26, ఫిబ్రవరి 2026, గురువారం

యోహను 16:5-11

 యోహను 16:5-11 

కాని, ఇప్పుడు  నన్ను పంపిన వాని యొద్దకు పోవుచున్నాను. మీలో ఎవడు "నీవు ఎక్కడకు పోవుచున్నావు"? అని నన్ను అడుగుట లేదు. నేను మీకు ఈ విషయములు చెప్పినందున మీ హృదయములు దుఃఖముతో నిండి వున్నవి. ఐనను  నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్లనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ వద్దకు పంపేదను. ఆయన వచ్చి పాపమును, నీతిని మరియు తీర్పును గురించి లోకమునకు నిరూపించును. పాపమును గురించి ఎందుకన వారు నన్ను విశ్వసించుట లేదు. నీతిని గురించి ఎందుకన , నేను తండ్రి యొద్దకు పోవుచున్నాను. ఇక మీరు నన్ను చూడరు. తీర్పును గురించి ఎందుకన, ఈ లోకాధిపతికి తీర్పు విధింపబడినది.  

యేసు ప్రభువు తన తండ్రి వద్దకు పోయేముందు, తన వీడ్కోలు ఉపదేశంను తన శిష్యులకు ఇస్తున్నాడు. ఈ సమయంలో శిష్యులు ఎవరు ఆయనను నీవు ఎక్కడకు వెళుతున్నావు? అని అడగలేదు. అందరు బాధలో ఉన్నారు, ఆయన వారిని వీడి పోతున్నారు కాని పూర్తిగా వారికి అక్కడ ఏమి జరుగుతుందో  తెలియదు. వారికి అర్ధం అయిన విషయం వారి గురువు వారి నుండి వెళ్ళిపోతున్నారు. అందుకు వారు బాధ పడుతున్నారు. యేసు ప్రభువు ఈ మాటలను మొదటి సారి చెప్పడం లేదు, అనేక సార్లు చెప్పి ఉన్నారు. ఇప్పుడు చెబుతున్న మాటలు ఖచ్ఛితముగా వారిలో ఒక మార్పు తీసుకువస్తున్నాయి, ఎందుకంటే వారు, యేసు ప్రభువుకు వ్యతిరేకముగా జరుగుతున్న పరిస్థితుల గురించి అవగాహన చేసుకుంటున్నారు. కనుక వారు ఏమి అడగడానికి సహసించలేదు. అంటే వీరికి పూర్తిగా ఆయనకు ఎటువంటి కష్టాలు వస్తున్నాయో తెలుసు అని కాదు అర్ధం. వారి దృష్టిలో ఇది వారికి అర్ధమయ్యే విషయం కూడా కాదు. కనుక దాని గురించి వారు ఏమి మాటలాడుటలేదు. 

నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరం : యేసు ప్రభువు నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరం అని చెబుతున్నారు. ఎందుకు శ్రేయస్కరం అంటున్నారు అంటే ఆయన వెళితే ఓదార్చువాడు అయిన పవిత్రాత్మ  వస్తాడు. ఆయన పాపము, నీతి , మరియు తీర్పు గురించి లోకామునకు నిరూపిస్తాడు. ఎందుకు వీటి గురించి లోకానికి తెలియచేయాలి? లోకం ప్రభువును తెలుసుకోవాలి, ఆయనను విశ్వసించాలి, పాపమును వదలి వేయాలి. లోకము యేసు ప్రభువును విశ్వసించక, అవిశ్వాసంతో జీవిస్తుంది. పాపము మానవున్ని ఏమి చేస్తుందో పవిత్రాత్మ తెలియజేస్తుంది. లోకం చేసిన తప్పు ప్రభువును విశ్వసించకపోవడం. నీతి గురించి లోకమునకు తెలియదు, నీతి లోకం దృష్టిలో క్షణికమైంది కాని నిజానికి అది శాశ్వతమైనది. అంతే కాదు పవిత్రాత్మ యేసు ప్రభువును నమ్మక , ఆయన చెప్పినట్లు జీవింపకపోతే వచ్చే తీర్పు గురించి తెలియచేస్తుంది. మనకు ప్రభువు నేర్పిన విషయములను అన్నింటిని గుర్తుకు తెస్తుంది.

