26, ఫిబ్రవరి 2026, గురువారం

హెరోదు పదవి కాంక్ష - పసిబిడ్డల హత్యలు

 హెరోదు పదవి కాంక్ష - పసిబిడ్డల హత్యలు 

మత్తయి 2:13-18 

వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత  యోసేపునకు కలలో కనిపించి, "శిశువును చంపుటకు హెరోదు వెదకబోవుచున్నాడు. కావున నీవు లేచి, బిడ్డను తల్లిని తీసుకొని, ఐగుప్తునకు పారిపోయి, నేను చెప్పు వరకు అచటనేయుండుము" అని  ఆదేశించెను. అంతట యేసేపులేచి, ఆ బిడ్డను, తల్లిని తీసుకొని, ఆ రాత్రియందు ఐగుప్తునకు వెళ్ళి, హెరోదు మరణించునంత వరకు అచటనే  ఉండెను. " ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని" అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. ఆ జ్ఞానులు  తనను మోసగించిరని హెరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాలమును బట్టి బెత్లెహామందును, ఆ పరిసరములందును ఉన్న రెండేండ్లును, అంతకంటే తక్కువ ప్రాయముగల మగశిశువులందరిని చంపుడని అతను ఆజ్ఞాపించెను.  

ధ్యానము: "ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి శిశువునకు చంపుటకు హెరోదు వేదకబోవుచున్నాడు" అని చెప్పాడు.  ఎందుకు హెరోదు యేసు ప్రభువును చంపుటకు  వేదకబోవుచున్నాడు? హెరోదు రాజుతొ  తూర్పునుండి వచ్చిన జ్ఞానులు, యూదుల రాజుగా  పుట్టిన శిశువు నక్షత్రం  చూచి, ఆయనను మేము  ఆరాధించుటకు వచ్చాము, ఆయన ఎక్కడ జన్మించారు అని  వారు  అడిగారు. హెరోదు రాజు తన అధికార వ్యామోహం కలిగినవాడు. తన సొంత కుమారులను కూడా అధికారం కోసం చంపించినవాడు, అందుకే ఆరోజులలో హెరోదు కుమారునిగా కంటే హెరోదు దొడ్డిలో పందిగా పుట్టటం మేలు అనే నానుడి ఉండేది.  తన అధికారమునకు అడ్డుగా ఎవరు వచ్చిన, దానిని సహించని వ్యక్తి హెరోదు. మరియొక రాజు పుట్టాడు అని తెలువగానే ఆ శిశువును, ఎలా అయిన చంపాలి అనే ఆలోచన హెరోదుకు వస్తుంది. మనుషుల అంతరంగాలు పూర్తిగా తెలిసిన దేవుడు హెరోదు చేయబోయే ఘోరాన్ని యోసేపుకు తెలియజేసాడు.

 "నీవు లేచి, బిడ్డను తల్లిని తీసుకొని, ఐగుప్తునకు పారిపోయి, నేను చెప్పు వరకు అచటనేయుండుము" అని యోసేపును దేవదూత   ఆదేశించెను. "అంతట యేసేపులేచి, ఆ బిడ్డను, తల్లిని తీసుకొని, ఆ రాత్రియందు ఐగుప్తునకు వెళ్ళి, హెరోదు మరణించునంత వరకు అచటనే  ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని" అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. ప్రభువు దూత చెప్పినట్లుగా యోసేపు మరియమ్మను, బాల యేసును తీసుకొని ఐగుప్తుకు వెళుతున్నారు.  హెరోదు మరణించినంతవరకు పవిత్ర కుటుంబం  ఐగుప్తు లోనే ఉంటుంది.  ఈ ఇద్దరు కూడా తమ బిడ్డ కోసము పడిన కష్టం చాలా గొప్పది. వీరు ఇద్దరు కూడా తమ కుమారుని కొరకు జీవిస్తున్నారు. మనతో పాటు ఉన్న వారు అపాయములో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలో వీరు చెబుతున్నారు. దేవుడు ఎందుకు ఐగుప్తుకు వెళ్ళమని చెబుతున్నారు? కారణం ఏమి అయి ఉండవచ్చు అంటే, ఐగుప్తు  హెరోదు పరిదిలో లేదు,  అక్కడ చాలా మంది యూదులు ఉన్నారు. మరల  హొషయ ప్రవక్త చెబుతున్నట్లుగా నేను నా కుమారున్నీ ఐగుప్తు నుండి పిలిచాను అనే ప్రవచనం వెరవేరుతుంది. 

