9, అక్టోబర్ 2021, శనివారం

28 వ సామాన్య ఆదివారము(3)

28 వ సామాన్య ఆదివారము(3)

మొదటిపఠనము:  విజ్ఞానము లోకములో దొరికే సంపదలకంటే గొప్పదని బోధిస్తుంది

రెండవ పఠనము: దైవ  వాక్కు  మహా  శక్తి కలది.

సువిశేషపఠనము:నిత్యజీవితముఅంటే ఏమిటి?దానినిచేరుమార్గమేమిటని  బోధిస్తుంది.

మొదటిపఠనము:

నాటి మొదటిపఠనములో సోలోమోను రాజు లోకములో జ్ఞానము కంటే గొప్పది ఏది కాదని తెలుసుకొని ప్రార్ధన ద్వారా దాన్ని పొందుతున్నాడు, అవి సింహాసనమైతేనేమి, రాజ్యాధికారం అయితేనేమి, సిరి సంపదనైతేనేమి, బంగారమైతేనేమి, ఆరోగ్యమైతేనేమి, సౌందర్యమైతేనేమి. ఎందుకంటె జ్ఞానము సమస్త ప్రశస్త వస్తువులను బహు సంపదలను గూడా తెచ్చును. అయితే జ్ఞానము వలన లాభమేంటి?.

1 దేవుని యొక్క పవిత్రతను,సత్సబంధ ప్రేమను తెలియజేస్తుంది. మోషే ప్రవక్త దేవునితో ముఖ్య ముఖి మాట్లాడాడు.

2 విజ్ఞానము దేవునినుండి వచ్చు బహుమానము ( యిర్మీయా 29 :11 )

3.విజ్ఞానము అంటే దేవునికి భయభక్తులు చూపడమే ( యోబు 28 :28 )

ఇది ఎలా వస్తుందంటే? దైవభయము వలన. “దైవభీతి విజ్ఞానమునకు మొదటిమెట్టు” (కీర్తన :111 :10) దేవునియొక్క జ్ఞానము మనల్ని మనం ఎలా  రక్షించుకోవాలో నేర్పిస్తుంది.

దేవునియొక్క జ్ఞానము గొప్ప గొప్ప విషయాలను మనకు తెలియజేస్తుంది.

 దేవునియొక్క జ్ఞానము విధేయతను,విశ్వాసమును నేర్పుతుంది.

దేవునియొక్క జ్ఞానము దేవునియొక్క నిగుడమైన ప్రేమను గూర్చి తెలియజేస్తుంది. ఎందుకంటే జ్ఞానము ఈలోకమునుండి కాక, సాక్షాత్తు దేవునినుండి వస్తుంది.అందుకనే ఈనాడు సొలొమోను రాజు  దీనికోసం ప్రార్ధన చేసింది. జ్ఞానము ద్వారానే అతడు తన రాజ్యాన్ని ఎంతో గొప్పగా పరిపాలించగలిగాడు. అయితే  ఈనాడు నువ్వు నేను ఈలోకసంపదలకు కాక, ఆశాలకోసంకాక, పరలోకం కోసం, పరలోకంలో వున్న దేవుడికోసం వెదకాలి. అప్పుడే మనకు గొప్ప బహుమానం కలుగుతుంది. యిర్మీయా :29: 11 లో, "నేను మీ క్షేమము కొరకు ఉద్దెశించిన పధకములు నాకు మాత్రమే తెలియును. నేను మీ అభివృద్ధినే కానీ, వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని"అని అంటున్నాడు. అయితే బంగారు భవిష్యత్తు నీకు నిత్యజీవితము చేకూర్చేది.

  సువిశేష పఠనములోచూస్తే:

 యేసు ప్రభువు యోర్దాను నది నుండి యెరూషలేము ప్రదేశానికి వెళ్లుచుండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చి అయన ఎదుట మోకరించి,సద్భోధకుడా! నిత్య జీవితం పొందుటకు నేనే మి చేయాలి అని అడిగినపుడు,దేవుడియొక్క ఆజ్ఞలను పాటించమని పలికాడు. అప్పుడు యువకుడు మాటలకు నా చిన్ననాటినుండే ఇవన్నీ పాటిస్తూనే వున్నాను అని సంతోషముగా పలికాడు. అప్పుడు యేసు ప్రభువు అతని వంక ప్రేమతో చూసి,నీకు ఉన్నదంతా వెచ్చించి,పేదలకు దానం చేసి,అటు పిమ్మట నన్ను అనుసరింపుము.పరలోకమందు నీకు ధనము చేకూరును, అని అనెను. కానీ యువకుడు అధిక సంపదలు గలవాడగుటచే మొఖమును చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు.

