27, ఫిబ్రవరి 2026, శుక్రవారం

యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16

 యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16

"పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది: ఒక  యజమానుడు తన ద్రాక్షతోటలో పని  చేయుటకు పని వారలకై ప్రాతః కాలమున  బయలు దేరెను. అతడు రోజునకు ఒక దీనారము చొప్పున ఇచ్చెదనని కూలీలతో ఒప్పందం చేసుకొని వారిని తన తోటకు పంపెను. తిరిగి  ఆ యజమానుడు తొమ్మిది గంటల సమయమున బయటకు వెళ్లి అంగడి వీధిలో పని కొరకు వేచియున్న కొందరిని చూచి,'మీరు నా తోటకు వెళ్లి పని చేయుడు. న్యాయముగా రావలసిన వేతనమును ఇచ్చెదను' అనెను. వారు అటులనే వెళ్లిరి. తిరిగి పండ్రెండు గంటలకు మరల మధ్యాహ్నం మూడుగంటలకు ఆ యజమానుడు అట్లే మరి కొందరు పని వారిని పంపెను. రమారమి  సాయంకాలము ఐదుగంటల సమయమున వెళ్లి, సంత వీధిలో ఇంకను నిలిచియున్నవారిని చూచి , మీరు  ఏల రోజంతయు పని పాటులు లేక ఇచట నిలిచియున్నారు? అని ప్రశ్నించెను. మమ్మెవరు కూలికి  పిలువలేదు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అంతట ఆ  యజమానుడు  అటులైన మీరు కూడ నా ద్రాక్ష తోటలో పనిచేయుటకు వెళ్లుడు అనెను. సాయంత్రమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్ష తోటలో పని చేసిన వారిని పిలిచి, చివర వచ్చిన వారితో ప్రారంభించి, తొలుత వచ్చిన వారి వరకు వారివారి కూలినిమ్ము అనెను. అటులనే సాయంత్రం అయిదు గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలకొక దీనారము లభించెను. తొలుత పనిలో ప్రవేశించినవారు తమకు ఎక్కువ కూలి వచ్చునని తలంచిరి. కాని, వారుకూడ తలకొక దీనారమునే పొందిరి. వారు దానిని తీసుకొని, యజమానునితో 'పగలంతయు మండుటెండలో శ్రమించి పనిచేసిన మాకును, చిట్ట చివర ఒక గంట మాత్రమే పనిలో వంగినవారికిని, సమానముగా కూలి నిచ్చితివేమి'? అని గొణుగుచు పలికిరి. అంతట యజమానుడు వారిలో నొకనిని చూచి, మిత్రమా!  నేను నీకు అన్యాయము చేయలేదు. దినమునకు ఒక దీనారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసికొనిపొమ్ము. నీకు ఇచ్చినంత కడపటివానికిని ఇచ్చుట నా యిష్టము. నా ధనమును నా యిచ్ఛవచ్చినట్లు వెచ్చించుకొను అధికారము నాకు లేదా? లేక  నా ఉదారత నీ కంటగింపుగానున్నదా?'అని పలికెను. ఇట్లే  మొదటివారు కడపటి వారగుదురు. కడపటివారు మొదటివారగుదురురు" అని యేసు పలికెను. 

క్రీస్తు నాధుని యందు  ప్రియమైన విశ్వాసులారా ఈనాటి మొదట పఠనంలో దేవుడు తన ప్రవక్తను పంపుతూ యిస్రాయేలు కాపరులను ఖండిస్తున్నాడు. ఇశ్రాయేలు రాజులను ఖండించు అని తన ప్రవక్తను పంపిస్తున్నాడు. మీకు అనర్ధము తప్పదు అని  వారికి తెలియజేస్తున్నాడు. ఎందుకు దేవుడు వారిని అంటే కాపరులను, రాజులను ఖండిస్తున్నాడు అంటే  కాపరులు మందను వెదకటం లేదు. అంతే కాకుండా వారు తమ కడుపు నింపుకొనుచున్నారే గాని  మందను మేపటం లేదు.  గొర్రెలను పట్టించుకొనుట లేదు. అందుకు దేవుడు అంటున్నాడు నేను మీ నుండి గొఱ్ఱెలను కాపాడుదును. నేనే నా మందను వెదకెదను. వానిని గూర్చి జాగ్రత్త పడెదను అని  తన ప్రవక్తల ద్వారా  తెలియజేస్తున్నాడు. 

ప్రియ విశ్వాసులారా ఇక్కడ కాపరులు అంటే దైవ సేవ చేస్తున్న గురువులు, దైవాంకితులు దేవుని చేత ఎన్నుకోనబడి దైవసేవ చేసేవారు అదే విధంగా గొర్రెలు అంటే ప్రజలు దేవుడు గురువులను కాపరులుగా తన మందయినా ప్రజలను మంచి మార్గములో నడిపించమని ఎన్నుకొంటే వారు మాత్రం వారు తమ కడుపు మాత్రమే నింపుకుంటున్నారు. అదే దేవుని ఆవేదన. దైవ ప్రజలను మేపుట లేదు . దేవుని ప్రజలు పాపపు మార్గంలో పడి కొట్టుమిట్టాడుతుంటే వారిని చూసి కూడా పట్టించుకోవడం లేదు. వారు అనేక సమస్యలతో , ఇబ్బందులతో, కష్టాలతో కన్నీళ్లతో గాయపడి ఉన్నప్పుడు వారికి దేవుని వాక్కుతో కట్టు కట్టడం లేదు. ప్రక్కకు తప్పుకొనిన వారు అంటే చేదు అలవాటుల వలన, చేడు క్రియలను, చేడు ఆలోచనల ద్వారా విశ్వాసులు అవిశ్వాసులుగా మారి ప్రక్కకు తప్పుకొని పోతున్నారు. అది చూసి కూడా కాపరులు వారిని తిరిగి మందలోనికి నడిపించలేక పోతున్నారు.  అంతేకాకుండా వారి పట్ల కఠినముగా ప్రవర్తించుచున్నారు. 

ఇదే ఈనాటి సమాజంలోకూడా  జరుగుతుంది. కాపరులు తమ కడుపునింపుకుంటున్నారు. తమకు అప్పగించబడిన విశ్వాసులను అస్సలు పట్టించుకోవండ లేదు.    వారిని కని పెట్టుకొని ఉండటం లేదు. వారు తాము మంచి మార్గంలో నడువకుండా మంచి మార్గంలో నడిచే విశ్వాసులను తమ మాటల ద్వారా అసత్యపు బోధల ద్వారా చెల్లా చెదురు చేస్తున్నారు. ఎవరైన చేడు మార్గంలో పోతుంటే వారిని సన్మార్గంలో నడిపించలేకపోతున్నారు. వారి గాయాలను మాన్పకుండా వారు తమ విశ్వాసులను  అనేక విధములుగా గాయ పరుస్తున్నారు. విశ్వాసుల పట్ల మృదువుగా ప్రవర్తించడం లేదు. ఇది  నిజమా ? కాదా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ఈనాటి సువిశేష పఠనములో మనం దేవుని యొక్క ఉదారతను తెలుసుకుంటున్నాం. దేవుడు పరలోక రాజ్యంను ద్రాక్షతోట, కూలీల పోలికలతో వివరించాడు. అనేక సమయాలలో అనేక మందిని  దేవుడు తన తోటకు పని నిమిత్తము పంపుతున్నారు. దేవుడు మనందరిని తన రాజ్య విస్తరణకు  పనివారిగా ఎన్నుకుంటున్నారు.   అందరి పట్ల ఉదారత, సమానత్వాన్ని దేవుడు చూపిస్తున్నారు. దేవునికి అందరు అర్హులే. కడపటి వారు మొదటివారగుదురు, మొదటివారు కడపటి వారగుదురు అంటే  అర్ధం ఏమిటంటే మనం ఏ స్థితిలో ఉన్న దేవుడు మనలను దీవించి యోగ్యులును  చేస్తాడు, మనం చివరి వారిగా ఉన్న మనలను మొదటి వారీగా దేవుడు దీవిస్తాడు. కాబట్టి మనం దేవుని   రాజ్యాల విస్తారణకై  శ్రమించడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుని దయను పొందుటకు  సిద్ధంగా  ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ప్రార్ధన: దేవా మమ్ము అందరిని ఒక  కాపరులుగా  ఎన్నుకున్నావు. తండ్రిగా, తల్లిగా , బిడ్డగా విశ్వాసిగా మేము కూడా కాపరులుగా జీవించడానికి శక్తిని దయ చేయండి. మాకు అప్పగించిన , మా బిడ్డలను మా కుటుంబాలను , సంఘస్తులను మంచి మార్గంలో నడిపించడానికి శక్తిని దయ చేయండి.  మమ్ము మంచి కాపరులుగా మార్చండి. నీవలె ఉదారత కలిగి అందరిని ప్రేమించి జీవించే భాగ్యం దయచేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

యెహెఙ్కేలు 28:1-10, మత్తయి 19:23-30

 యెహెఙ్కేలు 28:1-10, మత్తయి 19:23-30

అంతట యేసు తన శిష్యులతో, "ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే , ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరం అని మరల మీతో రూఢిగా చెప్పుచున్నాను" అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, "అట్లయిన ఎవడు రక్షణము పొందగలడు ?" అనిరి. అందుకు యేసు వారిని ఆదరముతో చూచి వారితో, "మానవులకు ఇది అసాధ్యము. కాని దేవునికి సమస్తము సాధ్యమే" అని పలికెను. అపుడు పేతురు యేసుతో, "మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి. మాకు ఏమి లభించును?" అనెను. అందుకు యేసు వారితో "పునఃస్థితి స్థాపన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు, నన్ను అనుసరించిన మీరును పండ్రెండు గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను గాని , సోదరులనుగాని, సోదరీలనుగాని, తల్లిని గాని తండ్రినిగాని, పిల్లలనుగాని భూములనుగాని త్యజించిన ప్రతివాడును నూరంతలు పొంది, నిత్య జీవమునకు వారసుడగుడను, అయినను మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు. కడపటివారు అనేకులు మొదటివారు అగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అనెను. 

ఈనాటి మొదటి పఠనంలో ప్రభువైన దేవుడు తన ప్రవక్తను పంపుతు నా ప్రజలకు నా సందేశాన్ని వినిపించు అంటున్నాడు. అది ఏమిటంటే తూరు రాజు గర్వముతో, నేను దేవుడును అని పొంగిపోతున్నాడు. దేవుని స్థానంలో కూర్చోవాలనుకొనుచున్నాడు. దేవునితో సరి సమానుడనని అనుకుంటున్నాడు. నేనే దేవుడను అని జీవిస్తున్నాడు. నేను అందరికంటే తెలివైన వాడనని అనుకుంటూ జీవిస్తున్నాడు. పొగరెక్కి జీవిస్తున్నాడు. కాబట్టి ఈనాడు దేవుడు తన ప్రవక్తను ఆ తూరు రాజు దగ్గరకు పంపిస్తున్నాడు. సోదరులారా ఈనాడు మనలో చాలా మంది గర్వముతో పొంగిపోయేవారిని మనము చూస్తూనే ఉన్నాం. ఆస్తి చూసుకొని గర్వ పడేవారు ,డబ్బుచూసుకొని గర్వ పడేవారు, అందాన్ని చూసి , సంపదలు చూసి చాలా మంది గర్వముతో జీవించేవారు మన సమాజంలో ఉన్నారు. నాకు అన్ని తెలుసు అని అహంకారంతో, అజ్ఞానములో పడిపోతున్నాం. దేవుడు మనందరికీ ఒక గప్ప సత్యాన్ని తెలియజేస్తున్నాడు. అది ఏమిటంటే మనం ఎంత కష్ట పడి, ఎంత సంపాదించినా ఏమి కూడా మన వెంట రాదు. అపుడు మనకు అర్ధం అవుతుంది మనం మానవులమేనని. చాల మంది తాము దేవుడిలాంటి వారిమి అని అజ్ఞానములో అనుకున్నవి అబద్దాలు అని తెలుసుకుంటాము. ఎప్పుడైతె మనం గర్వంతో, స్వార్ధంతో ఉంటామో మనలను మనము తెలుసుకోలేము. మనలను రక్షించడానికి దేవుడు తన ప్రవక్తలను మన వద్దకు పంపిస్తుంటాడు. ఎంత ఎదిగిన, ఎన్ని సంపాదించిన ఎన్ని ఉన్న మనం దేవుని వంటి వారము కాము. దేవుడిలా కాలేము ఎందుకంటే మనకున్నదంత దేవుడు మనకు ఇచ్చినదే. ఆయన అన్ని తీసుకోగలడు. కాబట్టి ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి. గర్వముతో కాకుండా విధేయతతో తగ్గింపు మనస్సుతో జీవించడానికి ప్రతి ఒక్కరం ప్రయత్నించాలి. అప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు. 

సువిశేష పఠనంలో దేవుడు అంటున్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము. ఎందుకు క్రీస్తు ప్రభువు ఈ మాటలను పలికి ఉన్నాడు? అంటే ధనవంతుడైన ఒక యువకుడు నేను పరలోక రాజ్యము పొందాలంటే ఏమి చేయాలి అని క్రీస్తు ప్రభువుని అడిగినప్పుడు, నీకు ఉన్న దానిని అమ్మి, పేదలకు ధానము చేయుము అనగానే, ఆ యువకుడు అధిక సంపదలు కలవాడు కాబట్టి డబ్బు, సంపదల మీద ఉన్న ప్రేమ వలన , ఆశ వలన దైవరాజ్యానికి దూరమైపోతున్నాడు. మనలో కూడా ప్రియ విశ్వాసులారా డబ్బు సంపాదనలో పడి, ఈ లోక సంపదలలో పడి దేవుడిని, పరలోక సంపదలను కోల్పోతున్నాము. 

అదే విధంగా దేవునికి సమస్తము సాధ్యమే అని వాక్యం సెలవిస్తుంది. ఆయన తనను విశ్వసించి వెంబడించువారికి సమస్తమును సమృద్ధిగా ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. మనం దేవుని అనుసరిస్తే మనకు ఏమి లభిస్తుంది అంటే 1. పునరుత్తాణ భాగ్యం. 2. పరలోక ఆసనం లభిస్తుంది. 3. నిత్యజీవమునకు వారసులగుతారు, 4. ఈ లోకంలో కడపటి వారు పరలోకంలో మొదటివారుగా ఉంటారు. 5. నూరంతలగ ఆత్మ బంధువులను పొందుదురు. కాబట్టి ప్రియా విశ్వాసులారా మనము ఎప్పుడైతే మన సంపదలను, మనకున్న సమస్తాన్ని పరిత్యజించి క్రీస్తును అనుసరిస్తామో అప్పుడు దేవుడు మనకు సమస్తాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి త్యాగ పూరిత జీవితం జీవించడానికి ప్రయత్నించుదాం. 

ప్రార్ధన: దయామయుడైన దేవా! నీవు తనను తాను తగ్గించుకొని, వినయంతో జీవించే ప్రతి వ్యక్తిని కరుణించి దీవించేవాడవు. కనుక తండ్రి మేము గర్వాత్ములము కాకుండా వినయ విధేయతలతో జీవించి ఈ లోక ఆశలు, ఈలోక సంపదలు, ఈ లోక వస్తువులో ఈ లోక వ్యక్తులను పరిత్యజించి నిన్ను వెంబడించే భాగ్యం మాకు దయచేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

మత్తయి 19: 16-22

 మత్తయి 19: 16-22

అంతట ఒక యువకుడు యేసుని సమీపించి, "బోధకుడా! నిత్యజీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పనియేమి?" అని ప్రశ్నించెను. "మంచిని గూర్చి నన్నేల ప్రశ్నించెదవు మంచివాడు దేవుడు ఒక్కడే. నిత్యజీవము పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము" అని యేసు సమాధానమిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏవి?" అని అతడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, "నరహత్య చేయకుము. వ్యభిచరింపకుము. దొంగిలింపకుము. అబద్ధసాక్ష్యములు పలుకకుము. తల్లితండ్రులను గౌరవింపుము. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపుము" అనెను. అంతట అతడు యేసుతో "ఇవన్నియు ఆచరించుచుంటిని. ఇంకను నాకు లోటు ఏమి?"  అని అడిగెను. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో, వెళ్లి నీ ఆస్తిని అమ్మి, బీదలకు దానము చేయుము.  అపుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపుము" అని ఆయన సమాధానమిచ్చెను. ఆ యువకుడు అధిక సంపదగలవాడగుటచే, ఈ మాట విని బాధతో వెళ్లిపోయెను. 

ధ్యానము : నిత్య జీవము పొందుటకు నేను చేయ వలసిన మంచి పని ఏమిటి ప్రభువా? అని అడిగిన  ధనికుడైన యువకునికి, దేవుడు మాత్రమే మంచి వాడు అని ప్రభువు తేటతెల్లం చేస్తున్నారు. ఎందుకు దేవుడు ఒక్కడే మంచివాడు? అంటే   ఆయన ఎప్పుడు మంచినే చేస్తాడు, మానవుని వలే దురాలోచనలు, చేడు  పనులు, హత్యలు, దొంగతనాలు, అబద్దాలు, మోసాలు, కపటము, స్వార్ధం, లేక మానవునిలో కనపడే ఏ చేడు భావన దేవునిలో ఉండదు. ఆయన సకల సద్గుణాల నిధి. ఇతరుల ఉన్నతిని కోరువాడు. ఆయన ప్రేమామయుడు. పునీత పౌలు, యోహానులు చెప్పినట్లు ఆయన ప్రేమ. ప్రేమ సమస్తమును భరిస్తుంది. కాని మానవుడు తనకు వ్యతిరేకముగా ఏదైనా జరిగితే ఓర్చుకోలేడు. దేవుడు ఈ ఆజ్ఞలు మనకు ఇవ్వడం వలన మనం కూడా అయన వలే ఉండాలని కోరుతున్నాడు. కేవలం మానవ స్వభావం కాక దైవిక స్వభావం మనలో ఉండాలని కోరుకుంటున్నారు.    

యేసు ప్రభువు ఆ యువకునితో నిత్య జీవం పొందుటకు దైవాజ్ఞలను ఆచరింపమని చెబుతున్నారు.  యువకునికి ఉన్న కోరిక నిత్య జీవం పొందాలని. యువకుడు అడిగినది యేసు  ప్రభువును. కేవలం యేసు ప్రభువు మాత్రమే నిత్య జీవం ఇవ్వగలడు. కాని నిత్య జీవం ఇచ్చే ప్రభువు, దేవుని ఆజ్ఞలను పాటించు అని చెబుతున్నాడు. దేవుని ఆజ్ఞలు మనలను నిత్య జీవం పొందుటకు అర్హులను చేస్తాయి. దేవుని ఆజ్ఞలు ఏమి? అని యువకుడు ప్రభువును అడుగుతున్నాడు.  యేసు ప్రభువు ఆ యువకునికి నిత్య జీవితానికి మనలను అర్హులను చేసే  దేవుని ఆజ్ఞలను వివరిస్తున్నాడు. అవి ఏమిటి అంటే నరహత్య చేయకుండా ఉండటం, వ్యభిచరించకుండా ఉండటం, దొంకిలింపకుండా ఉండటం, అబద్ద సాక్ష్యములు చెప్పకుండా ఉండటం, తల్లితండ్రులను గౌరవించడం, ఒక వ్యక్తి తనను తాను ప్రేమించుకున్నట్లు ఇతరులను ప్రేమించడం ఇవి ఒక వ్యక్తిని నిత్యజీవం పొందేలా చేస్తాయి. ఇవి కేవలం మనలను నిత్య జీవం పొందేలానే కాక దేవుని మనస్సును కలిగి ఉండేలా చేస్తాయి.  మనలను దేవునికి ఇష్టమైన వారిగా చేస్తాయి. 

ఆ యువకుడు ఈ ఆజ్ఞలన్నిటిని చిన్నప్పటి నుండి పాటిస్తున్నాను అని చెబుతున్నాడు. కాని ఆ యువకునిలో ఎదో ఓక  లోపం ఉన్నది అని ఆ యువకునికి అనిపిస్తుంది.  ఎందుకు ఆ యువకుడు అలా అనుకుంటున్నాడు అంటే నిత్యజీవాన్ని ఇచ్చే ఈ ఆజ్ఞలను ఆ యువకుడు పరిపూర్తిగా పాటించి ఉండడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలలో  నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అని చెబుతున్నాయి. ఈ యువకుడు నేను చిన్నప్పటి నుండి చేస్తున్నాను అని అన్నప్పటికీ, ప్రభువు, నీవు పరిపూర్ణుడవు కాగోరినచో నీవు నీ ఆస్తిని అమ్మి బీదలకు  దానము చేయుము అని అంటున్నాడు. అంటే ఈ యువకుడు తనతో పాటు ఉన్నటువంటి పేదలను పట్టించుకోలేదు. ఈ లోపం ఈ యువకునిలో ఉన్నది. అదే విధంగా తన ఆస్తిని వదులుకోవడానికి ఇష్ట పడటం లేదు, తన ఆస్తిని నిత్య జీవం కంటే ఎక్కువగా ఆ యువకుడు ప్రేమించాడు. కనుకనే ఆ యువకుడు బాధతో వెళ్ళిపోతున్నాడు. తన ఆస్తిని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడుటలేదు. యేసు ప్రభువు పరలోకంలో ఆస్తిని కూడపెట్టుకొనే మార్గం చూపిన కేవలం ఈలోకం ఆస్తుల మీదనే ఆ యువకుడు ధ్యాస పెట్టాడు. 

