26, ఫిబ్రవరి 2026, గురువారం

మత్తయి 15:29-37

 మత్తయి 15:29-37

యేసు అక్కడ నుండి గలిలీయ సముద్ర తీరమునకు వచ్చి, కొండపైకి  ఎక్కి కూర్చుండెను. అపుడు జనులు గుంపులు గుంపులుగా కుంటివారిని, వికలాంగులను, గ్రుడ్డివారిని, మూగవారిని, రోగగును అనేకులను తీసికొనివచ్చి, ఆయన పాదసన్నిధికి చేర్చగా ఆయన వారిని స్వస్థ పరచెను. అపుడు మూగవారు మాటాడుటయు, వికలాంగులు అంగపుష్టి  పొందుటయు, కుంటివారు నడుచుటయు, గ్రుడ్డివారు చూచుటయు జనసమూహము కాంచి, విస్మయమొంది, యిస్రాయేలు దేవుని స్తుతించిరి. అనంతరం యేసు తన శిష్యులను పిలిచి, "ఈ జనులు  మూడు దినములనుండి ఇక్కడ ఉన్నారు. వీరికి తినుటకు ఏమియులేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది. వీరు మార్గ మధ్యమున అలసి సోలసి పడిపోవుదురేమో! వీరిని పస్తుగా పంపి వేయుట నాకు యిష్టము లేదు" అనెను. అపుడు శిష్యులు, "ఈ ఎడారిలో ఇంతటి జనసమూహమునకు కావలసినంత ఆహారము మనము ఎచటనుండి. కొనిరాగలము?" అని పలికిరి. అంతట యేసు "మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి?" అని వారిని అడిగెను. "ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నవి" అని శిష్యులు పలికిరి. ఆయన జనసమూహమును నేల మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. పిమ్మట ఆయన ఆ ఏడు రొట్టెలను చేపలను తీసుకొని ధన్యవాదములు అర్పించి, త్రుంచి, తన శిష్యులకు ఈయగా వారు ఆ జనసమూహమునకు పంచి పెట్టిరి. వారు అందరు భుజించి సంతృప్తి చెందిరి. పిమ్మట మిగిలిన ముక్కలను ఏడు గంపల నిండ ఎత్తిరి. 

ధ్యానం: యేసు ప్రభువు గలిలీయా ప్రాంతానికి వస్తున్నాడు. ఆయన అంతకు ముందు కననీయ స్త్రీ విశ్వాసము గురించి చెప్పి ఆమె కుమార్తెను కాపాడాడు. అది చూసిన ప్రజలు, యేసు ప్రభువు అద్భుతాల గురించి తెలిసిన ప్రజలు ఆయనను వెంబడిస్తున్నారు. యేసు ప్రభువు అక్కడ నుండి గలిలీయా ప్రాంతానికి వచ్చి, అక్కడ  కొండను ఎక్కి కూర్చొని ఉన్నారు. ఆయన అద్భుతాలు చూసిన వారు, ఆయన మాటలను విన్నవారు అందరు ఆయనను వెంబడిస్తున్నారు. అద్భుతాలు చూసిన వారు అనేక మందిని గ్రుడ్డివారిని , కుంటివారిని, మూగవారిని, వికలాంగులను తీసుకొని వస్తున్నారు. ఎందుకు వారందరిని తీసుకొని వస్తున్నారు? వీరు అందరిని తీసుకొనిరావడానికి గల కారణం ఏమిటి అంటే వారు అందరు స్వస్థత పొందాలని, యేసు ప్రభువుని శక్తి తెలుసుకొని వారు ఆయన ద్వారా స్వస్థత పొంది మంచి జీవితం వారు పొందాలని, వారిని తీసుకొని వస్తున్నారు. కేవలం యేసు ప్రభువు ద్వారా స్వస్థత పొందాలని మాత్రమే కాదు, ఆయన మాటలను వినాలని వారు అందరు వస్తున్నారు. ఆయన చేసే అధ్భుతాలు మాత్రమే కాక ఆయన మాటలు జీవమైన మాటలు, అంతకు ముందు వారు ఇటువంటి జీవమైన మాటలు  వినలేదు. శిష్యులు , యేసు ప్రభువు మాటలు వినిన వారు, అధ్బుతాలు చూసిన వారు,  మిగినలిన వారందరు అక్కడకు రావడానికి ఉపయోగపడ్డారు. మనం కూడా ఆయన అనుచరులుగా కష్టాలు, బాధలలో ఉన్నవారిని, రోగులను, జీవవాక్కు అవసరంలో ఉన్నవారిని ప్రభువు ప్రభువు దగ్గరకు తీసుకొని రావాలి. అది వారు బాగుపడుటకు, పరిపూర్ణులు అవుటకు ఉపయోగపడుతుంది. 