  ఇక్కడ  యువకుడియొక్క జీవితాన్ని క్లుప్తంగా పరిశీలించినట్లయితే:

 1. అజ్ఞల యొక్క అంతరంగాన్ని కనుగొన లేక పోయాడు

2. లోక వ్యామోహాల ఊబిలో పడిపోయాడు

3. దేవుని యొక్క పిలుపును తిరస్కరించాడు.

4. మొఖము చిన్నబుచ్చుకొని వెళ్లిపోయాడు. 

 

1. ఆజ్ఞల యొక్క అంతరంగాన్ని కనుగొనలే పోవుట:

    దేవుడు మోషే ప్రవక్తద్వారా  ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలలో నిగూఢమైన  పరమార్థం గురించి  అర్ధంచేసుకోలేక పోయాడు. ఆజ్ఞలు రెండువిషయాలగురించి తెలియజేస్తున్నాయి.

1. దేవున్ని ప్రేమించుట

2. మానవుని ప్రేమించుట.

 ముందుగా అతడు యేసుప్రభువు ఆజ్ఞలను పాటించు అని అడిగినపుడు ధైర్యముగా, సంతోషముగా నేను అన్నీ పాటిస్తున్నాను అని చెప్పా గలిగాడే కానీ వాటిలో నిగుడతను తెలుసుకోలేకపోయారు, ఇంకా అర్ధం చేసుకోలేక పోయాడు. ఆజ్ఞలను దేవుడు మనకెందుకిచ్చాడంటే, దేవుడిని , మన పొరుగువారికి ప్రేమించడానికే.

2 . ఈలోక వ్యామోహాలలో పడిపోయాడు:

          యువకుడు ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు కానీ, అది  ఇచ్చినటువంటి దేవుడిని కాదు. అందుకే నీకున్నదంతా వెచ్చించి,పేదలకు దానము చేయుము, అటు పిమ్మట నన్ను అనుసరింపుము అన్నపుడు దేవుని యొక్క పిలుపును గ్రహించలేక , అర్ధం చేసుకోలేక బాధపడుతూ,మోహమును త్రిప్పుకొని వెళ్లి పోయాడు.

ఉదా:

   లూకా:12 :16 -20 లో ధనవంతుడి జీవితాన్ని మనం చూస్తే, తనకోసం, తన స్వార్థంకోసం ,కొట్లను నిర్మించి దానిలో సంపదలను కూడబెట్టి ఓనా ఆత్మమా తినుము, త్రాగుము, స్తుతించుము.  అప్పుడు దేవుడతనితో,ఓరీ! అవివేకి రాత్రికే నీ ప్రాణములు తీసుకొనిపోబడును.అప్పుడు నీవు కూడబెట్టిన డబ్బు ఎవరికీ చెందును అని అనెను. ఇంకా లూకా :16: 19-24 లో. ధనవంతుడు లాజరుగూర్చి తెలుపబడుతుంది.వీరిద్దరు జీవించిన జీవితం ద్వారా ధనవంతుడు నరకాగ్నిలోకి పోతే, లాజరు పేదవాడు మాత్రం అబ్రాహాము ఒడిలోకి చేర్చబడ్డాడు. దేవుని దృష్టిలో లాజరు గొప్పాజీవితాని జీవించాడు కానీ, ధనికుడు కాదు. ఎందుకంటే తనప్రక్కనే ఉన్నటువంటి లాజరును పట్టించుకోకుండా తన ఇష్టానుసారం జీవించి, దేవునియొక్క కోపాగ్నిపాలయ్యాడు.

