25, ఫిబ్రవరి 2026, బుధవారం

యెహోషువ చరిత్ర

 యెహోషువ చరిత్ర  

 
మోషే తరువాత ప్రజలను నడిపిన నాయకుడుయెహోషువ. మోషేకు అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఈ భాధ్యతను తీసుకున్నాడు. మోషే మరణించిన తరువాత యావే   నూను కుమారుడైన యెహోషువ మరియు  ప్రజలతో యొర్దాను నది దాటి వారికి  ఇస్తాను అని చెప్పిన దేశమునుకు వెళ్ళమని చెప్పాడు. నీ జీవితకాలంలో నిన్ను ఎవరు ఎదురింపలేరు అని చెప్పాడు. మోషే వలే నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. 

దేవుని సహాయం పొందుటకు ధర్మశాస్త్రము అనుసరించాలి 

 దేవుడు యెహోషువతో ధైర్యముగా  ఉండమని, నేను ఈ ప్రజల పితరులకు ఇస్తానని చెప్పిన భూమిని నీవు పంచి ఇస్తావని, ధైర్యస్తైర్యము కోల్పోకుండా ఉండమని చెప్పాడు. మోషే ఇచ్చిన ధర్మ శాస్త్రము తప్పక పాటించిన మీరు కృతార్థుడవగుదురని  అంటున్నాడు. ధర్మ శాస్త్రమును నిత్యము పఠించి, దానిని అహోరాత్రులు మననం చేయాలి,  దానిలో చెప్పిన అన్ని న్యాయములను పాటించినప్పుడు, అతని కార్యములు పూర్తిగా నెరవేరుతాయి.  అప్పుడు నీకు నేను ఎప్పుడు  తోడుగా ఉంటానని  అభయమిచ్చాడు. 

యెహోషువ వాగ్దత్తభూమిని పొందుటకు ప్రజలను సిద్ధం చేయుట 

యెహోషువ నాయకులను పిలిచి ఆహారపదార్థములు సిద్దముచేసుకోనండి,  యావే  ఇస్తాననిన  దేశమును స్వాధీనంచేసుకొనుటకు  యోర్ధాను  దాటలని చెప్పాడు.  రూబెను, గాదు , మనష్హె  సంతతిలో సగం మందిని పీలిచివారికీ చెప్పగా  వారు నీవు చెప్పినట్లు చేయుదుము మీకు ఎదురుతిరిగిన వారికి మరణ శిక్ష విధించుము అని చెప్పారు. అప్పుడు యొహోషువ ఇద్దరు వేగులను పిలిచి షిత్తిము నుండి వారిని రహస్యముగా యెరికో పట్టణమును పంపాడు. వారు అక్కడ రాహబు అనే ఒక వేశ్య ఇంటిలో బసచేశారు. ఈవిషయం  తెలిసిన రాజు  రాహాబు ఇంటికి సైనికులను  పంపాడు. రాహాబు వారిని  దాచి,  వారు వచ్చిన మాట నిజమే కాని నగరద్వారం మూయువేళకు  వెళ్లిపోయారు, ఎక్కడకి వెళ్లారో  తెలియదు,  వారిని వెంబడించినచో మీరు  పట్టుకొనవచ్చని చెప్పి ఆ భటులను పంపి, వేగులను  దాచిపెట్టిన చోటుకు వెళ్ళి వారితో యావే చేసిన అధ్బుత కార్యములను జ్ఞప్తికి తెస్తూ మీరన్న మాకు భయం. నేను  దయచూపిన విధముగా  నా తండ్రి ఇంటి వారిపై కనికరము చూపిస్తామని యావేపై ప్రమాణము చేయమనగా వారు యావే ఈ దేశమును మాకి చ్చినప్పుడు ఖచ్ఛితముగా మీమ్ము ఆదరించుదుమని చెప్పి, మాకు గురుతుగా  ఆ ఇంటినుండి దింపిన కిటికీకి ఎర్రటి తాడును కట్టమని  మీ కుటుంబ సభ్యులం దరిని దానిలోనే ఉండమని చెప్పారు. తరువాత వేగులు కొండలు, నదిని దాటి యెహోషువకు , జరిగినదంత చెప్పి, యావే మనకు ఆ దేశమును ఇవ్వబోతున్నాడని ఆ  ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. 

