11, ఫిబ్రవరి 2023, శనివారం

 

సామాన్య ఆరవ ఆదివారం

సిరాకు 15:15-20

1  కొరింతి 2:6-10

మత్తయి 5:17-37


ఈనాటి దివ్య పఠనాలు మానవులు తమ యొక్క జీవితంలో స్వేచ్ఛ వలన ఎంపిక చేసుకునే విషయాల గురించి బోధిస్తున్నాయి.

మానవునికి దేవుడు స్వేచ్ఛనిచ్చారు, తన యొక్క స్వేచ్ఛలో ఏది మంచిదో, ఏది చెడో  తెలుసుకొని సరియైనది ఎంచుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే జీవితంలో ప్రధానమైన అంశం ''ఎంపిక చేసుకోవటం'' ఏది ఎన్నుకోవాలో అనే అంశాల గురించి చెప్పుతూ ఉన్నవి.

చాలా సందర్భాలలో స్వేచ్ఛనిచ్చినప్పుడు, దానిని చాలా మంది దుర్వినియోగం చేసుకుంటారు, దాని ప్రతిఫలంగా బాధను అనుభవించవలసి వస్తుంది.

ఈనాటి మొదటి పఠనం లో  రచయిత 'మనిషి స్వేచ్ఛ జీవి' అనే తెలియజేస్తున్నారు.

ప్రతి ఒక్కరి జీవితంలో తాము అనుదినం తీసుకునే నిర్ణయాలు ఎంతో ప్రధానమైనవి.

మనకు దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛలో ఎటువంటి సరియైన నిర్ణయాలు తీసుకుంటున్నాం అనే అంశం గురించి ఈనాడు సిరాకు గ్రంథ రచయిత మనకు తెలియజేస్తున్నారు.

ఈ మొదటి పఠన ప్రారంభ వచనంలో ఈ విధంగా అంటున్నారు, నీవు కోరుకుందు వేని ప్రభువు ఆజ్ఞలు పాటింపవచ్చును, అతనిని అనుసరింపవలెనో  లేదో నిర్ణయించునది నీవే సిరాకు 15:15 అని అంటున్నారు.

దేవుడు మనిషికే తన స్వేచ్ఛలో నిర్ణయం తీసుకునే అవకాశం ఇచ్చారు, ఎంపిక చేసుకునే అనుమతి ఇచ్చారు. దేవుడు మనకు ఇచ్చిన స్వేచ్ఛలో రోజు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఎన్నో విషయాలను ఎంచుకుంటా 

- ఎక్కడ చదవాలో ఎన్నుకుంటాం.

- ఎవరిని వివాహం చేసుకోవాలో దానిని ఎంచుకుంటాం.

ఎలాంటి వ్యాపారం చేయాలో 

- ఎలాంటి ఉద్యోగం చేయాలో,

ఎవరిని అనుసరించాలో

ఎలాంటి జీవితం జీవించాలో

- ఎవరిని స్నేహితులుగా ఎంచుకోవాలో, ఎలాంటి దుస్తులు, ఎలాంటి మొబైల్స్, వస్తువులు కావాలో అనేవి మనం ఎంపిక చేసుకునే విధానం మీద ఆధారపడి ఉంది.

మనకు ఇవ్వబడిన స్వేచ్ఛలో, మనం తీసుకునే నిర్ణయాలు సరి అయినవి అయితే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, అదేవిధంగా మనం తీసుకునే నిర్ణయాలు చెడ్డవి తప్పిడివి అయితే అవి మనకు కీడు కలుగుతుంది.

మనం ఇవ్వబడిన స్వేచ్ఛలో తీసుకునే నిర్ణయం మనం ఎంచుకునే విషయాలు మన జీవితాలను మన యొక్క భవిష్యత్తును ఎంతో ప్రభావితం చేస్తాయి.