దేవునితో సంభాషణ: ప్రభువా నేను కూడా యువకుని వలే  నిత్య జీవం పొందాలనే ఆశ కలిగి ఉన్నాను. మీ గురించి విన్నప్పుడు, మీ గురించి చదివినప్పుడు, మీరు మాత్రమే ఈ నిత్య జీవం ఇవ్వగలరని తెలుసుకున్నాను. మీరు మాత్రమే  ఇవ్వగలిగే ఆ నిత్య జీవం పొందాలని అనుకుంటాను. కాని ఆ నిత్య జీవం పొందుటకు నన్ను అర్హున్నీ చేసేటువంటి మీ అజ్ఞాలను నేను పాటించుటలో అనేక  సార్లు విఫలం చెందుతున్నాను. నన్ను నేను ప్రేమించుకున్నట్లు ఇతరులను ప్రేమించుటలో విఫలం చెందాను. ఇతరులు గొప్పగా ఉండే ఓర్చుకోలేకపోయాను. అనేకసార్లు మీ అజ్ఞలను పాటించుటలో పూర్తిగా విఫలం అయ్యిపోయాను. నన్ను నేను ప్రేమించాను, అభిమానించాను, వృద్ధిలోకి రావాలని కాంక్షించాను,  కాని ఇతరులను అలా చూడలేక పోయాను. నిన్ను అనుసరించాలని, నీ వలె ఉండాలని, నిత్య జీవం పొందాలని అనుకుంటున్నాను. ఈ లోక విషయాలు, ఆస్తుల మీదనే నా మనసును కేంద్రీకరించాను కాని నీ వలె తండ్రి చిత్తము మీద నా మనస్సును పెట్టలేక పోతున్నాను. 

ప్రార్ధన: ప్రేమమయుడవైన ప్రభువా! మీరు నిత్య జీవం పొందుటకు మమ్ములను అర్హులను చేయుటకు మేము చేయవలసిన క్రియలను మాకు తెలియజేస్తున్నారు. మీరు ఇచ్చిన ఆజ్ఞలను అన్నింటిని పాటించుటకు కావలసిన అనుగ్రహాలు మాకు దయచేయండి. పరలోకంలో ఆస్తిని కూడపెట్టుటకు ఈ లోకంలో ఏమి కోల్పోవుటకైనను సిద్దపడే మనస్సును మాకు ఇవ్వండి.  నన్ను నేను ప్రేమించుకొనునట్లు ఇతరులను ప్రేమించుటకు, మీవలె సకల సుగుణాలు కలిగి ఉండుటకు కావలసిన అనుగ్రహాలు మాకు దయచేసి, మేము తండ్రి వలే పరిపూర్ణులమగుటకు కావలసిన అనుగ్రహములు దయచేయండి. ఆమెన్ 

20 వ సామాన్య ఆదివారం

 20 వ సామాన్య ఆదివారం 

సామెతలు 9:1-6, ఎఫెసీ5: 15-20, యోహాను 6:51- 58

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణములు దివ్య సత్ప్రసాదము గురించి తెలుపుచున్నవి. గత కొన్ని వారాలుగా తల్లి శ్రీ సభ దివ్యసప్రసాదం గురించే బోధిస్తుంది. సాధారణంగా ఒక్కొక్క ఆదివారం ఒక్క ప్రత్యేక అంశం గురించి బోధిస్తున్నది కానీ దివ్యసప్రసాదం గురించి ఐదు వారాలుగా మనం ధ్యానించాలని కోరుచున్నది.

 ఈ యొక్క దివ్య సత్ప్రసాదం గురించి మరియు ప్రభు శరీర రక్తముల యొక్క విలువను మన యొక్క అనుదిన జీవితంలో గ్రహించాలి అన్నదే శ్రీ సభ యొక్క ఉద్దేశం. చాలామంది వాక్యము, వాక్యం కావాలి అని తహతహలాడుతుంటారు కానీ వాక్యము, శరీరము ధరించి మనందరినీ పోషిస్తున్నది, ఉత్తేజపరుస్తుంది, శక్తినిస్తుంది అనే సత్యమును మరిచిపోతున్నాం దివ్య సత్ప్రసాదానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా కేవలము వాక్యమునకు ప్రాముఖ్యతను ఇచ్చే జీవిస్తూ ఉంటాం కానీ ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు జ్ఞానము కలిగి ఆ యొక్క ప్రభు ప్రేమ గౌరవం కలిగి ప్రభు శరీర రక్తములను స్వీకరించాలి అని తెలుపుతున్నారు. దివ్యసప్రసాదము శ్రీ సభకు కేంద్రం మరియు ఒక గుండె లాంటిది. ప్రభువే స్వయముగా స్వయంగా దివ్యసప్రసాదమును మన కొరకై ఏర్పరచి స్వీకరించమని తెలిపారు.

ఈనాటి మొదటి పఠణంలో విజ్ఞానము అనేటటువంటి స్త్రీ మూర్తి విందు చేసి అందరిని ఆహ్వానించినది జ్ఞానం లేని వాళ్ళందరని కూడా పిలుస్తుంది ఎందుకంటే వారు కూడా తనలాగా జ్ఞానవంతులు అవ్వాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో. పాత నిబంధన గ్రంధంలో విజ్ఞానమును దేవునితో పోల్చి చెబుతూ ఉంటారు దేవుడు స్వయముగా విందులో ఏర్పరచి వారిని పిలుస్తూ ఉన్నారు. తన యొక్క విందులో పాల్గొనుట ద్వారా అజ్ఞానులు సైతం జ్ఞానులుగా మారుతారు అని అర్థం. దేవుడు ఏర్పరిచిన విందు ద్వారా అందరూ ఏకమవుతారు, సంతోషంతో జీవిస్తారు. విజ్ఞాన మూర్తి ఏర్పరిచిన విందు స్వీకరించుటవలన మరియు ద్రాక్ష రసాన్ని సేవించడం వలన వారు జీవాన్ని పొంది సరియైన మార్గమును తెలుసుకొని జీవించగలుగుతారు. 

విజ్ఞానము పొందుట చాలా అవసరం ఎందుకనగా విజ్ఞానం మనలను సత్యము వైపునకు నడిపించును.ఏది నిజమో అబద్దమో గ్రహించేలా చేసి సత్యమునకు సాక్షులుగా జీవించి లాగున చేస్తుంది. 

ఈనాటి రెండవ పఠణంలో కూడా పునీత పౌలు గారు అన్యులను యూదులను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ జీవించమని తెలుపుచున్నారు ఎందుకనగా వారిని తన యొక్క శరీర రక్తములను పంచుకొనుటకు ప్రభువు ఏకం చేశారు అలాగే మనలను వివేకవంతులవలె జీవించమని తెలుపుతున్నారు. ఈ లోక సంబంధాను సారముగా జీవించకుండా దేవుని యొక్క చిత్తము ప్రకారంగా జీవించమని తెలుపుచున్నారు.

ఈనాటి సువిశేష భాగములో ప్రభుని శరీర రక్తములను భుజించి ఉన్నటువంటి వారికి కలిగినటువంటి ప్రయోజనం గురించి ఏసుప్రభు తెలుపుచున్నారు. ఏసుప్రభువు స్వయముగా పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము ఈ యొక్క ఆహారం గురించి నటువంటి వారు నిరంతరము జీవిస్తారు అని తెలుపుతున్నారు. యోహాను శుభవార్తను, జీవము కలిగిన సువార్త అని పిలుస్తారు ఎందుకనగా ఆయన యొక్క గ్రంథంలో ఎక్కువ జీవము గురించి మాట్లాడారు ఇది మనము ప్రభుని శరీర రక్తములను స్వీకరించటం ద్వారా పొందుతున్నాం. ప్రభువే స్వయముగా, తాను ఒసిగేటటువంటి శరీర రక్తములను భుజిస్తే కానీ వారిలో జీవము ఉండదు అని తెలుపుతున్నారు. ఆదికాండములో ఆది తల్లిదండ్రులను దేవుడు చెట్టు పండు తినవద్దు అని పలికారు తినన ఎడల మీరు మరణిస్తారు అని తెలిపారు కానీ మనలను ఆయన యొక్క శరీర రక్తమును భుజించమని కోరుతున్నారు.

ప్రభు నీ శరీర రక్తములను భుజించి మరణించినటువంటి వారిని ఆయన అంతిమ దినమున సజీవముగా లేపుతారు అని తెలుపుతున్నారు అదేవిధంగా భుజించినటువంటి వారి యెడల దేవుడు ఉంటారు అని తెలుపుచున్నారు అనగా మన యొక్క జీవితమును ప్రభువు పంచుకుంటారు మనము జీవితమును పంచుకుంటాము. క్రీస్తు శరీర రక్తాలను స్వీకరించుట ద్వారా మన యందు ఎల్లప్పుడూ కూడా జీవము ఉంటుంది.

ప్రభువు అనేక అద్భుతాల ద్వారా దివ్య సత్ప్రసాద యొక్క శక్తిని మనందరికీ కూడా తెలుపుతున్నారు కావున మనం దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించటానికి మనల్ని మనము తయారు చేసుకోవాలి.
Fr. Bala Yesu OCD

20 వ సామాన్య ఆదివారం

 20 వ సామాన్య ఆదివారం 

సామెతల గ్రంధం 9:1-6  ఎఫెసీ 5: 15-20 యోహాను 6: 51-58 

పరలోకమునుండి దిగివచ్చిన జీవముగల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించునో వాడు నిరంతరం జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అనెను. అంతట యూదులు ఒకరితో ఒకరు "మనము భుజించుటకు ఈయన తన శరీరమును  ఎట్లు ఈయగలడు?" అని వాదించుకొనసాగిరి. యేసు వారికి "మీరు మనుష్యకుమారుని శరీరమును భుజించి, ఆయన రక్తమును త్రాగిననే తప్ప , మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి , నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను వానిని అంతిమ దినమున లేపుదును. ఏలయన నా శరీరము నిజమైన ఆహారము. నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును.  జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున  జీవించును. ఇదియే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి. అటుల కాక, ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడును జీవించును అని సమాధానము ఇచ్చెను. 

ఈనాటి మొదటి పఠనంలో విజ్ఞానమను స్త్రీ మూర్తి ప్రజలను "రమ్ము నేను తయారు చేసిన భోజనమును ఆరగింపుము. జ్ఞానము లేని వారు ఇచ్చటకు రెండు అని ఆహ్వానిస్తుంది. మూర్ఖత్వమును  విడనాడి బ్రతుకుడు.  విజ్ఞాన పథమున నడువుడు అని మనం మొదటి పఠనంలో  విటున్నాం.  ప్రియ విశ్వాసులారా  జ్ఞానము లేని వారు  ఇచటకు రెండు అని విజ్ఞానమను స్త్రీ మూర్తి పిలిచినట్లే దేవుడు మనందరినీ పిలుస్తున్నాడు. మనలను దేవుని వాక్కు అనే భోజనమును ఆరగించమని ఆహ్వానిస్తున్నారు. మానవుడు కేవలం, రొట్టె వలెనే కాక దేవుని నోటి నుండి వచ్చు వాక్కు వలన జీవించును. ఇది అక్షరాల సత్యం. కానీ చాలా మంది ఇంకా మూర్ఖత్వంలోనే జీవిస్తున్నారు. అజ్ఞానములోనే ఉండిపోతున్నారు. నా యొద్దకు రెండు అని పిలిచిన దేవుని మాటను వినలేక పోతున్నారు. దేవుని విజ్ఞాన మార్గంలో నడవమని ఆహ్వానిస్తుంది. మనము జ్ఞానము కలిగిన వారిగా జీవించి విజ్ఞాన పథంలో జీవించుదాం. 

ఈనాటి సువిశేషంలో మనం వింటున్నాం పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారము నేనే. అదే విధంగా ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నాశరీరమే అని క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నాడు. 

అదే విధంగా నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువారు నిత్యజీవము పొందును. నేను వారి యందు వారు నాయందు ఉండును. నేను తండ్రి మూలమున జీవించునట్లే నన్ను భుజించువాడు నా మూలమున ఎల్లప్పుడును జీవించును. ఇది గొప్ప భాగ్యం మానవులమైన మనందరికీ. 

కాబట్టి ప్రియ విశ్వాసులారా మనం నిత్య జీవం పొందాలంటే , మనం మనము దేవుని యందు ఉండాలంటే దేవుని శరీర రక్తాలను నిత్యం స్వికరించాలి. మరి క్రీస్తు ప్రభువుని శరీర రక్తలను స్వీకరించాలంటే పరిశుద్ధతతో జీవించాలి. దేవుని చిత్తాను సారం నీవు నేను మనందరం ఆ ప్రభుని చిత్తం తెలుసుకొని జీవించాలి. పవిత్రతతో నింపబడాలి. 

మనం ఏమి చేయాలంటే? దేవుని పిలుపును , ఆహ్వానాన్ని విని దేవుని దగ్గరకు వెళ్ళాలి. దేవుని యొక్క జ్ఞానమును, జ్ఞాన ఫలములను పొంది దేవుని వాక్కుతోను శరీర రక్తములతోను నింపబడాలి. మన మూర్ఖత్వాన్ని తొలగించమని ఆ దేవుని జ్ఞానము కొరకు ప్రార్ధించాలి. నిత్య జీవం, పొందాలంటే మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని విడనాడి దేవుని త్రోవలో నడవాలి. దేవునితో నిత్యం కలకాలం జీవించడానికి ప్రయత్నించుదాం. 

ప్రార్ధన: ప్రేమ మయుడైన దేవా మేము ముర్ఖులం, మా మూర్ఖత్వంలో, అజ్ఞానంలో  జీవిస్తున్నాం. నీ జ్ఞానమును, జ్ఞానవరములను పవిత్రత్మను మాపై కుమ్మరించి విజ్ఞానముతో  నింపుము, నిత్యం నీ త్రోవలో నడుస్తూ నిత్య జీవం పొందే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. 

ఫా. సురేష్ కొలకలూరి OCD

యెహెఙ్కేలు 18:1-10. 13,30-32 మత్తయి 19:13-15

 యెహెఙ్కేలు 18:1-10. 13,30-32 మత్తయి 19:13-15

ఆ సమయమున కొందరు తమ బిడ్డలపై చేతులుచాచి ప్రార్ధింపుమని యేసు వద్దకు తీసుకొని రాగా, శిష్యులు వారిని ఆటంకపరచిరి. "చిన్న బిడ్డలను నాయొద్దకు  రానిండు. వారలను ఆటంక పరపకుడు. ఏలయన, అట్టి వారిదే పరలోక రాజ్యము" అని పలికిరి, వారి మీద చేతులుంచి యేసు అచట నుండి వెడలిపోయెను. 

ప్రియమైన మిత్రులారా ఈనాటి మొదటి పఠనం యెహెఙ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో ఇలా అంటున్నాడు. ఎవ్వరు చేసిన పాపములకు వారే శిక్షను అనుభవిస్తారు అని దేవుడు చెప్పిన సందేశాన్ని వారికి వినిపిస్తున్నాడు . అదే విధంగా సత్పురుషుడు  చిత్తశుద్ధితో దేవుని చట్టాలను విధులను పాటించును కనుక అతడు కాలకాలము  బ్రతుకును అని దేవుడు పలుకుచున్నాడు. ఎవరైతే న్యాయపరులుగాను, ధర్మ పరులుగాను, జీవిస్తారో వారు దేవుని కృపను పొందుతారని వింటున్నాం. అదే విధంగా ఎవరైతే దుష్ట కార్యాలను పాల్పడుతారో వారు ఖచ్చితముగా చచ్చును. వారి చావునకు వారే బాధ్యులు, అని దేవుడు వారితో చెబుతూ ఎవరు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగదు అని అంటున్నాడు. మన నుండి మన దేవుడు కోరుకొనినది హృదయ పరివర్తన చెంది, పాపముల నుండి వైదొలగి  బ్రతుకుడు అంటున్నాడు. 

ప్రియ విశ్వాసులారా దేవుడు మనలను మన పాపపు క్రియల నుండి పాపపు ఆలోచనలనుండి మారు మనస్సు పొంది, మన పాపముల నుండి వైదొలగాలని ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. మనం పాపంలోనే, పాపం చేస్తూ మరణించడం దేవునికి అసలు ఇష్టం లేదు అదేవిధంగా దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. మీ మీ క్రియలను బట్టి, మీరు శిక్షను పొందుతారు అని చెబుతున్నాడు. మరి మనము ఎలాంటి క్రియలు చేస్తున్నాము. ఎలాంటి పనులు చేస్తున్నాము ఆలోచించండి. మనం చిత్త శుద్దితో న్యాయంగా, ధర్మంగా దేవుని ఆజ్ఞలు పాటించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాని  మన మనలో చాలా మంది దుష్ట బుద్దితో, దుష్ట కార్యములకు పాల్పడుతున్నాం. దేవుని ఆజ్ఞలను పాటించడం లేదు. మరి ఈరోజు మన నుండి దేవుడు ఏమి అడుగుతున్నాడు అంటే మీ పాత పాపపు జీవితమును విడిచి పెట్టి నూత్న మనసును, నూత్న హృదయమును పొందుకోండి అంటున్నాడు. మనం మన పాపపు , చీకటి , చేడు, దుష్ట కార్యాలను వదలి నూత్న జీవితము పొందడానికి సిద్ధముగా ఉన్నామా? లేదా? ఇంకా పాపములోనే ఉండి  జీవిస్తూ, పాపములో మరణిస్తామో ఆలోచించండి. ఇంకా పాపములోనే ఉండి మనము చనిపోయినట్లయితే మనం దేవుని సంతోష పెట్టినవారము కాదు. మనము దేవుని దుఃఖ పరిచినవారము  అవుతాం. కాబట్టి మన జీవితాలు దేవుని చిత్తానుసారాం జీవించడానికి మంచిగా జీవించడానికి ప్రయత్నించుదాం. 

ఈనాటి సువిశేషంలో మనం వింటున్నాం. ఎప్పుడైతె శిష్యులు యేసు వద్దకు వచ్చి త్మమ బిడ్డలను దీవింపమని అడిగిన వారిని ఆటంకపరచడం చూశాడో  అప్పుడు శిష్యులతో చిన్న బిడ్డలను నాయొద్దకు రానివ్వండి. వారిని ఆటంకపరచకండి అట్టి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి వారిని దీవించాడు. ప్రియ విశ్వాసులారా మనం మన మనస్సు నందు చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చిన్న బిడ్డలలో గర్వం, స్వార్ధం, అహంకారం, కోపం, క్రోధం, మొహం, దుష్టత్వం ఇలాంటివి ఏవి వారికి ఉండవు. వారు నిర్మలంగా, పరిశుద్ధంగా, ప్రేమ, మంచి మనస్సుతో ఇతరులను గౌరవిస్తూ వారి తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తుంటారు. ప్రియ విశ్వాసులారా మరి మనం నిర్మలమైన , పరిశుద్ధమైన స్వచ్ఛమైన మనస్సులతో ఉంటేనే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. దేవుని రాజ్యాన్ని పొందగలం.  కాబట్టి దేవునికి ప్రార్థిస్తే చిన్నపిల్లల మనస్తత్వం పొందుటకు ప్రయత్నించుదాం. 

ప్రార్ధన : పరిశుద్దుడైన దేవా మేము మా పాపపు ఆలోచనలతో పాపము క్రియలు చేస్తూ మా పాపాలలోజీవిస్తున్నాం. దయగల దేవా నీవు అంటున్నాము. పాపాత్ములు మరణించుటలో నీకు సంతోషం లేదని, ప్రభువా నాకు పాప మన్నింపును దయ చేయండి. నా దుష్ట క్రియల నుండి వైదొలగడానికి, శక్తిని బలాన్ని నాకు దయచేయండి. మంచిగా జీవిస్తూ నీ ఆజ్ఞలను పాటించే నూత్న హృదయాన్ని నాకు దయచేయండి. నిన్ను సంతోష పెట్టె బిడ్డగా నేను జీవించేలాగా నన్ను మార్చుము తండ్రి. ఆమెన్. 