యొర్దాను నదిని దాటుట 

యొహోషువ ఉదయాన్నేలేచి  యిస్రాయేలియులతో షిత్తిము నుండి బయలుదేరి యొర్ధాను చేరి  నది ఒడ్డున  మూడు రోజులబస చేసి తరువాత  లెవీయులు దేవుని మందసమును తీసుకొని పోవుట చూసినప్పుడు మీరు మందసము వెనుక వెళ్ళమని, మందసముకు రెండువేల మూరల దూరంలో నడవాలని, యావే మీ మధ్య అద్భుతకార్యములు చేయును కనుక మిమ్మును పవిత్రపరచుకొనమని చెప్పాడు.  యాజకులతో నిబంధనమందసమును తీసుకొని ప్రజల ముందు నడవమని చెప్పాడు. 

యావే యొహోషువతో నెను మోషే వలె నీకును తోడుగా ఉన్నానని ప్రజలు తెలుసుకుంటారు నేను నిన్ను ప్రజల ముందు గొప్పవాన్నిగా చేస్తానని, నీవు యాజకులతో నిబంధనమందసమును యొర్దాను గట్టును సమీపించి నిలబడమని చెప్పమన్నారు. యొహోషువ ప్రజలతో దేవుడు మీతో వున్నాడని తెలుసుకొమ్మని చెప్పాడు. అప్పుడు మందసమును ఎత్తుకొనిన వారి పాదాలు నీటిలో పెట్టగానే పైనుండి వచ్చు నీరు దిగువ నుండి వచ్చే నీరు వేరుపడి ఒకచోటనిలుచును అని వారికి చెప్పాడు. ఆవిధముగానే యొర్ధాను నదిని దాటుటకు వారి పాదాలు తాకగానే పై నుండి పారు  నీరు ఆగిపోయి  ఒక రాశిగా పొగయాయి. యిస్రాయేలు ప్రజలు యెరికో నగరమునకు ఎదురుగా నదిని దాటారు. వారు అందరు నదిని దాటెవరకు  నిబంధనమందసమును మోయు యాజకులు నడిమద్యలో ఆరిన నేలపై నిలబడ్డారు. తరువాత యాజకులు నిలబడిన చోటనుండి  యావే అజ్ఞ ప్రకారం పన్నెండు రాళ్ళను తీసుకొని వచ్చి  బస చేయుచోట పెట్టారు . వారి  పిల్లలు ఈ రాళ్ళు ఏమిటని అడిగినప్పుడు ఈ నదీప్రవాహము ఎలా ఆగిపోయింది వారు చెప్పాలని వారికి చెప్పాడు.
 
 రూబెనియులు, గాదీయులు మనస్షే తెగలలోని వారు ఆయుధములు ధరించి యుద్దమునకు సిద్దమై నదిని దాటారు. నిబంధనపు మందసమును మోయుయాజకులు బయటకు రాగానే నది పూర్వ స్థితికి వెళ్ళింది.  యొర్ధాను నుండి బయటకు వచ్చి యెరికోకు తూర్పున ఉన్న గిల్గాలులో దిగారు. యొహోషువ యొర్ధాను నది నుండి తెచ్చిన రాళ్ళను అక్కడ నిలిపి రాబోవు కాలములో వారి పిల్లలకు దిని గురించి మరియు యావే రేళ్లు సముద్రమును కూడా ఎండు నట్లు చేసినది తెలియపరచాలని అప్పుడు యావే బాహూబలమును అన్ని జాతులు గుర్తిస్తారు అని చెప్పాడు. 

వాగ్దత్తభూమిని భాగాలుగా స్వాదినపరుచుకొనుట 

యొర్ధానుకు పడమటన ఉన్న అమోరియ రాజులు, సముద్ర తీరాన ఉన్న కనానీయ రాజులు యొర్ధానులో జరిగిన విషయాలు తెలుసుకొని భయపడ్డారు. గిల్గాలు వద్ద యొహోషువతో యావే రాతి కత్తులు చేయించి  యిస్రాయేలు ప్రజలకు మరల సున్నతి చేయింపమని చెప్పగా యొహోషువ గిబియెత్ హారలోత్ కొండ వద్ద సున్నతి చేయించాడు. ఐగుప్తు దాటి వచ్చే సమయంలో పుట్టిన వారు ఎవ్వరూ సున్నతి పొందలేదు. అందరు సున్నతి చేసుకొని ఆరోగ్యం కుదుటపడువరకు అక్కడే  విశ్రాంతి తీసుకున్నారు. ఆ నెల 14 వ రోజు సాయం కాలం యెరికో మైదానంలో పాస్కపండుగ చేసుకున్నారు. ఆ తరువాతి రోజున ఆ దేశపు పంటను  రుచి చూశారు. అప్పటినుండి మన్నా ఆగిపోయింది. 

