28, మే 2022, శనివారం

ప్రభువు మోక్షరోహణ పండుగ

 అపో. కా 1:1-11, ఎఫెసీ  1: 17-23, లూకా 24:46-53 

ఈ రోజు తల్లి శ్రీ సభ యేసు క్రీస్తు ప్రభువు యొక్క మోక్ష రోహణ పండుగ  జరుపుకొంటుంది. ప్రభువు పునరుత్థానం  అయిన నలభై రోజులు శిష్యులకు దర్శనమిస్తూ , వారి విశ్వాస జీవితాన్ని బలపరుస్తూ వారిని సువార్త పరిచర్యకు తయారు చేస్తూ, వారు సంపూర్ణంగా  దేవుని యొక్క  అనుభూతిని పొందిన తరువాత శిష్యులకు పరలోకంలో  నివాసం కల్పించుటకు యేసు క్రీస్తు ప్రభువు, తన తండ్రి చెంతకు  తిరిగి వెల్లుచున్నారు. యోహను 14:2-3. 

యేసు ప్రభువు పూర్వం తాను ఉన్న స్థలమునకు వెల్లుచున్నారు. పరలోకం నుండి దిగివచ్చిన  దేవుడు మనకు పరలోక విషయాలను బోధించి మనలను పరలోకం నడిపించుటకు , మనలను పరలోకంకు  చేర్చుటకు మార్గం చూపించారు. 

తాను వచ్చిన స్థలంకే మరలా తిరిగి వెల్లుచున్నారు. ఆయన పరలోకం వెళ్ళిన సరే లొకాంతము వరకు మనతోనే ఉంటారు. మత్తయి 28:20. దివ్య సత్ప్రసాదంద్వారా, దివ్య సంస్కారముల ద్వారా, ప్రార్ధన ద్వారా, వాక్యం చదవటం, ధ్యానించటం ద్వారా దేవుడు మనతోనే ఎప్పడూ ఉంటారు. 

క్రీస్తు ప్రభువు పరలోకంకు వెళ్ళటం ద్వారా దేవుని పనిని ఈ లోకంలో కొనసాగించాలి.  దేవుడు మనలను  భౌతికంగా విడిచి వెళ్లినందుకు ఒక విధంగా మనం బాధ పడాలి. ఇంకొక విధంగా  సంతోషించాలి. ఎందుకంటే త్రీత్వంలో  పవిత్రాత్మ దేవున్ని మనకు తోడుగా ఉండుటకు పంపిస్తానన్నారు. పవిత్రాత్మ ఆదరణకర్తగా , ఓదార్చువాడుగా  మనకు తోడుగా ఉండటానికి పంపిస్తానన్నారు. 

ఈరోజు  మనం చదువుకున్న మొదటి పఠనంలో పునీత లూకా గారు యేసు ప్రభువు యొక్క పునరుత్థాన సన్నివేశంను  వివరించారు. దానితో పాటు  శిష్యులకు పవిత్రాత్మను ఇస్తానని వాగ్ధానం చేశారు. 

సువార్తికులలో  కేవలం లూకా గారు మాత్రమే ప్రభువు యొక్క  మోక్ష రోహణంను చక్కగా వివరించారు. ప్రభువు యొక్క  శిష్యులు ఆయనను చూడటం అదే చివరి సారి.  వారందరు యేసు ప్రభువును చూస్తుండగా  ప్రభువు వారి కనుచూపు మేర నుండి మేఘాల్లో అదృశ్యమయ్యారు. 

మొదటి పఠనంలో లూకా గారు యేసు  ప్రభువు యొక్క పునరుత్థానం  తరువాత ఏ విధంగా శిష్యులతో వున్నారో, ఎలాగా వారిని బలపరిచారో, ఎంత గొప్పగా వారిని తీర్చి దిద్దరో, అలాగే వారికి  పవిత్రాత్మ దేవుని ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు గురించి తెలిపారు. 

లూకా గారు  ఆయన వ్రాసిన సువార్త మరియు అపోస్తులుల కార్యములు తెయొఫీలూ అనే వ్యక్తికి అంకితం చేశారు. లూకా 1:1.