ఫా . సురేష్ కొలకలూరి OCD

యెహెఙ్కేలు 16:1-15, 60,63 మత్తయి 19:3-12

 యెహెఙ్కేలు 16:1-15, 60,63 మత్తయి 19:3-12

యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి "ఏ కారణము చేతనైన ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా?" అని ప్రశ్నించిరి. "ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృజించినట్లు మీరు చదువలేదా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని, తండ్రిని, విడిచి తన భార్యను హత్తుకొనియుండును. వారు ఇరువురు ఏక శరీరులై యుందురు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక, ఏకశరీరులైయున్నారు. దేవుడు జతపరచిన జంటను మానవమాతృడు వేరుపరుపరాదు" అని యేసు పలికెను. "అటులైన విడాకుల పత్రమునిచ్చి భార్యను విడనాడవచ్చునని మోషే ఏలఆజ్ఞాపించెను?" అని పరిసయ్యులు తిరిగి పశ్నించిరి. "మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమతించెనే కాని, ఆరంభమునుండి ఇట్లు లేదు వ్యభిచార కారణమున తప్ప, తన భార్యను విడనాడి మరియొకతెను వివాహమాడువాడు వ్యభిచారియగును" అని యేసు ప్రత్యుత్తర మిచ్చెను. అప్పుడు శిష్యులు, "భార్య, భర్తల  సంబంధము ఇట్టిదైనచో వివాహమాడకుండుటయే మెలుతరము" అనిరి. అందుకు యేసు "దైవానుగ్రహము కలవారికేగాని మరెవ్వరికిని ఇది సాధ్యపడదు. కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు. మరికొందరు పరులచే నంపుసకులుగా చేయబడుచున్నారు. పరలోక రాజ్యము నిమిత్తమై తమకు తాము నపుంసకులు అయిన  వారును కొందరున్నారు. గ్రహింపగలిగినవాడు గ్రహించునుగాక!" అని పలికెను.  

ప్రియ విశ్వాసులారా ఈనాటి మొదటి పఠనంలో  యావే ప్రభువు  యెరూషలేముతో ఇట్లు చెప్పుచున్నాను. మీరు నాకు ద్రోహము చేసిరి. నాకు ఇష్టము లేని హేయమైన కార్యములు మీరు  చేస్తున్నారు. అని యెరూషలేము వాసులకు యెహెఙ్కేలు ప్రవక్తతో ద్వారా తెలియజేస్తున్నాడు. ఒక గొప్ప వివాహ బంధం ద్వారా దేవుడు తనకు తన ప్రజలకు ఉన్న బంధాన్ని గురించి  తెలియచేస్తున్నాడు. అది ఏమిటంటే దేవుడు  ఎన్నోత్యాగాలు చేస్తు, ఎన్నో దీవెనలు ఇస్తు, ఎంతో కష్టపడుతు మనపై దయచూపుతున్నారు.  మనకు అనురాగంతో పరిచర్యలు చేస్తున్నాడు. ప్రభువు చెబుతున్నాడు.   నిన్ను నా వస్త్రముతో కప్పి నీకు మాట ఇచ్చితిని, నేను నీతో వివాహ బంధము చేసుకొనగా నీవు నా దానవైతివి. నేను నా కీర్తినినీకు ప్రసాదించితిని. కాని నీ సౌదర్యము వలన కీర్తి వలన నీకు తలతీరిగినది. నీవు నీచెంతకు వచ్చిన వారందరితో వ్యభిచరించితివి.  

ప్రియ మిత్రులారా ఒక భర్త  భార్యకోసం  ఎన్నోత్యాగాలు, కష్టాలు, ఇబ్బందులు ప్రేమతో భరిస్తూ కష్టపడుతూ ఉంటె, ఎంతో అనురాగంతో  ఆప్యాయంగా పరిచర్యలు  చేస్తూ ఉంటె, భార్య మాత్రం  భర్తకు అన్యాయం చేస్తుంది. ఇక్కడ భర్త అంటే  (దేవుడు) యావే ప్రభువు. అదేవిధంగా భార్య అంటే యెరూషలేము వాసులందరు.  మనమందరికి  ఈ ఉపమానం ద్వారా దేవుడు తన బాధను ప్రేమను మనందరికీ అర్ధం అయ్యేలాగా చెబుతున్నాడు. మరి ఇక్కడ వ్యభిచారం అంటే అన్య దేవుళ్లను ఆరాధించడం. దేవుణ్ణి మర్చిపోయి అన్యదేవతలను మ్రొక్కుతున్నా వారు అని అర్ధం. 

ప్రియ మిత్రులారా ఏ బంధంలోనైన విశ్వాసనీయత ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ఎంతో విశ్వాసంతో,  ప్రేమతో ఉండాలి. దేవుడు ఈ విషయమును వివాహబంధము ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు నేను నీ అపరాధమును, నీ తప్పులెల్ల  క్షమిస్తున్నాను అని, అంటే దేవుడు మనకు తెలియజేసేది ఏమిటంటే ఆయన మన పాపములను తప్పిదములను అన్నింటిని క్షమించే దేవుడు. మరి మనము మన బంధాలలో ఒకరి పట్ల ఒకరము ఈవిధమైన ప్రేమ, క్షమ, విశ్వసనీయత కలిగివుండాలి. కలిగి ఉండటానికి మనందరం ప్రయత్నించాలి. 

అదేవిధంగా ఈనాటి సువిశేష పఠనంలో చూస్తే పరిసయ్యులు యేసును  శోధించడానికి, ఆయనను పరీక్షించడానికి వచ్చి ఏకారణము చేతనైన భార్యను పరిత్యజించుట తగునా అని ప్రశ్నించారు. ప్రభువు వారికి  భార్య భర్తలు  ఇరువురు వివాహం ద్వారా ఒకరినొకరు హత్తుకొని ఏక శరీరులైరి అని చెబుతూ ఒక సత్యాన్ని వారికి తెలియజేస్తున్నాడు. దేవుడు జత పరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరుపరాదు అని అంటున్నాడు. అప్పుడు వారు మోషే ఎలా విడాకుల పత్రం ఇచ్చి భార్యను వదిలి వేయవచ్చునని ఆజ్ఞాపించాడు అని అంటున్నారు. అందుకు యేసు ప్రభువు,మీ హృదయ కాఠిన్యమును  బట్టి మీ మీ భార్యలను  మీరు విడనాడుటకు అనుమతించేనే కాని ఆరంభము నుండి అలా లేదు. భార్యను వ్యభిచార కారణమున తప్ప ఇంక దేనివలనైనను విడనాడి మరియొకతెను వివాహమాడు వాడు వ్యభిచారియగును అని చెప్పాడు. 

ప్రియ మిత్రులారా వివాహ బంధం  అన్ని బంధాల కంటే ఎంతో గొప్ప బంధం. మనం మొదటి పఠనములో వింటున్నాం. ఎన్ని కష్టాలు వచ్చిన , ఎన్ని బాధలు వచ్చిన ఎన్నో తప్పులు చేసిన దేవుడు అవి అన్ని క్షమించి మనలను స్వీకరిస్తున్నారు. అదే విధంగా మనం కూడా ఆయన ప్రేమను మర్చిపోకూడదు. మనం ఎవ్వరు కూడా ఏ కుటుంబాన్ని విడదియ్యకూడదు. ఏ బంధంలో  లేని గొప్ప తనం ఈ వివాహ బంధంలో ఉంది. ఒకరికొకరు  ఏ విధంగా బ్రతుకుతారో మనకు తెలుసు. అదే విధముగా మనము కూడా క్రీస్తు కొరకు బ్రతకాలి. రెండవది వివాహం లేకుండా ఉండాలంటే,  జీవించాలంటే ఎలా సాధ్యము అంటే  క్రీస్తు  ప్రభువు చెబుతున్నాడు "దైవానుగ్రహము కలవారికె గాని మరెవ్వరికిని ఇది సాధ్యపడదు. అదే విధంగా కొందరు పుటుక్కుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు. మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడుతున్నారు. పరలోక రాజ్యం నిమిత్తమై తమను తాము నపుంసకులుగా చేసుకున్నవారు  కొందరున్నారు. వారెవ్వరు అంటే గురువులు , కన్యస్త్రీలు  బ్రహ్మచారులుగా దేవుని కొరకు  జీవించేవారు. ప్రియ విశ్వాసులారా ఏది చెయ్యాలన్న దైవానుగ్రహం ఉండాలి. మరి మన కుటుంబ  లేక సన్యాసం జీవితాలలో ప్రభుని అనుగ్రహం ఉందా? లేకపోతే దైవానుగ్రహాల కోసం ప్రార్ధించుదాం. 

ప్రార్ధన: ప్రేమామయుడా! నీవు ప్రతినిత్యం మమ్ము నీ ప్రేమతో నింపుతూ నిన్ను వెంబడించాలి అని పిలుస్తున్నావు. మా కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నావు. కానీ మేము మా అజ్ఞానము  వలన అవి మరచి  లోక వస్తువుల కోసం పొరుగువారి పట్ల ప్రేమ దయ క్షమ విశ్వసనీయత చూపలేక పోతున్నాం. మమ్ము మన్నించి నీ దైవానుగ్రహములు మాపై,  మా కుటుంబాలపై కుమ్మరించండి. ఆమెన్ 

మరియమాత మోక్షరోపణ పండుగ

 మరియమాత మోక్షరోపణ పండుగ

దర్శన గ్రంథం 11:19,12:1-6,10 1కొరింతి 15:20-27 లూకా 1:39-56

ఈరోజు మనం 79వ స్వతంత్ర దినోత్సవ  వేడుకను జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 వ తేదీ ప్రతి భారతియునికి చాలా ముఖ్యమైన రోజు. ఎందరో త్యాగాల ఫలితముగా భారత దేశానికి స్వతంత్రం వచ్చింది. అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన  దేశ ఉన్నతికి మన వంతు కృషి మనము చేయాలి. మన దేశ నాయకుల కొరకు  మనం ప్రార్ధన చేయాలి. మన దేశ నాయకులు అలాగే మన దేశ ప్రజలు ఎవరికీ బానిసలు కాకుండా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించేలాగా ఉండాలని ప్రార్ధన చేద్దాం. 

ఈనాటి మొదటి పఠనంలో మరియ తల్లి గురించిన  గొప్ప దర్శనం మనము వింటున్నాము. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై పండ్రెండు నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండుచులాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. ఆమె ప్రసవించగా ఆమె శిశువు దేవుని వద్దకును, ఆయన సింహాసనము వద్దకును తీసుకొనిపోబడెను. అప్పుడు ఒక స్వరము ఇప్పుడు దేవుని రక్షణము వచ్చి యున్నది. ఆయన మెస్సియా. ప్రియ విశ్వాసులారా దేవుని రక్షణ ప్రణాళికలో మరియ మాత  ఎంతో గొప్ప పాత్ర వహించింది. మానవాళి రక్షణలో మరియమాత చూపిన విశ్వాసం, త్యాగం, ప్రేమ ఎంతో  ఘనమైనది. దేవుని యొక్క పిలుపును విశ్వాసంతో స్వీకరించి నేను ప్రభుని దాసురాలను అంటూ తనను తాను ప్రభుని చిత్తానికి సమర్పించుకున్నది. తద్వారా దేవుని తల్లిగా మారి దైవ కుమారుడైన యేసుకు జన్మనిచ్చి, తన ప్రేమను త్యాగాన్ని ప్రదర్శించింది. కనుకనే దేవుడు ఆమెను గొప్ప సర్పము నుండి రక్షించాడు. ఆమెను మరణము నుండి రక్షించాడు. ఈలోక మరణము తర్వాత మరియతల్లిని  ఆత్మశరీరములతో పరలోక నిత్యా నివాసంలోనికి తీసుకొని వెళ్ళాడు. 

రెండవ పఠనం: మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని, ధ్రువ పరుచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రధముడనుట సత్యము, నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు అని వింటున్నాం. మితృలారా మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని క్రీస్తు ప్రభువు నిరూపిస్తున్నాడు. తనకు జన్మ నిచ్చిన పవిత్ర మూర్తియైన మరియమాతను దేవుడు ఆత్మ శరీరములతో మోక్షమునకు లేవనెత్తాడు అనుటలో ఏ సందేహం లేదు. మృత్యువునే నాశనము చేయగలిగిన శక్తి గల వాడు మన దేవుడు అని వాక్యం సెలవిస్తుంది.

క్రీస్తు ప్రభువు మోక్షరోహణం తర్వాత యేసు క్రీస్తు ప్రభువు తన తల్లియైన మరియమ్మను ఆయన మహిమతో  భాగస్తులుగా ఉండుటకు మరియమ్మను మోక్షరోపణం, మోక్షమునకు తీసుకొని పోతున్నాడు. 

సువిశేష పఠనములో మరియా తల్లి ఎలిజబెతమ్మను దర్శించుట మరియు మరియమ్మ స్తోత్రగీతము గురించి వింటున్నాం. మరియతల్లి ఉన్నచోట ప్రతి వ్యక్తి కూడా  పవిత్రాత్మతో నింపబడుతారు. మరియ తల్లి వందన వచనము ఎలిజబెతమ్మ చెవిలో పడగానే, ఆమె పవిత్రాత్మతో పరిపూర్ణురాలాయెను. అదేవిధంగా ఆమె అంటుంది. మరియమ్మ "స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు. నీవు నా ప్రభుని తల్లివి, నీవు ధన్యురాలవు. అప్పుడు మరియతల్లి దేవునికి స్తుతిగీతము  పాడుతుంది. దేవుడు తనకు చేసిన గొప్ప కార్యములకు ఆమె ఎంతో సంతోష పడుతు, సర్వశక్తిమంతుడు నా యెడల గొప్ప కార్యములు చేసెను. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరములు వరకు ఉండును. మరియు ఆయన దీనులను  లేవనెత్తును అంటు దేవుణ్ణి స్తుతించింది. 

ప్రియ విశ్వాసులారా  మనం  దేవుని యొక్క సందేశాన్ని విన్నప్పుడు పవిత్రాత్మతో నింపబడుతున్నామా? ఎలిజబెతమ్మ వలె మనము కూడా మరియతల్లి, దేవుని తల్లి అని చెప్పగలుగుతున్నామా? మరియతల్లి మోక్షరోపణ పండుగ మనకు తెలియజేసేది ఏమిటంటే ఒక రోజు నువ్వు, నేను మనమందరం కూడా మరియతల్లి వలే పరలోకానికి ఆత్మ శరీరంతో ఎత్త బడతాము అని  కాబట్టి మరియతల్లి వలె జీవించడానికి ప్రయత్నించుదాం. 

ప్రార్ధన : సర్వశక్తివంతుడైన దేవా నీవు మమ్ము స్వాతంత్రులుగా చెయ్యడానికి ఈలోకానికి వచ్చావు. మేము ఈ రోజు  మా దేశ స్వతంత్ర దినోత్సవాన్ని కొనియాడుకుంటున్నాం. కానీ ఇంకా చాలా చోట్ల ప్రజలు పేదరికం అన్యాయం హింసలకు  బానిసలుగా ఉన్నారు. నీవు సర్వశక్తివంతుడవు , దయ కనికరం గలవాడవు కాబట్టి అలా బానిసలుగా ఉన్న ప్రజలకు విముక్తి  విడుదలను దయచేయ్యండి. ఈ లోక రాజకీయ నాయకుల్ని మీ శక్తితో నడిపించండి. ఈరోజు మరియతల్లి మోక్షరోపణ పండుగ జరుపుకొనుచుండగా మా అందరికి కూడా విడుదలను దయచేయండి. ఈ లోకానికి, లోకవస్తువులకు,  శరీరానికి, పాపానికి  బానిసలైన మమ్ము మీ నిత్యా రక్షంలోనికి ఎత్తబడే భాగ్యం మాకు దయచేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD


యెహెఙ్కేలు 9: 1-7, 10:18-22 మత్తయి 18:15-20

 యెహెఙ్కేలు 9: 1-7, 10:18-22 మత్తయి 18:15-20

"నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన యెడల నీవు వెళ్లి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ది చెప్పుము. నీ మాటలు అతడాలకించిన యెడల వానిని నీవు సంపాదించుకొనిన వాడవగుదువు. నీ మాటలు అతడు ఆలకింపని యెడల ఒకరిద్దరిని నీ వెంట తీసుకొనిపొమ్ము. ఇట్లు ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడును. వారి మాట కూడ వినని యెడల సంఘమునకు తెలుపుము, ఆ సంఘమును కూడ అతడు లెక్కింపని యెడల, వానిని అవిశ్వాసునిగా, సుంకరిగ పరిగణింపుము. భూలోకమందు మీరు  వేనిని బంధింతురో అవి పరలోక మందు బంధింపబడును. భూలోకమందు  మీరు  వేనిని విప్పుదురో అవి పరలోక మందు విప్పబడునని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి అడిగినను, పరలోక మందుండు నా తండ్రి వారికి దానినొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలన, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను" అనెను. 

క్రిస్తునాధుని యందు ప్రియమైన విశ్వాసులారా ఈనాడు మనము పునీత మాక్సి మిలియాన్ మేరీ కోల్బె గారిని స్మరించుకుంటున్నాము. ఈ పునీతుడు ఎంతో ప్రేమతో, దేవుని సేవ చేసిన గురువు. ప్రతి నిత్యం దైవ ప్రేమను పంచిన పునీతుడు. దేవుని ఆజ్ఞలన్ని దైవ ప్రేమ, సోదర ప్రేమ అనే రెండు ఆజ్ఞల మీద ఆధారపడిఉన్నాయి. దైవ ప్రేమతో నింపబడి, దైవ ప్రేమలో ఎదిగిన వ్యక్తి ఈయన. తన పొరుగువారి కోసం తన ప్రాణమును ధారపోయువాని కంటే గొప్పవాడు ఎవడును లేడు అని క్రీస్తు  ప్రభువు అని చెప్పిన వాక్యాన్ని ధ్యానిస్తూ తన పొరుగు వానిని రక్షించడానికి వేరే వ్యక్తి మరణ శిక్షను తాను తీసుకొని ఆ వ్యక్తి కోసం ప్రాణమును అర్పించిన వ్యక్తి. గొప్ప వేద సాక్షి, దైవ  ప్రేమ మానవ ప్రేమతో నిండిన వ్యక్తి ఈ పునీతుడు. 

ప్రియ విశ్వాసులారా ఈ లోకంలో చాలా మందికి దైవ భయం లేదు, దైవ ప్రేమను కూడా అర్ధం చేసుకోలేక పోతున్నారు. మనము నిజముగా దైవ ప్రేమ కలిగిఉన్నామా? మనకు దైవ భయం ఉన్నదా? ఆలోచించండి. సోదర ప్రేమ ఈ లోకం ప్రజలు తమ తోబుట్టువులనే ప్రేమించలేకపోతున్నారు. అటువంటి మనం ఎలా పొరుగువారికి ప్రేమించగలం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజం చెప్పాలంటే దైవ ప్రేమ నీ నా హృదయంలో లేకపోయినట్లయితే మనకు సోదర ప్రేమ లేనట్టే. మన దేవుడి ప్రేమామయుడు, ప్రేమ నిధి ఆయన బిడ్డలుగా ప్రేమ కలిగి పునీత మాక్సిమిలియన్ గారి వలె జీవించడానికి ప్రయత్నించుదాం. 

ఈనాటి మొదటి పఠనంలో మనము వింటున్నాం. యెరూషలేములో ఉన్న ప్రజల పాపములకుగాను దేవుడు తన దూతలను పంపి వారిని శిక్షిస్తున్నాడు. యెహెఙ్కేలు ప్రవక్త ఈ దర్శనాన్ని చూస్తూన్నాడు. దేవుడు తన దూతను పంపుచు అంటున్నాడు. "నీవు యెరూషలేము నగరమంతట సంచరించి పట్టణమున జరుగుచున్న హేయమైన కార్యములకుగాను సంతాపము చెందు వారి నొసటిపై ముద్ర వేయుము. దూతలారా మీరు నగరంలోని వెళ్లి అందరిని వధింపుడు. ఎవరి మీద జాలి చూపకుడు. ఎవ్వరిని వదలి వేయకుడు అని చెబుతూ తమ నొసటి మీద గురుతు ఉన్న వారిని మాత్రము ముట్టుకోనకుడు అని ఆజ్ఞాపించాడు. 

