26, ఫిబ్రవరి 2026, గురువారం

యేసు క్రీస్తు జనన మహోత్సవం

 యేసు క్రీస్తు జనన మహోత్సవం


లూకా 2:1-14 

తన సామ్రాజ్యమునందు జనాభా లెక్కలు సేకరింపవలెనని అగుస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు వ్రాయించు కొనుటకు ప్రజలందరు తమ తమ పట్టణములకు వెళ్లిరి. యోసేపు , దావీదు వంశస్తుడైనందున గలిలీయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు పట్టణమగు బేత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు నిశ్చితార్ధము చేయబడిన , గర్భవతియునైన మరియమ్మను కూడా వెంటపెట్టుకొని వెళ్లెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండ బెట్టెను. ఏలయన వారికి సత్రములో చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో గొర్రెల మందలను కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రతక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయ భ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను: "మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు, ప్రభువు. శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుటమీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు" అనెను. 

దేవదూతల సందేశం : శాంతి సమాధానం మరియు ఆనందం 

 ఒక తార వెలసింది- భువి అంత వెలుగునింపింది. దేవుని మానవున్ని మధ్య సంబందం చిగురింపచేసింది. మానవుడు ఎల్లప్పుడూ  ఆనందంగా ఉండాలని కోరి, మానవ వికాసాన్ని పెంపొందేలా చేసిన పండుగ క్రీస్తు జననం.   నిజమైన సంతోషము సమాధానంకు చిరునామా క్రీస్తు జననం. ఒకరిని హింసించడం లేక మరణానికి గురిచేయడం కాకుండా కాపాడటానికి నాంది పలికేది ఈ పండుగ. దేవుడు మానవునితో ఉండాలని, మానవ స్వభావాన్ని పావనం చేయాడానికి దేవుడు చేసిన గొప్ప కార్యం ఈ క్రీస్తు   జన్మ దినము.  దేవుడే మానవునితో కలిసి జీవించడానికి రావడమే ఈ పండుగ. ప్రతి ఒక్కరు చిన్న, పెద్ద, పేదవాడు, ధనికుడు,  అనే తారతమ్యం లేకుండా కలిసి జీవించేందుకు నాంది ఈ పండుగ.  మానవున్నీ దేవుని కుమారునిగా చేసేది, దానికి మార్గం సుగమం చేయడమే క్రీస్తు జనన ఉద్దేశం. యేసు ప్రభువుని జననం, ప్రతి ఒక్కరికి శాంతి సమాధానము అనే సందేశమును మొదటిగా తెలుపుతుంది. దేవదూతలు ఈ వార్తను గొర్రెల కాపరులకు వినిపిస్తున్నారు. గొర్రెల కాపరులకు  ఆనాటి సమాజంలో ఎటువంటి శుభకార్యానికి ఆహ్వానము వీరికి ఉండదు. వీరిని దొంగలుగా చూసేవారు, అటువంటి వారికి శుభ వచనము, దేవుని రాక గురించి చెప్పడం ద్వార యేసు ప్రభువు జననము సమాజంలో అసమానతలను అనుభవించేవారికి, వారికి సమానత్వమును,  ఆనందం ఇచ్చే పండుగ అని తెలుస్తుంది.  

దేవుడు మానవుడు అగుట 

 యోహాను సువిశేషము మొదటి అధ్యాయం 12,  వచనంలో  దేవుడు ఎలా మనతో ఉండుటటకు ఇష్ట పడుతున్నాడు అని చదువుతాం. "అయన  ఈ లోకమున ఉండెను అయన మూలమున  ఈ లోకము సృజింపబడెను. అయినను లోకము ఆయనను తెలిసికొన లేదు. అయన తన వారి వద్దకు వచ్చెను తన వారే ఆయనను అంగీకరింపలేదు. "  యేసు ప్రభువు ఈ తన తండ్రి వద్దనుండి పరలోకం నుండి భూలోకమునకు వచ్చినది మనతో ఉండటానికి.  మానవునిలా జీవించడం, మానవుని కష్టాలు భరించడం దేవునికి ఏమి తెలుసు అనుకుంటూ ఉండేవారిని చూస్తూనే ఉంటాము. కాని యేసు ప్రభువు పరలోకం వదలి భూమి మీదకు ఒక సాధారణ వ్యక్తి వలె వచ్చి, మన మధ్య జీవించారు. మానవుడు పొందే అన్ని బాధలు కష్టాలు అనుభవిస్తున్నారు. దీనిద్వారా ఈ మానవ జీవితాన్ని పావనం చేస్తున్నారు. మానవున్ని దైవ పుత్రత్వం కలిగి ఉండేలా చేసుంది. 