యొహోషువ యెరికోలో ఉన్నప్పుడు ఒక మనిషి కత్తి దూసి నిలబడియున్నాడు. అతన్ని యొహోషువ, నీవు మాకు చెందినవాడవా లేక శత్రువు చెందినవాడవా అని అడుగగా అతను నేను యావే సైన్యమునకు నాయకుడుగా  వచ్చాను అని చెప్పగా యొహోషువ అతని ముందు సాగిలపడి దేవుని వర్తమానం ఏమిటని అడుగగా నీవు నిలబడిన ఈ ప్రదేశం పవిత్రమైనది పాదరక్షలను తీసివేయమనగానే యొహోషువ అలానే చేశాడు. 

యెరికో ప్రజలు యిస్రాయేలియులను చూసి భయపడి నగరాన్ని మూసివేశారు. అప్పుడు యావే యొహోషువతో మీ యోధులు పట్టణమును ఒకసారి చుట్టిరావాలని అలా ఆరు రోజులు చేయాలని, ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బాకాలను ఊదుతు మందసము ముందు పోవాలని, అప్పుడు మీ ప్రజలందరు యుద్దనాదం చేయగా ఆ కోటగోడ దానికి అదే కులీ పోవును అప్పుడు మీరు వెళ్ళి ఆ నగరమును మీ వశం చేసుకోవాలని చెప్పాడు. యొహోషువ యావే చెప్పినట్లే చేశాడు. ఆ విధంగా వారు ఆరురోజులు చేసిన తరువాత 7 వ రోజు కోట చుట్టు ఏడుసార్లు తిరిగారు.ఆ పట్టణమును స్వాధీనపరచుకున్నారు.   

 ఆ పట్టణములోనికి వెళ్ళి అక్కడ శాపమునకు గురైన దేనిని ముట్టవద్దని చెప్పాడు.  పట్టణములోనికి వెళ్ళి దానిని ఆక్రమించుకొని శ్వాసించు దానిని సంహరించి శాపము పాలుచేశారు. రాహాబును ఆమె కుటుంబమును, ఆమె బంధువులను మాత్రము కాపాడారు. యావే అజ్ఞాపించినట్లు ఉండక ఆకాను కొన్ని వస్తువులను తీసుకున్నాడు. దాని పర్యవసానంగా హాయి నగరమును ఆక్రమించుకొనుటకు వెళ్ళినవారు అక్కడ సంహరించబడ్డారు. అప్పుడు యొహోషువ తన వస్త్రములను చించుకొని, యిస్రాయేలు పెద్దలతో కలసి తలపై దుమ్ము పోసుకొని చీకటి పడువరకు మందసము ముందు సాష్టాంగపడి ఉన్నారు. . అప్పుడు యావే లెమ్ము ,  యిస్రాయెలియులు పాపము చేశారు, శపింపబడిన వస్తువులను తీసుకొని, వారి సరకులలో కలుపుకున్నారు అందుకే మీరు ఓడిపోయారు, శాపగ్రస్తులైనవారు మీ మద్య ఉండగ నేను మీకు తోడుగా ఉండను అని ప్రభువు చెప్పాడు. 

చేసిన తప్పును ఒప్పుకొనుట శిక్షకు గురియగుట 

 యొహోషువా మరుసటి రోజు ప్రొద్దునే అన్ని తెగలవారిని వరుసగా రప్పించినప్పుడు యూద తెగవారు పట్టుపడ్డారు.  యూదా తెగలోని సెరా కుటుంబంలోని సబ్ది మనుమడు కర్మి కుమారుడు ఆకాను పట్టుపడగా,  ఆయన దొంగిలించిన వెండి బంగారము, మరియు ఉత్తరియములను ఎలా పాతి పెట్టిన విషయము చెప్పాడు. వారు వాటిని తీసుకొనివచ్చి ఆకాను కుమారులను, కుమార్తెలను ఆకోరు లోయలోనికి తీసుకొనిపోయి అతనిని రాళ్ళతో కొట్టి అగ్నితో కాల్చి వేశారు. అప్పుడు యావే యొహోషువతో భయపడవద్దు హాయిని మీ వశము చేస్తాను అని చెప్పారు. 