యేసు ప్రభువును హెరోదు చంపించలేకపోయాడు. కాని తన అధికారమునకు ఎవరు ఆటంకంగా ఉండకూడదు అనుకునే హెరోదు, ఆ శిశువును ఎలాగైన చంపాలి అని బేత్లెహేము మరియు ఆ పరిసర ప్రాంతములో ఉన్న రెండేండ్లు మరియు అంతకంటే తక్కువ వయసు ఉన్న చిన్న బిడ్డలను చంపిస్తున్నాడు. ఎవరు ఈ చిన్న బిడ్డలు ? ఈ చిన్న బిడ్డలు అందరు కూడా ఎవరు కాపాడుటకు లేనివారు, ఏ మాలిన్యం లేని వారు. పవిత్రంగా ఉన్నవారు. యోసేపు, మరియమ్మ లాంటి వారు తోడు లేని వారు.

 అంతమంది చిన్న బిడ్డలను హెరోదు చంపనవసరం లేదు. కాని పదవి వ్యామోహం, అధికార దాహం అనేవి  మనలను ఎటువంటి హత్యలను, ఘోరాలను కూడా చేయుటకు ప్రేరేపిస్తుంది. వివేకము కోల్పోయేవిధంగా చేస్తుంది. ఆ చిన్న బిడ్డలు పెరిగి, అధికారానికి  రావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది, అంత కాలం హెరోదు బ్రతకడు అనే విషయం కూడా ఆలోచించలేక పోయాడు. మన ఆలోచనలను కూడా అధికారం వ్యామోహం చంపివేస్తుంది. 

 "రామాయందు ఒక ఆర్తనాదము వినపడెను. అది ఒక మహారోదనము. రాహెలు తన బిడ్డలకొరకై విలపించుచుండెను. వారి మరణము వలన కలిగిన దుఃఖము నుండి ఆమె ఓదార్పు పొందకుండెను" అని యిర్మీయా ప్రవక్త పలికిన వాక్కు నెరవేరెను." ఎందుకు రాహెలు ఏడుస్తుంది అంటే,  రాయహేలును యాకోబు ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. తన అక్కకు పిల్లలు పుట్టారు. పిల్లలు లేరు అనే బాధను ఆమె చాలా ఎక్కువగా పొందింది. పిల్లల కోసం చాల ఆశ పడింది.  ఆమె చనిపోయిన తరువాత రామా వద్ద సమాది చేశారు. ఇంత మంది చిన్న బిడ్డలను చంపినప్పుడు ఆ తల్లి బిడ్డలకోసము విలపిస్తుంది.ఆమెనుఓదార్చుటఅలవికానటువంటిది. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా!  మీరు జన్మించినప్పుడు ఎంతో ఆనందపడిన యోసేపు, మరియ తల్లి మిమ్ములను అధికార దాహం, పదవి కాంక్ష కలిగిన వారి నుండి కాపాడుటకు ఎంతో కష్టపడ్డారు. మీరు మీ పరిచర్య మొదలు పెట్టిన తరువాత కూడా ఇటువంటి ఆలోచనలు ఉన్న వారు, మిమ్ములను అనేక విధాలుగా కష్ట పెట్టుటకు ప్రయత్నించారు. ప్రభువా! మేము కూడా కొన్ని పర్యాయాలు ఇటువంటి పదవి, అధికారం వంటి కోరికలకు, ఆశలకు లోనవుతాము. అటువంటి సమయాలలో నిజమైన జ్ఞానంతో ప్రవర్తిస్తూ, మిమ్ములను అనుసరించెలా చేయండి. యోసేపు మరియతల్లి మిమ్ములను కాపాడినట్లు  ఇటువంటి అపాయములకు లోనయె వారికి సహాయం చేసేలా మమ్ము దీవించండి. చనిపోయిన చిన్న బిడ్డలలో, వారి ఆలోచనలలోకాని, మాటల్లో కాని, పనులలో కాని ఎటువంటి చెడు లేకుండా, నిర్మలముగా ఉన్నారో అటువంటి మనసును మాకు దయచేయండి. అటువంటి బిడ్డలను రక్షించు అవకాశము మాకు అనుగ్రహించండి. ఆమెన్ 

యేసు ప్రభువును దేవాలయంలో ఆర్పించుట

 యేసు ప్రభువును దేవాలయంలో ఆర్పించుట 

 లూకా 2: 22-35 

మోషే చట్ట ప్రకారము వారు శుద్దిగావించు కొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలి చూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభువు ధర్మ శాస్త్రములో వ్రాయబడియున్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరుషలేమునకు తీసికొనిపోయిరి. చట్టప్రకారము "ఒక జత గువ్వాలనైనను, రెండు పావురముల పిల్లలనైనను" బలిసమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. యొరుషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు, దైవభక్తుడు  ఉండెను. అతడు యిస్రాయేలు ఓదార్పుకై  నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుడెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచువరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అపుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచారవిధులు నిర్వర్తించుటకు బాల యేసును లోనికి తీసుకొనిరాగా, సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను: "ప్రభూ! నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధనముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారగాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు; నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు."  బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు, తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి, ఆ బిడ్డ తల్లి మరియమ్మతో  ఇట్లనెను: "ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్దరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడియున్నాడు. అనేకుల మనోగతభావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొనిపోనున్నది. 

