26, ఫిబ్రవరి 2026, గురువారం

లూకా 21: 1-4

 లూకా 21: 1-4 

దేవాలయము కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనికులను యేసు చూచెను. ఒక పేద వితంతువు అందు రెండు కాసులను వేయుట యేసు గమనించి, "ఈ పేద వితంతువు అందరికంటెను ఎక్కువగా  ఇచ్చినదని మీతో చెప్పుచున్నాను. వారలు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చిరి. కాని ఈమె తన  పేదరికంలో తన సమస్త జీవనమును సమర్పించినది" అని పలికెను. 

ధ్యానము: యేసు ప్రభువు దేవాలయంలో కానుకలను వేయుచున్న ధనికులను చూస్తున్నారు. అందరు వారి వారి సమృద్ధి నుండి అక్కడ కానుకలను వేయుచున్నారు. ఆ ధనము వారు దానం చేయడం వలన వారి జీవితంలో ఏమి లోటు ఉండదు. కానీ అక్కడ ఒక పేద వితంతువు ఉన్నది. ఆమె కూడా ఆ కానుకల పెట్టెలో రెండు కాసులను వేస్తుంది. యేసు ప్రభువు ఆ పేద వితంతువు వేసిన రెండు కాసులను గురించి  అందరి కంటే ఎక్కువ ఆమె ఇచ్చినది  అని చెబుతున్నారు.  ఈ రెండు కాసులు ఎందుకు ఎక్కువ అంటే, ఈ పేద విధవురాలు ఎన్నో అవరోదాలను అధిగమించింది అయినా తన భక్తిని కోల్పోలేదు. ఈమెకు స్త్రీగా ఆనాటి కాలం అనేక విధాలుగా అసమాజం ఆమెను బాధించింది. మరియు ఆమెకు ఆదరువు ఎవరు లేరు కారణం ఏమిటి అంటే ఆమె ఒక వితంతువు. అంతే కాక ఆమె పేదరాలు ఇన్ని అవరోధాలు ఆమెకు ఉన్నకాని ఆమె కానుకను ఇవ్వడానికి సిద్దపడింది. ధనికులు వేయుచున్న కానుకలు వారి జీవితంలో ఎటువంటి మార్పు తీసుకురాదు. కానీ ఈ స్త్రీ వేసిన కానుక ఆమె జీవితంలో మార్పు తీసుకువస్తుంది. ఎందుకు అంటే ఆ రెండు కాసులను వేయడం వలన మరుసటి రోజు ఆమెకు ఏమి లేదు. 

యేసు ప్రభువు ఆమె గురించి తన సమస్త జీవనమును సమర్పించినది అని చెప్పారు. ఈ రెండు కాసులు ఆమె యొక్క సమస్త జీవనము. ఈ రెండు కాసులు మాత్రమే ఆమెకు ఉన్నటువంటి ఆస్తి ,  అయినట్లయితే , వాటిని ఆమె ఎందుకు సమర్పించినది? ఆమెకు జీవితము మీద ఆశ లేదా? లేక ఆమె తనకు ఉన్నటువంటిది మొత్తం దేవునికి సమర్పించి చనిపోవాలనువుకున్నదా? ఆమె దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నది అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎలాగంటే ఆమె పేదరాలు , పేదరాలిగా ఆమె దేవుని మీద ఆధారపడి జీవిస్తుంది. ఆమె ఒక స్త్రీగా ఆనాటి సమాజం తనను ఒక బలహీనురాలుగా ఉన్నది , బలహీనురాలిగా ఒక పురుషుని మీద ఆధారపడి జీవించవలసి ఉన్నది. ఆమె ఒక వితంతువు అవుట  వలన తన ఆధారపడుటకు ఎవరు లేరు. కనుక తన సమస్తం దేవుడే అవుతున్నాడు. అందుకే ఆ రెండు కాసుల మీద ఆధారపడకుండా వాటిని కూడా ఆ దేవాలయంలో కానుకల పెట్టెలో వేసి దేవుడే తన సమస్తము అని చాటుచున్నది. ఆమెకు దేవుని మీద ఉన్న నమ్మకం ఇక్కడ మనము చూడవచ్చు. ఈ రెండు కాసులను దేవునికి సమర్పిస్తే మరుసటి రోజు ఎలా గడుస్తున్నది అనే చింత లేదు. దేవుడు తనను ఆదుకుంటాడు అనే దానికంటే అయన ఇప్పుడు ఎలా ఆదుకుంటున్నాడు అనే విషయంలో నిమగ్నమయ్యింది. అంతేకాకుండా ఆమె దేవునికీ పూర్తిగా అంకితమైనది. దేవున్ని తన ఆస్తిగా చేసుకున్నది. 

