ్రి చెప్పినట్లు ఆ బలి పీఠం మీద బలిగా అర్పించబడటానికి సిద్ధపడ్డాడు. ఈయన తన తండ్రి మీద విశ్వాసం వుంచి తండ్రి మాట జవదాటని వానిగా తన జీవితం మొత్తం కూడా ఉన్నాడు. ఆ విధంగా యేసు ప్రభువు వలె, బలి కావడానికి సిద్ధమైన వాడు, తండ్రి ఇష్టమునకు తన జీవితమును అర్పించడానికి  సిద్దమైన వాడు. తన తండ్రి చిత్తమునకు తన జీవితమును అర్పించడానికి సిద్ధమైనప్పటి నుండి ఈసాకు దేవునికి అంకితమైనటువంటి వానిగా జీవించాడు.

 అబ్రహాము ఇష్టప్రకారం తన పెండ్లిని కూడా నిర్ణయించే అధికారం మాత్రం తండ్రికే వదలి పెట్టాడు ఈసాకు.ఈసాకు మాత్రమే తన భార్య ఎవరు కావాలనేది దేవుని చిత్తమునకు వదలిపెట్టాడు.  అబ్రహాము తన జీవిత ముగింపులో ఉన్నాడు. తాను స్వయంగా ఈసాకుకు పెండ్లి కుమార్తెను చూడుటకు తన సేవకుడిని పిలిచి హారాను వెళ్ళి తన చుట్టాలలో ఒకరిని చూడమని చెప్పారు. ఆయనకు తన కుమారునికి అక్కడ వారు ఐగుప్తు వారిలో కాకుండా తన సొంత వారి దగ్గర నుండి మాత్రమే  చేసుకోవాలి అనుకున్నాడు. కనుక తన సేవకుడు హారాను వెళ్ళి రెబ్కాను తీసుకొని వచ్చారు.

తల్లి మరణము - స్త్రీకి ఈసాకు ఇచ్చిన గౌరవం - ఆధ్యాత్మిక చింతన 

సారా మరణించిన తరువాత ఈసాకు చాలా క్రుంగిపోయాడు. తన తల్లి చనిపోయే నాటికి ఇస్సాకు మూప్పై ఆరు సంవత్సరాలు వయసులో ఉన్నాడు.  ఈ కృంగుబాటు నుండి తన పెండ్లి తరువాత మాత్రమే బయట పడుతున్నాడు. తన తల్లి చనిపోయినందుకు ఈసాకు చాలా దుఃఖించాడు. తనకు పెళ్లి అయినంత వరకు తనకు తల్లి లేని లోటు, ఆ బాధ నుండి బయటపడలేక పోయాడు. విశ్వాస పితరులలో కేవలం ఒక్క ఈసాకు మాత్రమే ఒకే భార్య కలిగి ఉన్నాడు. తన జీవితంలో మరొక స్త్రీ కి స్థానం కలిగించలేదు. ఈసాకు మొదటి నుండి ఆధ్యాత్మిక చింతన కలిగి జీవించాడు. అబ్రహాము సేవకుడు రెబ్కాను ఈసాకుకు  భార్యగా చేయడానికి హారను నుండి తీసుకొని వస్తున్నప్పుడు ఆయన పొలంలో ధ్యానిస్తున్నాడు. ఆమెను తీసుకొని వస్తున్నప్పుడు నెగెబు వద్ద ధ్యానించుకొనేందుకు ఈసాకు పొలమునకు వెళ్ళిన తావునే వారు రాగా రెబ్కా అక్కడ కనపడుతున్న ఈసాకు గురించి వాకాబు చేయగా సేవకుడు ఆయనే ఈసాకు అని ఆమెకు చెప్పగా ఈసాకు ఆమెను తీసుకొని పోయి భార్యగా చేసుకొన్నాడు. తరువాత వారు అక్కడకు రాగ, ఆమెను తీసుకు వెళ్ళి తన భార్యగా చేసుకొనుచున్నాడు. ఈసాకు తన తల్లి లేని లోటును తన భార్య ద్వారా తీర్చుకున్నాడు అంటే అంతగా ఆమె మీద ఆధారపడ్డాడు, మరియు ఆమెను అంతగా ప్రేమించాడు. ఇక్కడ మనం ఈసాకు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి అని చూస్తున్నాం. 

ఈసాకు తండ్రి ఆగుట 

ఈసాకు నలువది సంవత్సరాల ప్రాయంలో పెండ్లి చేసుకున్నాడు. చాలా సంవత్సరాల వరకు వీరికి బిడ్డలు కలుగలేదు. తరువాత దేవుని కృప వలన రెబ్కా ఇద్దరి కవలలకు జన్మనించింది. ఏసావు మరియు యకొబు ఇద్దరు బిడ్డలు  పుట్టారు. రిబ్కా తండ్రి పేరు బెతూవెలు, ఆమెకు లాబాను అను ఒక సోదరుడు కలడు. ఆమె గొడ్రాలు అవుటవలన ఆమె కొరకు ఈసాకు దేవుని వెదుకొనగా ఆమె గర్భవతి అయ్యింది. ఇద్దరు కవల పిల్లలు పుట్టిరి. వారు గర్భమున ఉండగానే ఒకరిని ఒకరు నెట్టుకొనిరి. మొదట పుట్టిన బిడ్డ ఎర్రగా ఉండెను. రోమవస్త్రము వలె అతని ఒడలియందంతట వెంట్రుకలు ఉండెను. అతనికి ఏసావు అని పేరు పెట్టిరి. మొదటి బిడ్డ పుట్టిన వెంటనే అతని మడమ పట్టుకొని రెండవ బిడ్డ కూడా పుట్టాడు. అప్పడు ఈసాకు వయసు అరువై. 

