26, ఫిబ్రవరి 2026, గురువారం

తిరు కుటుంబ మహోత్సవం

 తిరు కుటుంబ మహోత్సవం

లూకా 2:22-40 

మోషే చట్ట ప్రకారము వారు శుద్దిగావించు కొనవలసిన దినములు వచ్చినవి.  ప్రతి తొలి చూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభువు ధర్మ శాస్త్రములో వ్రాయబడియున్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరుషలేమునకు తీసికొనిపోయిరి. చట్టప్రకారము "ఒక జత గువ్వాలనైనను, రెండు పావురముల పిల్లలనైనను" బలిసమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. యొరుషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు, దైవభక్తుడు  ఉండెను. అతడు యిస్రాయేలు ఓదార్పుకై  నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుడెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచువరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అపుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచారవిధులు నిర్వర్తించుటకు బాల యేసును లోనికి తీసుకొనిరాగా, సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను: "ప్రభూ! నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధనముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారగాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు; నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు."  బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు, తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి, ఆ బిడ్డ తల్లి మరియమ్మతో  ఇట్లనెను: "ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్దరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడియున్నాడు. అనేకుల మనోగతభావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొనిపోనున్నది. అపుడు అచట అన్నమ్మయనెడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనూయేలు పుత్రిక. ఆమె కడువృద్ధురాలు. వివాహమైన పిదప ఏడు సంవత్సరాలు సంసారము చేసి, ఆ తరువాత ఎనుబదినాలుగు సంవత్సరాలుగా  విధవరాలై దేవాలయముచెంతనే ఉండిపోయను. ఉపవాసములు, ప్రార్ధనలు చేయుచు, రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగియుండెను. ఆమె  ఆక్షణముననే దేవాలయమునకు వచ్చి, దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరుషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభువు అజ్ఞానుసారము అన్ని విధులు  నెరవేర్చి, గలిలీయప్రాంతములోని  తమ పట్టణమగు నజరేతునకు తిరిగివచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై, పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహము ఆయనపై  ఉండెను. 

ఈ రోజు పరిశుద్ద కుటుంబ పండుగను జరుపుకుంటున్నాము. కుటుంబమును చిన్న తిరుసభగా మనం గుర్తిస్తాం. ఈనాటి సువిశేషంలో ఒక కుటుంబం ఎలా ఉన్నట్లయితె దేవుని అనుగ్రహములు మనకు వస్తాయో చూస్తాము. నజరేతు చిన్న కుటుంబంద్వార ఇది మనం చూడగలుగుతాము.  ప్రతి మానవ కుటుంబానికి నజరేతు కుటుంబం ఒక ఆదర్శం.  ఈ పవిత్ర కుటుంబ ఐక్యత, పరస్పర ప్రేమ, మరియు వారి కుటుంబ ధ్యేయం, మన చూసినప్పుడు, ఎలా ఈ కుటుంబం మనకు మాతృక అనే విషయం తెలుస్తుంది. 

పవిత్ర కుటుంబం గురించి మనం తెలుసుకునేముందు, మానవ కుటుంబాలలో ఉండ కూడని కొన్ని లక్షణాలు మనం చూద్దాం. అవ్వ, ఆదాముల కుటుంబంలో ఒకరిని ఒకరు ప్రభావితం చేయడానికి ప్రయత్నించుచున్నారు. అవ్వ తన  తప్పులో ఆదామును పాలుపంచుకునేలా ఆయనను ప్రభావితం చేసింది. దాని ద్వారా పాపమును లోకములోనికి వారు తీసుకొని వస్తున్నారు. కయ్యాను తన తమ్ముడు మీద అసూయ పొంధుతున్నాడు. అసూయ తోటి హత్య చేస్తున్నాడు. తన తమ్ముడు, దేవుని మెప్పు పొందుటను ఓర్వ లేకపోతున్నాడు. రెబ్కా తన కుమారులకు చూపిన ప్రేమలో ఉన్న వ్యత్యాసం వలన అన్నదమ్ములు విడిపోవవలసివచ్చింది.  తమ తండ్రి చిన్న వాడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని, ఆ చిన్న వాడినే చంపాలని ఒక ప్రణాళిక ఏసుకుంటున్నారు యాకోబు కుమారులు.  చిన్న వాడి మీద ప్రేమను కూడా ఓర్చుకోలేని భావాలు  మానవునిలో ఉన్నాయి. ,వాయి వరసలు లేని కామం కుటుంబ కీర్తని నాశనం చేస్తుంది. రూబెను అందరికంటే పెద్దవాడు అయినప్పటికీ ఎప్పటికీ ఆ పెద్దరికానికి నోచుకోలేకపోయాడు.  భర్తను అవమానించిన మీకాలు ఎప్పటికీ పిల్లలను కనకుండా ఉండిపోయింది. తండ్రిని అవమానించి, మాట వినని అబ్షలోము మరణాన్ని తెచ్చుకుంటున్నారు. ఇతర కుటుంబాన్ని విచ్ఛిన్న చేసిన దావీదు కుటుంబం చిన్నభిన్నం అవుతుంది. ఒకరి చెడు కోరికలను తీర్చుకోవడానికి ఒకరికొకరు సహకరించుకొవడం, ఒకరిని చేతకాని వారీగా చిత్రీకరిస్తుంది. ఎసెబేలు రాణి అలానే తన భర్తను చేస్తుంది. 

