25, ఫిబ్రవరి 2026, బుధవారం

యేసు క్రీస్తుని బప్తిస్మం

 యేసు క్రీస్తుని బప్తిస్మం 

మార్కు 1: 7-11 

"నా కంటే శక్తిమతుడోకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షలవారును విప్పుటకైనను యోగ్యుడనుకాను నేను మిమ్ము నీటితో స్నానము చేయించితిని. కాని, ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును" అని యోహాను ప్రకటించుచుండెను. ఆ రోజులలో  గలిలీయ సీమలోని నజరేతు నుండి యేసు వచ్చి, యొర్ధాను నదిలో యోహనుచేత బప్తిస్మము పొందెను. ఆయన నీటినుండి వెలుపలికి వచ్చిన వెంటనే పరమండలము తెరువబడుట, పవిత్రాత్మ పావురము రూపమున తనపై దిగి వచ్చుట చూచెను. అపుడు పరలోకము నుండి ఒక వాణి "నీవు నా ప్రియమైన కుమారుడవు. నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను" అని వినిపించెను

ధ్యానం: యేసు ప్రభువు బప్తిస్మము చాలా ప్రాముఖ్యత కలిగినది మన రక్షణ చరిత్రలో అందుకనే సువార్తికులందరు దీని గురించి రాసారు. మత్తయి 3:14-15 యేసు ప్రభుని బప్తిస్మము ఆయన పాపం చేసినందుకు కాదు దేవుని ఆజ్ఞలకు అనుకూలముగా స్వీకరించాడు అని తెలియచేస్తుంది. యోహాను , యేసు ప్రభువుల మధ్య సంభాషణ ద్వారా ఇది తెలుసుకుంటున్నాము. యోహాను బప్తిస్మము పాప జీవితానికి ముగింపును పలికి నూతన జీవితాన్ని సాగించడానికి కానీ యేసు ప్రభువు స్వీకరించిన బాప్తిస్మము ఒక నూతన కార్యాన్ని స్వీకరించడానికి, అంటే తన పెంపుడు తండ్రి అయినా యేసేపు గారి పని అయిన వడ్రంగి పనిని వదలి ఒక నూతన కార్యాన్ని స్వీకరిస్తున్నారు లేక మొదలు పెడుతున్నారు. ఆ నూతన కార్యం ఏమిటి అంటే మానవ రక్షణ కార్యం. ఈ రక్షణ కార్యం మొదలు పెట్టడానికే యేసు ప్రభువు బాప్తిస్మము తీసుకుంటున్నారు. 

యేసు ప్రభువు బప్తిస్మము తీసుకున్నప్పుడు జరిగిన విషయాలు మనము గురించి ఈ రోజు మనము వింటున్నాము. అవి ఏమిటి అంటే 1. పరలోకం తెరవబడుతుంది. పరలోకం తెరవబడటం అనే మాట దర్శన గ్రంధం లోని భాషలా ఉంది. పరలోకం తెరవ బడటం అంటే  యుదయా ప్రజలు పరలోకానికి భూలోకానికి మధ్య ఒక విభజన ఉంది అని, అవి ఇప్పుడు వేరు చేయ బడినవి  అని నమ్మారు.  అంటే ఇప్పుడు పరలోకానికి , భూలోకానికి ఒక అడ్డు ఉందని అది కొన్ని ప్రత్యేక సంధర్భాలలో తొలగించబడుతుంది అని వారి నమ్మకం. ఎప్పుడు  ఈ ప్రత్యేక సంధర్భం లేక ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే పాత నిబంధనలో ప్రవక్తలు , దీర్ఘ దర్శులు దేవ రహస్యాలను చూస్తారు కాబట్టి వారి దృష్టిలో పరలోకం భూలోకం ఏకమవుతాయి. అంటే దేవుడు భూలోకానికి వస్తున్నాడు అని అర్థం. పరలోకం మరియు భూలోకం మధ్య సంగమం ఏర్పడుతుంది. 

ఇది చాలా కాలం తరువాత యేసు ప్రభువు బాప్తిస్మము రోజున జరుగుతుంది. మనం యెషయా  64:1 లో చూసినట్లయితే యెషయా ప్రవక్త "ఓ దేవా ! నీవు పరలోకం చీల్చి క్రిందికి దిగి రమ్ము" అని అంటున్నారు. ఈ ప్రార్ధన అర్ధం దేవుడు ఆయన్ను పూర్వ కాలంలో వలే తెలియ పరచాలి అని, నిర్గమ 19:16-19 , ఇక్కడ దేవుడు పర్వతము నుండి వస్తారు. అంటే దేవుడు పరలోకం నుండి భూలోకానికి వస్తూంటారు. ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే దేవుడు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియ చేసే సమయంలో లేక కొన్ని గొప్ప కార్యాలు ప్రారంభించే సమయములో జరుగుతుంది.  