  పు.మత్తయి:27:24లోఅంటారు,"ఈలోకంలోసంపదలుకూడబెట్టుకోవలదు.చెద పురుగులు,త్రుప్పు వానిని తినివేయును.దొంగలు కన్నమువేసి దోచుకొందురు" అంటున్నాడు. అయితే ధనవంతుడు మరియు యువకుడు దాచుకొనినట్లు మనంకూడా దనాన్ని కూడబెట్టుకున్నచో,అది మనము దక్కకుండా ఇతరులవశమవుతుంది.సామెతలు:  27: 24 "ధనం శాశ్వతంకాదు, సంపదలు కలకాలం నిలువవు". ఇక్కడ మనము ఉదాహరణకు పు.మదర్ తెరెసా గారిని తీసుకుంటే,ఆమె ఈలోకములో దనాన్ని కూడబెట్టుకోక పరలోకరాజ్యములో కూడబెట్టింది. కాబట్టే ఆమెను ఈనాడుమదర్అని పిలుస్తున్నాము.

 అసలు నిత్యజీవితంఅంటే ఏమిటంటే,పరలోకం. మరి పరలోకాన్ని చేరాలంటే ముందుగా:

1.యేసు ప్రభువునందు విశ్వాసం కలిగి జీవించాలి:

యోహా 3: 36: "కుమారుని విశ్వసించువాడు నిత్యజీవమును పొందును". అంటే ఎవరైతే యేసుప్రభువునందు అచంచలమైన  విశ్వాసమును కలిగి జీవిస్తారో. సువిశేషపఠనములో యువకుడు సద్భోధకుడా! అని సంభోదించాడు కానీ, యేసు ప్రభువును దేవునిగా అంగీకరించలేదు.

2. తండ్రి చిత్తానుసారం జీవించాలి:

  మత్తయి:7: 21 "ప్రభూ! ప్రభూ! అని సంభోధించువాడు పరలోకములో ప్రవేశింపరు. కానీ,తండ్రి   చిత్తానుసారముగా వర్తించువాడే పరలోకమున ప్రవేశించును". మన సాధారణ జీవితములో ఎన్నో తపోక్రియలు చేసినా,దేవునికి గొప్పగా మొరపెట్టినా కానీ తండ్రి చిత్తానుసారం జీవించకపోతే వ్యర్ధము.  

. మారుమనస్సు పొందాలి:

   మత్తయి:18:3 మీరు పరివర్తన చెంది,చిన్నబిడ్డలవలే రూపొందిననే తప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను". అని దేవుడు పలుకుచున్నాడు. ఇక్కడ చిన్నబిడ్డలంటే,దేవునియందే ఆధారపడి జీవించేవారు.ఈలోకవస్తువులమీద ఆధారపడుతూ జీవించేవారుకాదు. అయితే యేసుప్రభువు యువకుడు జాలితో, మొఖమును చిన్నబుచ్చుకొని వెనుతిరిగి వెళ్తున్నప్పుడు తన శిష్యులతో ధనవంతుడు పరలోకరాజ్యమున ప్రవేశించుటకంటె, ఒంటె సూదిబెజ్జములో దూరిపోవుట సులభ తరము అని తెలియజేస్తున్నాడు. అంటే వారు పరలోక రాజ్యానికి ఎంతో దూరముగా వున్నారని, వారు ఎప్పటికి చేరబోరని తెలియజేస్తున్నాడు.

4. క్రీస్తుకొరకు జీవించాలి:

  ఉదాహరణకు శిష్యులజీవితాన్ని మనం చూస్తే,వారు మొదట వారిస్వార్ధం కోసం జీవించినా కానీ తరువాత క్రీస్తుకొరకే జీవించి మరణించడానికయినా వెనకంజ వేయలేదు. అది వారు మనకు చూపించిన గొప్ప ఆదర్శవంతమయిన జీవితము.

      అయితే ఈనాడు శిష్యులు మరి మేమంతా విడిచిపెట్టి వచ్చి మిమ్ము అనుసరించితిమి అని అంటున్నపుడు యేసుప్రభువు :నా నిమిత్తము అన్నదమ్ములను,అక్కచెల్లెలను, భార్యలను, పిల్లలను,భూములను విడిచిపెట్టి నన్ను అనుసరించు వాడు వాటిని అధికముగా తిరిగి పొందును.అని అంటున్నాడు. అయితే ఇక్కడ పూర్తి సమర్పణా జీవితం కలిగి జీవించాలని భోధిస్తున్నాడు. సమర్పణా జీవితం ద్వారా,దేవుడికి పూర్తిగా సమర్పించుకొని చేసుకొని, ఆయనను విశ్వసించి, అయన చిత్తానుసారము నడుస్తూ, మారుమనస్సు కలిగి ఆయనకొరకే జీవించాలి. అదే మననుండి దేవుడు కోరుకునేది. 