ఇప్పుడు మనం చూసిన ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలు ఒకసారి మనం పరిశీలిస్తే అవి ఏమిటి అంటే, నా మాటే వినాలి అనే మనస్తత్వం. కుటుంబంలో ఒకరి మీద ఒకరికి అసూయ ఉండటం, ఒకరి ఉన్నతిని మరియొకరు ఓర్వలేక పోవడం, తల్లి దండ్రులు చూపే ప్రేమలో వ్యత్యాసాలు చూపించడం, తల్లి దండ్రులను అవమానపరచడం, వావివరసలు లేని కామం కలిగి ఉండటం, భర్త భార్యను, భార్య భర్తను అవమానించడం ఇవి అన్ని కూడా పవిత్ర గ్రంధంలో కొన్ని కుటుంబాలు వాటి గొప్పతనం, వారు సాధించిన ఘనతను కోల్పోవడానికి కారణం అయ్యాయి. వారు పొందవలసిన కీర్తిని వారు పొందలేక పోయారు. ఈ సమస్యలు అన్ని ఆనాటి కుటుంబాలలో మాత్రమే కాదు, ఈనాటి కుటుంబాలలలో కూడా ఉన్న సమస్యలే. అంత మాత్రము చేత ఇవి ఏమి  పరిష్కారం లేని సమస్యలు కాదు. ఈ సమస్యలకు సమాధానాలు ఉన్నట్లయితే అవి ఎక్కడ ఉన్నాయి అని ఆలోచిస్తే మనకు తెలిసేది ఏమిటి అంటే, యేసుప్రభువు మరియమ్మ, యేసేపుల నజరేతు కుటుంబం. 

ఎందుకు మన కుటుంబాలలో ఉన్న ఈ సమస్యలు, ఆ కుటుంబంలో లేవు, దానికి కారణం ఏమిటి అంటే, ఆ కుటుంబములోని వారు అందరు జీవించే విధానం చాల ప్రత్యేకమైనది.వీరు ఒకరికొరకు ఒకరు జీవించారు. యోసేపు మరియమ్మలు యేసు ప్రభువు కోసం జీవించారు. ఒకరి మీద ఒకరికి వారికున్న ప్రేమ గొప్పది.  మొదటిగా యోసేపుగారు ఈయన దేవుని మీద అచంచలమైన భక్తి కలవాడు. దేవున్ని ఎంతగా నమ్ముతాడు అంటే కలలో దేవదూత కనపడి చెప్పిన ప్రతి విషయాన్ని ఎటువంటి అపనమ్మకం  లేకుండా అన్ని పాటించేవాడు. నీతిమంతుడు అయిన యోసేపు ఎటువంటి పరిస్థితిలో కూడా ఇతరులకు ఇబ్బంది కలుగకూడదు అని కోరుకునేవాడు, కనుకనే తన భార్య తన ప్రేమేయం లేకుండా గర్బవతి అయ్యింది అని తెలిసిన కాని ఆమెను అవమానింప ఇష్టపడలేదు. ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న  తన కుటుంబాన్ని కాపాడుటకు అన్ని ప్రయత్నాలు చేశాడు. తన కుటుంబాన్ని కాపాడాడు. తండ్రిగా తన ప్రతి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఎప్పుడు, ఎటువంటి అలసటను వ్యక్త పరచలేదు. దేవుని ప్రణాళిక నెరవేర్చడమే తన ధ్యేయంగా జీవించాడు. 