వలస జీవితం - దేవుని తోడ్పాటు - ఈసాకు వృద్దిచెందుట

అబ్రహాము కాలములో  కరువు వచ్చిన సమయంలో ఈసాకు పిలిస్తీయుల రాజు అబీమెలెకు  దగ్గరకు వెళ్లారు. ఆ కాలంలో అబిమెలెకు గెరారులో ఉన్నారు. దేవుడు ఈసాకుకు ప్రత్యక్షమై ఐగుప్తు వెల్లవద్దని, ఆ దేశమునే ఉండమని చెప్పగా, ఈసాకు దేవుడు చెప్పినట్లుగానే గెరారులో జీవించాడు. అక్కడ ఈసాకు భయపది  రిబ్కాను తన సోదరి అని చెప్పి జీవించుచున్నాడు. ఆమె తన భార్య అని చెప్పుటకు ఆయన భయ పడ్డాడు. అబీమెలెకు రాజు , ఈసాకు తన భార్యతో సరసమాడుచు ఉండగా చూశాడు. అతడు ఈసాకును నిజము చెప్పమని అడుగుగా అతను తన భార్య అని ఒప్పుకున్నాడు. అప్పుడు అబీమెలెకు ఈసాకును గాని రిబ్కాని కాని ముట్టుకొన్న వారికి చావుముడుతుంది అని తన ప్రజలను హెచ్చరించాడు.

 ఈసాకు అక్కడ పొలములో విత్తనములు విత్తగా అది వందరెట్లు పంట ఇచ్చింది. ఆ విధంగా మహా సంపన్నుడు అయ్యాడు. దినదినాభివృద్ది చెందుతూ వచ్చాడు. గొర్రెలు, గొడ్లు సేవకులు ఇంకా అనేక సంపదలు సంపాదించాడు. అది చూసి పిలిస్తియులు ఆయన మీద అసూయ పడ్డారు. వారు అబ్రహాము కాలమున తవ్విన బావులను మట్టితో పూడ్చివేశారు. అబీమెలెకు  కూడా నీవు మాకంటే సంపన్నుడవు అయ్యావు ఇక్కడి నుండి వెళ్లిపో అని చెప్పాడు, అపుడు ఈసాకు  అక్కడనుండి గెరారు లోయలో, గూడారములు వేసుకొని అక్కడే నివసించాడు. ఈసాకు అబ్రహాము కాలము నాటి బావులను మరల త్రవ్వించి, వాటికి అబ్రహాము పెట్టిన పేర్లు పెట్టించాడు. ఈసాకు  బానిసలు ఆ స్థలంలో త్రవ్వగా  అన్ని చోట  నీరు పడ్డాయి. కాని గెరారు కాపరులు వచ్చి ఆ నీళ్ళు మావని వాదనకు దిగారు. కనుక ఆ బావికి ఎసెకు అని పెట్టారు, దాని అర్ధం  జగడము. తరువాత ఈసాకు పనివారు మరియొక బావిని త్రవ్వగా దాని కొరకు వారు పోట్లాడిరి, కనుక దానికి సిత్నా అను పేరు పెట్టిరి, అనగా పగ అని అర్ధం. అక్కడ నుండి పోయి ఈసాకు మరియొక బావి త్రవ్వించెను దానికి రెహోబోతు అని పేరు పెట్టి ఈనాటికి దేవుడు మాకు కావలసినంత చోటు చూపించేను, ఇక మేము ఇక్కడ అభివృద్ది చెందగలము అని అనెను. ఆ రాత్రి ఈసాకు బేర్షేబాకు వెళ్ళగా దేవుడు ఆయనకు ప్రత్యక్షమై అతనితో నేను నీ తండ్రి అబ్రహాము కొలిచిన దేవుడను భయపడకుము, నీకు చేదోడుగా ఉందును, నీ తండ్రిని బట్టి నిన్ను దీవింతును, నీ సంతతిని విస్తరిల్లచేయుదును అని చెప్పగా, ఈసాకు అక్కడ ఒక బలిపీఠము నిర్మించి, దేవుని అక్కడ ఆరాధించి అక్కడే గుడారము వేసికొనేను. అతని బానిసలు అక్కడ కూడా ఒక బావిని తవ్విరి. 

అబిమెలెకు తో వడంబడిక 

అబిమెలెకు తన సలహాదారుడు ఆహుసతు, సేనాధిపతి ఫీకోలుతో గెరారు నుండి ఈసాకు కడకు వచ్చి దేవుడు ఆయనకు తోడుగా ఉండుట చూచి, దేవుడు నీకు చేదోడుగా ఉండుట మేము కన్నులారా చూచితిమి, మేము నీకు ఎన్నడూ కీడు చేయలేదు. కనుక మేము నీకు కీడు చేయనట్టే నీవు మాకు ఏ కీడు చేయనని మాట ఇవ్వమని అడిగిరి, అందుకు ఈసాకు వారికి విందు తయారు చేయగా, విందు చేసి ఉదయాన్నే ప్రమాణములు చేసుకొనిరి. తరువాత వారు మిత్ర భావంతో వెళ్లారు. ఆరోజే ఈసాకు పనివారు ఒక బావిని త్రవ్వగా అక్కడ  నీరు పడెను. ఆ బావికి షేబా అను పేరు పెట్టెను. అందుకే ఇప్పటికి కూడా ఆ నగరము బేర్షేబా అను పేరిట ఉంది.  అంటే ప్రమాణము చేసిన బావి అని అర్ధం. 

యాకోబు ఈసాకు దీవెనలు పొందుట 

ఏసావు యూదితును, బాసెమతును వివాహం చేసుకొన్నారు, వారు  హిత్తుయులగు బీరీ మరియు ఏలోను కుమార్తెలు , వీరి వలన ఈసాకు మరియు రిబ్కాకు తీవ్ర మనస్తాపము కలిగింది. ఈసాకు పండు ముసలి వాడు అయిన తరువాత అతని కనులు కనపడనంతగా మసకపడెను. సుమారు 50 సంవత్సరాలు ఆయన గుడ్డివానిగానే జీవించాడు.  అతడు పెద్ద కుమారుడు ఏసావును పిలిచి జింక మాంసం తీసుకొనివచ్చి తనకు వడ్డించమని, తరువాత తను తృప్తిగా భుజించి తనను దీవించి కన్నుమూసెదను అని చెప్పాడు. 