హాయిని వశపరచుకొనుట 

యొహోషువ 30 వేలమంది వీరులను రాత్రివేళ పంపి పట్టణ పడమర ఉండమని,  కొంతమందితో పట్టణము సమీపమునకు వెళ్ళి వారి ఎదుట నిలువలేక పొరిపోయినట్లుగా చేసి వారిని తరుముతున్నామనే బావనలో పట్టణమును వీడుతుండగా పడమర ఉన్న వారు పట్టణమును ఆక్రమించుకొనేలా చేసుకొని దానిని వెంటనే తగులపెట్టమని ప్రణాళిక వేసుకొని మరుసటి రోజు అదేవిధంగా చేయగా హాయి , బేతేలు ప్రజలు యిస్రాయెలును తరుముతూ వారు అందరు ఆ పట్టణమును విడిచి వెళ్లిపోయారు.  యావే చెప్పినట్లు యొహోషువ ఈటెను  పట్టణము వైపు చూపగా అక్కడ పొంచివున్న వారు ఆ పట్టణమును ఆక్రమించుకొని దానిని తగులపెట్టారు. హాయి ప్రజలు వెనుకకు చూడగా వారి పట్టణము తగులపడుతుండగా యిస్రాయెలియులు వారిమీద తిరగబడ్డారు వారికి ఎక్కడకి వెళ్లాలో తెలియలేకుండిరి.  రాజును మాత్రము ప్రాణముతో యొహోషువవద్దకు తీసుకొని వచ్చి మిగిలినవారిని  సంహరించారు. యొహోషువా హాయి రాజును చెట్టుకు వ్రేలాడదియించాడు. హాయి శాపము పాలైనది. అక్కడి పశువులను, కొల్లగొట్టిన సొమ్మును యావే ఆజ్ఞ ప్రకారం యిస్రాయేలు తీసుకున్నది. యొహోషువ ఏబాలు కొండమీద యావేకు ఇనుము తాకని, చెక్కని ముడి రాళ్ళతో బలి పీఠము కట్టించి యవేకు దహనబలులు, సమాధాన బలులు సమర్పించారు. మోషే ఇచ్చిన ధర్మ  శాస్త్రమును యొహోషువ రాళ్లపై చెక్కించి దానిని చదివించాడు. 

గిబ్యోనీయులు భయపడి సంధిచేసుకొనుట-  ఇతర దేశాల రాజులు ఏకమగుట - 

జరుగుతున్న విషయాలను తెలుసుకున్న హిత్తియులు, అమోరియులు, కనానియులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యొబూసీయులు  యొహోషువాతో యుద్దము చేయడానికి ఒకటయ్యారు. ఈ సంగతలును విన్న గిబ్యోనీయులు కపటోపాయంతో యోహోషువ వద్దకు వచ్చి మేము దూరం నుంచి వచ్చాము మీ దేవుని గురించి, ఆయన ఎలా మీ శత్రువులమీద విజయం చేకూర్చినది విన్నాము కనుక మీరు మాతో శాంతి పాటించుతమని మాతో ఒడంబడిక చేసుకోమని అడుగగా యిస్రాయెలు పెద్దలు మీరు ఈ ప్రాంతము వారేనేమో అని అనుమానాన్ని వెల్లడిచేయగా  వారు మేము దూరము నుండే వచ్చామని చెప్పగా పెద్దలు వారు ఇచ్చిన ఆహరమును యావేను సంప్రదింపకుండానే తిన్నారు, యొహోషువ వారితో ఒడంబడిక చేసుకొనిన మూడురోజులకు గిబ్యోనీయుల పట్టణములు చెరుకొనిరి, ఆ పట్టణములను ముట్టడింపలేదు కాని ప్రజలు వారి నాయకుల మీద గొణుగుకొన్నారు. యొహోషువా వారిని శపించి వారికు నీటిని వంటచెరకు తెచ్చుటకు నియమించేను.