పవిత్ర గ్రంథంలో ఉన్న ఆదాము, అవ్వ తమకు ఇవ్వబడిన స్వేచ్ఛలో సరియైన నిర్ణయం ఎంపిక తీసుకోలేకపోయారు.

దేవుడివారికి ఏదెను  తోటలో స్వేచ్ఛనిచ్చారు కానీ వారు తమకు ఇవ్వబడిన స్వేచ్ఛలో వక్ర  మార్గమును, దేవునికి ఇష్టం లేని మార్గం ఎంచుకున్నారు, దాని ప్రతిఫలంగా వారి జీవితంలో దేవుడితో ఉన్న స్నేహ సంబంధం కోల్పోయారు, వారు ఎంచుకున్న విధానం బట్టి వారు శిక్షను అనుభవించారు, పాపం చేశారు అప్పటివరకు దేవునితో నడిచిన వారు దేవునికి మొఖం కూడా చూపించలేక దాక్కున్నారు, వారి జీవితం కష్టాల పాలయింది.

ఒకవేళ సైతాను వారిని ప్రేరేపించినప్పుడు సరియైన మార్గం ఎంచుకుంటే ఈరోజు మన యొక్క జీవిత విధానం ఇంకొక విధంగా ఉండేది,  అందుకనే రచయిత తెలిపే విషయం ఏమిటంటే దేవుడే మనకు స్వేచ్చనిస్తున్నారు, ఆయన యొక్క ఆజ్ఞలు పాటించాలో లేక పాటించవద్దు అని, కాబట్టి మనం ఎలాంటి ఎంపికను చేసుకుంటున్నాం.

స్వేచ్ఛ జీవులమైన మనం దేవుని యొక్క మార్గమును ఎంచుకోవాలి, దేవుని యొక్క మార్గమును ఎంచుకొని ఆయన యొక్క ధర్మ శాస్త్రాను సారం జీవించాలి.

కీర్తన 119:1-2 దేవుని యొక్క ఆజ్ఞలు పాటించువారు ధన్యులు అని తెలుపుచున్నారు, ఈ యొక్క అధ్యాయం మొత్తం కూడా మనం దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే వచ్చే ప్రతిఫలం గురించి తెలుపుచున్నాయి. ప్రభు యొక్క ఆజ్ఞలు పాటించి జీవిస్తే మనందరం కూడా ఒక పుణ్య జీవితం జీవించవచ్చు ఈ భూలోకం పరలోకం గా మారుతుంది.

16వ వచనంలో రచయిత అంటున్నారు, ప్రభువు నిప్పును నేలను కూడా మీ ముందు ఉంచెను అని.

నిప్పు దేవుని యొక్క సాన్నిధ్యమునకు గుర్తు, అలాగే నిప్పు కూడా దేవుని యొక్క శిక్షకు గుర్తు, ఈ సందర్భంలో నిప్పు దేవిని యొక్క శిక్షను సూచిస్తుంది. నీరు దేవుని యొక్క బహుమానం ఆశీర్వాదానికి గుర్తు కాబట్టి ప్రభువు యొక్క ఆజ్ఞలు పాటించేవారు దేవుని యొక్క మంచి బహుమానం పొందుతారు.

దేవుని యొక్క విజ్ఞానము అనంతమైనది, ఆయన అన్నింటినీ పరిశీలించెను. మానవులు చేసే ప్రతి కార్యము దేవుడు పరిశీలిస్తారు, ఆనాటి ప్రజల్లో వివిధ రకాలైన భిన్న ఆలోచనలు ఉండేవి ఎందుకంటే అప్పటి గ్రీసు దేశపు సంప్రదాయం ప్రభావం (helenistic culture) ఎక్కువగా ఉండేది, వారు నమ్మిన అంశం ఏమిటంటే దేవుడి కేవలం బయట కార్యాలే చూస్తారు, అంతరంగికంగా చూడరు అని నమ్మేవారు, అలాగే దేవుడు మానవుల్ని పాపం చేయడానికి ఆజ్ఞాపిస్తారు, అనే తప్పుడు ఆలోచనలు ఉండేవి అవి అన్నింటినీ కూడా రచయిత సరి చేస్తున్నారు.