అది వినిన రిబ్కా యాకోబుతో రెండు మేకలను  తీసుకొని రమ్మని చెప్పి దానిని రుచికరముగా వండి మీ తండ్రికి వడ్డించి నీవు దీవెనలు పొందమని చెప్పింది. అందుకు యాకోబు తన అన్న శరీరం అంత వెంట్రుకలతో వున్నది గదా, తండ్రి నన్ను తడిమి చూచిన తెలుసుకొనును గదా ,అప్పుడు నాకు తండ్రి కోపము  శాపము అవునేమో అని  చెప్పగా , దానికి ఆమె ఆ శాపమేదో నాకే తగలనిమ్ము, నీవు మాత్రము వెళ్ళి చెప్పినట్లు చేయని చెప్పగా యాకోబు అట్లే చేసెను. అప్పుడు తల్లి భోజనం తయారు చేసి ఏసావు కట్టుకొనే మేలి ఉడుపులు ఇంటిలో ఉండగా రిబ్కా వాటిని తీసుకొని యాకోబుకి ఇచ్చి, మేక పిల్ల తోళ్ళతో యాకోబు చేతులను, నున్ననిమెడను కప్పి, ఆమె సిద్దము చేసిన భోజనము  యాకోబుకు ఇచ్చి తండ్రి వద్దకు పంపెను.  యాకోబు తండ్రి వద్దకు రాగ, ఈసాకు ఇంత తొందరగా ఎలా మాంసం దొరికినది అని అడగ్గా నీ దేవుడైన యావే దానిని నా వద్దకు పంపెను అని చెప్పాడు. 

ఈసాకు యాకోబుతో తన దగ్గరకు రమ్మని పిలిచి తనను తడిమి చూసి గొంతు యాకోబు గొంతు వలె ఉన్నను, చేతులు ఏసావు చేతులే అనెను. అతనిని దీవింపనేంచి నీవు నిజముగా నా కుమారుడు ఏసావువేనా అడుగగా,  దానికి యాకోబు అవును అని సమాధానం ఇచ్చాడు. అపుడు ఆ మాంసము తిని, ద్రాక్ష సారాయమును ఇవ్వగా అది త్రాగి, యాకోబుతో తన దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకోమని చెప్పగా, యాకోబు అట్లే చేయగా, యాకోబు ధరించిన వస్త్రముల వాసన చూచి ఆయనను దీవించాడు. నీవు నీ సోదరులను పాలింతువు, అన్ని జాతులు నీకు తలొగ్గును అని, నిన్ను దీవించు వారు దీవించబడుదురు అని దీవించేను. ఈసాకు దీవించుట ముగించిన త వెంటనే ఏసావు వచ్చి భోజనము సిద్దము చేసి తండ్రికి ఇచ్చి,  లేచి భుజించి తనను దీవింపమని అడుగగా ఈసాకు నాయన నీవు ఎవరవు అని ప్రశ్నించాడు. నేను ఏసావును నీ  పెద్ద కుమారుడను  అని చెప్పగా ఈసాకు ఒళ్ళు కంపించింది. అప్పుడు జరిగినది చెప్పగా, ఏసావు తండ్రి నన్ను కూడా దీవింపుము అని అడిగెను. ఆ దీవెనకు తిరుగులేదు అని ఆయన సమాధానం చెప్పెను. ఆ మాటకు ఏసావు పెద్దగా ఏడ్చి , తన సోదరుని గురించి అతనికి యాకోబు అని సార్ధకమైన పేరే పెట్టితిరి, అతడు నన్ను మోసము చేయుట రెండవ సారి అని అన్నాడు. తండ్రి నాకు ఏ దీవెనయు మిగులలేదా అని అడుగగా, అందుకు ఈసాకు, నీవు భూసారము కొరవడిన చోట నివసింతువు, నీవు ఖడ్గము చేపట్టి బ్రతుకుదువు, నీ తమ్ముని సేవింతువు కాని నీవు తిరుగుబాటు చేసిన రోజు నీ మెడ మీద నుండి అతని కాడి విరిచేదవు అని చెప్పాడు. 

ఈసాకు యాకోబును లాబాను వద్దకు పంపుట 

రిబ్కా ఈసాకుతో ఏసావు వివాహమాడిన హిత్తియుల పిల్లలు నా ప్రాణాలు తీసివేస్తున్నారు. యాకోబు కూడా ఈ జాతి పిల్లను వివాహమాడిన నేను చచ్చిన, బ్రతికిన సమానమే అని చెప్పగా, ఈసాకు యాకోబును పిలిపించి, దీవించి అతనికి బుద్దులు చెప్పి, కనానీయులలో ఎవరని పెండ్లి చేసుకోవద్దని, యాకోబు మేనమామ అయిన లాబాను కూతురులలో ఒకరిని వివాహమాడమని చెప్పి, దేవుని ఆశీర్వాదములు పలికి అక్కడ నుండి పద్దనారములోని లాబాను ఇంటికి పంపెను. లాబాను అరమీయుడయిన బెతూవెలు కుమారుడు మరియు రిబ్కా సోదరుడు. 

ఈసాకు మరణం - గొప్ప వ్యక్తిత్వం

యాకోబు మమ్రేలో ఉన్న తన తండ్రి దగ్గరకు వచ్చిన తరువాత, నూటయెనుబది సంవత్సరాల వయసులో మరణించగా యాకోబు, ఏసావులు తమ తండ్రిని సమాది చేశారు. ఈసాకు వ్యక్తిత్వం చాలా ఉన్నతమైనది, తన కుటుంబ జీవితం ఎంతో ఉన్నతమైనది, నైతికంగా అయన జీవితాన్ని ఎవరితో పోల్చలేము అంత గోప్య నైతిక జీవితాన్ని జీవించాడు. తన తండ్రి వలె ఈయన కూడా తన భార్యను కూడా తన చెల్లి అని చెప్పడం జరిగింది. ఒక రకముగా ఈయన జీవితంలో అది మాత్రమే ఒక మచ్చ అంతకుమిచ్చి ఇతని జీవితంలో ఎటువంటి పొరపాటు జరుగలేదు. ఈయన మంచి భోజన ప్రియుడు , తన పెద్ద కుమారుడు అనిన ఇతనికి చాలా ఇష్టం అని మనకు తెలుస్తుంది. 