సమృద్ధి నుండి అనేక మంది ధనికులు కూడా అక్కడ అర్పణ ఇచ్చారు, అవి ఇవ్వడం వలన వారికి ఎటువంటి లోటు ఏర్పడలేదు. ఆ ధనము వారి దగ్గర లేక పోవడం వలన వారికి ఎటువంటి ఇబ్బంది కలుగుటలేదు. మనం అర్పించే అర్పణ కేవలం మన దగ్గర ఉన్న మిగులు మాత్రమే అయితే అది నిజమైన అర్పణ కాదు. మనము అర్పించే ప్రతి అర్పణ అది మన జీవితంలో భాగం అయిఉన్నట్లయితే అది గొప్ప అర్పణ అవుతుంది. ధనికులు తమ జీవితంలో ఉన్నటువంటి మిగులును అర్పించారు. పేద విధవరాలు తన సమస్తము అయిన రెండు కాసులను అర్పించింది. ధనికులు ఎక్కువ అర్పించిన అది వారికున్న సమస్తము కాదు, కానీ పేద విధవరాలు రెండు కాసులే అర్పించిన అది తన సమస్తము. అందుకే యేసు ప్రభువు ఆమె అందరికంటే ఎక్కువ ఇచ్చినది అని చెబుతున్నారు.  ఆమె తన సమస్తము సమర్పించి దేవున్ని తన సమస్తం చేసుకున్నది. 

ఈ సువిశేషభాగం  మనము మనకు ఉన్న మిగులును మాత్రమే దేవునికి సమర్పిస్తూ , ఆ మిగులు ఇవ్వడం వలన మనకు ఎటువంటి లోటు లేదులే అని ఆనందపడుతున్నామా? లేక కొంత బాధకు గురి అయినా మనకు ఉన్న మిగులుకాకుండా, ఉన్నదాని దేవునికి సమర్పించి దేవుని మీద నమ్మకం ఉంచుతున్నామా ? అని మనలను మనం పరిశీలించుకోవాలి అని తెలియజేస్తుంది. పేద వితంతువు వలే పూర్తిగా దేవుని మీద నమ్మకం ఉంచి జీవించే గొప్ప జీవితం మనకు కావాలి. దేవుడే మన సమస్తము కావలి. 

ప్రార్ధన  : ప్రభువా మీరు , మీ వాక్కుద్వారా మీ సంకల్పాన్ని మాకు తెలియజేస్తున్నారు. మాలో ఉన్న లోపాలను తెలియజేస్తున్నారు. మేము ఎలా జీవించాలో తెలియజేస్తున్నారు, మాలో ఉన్న లోపాలను ఎలా అధికమించాలో , మీ వలె ఎలా జీవించాలో తెలియజేస్తున్నారు.ఈ జీవితమునకును , మీరు ఇచ్చిన ప్రతి అనుగ్రహమునకును మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.  పేదరాలి దిన కానుకను చూచిన ప్రభువా! నేను నా జీవితంలో ధనికుల వలె , నాకు ఉన్న మిగులును ఇతరులతో పంచుకొని గొప్ప ఉదార స్వభావం కలిగిన వాడి వలే చెప్పుకొనుచున్నాను, నాకు మీరు ఇచ్చిన అని వరాలను అనుభవిస్తూ కూడా ఇతరులకు సహాయపడుటకు లేక మీకొరకు వినియోగించుటకు చిన్న ఇబ్బంది కూడా సహించలేకుండా ఉన్నాను.నాకు ఉన్నటువంటి ఆస్తి పస్తులు , నా సర్వస్వం అనే భావనలో ఉన్నాను.  ఇటువంటి ఆలోచనలతో చేసిన అనేక తప్పులకుగాను  నన్ను క్షమించండి. నాలో ఉన్న ఈ లోపాలను తీసివేయుటకు నాకు సహాయం చేయండి. పేద విధవరాలి వలె నేను కూడా నాకు ఉన్న సమస్తాన్ని మీకు అర్పించి, మీరే  నా సమస్తము అని తెలుసుకొని మిమ్ము  నా సమస్తముగా పొందే అనుగ్రహము దయచేయండి. ప్రభువా ! నిన్ను తెలుసుకొనుటకు మరియు అర్ధం చేసుకొనుటకు , మీ వలె మారుటకు సహాయం చేయండి. ఆమెన్ 