దేవుని ఉదారత 

"ఆయనను అంగీకరించి, విశ్వసించిన వారందరికి అయన దేవుని బిడ్డలగు భాగ్యమును ప్రసాదించెను. ఈ దైవ పుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కానీ , రక్తము వలన కాని శరీరేచ్ఛవలన కాని మానవ సంకల్పము వలన గాని కలిగినది కాదు." క్రీస్తు జననం మనకు ఏమి ఇస్తుంది. యేసు ప్రభువు లేక దేవుడు మానవునిగా మానవు రూపంలో ఈలోకంలో పుట్టుట ద్వారా మన మానవ జీవితాన్ని పవిత్ర మొనర్చడామె కాకుండా దాన్ని దైవీకం చేస్తున్నాడు. దీనిద్వారా దేవుడు తనను తాను మనకు అర్పించుకుంటున్నాడు. దేవుడు మన మధ్యకు వచ్చి నివసించి మనకు దైవ ఔన్నత్యన్నీ చూపిస్తున్నాడు. మనము ఎంత గొప్పగా జీవించ వచ్చు అనేది నేర్పుతున్నారు.   దీనినే మనం యోహాను సువిశేషం మొదటి అధ్యాయం 12 వ వచనములో చూస్తున్నాము. దేవుడు తనని తాను, మనకు ఒక బహుమానంగా ఇస్తున్నాడు. ఆయనను స్వీకరించే వారు దానికి సిద్ధముగా ఉండాలి. ఇది దేవుడు మననుండి ఏమి ఆశించకుండా మనకు ఒక బహుమానంగా ఇస్తున్నాడు. దీనిని మనము నేర్చుకోవాలి. 

మానవ స్వభావం - దైవ స్వభావంగా మారుటకు నాంది 

ఏ విధంగా యేసు ప్రభువు ఈ మానవ జీవితాన్ని దైవికం చేస్తున్నాడు అంటే మొదటిగా తాను ఈ లోకంలో మానవునిగా పుట్టుట ద్వారా ఆయన మానవ స్వభావాన్ని పంచుకోవాడమే కాకుండా దానికి మరియొక లక్షణాన్ని ఇస్తున్నాడు. అది ఏమిటి అంటే దైవత్వం కలిగిఉండేలా చేయడం.  ఇది చేయడం వలన ప్రతి వ్యక్తి కేవలం మానవునిగా మాత్రమే కాక ఈ మానవ స్వభావాన్ని దైవికంగా మార్చుకోవడానికి నాంది పలకడం జరిగింది. ప్రతి మానవ భావాన్ని , లక్షణాన్ని దైవికం చేసే అవకాశం మనకు కూడా ఇస్తున్నాడు. 

పరలోక వాణి 

క్రీస్తు జననం - ప్రతి ఘడియ పరలోక వాణి  అని తెలియజేస్తుంది. ఏమిటి పరలోక వాణి  అంటే యిస్రాయేలు ప్రజలు పరలోకానికి భూమికి మద్య ఒక ఎడబాటు ఉంది అని విశ్వసించేవారు. ఈ ఎడబాటు ఎప్పుడు అయితే పరలోక వాణి వినపడుతున్నదో అప్పుడు తీసివేయబడుతుంది అని వారు నమ్మేవారు. ఈ ఎడబాటు తీసివేయడం అంటే పరలోకం మరియు భూమి ఏకమవుతున్నవి అని అర్ధం, అంటే దేవుడు మానవుని దగ్గరకు వచ్చాడు అని అర్ధం. యేసు ప్రభువుని జననంతో ఈ పరలోక వాణి ప్రతి నిత్యం, మానవుడు పొందే భాగ్యం పొందాడు అని అర్ధం. మొదటి మానవునితో కలిసి నడిచిన దేవుడు మరల ఇప్పుడు ప్రతి మానవునికి దేవునితో  కలిసి జీవించడానికి అవకాశం ఇస్తున్నాడు.