యోహను 15:26-16:4

 యోహను 15:26-16:4 

 సువిశేషం : నేను తండ్రి  యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చేడువాడు, తండ్రి యొద్ద నుండి వచ్చు సత్య స్వరూపి అగు  ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్య మిచ్చును. మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు. కనుక మీరు నన్ను గురించిన సాక్షులు. మీరు పతనము చెంద కుండుటకు నేను ఇవి అన్నీ మీతో చెప్పితిని. వారు మిమ్ము ప్రార్ధన  మందిరముల నుండి వెలివేయుదురు , మిము హత్య చేయు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయు చున్నానని భావించు గడియ వచ్చుచున్నది. వారు తండ్రిని గాని, నన్నుగాని, ఎరుగకుండుటచే ఇట్లు చేసెదరు. ఇవి సంభవించు గడియ వచ్చినప్పుడు మీరు నా మాటను జ్ఞాపకముంచు కొనుటకై ఈ విషయములను మీతో చెప్పుచున్నాను. నేను మీతో ఉన్నందున ఇంత వరకు ఈ విషయములు మీతో చెప్పలేదు. 

ఈనాటి దేవుని వాక్యం యేసు ప్రభువు పంపే పవిత్రాత్మ గురించి చెబుతుంది. పవిత్రాత్మను ప్రభువు ఓదార్చువాడు అని చెబుతున్నాడు.  మరల పవిత్రాత్మ సత్య స్వరూపి అని చెబుతున్నాడు, యేసు ప్రభువు గురించి ఈ పవిత్రాత్మ సాక్షం ఇస్తుంది. ఇక్కడ ఓదార్పు యొక్క  అవసరం ఏమిటి? అంటే యేసు ప్రభువు శిష్యులకు ఓదార్పు అవసరం ఉంది. వారు జీవించేది యేసు ప్రభువు వలె కనుక ఈలోక ప్రేమికులు వారిని చూసి, వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. వారిని అన్యాయముగా కష్ట పెడతారు. అంతే కాదు యేసు ప్రభువు చెప్పినట్లుగా ఆయన శిష్యులను చంపే వారు, దేవునికి సేవ చేస్తున్నట్లు భావిస్తారు. ఇది మనం అపోస్తుల కార్యాలలో చూస్తాము. పౌలు గారు మారు మనస్సు పొందక ముందు క్రైస్తవులను  హింసిస్తు, తాను తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాను అనుకుంటున్నారు. 

ఈరోజు కూడా అనేక మంది వారి వారి విశ్వాసాలను పాటించుట కంటే కూడా క్రైస్తవల మీద దాడి చేయడం వారి విశ్వాసాన్ని పాటించడం అన్నంతగా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల గురించి యేసు ప్రభువు ముందుగానే శిష్యులకు చెబుతున్నారు. తాను వారి నుండి తండ్రి దగ్గరకు వెళ్లేముందు, ఈ లోకం దాని తీరు గురించి శిష్యులకు ప్రభువు తెలియచేస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభువు , మిమ్ములను ప్రార్ధన మందిరముల నుండి వెలివేయుదురు  అని చెబుతున్నారు, అంటే మనకు ఉన్న సమస్యలకు, కష్టాలకు బాధలకు, అన్నింటికీ దేవుడే తీర్చుతారు అని మనం నమ్ముతాము, అటువంటి దేవున్ని  ప్రార్ధన చేసుకునే మందిరములకు వీరిని దూరం చేస్తుంది, ఈ లోకం. అంటే వీరికి ఎవరి నుండి సహాయం వచ్చే అవకాశం లేకుండా చేస్తుంది. 

ఎందుకు వీరు ఇవన్నీ చేస్తారు ? అంటే వారికి తండ్రి (దేవుడు) తెలియదు, ఆయన ప్రేమ తెలియదు, ఆయన గుణగణాలు తెలియవు. తండ్రి దేవుడు వారి వలె ఉంటారు అనే భావనలో వారు ఉన్నారు. దేవుని దయార్ధ హృదయం ఎంత గొప్పదో వారికి తెలియకనే వారు ఈ పనులు చేస్తున్నారు. మనం పౌలు గారినే ఇక్కడ ఉదాహరణగా తీసుకోవచ్చు. యేసు ప్రభువు ఆయనకు దర్శనం ఇవ్వకముందు, చాలా క్రూరంగా ప్రవర్తించాడు, కాని తరువాత యేసు ప్రభువును తెలుసుకొని ఆయన మంచి లక్షణాలు కలిగి జీవించడం ప్రారంభిచాడు.

నిజ దేవుని గురించి తెలిసిన వారు ఎవరు ఇతరులను హింసలకు గురిచేయరు. ఎందుకంటే వారు ఆయనకు సాక్షులుగా జీవిస్తారు, ఆయన ప్రేమకు, దయకు, కరుణకు సాక్షులుగా జీవిస్తారు. 

వారి విశ్వాసం కోసం ఇటువంటి బాధలు , కష్టాలు , హింసలు అనుభవిస్తున్న వారికి పవిత్రాత్మ తోడ్పడుతుంది. వారికి ఓదార్పుఇస్తుంది. వారు ఎప్పుడు ఏమి చేయాలో, ఎప్పుడు ఏమి మాట్లాడాలో అంతా పవిత్రాత్మ వారికి తెలియజేస్తుంది. ఈ పవిత్రాత్మ శిష్యులను నడిపింది. వారికి యేసు ప్రభువు బోధించిన అన్నీ విషయాలను జ్ఞప్తికి తీసుకువచ్చింది. వారు కష్టాలు, హింసలకు గురి అయినప్పడు వారికి ప్రభువు చెప్పిన విషయాలు తెలియచేసింది. కనుక వారు అన్నింటిని తట్టుకొని నిలబడగలిగారు. 

