4, జూన్ 2022, శనివారం

పెంతెకోస్తు మహోత్సవము

పెంతెకోస్తు మహోత్సవము

 అ.కా. 2:1-11
1 కొరింతి 12:3-13
 యోహాను 20:19-23

క్రీస్తునాధునియందు ప్రియమైన సహొదరీ సహోదరులారా! ఈనాడు తల్లి తిరుసభ పెంతెకోస్తు మహోత్సవాన్ని కొనియాడుచున్నది. నిజానికి పెంతెకోస్తు పండుగ తల్లి శ్రీసభ పుట్టినరోజు. పెంతెకోస్తు పండుగరోజున పవిత్రాత్మ రాకడను కొనియాడుతున్నాము. నేడు పవిత్రాత్మ అగ్నిజ్వాలలుగా మానవాళిపైకి దిగివచ్చిన ఆనందదాయకమైయిన శుభదినం. పవిత్రాత్మ శ్రీసభను నిర్మించి, ప్రభువు ఒసగిన ప్రేషితకార్యాన్ని గుర్తుచేసి, ఆత్మవరాలతో అందరిని నింపి దైవసేవకు పిలిచిన రోజు. 
పెంతెకోస్తు అనునది యూదుల పండుగ. పెంతెకోస్తు అనగా “50  వ రోజు “అని అర్దం. యూదులు పాస్కా పండుగ అనంతరం ఏడు వారాల తరువాత అంటే  50 రోజుల తరువాత పెంతెకోస్తు పండుగను కొనియాడేవారు. ఇది యూదుల మూడు ప్రధాన పండుగలలో ఒకటి. యూదులు ముఖ్యంగా   కొతకాలము ముగియు సందర్భమున దేవునికి కృతజ్ఞతలు తెలుపుటకు ఈ పండుగను చేసేవారు. 

పెంతెకోస్తు - ప్రభుని వాగ్ధానము నెరవేరిన రోజు :
పెంతెకోస్తు పండుగను ప్రభువు చేసిన వాగ్ధానము నెరవేరిన రోజు అని కూడా పిలవవచ్చు.  క్రీస్తు ప్రభువు కలవరపడుచున్న  తన శిష్యులకు పవిత్రాత్మను అనుగ్రహిస్తానని వాగ్ధానం చేసియున్నారు. "నేను మిమ్ము అనాధలుగా వదిలి పెట్టను. మీతో ఎల్లపుడు ఉండుటకు మీకు ఒక ఆదరణ కర్తను పంపుదును" (యోహాను 14 : 16 ), "నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్లి మీకు ఒక ఆదరణ కర్తను పంపిస్తాను" (యోహాను 16 :7 ) అని ప్రభువు సువిశేషంలో వాగ్ధానమొనర్చినట్లు మనం చూస్తున్నాం. 
ప్రభువు తాను చేసినా ఆ వాగ్ధానము ఈనాటి మొదటి పఠనంలో నెరవేరడం మనం చూస్తున్నాం. పవిత్రాత్మ అగ్నిజ్వాలలు రూపంలో నాలుకల రూపంలో శిష్యులందరిపై క్రుమ్మరింపబడి, ప్రతి ఒక్కరు పవిత్రాత్మ శక్తి ధ్వారా అన్య భాషలలో మాట్లాడసాగిరి (అ. కా. 2 : 2 - 4 ). అక్కరికి వెళ్లిన ప్రతి ఒక్కరు శిష్యులు వారి వారి సొంత భాషలలో మాటలాడుట విని కలవరపడి, ఆశ్చర్యపోయిరి (అ. కా. 2 : 6 - 7 ). ఈ విధముగా ప్రభువు శిష్యులకు తాను వాగ్ధానము చేసిన పవిత్రాత్మను దయచేసారు. 

ఈనాడు ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని రాకడను కొనియాడుతున్న మనమందరము ఆయనను గౌరవించాలి, ప్రార్ధించాలి, మరియు ఆరాధించాలి. మనం ఎన్నడును పవిత్రాత్మకు వ్యతిరేకముగా మాట్లాడకూడదు, ఏ  కార్యము చేయకూడదు.  

ఎందుకు పవిత్రాత్మకు వ్యతిరేకముగా మాట్లాడకూడదు? ఏ కార్యము చేయకూడదు? 
“ఎవ్వడేని మనుష్యకుమారునికి వ్యతిరేకముగా మాటలాడిన క్షమింపబడును గాని, పవిత్రాత్మకు వ్యతిరేకముగా పలికినవానికి ఈ జీవితమందైనను, రాబోవు జీవితమందైనను క్షమాపణ లభింపదు" (మత్తయి 12 : 31 - 32) అని క్రీస్తుప్రభువు చాలా స్పష్టముగా చెప్పుచున్నారు. హెబ్రీయులకు వ్రాసిన లేఖలో కూడా 'దయామయుడగు పవిత్రాత్మను అవమానపరచువాని  గతి ఏమవుతుందో, అతడెట్టి నీచమైన శిక్షార్హుడో' అని విచారించడాని మనం చూస్తున్నాం (హెబ్రీ 10: 29). కనుక త్రిత్వంలో ఒకరైనటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరున్ని మనం ఈనాడు గౌరవించాలి, ఆరాధించాలి. 

