18, జూన్ 2022, శనివారం

యేసు క్రీస్తు దివ్య శరీర రక్తాల మహోత్సవం

దివ్య సత్ప్రసాద మహోత్సవము(4)

దివ్య సత్ప్రసాద మహోత్సవము

ఆది 14 : 18 - 20 , 1 కొరింతి 11 : 23 -26 , లూకా 9 : 11 -17

ద్వితియో 8 : 2 -3 , 14 - 16 , 1 కొరింతి 10 : 16 - 17 , యోహాను 6: 51 -58 .

నేడు తల్లి శ్రీ సభ క్రీస్తు ప్రభువు యొక్క పరమ పవిత్ర శరీర రక్తముల పండుగను కొనియాడుచున్నది. 

దైవార్చన సంవత్సరంలో దివ్య సత్ప్రసాదం యొక్క గొప్ప తనం గురించి రెండు ప్రత్యేకమైన రోజులలో ధ్యానించుకుంటాం. 

1. పవిత్ర గురువారం రోజున 

2. ప్రభువు పునరుతనమైన 9 వారాల తర్వాత.

దివ్య సత్ప్రసాదం అనేది క్రీస్తుప్రభువు శ్రీసభకు ఇచ్చిన గొప్ప సంపదం. దాని వలననే శ్రీ సభ జీవించుచున్నది . పరిశుద్ధ 16 వ బెనెడిక్ట్ పాపు గారు అంటారు దివ్య సత్ప్రసాదం లేనిది శ్రీ సభ ఉనికి లేదు అని.

దివ్య సత్ప్రసాదం అనేది ప్రభువు యొక్క అమూల్యమైన వరం. ఆయన కడరాత్రి భోజనమున దివ్యసత్ప్రసాదమును స్థాపించారు.

కేవలం కథోలిక సంఘంలో వున్న విశ్వాసులకు దేవుడిని తమలోకి స్వీకరించే అదృష్టం కలుగుతుంది. ఏ దేవాలయము కు  వెళ్లిన కేవలం దేవుడికి అర్పించిన ప్రసాదం తీసుకుంటారు. కానీ కథోలిక శ్రీ సభ లో దేవుడిని దివ్యసత్ప్రసాదంలో తమ యొక్క హృదయంలోకి ఆహ్వానించుకుంటారు.

పాస్కా పండుగ దినముల తరువాత ఎందుకు ఈ పండుగను కొనియాడుతారంటే ప్రభువు శిష్యులతో "నేను లోకాంతము వరకు సదా మీతో ఉందును అని వాగ్దానం చేశారు. మత్తయి 28 : 20 . ఈ విధంగా ఆయన దివ్య సత్ప్రసాదంలో దాగి వున్నారు.

దేవుడు మనతో చిరకాలము ఉండుటకు దివ్యసత్ప్రసాదంను స్థాపించారు.

దివ్య సత్ప్రసాదం కథోలిక విశ్వాస సంప్రదాయంలో గుండెకాయ వంటిది . మానవుల యొక్క జీవితంలో హృదయం అనేది కేంద్రం . హృదయం లేనిది మనిషి జీవించలేడు. అలాగే దివ్యసత్ప్రసాదం లేనిదే కథోలిక విశ్వాసం లేదు.

ప్రభువు యొక్క శరీరము నిజమైన ఆహారము ఆయన యొక్క రక్తము నిజమైన పానము. 

కడరాత్రి భోజనమున దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని చెప్పి ఆయన మన కోసమే తన శరీరమును రక్తమును ఇచ్చి వున్నారు.

శ్రీసభ ఈ పండుగను స్థాపించటానికి 4 కారణాలు వున్నాయి.

1 దివ్యసత్ప్రసాదంలో క్రీస్తు ప్రభువు నిజంగా ప్రత్యక్షమై వున్నారని తెలుపుటకు. 

2 దివ్య సత్ప్రసాదంలో దాగివున్న క్రీస్తు ప్రభువుకు చెందిన అవమానాలకు పరిహారం చెల్లించుటకు. 

3 దివ్యసత్ప్రసాదం ద్వారా మనం పొందే మేలులకు కృతజ్ఞతా తెలుపుటకు.