మనము తండ్రిని తెలుసుకున్నవారము. ఆయన ప్రేమ ఎటువంటిదో తెలిసిన వారము కనుక ఖచ్ఛితముగా మన జీవితము ఈ లోకంను అభిమానించే వారి కంటే భిన్నముగా ఉండాలి. ఏ ఒక్కరినీ  మన విశ్వాసం కోసం  హింసించడం దేవుడు మన నుండి కాంక్షీంచడు. అప్పడు మనం అటువంటి పనులు చేయకూడదు. అంతే కాదు మనం పతనం కాకూడదు అని ప్రభువు కోరుకుంటున్నారు. ప్రభువుకు ఇష్టం లేని పనులు మనం చేయకూడదు. పతనాన్ని తెచ్చుకోకూడదు. 

పవిత్రాత్మ మనకు సత్యం తెలుపుతుంది. పవిత్రాత్మ సత్య స్వరూపి. మనలను హింసించు వారు దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటున్నారు. ఎందుకంటే వారికి తండ్రి తెలియదు, అంతే కాదు సత్యము ఏమిటో తెలియజేయుటకు పవిత్రాత్మను  వారు పొందలేదు. మనం తెలుసుకున్న సత్యమును ఇతరులకు తెలుపుటకు సిద్ధ పడాలి. వారిని అజ్ఞానం నుండి బయటకు తేవాలి. అజ్ఞానంనే జ్ఞానం అని అనేక మంది జీవిస్తున్నారు ఈ రోజుల్లో వారి కోసం ప్రార్ధన చేయాలి. 

యేసు ప్రభువుకు పవిత్రాత్మ సాక్షిగా నిలుస్తుంది. అంతే కాదు ఆయన శిష్యులు కూడా సాక్షులుగా ఉన్నారు. మరి మన జీవితం ఏమిటి ? మనం కూడా యేసు ప్రభువుకు సాక్షిగా జీవించాలి. ఆయన పవిత్రాత్మను పొంది ఆయన వలె జీవించాలి. ఒక సాక్షి జీవితం జీవించాలి. ఎటువంటి పరిస్థితులలో అయిన నిజమైన సాక్షిగా జీవించి ప్రభువు వాగ్ధానం చేసిన నిత్య జీవితం పొందాలి. 

మనం మంచి జీవితం జీవించడానికి  సిద్ధ పడితే ఆయన మనకు ఆదరణ కర్త అయిన పవిత్రాత్మను పంపి మనలను ఓదార్చుతారు. మంచి జీవితం జీవించుటకు మరియు పవిత్రాత్మను పొందుటకు కావలసిన అనుగ్రహం కోసం ప్రార్ధించుదాం. 

ప్రార్ధన : ప్రభువా మీరు పవిత్రాత్మను మీ శిష్యులకు ఇస్తాను అని వాగ్దానం చేశారు. ఆ పవిత్రాత్మను నాకు కూడా ఒసగండి, ఆ పవిత్రాత్మ నా జీవితంలో అందరు నాకు వ్యతిరేకముగా ఉన్న నన్ను ఓదార్చువానిగా నాలో ఎల్లప్పుడు ఉండేలా నాకు మీ అనుగ్రహం దయచేయండి. ఆ పవిత్రాత్మ సత్య స్వరూపి కనుక ఎల్లప్పుడు కూడా నాతో ఉన్నట్లయితే నాలో ఎటువంటి అసత్యం లేకుండ నన్ను శుద్ది చేయువిధంగా నన్ను మలచండి.  ప్రభువా మీకు మేము సాక్షులుగా జీవించుటకు కావలసిన శక్తిని మాకు దయచేయండి. పవిత్రాత్మ మీకు సాక్షిగా ఉంటుంది, ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండే ఆ పవిత్రాత్మ మేము కూడా సాక్షులుగా ఉండుటకు మాకు సాయం చేసేలా చేయండి. మాకు జరుగబోయే విషయాలలో, మేము మీకు సాక్షులుగా జీవించుటకు మాకు అడ్డు అయ్యే అనేక రకాల సమస్యలలో మేము భయపడి, వెనుకకుపోకుండా నిజమైన సాక్షులుగా జీవించే  శక్తిని మాకు దయచేయండి. ఆమెన్. 

యోహను 16:5-11

 యోహను 16:5-11 

కాని, ఇప్పుడు  నన్ను పంపిన వాని యొద్దకు పోవుచున్నాను. మీలో ఎవడు "నీవు ఎక్కడకు పోవుచున్నావు"? అని నన్ను అడుగుట లేదు. నేను మీకు ఈ విషయములు చెప్పినందున మీ హృదయములు దుఃఖముతో నిండి వున్నవి. ఐనను  నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్లనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ వద్దకు పంపేదను. ఆయన వచ్చి పాపమును, నీతిని మరియు తీర్పును గురించి లోకమునకు నిరూపించును. పాపమును గురించి ఎందుకన వారు నన్ను విశ్వసించుట లేదు. నీతిని గురించి ఎందుకన , నేను తండ్రి యొద్దకు పోవుచున్నాను. ఇక మీరు నన్ను చూడరు. తీర్పును గురించి ఎందుకన, ఈ లోకాధిపతికి తీర్పు విధింపబడినది.  