లూకా 21:5-11

 లూకా 21:5-11

కొందరు ప్రజలు ఆలయమును గురించి  ప్రస్తావించుచు "చక్కని రాళ్లతోను , దేవునికి అర్పింపబడిన వస్తువులతోను ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు"అని చెప్పుకొనుచుండిరి. అంతట యేసు వారితో "ఈ కట్టడమును మీరు చూచుచున్నారుగదా! ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును. అంతయు నాశనము చేయబడును"అనెను. అపుడు వారు "బోధకుడా! ఇవన్నియు ఎప్పుడు సంభవించును? దానికి సూచనయేమి?" అని అడిగిరి. అందుకు, అయన "మిమ్ము ఎవ్వరును మోసగింపకుండునట్లు మెలుకువగా ఉండుడు. మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు, కాలము సమీపించినది అనియు చెప్పెదరు. కాని, మీరు వారివెంట వెళ్ళవలదు. యుద్ధములను, విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నియు జరిగితీరును. కాని, అంతలోనే అంతము రాదు." ఇంకను అయన వారితో ఇట్లనెను:"ఒక జాతి మరియొక జాతిపై, ఒక రాజ్యము మరియొక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్లు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. 

ధ్యానం: యెరూషలేము దేవాలయం ఒక అద్భుత కట్టడం. ఆ దేవాలయం యిస్రాయేలు ప్రజల కీర్తిని చాటుచున్నది. అంతేకాక దేవాలయం మీద ఆ ప్రజలు ప్రేమను పెంచుకొని ఉన్నారు.  ఆ ప్రేమ ఎంతగా అంటే వారి జీవితంలో ప్రతి విషయం ఈ దేవాలయంతో ముడిపడి ఉండేది. యిస్రాయేలు ప్రజలు దేవాలయ అందం గురించి చెప్పుకుంటు గర్వించేవారు. ఇంతటి గొప్ప కట్టడం ఎక్కడ ఉండదు అనే భావం వారిలో ఉండేది. కేవలం కట్టడం గొప్ప తనమునే కాదు వారు ఈ దేవాలయం దేవుని సాన్నిధ్యానికి గుర్తు అని, ఇక్కడ దేవుడు ఉన్నాడు అని , వారికి మరియు దేవాలయమును ఎప్పటికి ముప్పు వాటిల్లదు అనే భావనలో జీవించేవారు. దేవాలయం  పడగొట్టబడుతుంది అనే ఆలోచన వారి మనసులలో ఎప్పుడు వచ్చేది కాదు. అటువంటి ఆలోచన వారి ఊహకు అతీతము. కాని యేసు ప్రభువు వారి యెదుట వారి ఊహకందని విషయం చెబుతున్నారు. వారి దృష్టిలో యెరూషలేము ఎప్పటికి నిలిచిపోయే కట్టడం. 

యేసు ప్రభువు ఇక్కడ రాతిమీద రాయి నిలువని కాలము వచ్చును అని, అంతయు నాశనము చేయబడును అని అంటున్నారు. ఎందుకు ఈ ప్రజలు ఇంత ప్రేమగా చూసుకునే దేవాలయమును దేవుడు కాపాడలేదు? ఈ ప్రజలు కేవలం దేవాలయం బయట అందాన్ని మాత్రమే చూస్తున్నారు.  వారు ఎప్పుడు నిజమైన ఆరాధన, దేవునికి ఇష్టమైన జీవితం ఎలా ఉండాలి అనే విషయాలను వారు పట్టించుకోలేదు. దేవునికి ఇష్టం లేని పనులను వారు చేస్తున్నారు. యిర్మీయా ప్రవక్త చెబుతున్న విధముగా దేవుడు వారి నుండి తన సాన్నిధ్యాన్ని తీసివేయుటకు వెనుకాడడు. దేవుడు తన సాన్నిధ్యాన్ని మొదట షిలోలో ఎరుక పరిచినప్పుడు వారు అనేక విధాలుగా వృద్ధి చెందారు. కాని  వారు ఆయనకు ఇష్టం లేని జీవితం జీవించినప్పుడు తన సాన్నిధ్యాన్ని అక్కడ నుండి తీసివేస్తున్నారు.  ఇక్కడజరుగుతున్నది ఇదే  యెరూషలేము ప్రజలు దేవునికి వ్యతిరేకముగా జీవించినప్పుడు దేవుడు ఇక్కడ నుండి తన సాన్నిధ్యం తొలగిస్తారు.  కాని తన కుమారుని ఇక్కడకు పంపడం ద్వారా తన సాన్నిధ్యం పొందే అవకాశాన్ని మరల కలిగిస్తున్నారు. దేవాలయం ద్వారా కాకుండా యేసు ప్రభువు ద్వారా ప్రతి వ్యక్తి దేవుని సాన్నిధ్యాన్ని పొందుట జరుగుతుంది.  కనుక యెరూషలేము దేవాలయం పడగొట్టబడిన ప్రజలు దేవుని సాన్నిధ్యం పొందుట  యేసు ప్రభువులో జరుగుతుంది. 