4 తరుచుగా అందరం దివ్యసత్ప్ర సాదం స్వీకరించి దేవునితో ఐక్యమై జీవించుట కొరకు స్థాపించబడినది.

దివ్య సత్ప్రసాదంలో చాలా శక్తి దాగి వున్నది . దివ్య సత్ప్రసాదమే మనలను దేవునితో ఐక్యపరుస్తుంది.

ఈ నాటి మొదటి పఠనంలో షాలేము రాజు అయిన మేల్కేసెదెకు సమర్పించిన రొట్టె , ద్రాక్షారసము గురించి చెప్పబడినది. 

అబ్రహాము శత్రు సైన్యములను జయించి బంధింపబడి ఉన్న లోతును విడిపించుకొని వచ్చే సమయంలో మేల్కేసెదెకు రాజు అబ్రహామును కలుసుకొనుటకు వస్తారు.

మేల్కేసెదెకు ఒక రాజు మాత్రమే కాదు ఆయన దేవుని యొక్క పూజారికూడా (ఆది 14 : 18 ) అంటే దేవునికి బలులు సమర్పించే యాజకుడు.

మేల్కేసెదెకు యాజకత్వమునకు పుట్టుపూర్వోత్తరాలు లేవు అయినా కానీ ఆయన దేవుని యొక్క యాజకుడు. అని పవిత్ర గ్రంధం తెలుపుతుంది. పవిత్ర గ్రంథంలో వున్న మొదటి యాజకుడు. కీర్తన 110 :4 .

ఒక దేవుని యొక్క యాజకుడిగా మేల్కేసెదెకు అలసిపోయిన అబ్రహాముకు రొట్టెను, ద్రాక్షారసమును ఇచ్చి బలపరుస్తున్నాడు.

మేల్కేసెదెకు అబ్రహామును యావే దేవునిపేరిట దీవిస్తున్నారు. ఆయన సమర్పించిన రొట్టె, ద్రాక్షారసము బలి అర్పణకు సూచనగా ఉంది. రొట్టెను, ద్రాక్ష రసమును సమర్పించుట పూర్వ నిభందన కాలంలో అత్యంత ప్రధానమైన సాంప్రదాయంగా మారింది.

-యేసు క్రీస్తు ప్రభువు యొక్క యాజకత్వం మేల్కేసెదెకు యాజకత్వ వారసత్వంను కలిగి వున్నదని హెబ్రీయులకు వ్రాసిన లేఖలో తెలిపారు. హెబ్రి  7 , 8 అధ్యాయాలు . క్రీస్తు ప్రభువు లేవీయుల గోత్రమునకు చెందినవారు కారు. అయినా కానీ ఆయన నిత్యుడగు యాజకుడు; ఆయన తన శరీర రక్తములనే  రొట్టెగా, ద్రాక్షా రసముగా సమర్పించారు.

మేల్కేసెదెకు దేవునియొక్క ఆత్మ ప్రేరణ చేతనే రొట్టె, ద్రాక్షరసాలను ప్రభువుకు సమర్పించారు. 

వాస్తవానికి ఆనాటి అన్యజాతీయులు జంతువుల మాంసంతోను, రక్తంతోను తమ దేవదూతలకు , దేవుళ్ళకు బలులు సమర్పించాలి. కానీ మేల్కేసెదెకు  దానికి భిన్నముగా కేవలం రొట్టె, ద్రాక్ష రసాలు సమర్పించారు. ఎందుకంటే అవి క్రీస్తు ప్రభువు యొక్క రక్షణ బలికి సుమాత్రుకగా ఉన్నాయి.

మేల్కేసెదెకు  రొట్టె ద్రాక్ష రసములను ఇవ్వుట మాత్రమే కాదు అబ్రహామును దీవిస్తున్నారు. 

ఈనాటి రెండవ పఠనంలో క్రీస్తు ప్రభువు, వారు అర్పించిన బలి గురించి పౌలు గారు కొరింతు ప్రజలకు వివరిస్తున్నారు.

ప్రభువు యొక్క అపోస్తులులు తన మరణ, పునరుత్తానం తరువాత రొట్టె విరుచుటలో ప్రతిదినము సమావేశమయ్యేవారు. ఈ యొక్క సంప్రదాయంను అందరు పాటించే వారు ఎందుకంటే క్రీస్తు ప్రభువు వారు అన్నారు దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు అని.