 తెయొఫీలూ సమాజంలో మంచి పేరున్న వ్యక్తి కాబట్టియే లూకా గారు ఆయనను ఘనత వహించిన తెయొఫీలు అని సంబోదిస్తున్నాడు. 

 తెయొఫీలూ అనగా దేవుని చేత ప్రేమించబడిన వాడు అని మరియు దేవుని స్నేహితుడని అర్ధం. ఆయన పాలస్తీనాకు బయట జీవించారు. అందుకే లూకా గారు ఆయనకు ప్రభువు  విషయాలు లేఖల ద్వారా తెలియజేస్తున్నారు. 

తెయొఫీలూ అను వ్యక్తి దేవునిలో ఎదగాలని కోరుకున్న వ్యక్తి దేవుని గురించి తెలుసుకోవాలనుకున్న వ్యక్తి, విశ్వాసం కలిగిన వ్యక్తి, దేవున్ని వెంబడించిన వ్యక్తి. 

తెయొఫీలుకు దేవుని పట్ల తృష్ణవుంది. ఆయన్ను తెలుసుకోవాలనే దాహంతో ఉన్నారు. రెండు పుస్తకాలు ఆయన కోసమే లూకా గారు వ్రాసారంటే  ఆయనకు   ఎంత ప్రగాఢమైన కోరిక వుందో మనం  తెలుసుకోవాలి. తేయొఫీలూ క్రీస్తు ప్రభువు యొక్క జీవితంకు ఆకర్షింపబడ్డారు. 

యేసు ప్రభువు పునరుత్థానం  తరువాత శిష్యులకు దర్శన మిస్తూ, శాంతి యుతంగా జీవించుట గురించి బోధించారు. అలాగే దేవుని ముంగిట ఎలా జీవించాలి అనే విషయములను నేర్పించారు. 

దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు శిష్యులలో  ఒక ఆశను కలిగించారు. మనిషి జీవితంలో కష్టాలు ఎదుర్కొని ముందుకు సాగితే జీవితం నిలబడుతుంది అని ప్రభువు నేర్పించారు.  బ్రతుకు మీద ఆశలు కల్పించారు. 

ప్రభువు పరలోకంకు వెళ్ళేంత వరకు సువార్తను ప్రకటించుచునే వున్నారు. తన తండ్రికి సంపూర్ణ, విధేయత చూపుతూ తనకున్నది, మొత్తం కూడా తండ్రిని మహిమ పరుచుటకే అని భావించి ఆయనకు విశ్వాస పాత్రునిగా జీవించారు. 

దేవుడు మనకిచ్చిన వరములన్నీ మంచిగా వినియోగించి పరలోకంకు వెళ్ళాలి. పరలోకంలో ప్రవేశించే వరకు  మన యొక్క వరాలను మనం దేవున్ని మహిమ పరచడానికే వినియోగించాలి. యోహను 9:4, 1 పేతురు 4:10 . 

యేసు ప్రభువు ఈ భూలోకంలో పరిచర్య  చేసి తండ్రి చెంతకు తిరిగి వెళ్ళే సమయం వరకు పవిత్రాత్మ  దేవుని శక్తి తో  పనిచేసి బోధించారు. యేసు ప్రభువు పవిత్రాత్మ మీద ఆధారపడి జీవించారు. తనను తాను సమర్పించుకున్నారు. 

క్రీస్తు ప్రభువే పవిత్రాత్మ మీద ఆధారపడి జీవిస్తే మరి మనమెంతగా ఆదారపడి జీవించాలి. 