నిర్గమ ఖాండం 13 వ అధ్యాయంలో తొలిచూలు పుట్టిన కుమారుడు దేవునకి చెందిన వాడు. మొదట పుట్టిన కుమారుడు దేవాలయంలో సేవ చేయాలని నియమం ఉన్నది. కనుక ఆ బిడ్డను దేవునికి అంకితము  చేయడానికి దేవాలయమునకు  తీసుకొని వస్తారు. తరువాత ఆ బిడ్డకు బదులుగా సుమారు 5 తులముల వెండిని చెల్లించి ఆ బిడ్డను తీసుకొని వెల్లవారు సంఖ్యా 3:11-13. కుమారుడు  పుట్టిన తరువాత తల్లిదండ్రులు శుద్దికరణ నిమిత్తమైన లెవీయ ఖాండం 12:3-8  ప్రకారం వారు ఒక గువ్వను కాని దహన బలిగా ఒక గొర్రెను కాని అర్పించవలసినది. పేదవారు, అవి అర్పించలేనివారు రెండు గువ్వలను అర్పించాలి. అందుకే యేసేపు మరియమ్మలు రెండు గువ్వలను అర్పిస్తున్నారు. మరియమ్మ యోసేపులు పేదవారు అయినప్పటికీ దైవ భక్తి యందు వారు గొప్పవారు అందుకే దేవాలయమునకు వచ్చి ఇవి అన్నియు వారు  చేస్తున్నారు. యిస్రాయేలు చట్ట ప్రకారం  40 రోజులకు  శుద్దికరణ జరుగుతుంది.  మరియ మాత  యోసేపులు తమ తొలిచూలు బిడ్డను దేవాలయములో  దేవుని సేవకు అర్పించడానికి తీసుకొని వెళుతున్నారు. వారు దేవలయంలో ఉండగా పవిత్రాత్మ ప్రేరణతో  సిమియోను ప్రవక్త వారిని చూస్తున్నారు. సిమియోనుతో దేవుడు మెస్సీయ్యా గురించి అంతకు ముందుగానే మాటలడాడు. రానున్న మెస్సీయ్యా గురించి సిమియోను ఎదురుచూస్తున్నాడు. యేసు ప్రభువు దేవాలయం లోనికి రాగానే సిమియోను అక్కడకు వస్తున్నాడు.  

సిమియోను జీవితం 

సిమియోను అంటే వినుట అని అర్ధం. సిమియోను దేవుని మాటను విని ఆయన మాట ప్రకారం జీవించే వ్యక్తి. తన జీవితం మొత్తం మెస్సీయ్యా గురించి ఎదురుచూస్తున్న వ్యక్తి.రక్షకుని  చూచి మరణించాలని కోరుకున్న వ్యక్తి. సిమియోను నీతిమంతుడు అనే విషయం దేవుని వాక్కు ద్వారా తెలుస్తుంది. నీతిమంతుడు అంటే దేవుని చట్టమును తప్పక పాటించేవాడు. యోసేపును కూడా పవిత్ర గ్రంధం నీతిమంతుడు అని చెబుతుంది. యేసు ప్రభువును చూచి తండ్రితో తనను ఇక నిష్క్రమింపమనీ చెబుతున్నాడు. తాను చూడాలనుకున్న రక్షకుని చూసి తృప్తి పొందుతున్నాడు. 

దేవాలయములోనికి తీసుకొని వచ్చిన యేసు ప్రభువును  సిమియోను తన   హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను: "ప్రభూ! నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధనముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారగాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు; నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు." యేసు ప్రభువు గురించి సిమియోను మాటలాడిన మాటలు ముఖ్యముగా "దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ"  అనే ఈ మాట చాలా ముఖ్యమైనది. యేసు ప్రభువు అందరికీ రక్షకుడు. యేసు ప్రభువు చేసిన పనులు చూసి ఈ మాట సిమియోను అనుట లేదు. పవిత్రాత్మ ప్రేరణతో బాల  యేసును తన చేతులలోనికి తీసుకొని అంటున్నాడు.  ప్రభువు అన్యులకు వెలుగుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు యేసు ప్రభువు దగ్గరకు వచ్చినట్లయితే వారు వెలుగును చూస్తారు. వెలుగును చూచుట అంటే వారి జీవితమును తెలుసుకోవడం.  ఎటువంటి జీవితం జీవిస్తున్నది తెలుసుకోవడం. యేసు ప్రభువు వద్దకు వచ్చుట ద్వారా మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము అని తెలుసుకుంటాము. యేసు ప్రభువు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు ఎందుకంటే దేవునికి దూరముగా ఉండి వారి మహిమను కోల్పోయారు, యేసు ప్రభువు ద్వారా యిస్రాయేలు మరల మహిమను పొందుతుంది. 

ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్దరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడియున్నాడు. అనేకుల మనోగతభావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొనిపోనున్నది. యేసు ప్రభువు గురించి సిమియోను పలికిన ఈ మాటలు మొత్తం కూడా వేరుతున్నాయి. ఆయన అనేకుల ఉద్దరింపునకు కారణం అయివున్నాడు. ఆయనను అందరు అంగీకరించలేదు. అనేకుల మనోగతలను ఆయన బయలుపరిచాడు. ఎవరు ఎటువంటి వారు అనే విషయాలు ప్రభువు తెలియజేస్తున్నాడు. అంతేకాక అనేక గొప్ప కార్యలు చేసిన ప్రభువును తన తల్లి అందరు విడచివెళ్ళడం చూస్తుంది. సిలువ వేయడం, ఈటెతో పొడవడం, మరణించిడం చూస్తుంది. అందుకే నీ హృదయము నందు ఒక ఖడ్గం దూసుకొనిపోతుంది అని సిమియోను  చెబుతున్నారు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా! మిమ్ములను దేవాలయంలో మిమ్ము అంకితం చేసినప్పుడు సిమియోను ప్రవక్త మీ నిజ రూపాన్ని తెలియజేస్తున్నాడు. మీరు ఈ లోక రక్షణ అని మేము తెలుసుకుంటున్నాము. మీఋ అన్యులకు వెలుగు అని తెలుసుకుంటున్నాము. మీరు వెలుగు అని  మాకు మార్గదర్శి అని తెలుసుకొని వెళ్లప్పుడు మీ దగ్గర వుండి మీ వెలుగులో మమ్ములను మేము తెలుసుకొని, ఎప్పుడు ఆ వెలుగులో జీవించేలా చేయండి. ప్రభువా అనేక మంది ప్రజలు  ఉన్నప్పటికీ సిమియోనికి మాత్రమె  మిమ్ములను చూచి మీరే రక్షకుడు అని ప్రకటిస్తున్నారు. ఆయన భక్తి, నీతిమంతమైన జీవితం, పవిత్రాత్మ ప్రేరణ మిమ్ములను మీరు రక్షకుడు అని తెలుసుకొనుటకు ఉపయోగపడుతున్నవి. ప్రభువా ! మేము కూడా భక్తి వంతమైన జీవితం , నీతివంతమైన జీవితం జీవించేలా మీ అనుగ్రహం దయచెయండి. సిమియోను వలె మాకు కూడా మీ పవిత్రాత్మ అనుగ్రహాలు దయచేయండి. ఆమెన్. 

దేవుని సన్నిదిలో జీవించే వారి జ్ఞానం

 దేవుని సన్నిదిలో జీవించే వారి జ్ఞానం 

లూకా 2:36-40 

అపుడు అచట అన్నమ్మయనెడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనూయేలు పుత్రిక. ఆమె కడువృద్ధురాలు. వివాహమైన పిదప ఏడు సంవత్సరాలు సంసారము చేసి, ఆ తరువాత ఎనుబదినాలుగు సంవత్సరాలుగా  విధవరాలై దేవాలయముచెంతనే ఉండిపోయను. ఉపవాసములు, ప్రార్ధనలు చేయుచు, రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగియుండెను. ఆమె  ఆక్షణముననే దేవాలయమునకు వచ్చి, దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరుషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభువు అజ్ఞానుసారము అన్ని విధులు  నెరవేర్చి, గలిలీయప్రాంతములోని  తమ పట్టణమగు నజరేతునకు తిరిగివచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై, పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహము ఆయనపై  ఉండెను. 