మనందరం రొట్టెను , ద్రాక్షణారసమును పానము చేయునప్పుడు దేవునియొక్క రక్షణమును జ్ఞాపకం చేసుకోవాలి ఆయనయొక్క త్యాగం, ఆయన యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి.

యావే దేవుడు ఆనాడు మన్నాను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారు. ఈనాడు క్రీస్తు ప్రభువు తనను తాను బలిగా సమర్పించుకొని తన శరీర రక్తాలు మనకు ఒసగి వున్నారు.

దేవునికి మనం కృతఙ్ఞతలు తెలపాలి.

దివ్య సత్ప్రసాదం స్వీకరించిన మనందరం అన్యోన్యంగా జీవించాలి ఎందుకంటే అందరిలో క్రీస్తు ప్రభువు వున్నారు. అనేక మంది కలిసి ఒకే పిండితో, నీతితో చేసిన రొట్టెను పంచుకొనుట ద్వారా మనందరం క్రీస్తు నందు ఒకే ప్రజగా ఉంటున్నాం.

మనం ఏ ప్రాంతమునకు వెళ్లిన, భాషకు, జాతులకు, చెందిన వారమైన సరే దివ్యసత్ప్రసాదం స్వీకరించిన తరువాత ఒకే ఒక ప్రజగా మారాలి. ఎటువంటి పేద, ధనిక, భేదాభి ప్రాయాలు లేకుండా కలసి జీవించాలి.

రొట్టెను చేసేది అన్ని గోధుమలు కలిపి ఒక ముద్దగా చేసి రొట్టెగా మార్చుతారు. అలాగే ద్రాక్ష రసము కూడా చాలా కాయలు కలిపి నలగ గొట్టినప్పుడే మంచి ద్రాక్ష రసము వస్తుంది. కాబట్టి అనేక గోధుమల కలయిక వల్ల ఏర్పడిన రొట్టెలాగా అలాగే అనేక ద్రాక్ష పళ్ళ కలయిక వల్ల ఏర్పడు ద్రాక్ష రసములాగా మనందరం కలసి మెలసి ఐక్యంగా జీవించాలి.

పౌలు గారు ప్రభువుయొక్క భోజనము గురించి ఎందుకు వివరించారంటే ఆనాటి కొరింతు సంఘంలో ఐక్యత అంతగా లేదు అందుకే ప్రభువు భోజనము ఏవిధంగానైతే అందరిని ఐక్యపరిచినదో అలాగే  ప్రతి కొరింతు విశ్వాసి ఐక్యత కలిగి జీవించాలి.

ఈ నాటి సువిశేష పఠనంలో యేసు క్రీస్తు ప్రభువు 5000 మందికి ఆహారం ఇచ్చిన అద్భుతంను చదువుకుంటున్నాం.

ప్రభువు అయిదు రొట్టెలు, రెండు చేపలు ద్వారా అక్కడవున్న వారందరిని సంతృప్తి పరిచారు. ప్రభువు కేవలం వారికి ఆధ్యాత్మిక ఆహారం మాత్రమే కాదు ఇచ్చింది శారీరక ఆకలిని కూడా వారు తీసివేశారు.

యోహాను సువార్త 6 : 35 వచనాలలో ప్రభువు "నేనే జీవాహారము" అని పలికారు. జీవాహారము అనే మాటకు రెండు అర్థాలున్నాయి. 

1. దేవుని వాక్కు - జీవాహారం మన యొక్క ఆత్మలకు జీవము నిచ్చే వాక్కు మనల్ని బలపరిచే వాక్కు. కీర్తన 119 : 50 . పాతనిభందన గ్రంధంలో దేవుని వాక్కు ఆహారంతో పోల్చబడినది యెషయా 55 వ అధ్యాయం .

2. దేవుని యొక్క దివ్య శరీర రక్తములు - యోహాను 6 వ అధ్యాయం 

దివ్యసత్ప్రసాదం  మనయొక్క జీవాహారం కాబట్టి మనం యోగ్యారీతిగా స్వీకరించాలి.