 అంతే కాదు ప్రభువు నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరం అని శిష్యులకు చెప్పేది, ఇంకా ఎందుకంటే ప్రభువు మీదనే ఇంకా శిష్యులు ఆధారపడుతారు, కాని ప్రభువు వారి నుండి వెళ్ళిన తరువాత పవిత్రాత్మ సహాయంతో వారు లోకం అంతట ప్రభువు గురించి , దేవుని రాజ్యం గురించి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడ శిష్యులు కేవలం స్వీకరించేవారు కారు, ఆయన వారి నుండి వెళ్ళిన తరువాత వారు  ప్రభువును పంచే వారు అయ్యారు. దానికి ప్రభువు వారి వద్ద నుండి వెళ్లారు. దీనికి పవిత్రాత్మ వారికి సహాయం చేస్తుంది. యేసు ప్రభువు పాపము గురిచి చెబుతున్నారు,ముఖ్యంగా ఈ లోకం యొక్క ఘోరమైన  పాపం  ఏమిటి అంటే ఆయనను నమ్మక పోవడం, విశ్వసించక పోవడం. కొన్ని సార్లు మనం కూడా ఇలానే ఉంటూ వుంటాం. ఆయన చెప్పే మాటలను మనం పాటించక పోవడం.

 నీతి గురించి ప్రభువు చెబుతున్నారు, ఇక్కడ యేసు ప్రభువు గురించి ఈ మాటలు వున్నవి. ఆయన తండ్రి దగ్గరకు వెళుతున్నారు. ఆయన నిత్యం ఉండువాడు. తండ్రి దగ్గరకు వెళ్ళిన ఆయన జీవించువాడు. ఆయన ఎంతో నీతిమంతుడు, ఆయన చేసినవి అన్ని నీతితో కుడినవే. కానీ లోకం ఆయన నీతిని అంగీకరించలేదు. ఆయన్ను సాతాను సాయంతో సాతానును వెడలగొడుతున్నాడు అని అన్నది, ఆయన మంచిని లోకం అంగీకరించలేదు. సబ్బాతు రోజున ఆయన చేసే మంచి వద్దు అన్నది. ఆయన కరుణను అంగీకరించలేక పోయింది. యోహను తన సువిశేషం మొదటిలోనే చెప్పాడు ఈ విషయం. దేవుడు వెలుగుగా లోకమునకు వచ్చినప్పటికీ మానవుడు వెలుగు దగ్గరకు పోవుటకు ఇష్ట పడలేదు, ఎందుకంటే మానవుని పాపం, అవినీతి ఎక్కడ ఈ వేలుగులో కనపడుతుందో అని , చీకటినే ప్రేమించాడు మానవుడు. వెలుగు దగ్గరకు పోవడానికి భయ పడ్డాడు. మనం కూడా కొన్ని సార్లు ఇలానే జీవిస్తూ ఉంటాం. దేవుని దగ్గరకు పోతే ఎక్కడ మన నిజ జీవితాలు బయట పడుతాయో అనుకుంటూ వుంటాం. అందుకే పవిత్రాత్మ మనకు పాపం దాని పర్యవసానం గురించి తెలియ చేస్తుంది అని ప్రభువు పలుకుతున్నారు. 

మీరు నన్ను చూడరు,అని యేసు ప్రభువు చెబుతున్నారు.  శిష్యులు యేసు ప్రభువు యొక్క శిష్యులు ఆయన తండ్రి వద్దకు వెళ్ళిన తరువాత ఆయన వారికి  దూరం  అయి పోతారు. కాని వారికి ఆదరణ కర్తను పంపుతాను అని చెబుతున్నారు. ఈ అధరణ  కర్త కేవలం వీరికి వీటిని చెప్పడమే కాదు వీరికి సహాయ పడుతుంది. పాపం చేయడం ద్వారా మనం దేవుని నుండి మనం పొందే ఎడబాటు గురించి తెలియచేస్తుంది. అంతే కాదు యేసు ప్రభువు ఈ పాపన్ని జయించుటకు చేసిన అన్ని కష్టాలును తెలియజేస్తుంది. మరియు సాతాను ను జయించిన దానిని తెలియజేస్తుంది. మనం కూడా క్రీస్తు ను అనుసరించి , పవిత్రాత్మ సహాయంతో సాతానును జయించుదాం.