ప్రియ విశ్వాసులారా ఎందుకు దేవుడు వారిని చంపుతున్నాడు అంటే ఆ ప్రజలు యిస్రాయేలీయులు ఘోరమైన పాపములు చేశారు. వారు ఇతరులకు చెడు చేస్తున్నారు. దేవుడు వారిని శిక్షిస్తున్నాడు. కాని వారి పాపములు ఒప్పుకొని వారి తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపం చెందువారిని దేవుడు రక్షిస్తున్నాడు. దీని ద్వారా మనందరం ఏమి తెలుసుకోవాలంటే అంతిమ దినమున దేవుడు తన దూతలను పంపి మనలను, మన పాపక్రియలకుగాను మన చెడు క్రియలకుగాను మనలను జాలి, దయ లేకుండా శిక్షిస్తాడు. మరి ఆయన దయను పొందాలంటే మనము పాపపు, చేడు జీవితాన్ని విడిచి పెట్టి, పశ్చాత్తాపంతో దేవుని చెంతకు రావాలి. మిత్రులారా ఒకసారి ఆలోచించండి మన జీవితాలు, మన పనులు, మన మాటలు ఎలా ఉన్నాయి. ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుని మన్నింపును కోరుకుందాం. 

ఈనాటి సువిశేష పఠనంలో మనం మన సోదరుని ఎలా సరిదిద్దుకోవాలిఅనే విషయాన్ని మనం వింటున్నాం. నేటి సమాజంలో మనం చుస్తే చాలా మంది చాలా రకాలైన తప్పులను చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే, అవివేకం వాళ్ళ కొంతమంది తప్పులు చేస్తుంటే, కొంత మంది స్వార్ధ బుద్దితో, కొంత మంది స్వలాభాల కోసం, మరి కొంత మంది డబ్బు కోసం, ఆస్తుల కోసం ఎలా ఎన్నోరకాలైన వాటి కోసం తప్పులు చేస్తున్నారు. క్రీస్తు ప్రభువు ఈనాటి సువిశేషంలో  నీ సోదరుడు నీకు విరుద్ధంగా తప్పు చేస్తే నీవు అతని దగ్గరికి వెళ్లి ప్రేమతో మాట్లాడి, తన తప్పును ఆ వ్యక్తికి అర్ధమైయ్యేలా చెప్పు అంటున్నాడు. ఈనాడు ప్రజలు తప్పు చేసిన వ్యక్తితో తప్ప అందరికి చెబుతారు. ఆమె లేదా అతను ఇలా చేసాడు, అలా చేశారు అని చెబుతుంటారు. అలా చెయ్యడం వలన మనం వారికి ఇంకా చెడ్డవారిగా చేస్తుంటాం. ఆలోచించండి. నీవు చెప్పినట్టు వినకపోతే ఇంకో ఇద్దరినీ తీసుకెళ్లి మాట్లాడు అది కూడా వినకపోతే సంఘానికి చెప్పు అప్పటికి వినకపోతే అతన్నీ అవిశ్వాసిగా పరిగణించు  అని ప్రభువు చెబుతున్నారు. వారి కోసం మనము ప్రార్ధించాలి. ఏక మనస్కులై మనమందరం ప్రార్ధిస్తే దేవుడు మన ప్రార్ధనల ద్వారా ఎంతోమంది జీవితాలను మార్చుతాడు. మనమందరం గుర్తుంచుకోవలసినది ఏమిటంటే మన మాటల వల్లకానిది మన ప్రార్థన వల్ల ఖచ్చితముగా జరుగుతుంది కాబట్టి ప్రతినిత్యం ప్రార్ధించి ఆత్మలను రక్షించడానికి ప్రయత్నించుదాం. 

ప్రార్ధన :తండ్రియైన దేవా ఈనాటి వాక్యం ద్వారా సోదర ప్రేమ మరియు దైవ భయం దైవ ప్రేమను కలిగి జీవించాలని మాకు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. దేవా ఎన్నో సార్లు మేము నీ పట్ల భయ భక్తులు లేకుండా మా తప్పిదములతో, పాప స్థితిలో చెడు పనులలో ప్రయాణించాము. కాని ఈ రోజు నీ వాక్యం ద్వారా మా తప్పులు తెలుసుకొని పశ్చాత్తాప పడుతున్నాము. నిన్ను ప్రేమిస్తూ, నా పొరుగువారిని ప్రేమిస్తూ, వారి మంచి కోసం క్షేమం కోసం తపిస్తూ, ప్రార్ధిస్తూ పునీత మాక్సిమిలియన్ కోల్బె వలె జీవించే భాగ్యం మాకు దయచేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

యెహెఙ్కేలు 2:8-3:4 మత్తయి 18:1-5,10,12-14

 యెహెఙ్కేలు 2:8-3:4 మత్తయి 18:1-5,10,12-14

ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, "పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవ్వడు?" అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, "మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందింననే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశింపరని నిజముగా నేను మీతో వక్కాణించు చున్నాను. కాబట్టి తనను తాను తగ్గించు కొని ఈ బాలుని వలె వినమ్రుడుగ రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్న వానిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు." ఈ చిన్నవారిలో ఎవ్వరిని త్రుణికరింపకుడు. ఏలన వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." ఒకడు తనకున్న నూరు గొఱ్ఱెలలో ఒకటి తప్పిపోయినచో, తక్కిన తొంబది తొమ్మదింటిని ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదకుటకు పొడా? అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన తొమ్మది తొమ్మిదింటి కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసి బాలురలో ఏ ఒక్కడైన నాశనమగుట పరలోక మందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలిసికొనుడు." 

క్రిస్తునాధుని యందు ప్రియా మిత్రులారా దేవుడు ఈనాడు యెహెఙ్కేలు ప్రవక్తకు తన మాటలను వినిపించుచున్నాడు. ఆ ప్రవక్తతో దేవుడు అంటున్నాడు నీవు యిస్రాయేలు వలె తిరుగుబాటు చేయవలదు. అలాగే నీవు ఈ గ్రంథపు చుట్టను భుజించి యిస్రాయేలియుల వద్దకు వెళ్లి వారితో మాటలాడుము" అని చెబుతున్నాడు. ఎప్పుడైతే యెహెఙ్కేలు ప్రవక్త నోరు తెరిచాడో అప్పుడు దేవుడు అతనితో నేను నీకు ఇచ్చు ఈ గ్రంధపు చుట్టను భుజించి దీనితో కడుపు నింపుకొనుము అని అంటున్నాడు. అదేవిధంగా యెహెఙ్కేలు దానిని భుజింపగా అది తేనెవలె మధురముగా ఉన్నది. 

మిత్రులారా! దేవుడు ఎప్పుడు తన వాక్కును, తాన్ మాటలను వాగ్ధానాలను మనకు వినిపిస్తూనే ఉంటాడు. మరి మనము వినగలుగుతున్నామా? దేవుని వాక్కును ఆలకిస్తున్నామా? ఈనాడు యెహెఙ్కేలు దేవుని వాక్కును భుజింపగా అది ఆయన నోటికి తేనె వలే మధురంగా ఉన్నది, నీవు నేను దేవుని వాక్కును, దైవ గ్రంథాన్ని ధ్యానించగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని మనము రోజు వింటూ, చదువుతూ, ధ్యానిస్తూ, పాటిస్తూ ఉంటె నీవును నేను మనందరం కూడా ఆ వాక్యపు రుచిని చూడగలం. వాక్యంతో మన హృదయాలను నింపుకోవాలి. మనందరం వాక్యంతో నింపబడితే మనము కూడా ప్రజలకు దేవుని వాక్యమును బోధించగలం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం హృదయంలో నింపుకోవడానికి ప్రయత్నించుదాం. 

ఈనాటి సువిశేషంలో శిష్యులు యేసు ప్రభువును " పరలోక రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఎవ్వడు?" అని అడుగుతున్నారు. క్రీస్తు ప్రభువు తనను తాను తగ్గించుకొని చిన్న బాలుని వలె మారినవాడే పరలోకరాజ్యములో గొప్పవాడు. ప్రతి ఒక్కరు గొప్ప వారు కావాలని, గొప్పగా జీవించాలని అందరి కంటే ఎక్కువ స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. గొప్ప స్థాయిలో గొప్పవారిగానే ఉండాలని ప్రయత్నిస్తారు. అదే విధంగా ఆ ఆశ శిష్యులలో కూడా ఇప్పుడు కలిగింది. వారు పరలోకములో గొప్ప వారిగా ఉండాలని కోరుకుంటున్నారు. మనము ఈ లోకంలో కాదు పరలోకరాజ్యంలో గొప్పగా ఉండాలి. తనను తాను తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యంలో గొప్పగా పరిగణించబడతాడు. పరలోకరాజ్యంలో గొప్పవాడు ఎవడో దేవుడు తన శిష్యులకు తెలియపరిచారు. మనం ఈ తగ్గింపు జీవితం జీవిస్తున్నామా? లోకంలో మనము చూసినట్లయితే, గర్వం స్వార్ధం ఎక్కువైపోతున్నాయి. ఎవరు తనను తాను తగ్గించుకోలేక పోతున్నారు. గొప్పలు చెప్పుకోవడం, ఇతరులను చిన్న చూపుచూడటం ఎక్కువైపోతోంది. ఏ బంధమైన నిలబడాలంటే, కలకాలం సంతోషంగా ఉండాలంటే ఉండవలసిన ఓకె ఒక గుణం తగ్గింపు గుణం. ఎవ్వరు తగ్గించుకోగలుగుతారు అంటే తనను తాను అర్ధం చేసుకుంటారో వారే! కొన్ని సార్లుమన తగ్గింపు జీవితం మనలో ఉన్న గర్వాన్ని తగ్గిస్తుంది. మన తగ్గింపు మనస్తత్వం మనలను గొప్పవారిగా చేస్తుంది.త్రోవ తప్పిన గొర్రె ఉపమానములో దేవుడు చెప్పిన గొప్ప సందేశం ఏమిటంటే మనలో చాలా మంది గర్వంతో, స్వార్ధంతో, అజ్ఞానముతో దేవునికి దూరమై పోతున్నాము. మరి ఇది దేవుని చిత్తముకాదు. దేవుడు ఒక గొప్ప కాపరిగా తనను తాను తగ్గించుకొని త్రోవ తప్పిన మనకొరకు వెదుకుతూ వచ్చి మనలను రక్షించాడు. కాబట్టి ప్రియ మిత్రులారా మనం మంచి మార్గంలో దేవుణ్ణి అనుసరిస్తున్నామా లేదా త్రోవ తప్పిన గొర్రెవలె ఉన్నామా! ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రతినిత్యం తగ్గింపు మనస్సుతో దేవుని త్రోవలో క్రీస్తు వలె తగ్గింపు మనస్సుతో దేవుని వెంబడించడానికి ప్రయత్నించుదాం. 

ప్రార్థన:ప్రభువైన దేవా నీ వాక్కుతో మమ్ము పోషించు నీవు మానవుడు రొట్టెవలనే కాక దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని అన్నావు కదా ప్రభూ. నీ వాక్కును భుజించి, ధ్యానించి, సత్య త్రోవలో నీ సత్యపు వెలుగులో నడచి నిన్ను చేరి, నన్ను నేను తగ్గించుకొని జీవించే భాగ్యాన్ని మాకు దయ చేయండి. ఆమెన్  

ఫా. సురేష్ కొలకలూరి OCD


యెహెఙ్కేలు 1:2-5, 24-25 మత్తయి 17:22-27

 యెహెఙ్కేలు 1:2-5, 24-25 మత్తయి 17:22-27

పిమ్మట వారు గలిలీయలో తిరుగుచుండగ యేసు "మనుష్య కుమారుడు శత్రువులకు అప్పగింపబడ బోవుచున్నాడు. వారు ఆయనను చంపుదురు. కాని, మూడవ దినమున లేపబడును" అని వారితో చెప్పగా వారు మిక్కిలి దుఃఖించిరి. అంతట వారు కఫర్నాము చేరినప్పుడు దేవాలయపు పన్ను వసూలు చేయువారు పేతురు దగ్గరకు వచ్చి, "మీ గురువు పన్ను చెల్లింపడా? అని ప్రశ్నింపగ, "చెల్లించును" అని పేతురు ప్రత్యుత్తర మిచ్చెను. అతడింటికి వచ్చిన వెంటనే యేసు "సీమోను! నీ కేమి తోచుచున్నది? భూలోకమందలి రాజులు ఎవరి నుండి పన్ను వసూలు చేయుచున్నారు? తమ పుత్రుల నుండియా? ఇతరుల నుండియా?" అని ప్రశ్నించెను. పేతురు అందుకు "ఇతరుల నుండియే" అని ప్రత్యుత్తర మిచ్చెను. "అయితే పుత్రులు దీనికి బద్దులుకారు గదా! వారు మనలను అన్యధా భావింప కుండుటకై నీవు సముద్రమునకు వెళ్లి గాలము వేయుము. మొదట పడిన చేప నోటిని తెరచినపుడు అందొక నాణెమును చూతువు. దానిని మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లింపుము" అని యేసు సీమోనును ఆదేశించెను. 

ప్రియ విశ్వాసులారా! ఈనాడు మొదటి పఠనంలో యావే దేవుడు బూసి కుమారుడైన యహేఙ్కేలు అనే యాజకునికి ప్రభుని వాణి ప్రత్యక్షమయ్యెను. ప్రభుని హస్తము అతని మీదికి వచ్చెను. ప్రియ మిత్రులారా యహేఙ్కేలుకు దేవుడు తన సింహాసనం గూర్చి గొప్ప దర్శనము ఇస్తున్నాడు. అదేవిధంగా యెహెఙ్కేలు దేవుని దూతలను, ప్రభుని యొక్క సింహాసనము, సింహాసనము పై కూర్చొని ఉన్నా దేవుణ్ణి చూసి, ప్రభుని యొక్క తేజస్సు అతని చుట్టూ ఉన్న కాంతి మిరుమిట్లు గొలుపుతుండగా, నేలపై బోరగిలబడగానే ప్రభుని స్వరమును ఆయన విన్నాడు. ప్రియ మిత్రులారా దేవుడు ప్రతి నిత్యం తనను ప్రేమించి, సేవించి తనను తెలుసుకోవాలి అని ఎదురు చూసేవారికి తన దర్శనాన్ని ఇస్తుంటాడు. మరి మన జీవితంలో ఎంత మంది దేవుని దర్శనం పొందుకుంటున్నాం. ఎంత మంది దేవుని దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం. ఎప్పుడైతే మనము ఆయన స్వరాన్ని వింటామో అప్పుడు దర్శనాన్ని ఇస్తాడు. అంతేకాదు ప్రతి దివ్య బలి  పూజలో దేవుడు తన దివ్య దర్శనాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు, దీనిని మనము గ్రహించగలుగుతున్నామా! ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు తన శిష్యులకు తన మరణ పునరుత్తనాల గురించి చెప్పడం విని శిష్యులు మిక్కిలి  దుఃఖించుచున్నారు. స్నేహితులారా క్రీస్తు ప్రభుని మరణ పునరుత్తనాల ద్వారా మనము రక్షణము పొందియున్నాము. మన కోసం మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు మన క్రీస్తు ప్రభువు. ఆనాడు చాలా మంది పెద్దలు ప్రధానర్చకులు, పరిసయ్యులు క్రీస్తు ప్రభువుని దేవుని కుమారునిగా గుర్తించలేక  చీకటిలో, పాపములో జీవిస్తుండేవారు. అందుకనే క్రీస్తుని  పట్టుకొని, హింసించి అతి క్రూరంగా చంపిన, దేవుడు మాత్రం వారిని క్షమించాడు. రెండవది ఏమిటంటే వారు క్రీస్తు ప్రభువుని దగ్గరకు వచ్చి అడగకుండా ఆయన శిష్యులతో అంటున్నారు. మీ గురువు దేవాలయపు పన్ను చెల్లింపడా ? అని, అంటే వారు యేసు ప్రభువుని దేవుని కుమారుడు అని గుర్తించలేక పోయారు.  కాని క్రీస్తు ప్రభువు ఎంతో బాధ్యతతో పేతురుతో ఇట్లు అంటున్నాడు. నీవు సముద్రమునకు వెళ్లి గాలము వేయుము. మొదట పడిన చేప నోటిని తెరవగానే నీకొక నాణెము కనిపిస్తుంది. దానిని మన ఇద్దరికొరకు సుంకముగా చెల్లింపుము. 

ప్రియా విశ్వాసులారా ఈనాడు మనలో ఎంత మంది దేవుని దర్శనాన్ని పొందగలుగుతున్నాం? మనలో ఎంతమంది క్రీస్తు ప్రభుని దేవుని కుమారునిగా గుర్తించగలుగుతున్నాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ప్రార్ధన : దేవా మా జీవితాలలో మేము కూడా నీ దర్శనాన్ని పొందే భాగ్యాన్ని ఇచ్చే దేవుడవు. ప్రభువా ! నీ మరణ పునరుత్తనాల ద్వారా నీవిచ్చిన రక్షణను మేము ప్రతినిత్యం గుర్తించుకుంటూ మేము నిన్ను ప్రేమించి, సేవించి నీ పరలోక దర్శనం పొందే భాగ్యము  మాకు దయచేయండి. ఆమెన్ . 

ఫా. సురేష్ కొలకలూరి OCD

19వ సామాన్య ఆదివారం

 19వ సామాన్య ఆదివారం 

రాజుల మొదటి గ్రంథం 19:4-8, ఎఫెసీ 4:30-52 యోహాను 6:41-51

ప్రియ విశ్వాసులారా ఈనాటి మొదటి పఠనంలో ఏలియా ప్రవక్త గురించి   వింటున్నాము. ఏలీయా ప్రవక్త బాలు ప్రవక్తలందరిని చంపినా తరువాత యేసెబేలు రాణి ఏలియాతో నేను నిన్ను చంపిస్తాను అని చెప్పగానే ఆయన దేవుణ్ణి కలుసుకొవడానికీ, తన ప్రయాణము ప్రారంభించి మార్గంలో  దేవునితో  ప్రభూ ఈ బాధ ఇక చాలు! నా ప్రాణమును తీసుకొనుము  అని మోర పెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు ఏలియాను ఆదరించి, ఆకలిని తీర్చిన తరువాత , ఆ శక్తితో  తన ప్రయాణం  నలువది రోజులు నడిచి దేవుని కొండయైన హోరేబు చేరుకున్నాడు. 

ప్రియా విశ్వాసులారా దేవుని వాక్కు ప్రజలకు అందించి ఆత్మబలంతో ఎన్నో గొప్ప కార్యాలు చేసి రోషంతో దేవుని కొరకు జీవించి యావే దేవుడే నిజమైన దేవుడని నిరూపించి, ఎంతో మంది బాలు ప్రవక్తలను చంపి కార్మెల్ కొండపై దేవుని ఘనతను చాటించిన ఏలీయా ప్రవక్త, యేసెబేలు రాణి చంపిస్తుందేమో అని భయపడ్డాడు. మన జీవితాల్లో కూడా మనం ఎన్నో గొప్ప కార్యాలను దేవుడిచ్చే శక్తితో చేస్తూ ఉంటాం. కాని ఎలియా వలె మనం కూడా ఏమైనా కష్టాలు, బాధలు వచ్చినప్పుడు, ప్రభూ  ఇక చాలు నా ప్రాణమును తీసుకొనుము అని అంటూవుంటాం. ప్రియ విశ్వాసులారా మనము దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు నిలబడితే దేవుడు ఎల్లా వేళల మన పక్షమున ఖచ్చితముగా ఉంటూ, మనలను ఆదరిస్తూ, మన ఆకలిని తీర్చుతాడు. మనలను నడిపిస్తుంటాడు. మరి ఈ గొప్ప ప్రేమను దేవుని నడిపింపును అర్ధం చేసుకొనగలుగుతున్నామా లేదా ఆలోచించండి. 