ప్రభువు సువిశేషంలో 5000 మందికి ఆహారం ఒసగిన సంఘటన పాత నిబంధన గ్రంధంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను ఇచ్చిన సంఘటన అదేవిధంగా ఎలీషా ప్రవక్త అతిధులకు  రొట్టెను ఇచ్చిన విధానం అన్ని కూడా యేసు ప్రభువు స్థాపించే దివ్యసత్ప్రసాదంకు సూచనగా వున్నాయి.

నిర్గమ 16 : 4 - 36 (మన్నా),, 2 రాజు  4 : 42 – (ఎలీషా అద్భుతం)

యేసు ప్రభువు 5000 మందికి ఆహారం ఒసగిన సంఘటన నలుగురు సువార్తికులు వ్రాశారు.

దివ్యసత్ప్రసాదం దేవుడు మనకు ఒసగిన గొప్ప వరం కాబట్టి దానిని ఎలాగా మనం స్వీకరిస్తున్నాం?

దివ్య సత్ప్రసాదం స్వీకరించుట అంటే-

ఆయనను  మనలోకి ఇంకించుకోవడం  అంటే ఆయన జీవితం వలే మన జీవితం మారాలి . గలతి 2 : 20 .

- ఆయన రూపంను పొందాలి 

-ఆయన వలే మనం తయారవ్వాలి.

-ఐక్యమై జీవించుట 

దేవుడు మనతో ఉండాలని మనకు దగ్గరగా ఉండాలని, మనలో ఉండాలని దివ్య సత్ప్రసాద రూపంలో దాగి వున్నారు కాబట్టి ఆయనను స్వీకరించుటకై మనం ఎలాగా తయారగుచున్నాం.

-దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తే మనందరిలో అనేక ప్రయోజనాలు వున్నాయి. 

-స్వీకరించిన వారు జీవాన్ని కలిగి వుంటారు- యోహాను 6: 53 

-ఆయన పునరుత్థాన జీవితం పంచుకుంటారు- యోహాను 6: 54 

-ప్రభువులో సహజీవనం ఏర్పడుతుంది -యోహాను 6: 56, గలతి 2 :20  

-దేవుని మూలమున జీవిస్తాం - యోహాను 6: 57 

-దేవుడు మనయందు ఉంటారు - యోహాను 6: 56

మనందరం యేసు ప్రభువుయొక్క దివ్య శరీర రక్తములు స్వీకరించినప్పుడు దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. 

- దేవుడు ఒసగె ఆహారం మనలను ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది. ఈ ఆహారం భుజించియే ఏలియా నలభై రోజులు నడిచారు. 1 రాజు 19: 8.

- ఈ ఆహారం భుజించియే ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో నడిపించబడ్డారు. నిర్గమ 16 : 35 .

-దేవుడు మనకై ఏర్పరిచిన ఈ యొక్క దివ్య సత్ప్రసాదం పట్ల గౌరవం, ప్రేమ, భక్తి కలిగి మారుమనస్సు పొంది ప్రభువుని మనలోకి స్వీకరిద్దాం.

మన ఇంటికి ఎవరైనా అతిధి వస్తే వారిని మంచిగా స్వీకరిస్తాం, అదే ఇంటికి గొప్ప వారు వస్తే ఇంకా బాగా స్వీకరిస్తాం. మరి దివ్య సత్ప్రసాదం ద్వారా దేవుడు మనలోకి  వచ్చేటప్పుడు మనం ఎలాగా స్వీకరిస్తున్నాం. ఆయన మానవ మాత్రులకన్నా గొప్పవాడు. మనల్ని రక్షించిన దేవుడు. ఆయన్ను స్వీకరించుటకు పవిత్రత కావాలి. మనం పాపమును విడిచిపెట్టి, మారుమనస్సు పొంది దేవుడిని మనలోకి ఆహ్వానించాలి.

Rev. Fr. BalaYesu OCD 

క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము(3)

క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము

ఆది 14:18-20
1 కొరింతి 11: 23-26
లూకా  9: 11-17

 క్రీస్తు నాధుని యందు ప్రియ సహోదరి సహోదరులారా! ఈనాడు తల్లి శ్రీసభ 'దివ్యసత్ప్రసాద మహోత్సవం లేదా క్రీస్తు శరీర రక్తముల మహోత్సవాన్ని  కొనియాడుచున్నది. దివ్యసత్ప్రసాదం యేసుక్రీస్తు ప్రభువు మానవాళికి అనుగ్రహించిన ఒక గొప్ప వరం. ఎందుకనగా, దివ్యసత్ప్రసాదం రూపంలో ఆయన ఎల్లప్పుడూ మనతో వాసం చేస్తున్నారు, మనలోకి వేంచేస్తున్నారు.  ఏడు దివ్య సంస్కారాలలో  దివ్య సత్ప్రసాదానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది . 