పాలస్తీనా దక్షిణ భాగమును జయించుట 

యెరుషలెము రాజైన అదోనిసెదెకు యెరికో, హాయిలకు పట్టినగతి తెలుసుకొని, గిబ్యోను వంటి నగరమే వారితో సంధిచేసుకున్న విషయం తెలిసి, హెబ్రోను రాజు, యార్మూతురాజు, లాకిషురాజు ఏగ్లోను రాజులను తీసుకొని గిబ్యోను మీదకు యుద్దమునకు పోయాడు. అప్పుడు  యొహోషువ రాత్రి మొత్తం తన వీరులతో ప్రయాణం చేసి యావే అనుగ్రహంతో వారిని ఎదుర్కొన్నాడు. బెత్హహోరోను పల్లము వారిని తరిమివేశారు. యావే వారికి తోడ్పడిన విధం ఎంత గొప్పది అంటే శత్రువుల మీద వడగండ్ల వాన కురిపించాడు. ఈ వాన వలననే ఎక్కువ మంది చనిపోవడం జరిగినది.  యొహోషువ ఆ రోజు   సూర్యుడా నీవు గిబ్యోను పట్టణముపై నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయమీద ఆగుము అని ప్రార్ధించిన విధముగా సూర్యుడు, చంద్రుడు వారు గెలుచు వరకు ఆగిపోయారు. సూర్యుడు ఒక రోజువరకు అస్తమించలేదు.  శత్రురాజులు మక్కేడా గుహలో దాగుకొనియున్నారని ఆ గుహకు అడ్డుగా పెద్ద రాళ్ళను దొర్లించి భటులను కాపలాగా పెట్టారు. ఆ రాజులను తీసుకొని వచ్చి  నాయకులతో ఆ రాజుల మెడలపై పాదములను మోపించి మీరు యుద్దము చేయువారిని ఈ రీతిగానే నాశనం చేయునని చెప్పి ఆ రాజులను వధించి చెట్లకు వ్రేలాడదియించాడు. ఆ సాయంత్రం వారిని దించి ఆ గుహలో పడవేశారు. 

కనాను దేశం దక్షణ భాగం చేయించుట

అదే రోజు మక్కెడను యొహోషువ జయించాడు. మక్కెడ రాజుకు కూడా యెరికోకు పట్టిన గతే పట్టింది. యొహోషువ అతని అనుచరులు మక్కెడ నుండి లిబ్న వచ్చి ఆ పట్టణమును ముట్టడించారు.  యావే ఆ పట్టణమును యిస్రాయేలుకు అప్పగించాడు. అక్కడనుండి యొహోషువ లాకిషును రెండురోజులలో  వశము చేసుకున్నారు. గేసేరు రాజు, వారికి తోడుగా వచ్చిన వారు యిస్రాయేలును ఏమి చేయలేకపోయారు. తరువాత వారు లాకిషు నుండి 
ఏగ్లోనుకు వెళ్ళి ఆ పట్టణమును తరువాత హెబ్రోను స్వాధీనం చేసుకున్నారు.  అక్కడ నుండి  దెబీరుకు వచ్చి దాన్ని  ఆక్రమించుకున్నారు. ఆ విధంగా కాదేషుబార్నెయా  నుండి గాసావరకు గిబ్యోను వరకు ఉన్న గోషే  వరకు స్వాధీనం చేసుకున్నారు. 

ఉత్తర దేశమును జయించుట

హసోరురాజు  యాబీను యొహోషువ గురించి విని మాడోను రాజు యోబాబు, షిమ్రోను రాజు, అక్షాపు రాజు, ఉత్తరదేశపు పీఠభూములయందు రాజులకు, కిన్నెరోత్తుకు దక్షిణమున లోయలలోని రాజులకు డోరుసీమకు   ప్రక్క పల్లములో రాజులకు, కనానీయులకు, పెరిస్సీయులకు, ఆమోరియులకు, హివ్వీయులకు, యొబూసియులకు, మిస్ఫలోని హర్మోనులో ఉన్నవారికి  కబురు పంపి అందరు యిస్రాయేలు మీద యుద్దమునకు వచ్చారు. వారు అందరు మేరోము వద్ద దిగి యిస్రాయేలుతో యుద్దమునకు సిద్దంకాగా, యావే యొహోషువతో భయపడకు వారిని నీకు అప్పగిస్తానని చెప్పి, అలాగే చేశాడు. యొహోషువ అతని అనుచరులు అకస్మాత్తుగా వారి మీద పడి వారిని ఓడించారు. హసోరు, ఉత్తర దేశ పట్టణములు యిస్రాయేలు వశం అయ్యాయి. హసోరులోని మెట్ట పట్టణములనుండి వచ్చిన సొమ్మును, పశువులను యిస్రాయేలుతీసుకొని మిగిలన ప్రాంతములలో మొత్తాన్ని నాశనం చేసినది. యొహోషువ మోషే ఆజ్ఞలను మీరకుండ  పాటించాడు. తరువాత పీఠభూముల మీద ఉన్న అనాకీయులను నాశనం చేశారు. యొహోషువ యొర్ధానుకు తూర్పున ఉన్న రాజులను, పడమర ఉన్న రాజులను  జయించారు. 