యేసు ప్రభువు ఆజ్ఞలిచ్చి  వాటిని పాటించమని  తాను ఎన్నుకొన్నవారికి  తెలియజేశారు. అనేక మందికి  పరలోక విషయములు తెలియజేసినా ప్రభువు యొక్క మనసు , attention శిష్యుల మీదనే  ఉంది. ఎందుకంటే ఆయనకు  సాక్షులుగా  ఉండబోతున్నారు కాబట్టి. ప్రభువు పరిచర్యం మొత్తం కూడా శిష్యుల మీదనే ఆధారపడి ఉంది. శిష్యులె ప్రభువు యొక్క సందేశాన్ని మొదటిసారిగా అందించేవారు. ఆయన పునరుత్థాన వార్తను అదించేవారు శిష్యులే కాబట్టి ప్రభువు వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వారు విఫలమైతే ప్రభువు యొక్క పని విఫలమైనట్లే. అందుకే శిష్యుల మీద concentrate చేశారు. వారు విజయం పొందితే, ప్రభువు విజయం పొందినట్లే ఆయన యొక్క పని సంపూర్ణంగా పూర్తి అవుతుంది. 

ప్రతి యొక్క క్రైస్తవుడు కూడా ప్రభువు గురించి ప్రకటించాలి. 2 తిమోతి 2:2., మత్తయి 28:19-20 యోహను 20:21. 

అపో 1:3 వ వచనంలో ప్రభువు శిష్యులకు పునరుత్థానం అయ్యాక  కనిపించారని తెలుపుతుంది. నూతన నిబందన గ్రంధం లో, దాదాపు 10 సార్లు ఆయన దర్శనం గురించి వ్రాయబడింది. 

1. మగ్ధలా మరియమ్మకు దర్శనం ఇచ్చారు.  యోహను 20:11- 18

2. స్త్రీలకు దర్శనం ఇచ్చారు, ఖాళీ సమాధి గురించి చెప్పుటకు వెళ్తున్న స్త్రీలకు ప్రభువు దర్శనం ఇచ్చారు. మత్తయి 28: 8-10 

3. పేతురు గారికి దర్శనం ఇచ్చారు. లూకా 24:34, 1 కోరింథీ 15:5 

4. ఎమ్మావు మార్గంలో  శిష్యులకు దర్శనం ఇచ్చారు. లూకా  24:13-42 

5. శిష్యులకు తోమా గారు లేని సమయంలో ఇచ్చిన దర్శనం.  మార్కు 16:14, యోహను 20:19-25. 

6. చేపలు పట్టుటకు వెళ్ళిన శిష్యులకు దర్శనం ఇచ్చారు.  యోహను 20. 

7. ప్రభువు 500 మంది విశ్వాసులకు దర్శనం ఇచ్చారు.  1కోరింథీ 15:6 

8. శిష్యులందరు ఉన్నప్పుడు దర్శనం ఇచ్చారు. మత్తయి 28:16-20 

9. యకొబుకు దర్శనం ఇచ్చారు.  1 కోరింథీ 15:7 

10. ఆయన మోక్ష రోహణమప్పుడు విశ్వాసులకు దర్శనం ఇచ్చారు. ఇవి కాకుండా  ఇంకా   కోన్ని  బహుశ వ్రాయబడలేదు. యోహను 20:30-31. 

మోక్షరోహణ సమయంలో ప్రభువు శిష్యులను, విశ్వాసులను సాక్షులై ఉండమని తెలుపుచున్నారు.  8 వ వచనం. పవిత్రాత్మ పొందిన తరువాత భూదిగంతముల వరకు మనము దేవునికి సాక్షులై ఉండాలని ప్రభువు తెలిపారు. శిష్యులు పవిత్రాత్మ శక్తిని పొందిన తరువాత ఈ లోక ఆశలు ఏమియు వారు కొరలేదు. అధికారం కోసం, పేరు కోసం, ఆశ పడలేదు. కేవలం ఆయనకు సాక్షులై జీవించారు. 

శిష్యులు దేవుని విషయాలను  అందరితో పంచుకున్నారు, ఈ వచనంలో మీరు అంటే కేవలం శిష్యులు మాత్రమే కాదు.  అందరు ప్రతి విశ్వాసి కూడా సాక్షియై జీవించాలి. సువార్తను ప్రకటించాలి. 