వారి అందరిని ప్రభువు స్వస్థ పరిచారు. యేసు ప్రభువు అక్కడకు వచ్చిన ప్రతి వ్యక్తిని స్వస్థపరుస్తున్నారు. ఇక్కడ స్వస్థ పరచడం అంటే వారిలో ఉన్న లోపాలను తీసువేసి వారిని  పరిపూర్ణమైన వ్యక్తులుగా మారుస్తున్నారు. యేసు ప్రభువు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి, ఆయన అనుగ్రహం పొంది వెళుతున్నారు అంటే, అతను పరిపూర్ణమైన వ్యక్తిగా మారుతున్నారు అని మనకు అర్ధం అవుతుంది. అక్కడ జరుగుతున్న విషయాలను చూస్తున్న, యిస్రాయేలు ప్రజలు దేవున్ని స్తుతిస్తున్నారు. ఇది కేవలం అప్పటి ప్రజలు మాత్రమే కాదు, యేసు ప్రభువును నమ్మిన వ్యక్తులు జీవించే జీవితవిధానం కూడా, ఇతరులను  దేవున్ని స్తుతించేలా చేస్తుంది. అపోస్తులుల కార్యాలలో ఇది మనం చూస్తాము. అంతే కాదు ఇది  క్రీస్తు ప్రభువు అనుచరుల జీవిత విధానం, వీరి ప్రార్ధన ద్వారా ఇతరులు పొందే స్వస్థత కూడా మిగిలినవారు  దేవున్ని స్తుతించడానికి ఉపయోగపడుతుంది. అది చేయవలసిన బాధ్యత ప్రభువు అనుచరులుగా మన మీద ఉన్నది. 

"ఈ జనులు  మూడు దినములనుండి ఇక్కడ ఉన్నారు. వీరికి తినుటకు ఏమియులేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది. వీరు మార్గ మధ్యమున అలసి సోలసి పడిపోవుదురేమో! వీరిని పస్తుగా పంపి వేయుట నాకు యిష్టము లేదు" అనెను. యేసు ప్రభువు మన ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే కాదు, ఆయన మానవుల  భౌతిక అవసరాలను గురించి  కూడా ఎంతగానో శ్రద్ద కలిగి ఉంటారు. యేసు ప్రభువు అంతమందిని స్వస్థ పరచడం ఇది మనకు తెలియజేస్తుంది. ఇది మాత్రమే కాకుండా అక్కడ ఉన్న ప్రజలు అందరు మూడు రోజుల నుండి ఉన్నారు. వారు ఏమి తినలేదు. ఒకవేళ వారు అక్కడ నుండి వెళితే, మార్గ మధ్యలో శక్తిలేక పడి పోతారు ఏమో అని ప్రభువే వారికి భోజన వసతిని కలిపిస్తున్నారు. వారిని అలా పంపించి వేయడం ప్రభువుకు ఇష్టం లేదు అంటే మనం లేమితో ఉండాలి అని ప్రభువు కోరుకోవడం లేదు. ప్రభువునకు మనం అంటే చాలా ఇష్టం అందుకే మానవునికి సంభందించిన ప్రతి చిన్న విషయమును కూడా ప్రభువు అంత శ్రద్ద తీసుకుంటున్నారు. మన తల్లి, తండ్రి వలె ప్రభువు మనలను చూస్తున్నారు. 