యేసు ప్రభువు తన తండ్రి వద్దకు పోయేముందు, తన వీడ్కోలు ఉపదేశంను తన శిష్యులకు ఇస్తున్నాడు. ఈ సమయంలో శిష్యులు ఎవరు ఆయనను నీవు ఎక్కడకు వెళుతున్నావు? అని అడగలేదు. అందరు బాధలో ఉన్నారు, ఆయన వారిని వీడి పోతున్నారు కాని పూర్తిగా వారికి అక్కడ ఏమి జరుగుతుందో  తెలియదు. వారికి అర్ధం అయిన విషయం వారి గురువు వారి నుండి వెళ్ళిపోతున్నారు. అందుకు వారు బాధ పడుతున్నారు. యేసు ప్రభువు ఈ మాటలను మొదటి సారి చెప్పడం లేదు, అనేక సార్లు చెప్పి ఉన్నారు. ఇప్పుడు చెబుతున్న మాటలు ఖచ్ఛితముగా వారిలో ఒక మార్పు తీసుకువస్తున్నాయి, ఎందుకంటే వారు, యేసు ప్రభువుకు వ్యతిరేకముగా జరుగుతున్న పరిస్థితుల గురించి అవగాహన చేసుకుంటున్నారు. కనుక వారు ఏమి అడగడానికి సహసించలేదు. అంటే వీరికి పూర్తిగా ఆయనకు ఎటువంటి కష్టాలు వస్తున్నాయో తెలుసు అని కాదు అర్ధం. వారి దృష్టిలో ఇది వారికి అర్ధమయ్యే విషయం కూడా కాదు. కనుక దాని గురించి వారు ఏమి మాటలాడుటలేదు. 

నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరం : యేసు ప్రభువు నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరం అని చెబుతున్నారు. ఎందుకు శ్రేయస్కరం అంటున్నారు అంటే ఆయన వెళితే ఓదార్చువాడు అయిన పవిత్రాత్మ  వస్తాడు. ఆయన పాపము, నీతి , మరియు తీర్పు గురించి లోకామునకు నిరూపిస్తాడు. ఎందుకు వీటి గురించి లోకానికి తెలియచేయాలి? లోకం ప్రభువును తెలుసుకోవాలి, ఆయనను విశ్వసించాలి, పాపమును వదలి వేయాలి. లోకము యేసు ప్రభువును విశ్వసించక, అవిశ్వాసంతో జీవిస్తుంది. పాపము మానవున్ని ఏమి చేస్తుందో పవిత్రాత్మ తెలియజేస్తుంది. లోకం చేసిన తప్పు ప్రభువును విశ్వసించకపోవడం. నీతి గురించి లోకమునకు తెలియదు, నీతి లోకం దృష్టిలో క్షణికమైంది కాని నిజానికి అది శాశ్వతమైనది. అంతే కాదు పవిత్రాత్మ యేసు ప్రభువును నమ్మక , ఆయన చెప్పినట్లు జీవింపకపోతే వచ్చే తీర్పు గురించి తెలియచేస్తుంది. మనకు ప్రభువు నేర్పిన విషయములను అన్నింటిని గుర్తుకు తెస్తుంది.

 అంతే కాదు ప్రభువు నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరం అని శిష్యులకు చెప్పేది, ఇంకా ఎందుకంటే ప్రభువు మీదనే ఇంకా శిష్యులు ఆధారపడుతారు, కాని ప్రభువు వారి నుండి వెళ్ళిన తరువాత పవిత్రాత్మ సహాయంతో వారు లోకం అంతట ప్రభువు గురించి , దేవుని రాజ్యం గురించి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడ శిష్యులు కేవలం స్వీకరించేవారు కారు, ఆయన వారి నుండి వెళ్ళిన తరువాత వారు  ప్రభువును పంచే వారు అయ్యారు. దానికి ప్రభువు వారి వద్ద నుండి వెళ్లారు. దీనికి పవిత్రాత్మ వారికి సహాయం చేస్తుంది. యేసు ప్రభువు పాపము గురిచి చెబుతున్నారు,ముఖ్యంగా ఈ లోకం యొక్క ఘోరమైన  పాపం  ఏమిటి అంటే ఆయనను నమ్మక పోవడం, విశ్వసించక పోవడం. కొన్ని సార్లు మనం కూడా ఇలానే ఉంటూ వుంటాం. ఆయన చెప్పే మాటలను మనం పాటించక పోవడం.

 నీతి గురించి ప్రభువు చెబుతున్నారు, ఇక్కడ యేసు ప్రభువు గురించి ఈ మాటలు వున్నవి. ఆయన తండ్రి దగ్గరకు వెళుతున్నారు. ఆయన నిత్యం ఉండువాడు. తండ్రి దగ్గరకు వెళ్ళిన ఆయన జీవించువాడు. ఆయన ఎంతో నీతిమంతుడు, ఆయన చేసినవి అన్ని నీతితో కుడినవే. కానీ లోకం ఆయన నీతిని అంగీకరించలేదు. ఆయన్ను సాతాను సాయంతో సాతానును వెడలగొడుతున్నాడు అని అన్నది, ఆయన మంచిని లోకం అంగీకరించలేదు. సబ్బాతు రోజున ఆయన చేసే మంచి వద్దు అన్నది. ఆయన కరుణను అంగీకరించలేక పోయింది. యోహను తన సువిశేషం మొదటిలోనే చెప్పాడు ఈ విషయం. దేవుడు వెలుగుగా లోకమునకు వచ్చినప్పటికీ మానవుడు వెలుగు దగ్గరకు పోవుటకు ఇష్ట పడలేదు, ఎందుకంటే మానవుని పాపం, అవినీతి ఎక్కడ ఈ వేలుగులో కనపడుతుందో అని , చీకటినే ప్రేమించాడు మానవుడు. వెలుగు దగ్గరకు పోవడానికి భయ పడ్డాడు. మనం కూడా కొన్ని సార్లు ఇలానే జీవిస్తూ ఉంటాం. దేవుని దగ్గరకు పోతే ఎక్కడ మన నిజ జీవితాలు బయట పడుతాయో అనుకుంటూ వుంటాం. అందుకే పవిత్రాత్మ మనకు పాపం దాని పర్యవసానం గురించి తెలియ చేస్తుంది అని ప్రభువు పలుకుతున్నారు. 