పన్నెండు తెగలు కనాను పంచుకొనుట 

యొహోషువ ముసలి వాడు అయ్యాక, యావే అతనితో నీవు ముసలివాడవు అయ్యావు. ఇంకా జయించవలసిన దేశములు ఉన్నవి. ఆ దేశములలో ఉన్న వారినందరిని యిస్రాయేలు కన్నుల ముందునుండి తరిమివేస్తానని చెప్పి, నేను అజ్ఞాపించినట్లే ఈ నేలను వారసత్వభూమిగా యిస్రాయేలుకు పంచిఇవ్వమని, తొమ్మిది తెగలకు, మనస్షే అర్ధ తెగకు పంచిఇవ్వమని చెప్పాడు.రూబెను, గాదు తెగల వారికి తూర్పున యొర్ధానుకు అవ్వతల నేల వారికి ఇచ్చాడు. లెవీ తెగకు మాత్రము వారసత్వభూమి ఏమి లభింపలేదు. దేవునికి బలులు అర్పించుటయే వారి వారసత్వం. గాదు తెగకు  వారి వారి కుటుంబములను అనుసరించి మోషేచెప్పినట్లుగా   భూములు పంచి ఇచ్చాడు. తరువాత మనస్సే అర్ధతెగ వారికి వారివారి కుటుంబములను అనుసరించి  వారసత్వ భూమిని పంచి ఇచ్చాడు. యోర్ధానుకు తూర్పున ఉన్న రెండున్నర తెగలకు ముందుగానే భూమిని పంచి ఇచ్చాడు. లెవీ తెగకు మాత్రము ఇవ్వలేదు.కానీ వారు వసించుటకు కొన్ని పట్టణాలు, మందలు మేపుటకు కొన్ని బయళ్ళు ఇచ్చారు.  యేసేపు కూమరులు మనస్సే , ఏఫ్రాయిము అను రెండు తెగలగా ఏర్పడిరి. 

కాలెబు భాగము 

యూదీయులు గిల్గాలులో ఉన్న యోహోషువను చూచుటకు వచ్చారు, అపుడు యెపున్నే కుమారుడు కెనిస్సీయుడగు  కాలెబు యోహోషువతో మోషే వారికి చెప్పిన మాటలను గుర్తు చేసి, మోషే వాగ్ధానం చేసినట్లు ఆ కొండ సీమలను తనకు ఇవ్వమని అడిగాడు. యోహోషువ హెబ్రోను సీమను వారసత్వ భూమిని కాలెబుకు ఇవ్వడం జరిగింది. 

యూదాకు వారి కుటుంబాల ప్రకారం వారికి ఇచ్చిన భూమి ఏదోము సరిహద్దున ఉంది. అది శీను ఎడారి నుండి కాదేషు వరకు వ్యాపించి ఉంది. కాలెబుకు కూడా యూదా తెగవారు ఆక్రమించిన నేలలో భాగం ఇచ్చారు. కాలెబు తన కుమార్తె అక్సా కు వివాహం చేయగా ఆమె తన తండ్రిని నన్ను నెగెబు ఎడారి సీమకు ఇచ్చితివి కదా నాకు నీటి బుగ్గలు గల నేలను ఇప్పింపుము అని అడుగగా అతను ఆమెకు ఎగువ నీటి బుగ్గలు దిగువ నీటి బుగ్గలు ఇచ్చాడు. అది యూదా తెగల వారికి వచ్చిన వారసత్వ భూమి. 