దేవుడు మానవుల యొక్క బాహ్య అంతరంగీకా కార్యాలు ఆలోచనలు అనే పరిశీలిస్తారు. అదేవిధంగా దేవుడు ఎవరిని కూడా పాపం చేయమని ఆజ్ఞాపించడు అని తెలిపారు, దేవుని పట్ల భయభక్తులు చూపే వారిని ఆయన ఆశీర్వదిస్తారు కాబట్టి మన యొక్క అనుదిన జీవితంలో దేవుడిచ్చిన స్వేచ్ఛలో ఎలాంటి మార్గం ఎంచుకుంటున్నాం ఎలాంటి నిర్ణయాలు ఎంపికలు చేసుకుంటున్నాం అని ధ్యానం చేసుకోవాలి.

మనం మంచిని ఎంచుకుంటే దేవుని బహుమానం వస్తుంది, చెడును ఎన్నుకుంటే శిక్ష వస్తుంది, కాబట్టి సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. మనం బహుమానం పొందాలన్నదే దేవుని యొక్క కోరిక ద్వితీయో 11:26-28 కాబట్టి సరియైన మార్గం ను ఎంచుకొని దేవుని దీవెనలు పొందుదాం.

దేవుడు ఎవరిని ఒత్తిడి చేయరు, ఆయన ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిచ్చారు, అందుకే తప్పిపోయిన కుమారుడు ఇల్లు వదిలి వెళ్లాలి అన్నప్పుడు స్వేచ్ఛనిచ్చారు కాబట్టి మనం ఎలాంటి మార్గం, నిర్ణయాలు, ఎంపికలు చేసుకుంటున్నాం అనే అంశం ధ్యానించాలి.

మనం చేసుకొనే ఎంపిక మనల్ని దేవునికి దగ్గరగా చేర్చుతుందా లేక దూరం చేస్తుందా? మంచినీ ఎంచుకుంటే సంతోషం ను పొందుతాం. 

ఈనాటి రెండవ పట్టణంలో పౌలు గారు ఈ లోక సంబంధమైన జ్ఞానం కు, అదే విధంగా దైవ జ్ఞానం కు మధ్య ఉన్న వ్యత్యాసం గురించి తెలుపుచున్నారు.

పౌలు గారు మనందరం కూడా దైవ జ్ఞానంను అలవర్చుకొని జీవించాలి అని తెలుపుచున్నారు, మనం దేవుని యొక్క ఆత్మను పొందిన తరువాత దైవ జ్ఞానం మనల్ని దేవుని వైపుకు నడిపిస్తుంది దేవుని స్తుతించేలా చేస్తుంది.

ఈ లోక సంబంధమైన జ్ఞానం కలిగిన లోక పాలకులు చాలా సందర్భాలలో హాని చేస్తారు, అందుకే దేవుని యొక్క జ్ఞానం కలిగి జీవించాలి, అప్పుడు మన జీవితాలు అభివృద్ధి చెందుతాయి అని పౌలు గారు తెలిపారు.

దైవ జ్ఞానం పొందాలంటే దేవుని యొక్క ఆత్మ యొక్క సహకారం కావాలి.

ఈనాటి సువిశేష పట్టణంలో ఏసుప్రభు కొండ మీద చెప్పిన ప్రసంగం గురించి చదువుకున్నాం.

ఏసుప్రభు అష్ట భాగ్యాలను బోధించిన ప్రతి కాలంలో చట్టపరమైన ఆరువ దేశాల గురించి తెలియజేశారు యూదులకు దేవుడిచ్చిన చట్టం గురించి వివిధ రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి.

యూదుల ధర్మ శాస్త్రం కు నాలుగు రకాలైన అర్థాలు ఉన్నాయి:

1. ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క పది ఆజ్ఞలు.