మరియమాత జీవితం  ప్రతి కుటుంబానికి ఆదర్శం. తన జీవితం మొత్తం కూడా తన కుమారుని కోసం జీవిస్తున్నారు.  చిన్నప్పటి నుండి వారు బాలయేసుకు కావలసిన ప్రతి దానిని చేకూర్చడమే కాకుండా, బాల యేసును చిన్నప్పటినుండి దేవుని ప్రణాళికకు అనుకూలంగా వారు పెంచుతున్నారు. ఆమె జీవితంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ఎవరైన ఆపదలో ఉన్నట్లయితే వారిని ఆదుకోవడం. మరియు దేవుని వాక్కును  ధ్యానించడం. వీటితో పాటు దేవుని ప్రణాళిక ప్రకారం జీవిచడం. అందుకే ఈ కుటుంబానికి దేవుడే పునాది. అందుకే వారు అన్ని కష్టాలు పడిన ఆ కుటుంబం కీర్తిని పోగొట్టుకోలేదు, ఇంకా ఎక్కువగా పొందుతుంది. 

వీరిద్దరితోపాటు యేసు ప్రభువు ఆ కుటుంబం  జీవించారు. పవిత్ర గ్రంధంలో ఆయన తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడని చదువుతున్నాము. ఆయన తన తల్లిదండ్రులకు  విధేయుడుగా జీవించాడు. దా ని ద్వారా , జ్ఞానమందు ప్రాయమందు ఎదిగాడు.ఆయన పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదుగుతున్నాడు.  ఆ కుటుంబం అంతగా ఆయనకు ప్రాముఖ్యత ఇచ్చారు. యోసేపు మరియమ్మల జీవితం మొత్తం యేసు ప్రభువు కొరకే జీవించారు. మన కుటుంబాలలో కూడా దేవున్ని పునాదిగా చేసుకొని మన బిడ్డలకోసం జీవించుదాం 

25, ఫిబ్రవరి 2026, బుధవారం

మానవుడు దేనిని వెదకాలి

 మానవుడు దేనిని వెదకాలి 

యోహాను 1: 35-42 

మరునాడు మరల యోహాను తన శిష్యులలో ఇద్దరితో నిలుచుని ఉండగా, ఆ సమీపమున  నడచిపోవుచున్న యేసును చూచి "ఇదిగో'!దేవుని గొర్రె పిల్ల" అనెను. అది విని, ఆ యిద్దరు శిష్యులు యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తనను అనుసరించుటను చూచి, "మీరేమి వెదకుచున్నారు?" అని అడిగెను. "రబ్బీ! నీవు ఎక్కడ నివసించుచున్నావు?"అని అడిగిరి. "వచ్చి చూడుడు" అని యేసు సమాధానమిచ్ఛెను. వారు వెళ్ళి ఆయన నివాసస్థలమును చూచి, ఆనాడు ఆయనతో గడిపిరి. అది యించుమించు సాయంకాలము నాలుగు గంటల వేళ. యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రెయ. అతడు మొదట తన సహోదరుడగు సీమోనును కనుగొని "మేము మెస్సయ్యాను కనుగొంటిమి" అని చెప్పెను. అతడు సీమోనును యేసు వద్దకు తీసుకొనిరాగా, యేసు అతనిని చూచి "నీవు యోహాను కుమారుడవగు సిమోనువు. నీవు కేఫా అని పిలువ బడుదువు" అనెను. కేఫా అనగా రాయి అని అర్ధము. 