మీరు నన్ను చూడరు,అని యేసు ప్రభువు చెబుతున్నారు.  శిష్యులు యేసు ప్రభువు యొక్క శిష్యులు ఆయన తండ్రి వద్దకు వెళ్ళిన తరువాత ఆయన వారికి  దూరం  అయి పోతారు. కాని వారికి ఆదరణ కర్తను పంపుతాను అని చెబుతున్నారు. ఈ అధరణ  కర్త కేవలం వీరికి వీటిని చెప్పడమే కాదు వీరికి సహాయ పడుతుంది. పాపం చేయడం ద్వారా మనం దేవుని నుండి మనం పొందే ఎడబాటు గురించి తెలియచేస్తుంది. అంతే కాదు యేసు ప్రభువు ఈ పాపన్ని జయించుటకు చేసిన అన్ని కష్టాలును తెలియజేస్తుంది. మరియు సాతాను ను జయించిన దానిని తెలియజేస్తుంది. మనం కూడా క్రీస్తు ను అనుసరించి , పవిత్రాత్మ సహాయంతో సాతానును జయించుదాం.

ప్రార్దన : ప్రభువా మీరు తండ్రి వద్దకు వెళ్ళుటకు ముందుగ మీ శిష్యులను మీ ఎడబాటును తట్టుకోవడానికి వారిని ముందుగానే సిద్ధం చేశారు. మీరు  మీరు ఎక్కడకి వెళుతున్నది, ఎందుకు వెళుతున్నది వారికి తెలియజేస్తున్నారు. మీ ఎడబాటులో  వారని ఆధారపడే వారి నుండి ఆదరించే వారిగా మారుతున్నారు. మీరు పంపిన పవిత్రాత్మ  వారిని ఇలా చేస్తుంది. మా జీవితంలో కూడా ప్రభువా మేము మాకు  తోడుగా ఉండుటకు మీ ఆత్మను పంపంచి, మమ్ములను ఎప్పుడు కూడా మా విశ్వాసమందు గట్టిగా ఉండేలా చేయండి.  మాకు ఎల్లప్పుడు కూడా  మీ ఆత్మ తోడుగా ఉండే విధంగా మమ్ము దీవించండి. మీ పవిత్రాత్మ ఏ విధముగా అయితే పాపం గురించి, నీతి గురించి మరియు తీర్పును గురించి తెలియజేస్తున్నదో అవి మేము తెలుసుకొని మిమ్ము విశ్వసించి, ఎప్పటికీ పాపములో పడకుండా, మేము నీతి వంతమైన జీవితం ప్రతి నిత్యం జీవించి, మీరు తీర్పు తీర్చుటకు వచ్చినప్పుడు మిమ్ములను చూచుటకు, మీతో పాటు వుండుటకు కావలనసిన అనుగ్రహం దయచేయండి. ఆమెన్ 

యోహాను 16:12-15

 యోహాను  16:12-15 

 సువిశేషం : నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది. కాని, ఇప్పుడు మీరు వానిని భరింపలేరు. ఆయన, సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమి బోధింపక తాను వినిన దానినే బోధించును. జరుగబోవు విషయములను మీకు తెలియ చేయును. ఆయన నన్ను మహిమ పరుచును . ఏలన , ఆయన నాకున్న దానిని , నా  నుండి గైకొని దానిని మీకు తెలియ చేయునని చెప్పితిని. తండ్రికి ఉన్నదంతయు నాది. అందుచేత నానుండి గైకొని మీకు తెలియచేయును అని చెప్పితిని. 

"ఇప్పడు మీరు వానిని భరింపలేరు", ఎందుకు వీరు యేసు ప్రభువు చెప్పే వాటిని భరించలేరు, కారణం ఏమిటి అంటే వీరు కష్టాలు, బాధలు పొందటానికి ఇంకా సిద్ధంగా లేరు. అందుకే యేసు ప్రభువు వారికి ఈ విషయమును వెల్లడిచేస్తున్నారు. ఇది యేసు ప్రభువుని వీడ్కోలు ఉపదేశం, అంటే వారు ఆయనను ఒక రాజుగా జయ జయ నినాధాలతో యెరుషలేము నగరములోనికి ఆహ్వానించిన తరువాత ఇది  జరుగుతుంది. శిష్యులు యేసు ప్రభువును  ఒక వీరోచితమైన రాజుగా  చూస్తున్నారు. కాని యేసు ప్రభువు వారికి రాబోయే కష్టముల గురించి చెబుతున్నారు. ఆయన వెళ్ళిన తరువాత వారి జీవితాలలో వచ్చే హింసల గురించి యేసు ప్రభువు వారికి పూర్తిగా చెప్పటం లేదు. 

 ఎందుకు యేసు ప్రభువు వారికి వారు పొందబోవు శ్రమల గురించి పూర్తిగా చెప్పడం లేదు? వీరు ఆయన వారి నుండి వెళ్ళిన తరువాత చాలా క్రూరమైన హింసలకు గురిఅయ్యారు, అప్పుడు వాటిని భరించారు కాని ఇప్పుడు వీరికి ఇటువంటి వాటిని తట్టుకునే శక్తి లేదు, అందుకే వారికి పవిత్రాత్మ వచ్చిన తరువాత ఇవన్నీ అర్ధం అవుతాయి అని చెబుతున్నారు. దేవుడు మనలను మనం భరించ లేని కష్టాలుకు గురిచేయరు. అందుకే వారు పొందబోయే హింసలు ,కష్టాలు అన్ని వారికి చెప్పడం లేదు. ఇవన్నీ తెలియజేయడానికి, ఆ కష్ట కాలంలో పవిత్రాత్మ వారికి సహాయం చేస్తుంది. వారికి యేసు ప్రభువు తండ్రి దగ్గరకు పోయేంత వరకు చెప్పేమాటలు, రాబోవు పరిస్థితులను తట్టుకొనే విధంగా వారికి ఒక తర్ఫీదు కాలం ఆవుతుంది.  అంతే కాదు వారికి ఆ సమయాల్లో ఏమి చేయాలో , ఏమి చెప్పాలో కూడా పవిత్రాత్మ వారికి తెలియ జేస్తుంది. దీనిని మనం  యేసు ప్రభువు శిష్యులు , పాలకులు, పెద్దలు మొదలగువారి ముందు  మాటలాడినప్పుడు వారు ఎటువంటి జ్ఞానం తో మాటలాడింది, మనం అపోస్తుల కార్యాలలో చూస్తాము. దీనికంతటికి తోడ్పడు ఇస్తుంది, నడిపిస్తుంది, పవిత్రాత్మయే. 