2. పవిత్ర గ్రంథంలో ఉన్న మొదటి ఐదు గ్రంథాలు.

3. పాత నిబంధన గ్రంథం దీనినే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము అని పిలిచేవారు.

4. ధర్మశాస్త్ర బోధకుల చట్టం వీటన్నిటికీ కూడా ధర్మశాస్త్రము అనే నామం వర్తిస్తుంది.

ఏసుక్రీస్తు ప్రభువు తన యొక్క పరిచర్య జీవితంలో మూడవ దానిని సంపూర్ణంగా నెరవేర్చారు. నాలుగవ దానిని ప్రభువు రద్దు చేశారు. ఎందుకంటే ధర్మశాస్త్ర బోధకుల చట్టం అనేక నియమాలతో కట్టడాలతో కూడుకొని ఉన్నది.

అనేక రకాలైన కట్టడాలను నిబంధనలను పాటించాలని ప్రజలపై భారం మోపారు, లెక్కకు మిక్కుటం లేని కట్టడాలతో జీవితాన్ని దుర్భారం చేశారు. వాస్తవంగా చెప్పాలంటే తోటి సోదరుడి కంటే ధర్మశాస్త్ర బోధకులు నియమ నిబంధనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి జీవించారు.

ధర్మశాస్త్రము తూ;చా తప్పకుండా పాటిస్తే పరిపూర్ణత సాధించినట్లే అని, అపోహ కలిగి జీవించేవారు అందుకే ధర్మశాస్త్రముకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు, ఏసుప్రభు ఈ లోకానికి వచ్చింది ధర్మశాస్త్రమును సంపూర్ణంగా నెరవేర్చుట కొరకే, ధర్మశాస్త్రము యొక్క పరమార్థం ను యేసు ప్రభువు సంపూర్ణంగా వివరిస్తున్నారు, ఒక దేవుని యొక్క ఏకైక కుమారునిగా యేసు ప్రభువు తండ్రిని గురించి తండ్రి ప్రేమ గురించి పవిత్రాత్మ సహాయం గురించి దైవ ప్రణాళికల గురించి తెలియజేశారు.

ఏసుప్రభువు రాకముందు ఈ యొక్క ధర్మ శాస్త్ర కేవలం ఒక నియమంక మాటగా మాత్రమే ఉండేది కానీ తరువాత ఏసుప్రభువు యొక్క రాకతో ధర్మశాస్త్రంకు జీవం పరిపూర్ణత వచ్చినది ఏసు ప్రభువు దైవ చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చారు.

ఏసుప్రభు రాకముందు ధర్మశాస్త్రం నేర్పిన విషయం ఏమిటంటే కేవలం నియమం పాటిస్తే చాలు జీవితం ధన్యమవుతుంది అని, కానీ క్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రం కేవలం నామకార్థం కు పాటించడం కు బదులుగా ఒక మంచి నిజాయితీ కలిగిన జీవితం ధర్మశాస్త్రం పాటించుట ద్వారా రావాలి అని తెలిపారు.

అప్పటి యూదుల మాటలు క్రియలు భిన్నంగా ఉండేవి అందుకే ఏసుప్రభు ధర్మశాస్త్రం పాటించే వారికి విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలని తెలిపారు.

ధర్మ శాస్త్రాన్ని, ప్రవక్తల ప్రబోధాన్ని ఏసుప్రభువు ప్రేమతో తన యొక్క మరణ పునరుద్ధానం ద్వారా నెరవేర్చారు.

ప్రభువు మన నుండి కోరుకునేది ఒక మంచి జీవితం, ధర్మశాస్త్ర బోధకుల కంటే నీతి వంతమైన జీవితం జీవించాలి, చాలా సందర్భాలలో మన నియమా నిబంధనలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం, కానీ మనుషులను మరిచిపోతాం, ధర్మశాస్త్రం పాటించేవారు తప్పనిసరిగా సోదర ప్రేమ దైవ మనస్తత్వం కలిగి జీవించాలి.