యేసు ప్రభువు బాప్తిస్మము లో జరుగుతుంది కూడా ఇదే. ఇక్కడ సంభాషణ  జరుగుతుంది యేసు ప్రభువుకి మరియు దేవునికి మద్యలో, అందుకే యేసు ప్రభువు ప్రారంభించే పని, సరి అయినది అని దేవుని ఆమోదం పరలోక వాణి ద్వార మరియు పవిత్రాత్మ  యేసు ప్రభువు  మీద పావుర రూపమున దిగి రావడం ద్వార తెలుస్తుంది. రక్షణ కార్యాన్ని ప్రారంభించడానికి  దేవుని అనుగ్రహం ఇక్కడ జరుగుతుంది. పవిత్రాత్మ ఈ కార్యానికి తోడ్పాటు అందిస్తుంది. 

 పరలోక వాణి  : బాప్తిస్మము జరుగుతున్న సమయములో పరలోకము నుండి ఒక వాణి  వినబడుతుంది.  ఇక్కడ జరిగిన ఈ సందర్భంలో మిగిలిన వారు నిజముగా అక్కడ ఉన్న వారందరికీ వినబడింది లేనిది మనకు తెలియదు. ఎందుకంటే యేసు ప్రభువు పౌలుకు  డమాస్కస్ (అ. చ 9:7,22:9) దర్శన మిచ్చిన సమయములో పౌలుతో ఉన్న ప్రజలు వెలుగును మాత్రమే చూసారు, శబ్దం విన్నారు కానీ ఆ మాటలను గుర్తు పట్టలేదు. యేసు ప్రభువుకు మాత్రము ఇక్కడ తండ్రి మాటలు ఊరటను బలాన్ని ఇస్తున్నాయి. 

దేవుడు ప్రజలతో మాట్లాడటం మనం పాత నిబంధనలో కూడా  చూస్తాం. ద్వితీ 4:10-12, నిర్గమ 3:4 కనుక పరలోక వాణి అనేది యిస్రాయేలు ప్రజలకు తెలుసు. నీవు నా ప్రియమైన కుమారుడవు పరలోక వాణి పలుకుతుంది  అని వింటున్నాము.  అంటే ఈ మాటలు యేసు ప్రభువు కొరకు వచ్చినవి. ఈయన దేవుని కుమారుడు అని అదే విధముగా ఈయన చేసే పని దేవుని కార్యము అని తెలియచేస్తుంది. అంటే ఈయన చేయబోయే పనికి తండ్రి ఆమోదం ఉంది అని తెలియచేస్తుంది. 

ఈ క్రీస్తు బాప్తిస్మము మనకు ఏమి తెలియ చేస్తుంది? అని అంటే మొదటిగా దేవుని ప్రణాళిక అమలు చేయడానికి నేను సిద్దముగా ఉండాలి అని తెలియ చేస్తుంది. ఎందుకంటే పునీత బాప్తిస్మ యోహను గారు యేసు ప్రభువు బాప్తిస్మము స్వీకరించడానికి వచ్చినప్పుడు, నేను నీకు బాప్తిస్మము ఇవ్వడానికి అర్హుడను కాను నేనే నీ వద్ద బాప్తిస్మము స్వీకరించ వలసిన వాడను అని అంటున్నారు. కాని యేసు ప్రభువు ఇప్పడు నిర్ణయించబడిన విధముగా జరగనివ్వమని చెబుతున్నాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక చేయడానికి ఆయన తన గొప్పతనం  లేక దేనినైనా కూడా వదులు కోవడానికి సిద్దముగా ఉన్నాడు అని తెలియచేస్తున్నారు. ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అని మనం చూస్తున్నాం. ఈ రోజుతో తన రక్షణ కార్యాన్ని ప్రారంభిస్తున్నారు. ఆయన పరిచర్య , స్వస్థత చేయటం, క్షమించడం, దేవుని నుండి దూరముగా వెళ్ళిన వారిని వెదకి  తీసుకురావడం మొదలు పెట్టబోవుచున్నారు. వానికి ముందుగా  బాప్తిస్మ యోహను దగ్గరకు వస్తున్నారు. యోహను పాప క్షమాపణ పొందడానికి పశ్చాతాపం కలిగి జీవించమని పిలుపు ఇచ్చారు, వారికి బాప్తిస్మము ఇస్తున్నారు. 