రెండవ పఠనములో వింటున్నాం. మనము దేవుని ప్రియమైన బిడ్డలం కనుక దేవుని పోలి జీవించాలి అని వాక్యంలో స్పష్టంగా చెబుతున్నారు దేవుడు. అదేవిధంగా క్రీస్తు ప్రభువు మనలను ప్రేమించి మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. కాబట్టి క్రీస్తు వలె మనం ప్రేమతో నడుచుకోవాలి అని వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా మన జీవితంలో ఏమి ఉండాలి ఏమి ఉండకూడదు అని తెలియజేస్తుంది. వైరము, మోహము, క్రోధము అనే వాటిని వదలి పెట్టాలి అరుపులుగాని,  అవమానముగాని  ఏ విధమైన ద్వేషభావముగాని,  అసలు మనలో మన కుటుంబాలలోగాని మన మనసులలోగాని ఉండకూడదు. కాని ప్రియా మిత్రులారా ఈలోక  జీవితంలో ప్రేమకు బదులుగా గొడవలు, ప్రతి విషయానికి అరుపులు, కేకలు, అల్లరులు అవమానాలు ఎక్కువై పోతున్నాయి. వీటన్నిటికీ కారణం స్వార్ధం, గర్వం, అసూయ, ఓర్వలేని తనం, అందుకే వాక్యం సెలవిస్తుంది. ఏ విధమైన ద్వేషభావమైన మనలో అసలు ఉండకూడదు.   ఈ లోకంలో స్వార్ధం, నటన, మోసం ఎక్కువగానే కనపడుతుంది, ఈ లోకంలో ఎక్కడ చూసిన స్వార్ధ బుద్దితో ఉన్నవారే ఎక్కువ ఉన్నారు. అన్ని నాకే, అంత నాకే, అన్ని నేనే అనే స్వార్ధం అదేవిధంగా నటన అన్నిటిలో,, అన్ని రంగాలలో అన్ని విధులలో ఎంతో మంది నటిస్తూ నటన జీవితం జీవిస్తున్నారు. అదేవిధంగా ఎక్కువమంది  ప్రజలు ఇతరులను  అవమానిస్తున్నారు, లేదా అవమానింపబడుతున్నారు. 

ప్రియమిత్రులారా ఆలోచించండి మనం ఏవరిని అవమానించకూడదు. ఎవరిని ద్వేషించకూడదు.  క్రీస్తుని బిడ్డలుగా, యేసు క్రీస్తుని విశ్వాసులుగా మనము ఎలా ఉండాలి అంటే పరస్పరము దయను, మృదుత్వమును మరియు క్షమాగుణమును కలిగి ఉండాలి. మన పరలోకపు తండ్రి దయామయుడు. మృదుత్వంకలిగి క్షమించి ప్రేమించే ప్రేమ మయుడు. కాబట్టి మనము పరస్పరం ప్రేమ కలిగి ఉండటానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించుదాం. 

సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు అంటున్నారు. "పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారము నేనే. అది విని  యూదులు గొణగసాగారు. ఈ యూదులు క్రీస్తు ప్రభువును తృణీకరించారు. క్రీస్తును కేవలం ఒక మానవునిగా మాత్రమే వారు చూస్తున్నారు. కాని దేవుని కుమారుడుగా అంగీకరించలేకపోతున్నారు. ఆయనపై నిందలు వేస్తూ వ్యతిరేకిస్తున్నారు. ఆయనను గురించి ప్రశ్నించుకుంటూ గొణుగుతున్నారు. ప్రియ విశ్వాసులారా మనలో చాలామంది యూదుల వలె అపనమ్మకంతో క్రీస్తుని నిజ దేవుడు కాదని అనుమానిస్తుంటాము. కొన్ని సార్లు మనము కూడా గొణుగుకుంటూ దేవుణ్ణి పరీక్షిస్తుంటాం. దేవునిపై మనము కూడా నిందలు వేస్తూ వ్యతిరేకిస్తుంటాము.   

ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము ఎలా ఉన్నాము అందుకే క్రీస్తు ప్రభువు అంటున్నాడు. తనను పంపిన  తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు. మిత్రులారా మనము దేని ద్వారా లేక ఎవరి ద్వారా ఆకర్షింప బడుతున్నాము, ఆలోచించండి. అనేక విధాలుగా మనము ఆకర్షింపబడుతున్నాం. మరి మనము దేవుని ద్వారా ఆకర్షింపబడుతున్నామా! దేవుని వాక్యానికి ఆకర్షింపబడుతున్నామా! ఆలోచించండి. అదేవిధంగా క్రీస్తు ప్రభువు నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందును అని అంటున్నాడు. మనము నిత్య జీవం పొందాలంటే ఏమి చేయాలి అంటే ఆయనను విశ్వసించాలి. ఒక గొప్ప విశ్వాసిగా విశ్వాస జీవితం జీవించాలి. అదే విధంగా క్రీస్తు ప్రభువు అంటున్నాడు ఈలోకము అనగా మనం జీవించుటకు ఆయన ఇచ్చు ఆహారము తన దేహము. అంటే ఎవరైనా క్రీస్తు శరీర రక్తాలను, దివ్యసత్ప్రసాదమును విశ్వాసంతో  స్వీకరిస్తారో, వారు నిరతము జీవిస్తారు. మరి మనము నిజమైం విశ్వాసంతో క్రీస్తుని శరీర రక్తాలను స్వీకరిస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ప్రార్ధన: జీవము గల దేవా, మాకు నీ జీవమును నీ శక్తిని ఇచ్చి నడిపింపుము. ఆనాడు ఏలియా ప్రవక్తను పోషించి, బలపరచి, నడిపించినావు. మమ్ము కూడా అదే విధముగా నడిపించుము. మేము మాలోని చేడు గుణములు విడనాడి నిన్ను పోలి నీ బిడ్డలుగా జీవించే అనుగ్రహం మాకు దయచేయుము. అదేవిధంగా మీ విశ్వాసులుగా పరస్పరం దయను,మృదుత్వమును మరియు క్షమించే గుణములను కలిగి జీవిస్తూ, పరలోకం నుండి దిగివచ్చిన జీవముగల ఆహారం  నీవే అని గుర్తించి, విశ్వసించి, నీ శరీర రక్తాలను విశ్వాసంతో స్వీకరించి నిత్య జీవం పొందే భాగ్యం దయచేయండి. ఆమెన్. 

ఫా. సురేష్ కొలకలూరి OCD

18వ సామాన్య ఆదివారం

 18వ సామాన్య ఆదివారం 

నిర్గమ 16:2-4,12-15, ఎఫేసీ 4:17,20-24, యోహాను 6:24-35

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు మానవుల కొరకై ఏర్పరచినటువంటి పరలోక విందు గురించి తెలుపుచున్నవి.
ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎడారిలో మన్నాను, పూరేడు పిట్టలను ఇచ్చిన విధానము చదువుకుంటున్నాం. ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాత భూమికి ప్రయాణమైనప్పుడు ఎడారిలో ఆకలిగొనిన సందర్భంలో వారు మోషే ప్రవక్తకు విరుద్ధముగా దేవునికి విరుద్ధముగా నడుచుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఆకలి బాధకు తట్టుకోలేక ఐగుప్తులో వారు భుజించిన మాంసాహార భోజనాన్ని మరియు రొట్టెలను తలచుకొని అచటనే ఉండి దేవుని చేతిలో చనిపోయిన బాగుండేది అని గొణగసాగిరి. అందుకుగాను దేవుడు వారికి స్వయముగా పరలోక దూతలు భుజించే భోజనము ఒసగి ఉన్నారు. ఈ యొక్క మొదటి పఠణంలో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు.
1. ఎడారిలో మన్నా అనేది ఒక విశ్వాస పరీక్ష ఎందుకనగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కావలసినది మొత్తం కూడా ఒక్కసారి సమర్పించవచ్చు కానీ అలాగా చేయలేదు. ఏనాటికి మన్నా ఆనాటికే ప్రభువు ఇచ్చారు అనగా వారు దేవుడి మీద ఆధారపడుతూ దేవుడి యందు విశ్వాసము కలిగి జీవించాలి అనే ఉద్దేశ్యం కొరకు. అదేవిధంగా ఎవరికి ఎంత కావాలో అంతే దేవుడు ఉండేలాగా చేస్తున్నారు
2. దేవుని యొక్క ఉదార స్వభావము. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరుద్ధముగా మాట్లాడినప్పటికీ ప్రభువు వారి యొక్క మాటలను పట్టించుకోకుండా ఇంకా సమయం వేచి ఉండకుండా వెంటనే సహాయము చేస్తూ వారి యొక్క ఆకలిని సంతృప్తి పరుస్తున్నారు. ఎదుటివారు చేసిన తప్పిదమును గుర్తించకుండా వారి యొక్క ఆకలిని తీర్చుట చాలా గొప్పది.
3. ఫిర్యాదు చేయటం. ఇది సర్వసాధారణంగా చాలామంది యొక్క జీవితంలో చూస్తూ ఉంటా. ఇశ్రాయేలు ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు, మార్తమ్మ మరియమ్మ మీద ఫిర్యాదు చేస్తున్నారు అలాగే యోహాను శిష్యులు యేసు ప్రభువు యొక్క శిష్యులు ఉపవాసము ఉండటం లేదని ఫిర్యాదు చేస్తున్నారు ఈ విధంగా చాలామంది దేవునికి ఫిర్యాదు చేస్తూనే ఉంటారు కానీ అది మంచిదా లేక చెడా అని కొంతమంది మాత్రమే గ్రహిస్తారు. మన జీవితంలో ఏదైనా కొరతగా అనిపిస్తే వెంటనే మనము దేవునికి ఫిర్యాదు చేయటానికి ముందుంటాం కానీ ఆయనను అర్థం చేసుకునటానికి ప్రయత్నం చేయము.
4. ఇశ్రాయేలీయుల యొక్క అప నమ్మకం. దేవుడు వారిని ఎర్ర సముద్రం గుండా కాపాడిన విషయం మరచితిరి, ఫరో సైన్యమును నాశనము చేసిన విధానం మరిచితిరి అలాగే దేవుడు వారిని ఆదుకుంటారు అనే విషయంలో కూడా మరచి జీవించారు అందుకే ప్రభువు వారి విశ్వాసాన్ని ఇంకా బలపరచడానికి ఆకాశము నుండి అద్భుత రీతిగా ఈ యొక్క పరలోక భోజనమును ప్రసాదిస్తున్నారు.
5. దేవుడు మనలను పోషిస్తాడు అనే నమ్మకం లేక ఇశ్రాయేలు ప్రజల వలె మనం కూడా ఆకలి దప్పులతో ఉన్నప్పుడు, కష్ట సమయంలో ఉన్నప్పుడు గొణుగుతూ అపనమ్మకంతో జీవిస్తుంటాం. ఈ యొక్క శారీరక సంబంధమైన ఆకలి దప్పులను గురించే ఆలోచిస్తుంటాము గాని దేవుని వైపు మన యొక్క దృష్టి మరల్చి ఆయనపై నమ్మకంతో మన కష్టాలను ఆయన చేతులలో ఉంచడానికి వెనుకంజ వేస్తాం. మన యొక్క భౌతిక భోజనమునకు ఆరాటపడతాం కానీ ఆధ్యాత్మిక భోజనం గురించి చింతించం మన గమ్యాన్ని మరచిపోయి భౌతిక చింతలకే ప్రాధాన్యతనిస్తాం.
  ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు పాత స్వభావమును విడిచి కొత్త స్వభావమును కలిగి జీవించమని తెలుపుచున్నారు. మన యొక్క పాత స్వభావమును విడిచి పెట్టకపోతే మనలో నూతనత్వము ఉండదు.  గోధుమ గింజ భూమిలో పడి నశించకపోతే అది అట్లే ఉండును కానీ నశించిన దానియందు ఒక కొత్త జీవము ఉద్భవించును అలాగే మనలో పాపము ఉన్నంత కాలము మనము క్రీస్తునకు జన్మించలేం మన యొక్క పాపమునకు మరణించిన సందర్భంలో క్రీస్తు ప్రభువు మనకు జన్మించిన వారముగా ఉంటాము. దివ్య సత్ప్రసాద స్వీకరణ ద్వారా క్రీస్తు ప్రభువు మనలోనికి వేంచేసి మన యొక్క జీవితములను నూతన పరచున్నారు. పునీత పౌలు గారు తన యొక్క పాత స్వభావమును విడిచిపెట్టి క్రీస్తు ప్రభువును వెంబడించారు.
ఈనాటి సువిషేశ పఠణంలో ఏసుప్రభు 'నేనే జీవాహారము' అని పలుకుచున్నారు. ఏసుప్రభు 5000 మందికి ఆహారమును వసగిన తర్వాత ఆయన కఫర్నామునకు వెళ్ళినప్పుడు చాలా మంది ప్రజలు ప్రభువును వెంబడించారు ఆ సందర్భంలో అడిగినా ప్రశ్న" ప్రభువా, మీరు ఎప్పుడూ ఇక్కడికి వచ్చితిరి? " ఈ ప్రశ్న వారు ఏసుప్రభు యొక్క బోధనలు వినటానికి అడగలేదు కేవలము వారు పోషింపబడ్డారు కాబట్టి ఏసుప్రభు దగ్గరికి వస్తే మరల వారి యొక్క శారీరక ఆకలి తీరిపోతుంది అనే ఉద్దేశంతో ప్రభువుని ప్రశ్న అడిగారు దానికి గాను ప్రభువు శాశ్వతమైన భోజనము కొరకు శ్రమింపుడు పలికారు. 
ప్రజలు తమ యొక్క పొట్టలను నింపిన రొట్టెలను గురించి  ఆలోచిస్తున్నారు కానీ ఆ పొట్టల నింపినటువంటి దేవుడిని మాత్రము తలంచలేదు. రొట్టెలను రొట్టెలగానే స్వీకరించారు కానీ అవి దేవుని యొక్క వరము అని విశ్వసించలేకపోయారు.
ఏసుప్రభు తానే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము అని తెలుపుచూ ఈ యొక్క ఆహారమును భుజించిన అతడు ఎన్నటికీ ఆకలిగొనడు అని ప్రభువు తెలుపుచున్నారు. మన యొక్క అనుదిన జీవితంలో కూడా దేవుడు మన కొరకై ప్రసాదించిన దివ్య సత్ప్రసాదం మనము ఎప్పుడు స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల పాటు ఈ యొక్క మన్నాను భుజించి వాగ్దాత భూమికి చేరుకున్నారు. మనము కూడా ఏసుప్రభు మన కొరకై వసగిన తన యొక్క దివ్య శరీర రక్తములను భుజించి మన జీవితములను మార్చుకొని పరలోక రాజ్యములో ప్రవేశించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దివ్యసప్రసాదము పట్ల ప్రేమను గౌరవమును అలవర్చుకొని జీవించాలి.
Fr. Bala Yesu OCD

18 వ ఆదివారం

 

18 వ ఆదివారం 

నిర్గమ ఖాండం 16:2-4,12-15 ఎఫెసి 4:17,20-24  యోహాను 6: 24-35

అక్కడ యేసుగాని , శిష్యులు గాని లేకుండుటచూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫ ర్నామునకు పోయిరి.  ప్రజలు సరస్సు  ఆవలివైపున యేసును కనుగొని  "బోధకుడా!  మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి?" అని అడిగిరి. "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు అని  మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత  భోజనమునకై శ్రమింపుడు. మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన  తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు  ముద్రను వేసియున్నాడు"  అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు "దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలయును?" అని వారడుగగా, యేసు "దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు. అదియే దేవుడు మీ నుండి కోరునది"  అని చెప్పెను. అంతట "నిన్ను   విశ్వసించుటకు మాకు ఎట్టిగురుతు నిచ్చెదవు? ఏ క్రియలు చేసెదవు?" అని వారు మరల ప్రశ్నించిరి. "వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను. అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను" అని వారు ఆయనతో చెప్పిరి. "పరలోకమునుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషేకాదు. కాని, నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకమునుండి దిగివచ్చి, లోకమునకు జీవమును ఒసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను"  అని యేసు వారితో అనెను. "అయ్యా ! ఎల్లప్పుడును ఆ ఆహారమును మాకు ఒసగుము" అని వారు అడిగిరి. అందుకు యేసు "నేనే జీవాహారమును, నాయొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు. నన్ను విశ్వసించువాడు  ఎన్నడును దప్పికగొనడు" 

ఈనాడు దేవుడు మనకు ఇచ్చే సందేశం. 

మొదటి పఠనం : దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరీక్షిస్తున్నాడు. 

రెండవ పఠనంలో మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొని క్రీస్తునందు నూతన  జీవితాన్ని ప్రారంభించండి. 

సువిశేష పఠనం: దేవుడు తనను వెదుకుతూ వచ్చిన ప్రజలకు అశాశ్వతమైన  భోజనముకై శ్రమింపుడు అంటు నేనే జీవము గల ఆహారాన్ని అని  తెలియజేశాడు. 

ప్రియా విశ్వాసులారా మొదటి పఠనములో ఇశ్రాయేలు ప్రజలు మోషే మరియు అహరోనులు మీద నేరము మోపుతున్నారు. ఎందుకు అంటే వారు మోషేతో మేము ఐగుప్తులో చచ్చిన బాగుండేది. అక్కడ మేము మాంసమును , రొట్టెను కడుపారా భుజించితిమి. ఇప్పుడు మేమందరం ఈ ఎడారిలో ఆకలితో మలమల మాడి చంపబడడానికి మీరిద్దరు మమ్ము ఇక్కడకు తీసుకొని వచ్చారా అని దూషించారు. యిస్రాయేలు ప్రజలు, శరీరానికి దాని అవసరాలకు లొంగిపోయి, వారు పొందిన స్వతంత్రాన్ని, బానిసత్వము నుండి  రక్షణను, విడుదలను మర్చిపోయిదైవసేవకులను  దూషించారు. కాని  దేవుడైన యావే నిర్గమ  16:4లో వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై వారిని  ఈ విధంగా పరీక్షింతును అని అంటున్నాడు. ప్రభువు ప్రేమతో వారికి ఆకాశము నుండి మన్నాను మరియు వారు కడుపునిండా భుజించడానికి పూరేడు పిట్టలను దయచేసి, యావేనైన నేను మీ దేవుడనని తెలియజేశాడు. 

దేవునికి అంత తెలుసు. మనకు ఏమికావలెనో,ఎప్పుడు కావలెనో ఏమి ఇవ్వాలో తెలుసు. కాబట్టి  దేవుడు మనలను  పరీక్షిస్తున్నాడని మనకు అనిపిస్తే మనము దేవుని ధర్మములను అంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తే చాలు. అంత దేవుడే ఇస్తాడు. కాబట్టి పరీక్షింపబడినప్పుడు గొణుకుతూ, సణుగుతూ , ఎదురు తిరుగుతూ నేరం మోపుతూ కాకుండా దేవుని చిత్తానుసారం,  ఆజ్ఞానుసారం నడుచుకుందాం. 

సువిశేషంలో ప్రజలు క్రీస్తు ప్రభువును వెదుకుతూ వచ్చినప్పుడు, ప్రజలు ఎందుకు వచ్చారో వారి మనస్సులోని ఆలోచనలను తెలుసుకోని, మీరు రొట్టెను తిని సంతృప్తులైనందున నన్ను వెదుకుచున్నారు.  కాని నా సూచక క్రియలను చూసి కాదు అని ప్రజలకు చెప్పియున్నాడు. దీని ద్వారా మనము ఏమి తెలుసుకోవాలంటే, దేవునికి  మనము ఏమి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, మన మనస్సులోని ఆలోచనలు, ఆశలు ఏంటో తెలుసు. దేవుడు   మన ఉద్దేశాలు  ఎలాంటివి, మంచివా?  కాదా? అని ఖచ్చితంగా చెప్పగలడు. 

ఈనాడు ఎంతో  మంది ప్రజలు తమ స్వలాభాల కోసం, స్వష్టతల కోసం  దేవుని  వెదుకుచు వస్తున్నారు, కాని  నిజంగా దేవుణ్ణి నమ్మి రావడంలేదు. దేవునికి తెలుసు .  దేవుని దగ్గర నుండి అది కావాలి, ఇది కావాలి అని అడుగుతున్నారు. దేవా! నాకు నీవు కావాలి అని   ఎంత మంది అడుగుతున్నారు? వరాలు కావాలి, దీవెనలు కావాలి అని దేవుని దగ్గరకు వెళ్లేవారు చాలా మంది ఉన్నారు.  కాని ఆ వారలను దీవెనలను ఇచ్చే వార ప్రధాతను నాకు నీవు కావాలి అని ఎంత మంది అడుగుతున్నాం. 

క్రీస్తు ప్రభువు అంటున్నాడు, అశాశ్వతమైం దానికై శ్రమింపవలదు. మిత్రులారారా !  ఈనాటి సమాజంలో ఎంతో మంది అశాశ్వతమైన ఈలోక  వస్తువులు, ఈలోక,  వ్యామోహం ఈలోక  సంపదల కోసం శ్రమిస్తున్నారు. ఈ లోకం శాశ్వతంకాదు. మనము ఎల్లకాలం ఈలోకంలో ఉండము. ఈ అశాశ్వ తమైన వాటి కొరకు మనం పడే శ్రమ వృధా! కాని  క్రీస్తు ప్రభువు చెబుతున్నాడు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత  భోజనముకై శ్రమింపుడు అని అంటున్నాడు. మనము ఏ రకమైన  పనులు చేయాలి ఈ నిత్య జీవమును పొందాలంటే యోహాను 6: 35 వచనములో చెబుతున్నాడు. "నేనే జీవాహారమును, నాయొద్దకు వచ్చువాడు ఎప్పటికి ఆకలిగొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు. దీని అర్ధం ఏమిటంటే మనము దేవుని యొద్దకు రావాలి, దేవుని విశ్వసించాలి. అపుడు మనకు జీవం లభిస్తుంది. 