ధర్మ శాస్త్రం ఇవ్వబడినది మనిషి దేవుని ప్రణాళికలు తెలుసుకొంటూ పవిత్ర జీవితం జీవిస్తూ దేవుని యొక్క మార్గమును పుణ్యక్రియలను అనుసరించాలన్న ఉద్దేశం కొరకే మనం మంచిగా జీవిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం.

ఏసుప్రభు నరహత్య చేయరాదు అదే  విధంగా సోదరుడిని వ్యర్థుడా అనేవాడు నరకాగ్నిలోనికి పంపబడతాడు అని తెలుపుచున్నారు, అలాగే మన సోదరుల మీద కోపబడితే తీర్పుకు గురి అవుతాం అని తెలిపారు.

మానవ జీవితంలో కోపపడటం సహజం, కానీ ఆ కోపం మనిషిని పాపంలోనికి నడిపించకూడదు అనే ఏసుప్రభువు తెలుపుచున్నారు.

మన పొరుగు వారిని చంపకున్నంత మాత్రాన సరిపోదు, అతనిని ద్వేషించకూడదు, చులకనగా చూడకూడదు, తగువులాడకూడదు, వారికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి. సోదర ప్రేమ ఉంటే సమస్తము సాధ్యమవుతుంది, యేసుప్రభు కోప పడ్డారు, ఆయన యొక్క కోపం మంచి కొరకే మనం కూడా కోపబడే సందర్భంలో మంచి ఆశించే కోప పడాలి.

ప్రస్తుత కాలంలో మనం చాలామందిని శరీరకంగా చంపకపోయినా, మన యొక్క మాటలు, క్రియల  ద్వారా మానసికంగా చంపుతూనే ఉంటాం అలాంటివి మానుకోవాలి.

సోదరులతో మనస్పార్ధాలు ఉన్నప్పుడు మనం వెళ్లి సంఖ్య పడాలి. సంఖ్య  పడుటయే దేవుడు కోరుకునేది, అదే విధంగా ఏసు ప్రభువు వ్యభిచారించవద్దు అని పలికారు, ఒట్టు పెట్టుకోకూడదు అని తెలిపారు. మన యొక్క జీవితంలో శరీరకంగా అనేకసార్లు శోధించబడతాం. ఆ శోధనలో కొంతమంది పడిపోతుంటారు, మన యొక్క కార్యాలే కాకుండా మన యొక్క తలంపులు కూడా చాలా ముఖ్యం కాబట్టి మన ముఖ్యంగా మన యొక్క చూపులను, తలంపులను, హృదయం  పవిత్రంగా ఉంచుకోవాలి.

ఈనాటి సువిశేశం  లో  యేసు ప్రభువు చెప్పిన ప్రతి అంశంలో మనిషి యొక్క స్వేచ్ఛ గురించి చెప్పబడింది, తన స్వేచ్ఛలో దేవుడు మార్గాలను ప్రణాళికలను ఎంచుకుంటున్నారా? లేక వేరొక మార్గమును ఎంచుకుంటున్నారా అన్నది అందరూ ధ్యానించుకొని జీవించాలి.

దేవుడు మనకు ఇచ్చిన స్వేచ్ఛ మంచిని ఎంపిక చేసుకుని దేవుని సంతోషపరిచే జీవితం జీవించుదాం . ఈ నాటి దివ్య పఠనాలు మనకు ఒక సవాలు లాంటివి, ఎందుకంటే మన స్వేచ్ఛలో మనం ఎంత మాత్రం మంచినీ ఎంచుకుంటున్నాం ఎంత మాత్రం దేవుని సంతోషపెట్టే జీవితం జీవిస్తున్నాం మన యొక్క సరియైన ఎంపికలు ద్వారా దేవునికి దగ్గరవుతున్నామా అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి.


FR. BALAYESU OCD

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...