ధ్యానం: అన్నమ్మ ఒక ప్రవక్తి , తన జీవితంలో ఎక్కువ సంవత్సరాలు ఆమె విధవరాలుగా, దేవలయంలోనే ఉన్నది. ఆమె ఫనుయేలు కుమార్తె అని చదువుతున్నాము.  అంటే తన భర్త పేరు కాకుండా తండ్రి పేరుతో ఆమెను పరిచయం చేస్తున్నారు అంటే ఆమె భర్త కన్నా ఆమె తండ్రి ఎక్కువ కాలం బ్రతికిఉంటాడు. ఆ రోజులలో యుక్త వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకునేవారు కనుక ఆమె 15 సంవత్సరాల ప్రాయంలో పెళ్లి చేసుకొని వుండవచ్చు. ఆమెకు పెళ్లయిన ఏడుసంవత్సరాలకు ఆమె భర్త చనిపోయాడు. అంటే రెండు పదుల వయసులోనే ఆమె విధవరాలుగా మారింది. సుమారు 84 సంవత్సరాలు ఆమె విధవరాలుగా ఉన్నది. అప్పటి నుండి ఆమె దేవాలయంలోనే, దేవునికి సేవ చేస్తూ ఆమె జీవితాన్ని గడుపుతుంది.  ఆమె గురించి చెప్పిన మాటలు చాలా లోతైన భావాలు కలిగియున్నవి. ఆమె ఆషేరు వంశస్తురాలు. ఆషేరు అంటే భాగ్యం, సంతోషం అని అర్ధము. ఆమె పొందిన భాగ్యం ఏమిటి అంటే దేవుని సన్నిదిలో తన జీవితం మొత్తం కూడా గడపటం. అదే విధంగా ఆమె ఫనుయేలు కుమార్తె ఆదిఖాండంలో ఫేనుయేలు అని ప్రదేశం గురించి మనం వింటాము. పెనుయేలు అంటే దేవుని ముఖము అని అర్ధం. పనుయేలు అనే మాట దైవ సాన్నిద్ధ్యం అనే భావం వుంది. ఆ విధముగా ఆమె దేవుని సాన్నిధ్యంలో అనగా దేవాలయంలో తన జీవితాన్ని మొత్తం కూడా గడిపింది. 

ఆమె దేవాలయమును వదలలేదు, అంటే దేవాలయం తెరచినప్పటి నుండి మూసేవరకు దేవలయంలోనే ఉండేది. పాతనిబంధంలో యేస్సీయ్యా రాజుగా ఉండగా   ప్రవక్తీ గా ఉన్న ఉల్దకు దేవాలయంనే ఒక గదిని ఇవ్వడం జరిగినది. అటులనే అన్నమ్మకు కూడా ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఈమె రేయింబవళ్ళు ప్రార్ధన మరియు  ఉపవాసంతో ఆమె దేవున్ని  స్తుతించుచు బ్రతికినది. ఆమె దేవాలయమునకు వచ్చి దేవునికి వందనములు అర్పించి, యెరుషలెము విముక్తి కోసం ఎదురుచూచుచున్న వారికి యేసు ప్రభువు గురించి ఆమె చెప్పసాగిందంటే, ఎప్పుడు దేవాలయ పరిసరాలలోనే ఉండేది.  https://www.daivavaakkudhyaanam.com/2023/12/blog-post_29.html

ఆమె  ఆక్షణముననే దేవాలయమునకు వచ్చి, దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరుషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. యెరుషలెము విముక్తికై నిరీక్షించు వారు ఎవరు? ప్రార్ధనలు, ఉపవాసాలు చేస్తూ అనేక మంది మెస్సీయ్యా కొరకు నిరక్షించుచున్నారు. మెస్సీయ్యా రాక కోసం ఆనాటి యిస్రాయేలు ప్రజలు చాలామంది నిరీక్షించుచున్నారు. కొంత మంది ఎడారిలో ఉండి, కొంత మంది సమూహాలుగా ఉండి మెస్సీయ్యా కోసం ప్రార్దన, ఉపవాసంతోటి ఎదురుచూస్తున్నారు. వీరు అందరు పవిత్రతతో  ప్రత్యేక విధంగా మెస్సీయ్యా కోసం సిద్దపడుతున్నారు. సాధారణ ప్రజలు కూడా చాలా మంది మెస్సీయ్యా కోసం ఎదురుచూస్తున్నారు. వీరందరకి మరియు యెరుషలెము విముక్తి గురించి ఎదురుచూచే వారికి మరియు రక్షణ కొరకు చూచే వారి అందరికీ కూడా అన్నమ్మ యేసు ప్రభువును గురించి చెబుతున్నది. వారి ఎదురుచూపులకు, వారికి ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారంగా ,  సమాధనముగా దేవుడు ఇచ్చిన సమాధానం ఈ చిన్న బాలుడే అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. 