దేవుని యొక్క సంపూర్ణత తెలుసుకొనే అవకాశం 

 దేవుడు మనుష్య రూపేణా అంటే అది  కేవలం యేసు ప్రభువు మాత్రమే అవుతారు,  ఎందుకంటే మనం ఆయన జీవితంలో ఎటువంటి అపరిపక్వత లేక అసంపూర్ణం అనేది చూడం.  ఈలోకములోని  ఎంతటి గొప్ప వ్యక్తి అయిన కాని అతనిలో  ఏదో ఒక అసంపూర్ణత మనం చూస్తూనే ఉంటాము. యేసు ప్రభువు జననము దేవుని సంపూర్ణతను తెలుసుకొనేలా చేస్తుంది. అంతే కాక ఆయన పరిపూర్ణతలో మనము భాగము ఎలా పొందలో తెలుసుకొని మార్గమునకు అంకురార్పణ జరిగినది ఈ రోజు. కనుక మనకు దేవుని సంపూర్ణతను తెలుసుకోవటమే కాక దేవుని కలుసుకొనే అవకాశం పొందటం జరుగుతుంది. దేవున్ని అనుభవించడం, కలుసుకోవడం అనేక విధాలుగా మనం బైబుల్లో చూస్తాము. మోషే మండుతున్న పొదలో దేవున్ని కలుసుకోవడం, దివ్య మందసంలో దేవున్ని కలుసుకోవడం ఇవన్నీ ఒక భాగం కాని క్రీస్తు పుట్టుక వీటన్నింటికన్నా  పరిపూర్ణత సంతరించుకున్నది. కనుక మానవుడు దేవుని పరిపూర్ణతను యేసు క్రీస్తు ద్వారా తెలుసుకుంటున్నాడు. 

యేసు జననం దేవుని ప్రణాళికా ప్రకటన 

మానవునికి సంభందించి దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ప్రణాళికా ఏమిటి? మానవునితో కలసి ఉండుటకు దేవుడు సిద్ధంగా ఉంటాడా? మానవునికి దేవునికి మధ్య తెగిపోయిన సంబంధమును దేవుడు బాగుచేయుటకు సిద్ధంగా ఉన్నాడని తెలియచేస్తుంది, యేసు ప్రభువు జననం. అంతే కాదు, తెగిపోయిన  దైవ-మానవ సంబంధం సరిచేయడం మరియు మానవుని రక్షణకు పరిపూర్ణ అంకురార్పణ జరిగింది అని తెలియజేస్తుంది. దేవుడు మనతో ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు అని చెబుతున్నాడు. 

 దేవుడు ఇచ్చే పాప క్షమాపణ -  చూపే పరి పూర్ణ ప్రేమను సంపూర్తిగా అర్ధం చేసుకునే మార్గం సుగమమం 

దేవుని ప్రేమ మానవుడు పరిపూర్ణంగా తెలుసుకునే మార్గం మనకు తెలిసేది కేవలం యేసు ప్రభువు ద్వారానే. ఎందుకంటే ఆయనే దేవుని ప్రేమను సంపూర్ణముగా మనకు తెలియజేయడం జరిగినది. ఎంతో మంది దేవుని ప్రేమ గురించి దేవుడు క్షమించే విధం గురించి చెప్పిన యేసు ప్రభువు వలె ఎవరు అంత పరిపూర్ణంగా ఆ ప్రేమను కాని, దేవుని క్షమాపణ గురించి ఎవరు యేసు ప్రభువులా చెప్పలేదు. అందుకే ఈ రోజు దేవుని ప్రేమ క్షమాపణ పూర్తిగా తెలుసుకోవడానికి అంకురార్పణ జరిగిన రోజు ఇది. కనుక ఈ మానవ స్వభావాన్ని దేవుని అనుగ్రహంతో పావనము చేయుటకు ప్రయత్నించుదాం.  ఆమెన్ 


23 వ సామాన్య ఆదివారం

  23 వ సామాన్య ఆదివారం 

లూకా 14:25-33  

అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను: నన్ను వెంబడింపగోరి ,తన తల్లిదండ్రులను, భార్యను,బిడ్డలను అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్ట దలచిన వాడు కూర్చుండి వ్యయము గుణించి, దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా, లేదా అని పర్యాలోచన చేయడా?అటుల కాక, పునాది వేసిన పిదప, నిర్మాణము పూర్తి చేయజాలని యెడల చూచు వారు, ఇతడు ఆరంభశూరుడే కాని కార్య సాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్దమునకు వెళ్ళుటకు ముందు, ఇరువది వేల సేనతో తన పై దండెత్తి వచ్చు శత్రురాజును తన పదివేల సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడా? అంత బలము లేని యెడల, శత్రురాజు సమీపించక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధి చర్చలు జరుపును. కనుక తన సమస్తము త్యజియించిన తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు. 

"అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను." యేసు ప్రభువు చేసే పనులను చూసి ఆయన అద్భుతములను చూసి, ఆయన వారికి సమకూర్చుతున్న ఆహారం చూసి అనేక మంది ఆయనను ప్రవక్తగా, రక్షకునిగా భావించి  ఆయనను వెంబడిస్తున్నారు. ఎక్కువ మంది ఆయన నుండి ఏదో ఒకటి ఆశించి ఆయనను అనుసరిస్తున్నారు. అది తప్పు కాదు. కాని నిజానికి ఆయన ఇవన్నీ ఇస్తున్నప్పటికి, వీటికంటే ఆయన వాగ్ధానం చేసేది గొప్పది. నిజానికి ప్రజలకు దాని గురించి అవగాహన లేదు.  ఆయనతో ఉన్న వారు అందరు ఆయన అనుచరులం అని అనుకుంటున్నారు. ఆయన అనుచరులు కావాలి అని అనుకునేవారు ఏమి చేయాలో, ఎలా ఉండాలో యేసు ప్రభువు ఈనాటి సువిశేషంలో తెలియ పరుస్తున్నారు. 

యేసు ప్రభువును వెంబడించాలి అనుకునేవారు ఏమి చేయాలి? యేసు ప్రభువు చెబుతున్న షరతులు ఏమిటి అంటే "తన తల్లిదండ్రులను, భార్యను,బిడ్డలను అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు." అని ప్రభువు చెబుతున్నాడు.  తల్లి దండ్రులను గౌరవించాలి అనేది ధర్మ శాస్త్రం లో ఉన్నది, కుటుంబాన్ని కాపాడుతూ, వారిని మంచిగా తీర్చి దిద్దటం, బాధ్యత గల ప్రతి యూదుని కర్తవ్యం. దానిని దేవుడు కూడా ఎంతో హర్షిస్తాడు, మరి యేసు ప్రభువు ఎందుకు ఇలా మాటాడుతున్నారు? ఒక సారి యేసు ప్రభువు దేవాలయంలో తప్పి పోయినప్పడు ఏమి అంటున్నారో చదివితే మనకు ఒక విషయం అర్ధం అవుతుంది. లూకా 2: 48 "అప్పుడు తల్లి ఆయనతో కుమారా ఎందులకు ఇట్లు చేసితివి ? నీ తండ్రియు ,నేనును విచారముతో నిన్ను వెదకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఏల వెదకితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలయునని మీకు తెలియదా? అని ఆయన బదులు పలికెను." యేసు ప్రభువు జీవితంలో తండ్రి పని చేయడం, లేక దేవుని చిత్తం నెరవేర్చడం అనేది  అత్యంత ముఖ్యమైనది, దాని తరువాతనే ఏ పని అయిన , అందుకే ఆయన నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నా అహరం అని అంటున్నారు. కనుక ఇక్కడ  , నాకు ఇష్టమైన , లేక నా కుటుంబ సభ్యులైన లేక ఇతర ఏ విషయము కూడా తండ్రి చిత్తముతో పోల్చినచో తక్కువదిగానే ఉండాలి, ఇది మనం తెలుసుకోవలసినది యేసు ప్రభువు జీవితం ద్వారా. 

యేసు ప్రభువును అనుసరించుట వలన ఏమి జరుగుతుంది. యేసు ప్రభువు తన తల్లిని ద్వేషించలేదు. కనుక అది ఖచ్చితముగా తల్లిని, తండ్రిని, తోబుట్టువులను  అసహ్యించుకోవడం కాదు. కాని తాను దేవుని పని చేయడానికి   ఎటువంటి ఆటంకం ఉండకూడదు. అదే విషయాన్ని యేసు ప్రభువు తాను దేవాలయంలో తప్పి పోయినప్పుడు చెబుతున్నారు. 

కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. యేసు ప్రభువు జీవితంలో ఇదే సంధర్భన్ని మనం చూస్తున్నాం. తన తండ్రి చిత్తం నెరవేర్చడానికి తన ప్రాణమును కూడా తృణప్రాయముగా త్యజించడానికి వెనుకాడలేదు, ఇప్పుడు ఆయనను అనుసరించాలి అని అనుకునేవారు, ఆయన కోసం, ఆ విధంగా తమ ప్రాణమును కూడా త్యజించడానికి సిద్దపడాలి.  అని ప్రభువు చెబుతున్నారు. ఒక వేళ మనం  ఆయన శిష్యుడు కాగోరి, దానికి మనం జీవితాన్ని త్యజించిన యెడల మనకు ఏమి వస్తుంది? మనం ఆయన శిష్యులు అవుతాం. మనం జీవం పొందుతాము, ఎందుకంటే నాకోసం తన ప్రాణమును కోల్పోవు వాడు దానిని నిలుపుకొనును అని ప్రభువు వాగ్ధానం ఇస్తున్నాడు. నిజానికి ఆయన కోసం మనం ఏమి కోల్పోతున్నామో అది సమృద్దిగా దొరకుతుంది. దేవుడు ఇచ్చేదీ సమృద్దిగా ఇస్తాడు. 

తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. యేసు ప్రభువును అనుసరించేది ఏదో ఒక రోజు లేక సమయంలో మాత్రమే కాదు. ప్రతి నిత్యం అది జరుగాలి, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి అని ప్రభువు కోరుచున్నాడు.  ఏమిటి ఇక్కడ సిలువ అంటే రోజు వారి జీవితంలో యేసు ప్రభువును అనుసరిస్తున్న సమయంలో  ఎదురయ్యే సమస్యలను అదికమిస్తూ ఆయనను అనుసరించుటలో ముందుకు సాగటమే. 

ఈరోజు యేసు ప్రభువు సువిశేషంలో చెప్పే మాటలు చాలా కఠినముగా ఉన్నాయి అని మనం అనుకుంటున్నాం. కొన్ని సార్లు ఈ మాటలు యేసు ప్రభువు నుండి వస్తున్నాయా? అని ఆశ్చర్య పడుతుంటాం. ఈ రోజు సువిశేషంలోనే కాక వేరె సంధర్బంలో కూడా యేసు ప్రభువు ఇటువంటి మాటలు చెప్పారు. అవి  , యేసు ప్రభువు దేవాలయాన్ని శుభ్ర  పరిచే సమయంలో, తన శరీరం భుజించాలి అని అన్నప్పుడు, తనను అనుసరించమని యువకుడను అడిగిన సమయంలో  ఆయన మాటలు అర్ధం చేసుకోవడం కష్టం అని అనుకుంటాం. ఇవి ఏమిటి నిజానికి అంటే 1. ఆయనతో ఉండటం, దేవాలయాన్ని శుభ్ర పరిచే సమయం. 2. ఆయన శరీరం భుజించడం, 3, ఆయనను అనుసరించడం. నిజానికి మూడు ఒకటే అదే ఆయనతో ఎలా ఉండగలం అనే ఒకే ఒక విషయం చెబుతున్నాయి. 

మనం  ఏమి చేయాలి? ఆయనను అనుసరిస్తే ఆయన వాగ్ధానం చేసే నిత్య జీవితం మనకు వస్తుంది. కాని దానికి తగిన జీవితం మనం జీవించగలమా? మనలను మనం పరిశీలన చేసుకొని దానికి తగిన ఆయుధాలను మనం సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన వాగ్దానం చాలా గొప్పది దానిని కోల్పోకుండా తగిన ఆయుధ సంపత్తిని మనం ఏర్పాటు చేసుకోవాలి. యేసు ప్రభువు ఇక్కడ చెప్పిన రెండు ఉపమానల్లో కూడా సంధి చేసుకొనే సమయంలో మనం చాలా కోల్పోతాము ఎందుకంటే మన కంటే గొప్ప వాడైన రాజు మనతో సంధికి అనేక షరతులు పెట్టవచ్చు మనకు కేవలం కొద్ది వెసులుబాటు మాత్రమే ఇవ్వ వచ్చు, కాని మన ఇష్టాలు , అన్ని కూడా దేవునికోసం ఇస్తే మనకు ఆయననే పొందే భాగ్యం వస్తుంది. ఆమెన్ 

లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...