ప్రార్దన : ప్రభువా మీరు తండ్రి వద్దకు వెళ్ళుటకు ముందుగ మీ శిష్యులను మీ ఎడబాటును తట్టుకోవడానికి వారిని ముందుగానే సిద్ధం చేశారు. మీరు  మీరు ఎక్కడకి వెళుతున్నది, ఎందుకు వెళుతున్నది వారికి తెలియజేస్తున్నారు. మీ ఎడబాటులో  వారని ఆధారపడే వారి నుండి ఆదరించే వారిగా మారుతున్నారు. మీరు పంపిన పవిత్రాత్మ  వారిని ఇలా చేస్తుంది. మా జీవితంలో కూడా ప్రభువా మేము మాకు  తోడుగా ఉండుటకు మీ ఆత్మను పంపంచి, మమ్ములను ఎప్పుడు కూడా మా విశ్వాసమందు గట్టిగా ఉండేలా చేయండి.  మాకు ఎల్లప్పుడు కూడా  మీ ఆత్మ తోడుగా ఉండే విధంగా మమ్ము దీవించండి. మీ పవిత్రాత్మ ఏ విధముగా అయితే పాపం గురించి, నీతి గురించి మరియు తీర్పును గురించి తెలియజేస్తున్నదో అవి మేము తెలుసుకొని మిమ్ము విశ్వసించి, ఎప్పటికీ పాపములో పడకుండా, మేము నీతి వంతమైన జీవితం ప్రతి నిత్యం జీవించి, మీరు తీర్పు తీర్చుటకు వచ్చినప్పుడు మిమ్ములను చూచుటకు, మీతో పాటు వుండుటకు కావలనసిన అనుగ్రహం దయచేయండి. ఆమెన్ 

యోహాను 16:12-15

 యోహాను  16:12-15 

 సువిశేషం : నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది. కాని, ఇప్పుడు మీరు వానిని భరింపలేరు. ఆయన, సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమి బోధింపక తాను వినిన దానినే బోధించును. జరుగబోవు విషయములను మీకు తెలియ చేయును. ఆయన నన్ను మహిమ పరుచును . ఏలన , ఆయన నాకున్న దానిని , నా  నుండి గైకొని దానిని మీకు తెలియ చేయునని చెప్పితిని. తండ్రికి ఉన్నదంతయు నాది. అందుచేత నానుండి గైకొని మీకు తెలియచేయును అని చెప్పితిని. 

"ఇప్పడు మీరు వానిని భరింపలేరు", ఎందుకు వీరు యేసు ప్రభువు చెప్పే వాటిని భరించలేరు, కారణం ఏమిటి అంటే వీరు కష్టాలు, బాధలు పొందటానికి ఇంకా సిద్ధంగా లేరు. అందుకే యేసు ప్రభువు వారికి ఈ విషయమును వెల్లడిచేస్తున్నారు. ఇది యేసు ప్రభువుని వీడ్కోలు ఉపదేశం, అంటే వారు ఆయనను ఒక రాజుగా జయ జయ నినాధాలతో యెరుషలేము నగరములోనికి ఆహ్వానించిన తరువాత ఇది  జరుగుతుంది. శిష్యులు యేసు ప్రభువును  ఒక వీరోచితమైన రాజుగా  చూస్తున్నారు. కాని యేసు ప్రభువు వారికి రాబోయే కష్టముల గురించి చెబుతున్నారు. ఆయన వెళ్ళిన తరువాత వారి జీవితాలలో వచ్చే హింసల గురించి యేసు ప్రభువు వారికి పూర్తిగా చెప్పటం లేదు. 