దివ్య సత్ప్రసాదం  ద్వారా ప్రతి దివ్య సంస్కారము సంపూర్ణమవుతున్నది. అటువంటి క్రిస్తునాధుని శరీర రక్తముల మహోత్సవాన్ని కొనియాడే గొప్ప ఆశీర్వాదం ఈనాడు తల్లి శ్రీసభ మనందరికీ ఒసగుచున్నది.
ఈ పండుగను శ్రీసభ ప్రారంభం నుండి జరుపుకునేవారము కాదు. ఈ పండుగ  13 వ శతాబ్దంలో ప్రారంభమైనది.

పండుగ ప్రారంభం: బెల్జియం దేశం లియోజపురం నివాసియైన జులియాన  అనే కన్యాస్త్రికి తరచుగా ఒక దృశ్యం కనిపిస్తూ ఉండేది. ఆ దృశ్యంలో ఆమె ధగధగమెరుస్తున్న చంద్రుని, దానిలో ఒక మచ్చను చూస్తుండేది.  అది ఒక అద్భుతమని తెలుసుకున్న ఆమె దానిగురించి ఇతరులకు చెప్పడానికి భయపడేది. ఎందుకనగా ఆ దృశ్యం భావమేమిటో ఆమెకు తెలియదు కాబట్టి దాని గురించి ఇతరులకు ఎలా చెప్పాలో ఆమెకు తెలిసేది కాదు. ఆ దృశ్యం భావం తెలియజేయమని ఉపవాసాలతో దేవునికి దీర్ఘ ప్రార్ధనలు చేసేవారు. తన ప్రార్ధనలు ఆలకించిన యేసు ప్రభువు ఆ దృశ్యం భావాన్ని ఆమెకు అర్ధమయ్యేలా చేశారు. అలా ఆమె ఆ దృశ్యం భావాన్ని గ్రహించగలిగింది. ఆ దృశ్యం భావమేమనగా చంద్రుడు శ్రీసభ కాగా, దివ్య సత్ప్రసాద గౌరవార్ధం ప్రత్యేక ఉత్సవం లేని కొరతే ఆ చంద్రునిలో మచ్చ. 

ఆ ఉత్సవం ఏర్పాటు చేయ తోడ్పడాల్సిందిగా తనను ప్రభువు ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఆమె గ్రహించింది. తాను ఒక సాధారణ కన్యాస్త్రి కనుక ఆ ఉత్సవం ఎలా ఏర్పాటు చేయించాలో తనకు అర్ధమయ్యేది కాదు. ఇలా తనలో తాను సతమతమవుతుండగా శ్రీసభ పెద్దలను ఆశ్రయించమని దేవుడు ఆమెకు ప్రేరేపణ కలిపించాడు. ముందుగా ఆమె ఈ దృశ్యం గురించి కొంతమంది భక్తులకు, ముఖ్యమైన గురువులకు తెలియజేశారు. వారందరు లియోజపురం పీఠాధిపతిని కలిసి విషయం తెలియజేసి, తమ మేత్రాసనంలో దివ్య సత్ప్రసాద ఉత్సవం ఏర్పాటు చేయాల్సిందిగా పీఠాధిపతిని అభ్యర్ధించారు. తత్ఫలితంగా రోబర్టో పీఠాధిపతులు 1246 సంవత్సరంలో తమ గురువులకు అధికార పూర్వకమైన ఉత్తరువులు పంపి ఈ ఉత్సవాన్ని స్థాపించాలని ఆదేశించారు. అలా ఆ మేత్రాసనంలో ఆ ఉత్సవం ప్రారంభమైనందున ప్రజలు ఉత్సవం ద్వారా దివ్య సత్ప్రసాదం ప్రాముఖ్యతను గ్రహించారు. అది చూసిన ఇతర పీఠాధిపతులు తమ  మేత్రాసనాల్లో కూడా ఈ  పండుగను ప్రారంభించారు.  తరువాత ఈ ఉత్సవం మెల్లగా మెల్లగా ఇతర దేశాలకు విస్తరించింది. చివరికి 1264 సంవత్సరంలో మూడవ ఉర్బను పోపుగారు ఈ ఉత్సవాన్ని శ్రీసభ అంతటా జరపాలని ఆదేశించారు. అలా ఈ  ఉత్సవం క్రైస్తవులలో యేసుక్రీస్తు దివ్య శరీర రక్తల పట్ల గౌరవం, భక్తిని పెంపొందించింది.