  అయితే ఈనాటి రెండవ పఠనము ద్వారా దేవుడు మనకు దేవుని వాక్కు యొక్క శక్తిని గూర్చి తెలియజేస్తుంది. ఇక్కడ, దేవుని యొక్క వాక్కు జీవమును,చైతన్యమైనది.అది రెండంచుల కత్తికంటే పదునైనదని తెలియ జేస్తుంది. ఉదా హరణకు :దేవుడు ఈలోకాన్ని సృష్టించినపుడు తన వాక్కు ద్వారా సృష్టించాడు. తన వాక్కు ద్వారా ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి విడిపించాడు. ఎడారిలో ఆకలిగా వున్నప్పుడు తన వాక్కు ద్వారా మన్నాను కలుగజేసి వారి ఆహారాన్నితీర్చాడు. కుమారుడైన యేసుప్రభువు, తన వాక్కు ద్వారా ఎంతోమందిని దీవించాడు. తన వాక్కు ద్వారా ఎంతోమందిని స్వస్థపరిచాడు.తనవాక్కు ద్వారానే ఎంతోమంది మరణించిన వారిని తిరిగి లేపాడు. ఇలా ఎన్నోరకాలుగా, దేవుడు తన వాక్కు ద్వారా ఎన్నో ఎన్నెన్నో గొప్పమేలులు, గొప్పకార్యాలు చేసాడు. అయితే వాక్కు అయినటువంటి యేసుప్రభువుని విశ్వసించి, ఆయనతోపాటు ఐక్యతకలిగి జీవించాలి. అప్పుడే వాక్కు మన హృదయములోకి చొచ్చుకొనిపోయి,మనలో ఉన్నటువంటి పాప కలంకములను, చెడు జీవితాన్ని, అవిశ్వాసపు జీవితాన్ని, రెండంచుల ఖడ్గములాగా వీటన్నిటిని ఛేదించుకొనిపోయి, నూతన జీవితాన్ని మనకు ప్రసాదిస్తుంది. 

    కాబట్టి మనమందరము అయన వాక్యానుసారము జీవిస్తే, దాని ఫలితం నిత్యజీవితాన్ని మనం సంతోషముగా పొందగలం. అయితే, దేవుని వాక్కు నందు విశ్వాసము కలిగి జీవించాలి .అప్పుడు నీవు దేవునికి వినయము కలిగి,ఆయనతో కలిసి సిలువదారిలో ప్రయాణిస్తావు. అది నిన్ను నన్ను దేవునితో ఐక్యపరిచి, ఒక్కటిగా చేసి,నిత్యజీవితములో పాలుపంచుకొనునట్లు చేస్తుంది.ఎందుకంటే దైవవాక్కు ద్వారా పాతనిభందనలో సృష్టిని సృష్టించాడు. వాక్కు ద్వారా ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశమునకు నడిపించి రక్షణను కల్పించాడు. అవిశ్వాసులను విశ్వాసులుగా మార్చాడు. మరణించినవారికి జీవాన్ని ఒసగాడు. అంత శక్తి దేవుని  యొక్క వాక్కుకి కలదు. ఎందుకంటే, కాబట్టి మన జీవితములో దేవునియొక్క వాక్కుని మన హృదయములోకి స్వీకరించి, స్వీకరించిన వాక్కుని అనుసరిస్తూ,నిత్యజీవితపు మార్గములో ప్రయాణించాలి. అప్పుడే మన జీవితానికి ఒక పరమార్ధం ఉంది. ఎందుకంటే, కాబట్టి మన జీవితములో దేవునియొక్క వాక్కుని మన హృదయములోకి స్వీకరించి, స్వీకరించిన వాక్కుని అనుసరిస్తూ,నిత్యజీవితపు మార్గములో ప్రయాణించాలి. అప్పుడే మన జీవితానికి ఒక పరమార్ధం ఉంది. కాబట్టి ఈనాటి దివ్య బలిపూజలో వాక్కుదారిఅయిన యేసు ప్రభువునియందు విశ్వాసము కలిగి జీవిద్దాం.ఆమెన్.

 

 -   బ్ర.నందిగామ. జోసెఫ్ మారియో 

 

 

 

 

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...