 ఎందుకు యేసు ప్రభువు వారికి వారు పొందబోవు శ్రమల గురించి పూర్తిగా చెప్పడం లేదు? వీరు ఆయన వారి నుండి వెళ్ళిన తరువాత చాలా క్రూరమైన హింసలకు గురిఅయ్యారు, అప్పుడు వాటిని భరించారు కాని ఇప్పుడు వీరికి ఇటువంటి వాటిని తట్టుకునే శక్తి లేదు, అందుకే వారికి పవిత్రాత్మ వచ్చిన తరువాత ఇవన్నీ అర్ధం అవుతాయి అని చెబుతున్నారు. దేవుడు మనలను మనం భరించ లేని కష్టాలుకు గురిచేయరు. అందుకే వారు పొందబోయే హింసలు ,కష్టాలు అన్ని వారికి చెప్పడం లేదు. ఇవన్నీ తెలియజేయడానికి, ఆ కష్ట కాలంలో పవిత్రాత్మ వారికి సహాయం చేస్తుంది. వారికి యేసు ప్రభువు తండ్రి దగ్గరకు పోయేంత వరకు చెప్పేమాటలు, రాబోవు పరిస్థితులను తట్టుకొనే విధంగా వారికి ఒక తర్ఫీదు కాలం ఆవుతుంది.  అంతే కాదు వారికి ఆ సమయాల్లో ఏమి చేయాలో , ఏమి చెప్పాలో కూడా పవిత్రాత్మ వారికి తెలియ జేస్తుంది. దీనిని మనం  యేసు ప్రభువు శిష్యులు , పాలకులు, పెద్దలు మొదలగువారి ముందు  మాటలాడినప్పుడు వారు ఎటువంటి జ్ఞానం తో మాటలాడింది, మనం అపోస్తుల కార్యాలలో చూస్తాము. దీనికంతటికి తోడ్పడు ఇస్తుంది, నడిపిస్తుంది, పవిత్రాత్మయే. 

"ఆయన సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పడు మిమ్మును సంపూర్ణ సత్యమునకు నడిపించును" : యేసు ప్రభువు వలె సత్యమును బోధించుటకు, సత్యమునకు నడిపించుటకు  ఇప్పుడు పవిత్రాత్మ యొక్క అవసరం శిష్యులకు  ఉంది. సత్యం మనకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మన పాపమును అది చూపిస్తుంది.  మన చెడు జీవితమును మనకు తెలుపుతుంది.  ఈరోజుల్లో మనం ఏది మనకు అనుకూలంగా ఉంటుందో దానికి పాటించుటకు ఇష్ట పడుతున్నాము. సత్యమును పాటించుటకు ఇష్టపడుటలేదు. సత్యం మనలను అనేక బందనముల నుండి విముక్తులను చేస్తుంది. సత్యం అంటే యేసు ప్రభువే.  యేసు ప్రభువు నేనే సత్యమును జీవమును మార్గమును అని చెప్పారు. 

పవిత్రాత్మ సత్య స్వరూపి , అంటే మనలను చేడుగా  నడిపించడు, మనలను ఎక్కడకు నడిపించాలి? మనం గమ్యం ఏమిటి?  యేసు ప్రభువు నేనే మార్గమును అని చెబుతున్నారు. మన మార్గం ఆయనే ఖచ్ఛితముగా మనలను పవిత్రాత్మ యేసు ప్రభువు దగ్గరకు నడిపిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువు సత్యము. అంతే కాదు యేసు ప్రభువు తన గురించి చెప్పేటప్పుడు,  నా అంతట నేను ఏమి చెప్పుటలేదు, నా తండ్రి నుండి చూసిన దానిని, వినిన దానినే నేను చెబుతున్నాను అని చెప్పారు. పవిత్రాత్మ కూడా తనంతట తాను ఏమి చేయదు, తాను వినిన దానినే బోధించును. 