ఎందుకు యేసు ప్రభువు బాప్తిస్మము తీసుకుంటున్నారు?  యోహను ఇచ్చే బాప్తిస్మము పాప క్షమాపణకు కదా!  మరి యేసుప్రభువులో ఎటువంటి పాపం లేదు కదా ! యేసు ప్రభువుకి ఈ బాప్తిస్మము అవసరం లేదు, అందుకే యోహను యేసు ప్రభువుతో  నేనే నీ వద్ద బాప్తిస్మము తీసుకోవలసిన వాడిని, నేను నీకు బాప్తిస్మము ఇవ్వడమా ? అని అంటున్నారు. కానీ యేసు ప్రభువు ఇప్పటికీ ఇటులనే కానిమ్ము,   దైవ  సంకల్పమును మనము ఇప్పుడు ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము అని చెపుతున్నారు.  దాని అర్దము దేవుని సంకల్పమును నెరవేర్చుటకు నేను ఏమి చేయడానికి అయిన సిద్దమే అని తెలుపుతున్నారు. యేసు ప్రభువు జీవితము మొత్తము కూడా తండ్రి దేవుని సంకల్పమును నెరవేర్చడమే. అది చేయడము కోసము యేసు ప్రభువు ఎంత వరకు అయిన వెళతారు. తన కంటే తక్కువ వాడైన యోహను ఇచ్చే బాప్తిస్మము తీసుకుంటున్నారు. తన శిష్యుల కాళ్ళు కడుగుతున్నారు, తన ప్రాణాన్ని ఇస్తున్నారు.  దేవునితో తన సమానత్వాన్ని వదలి మానవునిగా మన మధ్యకి వస్తున్నారు. కారణం ఏమిటి అంటే దేవుని సంకల్పం నెరవేరాలి. యేసు ప్రభువు ఒక అనమకునిగా ఎందుకు జన్మించాలి, ఎందుకు మరణించాలి, పాపుల చేత ఎందుకు నిందించబడాలి, ఎందుకు వారి చేత శిక్షించబడాలి , అన్నిటికీ సమాదానం యోహానుకు యేసు ప్రభువు ఇస్తున్నారు. దేవుని సంకల్పం నెరవేరుటకు ఈ విధముగా జరుగనివ్వు అని అంటున్నారు. దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను ఏమైనా చేస్తాను అని చెబుతున్నారు. 

యేసు ప్రభువును గురించి తండ్రి దేవుడు చెప్పే విషయాలు మనకు ఇక్కడ వివరించబడ్డాయి. తండ్రి దేవుడు తన కుమారుడును ప్రవర్తన పట్ల ఎంతో ఆనందముగా ఉన్నాడు. అదే విధంగా తన కుమారుడు తండ్రి కోసం ఏమి అయిన చేస్తాడు.  

ఈ రోజు యేసు ప్రభువు బాప్తిస్మము ద్వార ఈ సుగుణాన్ని అలవర్చుకోవాలి దేవుని చిత్తము నెరవేర్చడానికి నేను ఏమి చేయడానికైనా సిద్దముగా ఉండాలి. మనము కూడా ఆ విధంగా జీవించడానికి సిద్దముగా ఉందాం. ఆమెన్

కుష్ట రోగి స్వస్థత- యేసు ప్రభువు కరుణ

 కుష్ట రోగి స్వస్థత- యేసు ప్రభువు కరుణ 

మార్కు 1:40-45 

కుష్టరోగి ఒకడు వచ్చి ప్రభువుఎదుట మోకరించి, "నీకు ఇష్టమగుచో  నన్ను స్వస్థపరపగలవు" అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి, చేయిచాచి, వానిని తాకి "నాకు ఇష్టమే శుద్దిపొందుము"అనెను. వెంటనే అతని కుష్టరోగము తొలగిపోయెను. అతడు శుద్దుడయ్యెను. యేసు అపుడు "నీవు ఈ విషయమును ఎవరితోను చెప్పరాదు" అని గట్టిగా అజ్ఞాపించి, "నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము" అని వానిని పంపివేసెను. కాని వాడుపోయి, ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగెను. అందువలన యేసు ఏ పట్టణమునను బహిరంగముగా ప్రవేశింపలేక, నిర్జనప్రాంతమునకు వేళ్ళను. కాని నలుదేసలనుండి జనులు ఆయనయొద్దకు వచ్చుచుండిరి. 