ఈ  విధంగా ఆనాడు ఈ  ఉత్సవం ఒక్క మేత్రాసనంలో మొదలై ఈనాడు ప్రపంచమందంతటా క్రైస్తవులు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా జర్మనీ దేశస్థులు ఈ  ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుకుంటారు.  

పరిశుద్ధ గ్రంధంలో మొదటి మూడు సువిశేషములలో యేసుప్రభువు కడరా భోజనం రోజున దివ్య సత్ప్రసాదాన్ని  స్థాపిస్తూ తన శరీర రక్తములను మనకు ప్రసాదించినటువంటి ఒక గొప్ప కార్యాన్ని మనం చూస్తున్నాం. "యేసు రొట్టెనందుకొని, ఆశీర్వదించి, త్రుంచి శిష్యులకు ఇచ్చుచు 'మీరందరు దీనిని తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము' అనెను. తరువాత పాత్రమునందుకొని, కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చుచు, 'దీనిని మీరు పానము చేయుడు. ఇది అనేకుల పాపపరిహారమై చిందబడనున్న నా రక్తము. దీనిని నా జ్ఞాపకార్ధము చేయుడు' అనెను" (మత్తయి 26: 26-29, మార్కు 14: 22-25,  లూకా  22: 17-20) అని మనం పవిత్రగ్రంథంలో యేసుప్రభువు పలికిన మాటలను వింటున్నాం.  ఈనాడు ఆ యేసుక్రీస్తుని శరీర రక్తములను ఏ విధంగా స్వీకరిస్తున్నాం? యోగ్యముగా స్వీకరిస్తున్నామా లేక అయోగ్యముగా స్వీకరిస్తున్నామా ? యోగ్యముగా స్వీకరించడమంటే మన స్వీకరించబోయేది కేవలం అప్పద్రాక్ష రసములు కాదు నిజమైన ప్రభుని శరీర రక్తములనే మనం స్వీకరిస్తున్నాం అని నిండు విశ్వాసం కలిగియుండి, అలా స్వీకరించుటకు కావలసిన పరిశుద్ధతను కలిగియుండడమే. 

ఈరోజు అటువంటి నిండు విశ్వాసంతో, గొప్ప పరిశుద్ధతతో ఆ ప్రభుని మనం స్వీకరిస్తున్నామా? 

ఎందుకు విశ్వాసం, పరిశుద్ధత కలిగియుండాలి? 

     "విశ్వాసంపై ఆధారపడనిది ఏదైనా పాపమే" (రోమా 14 : 23 ) అని పునీత పౌలు గారు అంటున్నారు. అనగా ప్రభుని శరీర రక్తములను విశ్వాసంతో స్వీకరించకపోతే అది పాపమే అంటున్నారు పౌలుగారు. అదేవిధంగా "పరిశుద్ధ జీవితమును గడుపుటకై ప్రయత్నించండి. ఏలయన, అది లేకుండా ఎవరును ప్రభువును చేరలేరు" (హెబ్రీ 12 : 14 ) అని  హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ మనకు తెలియజేస్తుంది.  అనగా పరిశుద్ధత అనేది ప్రభువుని చేరడానికి మనకు  ఉన్న ఒక ముఖ్యమైన మార్గమని పవిత్రగ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా! ప్రభుని స్వీకరించాలి అంటే విశ్వాసం, పరిశుద్ధత అనేవి మనకు చాలు ముఖ్యం.

 యోగ్యతతో ప్రభువుని శరీర రక్తాలను స్వీకరిస్తే:

యేసుక్రీస్తు ప్రభువుని మనం నిండు విశ్వాసంతో, సంపూర్ణ పరిశుద్ధతో స్వీకరిస్తే ఈనాడు ప్రభువు మనకు మూడు గొప్ప అనుగ్రహాలను దయచేస్తున్నారు. 