యేసు ప్రభువు 'దేవాలయం ధ్వంసం చేయబడుతుంది' అని చెప్పగానే వారిలో కొంత భయం , బాధ కలిగి యేసు ప్రభువును ఇవి అన్ని ఎప్పుడు జరుగుతాయి అని అడుగుతున్నారు. వారు యేసు ప్రభువును సూచనలు అడుగుతున్నారు. దేవాలయం ద్వారా కాకుండా దేవుని కుమారుడు అయిన యేసు ప్రభువు ద్వారా మనము దేవుని సాన్నిధ్యం పొందవచ్చు కాని అయన పేరు చెప్పుకొని , అయన వలే ఉన్నామని, అనేక మంది దైవ సాన్నిధ్యం తమ ద్వారా పొందవచ్చు అని  చెబుతూవుంటారు. వారిని చూసి మోసపోవద్దు అని ప్రభువు చెబుతున్నారు. అనేక మంది యేసు ప్రభువు వలె వచ్చి మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. యేసు ప్రభువు వలె జీవించడం ఎవరికీ కుదరదు. నిజమైన క్రీస్తు అనుచరులు ఎవరు తామే క్రీస్తు అని చెప్పుకోరు. ఎందుకంటే వారి జీవితం మొత్తం ఆయనను అనుసరించడానికి వినయంతో వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. అబద్ధికుడు మాత్రమే అయన డాంభికము కోసం అయన వలె నటిస్తూ ఆ వినయమును చూపించలేక తమ కపటత్వాన్ని కొంతకాలానికి బయలుపరుస్తారు. మనము   యేసు ప్రభువు వలె సంపూర్ణంగా మారడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. 

ప్రార్ధన: సర్వ సృష్టికి కారకుడవైన ప్రభువా , మీరు ఇచ్చిన తెలివి , జ్ఞానము  చేత మేము ఈ ప్రకృతిని, లోకమును సుందరముగా తీర్చి దిద్దుతున్నాము. వాటిని మా గొప్పతమునుగా భావిస్తూ, మీ అవసరం మాకు లేదు అన్నట్లు జీవిస్తున్నాము. అటువంటి పనులు చేస్తున్నందుకు మమ్ము క్షమించమని వేడుకుంటున్నాము. ప్రభువా మేము మీమమ్ములను కాదని ఈ లోకమును ఈ లోక వస్తువులను ప్రేమిస్తూ అవే ముఖ్యం అని జీవిస్తున్నందుకు మమ్ములను మన్నించండి. ప్రభువా మాకు ఏది సత్యమో , ఏది అసత్యమో తెలియక మేము అనేక మంది చేత చెడు మార్గాలలో నడిపించబడుతున్నాము.  అటువంటి సందర్భంలో మాకు సత్యాన్ని తెలియచేసి మిమ్ములను అనుసరించేలా చేయండి. ప్రభువా దేవాలయం లేకపోయినా మీ ద్వారా ప్రజలు దేవుని కనుగొన్నారు, మీద్వారా తండ్రిని చేరుకున్నారు. మీరు ఎలా దేవాలయం చేసే పనిని మీరు మీ జీవితం ద్వారా చేస్తున్నారో, మేము కూడా ముందు మిమ్ములను అనుసరిస్తూ , తండ్రిసాన్నిధ్యాన్ని పొందే అనుగ్రహం దయచేయండి

తోబియా జీవిత కథ

 తోబియా జీవిత కథ మనము రక్షణ గ్రంధంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ఉద్దేశంతో దేవుడు తన సేవ కొరకై మరియు తన ప్రజలను రక్షించడానికి ఎ...