ధ్యానము: నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరపగలవు అని ఒక కుష్టరోగి ప్రభువుతో అంటున్నాడు. కుష్టు రోగము అనే జబ్బును దేవుని శాపంగా ప్రజలు భావించేవారు. లేవియఖాండంలో 13 మరియు 14 అధ్యాయాలలో కుష్టురొగులును యాజకులు అశుద్దులుగా ప్రకటించారు. దీని పర్యవసానంగా కుష్టురోగంతో ఉన్నవారు మత పరమైన మరియు సామాజిక పరమైన విషయాలలో పాల్గొనడం నిషేదించబడింది. ఆనాటి సమాజం కుష్టురోగితో ఎటువంటి సాన్నిహిత్యం లేకుండా ఉండటానికి కోరుకున్నారు.   కుష్టురోగం వారిని కలిసిన వారిని, వారితో మాటలాడిన వారిని కూడా అపవిత్రులను చేస్తుంది అని చెప్పడం వలన వారిని తాకడం లేక వారితో మాట్లాడటం కూడా ప్రజలు ఇష్టపడలేదు. మరియు కొన్ని సార్లు వారిని అశుద్దులుగా పరిగణించి రాళ్ళతో కొట్టేవారు. ఇది అంటురోగం కావడం వలన వారితో సాన్నిహిత్యం ప్రజలు హర్షించలేదు, ఒకరకంగా ద్వేషించారు. వారి పేరు ఉచ్చరించాలన్న భయపడేవారు. సమాజికంగా, సాంఘికంగా మత పరంగా కుష్టురోగి అవమానంతో రోజు మరణించేవాడు. జబ్బుతో మనిషి కృశించి పోయేదానికన్నా సామాజికంగా ఎడబాటు వారిని ఎక్కువగా బాధించేది. 

యేసు ప్రభువు కేవలము దైవికమైన విషయాలు మాత్రమే బోధించలేదు. ఆయన దేవుడు కనుక సమాజంలో ఉన్న అన్ని సమస్యలు, అసమానతలు తెలిసినవాడు. ఒక సంఘ సంఘసంస్కర్త వలె  ఆయన సమాజంలో ఉన్న అన్ని రుగ్మతలకు పరిష్కారం చూపడమే కాకుండా, ఇటువంటి సమస్యలతో బాధించబడే వారితో ఎలా ఉండాలో కూడా తన జీవితంతో నేర్పుతున్నారు. కనుక కుష్టురోగంతో ఉన్న వ్యక్తిని తాకుతున్నాడు. ఆ వ్యక్తి యొక్క విలువ మానవ ఆకారంలో కాదు ఆయన వ్యక్తిత్వంలో ఉన్నది అని తెలియజేస్తున్నాడు. కుష్టు రోగం ఒక వ్యక్తిని అందవికారముగాచేయడమేకాక ఆ వ్యక్తిని  అనేక విధాలుగా తింటుంది. యేసు ప్రభువు  కుష్టు రోగికి మరల ఆ కోల్పోయిన భాగాన్ని అతనికి వచ్చే విధంగా చేస్తున్నాడు.  కుష్టు రోగమునకు స్వస్థత అనేది లేదు, కాని ఆనాటి  ప్రజలు ప్రతి చర్మ వ్యాధిని కూడా కుష్టు రోగముగానే పరిగణించేవారు. ఒక వ్యక్తి స్వస్థత పొందినట్లయితే దానికి దృవీకరించవలసినది యాజకుడు కనుక వారు యాజకుని దగ్గర దృవీకరించుకోవాలి. వారు శుద్దిపొందారు అని యాజకులు నిర్ధారించేవారు. 
 