1. నిత్య జీవం, అంతిమ దినమున లేపబడతాము:

ఈనాటి సమాజంలో నిత్యజీవము లేదా శాశ్వత జీవం అనగానే అనేకమంది ఈలోక సంబంధమైన వస్తువులలో వెతుకుతూ ఉంటారు. ఏదైనా సరే క్షణాల్లో వచ్చేయాలి అనుకుంటాం.  కానీ ఈనాడు ప్రభువు మనకు జీవాన్ని పొందడానికి ఉన్న అసలైన మార్గాన్ని తెలియజేస్తున్నారు.  "నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నిత్యజీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును" (యోహాను 6 : 54 ) అని ప్రభువు సెలవిస్తున్నారు. ఆయన శరీర రక్తములను యోగ్యముగా స్వీకరించుట వలన మనం నిత్య జీవాన్ని పొందడమే కాకుండా అంతిమ దినమున ఆయన చేత లేపబడతాము. ఆయన శరీర రక్తముల ద్వారా నిత్యజీవాన్ని పొందే గొప్ప అనుగ్రహం కథోలిక విశ్వాసులమైన మనకు దయచేయడం మన అదృష్టంగా భావించాలి.

2. ప్రభువు మనయందు, మనం ప్రభుని యందు ఉంటాము:

ప్రభువు తన శరీర రక్తముల ద్వారా మనకు ఇస్తున్న మరొక గొప్ప వరం మన ప్రభునియందును, ప్రభువు మనయందును జీవిస్తారు. "నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వాని యందును ఉందును" (యోహాను 6 : 56 ) అని ప్రభువు పలుకుచున్నారు. పరిశుద్ధుడు, కరుణామయుడైన ఆ ప్రభువు మనలోనూ, మన కుటుంబములలోను, మన సంఘములోను జీవించాలన్నా, మనం ప్రభుని తిరుహృదయములోను, క్రీస్తు సంఘములో నిజమైన క్రైస్తవ బిడ్డలుగా జీవించాలన్నా ఆ ప్రభువుని యొక్క శరీర రక్తములు మనకు ఆ అనుగ్రహాన్ని దయచేస్తాయి. కనుక యోగ్యముగా ప్రభువుని స్వీకరిస్తూ ఆ ప్రభుని మన హృదయాలలోనికి, మన కుటుంబాలలోని, మన సంఘాలలోనికి ఆహ్వానించుదాం.

3. ప్రభువుని మూలమున ఎల్లప్పుడూ, నిరంతరం జీవిస్తాము:

ప్రభువు తన శరీర రక్తముల ద్వారా మనకు అనుగ్రహిస్తున్న మరొక గొప్ప వరం ఆయన మూలమున జీవించడం. మనం అనేకమార్లు మనకు వున్నా ధనాన్ని, ఆస్తిపాస్తులను, కండబలాన్ని, సమాజంలో మనకున్న పలుకుబడిని చూసుకొని విర్రవీగుతుండవచ్చు. వీటి మూలమున మనం సంతోషంగా, ఆనందంగా జీవించవచ్చు, ఇంకేమి అవసరం లేదు అనుకుంటుంటాం కానీ ప్రభువు ఇవన్నీ అశాశ్వతమైనవని మనకు తెలియజేస్తున్నారు. "పరలోకమునుండి దిగివచ్చిన జీవముగల ఆహారమును నేనే. నన్ను భుజించువాడు నా మూలమున జీవించును, నన్ను భుజించువాడు ఎల్లప్పుడును, నిరంతరము జీవించును" (యోహాను 6 : 51 , 57 - 58 ) అని ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. కనుక మన జీవితం ఈలోక  సంపదలు, ఈలోక వస్తువుల మూలమున కాకుండా జీవమునిచ్చు ఆ యేసుక్రీస్తుని మూలమున జీవించాలి. ఆ విధముగా జీవించాలి అంటే ఆయన శరీర రక్తములను మనం యోగ్యముగా స్వీకరించాలి.

ఒకవేళ అయోగ్యముగా ప్రభువుని స్వీకరిస్తే ఏమౌతుంది?