వారు ప్రభువు అజ్ఞానుసారము అన్ని విధులు  నెరవేర్చి, గలిలీయప్రాంతములోని  తమ పట్టణమగు నజరేతునకు తిరిగివచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై, పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహము ఆయనపై  ఉండెను. యోసేపు మరియమ్మల విశ్వాస జీవితం ఉన్నతమైనది. వారి జీవితంలో దేవుని ఆజ్ఞలకు ప్రధమ స్థానం వుంది. వారు ఇరువురు కూడా దేవుని చిత్తమును నెరవేర్చడానికి తమ జీవితాలను అంకితం చేసిన వారు. అందుకే వారి విధులను పూర్తిగా నెరవేర్చి తమ పట్టణానికి వెళుతున్నారు.  యేసు ప్రభువు గురించి వారికి తెలిసిన విషయాలు ఎలిశబేతమ్మ, జ్ఞానులు, సిమియోను, అన్నమ్మల నుండి వినినప్పుడు వారికి యేసు ప్రభువు మీద ఇంకా ఎక్కువ మక్కువ కలిగిఉండాలి. యేసు ప్రభువును చిన్నప్పటి నుండి దేవుని యందు, దైవ కార్యములందు నిమగ్నమయేలా వారి జీవితాలు ఉన్నాయి. వీరి పెంపకంలో పెరిగిన యేసు ప్రభువు దృడకాయుడై పరిపూర్ణ  జ్ఞాని అవుతున్నాడు. యేసు ప్రభువు జీవితమే పరిపూర్ణతను పొందుటకు ఆధారము. అటువంటి ప్రభువు పరిపూర్ణ జ్ఞాని అవుట సహజమే. దేవుని అనుగ్రహము ఆయన మీద ఎప్పుడు ఉంటుంది. ఆయనే దేవుడు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్దన: ప్రభువా! మీ సన్నిదిలో ఉన్న అన్నమ్మ అనేక సంవత్సరాలు ప్రార్దనలతో ఉపవాసంతో జీవిస్తున్నారు. మీ సన్నిదిలో నివసించిన వారికి మిమ్ములను తెలుసుకునే భాగ్యమును అనుగ్రహిస్తున్నారు. మిమ్ములను తెలుసుకోవడమే కాకుండా మీగురించి ప్రకటించే అనుగ్రహం ఇస్తున్నారు. ప్రభువా! మేము కూడా ఎల్లప్పుడు మీ సన్నిదిలో నివసించుటకు కావలసిన అనుగ్రహం ఇస్తున్నారు. ప్రభువా! మరియమ్మ యోసేపులు వారి జీవితం మొత్తం మీ చిత్తమును నెరవేర్చడానికి అంకితం చేశారు. ప్రభువా మీ చిత్తము నెరవేర్చుటకు వారు ఎన్నో కష్టాలు అనుభవించిన మీకు దూరంగా ఉండకుండా, మీకు ఎల్లప్పుడు సేవచేయుటకు మీకు దగ్గరగా ఉన్నారు. ప్రభువా మేము కూడా మీ చిత్తం నెరవేర్చుటకు, మా జీవితాలలో మీ పట్ల మేము చేయవలసిన బాధ్యతను నెరవేర్చునట్లు మమ్ము దీవించండి. మీ వలె జ్ఞానమందు ఎదిగే అనుగ్రహం మాకు దయచేయండి. ఆమెన్ 

తిరు కుటుంబ మహోత్సవం

 తిరు కుటుంబ మహోత్సవం

లూకా 2:22-40 

మోషే చట్ట ప్రకారము వారు శుద్దిగావించు కొనవలసిన దినములు వచ్చినవి.  ప్రతి తొలి చూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభువు ధర్మ శాస్త్రములో వ్రాయబడియున్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరుషలేమునకు తీసికొనిపోయిరి. చట్టప్రకారము "ఒక జత గువ్వాలనైనను, రెండు పావురముల పిల్లలనైనను" బలిసమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. యొరుషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు, దైవభక్తుడు  ఉండెను. అతడు యిస్రాయేలు ఓదార్పుకై  నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుడెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచువరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అపుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచారవిధులు నిర్వర్తించుటకు బాల యేసును లోనికి తీసుకొనిరాగా, సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను: "ప్రభూ! నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధనముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారగాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు; నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు."  బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు, తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి, ఆ బిడ్డ తల్లి మరియమ్మతో  ఇట్లనెను: "ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్దరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడియున్నాడు. అనేకుల మనోగతభావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొనిపోనున్నది. అపుడు అచట అన్నమ్మయనెడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనూయేలు పుత్రిక. ఆమె కడువృద్ధురాలు. వివాహమైన పిదప ఏడు సంవత్సరాలు సంసారము చేసి, ఆ తరువాత ఎనుబదినాలుగు సంవత్సరాలుగా  విధవరాలై దేవాలయముచెంతనే ఉండిపోయను. ఉపవాసములు, ప్రార్ధనలు చేయుచు, రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగియుండెను. ఆమె  ఆక్షణముననే దేవాలయమునకు వచ్చి, దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరుషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభువు అజ్ఞానుసారము అన్ని విధులు  నెరవేర్చి, గలిలీయప్రాంతములోని  తమ పట్టణమగు నజరేతునకు తిరిగివచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై, పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహము ఆయనపై  ఉండెను. 