యేసు ప్రభువు ఆ వ్యక్తి మీద జాలి పడి, చేయి చాపి అతనిని  తాకి నాకు ఇష్టమే. స్వస్థత పొందుము అని అంటున్నాడు.  యేసు ప్రభువు బాధలలో, కష్టాలలో ఉన్న వారి పట్ల ఎంతో ఆధరణ  చూపేవాడు. వారి బాధ తాను అనుభవించినంతగా వారి కోసం పరితపించేవాడు. అందుకే మన అందరి పాపలు మోయుటకు కూడా సిద్దపడ్డాడు. కనుకనే అడిగిన వెంటనే ఆ వ్యక్తి బాధను తీసివేయాలని చేయి చాపి, అతనిని తాకుతున్నాడు.  ఆ వ్యక్తి వెంటనే స్వస్థత పొందుతున్నాడు. యేసు ప్రభువు  మానవుడు అన్ని విధాలుగా సంపూర్ణతను పొంది వుండాలి అని కోరుకుంటాడు. మానవుడు ఎటువంటి లోపం లేకుండా ఉండాలి అని కోరుకుంటున్నాడు. అందుకే ఆ వ్యక్తికి కోల్పోయిన సంపూర్ణతను ఇస్తున్నాడు. ఆ వ్యక్తి కోల్పోయిన ఆరోగ్యమును తిరిగి ఇస్తున్నాడు. అతడు సంపూర్ణమైన వ్యక్తిగా ఉండేటట్లు చేస్తున్నాడు. నీవు స్వస్థత పొందుట నాకు ఇష్టమే అని ప్రకటిస్తున్నాడు. కేవలం ఈ వ్యక్తి మాత్రమే కాదు ప్రతి వ్యక్తి కూడా అన్ని విధాలుగా ఎదగాలని, సంపూర్ణత కలిగిఉండాలని మరియు ఎటువంటి లోపాలు లేకుండా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. 

"నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము" అని వానిని పంపివేసెను. యేసు ప్రభువు ఆ వ్యక్తి స్వస్థత పొందిన తరువాత ఆ వ్యక్తిని వెళ్ళి యాజకునికి కనిపించమని చెప్పుట వలన, యాజకుడు ఆ వ్యక్తిని శుద్దుడు అని దృవీకరించుట వలన సమాజంలోనికి  అతను  అధికారికంగా రాగలుగుతాడు. ఎవరు ఆయనను ఆటంకపరచరు. కాని అలా చేయకపోతే ఇది అతని మీద అనేక అనుమానాలకు దారితీస్తుంది. మరియు ఆ వ్యక్తి  వివక్షకు గురిఅవుతూనే ఉంటాడు. కాని ప్రభువు ఆ వ్యక్తి ఎటువంటి వివక్షకు గురికాకూడదు అని అనుకుంటున్నాడు. అందుకే అతన్ని పోయి అర్చకునికి కనపడి, నీవు చట్టపరంగా చెల్లించవలనసినది చెల్లించమని సూచిస్తున్నాడు. ప్రభువుకు మానవుడు ఏ విధంగా కూడా అసమానతలకు, అవమానములకు, వివక్షకు గురికాకూడదు అని కోరుకుంటున్నాడు. 

సంభాషణ మరియు ప్రభువుతో ప్రార్ధన:   ప్రభువా ! మీ కరుణ ఎంత ఉన్నతమైనది. లోకం మొత్తం కూడా భయంతో కుష్టువారిని దగ్గరకు, రానివ్వప్పటికి వారిని  దగ్గరకువారిని రాళ్ళతో కొట్టలేదు.  వచ్చిన వారిని అసహ్యించుకోలేదు.  మీరు మాత్రం వారిని తాకుతున్నారు. వారు స్వస్థత పొందాలని కోరుతున్నారు. అంతే కాకుండా వారిని స్వస్థపరుస్తున్నారు. కుష్టు రోగి స్వస్థ పడుట నాకు ఇష్టమే అని తెలియజేస్తున్నావు. ప్రభువా మీరు కోల్పోయిన ఆరోగ్యమును తిరిగిఇస్తున్నారు. సమాజంలో కోల్పోయిన గౌరవాన్ని ఇస్తున్నారు. మా జీవితంలో కూడా ప్రభువా అనేక అసమానతలకు మరియు వివక్షకుఅవుతున్నాము. కొన్నిసార్లు సమాజంలో జరుగుతున్న అసమానతనలను చూసి వాటిని తీసివేయడానికి మీవలె మేము కూడా కృషి చేసేలా చేయండి. ప్రభువా! మీరు స్వస్థత పొందిన వ్యక్తిని సమాజంలో గౌరవం పొందాలని, ఆ విషయం చట్టపరంగా దృవికరించబడాలని కోరుతున్నారు. మేము కూడ ప్రతి వ్యక్తి సమాజంలో వివక్ష లేకుండా ఉండుటకు చేయవలసిన పని చేయుటకు కావలసిన అనుగ్రహాలు దయచేయండి. ఆమెన్ 


యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16

 యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16 "పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది: ఒక  యజమానుడు తన ద్రాక్షతోటలో పని  చేయుటకు పని వారలకై ప్రాతః...