విశ్వాసంతో, పరిశుద్ధతో ప్రభువుని స్వీకరిస్తే ఆయన అనుగ్రహాలు పొందినట్లే, అవిశ్వాసంతో, అపరిశుద్ధతతో ప్రభువుని స్వీకరిస్తే మనం జీవితంలో ఏం జరుగుతుంది?

1. పాపం చేసినట్లే:

విశ్వాసము, పరిశుద్ధ లేకుండా ఎవరైనా అయోగ్యముగా ప్రభువుని స్వీకరిస్తే మనం పాపం చేయుచున్నట్లే అని పవిత్రగ్రంథం తెలియజేస్తుంది. "అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను ఎవడైనా తినినను, లేక ఆయన పాత్రనుండి త్రాగినను అతడు ప్రభుని శరీరమునకు, రక్తమునకు వ్యతిరేకముగా పాపం చేయుచున్నాడు" (1 కొరింతి 11 : 27 ) అని పునీత పౌలు గారు చాలా స్పష్టముగా మనకు తెలియజేస్తున్నారు. కనుక ప్రభుని శరీర రక్తములను స్వీకరించు ప్రతిసారి ప్రతిఒక్కరు వారు యోగ్యముగా ఆయనను స్వీకరిస్తున్నారు లేదా అని ఆత్మ పరిశీలన చేసుకొని ఆయనను స్వీకరించాలి.

2. తీర్పునకు గురియవుతాము:

అయోగ్యముగా ప్రభువుని స్వీకరిస్తే, స్వీకరించేది ప్రభుని నిజమైన శరీర రక్తములు అని గుర్తింపనిచో తీర్పుకు గురియవుతామని పునీత పౌలు గారు సెలవిస్తున్నారు. "ఎవడైనను రొట్టెను తినుచు, పాత్రనుండి త్రాగుచు అది ప్రభుని  శరీర రక్తములని గుర్తింపనిచో, అతడు తినుటవలనను, త్రాగుటవలనను తీర్పునకు గురియగును" (1 కొరింతి 11:29 ) అని పరిశుద్ధగ్రంధం పలుకుచున్నది. కనుక మనము స్వీకరించేవి యేసుక్రీస్తుని నిజమైనటువంటి శరీర రక్తములు అని గుర్తించి, యోగ్యముగా స్వీకరించినట్లైతే  రానున్న తీర్పునుండి మనము తప్పించుకోగలము. 

మనం ఎల్లప్పుడూ ప్రభువు సువిశేషంలో పలికిన మాటలను గుర్తుంచుకోవాలి. "నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు. నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు" (యోహాను 6 : 35 ).కనుక ఎల్లప్పుడూ పరిశుద్ధతతో ప్రభుని శరీర రక్తములయందు నిండు విశ్వాసం కలిగి   యోగ్యముగా ప్రభువుని స్వీకరించడానికి ప్రయత్నించాలి. ఆ ప్రభువుని యోగ్యముగా స్వీకరించడంతో క్రైస్తవుల పని అయిపోవడం లేదు. ప్రభుని యోగ్యముగా స్వీకరించిన పిమ్మట ఆయన మనకు ఒక కర్తవ్యాన్ని, భాధ్యతను ఇస్తున్నారు. "ఈ రొట్టెను భుజించునప్పుడెల్ల, ఈ పాత్రనుండి పానము చేయునప్పుడెల్ల ప్రభువు వచ్చు వరుకు ఆయన మరణమును ప్రకటించాలి" (1 కొరింతి 11:26 ). ప్రభువుని స్వీకరించిన పిమ్మట ఆయన మరల వచ్చువరకు ఆయన మరణమును ప్రపంచ నలుమూలల ప్రకటించడం ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క బాధ్యత. 

కనుక క్రిస్తునాధుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా! ప్రభుని ఎల్లప్పుడూ నిండు విశ్వాసంతో, సంపూర్ణ పరిశుద్ధతో యోగ్యముగా స్వీకరించి ఆ ప్రభువు ఒసగే గొప్ప వరములను పొందే అనుగ్రహమును దయచేయమని ఈనాటి దివ్యబలి పూజలో ఆ  క్రిస్తునాధుని వేడుకుందాము.

 By Br. Joseph Kampally OCD

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...