ధ్యానము: యోహాను యేసు ప్ర,భువును తన శిష్యుల ఎదుట మరియు ప్రజల ఎదుట దేవుని గొర్రె పిల్ల అని ప్రకటించుటకు ఏనుకడుగు వేయుట లేదు. యేసు ప్రభువును చూసిన ప్రతి సారి ఆయనను ప్రకటించడానికి ఎంతగానో ఆనందపడుతున్నారు. యేసు ప్రభువు ఆ సమీపమున నడచిపోవుచున్నప్పుడు ఆయనను చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని యోహాను  చెబుతున్నాడు. గొర్రె పిల్లను  యూదులు, వారికి బదులుగా, వారి పాపాలను పరిహరించుటకు  బలి ఇచ్చేవారు. వారి  పాపములను ఆ గొర్రె మొస్తుంది అని వారు నమ్మేవారు. అందుకే యోహాను మానవుల పాపములను మోసే గొర్రె పిల్లగా యేసు ప్రభువును చూస్తున్నారు. ఆయన మన పాపములను మోసే గొర్రెపిల్ల. మనకు బదులుగా శిక్షను అనుభవించడానికి మన వద్దకు వచ్చాడు. వాస్తవానికి గొర్రె పిల్ల రక్తం వారిని రక్షించలేదు, కేవలం యేసు ప్రభువు రక్తం మాత్రమే మనలను రక్షించగలదు అని పూర్తిగా తెలిసిన యోహాను, యేసు ప్రభువును దేవుని గొర్రె పిల్లగా ప్రకటిస్తున్నారు. 

యేసు ప్రభువును దేవుని గొర్రె పిల్లగా ప్రకటిస్తున్నప్పుడు యోహనుతో ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ఇది రెండవ సారి యోహాను, యేసు ప్రభువును గొర్రె పిల్లగా ప్రకటించడం. యోహాను శిష్యులకు తమ గురువు పదేపదే యేసు ప్రభువు గురించి ప్రకటిస్తున్నారు కనుక ఆయన గురించి తెలుసుకోవలనుకుంటున్నారు. అందుకే ఆ శిష్యులు ఇద్దరు కూడా ఆయనను వెంబడించడం మొదలుపెట్టారు. అది గమనించిన యేసు ప్రభువు వారితో మీరేమి ఎదుకుచున్నారు అని ప్రశ్నిస్తున్నారు. యేసు ప్రభువు అడిగిన ప్రశ్నకు వారు జవాబు ఇవ్వడం లేదు. కాని మరొక ప్రశ్న అడుగుతున్నారు. నీవు ఎక్కడ నివసించుచున్నావు అని వారు అడుగుతున్నారు. కారణం ఏమిటి అంటే వారికి ఏమి అడగాలో కూడా తెలియదు. ఆనాటి యోహాను శిష్యులు మాత్రమే కాదు, దేవుని మీద నమ్మకం ఉన్న వారు, దేవుని ఆజ్ఞల మీద నమ్మకం ఉన్నవారు ఎదురు చూసేది, వేదికేది కేవలం రక్షకుడిని మరియు మెస్సీయ్యాను. ఇది వారు చెప్పక పోయిన, వారు కూడా తెలియకుండా చేసేది కూడా అదే. 

"రబ్బీ! నీవు ఎక్కడ నివసించుచున్నావు?"అని అడిగిరి. "వచ్చి చూడుడు" అని యేసు సమాధానమిచ్ఛెను. వారు వెళ్ళి ఆయన నివాసస్థలమును చూచి, ఆనాడు ఆయనతో గడిపిరి. అది యించుమించు సాయంకాలము నాలుగు గంటల వేళ. రబ్బీ! నీవు ఎక్కడ నివసించుచున్నావు అని వారు అడుగుతున్నారు. యేసు ప్రభువు వారికి తాను ఎక్కడ నివసించుచున్నది చెప్పడం లేదు, కాని వారిని వచ్చి చూడమని  ఆహ్వానిస్తున్నారు. వారు దానికి మారు మాటలాడకుండా ఆయనను అనుసరిస్తున్నారు. ఆరోజు వారు ఆయనతో గడుపుతున్నారు. ఆయనతో గడపటం వలన వారు అనుభవపూర్వకంగా, యేసు ప్రభువు మెస్సీయ్యా అని తెలుసుకుంటున్నారు. యోహాను వారికి యేసు ప్రభువు దేవుని గొర్రె పిల్ల అని చెప్పారు కాని ఇప్పుడు వారికి ఆయన కేవలం  పాపములను మోసె గొర్రెపిల్ల మాత్రమే కాదు, దేవుడు ఏర్పరిచిన రక్షకుడు అని వారు తెలుసుకుంటున్నారు. 

యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రెయ. అతడు మొదట తన సహోదరుడగు సీమోనును కనుగొని "మేము మెస్సయ్యాను కనుగొంటిమి" అని చెప్పెను. అతడు సీమోనును యేసు వద్దకు తీసుకొనిరాగా, యేసు అతనిని చూచి "నీవు యోహాను కుమారుడవగు సిమోనువు. నీవు కేఫా అని పిలువ బడుదువు" అనెను. కేఫా అనగా రాయి అని అర్ధము. యోహాను శిష్యులు ఆయనను వదలి యేసు ప్రభువును అనుభవపూర్వకంగా మెస్సీయ్యా అని, సిఖారు పట్టణ వాసుల వలె, ఎవరో చెప్పినందుకు కాక, ఆయనతో ఒక రోజు గడిపి  తెలుసుకున్నారు. ఈయనే నిజమైన మెస్సీయ్యా అని తెలుసుకున్న ఈ శిష్యులలో ఒకరు, సీమోను సోదరుడు అయిన ఆంద్రెయ. ఆయన తన సోదరుడు అయిన సీమోను పేతురుతో మేము మెస్సీయ్యాను కనుగొన్నాము అని చెప్పాడు. మెస్సీయ్యాను కనుగొనుట అనెది జ్ఞానంతో కూడిన ఒక పక్రియ. అనేక మంది మంచి పనులు చేసిన వారు, దేవుడు గురించి చెప్పిన వారు ఉండవచ్చు కాని అందరు మెస్సీయ్యా కాదు. యోహానుకు  మాత్రమే నిజమైన మెస్సీయ్యా తెలుసు, ఎందుకంటే దేవుడు ఆయనకు మెస్సీయ్యా ఎవరు, ఎలా ఉంటారు అని చెప్పాడు, ఆయన శిష్యుడైన ఆంద్రెయకు మెస్సీయ్యాను కనుగొనుట సాధ్యమే. తన గురువు ఆయన గురించి చెప్పాడు మరియు ఆయన యేసు ప్రభువుతో గడిపి ఆ విషయం తెలుసుకుంటున్నాడు. ఆయన పేతురును యేసు ప్రభువు దగ్గరకు తీసుకొని వస్తున్నాడు. యేసు ప్రభువు ఆయనను కేఫా అని పిలుస్తున్నారు. ఆయన అంతగట్టివాడు కాకపోయినప్పటికి, అంత గట్టిగా ఆయనను చేస్తాడు యేసు ప్రభువు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ప్రభువా! మీరు మా పాపములను మోసే దేవుని గొర్రె పిల్ల అని యోహాను ద్వారా తెలుసుకుంటున్నాం. యోహాను తన శిష్యులు మిమ్ములను అనుసరిస్తున్నందుకు ఎంతగానో ఆనందపడుతున్నాడు. తనను వీడిపోతున్నారు అనే బాధలేకుండా మిమ్ములను తెలుసుకుంటున్నారు అనే సంతోషం ఆయనలో ఉన్నది. మేము కూడా మా జీవితాలలో అటువంటి భావాలు కలిగి జీవించే అనుగ్రహం మాకు దయచేయండి. యోహాను చెప్పినందుకే కాకుండా మిమ్ములను అనుసరించి, మీ దగ్గర ఉండి, మీరు ఎంత గొప్ప వారో, మరియు మీరు రక్షకుడు అని వారు తెలుసుకుంటున్నట్లుగా మేము కూడా అనుభవ పూర్వకంగా మిమ్ములను తెలుసుకునే భాగ్యం మాకు దయచేయండి. ప్రభువా! మీరు ఏమి వెదకుచున్నారు అని శిష్యులను  అడుగుతున్నారు. మేము కూడా మా జీవితములలో చాలా వేదకూచున్నాము. శిష్యుల వలె రక్షకుడను  వేదకుట లేదు. ఏమి వెదకాలో మాకు తెలియదు. మిమ్ములను వెదికే జ్ఞానము మాకు దయచేయండి. సీమోను వలె మమ్ములను గట్టివారిగా  చేయమని వేడుకుంటున్నాము. ఆమెన్ 

యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16

 యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16 "పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది: ఒక  యజమానుడు తన ద్రాక్షతోటలో పని  చేయుటకు పని వారలకై ప్రాతః...