అక్కడ వారి దగ్గర ఉన్నటువంటి ఐదు రొట్టెలను చేపలను తీసుకొని దేవునికి అర్పించి వాటిని అందరికీ పంచుతున్నారు. ఇక్కడ మనం చూసే ఈ అధ్భుతం మనకు ఒక విషయం తెలియజేస్తుంది. మన దగ్గర ఉన్నది అందరం పంచుకుంటే, దేవుని దీవెన అక్కడ ఉంటుంది. అక్కడ ఎవరికి కోదువ ఉండదు.మరియు ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందుతారు. యేసు ప్రభువు చేసిన ఈ గొప్ప కార్యమును, మొదటి క్రైస్తవ సంఘము అవలంభించినది. వారి వద్ద ఉన్నదానిని వారు తీసుకొన వచ్చి, పంచుకొని బ్రతికారు, అందరికీ సమృద్దిగా లభించినది. ఎవరికి తక్కువ కాలేదు. ఇది మనం ప్రభువు వద్ద నుండి నేర్చుకోవాలి. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ఓ ప్రభువా! మీరు ఎంత ఉన్నతులు. అనేక మందిని వారికి ఉన్న వైకల్యం నుండి బయటకు తీసుకువచ్చి వారిని పరిపూర్ణ ఆరోగ్యవంతులను చేస్తున్నారు. వారిలో ఏ లోపం లేకుండా వారిని అందమైన దేవుని సృష్టిగా చేస్తున్నారు. మీ ఓర్పుకు, అనేక రకాలైన లోపాలతో బాధ పడేవారిని, పరిపూర్ణ వ్యక్తులుగా చేసిన మీ మంచి హృదయానికి కృతజ్ఞలు తెలుపుతున్నాను ప్రభువా. ప్రభువా! నాలో  కూడా అనేక లోపాలు ఉన్నవి, అవి మిమ్ములను చూచుటకు, మీ మాటలను వినిపాటించుటకు ఆటంకముగా ఉన్నవి, నాలో ఉన్న ఆ లోపాలను తీసివేయండి. నన్ను కూడా పరిపూర్ణమైన  వ్యక్తిగా మార్చుము. అలానే నేను కూడా మీ వద్దకు ఇతరులను తీసుకువచ్చేలా , ముందు నన్ను మీ నిజమైన అనుచరుడను చేయండి.  ప్రభువా! మీకు ప్రజలు పస్తులు ఉండి మీ వద్ద నుండి వెళ్ళడం ఇష్టం లేక వారికి కావలసిన అహరం ఇవ్వడానికి మీరు సిద్దపడ్డారు. వారికి కావలసిన అహరం వారికి ఇచ్చారు. ప్రభువా! నా జీవితంలో అనేక విషయాలలో మిమ్ములను నమ్మి మీ మాటలను వినాలని,  మీతో ఎప్పుడు ఉండాలని కోరికతో ఉన్నాను. ఆ ప్రజల ఆకలి తీర్చిన విధంగా నాకు ఏమి అవసరమో మీరే ప్రసాదించండి. ఆమెన్. 



మత్తయి 7:21,24-27

 మత్తయి 7:21,24-27

"ప్రభూ! ప్రభూ! అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోకరాజ్యములో  ప్రవేశిండు! కాని, పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. " నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతిపునాదిపై తన యిల్లు కట్టుకొనిన బుద్దిమంతుని పొలియున్నాడు. జడివానలు కురిసి, వరదలు వెల్లువలై పారి, పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాది పై నిర్మింపబడుటచే కూలి పోలేదు. నా బోధనలను ఆలకించి  పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్దిహీనుని పొలియున్నాడు. జడివానలు కురిసి, వరదలు వెల్లువలైపారి, పెనుగాలులు వీచినపుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమయ్యెను. దాని పతనము చాల ఘోరమైనది." 