పవిత్రాత్మను పొందాలంటే మనం ఏం చేయాలి?

1 . హృదయ పరివర్తన చెందాలి :
పవిత్రాత్మను పొందాలంటే ప్రతిఒక్కరు  ముందుగా పాపం నుండి వైదొలగి హృదయ పరివర్తన చెందాలి. "మీరు హృదయపరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు నామమున జ్ఞానస్నానము పొందవలయును. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు" (అ. కా. 2 : 38 ) అని అపొస్తలుల కార్యంలో మనకు తెలియజేయబడుతుంది. అనగా, పవిత్రాత్మను పొందుటకు హృదయ పరివర్తనం అనేది ఒక ముఖ్యమైన వారధి లేదా ధ్వారం వలె ఉన్నది.

2 . దేవునియందు విధేయత :
పవిత్రాత్మను పొందుటకు రెండవదిగా మనం చేయవలసిన ముఖ్య కార్యము దేవునియందు విధేయత కలిగియుండాలి. "దేవుడు తనపట్ల విధేయత చూపువారికి అనుగ్రహించిన పవిత్రాత్మ.........." (అ. కా. 5 : 32 ). ఎవరైతే దేవునియందు విధేయత భయభక్తులు కలిగి జీవిస్తారో అట్టివారికి ప్రభువు పవిత్రాత్మను అనుగ్రహిస్తారు. 

పవిత్రాత్మను పొందుటవలన కలుగు మేలు ఏమిటి ?

1 . పాపములను క్షమించు అధికారం?
ఈనాటి సువిశేషం ద్వారా  ప్రభువు ప్రతి ఒక్కరికి పవిత్రాత్మ పొందుట ద్వారా పాపములను క్షమించు అధికారమును ఒసగుచున్నారు. "ప్రభువు వారిమీద శ్వాస ఊది 'పవిత్రాత్మను మీరు పొందుడు.ఎవరి పాపములనైనను మీరు క్షమించి యెడల అవి క్షమించబడును; ఎవరి పాపములనైనను మీరు క్షమింపని యెడల అవి క్షమింపబడవు"(యోహాను 20 : 22 -23 ) అని ప్రభువు పలుకుచు మనకు పాపములను క్షమించు ఒక గొప్ప అధికారమును పవిత్రాత్మద్వారా ఒసగుచున్నారు. 

2 . దేవుని రాజ్యంలోకి ప్రవేశం:
పవిత్రాత్మ మనకు దేవుని రాజ్యంలోకి చేరడానికి ప్రవేశాన్ని కల్పిస్తుంది.  "ఒకడు ఆత్మ వలన, నీటి వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (యోహాను 3 : 5 ) అని పరిసయ్యుడైన నికోదేముతో ప్రభువు పలుకుచున్నారు. పవిత్రాత్మను స్వీకరింపని యెడల మనకు దైవ రాజ్యంలో స్థాన ఉండదని నికోదేము ద్వారా ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. 

3 . దేవుని పుత్రులం:
 పవిత్రాత్మ ద్వారా మనమందరము దేవుని పుత్రులం అవుతాం అని పునీత పౌలు గారుతెలియజేస్తున్నారు. "దేవుని ఆత్మద్వారా నడుపబడువారు దేవుని పుత్రులు.......... దేవుని ఆత్మ ద్వారా మనం దేవుని 'అబ్బా! తండ్రీ!' అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని  సాక్షమిచ్చును (రోమా 8 : 14 - 16 ).

4 . మన బలహీలతలో సహాయపడును:
మన బలహీనతలో పవిత్రాత్మ మనకు సహాయపడునని పునీత పౌలు గారు రోమీయులకు వ్రాసిన లేఖలో తెలియజేస్తున్నారు. "బలహీనులమైన మనకు పవిత్రాత్మ సహాయపడును. ఏలయన, మనం ఎట్లు ప్రార్ధింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా ఆత్మయే మన కొరకు దేవుని ప్రార్ధించును (రోమా 8 : 26 - 27 ). 
5 . జీవమును ఒసగును:
పవిత్రాత్మ మనకు జీవమును ఒసగును అని పవిత్ర గ్రంధము తెలియజేయుచున్నది. "క్రీస్తును మరణమునుండి  లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందున్నచో, క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన, మీయందున్న తన ఆత్మ వలన మీ మర్త్య శరీరములకు కూడా జీవమును ఒసగును" (రోమా 8 : 11 ) అని పౌలు గారు పవిత్రాత్మ వలన కలుగు ఫలమును బోధిస్తున్నారు. 

కనుక క్రిస్తునాధుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా!  పెంతెకోస్తు పండుగ అనగా పవిత్రాత్మ రాకడను జరుపుకుంటున్న  ఈ శుభదినాన అందరము ఆ పవిత్రాత్మ  సర్వేశ్వరుడు మన యందు, మన కుటుంబాల యందు నివసిస్తూ, ఎల్లప్పుడూ మనలను ఆ ప్రభుని మార్గంలో నడిపిస్తూ, శాంతి సమాధానంతో మనలను నింపమని ఈనాటి దివ్యబలి పూజలో ప్రార్ధించుదాం. 

Br. Joseph Kampally 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...