రెండవ పఠనంలో: మనము వింటున్నాం మన పాత స్వభావమును విడిచి, మీ మనస్తత్వమును నుత్నికరించుకొనుడు. అన్యుల వలె  ఆలోచనలు గలవారిగా మీరు ప్రవర్తించకండి. మీరు సత్యమైన నీతిని మరియు పరిశుద్దతను కలిగి క్రొత్త స్వభావమును ధరింపుము. దేవుని పోలికలా  జీవించండి అని పౌలుగారు తెలుయజేస్తున్నారు. మొదటి పఠనములో యిస్రాయేలు ప్రజలు తమ పాత స్వభావమును మార్చుకోవాలి. వారు దేవుని విధులను పాటించాలని సువిశేషంలో జనులు శాశ్వతమైన వాటికొరకు శ్రమించాలని చెబుతూ మనము నీతితో పరిశుద్ధతతో క్రొత్త స్వభావమును ధరించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. 

ప్రార్ధన: పరిశుద్దుడైన తండ్రి మా జీవితాలు  పరీక్షలకు గురైనప్పుడు మాకు ఓర్పును, శనమును దయచేయండి. మీ గొప్ప కార్యాలు మాయందు జరిగింపుము/ మేము మీ యొద్దకు వచ్చుటకు, మిమ్ము విశ్వసించుటకు జీవం పొందుటకు కావలసిన నీతిని పరిశుద్దతను మాకు దయచేయండి, మా పాట పాపపు  స్వభావమును మార్చుకొని నీ పోలిక  క్రొత్త స్వభావమును మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. 

ఫా. సురేష్ కొలకలూరి OCD

మత్తయి 16:24-28

 మత్తయి 16:24-28  

"నన్ను అనుసరింపగోరువాడు తననుతాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడు కొనచూచు వాడు దానిని పోగొట్టుకొనును. నా  నిమిత్తమై తన ప్రాణమును ధారపోయువాడు, దానిని దక్కించు కొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఈయగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతియొక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచునంతవరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను" అని యేసు పలికెను. 

క్రిస్తునాధుని యందు ప్రియ స్నేహితులారా ఈనాడు కార్మెల్ సభకు ఎంతో  పర్వదినం. కార్మెల్ సభ సభ్యులు ఎంతో సంతోషంగా పునీత ఎడిత్ స్టెయిన్ గారి పండుగను జరుపుకుంటారు.

ఆమె జీవితం: పునీత  ఎడిత్ స్టెయిన్ గారు అక్టోబర్ 12 వ తేదీన 1891వ సంవత్సరంలో జన్మించారు. చిన్న వయస్సు నుండి ఎంతో జ్ఞానము కలిగిన వ్యక్తి.  ఆమె హెడ్మాన్డ్ హస్రెల్ అనే గొప్ప తత్వవేత్త శిష్యురాలు. ఆమె కూడా త్తత్వవేత్తగా ప్రసిద్ధి చెందినవారు. 1904వ సంవత్సరంలో తనను తాను  నాస్తికురాలిగా ప్రకటించుకుంది. కాని కాలక్రమేణా ఆమె గొప్ప జ్ఞానము కలిగిన విద్యార్థిగా , మరియు కళాశాల ఆచార్యరాలుగా గొప్ప మేధాసంపద కలిగిన వ్యక్తిగా మారింది. ఆమె 1921లో అవిలాపుర  తెరాసమ్మ గారి జీవిత కథను,  ఆత్మకథ పుస్తకం చూసి రాత్రికి రాత్రే ఆ పుస్తకాన్ని చదివి, ఆమె సత్యాన్ని కనుగొన్నది. ఆమె సత్యం కోసం అన్వేషిస్తుంది.  తెరెసామ్మ గారి ఆత్మకథ ద్వారా క్రీస్తు ప్రభువు సత్యం అని కనుకొన్నది. ఆమె కార్మెల్ సభకు ఎంతో ఆకర్షితురాలైంది. 1982లో యూదా మతం నుండి  కాథోలికురాలిగా మారింది. తదనంతరం ఆమె 1933లో కొలోన్లోని కార్మెల్ మఠంలో చేరింది. కార్మెల్ మఠంలో సిలువ తెరెసా బెనెడిక్తగా పేరును స్వీకరించింది. ఈ పేరుకు అర్ధం తెరెసా సిలువ ద్వారా ఆకర్షించబడింది అని అర్ధం. ఎడిత్ స్టెయిన్ గారు తన గొప్ప రచనల ద్వారా ఎన్నోసత్యాలను ప్రజలకు తెలియజేసినటువంటి వ్యక్తి. క్రీస్తు ప్రభువుని  కోసం, క్రీస్తు ప్రభునిపై తనకు ఉన్న ప్రేమకోసం తన విశ్వాసాన్ని వదలక ఎన్నో కష్టాలను బాధలను ఏంతో సంతోషంతో ఎదుర్కొవడానికి, క్రీస్తు కొరకు తన ప్రాణాలను త్యాగం చేసి, సత్యం కొరకు సాక్షిగా నిలబడింది,ఈ గొప్ప పునీతురాలు. ఆమె ఆగస్టు 9, 1942 వ సంవత్సరంలో వేదసాక్క్షి మరణం పొందింది.  

ఈనాటి మొదటి పఠనంలో యూదా ప్రజలకు శుభ వర్తమానమును ఈ విధంగా  వినిపిస్తున్నాడు. దుష్టులు మీపై మరల దాడి చేయరు. వారు  ఆడపొడ కానరాకుండా పోవుదురు. అదేవిధంగా మీకు మునుపు ఉన్న వైభవమును తిరిగి నెలకొల్పుదును. మరి మనము శుభ వర్తమానము వినగలుగుతున్నామా, దేవుడు మనలను రక్షిస్తున్నాడు. మనకు  వైభవమును ఇస్తున్నాడు. దానిని మనము నిలుపుకోగలుగుతున్నామా? ఆలోచించండి. మనము దేవునికి దూరంగా వెళ్లిన  , ఆయనను బాధపెట్టిన,  ఆయన మాత్రం మనలను వదలి పెట్టరు. అదేవిధంగా విశ్వాస పాత్రంగా మనము కూడా జీవించాలి. 

ఈనాడు సువిశేషం  "పునీత ఎడిత్ స్టెయిన్ గారి  జీవితంలో అక్షరాల నెరవేరింది. అదేమిటంటే క్రీస్తు ప్రభువు చెబుతున్నాడు "నన్నుఅనుసరించగోరువాడు తనను తాను పరిత్యజించుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించవలెను." పునీత ఎడిత్ స్టెయిన్ గారు క్రీస్తును తెలుసుకొని తనను తాను పరిత్యజించుకొన్నది. తన జీవితంలో వచ్చే శ్రమలను బాధలను కష్టాలను ఇబ్బందులను మోస్తూ సిలువను  ఎత్తుకొని క్రీస్తు ప్రభువును అనుసరించింది. క్రీస్తు ప్రభువుని అడుగుజాడలలో నడిచి ఆయన సాక్షిగా మారింది. క్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా నా నిమిత్తము ఎవరైతే  తమ ప్రాణాలను ధారా పోస్తారో వారు తమ ప్రాణాలను దక్కించుకొందురు అని అన్న మాటను నెరవేర్చింది. ఈలోకం మొత్తం పంపాదించి తమను కోల్పోతే లాభము ఏమిటి అనే సత్యాన్ని తెలుసుకొని తనను తాను  దేవునికిసమర్పించుకుంది. వారి వారి పనులను బట్టి దేవుడు  ప్రతిఫలాన్ని ఇస్తాడని మనము విన్నాం.  ఆమె చేసిన గొప్ప పని ఏమిటంటే తాను సత్యాన్ని  తెలుసుకొని సత్యస్వరూపుడైన  క్రీస్తుని అనుసరించింది. అంతేకాక క్రీస్తుని కొరకు తన ప్రాణమును దారపోసింది. ప్రభువు చెప్పినట్లుగా ఆమె క్రియలను బట్టి ఆమె విశ్వాసాన్నిబట్టి ఆమె తిరుసభలో ఒక గొప్ప పునీతురాలుగా మారింది. మరి మనము నిజంగా దేవుణ్ణి అనుసరిస్తున్నామా!మనల్ని మనము పరిత్యజించు కొంటున్నామా? మన సిలువలు అనే బాధలు కష్టాలను ఎత్తుకొని క్రీస్తుని వెంబడిస్తున్నామా, ఈ  కాలంలో చాలా మంది క్రీస్తు ప్రభువును అనుసరిస్తున్నారు. కాని తమను తాము ప్రరిత్యాజించుకోలేక పోతున్నారు. కేవలం నామ మాత్రంగా అనుసరిస్తున్నారు. ఆలోచించండి, మనము ఎలా ఉన్నాం? లోక సంపదలతో  మన ఆత్మను కోల్పోతున్నాము. కాబట్టి ప్రియాబిడ్డలారా పునీత ఎడిత్ స్టెయిన్ గారి వలె జీవిస్తూ ఆమె వలె గొప్ప కార్యాలు చేస్తూ క్రీస్తు ప్రభుని నిజమైన అనుచరులుగా జీవించుదాం. 

ప్రార్ధన : ఓ ప్రభువా మీరు మాకు ఎన్నోసార్లు నీతి మార్గంలో నడవమని పిలుపు ఇస్తున్నారు. కొన్ని  సార్లు మమ్ము మేము పరిత్యజించుకోలేక పోతున్నాం. మా సిలువను మోయలేక పోతున్నాం. మా సిలువలు అనే బాధలతో  నిన్ను అనుసరించలేక పోతున్నాం. కాని తండ్రి! భయంతో , దురాలోచనలతో లోక సంపదలతో పడి మా ఆత్మలు కోల్పోతున్నాము. ప్రభువా మంచి క్రియలద్వారా విశ్వాసంతో మిమ్ము అనుసరించి మీ రాజ్యంలో చేరే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

యెహెఙ్కేలు 9: 1-7, 10:18-22 మత్తయి 18:15-20

 యెహెఙ్కేలు 9: 1-7, 10:18-22 మత్తయి 18:15-20

"నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన యెడల నీవు వెళ్లి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ది చెప్పుము. నీ మాటలు అతడాలకించిన యెడల వానిని నీవు సంపాదించుకొనిన వాడవగుదువు. నీ మాటలు అతడు ఆలకింపని యెడల ఒకరిద్దరిని నీ వెంట తీసుకొనిపొమ్ము. ఇట్లు ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడును. వారి మాట కూడ వినని యెడల సంఘమునకు తెలుపుము, ఆ సంఘమును కూడ అతడు లెక్కింపని యెడల, వానిని అవిశ్వాసునిగా, సుంకరిగ పరిగణింపుము. భూలోకమందు మీరు  వేనిని బంధింతురో అవి పరలోక మందు బంధింపబడును. భూలోకమందు  మీరు  వేనిని విప్పుదురో అవి పరలోక మందు విప్పబడునని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి అడిగినను, పరలోక మందుండు నా తండ్రి వారికి దానినొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలన, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను" అనెను. 

క్రిస్తునాధుని యందు ప్రియమైన విశ్వాసులారా ఈనాడు మనము పునీత మాక్సి మిలియాన్ మేరీ కోల్బె గారిని స్మరించుకుంటున్నాము. ఈ పునీతుడు ఎంతో ప్రేమతో, దేవుని సేవ చేసిన గురువు. ప్రతి నిత్యం దైవ ప్రేమను పంచిన పునీతుడు. దేవుని ఆజ్ఞలన్ని దైవ ప్రేమ, సోదర ప్రేమ అనే రెండు ఆజ్ఞల మీద ఆధారపడిఉన్నాయి. దైవ ప్రేమతో నింపబడి, దైవ ప్రేమలో ఎదిగిన వ్యక్తి ఈయన. తన పొరుగువారి కోసం తన ప్రాణమును ధారపోయువాని కంటే గొప్పవాడు ఎవడును లేడు అని క్రీస్తు  ప్రభువు అని చెప్పిన వాక్యాన్ని ధ్యానిస్తూ తన పొరుగు వానిని రక్షించడానికి వేరే వ్యక్తి మరణ శిక్షను తాను తీసుకొని ఆ వ్యక్తి కోసం ప్రాణమును అర్పించిన వ్యక్తి. గొప్ప వేద సాక్షి, దైవ  ప్రేమ మానవ ప్రేమతో నిండిన వ్యక్తి ఈ పునీతుడు. 

ప్రియ విశ్వాసులారా ఈ లోకంలో చాలా మందికి దైవ భయం లేదు, దైవ ప్రేమను కూడా అర్ధం చేసుకోలేక పోతున్నారు. మనము నిజముగా దైవ ప్రేమ కలిగిఉన్నామా? మనకు దైవ భయం ఉన్నదా? ఆలోచించండి. సోదర ప్రేమ ఈ లోకం ప్రజలు తమ తోబుట్టువులనే ప్రేమించలేకపోతున్నారు. అటువంటి మనం ఎలా పొరుగువారికి ప్రేమించగలం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజం చెప్పాలంటే దైవ ప్రేమ నీ నా హృదయంలో లేకపోయినట్లయితే మనకు సోదర ప్రేమ లేనట్టే. మన దేవుడి ప్రేమామయుడు, ప్రేమ నిధి ఆయన బిడ్డలుగా ప్రేమ కలిగి పునీత మాక్సిమిలియన్ గారి వలె జీవించడానికి ప్రయత్నించుదాం. 

ఈనాటి మొదటి పఠనంలో మనము వింటున్నాం. యెరూషలేములో ఉన్న ప్రజల పాపములకుగాను దేవుడు తన దూతలను పంపి వారిని శిక్షిస్తున్నాడు. యెహెఙ్కేలు ప్రవక్త ఈ దర్శనాన్ని చూస్తూన్నాడు. దేవుడు తన దూతను పంపుచు అంటున్నాడు. "నీవు యెరూషలేము నగరమంతట సంచరించి పట్టణమున జరుగుచున్న హేయమైన కార్యములకుగాను సంతాపము చెందు వారి నొసటిపై ముద్ర వేయుము. దూతలారా మీరు నగరంలోని వెళ్లి అందరిని వధింపుడు. ఎవరి మీద జాలి చూపకుడు. ఎవ్వరిని వదలి వేయకుడు అని చెబుతూ తమ నొసటి మీద గురుతు ఉన్న వారిని మాత్రము ముట్టుకోనకుడు అని ఆజ్ఞాపించాడు. 

ప్రియ విశ్వాసులారా ఎందుకు దేవుడు వారిని చంపుతున్నాడు అంటే ఆ ప్రజలు యిస్రాయేలీయులు ఘోరమైన పాపములు చేశారు. వారు ఇతరులకు చెడు చేస్తున్నారు. దేవుడు వారిని శిక్షిస్తున్నాడు. కాని వారి పాపములు ఒప్పుకొని వారి తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపం చెందువారిని దేవుడు రక్షిస్తున్నాడు. దీని ద్వారా మనందరం ఏమి తెలుసుకోవాలంటే అంతిమ దినమున దేవుడు తన దూతలను పంపి మనలను, మన పాపక్రియలకుగాను మన చెడు క్రియలకుగాను మనలను జాలి, దయ లేకుండా శిక్షిస్తాడు. మరి ఆయన దయను పొందాలంటే మనము పాపపు, చేడు జీవితాన్ని విడిచి పెట్టి, పశ్చాత్తాపంతో దేవుని చెంతకు రావాలి. మిత్రులారా ఒకసారి ఆలోచించండి మన జీవితాలు, మన పనులు, మన మాటలు ఎలా ఉన్నాయి. ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుని మన్నింపును కోరుకుందాం. 

ఈనాటి సువిశేష పఠనంలో మనం మన సోదరుని ఎలా సరిదిద్దుకోవాలిఅనే విషయాన్ని మనం వింటున్నాం. నేటి సమాజంలో మనం చుస్తే చాలా మంది చాలా రకాలైన తప్పులను చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే, అవివేకం వాళ్ళ కొంతమంది తప్పులు చేస్తుంటే, కొంత మంది స్వార్ధ బుద్దితో, కొంత మంది స్వలాభాల కోసం, మరి కొంత మంది డబ్బు కోసం, ఆస్తుల కోసం ఎలా ఎన్నోరకాలైన వాటి కోసం తప్పులు చేస్తున్నారు. క్రీస్తు ప్రభువు ఈనాటి సువిశేషంలో  నీ సోదరుడు నీకు విరుద్ధంగా తప్పు చేస్తే నీవు అతని దగ్గరికి వెళ్లి ప్రేమతో మాట్లాడి, తన తప్పును ఆ వ్యక్తికి అర్ధమైయ్యేలా చెప్పు అంటున్నాడు. ఈనాడు ప్రజలు తప్పు చేసిన వ్యక్తితో తప్ప అందరికి చెబుతారు. ఆమె లేదా అతను ఇలా చేసాడు, అలా చేశారు అని చెబుతుంటారు. అలా చెయ్యడం వలన మనం వారికి ఇంకా చెడ్డవారిగా చేస్తుంటాం. ఆలోచించండి. నీవు చెప్పినట్టు వినకపోతే ఇంకో ఇద్దరినీ తీసుకెళ్లి మాట్లాడు అది కూడా వినకపోతే సంఘానికి చెప్పు అప్పటికి వినకపోతే అతన్నీ అవిశ్వాసిగా పరిగణించు  అని ప్రభువు చెబుతున్నారు. వారి కోసం మనము ప్రార్ధించాలి. ఏక మనస్కులై మనమందరం ప్రార్ధిస్తే దేవుడు మన ప్రార్ధనల ద్వారా ఎంతోమంది జీవితాలను మార్చుతాడు. మనమందరం గుర్తుంచుకోవలసినది ఏమిటంటే మన మాటల వల్లకానిది మన ప్రార్థన వల్ల ఖచ్చితముగా జరుగుతుంది కాబట్టి ప్రతినిత్యం ప్రార్ధించి ఆత్మలను రక్షించడానికి ప్రయత్నించుదాం. 

ప్రార్ధన :తండ్రియైన దేవా ఈనాటి వాక్యం ద్వారా సోదర ప్రేమ మరియు దైవ భయం దైవ ప్రేమను కలిగి జీవించాలని మాకు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. దేవా ఎన్నో సార్లు మేము నీ పట్ల భయ భక్తులు లేకుండా మా తప్పిదములతో, పాప స్థితిలో చెడు పనులలో ప్రయాణించాము. కాని ఈ రోజు నీ వాక్యం ద్వారా మా తప్పులు తెలుసుకొని పశ్చాత్తాప పడుతున్నాము. నిన్ను ప్రేమిస్తూ, నా పొరుగువారిని ప్రేమిస్తూ, వారి మంచి కోసం క్షేమం కోసం తపిస్తూ, ప్రార్ధిస్తూ పునీత మాక్సిమిలియన్ కోల్బె వలె జీవించే భాగ్యం మాకు దయచేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

యోహాను 12: 24-26

 యోహాను 12: 24-26    

 నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమన:గోధుమగింజ భూమిలోపడి నశించనంతవరకు అది అట్లే ఉండును. కాని అది నశించినయెడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కాని ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్యజీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరించును. అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించినయెడల వానిని నాతండ్రి గౌరవించును. 

ధ్యానము: ఈరోజు మనము  పునీత లారెన్స్ గారి మహోత్సవమును జరుపుంటున్నాము. ఎవరు పునీత లారెన్స్ గారు అంటే యేసు ప్రభువు వలే జీవించడానికి ఆయన నిజ అనుచరునిగా జీవించిన వ్యక్తి. ఆయన 32 సంవత్సరాల వయసులో మరణించాడు. రోమపుర ఆర్చ్ డికనుగా సేవ చేసాడు. యేసు ప్రభువు మరణించిన రెండువందల సంవత్సరాల తరువాత ఈయన జీవించాడు. ఆనాటి రోజులలో తిరుసభకు స్వతంత్రం లేదు, తిరుసభ మొత్తం  రహస్యంగా దేవుణ్ణి ఆరాధించారు. క్రైస్తవులను అనేక విధాలుగా హింసించారు. ఎంతో గోరంగా హింసించారు అంటే కొంత మందిని మంటలలో కాల్చారు. కొంతమందిని అడవి మృగాలకు  ఆహారంగా ఇచ్చారు. కొంతమందిని నూనెలో కాల్చారు. క్రైస్తవుల మీద హింస వలేరియన్, డైక్లిషియన్లు చక్రవర్తులుగా ఉన్నప్పుడు ఎక్కువగా జరిగింది.  వలేరియన్ చక్రవర్తి  మేత్రానులను , గురువులను, డికనులను చంపాలి అని శాసనము చేసాడు. 258వ సంవత్సరంలో సిక్స్టాస్ పోపుగారిని బంధించారు. ఆది చూచిన  లారెన్స్ పోపుగారి వెంట వెళుతూ నన్ను వదలి ఎలా వెళతారు తండ్రిగారా అని అడిగితే ఆ పోపుగారు లారెన్స్ తో, కుమారా నేను నిన్ను వదలి పెట్టను, నీకు ఎక్కువ హింసలు రాబోతున్నవి.   నీవు ఇంకా ఎక్కువుగా ప్రభువుకు సాక్షమివ్వడానికి వస్తావు అని చెప్పాడు. కనుక లారెన్స్ గారికి వచ్చేటువంటి హింస ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసు.  