ధ్యానం: "ప్రభూ! ప్రభూ! అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోకరాజ్యములో  ప్రవేశిండు! కాని, పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. యేసు ప్రభువుని మాటలు జీవమై ఉన్నవి అని మనకు తెలుసు. ఈ ప్రభువు మాటలు ఒకసారి ఆలోచిద్దాం. ప్రభూ ప్రభూ అని నన్ను పదే  పదే సంబోధించే వారు పరలోక రాజ్యములో ప్రవేశించారు అని ప్రభువు చెబుతున్నారు. మరి ఎవరు  పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు? పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును అని ప్రభువు చెబుతున్నారు. ఏమిటి పరలోక మందున్న తండ్రి చిత్తము? దీని కోసము ఎవరు ఎవరు ఏమి చేశారు? ఒక సారి పవిత్ర గ్రంధం పరిశీలించినట్లయితే కుమారుని ఔన్నత్యం ఆయన ఈ తండ్రి చిత్తము నెరవేర్చిన విధానం ద్వారానే  తెలుసుకుంటాము. అంతేకాక అనేక మంది ప్రవక్తలు, గొప్ప భక్తులు వారి జీవితాలను, పూర్తిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి  అంకితం చేశారు. ఈ విషయంలో కుమారుడు అయిన యేసు ప్రభువు ప్రతి మానవునికి ఆదర్శం అవుతారు. 

క్రైస్తవులు ఎక్కువగా ప్రార్ధించే ప్రార్ధన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్దన.  ఈ ప్రార్ధనలో , "మీ  చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక" అని ప్రార్ధిస్తున్నాము. మరల యేసు ప్రభువు తాను గెత్సమేను తోటలో ఉన్నప్పుడు "తండ్రి నేను పానము చేసిననే తప్ప , నా నుండి తొలగిపోవ సాధ్యము కాని యెడల మీ చిత్తమునే నెరవేరనిమ్ము అని ప్రభువు చెబుతున్నారు. అంతకు ముందుకూడా ప్రభువు అంటున్నారు "ఈ పాత్రను నా నుండి తొలగించు కానీ నా చిత్తము కాదు మీ చిత్తమే నెరవేరనిమ్ము" అని అంటున్నారు.  యేసు ప్రభువుకు తాను ఈ దైవ చిత్తము నెరవేర్చడం అంటే, తాను అనేక కష్టలు పొంది మరణశిక్ష పొందడం అని తెలిసి కూడా, మీ చిత్తమె నెరవేరనిమ్ము అని చెబుతున్నాడు. యేసు ప్రభువుకు తన తండ్రి చిత్తము నెరవేర్చడమును తన ఆహరంగా మార్చుకున్నారు. అందుకే ఆయన అంత కష్టమైన పనిని కూడా చేస్తున్నారు. 

 యేసు ప్రభువు  తండ్రి చిత్తాన్ని ఎవరు పాటిస్తారో , వారు ఎలా దేవునికి కుటుంబంలో వారు అవుతారో చెబుతారు. అది తెలియజేయడానికి, పరలోక మందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చు వాడే , నా సోదరి , సోదరుడు నా తల్లి అని ప్రభువు చెబుతున్నారు. ఈ పసి బాలురలో ఏ ఒకడైన నాశనమగుట మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు అని ప్రభువు చెబుతున్నారు. దేవుని చిత్తమును నెరవేర్చువాడే పరలోకమున ప్రవేశించును అని ప్రభువు చెబుతున్నాడు. దైవ చిత్తము మన జీవితాలలో చాలా ముఖ్యమైనది. ఇది మనలను దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు అర్హతను సాధిస్తుంది. యేసు ప్రభువు తండ్రి చిత్తము నెరవేర్చడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయుట లేదు. మరియమాత తాను దేవుని దాసురాలను, మీ మాట చొప్పున నాకు జరగాలి అని తన జీవితాన్ని పూర్తిగా దైవ చిత్తానికి అర్పిస్తుంది. యోసేపు, తండ్రి ప్రణాళికా జరుగుటకు తన జీవితాన్ని అర్పిస్తున్నారు. మన జీవితాలలో దేవుని ప్రణాళికా తెలుసుకొని అది జరుగుటకు మన వంతు బాధ్యత మనం ఎప్పుడు చెయాలి. అప్పుడు మనం దేవుని కుటుంబంలో సభ్యులం అవుతాము. 

నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతిపునాదిపై తన యిల్లు కట్టుకొనిన బుద్దిమంతుని పొలియున్నాడు అని ప్రభువు చెబుతున్నాడు. యేసు ప్రభువుని మాటలు ఆలకించుట అంటే ఒకడు తన జీవితాన్ని, పరలోకరాజ్యంలో స్థానాన్ని పదిలపరుచుకున్నట్లే. పరలోక రాజ్యం అంటే సకల సౌక్యాల కంటే, సకల సంతోషాల కంటే గొప్పది. అది  ఎప్పుడు ఆ ప్రభువుతో కలసి ఉండటము. అది కేవలం ప్రభువుని మాటలను ఆలకించి దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించిన వారికి మాత్రమే ఉంటుంది. ఒక వేళ యేసు ప్రభువు మాటలను పట్టించుకోకుండా, తండ్రి చిత్తాన్ని చేయకుండా ఉన్నట్లయితే వారు తమ ఇంటిని ఇసుక మీద కట్టుకున్న వారి వలె ఉంటారు  అని  ప్రభువు చెబుతున్నారు. ఇసుక మీద కట్టిన ఇల్లు చిన్న కుదుపులను కూడా తట్టుకోలేదు అటువంటిది పెద్ద పెద్ద తుఫానులను ఎలా తట్టుకుంటుంది. యేసు ప్రభువు మాటలను అనుసరించినట్లయితే, వారు యేసు అనే పునాది మీద తమ జీవితాన్ని కట్టుకున్నట్లు, వారు ఎటువంటి కుదుపులకు తొనకరు. మన పునాది క్రీస్తు అని మనం ఎప్పుడు గుర్తించుకొని జీవించాలి. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ప్రభువా! మీరు మీ తండ్రి చిత్తము గురించి, దాని ప్రాముఖ్యతను గురించి చెబుతున్నారు. మీ మాటలను వినమని తండ్రి చెబుతున్నారు. మీరు తండ్రి చిత్తము నెరవేర్చడానికి మీ ప్రాణమును కూడా త్యాగం చేశారు. ప్రభువా , మీరు తండ్రి చిత్తము చేయుట ఎంత కష్టమైన, అది చేయనని తండ్రికి చెప్పలేదు, వీలైతే దీనిని నా నుండి తొలగించండి అని అడుగుతున్నారు. అప్పటికి నా ఇష్టం కాదు మీ ఇష్టమునే నెరవేరనిమ్ము అని చెబుతున్నారు. ప్రభువా నేను నా జీవితంలో సౌక్యాలు పొందాలని,  చిన్న చిన్న ఆనందాల కోసం కూడా తండ్రి చిత్తాన్ని పాటించకుండా ఉన్నాను. అటువంటి పరిస్థితులలో నన్ను క్షమించండి. నేను ఎట్టి పరిస్థితిలో కూడా మీ వలె  ఎల్లప్పుడు తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఎటువంటి కష్టమునైన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే వ్యక్తిగా నన్ను చేయమని, నా జీవితానికి మిమ్ములను పునాదిగా చేసుకునే భాగ్యం నాకు దయచేయండి. ఎల్లప్పుడు తండ్రి చిత్తాన్ని పాటిస్తూ, మీతో పాటు కలిసి జీవించుటకు అర్హతను దయచేయండి. ఆమెన్. 

తోబియా జీవిత కథ

 తోబియా జీవిత కథ మనము రక్షణ గ్రంధంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ఉద్దేశంతో దేవుడు తన సేవ కొరకై మరియు తన ప్రజలను రక్షించడానికి ఎ...