సాక్షులై జీవించుట అంటే  దేవునికొరకు జీవించుట, ప్రాణాలు సైతం సమర్పించుట. సాక్షులు క్రీస్తు ప్రభువు ఆలోచనలు కాదు తెలిపేది ,క్రీస్తు ప్రభువునే. 

ఈనాటి రెండవ పఠనంలో దేవుని విశ్వాసులు ప్రభు జ్ఞానమందు  ఎదుగుట కొరకు పౌలుగారు ప్రార్ధిస్తున్నారు. దేవుని యొక్క పవిత్రాత్మను పొందుకొని వారు ప్రభువుని తెలుసుకొనుటకు ప్రార్ధిస్తానని చెబుతున్నారు. 

విశ్వాసులు దైవ జ్ఞానంను  కలిగి జీవించాలి. మనం దేవుని గురించి తెలుసుకోవాలి. ఆ దేవుడు క్రీస్తు ప్రభువే ఆయన తండ్రి యొక్క ప్రియమైన కుమారుడు. అలాగే విశ్వాసులు, తండ్రి దేవుని గురించి తెలుసుకోవాలి.  ఆయన సృష్టి కర్త అని గ్రహించి, వారి యొక్క గొప్పతనం ధ్యానించుకొని వారి గురించి జ్ఞానం సంపాదించుకోవాలి. 

దేవుడు సజీవుడు, నిజమైన దేవుడు కాబట్టి విశ్వాసులందరు ఆయన జ్ఞానంలో ఎదగాలి. దేవుని జ్ఞానంలో ఏదగాలంటే మూడు విషయాలు మనం కలిగి ఉండాలి. 

1. విశ్వాసికి విజ్ఞానము వుండాలి. దేవుని యొక్క ఆత్మ ఉండాలి. 

2. విశ్వాసి దేవునితో సంబంధం కలిగి జీవించాలి.  దేవుడు ఎవరని గ్రహించి ఆయనతో బంధంను ఏర్పరుచుకోవాలి. 

3. విశ్వాసి దేవున యొక్క క్రియలు తెలుసుకొని రోజు రోజుకు ఆయనలో ఎదగాలి . తెలుసుకోవాలి అనే కోరిక ఉండాలి. 

రెండవ భాగంలో యేసు క్రీస్తు ప్రభువును తండ్రి లేవనెత్తిన విధానం గురించి పౌలు గారు తెలుపుచున్నారు. 

ప్రభువు చూపిన విధేయతను బట్టి సమస్తము ఆయన పాదముల క్రింద వుంచారు. తండ్రి కుమారున్నీ అధికంగా దీవించారు. మనందరం ఆయన శరీరంలో భాగస్తులము కాబట్టి ఆయన్ను గురించి ప్రకటించాలి. మన యొక్క క్రియల ద్వార , మాటల ద్వారా ప్రకటించాలి. 

ఈనాటి  సువిశేష పఠనంలో  యేసు ప్రభువు  చివరి సారిగా శిష్యులతో  మాట్లాడారు. ఆయన  పునరుత్థానం  తరువాత  చివరి  రోజు  ప్రభువుకు భూలోకంలో . ఇది మోక్ష రోహణంకు ముందు. ప్రతి ఆదివారం  విశ్వాస ప్రమాణంలో  మనం చెబుతాం. ఆయన పరలోకంకు ఎక్కి తండ్రి కుడి ప్రక్కన  కూర్చొని వున్నారని.  తండ్రి చిత్తాన్ని  సంపూర్ణంగా నెరవేర్చిన తరువాత ఆయన ప్రణాళికా ప్రకారంగా తండ్రి  చెంతకు తిరిగి వెల్లుచున్నారు. 

యేసు ప్రభువు  40 రోజుల తరువాత  మోక్షంకు ఎత్త బడ్డారు. తండ్రి కుమారున్నీ పునరుత్థానం ద్వారా మహిమ పరిచారు. మరొకసారి మోక్ష రోహణం ద్వారా మహిమ పరచి తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడైయ్యేలా చేశారు. 

ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు  ప్రభువు యొక్క పట్టాభిషేకం రోజు.  ప్రభువుకు పరలోకంలో సన్మానం జరిగిన రోజు. ఆయన యొక్క త్యాగ క్రియలకు, తండ్రి చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చినందుకు పరలోకంలో గొప్ప సన్మానం జరుగుతుంది. 

క్రీస్తు భూలోకంలో తనకొసగబడిన కర్తవ్యాన్ని జయ ప్రదంగా ముగించుకొని వస్తున్నాడని పరలోక దూతలు ఆయన్ను ఘనంగా ఆహ్వానించారు. 

పిత దేవుడు , పవిత్రాత్మ దేవుడు కుమారున్ని పరలోకంలోకి ఆహ్వానించి తండ్రి  తన కుడి ప్రక్కన సింహాసనములను ఇచ్చారు. ఇది పరలోకంలో ఒక పండుగ దినం, సంతోషకరమైన  రోజు. ప్రభువు పరలోకంలోకి ప్రవేశించారు. ప్రభువు వలె మనమందరం కూడా పరలోకంలో ప్రవేశించాలి. 

ప్రభువు యొక్క మోక్ష రోహణంకు  మరియు క్రీస్తు జయంతికి ఒక దగ్గర సంబంధం వుంది. క్రీస్తు జయంతిలో త్రీత్వంలో వున్న పుత్రుడు, దైవ , మానవ స్వభావంతో ఈ లోకంలో జన్మించారు. 

మోక్ష రోహణం  ద్వారా పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువు దివ్య శరీరం ద్వారా దైవ స్వభావంతో మరల త్రీత్వంలో కలుస్తున్నారు, పరలోకంలో ప్రవేశిస్తున్నారు. 

ఏ శరీరంను అయితే శిష్యులు పునరుత్థానం తరువాత తాకారో అదే దివ్య  శరీరంతో ప్రభువు పరలోకానికి వెళ్లారు. క్రీస్తు జననం ద్వారా ప్రభువు భూలోకంలోనికి ప్రవేశించి  మానవులకు దగ్గరగా వున్నారు. ఆయన మోక్ష రోహణం ద్వారా మళ్ళీ తండ్రి దగ్గరకు వెళ్లారు. 

యేసు ప్రభువు అదే శరీరంతో పరలోకంకు  వెళ్లారు. యేసు ప్రభువు మోక్ష రోహణం అయ్యే ముందు ప్రపంచమంతట వెళ్ళి బోధించమని  శిష్యులకు చెప్పారు. 

సువార్తను ప్రకటిస్తూ  ప్రభువు యొక్క ప్రేమకు సాక్షులవ్వాలి. ప్రభు ప్రేమను ప్రపంచమంతట చాటి చెప్పాలి. 

ఈ ప్రకటించే బాధ్యత కేవలం గురువులది, కన్యస్త్రీలది మాత్రమే కాదు. అది అందరికి చెందినది. అందరు ప్రకటించాలి. పవిత్రాత్మ దేవుని సహకారంతో  మనందరం ప్రేమ వ్యాప్తికై కృషి చేయాలి. 

ప్రభువు యొక్క ప్రేమతో పాటు మనందరం విశ్వాసం గురించి , దేవుని  దయ గురించి , రక్షణము గురించి, క్షమను గురించి మనం బోధించాలి. 

అనుదినం దైవ అనుభూతిని పొందుతూ మనం దేవుని గురించి ప్రకటించాలి.   

యేసు ప్రభువు యొక్క మోక్ష రోహణం మనందరం కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. 

1. మనం పరలోకంలో ప్రవేశించుటకు దేవుని యొక్క చిత్తం ప్రకారం జీవించాలి. 

2. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి. 

3. దేవుని యొక్క ప్రేమను పంచి పెట్టాలి. 

4. పాపంను జయించి  హృదయ పరివర్తనం చెంది జీవించాలి. 

5. దేవుని సువార్తను ప్రకటించాలి. 

6. దేవుని యొక్క ఆనందంలో పాలు పంచుకొని జీవించాలి. 

 By Rev . Fr. BalaYesu OCD


పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...