"జరుగబోవు విషయములను మీకు బోధించును", పవిత్రాత్మ క్రైస్తవ సంఘానికి సహాయకునిగా , అనేక సమస్యలను తీర్చుటలో వీరికి సహాయ పడింది. అనేక సార్లు పవిత్రాత్మ వారికి ఏమి చేయాలో నేర్పుతుంది. పౌలు గారి మీద అందరు వ్యతిరేకంగా ఉన్నా,  పవిత్రాత్మ ఆయన మీదకు వస్తుంది , ఎందుకంటే ప్రభువే ఆయన్ను ఎన్నుకున్నారు కాబట్టి. పవిత్రాత్మ  వీరితో ఉన్నప్పుడు వీరు యేసు ప్రభువు జ్ఞానం  కలిగి ఉన్నారు. వారు ఎప్పుడు ఏమి చెప్పాలో పవిత్రాత్మ చెబుతుంది. 

ఆయన నాకున్న దానిని, గైకొని మీకు తెలియజేయును : ఇక్కడ యేసు ప్రభువు పవిత్రాత్మ యొక్క తత్వాన్ని తెలియ జేస్తున్నారు. ఆయన తెలుసుకున్నదానిని, వినిన దానిని తీసుకొని మీకు తెలియజేయును, తనంతట తాను ఏమి చెప్పడు. అంటే తండ్రికి ఉన్నదంతయు నాది, దానిని ఆయన మీకు ఇస్తాడు, తెలియ జేస్తాడు, అని  యేసు ప్రభువు చెబుతున్నారు. యోహను , తండ్రి అంతయు ఆయనకు ఇచ్చెను అని చెబుతున్నారు. మనకు అంటే తెలియ పరచడానికి పవిత్రాత్మ మనకు సహాయం చేస్తుంది. అన్నిటి మీద యేసు ప్రభువుకు అధికారం ఉన్నట్లు, మరియు అంతా ఆయనదే అని  పవిత్రాత్మ తెలియజేస్తుంది. ఆయన ఇచ్చే రక్షణ తెలియ జేస్తుంది. దానికి ఏమి చేయాలో తెలియ జేస్తుంది. ఇవన్నీ చేయడం ద్వారా పవిత్రాత్మ యేసు ప్రభువును మహిమ పరుస్తాడు.   పవిత్రాత్మ ఎప్పటికీ ఆయనకు వ్యతిరేకముగా ఏమి చెప్పడు. 

యేసు ప్రభువు అంతయు తండ్రి దగ్గర నుండి పొందుతున్నాడు. తండ్రిని చేరుకోవడానికి ఆయనే మార్గం. యేసు ప్రభువు తండ్రి దగ్గరకు పోతున్నప్పుడు పవిత్రాత్మకు అంతయు అప్పగిస్తున్నారు, ఇప్పుడు యేసు ప్రభువును తెలుసుకోవడానికి పవిత్రాత్మ మార్గం అవుతుంది. అంతేకాదు యేసు ప్రభువు చెప్పినవన్ని తెలియజేస్తుంది , ఆయన  శిష్యులను నడుపుతుంది. మార్గ చూపరి అవుతుంది. 

ప్రార్ధన : ప్రభువా ! మీరు తండ్రి దగ్గరకు వెళుతున్నప్పుడు మీ శిష్యులకు తోడుగా ఉండుటకు, మరియు వారికి మీ వద్దకు నడిపించుటకు పవిత్రాత్మను వారికి సహాయంగా పంపారు. పవిత్రాత్మ వారికి  అన్ని విధాలుగా సహాయ పడుతూ , సంపూర్ణ సత్యమగు మీ వైపు నడిపినది, కాని ప్రభువా ఈ లోకంలో జీవిస్తూ మీ దరి  చేరాలని కోరిక ఉన్న అనేక సార్లు చెడు మార్గాలలో నడుస్తున్నము  ప్రభువా, అటువంటి అపదల నుండి మాకు సహయం చేయుటకు మాకు తోడుగా ఉండుటకు పవిత్రాత్మను మాకు అనుగ్రహించండి. ఆమెన్ 

లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...