లారెన్స్ రోమాపూరి ఆర్చి డికను, రోమా పూరి తిరుసభ   సంపదమొత్తం లారెన్స్ ఆదీనంలో ఉన్నది.  లారెన్స్ ఆ సంపదను పేదలకు పంచుతూ ఉండేవాడు.  అప్పుడు ఆ సంపదను అక్కడి అధికారులు కావాలని అడిగినప్పుడు లారెన్సు వారిని  మూడు రోజులు సమయం అడిగి,  ఆ సమయంలో ఆ సంపదను మొత్తాన్ని పేదలకు పంచి ఇచ్చాడు. తరువాత  రోములో ఉన్న పేదలను మొత్తాన్ని తీసుకొని వచ్చి ఇదే తిరుసభ సంపద అని వారి ముందు ఉంచాడు.  లారెన్స్ గారికి తనకు ఏమి జరుగుతున్నదో ఖచ్చితముగా తెలుసు. అయినప్పటికి అతనికి ఎదురయ్యే సమస్యలను హింసను పట్టించుకోకుండా, యేసు ప్రభువు నిజమైన అనుచరునిగా ఉండటానికి సిద్ధపడ్డాడు. 

ఆది మొత్తం పరిశీలిస్తున్న అధికారి లారెన్స్ గారిని బంధించాడు. ఆయన్ను ఒక మాంసపు ముక్కను నిప్పుల మీద కాల్చినట్లు ఒక ప్రక్క కాల్చగా, నేను ఈ ప్రక్కన కాలిపోయాను, ఇప్పుడు అవతలి ప్రక్కన కాల్చమని అడిగాడు. వారు అటులనే వేరొక ప్రక్కన కాల్చడం జరిగినది. ఎంతటి బాధనైనా తట్టుకోవటానికి పునీత లారెన్స్ గారు సిద్ధపడ్డాడు. తాను పొందే హింస తక్కువ అన్నట్లు హింసించే వారిని ఇంకా ఎక్కువగా హింసించేలా ప్రేరేపించాడు. వారితో పరిహాసం ఆడాడు. అయన దృష్టిలో  యేసు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వడం అనేది ఆయన జీవితంలో అత్యంత ముఖ్యమైనది. వారు పెట్టె హింసలు చాలా కఠినమైనవి ఐన ప్రభువు సాక్షిగా నిలబడటానికి ఆనందంగా వాటిని భరించాడు అవి ఆయనకు అల్పమైనవిగా కనపడినవి. ప్రభవు మీద అతని ప్రేమ అంత గొప్పది. యేసు ప్రభువు అనుచరునిగా జీవించాడు. అందుకే పునీత లారెన్స్ గారు హాస్య కళాకారులకు పాలక పునీతునిగా ప్రసిద్ధి. 

ఈనాటి సువిశేషంలో ప్రభువు తన అనుచరుల లక్షణాల గురించి చెబుతున్నాడు. గోధుమగింజ భూమిలో పడి నశించనంతవరకు అది ఫలించదు. అంటే నేను నా బాహ్య పొరను వదిలించుకొని రావాలి అప్పుడు మాత్రమే నేను పూర్తిగా ఫలించడానికి సిద్దము అవుతాను. ఏమిటి ఈ బాహ్యపొర ఎలా దానిని నేను కోల్పోవాలి? ప్రభువే నాకు అది నేర్పుతున్నారు. ఎలా నన్ను నేను రిక్తుని చేసుకోవాలో చెబుతున్నాడు. నెను ఈ లోక జీవితం నాకోసము కాదు, ఈ లోకంలో నేను కేవలం నాకోసమే జీవించినట్లయితే  నా జీవితం  ఫలించదు. ఈ జీవితంలో నన్ను నేను ఇతరుల కోసం ఇవ్వాలి. యేసు ప్రభువు వలె జీవించాలి. ఆయన తన ప్రాణమును, తన సమయాన్ని, తన శక్తిని, తన యుక్తిని, తన జీవితాన్ని మన కోసం హెచ్చించాడు. తన ప్రాణమును కూడా కోల్పోయాడు కాని తండ్రి ఆయనకు తన ప్రాణమును ధారపోయుటకు మరల తీసుకొనుటకు అధికారం ఇచ్చాడు.

ఈ లోకములో తన జీవితమే ముఖ్యం, తన ప్రాణమే ముఖ్యం అనుకునే వారు అందరు స్వార్ధంతో జీవించువారే, వారు దేవుని అనుగ్రహములను కోల్పోతున్నారు. యేసు ప్రభువు చెప్పినట్లు జీవిస్తే ఆయనతో పాటు మనము ఉండవచ్చు. యేసు ప్రభువుతో పాటు ఉంటే తండ్రి దేవుడే మనలను గౌరవిస్తారు. యేసు ప్రభువును అనుసరిస్తూ, నన్ను నేను కోల్పోయిన నాకు లాభమే. ఎందుకంటే పరలోకమున నేను నా ప్రాణమును పొందుతాను. మరల ప్రభువుతో కలసి ఉంటాను, ఈ మహాద్భాగ్యం ఏమిచ్చి నేను పొందగలను. కేవలము ఆ ప్రభువును అనుసరించుటం వలన మాత్రమే. అంతే కాదు అప్పుడు తండ్రి దేవుడు నన్ను గౌరవిస్తారు అని ప్రభువు చెబుతున్నారు. 

ప్రార్ధన : సకల వర ప్రధాత అయిన ప్రభువా! నేను నా జీవితములో ఉహించలేనటువంటి గొప్ప అనుగ్రహాలు నాకు దయచేసి ఉన్నారు.  మీరు వాగ్దానము చేసిన వాటిని పొందుటకు నాకు అర్హత లేదు ప్రభువా కాని , పునీతుల జీవితాలు చూసినప్పుడు నేను కూడా అలా జీవించాలి అనే కోరిక నాలో కూడా పుడుతుంది, వారి వలె మిమ్ములను సంపూర్ణంగా అనుసరించే అనుగ్రహం దయచేయండి. మిమ్ములను అనుసరిస్తూ, ఎల్లప్పుడూ మీతో ఉండే అనుగ్రహం దయచేయండి. ఆమెన్ 

19వ సామాన్య ఆదివారం

 19వ సామాన్య ఆదివారం 

1 రాజులు 19:4-8, ఎఫేసీ 4:30-5:2, యోహాను 6:41-51

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు మరొకసారి దేవుని యొక్క దివ్య భోజనము గురించి బోధిస్తున్నాయి. గత మూడు వారముగా తల్లి శ్రీ సభ  దివ్యసప్రసాదం యొక్క ఔన్నత్యమును మనకు తెలియజేస్తూ ఉన్నది. 

ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఏలియా ప్రవక్తను రొట్టెతోను మరియు నీటితోనూ పోషించిన విధానం చదువుకుంటున్నాము. ఏలియా ప్రవక్త కార్మెల్ కొండపై 450 మంది బాలు ప్రవక్తలతో సవాలు చేసిన తర్వాత నిజమైనటువంటి దేవుని యొక్క సాన్నిధ్యం రుజువు చేసి ఆ 450 మంది బాలు ప్రవక్తలను హతమార్చారు దాని తరువాత ఆహాబు రాజు యొక్క భార్య అయిన యెసెబేలు రాణి తన సైనికులను పంపించి ఏలియాను ఏ విధముగానైనా సరే చంపాలని చూసింది. ఏలియా ప్రవక్త తాను ఈ వార్తను గ్రహించి తన యొక్క ప్రాణములను దక్కించుకొనుట నిమిత్తమై దూరముగా పారిపోవుచున్నారు. 
ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకున్నట్లయితే ఏలీయా ప్రవక్త 450 మంది ప్రవక్తలను చంపిన సమయంలో భయపడలేదు కానీ ఒక రాణి యొక్క మూర్ఖత్వము గ్రహించి ఆయన పారిపోతున్నారు. కొద్దిగా ఆలోచన చేసినట్లయితే ఎందుకని ఏలియా పారిపోతున్నారు? తన దేవుడి మీద నమ్మకం లేఖనా, లేదా ఇంకేమైనా కారణమా? ఎంతో ధైర్యంగా ఉన్న ఏలియా ఎందుకు ఒక్కసారిగా బలహీనపడుచున్నాడు? 
ఏలియా ప్రవక్త ఒక్కసారిగా తన యొక్క ప్రాణం మీదకు వచ్చినప్పుడు భయపడుచున్నారు. తన యొక్క కష్ట సమయంలో దేవుని యొక్క స్వరమును గుర్తించలేకపోయారు, దేవుని కార్యములు జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. ఆయన నిరాశలో ఉంటున్నారు అందుకని ప్రాణభయం మీద ఉన్న ఒక ఆశ వలన దూరంగా ప్రయాణమై పోతున్నారు. మొదటి పఠణంలో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు ఏమిటంటే;
1. ఏలియా ప్రవక్త యొక్క భయం. తన బలహీనత ద్వారా భయపడ్డారు కానీ ప్రభువు అతనికి దర్శనమిచ్చి, ధైర్యం నుంచి ముందుకు నడిపారు. ఏసుప్రభు మరణం తరువాత కూడా శిష్యులు భయపడిన సమయంలో ఏసుప్రభు పునరుత్థానమైన  తరువాత దర్శనం ఇచ్చి బలపరిచారు (యోహాను 20:19)
2. దేవుడు ఏలియాను విశ్రాంతి తీసుకోమని చెప్పుట. ఆయన దేవుని కార్యము ముగించే అలసట చింది ఉన్నారు కాబట్టి దేవుడు ఏలియాను కొద్దిపాటి సమయము విశ్రాంతి తీసుకోమని తెలుపుచున్నారు.  ఏసుప్రభు యొక్క శిష్యులు కూడా పరిచర్య చేసి అలసిపోయిన సందర్భంలో ఏసుప్రభు వారిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మని పలికారు (మార్కు 6:31). ప్రభువు మన యొక్క ఆరోగ్య పరిస్థితులను అర్థం చేసుకొని మనము సంతోషముగా ఉండుట నిమిత్తమై మనకు సహాయపడతారు.
3. దేవుడు పరిగెత్తే వారి వెనకాల వెళతారు. ఏలియా ప్రవక్త దూరంగా వెళ్లేటటువంటి సమయంలో దేవుడు అతడిని విడిచిపెట్టలేదు. తన యొక్క బలహీన సమయాలలో తోడుగా ఉన్నారు. తాను పరిగెత్తే సమయంలో తన వెనకాలే వస్తున్నారు. యోనా ప్రవక్త కూడా దేవునికి దూరంగా వెళ్లే సమయంలో దేవుడు అతని వెంట వస్తున్నారు. (యోనా 1:3, 2:10)
4. ప్రభువు ఇచ్చిన ఆహారము ద్వారా ఏలీయా ప్రవక్త 40 రోజుల పాటు శక్తిని పొందుకొని తన యొక్క గమ్యమును చేరుకున్నారు. ప్రభువు ప్రసాదించే ఆహారము మన అందరి యొక్క బలహీనతను తొలగించి మనకు బలమును ఒసగుతుంది.
5. దేవుడు మనల్ని ఎన్నటికీ మరువరు. మనము ఉన్నటువంటి అపాయములో ప్రభువు మనకు చేరువలోనే ఉంటారు. దేవుని యొక్క కనుల నుండి మనము దూరముగా వెళ్లలేము ఆయన మనలను పరిశీలిస్తూనే ఉంటారు. ఏలియా ప్రవక్త కూడా తాను ఉన్నటువంటి పరిస్థితిలో అతనిని విడిచి పెట్టకుండా తన చెంతకు వచ్చి తనను ఆదుకుంటున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో పవిత్రాత్మను విచారణమున ఉంచరాదని పౌలు గారు తెలుపుతున్నారు. పవిత్ర ఆత్మ మనలను బలపరచి ఈ లోకంలో ఎన్ని శోధనలను ఎదుర్కొనటానికి సహాయపడతారు. దేవుడు ఒసగిన ఆత్మ ద్వారా మనందరం కూడా దేవునికి చెందిన వారముగా మరియు దేవుడు మన యొక్క యజమానిగా ఉంటారు కాబట్టి మనము మన యొక్క జీవితములో ఒకరి ఎడల ఒకరు దయను చూపించుకునే విధంగా, అందరితో మంచిగా మాట్లాడుతూ, ఒకరిని ఒకరు క్షమించుకుంటూ, ప్రేమించుకుంటూ దేవుడిని పోలిన వ్యక్తులుగా జీవించమని పౌలు గారు తెలుపుచున్నారు. దేవుని పోలిన వ్యక్తులుగా అనగా దేవుని యొక్క వాక్యమును మన జీవితంలో ఆచరించి పాటించి జీవించటం.
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు తానే జీవాహారము అని ప్రజలకు తెలిపిన విధానము చదువుకుంటున్నాం. ఏసుప్రభు తాను జీవాహారము అని పలికిన సందర్భంలో చాలామంది ఆయన ఈ లోక సంబంధమైన ఆహారం ఇస్తారు అని భావించారు కానీ ఆయన ఆధ్యాత్మిక సంబంధమైన ఆహారమును గురించి తెలిపారన్న సత్యమును గ్రహించలేకపోయారు. ప్రభువు ఏ విధంగా మనకు జీవాహారము అవుతారు అంటే;
1. ఆయన యొక్క వాక్కును వినుట ద్వారా, విశ్వసించుట ద్వారా, ఆచరించుట ద్వారా మనకు జీవాహారముగా మారతారు. 
2. ప్రభువు యొక్క శరీర రక్తములను స్వీకరించుట ద్వారా ప్రభువు మనకు జీవాహారమవుతారు. ఆయన దివ్య శరీర రక్తములు మనలను ఆధ్యాత్మికంగా బలపరుస్తాయి. 
3. ప్రార్థించుట ద్వారా. ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మనలో ఉన్నటువంటి కొరతను తొలగించి మనలను తన యొక్క సాన్నిద్యంతో నింపుతారు. 
4. దేవుని మీద మనసును హృదయమును లగ్నము చేసి ఆయన కొరకు జీవించినట్లయితే ప్రభువు మన యొక్క జీవాహారము అవుతారు. 
ఈ విధముగా ప్రభువును మన హృదయంలోనికి స్వీకరించినట్లయితే ఇక మనకి ఈ లోక సంబంధమైన ఎటువంటి ఆకలి ఉండదు ఎందుకనగా దేవుడే మనలను తనతో నింపుతారు. కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చి మనకు ఆహారమైన క్రీస్తు ప్రభువును స్వీకరించటానికి మనము ప్రతినిత్యం కూడా సిద్ధముగా ఉండాలి. 
Fr. Bala Yesu OCD

మత్తయి 4:13-21

 మత్తయి 4:13-21

క్రిస్తునాధునియందు ప్రియమైన స్నేహితులారా ! ఈనాడు మనం మొదటి పఠనములో యాజకుడైన పషూరు యిర్మీయా ప్రవక్తను బాధించినప్పుడు యిర్మీయా తన బాధను, కష్టాన్ని దేవునికి పిర్యాదు చేస్తున్నాడు. మనము పషూరు యిర్మీయా చెప్పిన ప్రవచనములు విని యిర్మీయాను కొట్టించి, బంధించాడు. అప్పుడు ప్రభువు యాజకుడైన పషూరుతో ఇట్లాంటున్నాడు. శత్రువులు నిన్నును నీ కుటుంబమును బంధీలనుఁగా కొనిపోవుదురు. నీవచటనే చత్తువు అచటనే నిన్ను పాతి పెట్టుదురు. నీవు ఇన్ని కల్లబోల్లి ప్రవచనములు చెప్పి మోసపుచ్చిన నీ ఈ మిత్రులకు  ఇదే గతి పట్టును. 

యిర్మీయా ప్రవక్త తనకు జరిగిన అవమానం మరియు ఆయన ప్రభువు సందేశమును వినిపించగా జనులు ఆయనను గెలిచేయుచున్నారని ఎగతాళి చేస్తున్నారని ఎంతో బాధతో, కోపంతో దేవుణ్ణి దూషిస్తున్నారు. దేవునిపై గొంతెత్తుహి అరుస్తూ ఇలా అంటున్నాడు. ప్రభూ!నీవు నన్ను చెరచితివి, నేను చెడితిని. నీవు బలవంతుడవైనన్ను వశము చేసుకొంటివి. నీ సందేశమును చెప్పినందుకుగాను దినమెల్ల నన్ను చూసి నవ్వుచు గెలిచేస్తున్నారు. నేను ఇక నిన్ను జ్ఞప్తియందు ఉంచుకొనను. నీ పేరు మీదుగా మాట్లాడను అని అంటూ నేను ఎంత ప్రయతామ్ చేసిన నా వాళ్ళ కావటంలేదు. నీ వాక్కు నా హృదయంలో అగ్నివలె మండుచున్నది దానిని నేనిక ఆపుకోజాలను. ప్రభువు నీవు నా పక్షమున ఉండుము. నా వ్యాజ్యెమును నీకు అప్పగించితిని, దుష్టుల బారి నుండి నన్ను విడిపించుము అని యిర్మీయా ప్రవక్త దేవునికి మనవి చేసుకుంటున్నాడు. మరి మన జీవితాలలో మంకు కష్టాలు బాధలు అవమానాలు హేళనలు వచ్చినప్పుడు మనము నవ్వుల పాలు అయినప్పుడు చాలా సార్లు మనము కూడా యిర్మీయా వాలే దేవుణ్ణి నిందిస్తాం. దేవునిపై కోపపడుతాం, దేవునిపై అరుస్తూ ఉంటాం. కానీ మన దేవుడు బలాఢ్యుడని, సైన్యములకు అధిపతిఅని ఆయన నరులను న్యాయబుద్ధితో పరిశీలిస్తాడని మర్చిపోతాం. మనము ఏమి చేయాలంటే మన సమస్తాన్ని దేవునికి అప్పగించి ప్రార్ధిస్తే దేవుడు మనలను రక్షించి మన శత్రువులను శిక్షిస్తారు. 

సువిశేష పఠనములో మనము వింటున్నాం. ప్రజలు కాలినడకన క్రీస్తుప్రభువును వెంబడించారు. కాపరిలేని మందవలె ఉన్నవారిని చూసి జాలిపడి వారిలో వ్యాధిగ్రస్తులను స్వస్థ పరిచారు. అంతే కాకుండా వారికి ఆధ్యాత్మిక ఆహారాన్ని అనగా దేవుని వాక్కుని అందించి వారికి భౌతిక ఆహారాన్ని అందించాడు. ఓకే చిన్న బాలుడు తన కొరకు తెచ్చుకొన్న ఐదుచేపలను రెండుచేపలను తీసుకొని వచ్చి అర్పించాడు. క్రీస్తు ప్రభువు ఐదు రొట్టెలను రెండు చేపలనూ తీసుకొని ఆశీర్వాదించి వారందరు సంతృప్తు చెందినంతగా వడ్డించగా 12 గంపలు ముక్కలు మిగిలాయి. భుజింహ్సి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు ఐదువేల  మంది పురుషులు ఉన్నారు. 

మనము ఏమి అర్ధం చేసుకోవాలంటే మనము క్కూడా దేవుని యొద్దకు వచ్చి తన సన్నిధిలో ఉంటామో క్రీస్తు ప్రభువుని యొక్క జాలి, దయ మనపై మన కుటుంబాలపై ఉంటుంది. అయన మం వ్యాధి బాధలనుండి మనలను స్వస్థపరుస్తాడు. మనము ఆత్మల ఆహారాన్ని మం ఆధ్యాత్మిక ఆహారాన్ని మనకు అందిస్తాడు అని మనము తెలుసుకోవాలి. మానవుడు కేవలము రొట్టె వలనకాక దేవుని నోటినుండి వచ్చు ప్రతిమాట వలన జీవిస్తాడు అని వాక్యయమ్ తెలియజేస్తుంది. 