"ఆయన సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పడు మిమ్మును సంపూర్ణ సత్యమునకు నడిపించును" : యేసు ప్రభువు వలె సత్యమును బోధించుటకు, సత్యమునకు నడిపించుటకు  ఇప్పుడు పవిత్రాత్మ యొక్క అవసరం శిష్యులకు  ఉంది. సత్యం మనకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మన పాపమును అది చూపిస్తుంది.  మన చెడు జీవితమును మనకు తెలుపుతుంది.  ఈరోజుల్లో మనం ఏది మనకు అనుకూలంగా ఉంటుందో దానికి పాటించుటకు ఇష్ట పడుతున్నాము. సత్యమును పాటించుటకు ఇష్టపడుటలేదు. సత్యం మనలను అనేక బందనముల నుండి విముక్తులను చేస్తుంది. సత్యం అంటే యేసు ప్రభువే.  యేసు ప్రభువు నేనే సత్యమును జీవమును మార్గమును అని చెప్పారు. 

పవిత్రాత్మ సత్య స్వరూపి , అంటే మనలను చేడుగా  నడిపించడు, మనలను ఎక్కడకు నడిపించాలి? మనం గమ్యం ఏమిటి?  యేసు ప్రభువు నేనే మార్గమును అని చెబుతున్నారు. మన మార్గం ఆయనే ఖచ్ఛితముగా మనలను పవిత్రాత్మ యేసు ప్రభువు దగ్గరకు నడిపిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువు సత్యము. అంతే కాదు యేసు ప్రభువు తన గురించి చెప్పేటప్పుడు,  నా అంతట నేను ఏమి చెప్పుటలేదు, నా తండ్రి నుండి చూసిన దానిని, వినిన దానినే నేను చెబుతున్నాను అని చెప్పారు. పవిత్రాత్మ కూడా తనంతట తాను ఏమి చేయదు, తాను వినిన దానినే బోధించును. 

"జరుగబోవు విషయములను మీకు బోధించును", పవిత్రాత్మ క్రైస్తవ సంఘానికి సహాయకునిగా , అనేక సమస్యలను తీర్చుటలో వీరికి సహాయ పడింది. అనేక సార్లు పవిత్రాత్మ వారికి ఏమి చేయాలో నేర్పుతుంది. పౌలు గారి మీద అందరు వ్యతిరేకంగా ఉన్నా,  పవిత్రాత్మ ఆయన మీదకు వస్తుంది , ఎందుకంటే ప్రభువే ఆయన్ను ఎన్నుకున్నారు కాబట్టి. పవిత్రాత్మ  వీరితో ఉన్నప్పుడు వీరు యేసు ప్రభువు జ్ఞానం  కలిగి ఉన్నారు. వారు ఎప్పుడు ఏమి చెప్పాలో పవిత్రాత్మ చెబుతుంది. 

ఆయన నాకున్న దానిని, గైకొని మీకు తెలియజేయును : ఇక్కడ యేసు ప్రభువు పవిత్రాత్మ యొక్క తత్వాన్ని తెలియ జేస్తున్నారు. ఆయన తెలుసుకున్నదానిని, వినిన దానిని తీసుకొని మీకు తెలియజేయును, తనంతట తాను ఏమి చెప్పడు. అంటే తండ్రికి ఉన్నదంతయు నాది, దానిని ఆయన మీకు ఇస్తాడు, తెలియ జేస్తాడు, అని  యేసు ప్రభువు చెబుతున్నారు. యోహను , తండ్రి అంతయు ఆయనకు ఇచ్చెను అని చెబుతున్నారు. మనకు అంటే తెలియ పరచడానికి పవిత్రాత్మ మనకు సహాయం చేస్తుంది. అన్నిటి మీద యేసు ప్రభువుకు అధికారం ఉన్నట్లు, మరియు అంతా ఆయనదే అని  పవిత్రాత్మ తెలియజేస్తుంది. ఆయన ఇచ్చే రక్షణ తెలియ జేస్తుంది. దానికి ఏమి చేయాలో తెలియ జేస్తుంది. ఇవన్నీ చేయడం ద్వారా పవిత్రాత్మ యేసు ప్రభువును మహిమ పరుస్తాడు.   పవిత్రాత్మ ఎప్పటికీ ఆయనకు వ్యతిరేకముగా ఏమి చెప్పడు. 

యేసు ప్రభువు అంతయు తండ్రి దగ్గర నుండి పొందుతున్నాడు. తండ్రిని చేరుకోవడానికి ఆయనే మార్గం. యేసు ప్రభువు తండ్రి దగ్గరకు పోతున్నప్పుడు పవిత్రాత్మకు అంతయు అప్పగిస్తున్నారు, ఇప్పుడు యేసు ప్రభువును తెలుసుకోవడానికి పవిత్రాత్మ మార్గం అవుతుంది. అంతేకాదు యేసు ప్రభువు చెప్పినవన్ని తెలియజేస్తుంది , ఆయన  శిష్యులను నడుపుతుంది. మార్గ చూపరి అవుతుంది. 

ప్రార్ధన : ప్రభువా ! మీరు తండ్రి దగ్గరకు వెళుతున్నప్పుడు మీ శిష్యులకు తోడుగా ఉండుటకు, మరియు వారికి మీ వద్దకు నడిపించుటకు పవిత్రాత్మను వారికి సహాయంగా పంపారు. పవిత్రాత్మ వారికి  అన్ని విధాలుగా సహాయ పడుతూ , సంపూర్ణ సత్యమగు మీ వైపు నడిపినది, కాని ప్రభువా ఈ లోకంలో జీవిస్తూ మీ దరి  చేరాలని కోరిక ఉన్న అనేక సార్లు చెడు మార్గాలలో నడుస్తున్నము  ప్రభువా, అటువంటి అపదల నుండి మాకు సహయం చేయుటకు మాకు తోడుగా ఉండుటకు పవిత్రాత్మను మాకు అనుగ్రహించండి. ఆమెన్ 

లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...