ఈ రోజు పరిశుద్ద కుటుంబ పండుగను జరుపుకుంటున్నాము. కుటుంబమును చిన్న తిరుసభగా మనం గుర్తిస్తాం. ఈనాటి సువిశేషంలో ఒక కుటుంబం ఎలా ఉన్నట్లయితె దేవుని అనుగ్రహములు మనకు వస్తాయో చూస్తాము. నజరేతు చిన్న కుటుంబంద్వార ఇది మనం చూడగలుగుతాము.  ప్రతి మానవ కుటుంబానికి నజరేతు కుటుంబం ఒక ఆదర్శం.  ఈ పవిత్ర కుటుంబ ఐక్యత, పరస్పర ప్రేమ, మరియు వారి కుటుంబ ధ్యేయం, మన చూసినప్పుడు, ఎలా ఈ కుటుంబం మనకు మాతృక అనే విషయం తెలుస్తుంది. 

పవిత్ర కుటుంబం గురించి మనం తెలుసుకునేముందు, మానవ కుటుంబాలలో ఉండ కూడని కొన్ని లక్షణాలు మనం చూద్దాం. అవ్వ, ఆదాముల కుటుంబంలో ఒకరిని ఒకరు ప్రభావితం చేయడానికి ప్రయత్నించుచున్నారు. అవ్వ తన  తప్పులో ఆదామును పాలుపంచుకునేలా ఆయనను ప్రభావితం చేసింది. దాని ద్వారా పాపమును లోకములోనికి వారు తీసుకొని వస్తున్నారు. కయ్యాను తన తమ్ముడు మీద అసూయ పొంధుతున్నాడు. అసూయ తోటి హత్య చేస్తున్నాడు. తన తమ్ముడు, దేవుని మెప్పు పొందుటను ఓర్వ లేకపోతున్నాడు. రెబ్కా తన కుమారులకు చూపిన ప్రేమలో ఉన్న వ్యత్యాసం వలన అన్నదమ్ములు విడిపోవవలసివచ్చింది.  తమ తండ్రి చిన్న వాడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని, ఆ చిన్న వాడినే చంపాలని ఒక ప్రణాళిక ఏసుకుంటున్నారు యాకోబు కుమారులు.  చిన్న వాడి మీద ప్రేమను కూడా ఓర్చుకోలేని భావాలు  మానవునిలో ఉన్నాయి. ,వాయి వరసలు లేని కామం కుటుంబ కీర్తని నాశనం చేస్తుంది. రూబెను అందరికంటే పెద్దవాడు అయినప్పటికీ ఎప్పటికీ ఆ పెద్దరికానికి నోచుకోలేకపోయాడు.  భర్తను అవమానించిన మీకాలు ఎప్పటికీ పిల్లలను కనకుండా ఉండిపోయింది. తండ్రిని అవమానించి, మాట వినని అబ్షలోము మరణాన్ని తెచ్చుకుంటున్నారు. ఇతర కుటుంబాన్ని విచ్ఛిన్న చేసిన దావీదు కుటుంబం చిన్నభిన్నం అవుతుంది. ఒకరి చెడు కోరికలను తీర్చుకోవడానికి ఒకరికొకరు సహకరించుకొవడం, ఒకరిని చేతకాని వారీగా చిత్రీకరిస్తుంది. ఎసెబేలు రాణి అలానే తన భర్తను చేస్తుంది. 

ఇప్పుడు మనం చూసిన ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలు ఒకసారి మనం పరిశీలిస్తే అవి ఏమిటి అంటే, నా మాటే వినాలి అనే మనస్తత్వం. కుటుంబంలో ఒకరి మీద ఒకరికి అసూయ ఉండటం, ఒకరి ఉన్నతిని మరియొకరు ఓర్వలేక పోవడం, తల్లి దండ్రులు చూపే ప్రేమలో వ్యత్యాసాలు చూపించడం, తల్లి దండ్రులను అవమానపరచడం, వావివరసలు లేని కామం కలిగి ఉండటం, భర్త భార్యను, భార్య భర్తను అవమానించడం ఇవి అన్ని కూడా పవిత్ర గ్రంధంలో కొన్ని కుటుంబాలు వాటి గొప్పతనం, వారు సాధించిన ఘనతను కోల్పోవడానికి కారణం అయ్యాయి. వారు పొందవలసిన కీర్తిని వారు పొందలేక పోయారు. ఈ సమస్యలు అన్ని ఆనాటి కుటుంబాలలో మాత్రమే కాదు, ఈనాటి కుటుంబాలలలో కూడా ఉన్న సమస్యలే. అంత మాత్రము చేత ఇవి ఏమి  పరిష్కారం లేని సమస్యలు కాదు. ఈ సమస్యలకు సమాధానాలు ఉన్నట్లయితే అవి ఎక్కడ ఉన్నాయి అని ఆలోచిస్తే మనకు తెలిసేది ఏమిటి అంటే, యేసుప్రభువు మరియమ్మ, యేసేపుల నజరేతు కుటుంబం. 