మంకు ఉన్న దానిని దేవుని చేతిలో ఉంచితే దేవుడు దానిని ఏంటో మందికి ఆశీర్వాదకరంగాను  దీవెనకరంగాను మార్చుతాడు అని ఈనాటి సువిశేష పఠనములో మనాకు విశదమొనర్చుచున్నారు దేవుడు. కాబట్టి ప్రియ మిత్రులారా మనము మంకు ఉన్న దానిని దేవునికి మరియు మన తోటి వారికి ఇట్సె అది ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఆనాడు నాయుడు రొట్టెలు రేణు చేపలు ఐదు వేళా మందికి ఆశీర్వాదంగా మారెను, మనం మన జీవితాల ద్వారా ఎంతో మందికి ఆశీర్వాదాహముగా మారాలి. అవిద్యాగం మారడానికి ప్రయత్నించుదాం. 

ప్రార్ధన : ఓ కరుణామయుడా!ఎన్నో సార్లు మేము కూడా మా బాధల్లో, కష్టాలలో నిందలలో అవమానంతో నిన్ను దూషించి ఉన్నాము. మమ్ము క్షమించండి. ప్రభువా నీవు నా పక్షమున ఉన్నవని మార్చిపోయి భయపడిపోతున్నాం. మాకు బలాన్ని ధైర్యాన్ని దయచేయండి,అప్పుడు మేము నీసేవను ధైర్యంగా చేయగలము. ప్రభువా! నీవు దయమయుడవు కాబట్టి మాపై దయచూపి మమ్ము స్వస్థ పరచి, ఆశీర్వదించుము, మా జీవితాలు ఇతరులకు ఆశీర్వాదంగా మార్చుము. ఆమెన్ 

మత్తయి 14:1-12

 మత్తయి 14:1-12 

ఆ కాలమున గలిలీయ ప్రాంత పాలకుడగు హేరోదు యేసు ప్రఖ్యాతిని విని, "ఇతడు స్నాపకుడగు యోహానే. అతడే మృతులనుండి లేచియున్నాడు. కావున, అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి" అని తన కోలువుకాండ్రతో చెప్పెను. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియ కారణముగా యోహానును బంధించి చెరలో వేయించెను. ఏలయన, "ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు" అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను. కాని అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను. హేరోదు జన్మదినోత్సవమున హేరోదియ కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు ఒసగెదను అని అతడు ప్రమాణ పూర్వకముగా వాగ్దానము చేసెను. అపుడు ఆమె తల్లి ప్రోత్సాహమువలన "స్నాపకుడగు యోహాను శిరస్సును ఒక పళ్ళెరములో ఇప్పుడు ఇప్పింపుము" అని అడిగెను. అందుకు ఆ రాజు దుఃఖించెను. కాని, తన ప్రమాణముల కారణముగ, అతిధుల కారణముగ ఆమె కోరిక తీర్చ ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలోనున్న యోహానును శిరచ్చేదనము గావించెను. వారు అతని తలను పళ్ళెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతట యోహాను శిష్యులు వచ్చి అతని భౌతికదేహమును తీసుకొనిపోయి భూస్థాపనము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్లి ఆ విషయమును తెలియజేసిరి. 

ప్రియమైన దైవ ప్రజలారా! ఈనాడు మొదటి పఠనంలో మనము యిర్మీయా ప్రవక్తను చూసి, ఆయన చెప్పిన దైవ సందేశాన్ని విని భయంతో, కోపంతో, అసూయతో, గర్వంతో యిర్మీయా ప్రవక్తను చంపివేయాలని యాజకులు ప్రవక్తలు, నాయకులను ప్రజలను రెచ్చగొట్టడం చూస్తున్నాము. ఎందుకంటే యిర్మీయా ప్రవక్త చాలా కఠినమైన సందేశాన్ని వారికి వినిపించారు. ఆ సందేశం ఏమిటంటే వారు వారి మార్గములను, క్రియలను మార్చుకొని దేవునికి విధేయులు కాకపోతే నాశనము చేయబడుదురు. వారి దేవాలయం నాశనము చేయబడుతుంది. పదే  పదే ఆయన ప్రజలను హెచ్చరిస్తున్నాడు. యిర్మీయా ప్రవక్త వారిని, మీరు మీ మార్గాలను, మీ పాపపు పనులను మీ గర్వాన్ని వదలిపెట్టి మారు మనసు పొంది దేవునికి విధేయతతో జీవిస్తే మిమ్మి అయన రక్షిస్తాడు, మీ శిక్షను తొలగిస్తాడు అని బోధిస్తున్నాడు. ఈ సంగతులెల్ల మీకు తెలియజేయుటకు ప్రభువు నన్ను పంపాడు అని చెబుతున్నాడు. ఇది విని నాయకులు, ప్రజలు తమ యొక్క నాయకులు ప్రవక్తలతో యిర్మీయాకు మరణ శిక్ష  విధించుట తగదు. ఎందుకు అనగా అతడు మన దేవుడైన ప్రభువు పేరు మీదుగా మాట్లాడేను అంటున్నారు. 

సువిశేష పఠనంలో మనము స్నాపకుడగు యోహాను గారి శిరచ్చేదనము గురించి వింటున్నాం. యోహాను గారు దైవ సందేశాన్ని భయపడకుండా ధైర్యంతో భోదించినందుకు తన ప్రాణమును కోల్పోయాడు. హేరోదురాజు యేసు ప్రభువుని పేరు ప్రఖ్యాతులను విని ఖచ్చితముగా యోహానే మృతలనుండి లేచి, ఇన్ని అద్భుతశక్తులు కలిగిఉన్నాడు అని తన సేవకులతో చెబుతున్నాడు. యోహాను గారు రాజైన హేరోదుతో నీ సోదరుడగు ఫిలిప్పు భార్యను నీవు ఉంచుకొనుట ధర్మముకాదు అని అధర్మాన్ని ఖండించి, హెచ్చరించాడు. అందువలన హేరోదు యోహానును చంపుటకు నిర్ణయం తీసుకున్నాడు, కాని  భయ పడ్డాడు ఎందుకంటే యోహాను నిజమైన దేవుని ప్రవక్త అని హేరోదు అర్ధం చేసుకున్నాడు. యోహానును చరసాలలో బంధించారు. హేరోదియ కూడా యోహాను పట్ల కోపం, ఈర్ష్య ద్వేషంతో యోహానును చంపాలని చూసింది. ఆమె కూతరు హేరోదు రాజును నాట్యంద్వారా మెప్పించి,సంతోష పెట్టినందుకు నీము ఏమి కావాలో కోరుకో అని ప్రమాణం చెయ్యగా తన తల్లి మాట మీదగా స్నాపకుడగు యోహాను తనను ఒక పళ్లెంలో ఇవ్వమని అడిగింది. 

హేరోదు తన ప్రమాణము కారణంగా, అతిధుల ముందు మాటను ఇచ్చి ఉండటంవలన ఆమె కోర్కెను తీర్చాడు. దేవుని సత్య సువార్తను ధైర్యంగా బోధించి సత్యంకోసం  తన రక్తాన్ని కార్చిన స్నాపకుడగు యోహాను వారి వలె, మనము అధర్మాన్ని ఎదిరించి తప్పును తప్పు అని చెప్పగలమా! ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం భయంతో ఉంటె సత్యానికి, సత్య సువార్తకు సాక్షులుగా ఉండలేం. కనుక యిర్మీయా ప్రవక్త వలె స్నాపకుడగు యోహాను వలె మనము కూడా దేవుని వాక్కుని విని, పాటించి ధైర్యంగా ఏ భయం , ఆందోళన లేకుండా నిజమైన సత్య సువార్తను బోధించుదాం. సత్యానికి సాక్షులుగా నిలబడదాం. సత్యం ధర్మం కొరకు మన ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా వెనుకడుగు వేయకుండా ఉందాం. దేవుడు తన   సత్య సువార్తను మన హృదయాలలో నింపి మనలను నడిపించులాగున  ప్రార్ధించుదాం. 

ప్రార్ధన: సత్య స్వరూపుడైన తండ్రి, మమ్ము మీ సత్య వాక్కుతో నింపుము.మేము అన్ని వేళలలో సత్యానికి సాక్షులుగా జీవిస్తూ సత్య సువార్త బోధిస్తూ, ప్రజలను మీ సత్యపు వెలుగు లోనికి నడిపించడానికి మాకు శక్తిని, బలమును, ధైర్యమును దయచేయుము. తద్వారా ఎన్నో ఆత్మలను రక్షించుటలో మా వంతు బాధ్యతను నెరవేర్చుటకు మీ అనుగ్రహం  దయ చేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

మత్తయి 13: 54-58

  మత్తయి 13: 54-58    


యేసు తన పట్టణమును చేరెను. అచట ప్రార్ధనామందిరములో ఉపదేశించుచుండగా, ప్రజలు ఆశ్చర్యచకితులై, "ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచటినుండి  లభించినవి?" అని అనుకొనిరి. "ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు  , యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులుకారా? ఇతని సోదరీమణులు అందరు మన మధ్యనలేరా? అటులయిన ఇవి అన్నియు యితడు ఎట్లు పొందెను?" అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో  "ప్రవక్త  స్వదేశమందును, స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు" అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసమువలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములను చేయలేదు. 

ఈనాడు ప్రభువు తన వాక్కును యిర్మీయా ప్రవక్తకు, నన్ను ఆరాధించుటకు వచ్చిన ప్రజలకు నేను ఆజ్ఞాపించిన సంగతులెల్ల వినిపింపుము. వాటిలో ఒక్క మాటకూడా వదలిపెట్టవలదు అని  వినిపించాడు.  ప్రియా మిత్రులారా దేవుడు ప్రవక్తలను ఎన్నుకొని , తన వాక్కును వినిపించి, తనను ఆరాధించే ప్రజలకు తన సందేశాన్ని ఒక్క మాటకూడా వదలి  పెట్టకుండా చెప్పడానికి మన మధ్యకుపంపిస్తున్నాడు. ఎందుకు దేవుడు తన ప్రవక్తలను పంపిస్తున్నాడు అంటే, దేవుని వాక్కును సందేశాన్ని విని పాపులమైన మనము  మన దుష్ట మార్గము నుండి మంచి మార్గములోనికి రావాలని, మన బ్రతుకులు మార్చుకొవాలని, మనము  మనం పాపలు నుండి చేదు వ్యసనాల నుండి మారకపోతే  దేవుని ప్రేమకు దగ్గరగా రాకపోతే మనం నాశనమునకు గురిచేయబడుతాం. మారుమనస్సు పొందితే రక్షణ లేకపోతే నాశనము. మరి మనము మన మనస్సును మార్చుకోవాలంటే ఏమి చేయాలి.

యిర్మీయా 26:4 వ వచనంలో దేవుడు "మీరు నేనిచ్చిన ధర్మ శాస్త్రమును పాటించి నాకు విధేయులు కావాలి"  అని చెబుతున్నాడు. మరి మనము దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామా? ఆజ్ఞలు అన్ని దైవ ప్రేమ, సోదర ప్రేమపై ఆధారపడియున్నవి. మరి మనము దేవుని మరియు మన తోటి వారిని ప్రేమించగలుగుతున్నామా? అదేవిధంగా దేవునికి నిజంగా విధేయులమై ఉంటున్నామా? మనం ఎవరికీ విధేయత చూపిస్తున్నాం? దేవుని వాక్కులుకు విధేయత చుపిస్తున్నామా? ఒకవేళ దేవుని వాక్కు కు విధేయత చూపించకపోతే మనము మన నాశనమును  కోని తెచ్చుకుంటాము. దేవుడు యిస్రాయేలు ప్రజలతో , మీరు నా సేవకులగు ప్రవక్తల  పలుకులు వినలేదని అంటున్నాడు.  మరి ఈనాడు మనం దేవుని సేవకులగు ప్రవక్తలు,   గురువులు పెద్దల మాటలను వింటున్నామా  లేదా ఆలోచించండి. ఒక ప్రవక్తగా, దైవ సేవకునిగా, దేవుని వాక్కును భయపడకుండా, భాధలకు దూరంగా వెళ్లకుండా  ధైర్యంగా ప్రకటించాలి. యిర్మీయా ప్రవక్త వలె ఉండాలి.   ఆయన దేవుని వాక్కును, సందేశాన్ని ప్రకటించినప్పుడు ప్రజలు ఆయనను నింధించారు. ఆయనపై అరిచారు. కాని  ఆయన దేవుని వాక్కును, సువార్త పరి చర్యను ఆపివేయలేదు. 

ఈనాటి సువిశేషంలో తన పట్టణ ప్రజలే క్రీస్తు ప్రభువునుతృణీకరించారని వింటున్నాం. ఆయనను చిన్న చూపు చూచి, ఆయన బోధనలు విని ఆశ్చర్యపోయి, క్రీస్తు ప్రభువునికి ఇంతటి  జ్ఞానం ఎట్లు వచ్చినదని,  ఆయనను ఔన్నత్యాన్ని ఒప్పుకోలేక,  ఆయన బోధనలను తృణీకరించారు. క్రీస్తు ప్రభువు, తన శిష్యులమైన  మనకు  తెలియజేసేది ఏమిటంటే మనవారే కొన్ని  సార్లు మనలను తృణీకరిస్తారు , మన మాటలను అంగీకరించరు, మన మాటలపై అవిశ్వాసం వ్యక్తపరుస్తారు, భయపడకండి, నా సందేశాన్ని అందరికి తెలియజేయండి. కొన్నిసార్లు అగౌరవంగా మాట్లాడుతారు. కాని  మీరు సువార్త ప్రకటనను కొనసాగించండి అని తెలియజేస్తున్నాడు. 

ప్రార్థన : 
ప్రేమమయుడైన  దేవా! నీవు మమ్ము రక్షించువాడవు. మేము నీ వాక్కును విని, ఆరాధిస్తూ, నీ ఆజ్ఞలను పాటించి జీవించే భాగ్యం  నాకు దయజేయండి. తద్వారా మేము మా దృష్టమార్గములను విడిచిపెట్టి, నీ ప్రేమా ,  సువార్తను  ప్రకటించే భాగ్యం మాకు దయచేయండి. మమ్ము ఎవరు తృణీకరించిన బాధపడకుండ,  నీ సత్య మార్గములో నడిచే శక్తిని ఇవ్వండి.   ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

మత్తయి 13: 47-53

 మత్తయి 13: 47-53 

"ఇంకను పరలోకరాజ్యము సముద్రములో వేయబడి, అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. వల నిండినపుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి, పనికి రాని వానిని పారవేయుదురు. అటులనే అంత్యకాలమందును జరుగును; దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతులనుండి వేరుపరచి అగ్ని గుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు, పండ్లు కోరుకుకొందురు." వీనినన్నింటిని మీరు గ్రహించితిరా?" అని యేసు అడిగెను. "అవును" అని వారు సమాధానమిచ్చిరి. అయన "పరలోక రాజ్యమునకు శిక్షణ  పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన, పురాతనవస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు" అనెను. 

ఈరోజు దేవుని వాక్యం మొదటి పఠనమును  మనము చూస్తే,  దేవుడు యిర్మీయా ప్రవక్తను ఓక  కుమ్మరి వాని ఇంటికి తన యొక్క సందేశాన్ని వినిపించమని పంపిస్తున్నాడు,  అయితే ఆ ప్రవక్త  వెళ్లి ఆ కుమ్మని సారెమీద పని చెయ్యడం చూసాడు. దేవుడు ఎన్నో  సార్లు తన ప్రవక్తలను, శిష్యులను కూడా మన  దగ్గరకు పంపిస్తునాడు. మన  గ్రామాలకు, కుటుంబాలకు, సంఘాలకు పంపించుచున్నాడు. ఎందుకు అనగా మనయొక్క జీవిత విధానాలను చూచి, మన  వ్యాధి బాధలను చూచి మనలకు సువార్తను అంటే, దేవుని సందేశాన్ని అందించమని తన ప్రవక్తలను పంపుచున్నాడు. 

ఆనాడు యిర్మీయా ప్రవక్త కుమ్మరివాని  ఇంటి దగ్గర కుమ్మరి చేసే పనిని చూచి ఉన్నాడు. మనము ఈనాడు ఏ పనులు చేస్తున్నాము. దానిని బట్టి దేవుడు తన సందెశాన్ని మనకు అందిస్తాడు. కుమ్మరి,  సరిగా తయారుకాని కుండను ఏ విధంగానైతే వేరొక పాత్రగా చేసాడో అదే విధంగా  దేవుడు కూడా మన జీవిత విధానం బట్టి, మన జీవితాన్ని రూపుదిద్దుతాడు. పాడైపోయిన కుండా మరల ఏ విధంగా అందమైన పాత్రగా మార్చుబడుతుందో, దేవుడు పాడైపోయినా మన జీవితాలను కూడా అందమైన పాత్రగా మార్చగలడు. మన జీవితం ఏ విధంగా ఉన్న, మన బలహీనతలు ఏమైనా  దేవుడు వాటిని తొలగించి  మనలను   మరల సుందరంగా అందంగా మార్చుతాడు, మార్చగలడు.  ఓ! యిస్రాయేలు ప్రజలారా మీరు ఎలాంటి వారంటే కుమ్మరి చేతిలో మట్టివలె మీరును నా చేతిలో ఇమిడిపోయేదరు అంటున్నారు.  కాబట్టి మనము అర్ధం చేసుకోవలసినది మనము దేవుని చేతిలో మట్టి వంటి వారము, మన  జివితాలు దేవుని చేతిలో ఉంచితే మన జీవితాలను, కుటుంబాలను సంఘాలను దేవుడు ఎంతో అందంగా మార్చివేస్తారు. 

మన జీవితాలు ఎవరి చేతులో ఉన్నాయి? మనము ఏ విధంగా ఉన్నాము? ఆలోచించాలి. ప్రస్తుత కాలంలో మనము మన జీవితాలను వేరే వారి చేతులలో పెడుతున్నాము. మన జీవితాలను నాశనము చేసుకుంటున్నాము. పదే పదే పాపములో పడిపోయి, పాపపు పనులు చేస్తున్నాము. కాబట్టి దేవుడు మనతో ఈ కుమ్మరి మట్టిని ఎట్లు మలచెనో నేనును మిమ్మునట్లు మలవకూడదా? అంటున్నాడు. మరి మన సమాధానం ఏమిటి ఈ ప్రశ్నకు ? ఆత్మ పరిశీలన చేసుకుందాం.  మనము దేవునికి మనలను మార్చడానికి అవకాశం ఇస్తున్నామా? పునీత అగస్టిను వారు నీ అనుమతి లేకుండా నిన్ను సృష్టించిన దేవుడు నీ అనుమతి లేకుండా నిన్ను రక్షించాడు అని అంటున్నాడు. మరి మనము దేవుని చిత్తమునకు అనుమతిస్తున్నామా? 

సువిశేష పఠనంలో పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి అన్నివిధములైన చేపలను పట్టు వలను పోలియున్నది అని క్రీస్తు ప్రభువు బోధిస్తున్నారు. అపుడు మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వాటిని పారవేయుదురు. మనం ఇక్కడ గమనించవలసినది ఏమిటి అంటే  దూతలు అంత్యకాలంలో మంచి చేపలు అంటే మంచి పనులు చేస్తూ, పరిశుద్ధంగా జీవించేవారు, బుట్ట అంటే పరలోకరాజ్యము. పనికిరాని చేపలు అంటే దుష్టులు చెడు పనులు చేయువారు. వీరు నరకంలో పారవేయబడి శిక్ష అనుభవిస్తారు. కాబట్టి పరలోకంలో చేరాలి అంటే మనము మన పాప క్రియలను విడిచి పశ్చాతాపంతో ప్రభువును ఆశ్రయించాలి, ప్రార్ధించాలి. అపుడు దేవుని రాజ్యంలో చేర్చబడుతాం. 

ప్రార్ధన: ప్రభువైన దేవా మేము మమ్ము తగ్గించుకొని ప్రతినిత్యం మా జీవితం విధానాలను మార్చుకుంటూ మీ  సందేశాన్ని, ప్రణాలికను అర్ధంచేసుకుంటూ మా జీవితాలను అందంగా, పరిశుద్ధంగా మార్చుకొని మంచి వారిగా ఉంటూ మంచి పనులను చేస్తూ పరలోక రాజ్యం పొందేబాగ్యం మాకు దయ చేయండి. ఆమెన్

ఫా. సురేష్ కొలకలూరి  

యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16

 యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16 "పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది: ఒక  యజమానుడు తన ద్రాక్షతోటలో పని  చేయుటకు పని వారలకై ప్రాతః...