ఎందుకు మన కుటుంబాలలో ఉన్న ఈ సమస్యలు, ఆ కుటుంబంలో లేవు, దానికి కారణం ఏమిటి అంటే, ఆ కుటుంబములోని వారు అందరు జీవించే విధానం చాల ప్రత్యేకమైనది.వీరు ఒకరికొరకు ఒకరు జీవించారు. యోసేపు మరియమ్మలు యేసు ప్రభువు కోసం జీవించారు. ఒకరి మీద ఒకరికి వారికున్న ప్రేమ గొప్పది.  మొదటిగా యోసేపుగారు ఈయన దేవుని మీద అచంచలమైన భక్తి కలవాడు. దేవున్ని ఎంతగా నమ్ముతాడు అంటే కలలో దేవదూత కనపడి చెప్పిన ప్రతి విషయాన్ని ఎటువంటి అపనమ్మకం  లేకుండా అన్ని పాటించేవాడు. నీతిమంతుడు అయిన యోసేపు ఎటువంటి పరిస్థితిలో కూడా ఇతరులకు ఇబ్బంది కలుగకూడదు అని కోరుకునేవాడు, కనుకనే తన భార్య తన ప్రేమేయం లేకుండా గర్బవతి అయ్యింది అని తెలిసిన కాని ఆమెను అవమానింప ఇష్టపడలేదు. ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న  తన కుటుంబాన్ని కాపాడుటకు అన్ని ప్రయత్నాలు చేశాడు. తన కుటుంబాన్ని కాపాడాడు. తండ్రిగా తన ప్రతి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఎప్పుడు, ఎటువంటి అలసటను వ్యక్త పరచలేదు. దేవుని ప్రణాళిక నెరవేర్చడమే తన ధ్యేయంగా జీవించాడు. 

మరియమాత జీవితం  ప్రతి కుటుంబానికి ఆదర్శం. తన జీవితం మొత్తం కూడా తన కుమారుని కోసం జీవిస్తున్నారు.  చిన్నప్పటి నుండి వారు బాలయేసుకు కావలసిన ప్రతి దానిని చేకూర్చడమే కాకుండా, బాల యేసును చిన్నప్పటినుండి దేవుని ప్రణాళికకు అనుకూలంగా వారు పెంచుతున్నారు. ఆమె జీవితంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ఎవరైన ఆపదలో ఉన్నట్లయితే వారిని ఆదుకోవడం. మరియు దేవుని వాక్కును  ధ్యానించడం. వీటితో పాటు దేవుని ప్రణాళిక ప్రకారం జీవిచడం. అందుకే ఈ కుటుంబానికి దేవుడే పునాది. అందుకే వారు అన్ని కష్టాలు పడిన ఆ కుటుంబం కీర్తిని పోగొట్టుకోలేదు, ఇంకా ఎక్కువగా పొందుతుంది. 

వీరిద్దరితోపాటు యేసు ప్రభువు ఆ కుటుంబం  జీవించారు. పవిత్ర గ్రంధంలో ఆయన తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడని చదువుతున్నాము. ఆయన తన తల్లిదండ్రులకు  విధేయుడుగా జీవించాడు. దా ని ద్వారా , జ్ఞానమందు ప్రాయమందు ఎదిగాడు.ఆయన పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదుగుతున్నాడు.  ఆ కుటుంబం అంతగా ఆయనకు ప్రాముఖ్యత ఇచ్చారు. యోసేపు మరియమ్మల జీవితం మొత్తం యేసు ప్రభువు కొరకే జీవించారు. మన కుటుంబాలలో కూడా దేవున్ని పునాదిగా చేసుకొని మన బిడ్డలకోసం జీవించుదాం 

హెరోదు పదవి కాంక్ష - పసిబిడ్డల హత్యలు

  హెరోదు పదవి కాంక్ష - పసిబిడ్డల హత్యలు  మత్తయి 2:13-18  వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత  యోసేపునకు కలలో కనిపించి, "శిశువును చంపుటకు హెరో...