ఎఫ్రాయీము తెగ :  యోసేపు తెగవారికి  యోర్ధాను నుండి ఏరికో వరకు తూర్పు వైపున ఉన్న నేల వచ్చింది. వారి   సరిహహద్దులు ఏరికో నుండి బేతేలు వరకు, బేతేలు లూసు నుండి ఆటారోతున వున్న ఆర్కి వరకు అక్కడనుండి పడమట బెత్ హొరోను వరకు గేసెరునుండి సముద్రం వరకు ఉన్నది. ఎఫ్రాయీము జనులు గేసెరున నివసించు కనానీయులను వెడలకొట్టక పోవడంతో వారు అక్కడే జీవించారు మరియు వారిచేత చాకిరి చేయించుకున్నారు. 

మనష్హె తెగ : యోసేపు పెద్దకుమారుడు మనష్హె. మనష్హె పెద్దకుమారుడు మాకీరు పోరాట వీరుడు. అతనికి గిలాదు, బాషాను మండలాలు ఇవ్వబడ్డాయి.  మనష్హె ఇతర కుమారులకు వారివారి కుటుంబములను అనుసరించి భూమినిచ్చారు. వారు అబిఏజెరు, హేలేకు, ఆస్రియెలు, షేకెము, హేఫెరు, షెమిదా. గిలాదు మాకీరు కుమారుడు గిలాదుకు హేఫెరు కుమారుడు, హేఫెరుకు కుమార్తెలు మాత్రమే ఉన్నారు. వారు మహ్ల, నోవా, హొగ్లా, మిల్కా, తీర్సా.  వీరు యోహోషువ, ఎలియాజరు , మరియు పెద్దల  వద్దకు వచ్చి  యావే ఆజ్ఞను అనుసరించి మాకును ఇవ్వమని అడుగగా అటులనే వారికి భాగము ఇచ్చారు. కనుక మనష్హెకు గిలాదు , బాషాను మండలలే కాక పది వంతులు ఎక్కువ భూమి వచ్చినది. దక్షిణమున ఎఫ్రాయీము ఉత్తరమున మనష్హె ఉన్నారు. వారికి ఉత్తరమున ఆషేరు తూర్పున యిస్సాఖారు ఉన్నారు. ఈ మండలలలో మనష్హెకు పట్టణాలలు ఉన్నవి. 

యోసేపు సంతతి వారు యోహోషువతో మేము యావే దీవెనల వలన చాలమందిమి అయ్యాము అని చెప్పగా యోహోషువ వారితో మీకు ఎఫ్రాయీము ప్రాంతము చాలనిచో అరణ్య ప్రాంతమునకు వెళ్ళి పెరిస్సీయులు  రేఫీయులు నివసించు దేశంలో అడవులను నరికి అక్కడ నేలను ఆక్రమించుకొనమని చెప్పారు. అక్కడ కనానీయులు బలవంతులైయన మీరు వారిని వెడలగొట్టగలరు అని చెప్పాడు. 

యిస్రాయేలీయులు షీలో  వద్ద చేరి సమావేశపు గుడారము ఏర్పాటు చేశారు. వారు ఆ ప్రాంతమును స్వాదినము చేసుకున్నప్పటికి ఏడుతెగలవారికి  వారసత్వ భూమి లభింపలేదు. యోహోషువ వారితో ఇంకా ఎంత కాలం యావే మీకు ఇచ్చిన భూమిని స్వాదినం చేసుకోకుండా  జాగుచేస్తారు, ఒక్కో తెగ నుండి ముగ్గురిని ఎన్నుకొండి వారు ఈ నేల మొత్తం తిరిగి దానిని ఎట్లు విభజింపాలో నిశ్చయించి, నా దగ్గరకు వచ్చేదరు అని చెప్పాడు. వారు ఈ భూమిని ఏడు భాగాలుగా విభజించాలని యూదా తెగవారికి దక్షిణ భాగమున, యోసేపు ఉత్తర భాగమున ఉంటారని చెప్పారు. లెవీయులకు మీతో భాగము లేదు.  యావే యాజకులుగా పనిచేయుటయే వారి వారసత్వం. గాదు, రూబెను, మనష్హె అర్ధ తెగవారు యొర్ధాను ఆవలిదరిని తూర్పు వైపున  తమ వారసత్వ భూమిని తీసుకున్నారు. 

మిగిలిన తెగలవారు వారసత్వ భూమి పొందుట 

అక్కడకు వచ్చిన తరువాత చీటి వెయ్యగా మొదటి వంతు బెన్యామీను కుటుంబమునకు వచ్చెను అది యూదా యోసేపుల భాగముల మద్య ఉన్నది. షిమ్యోను తెగ: తరువాత చిట్లు వెయ్యగా రెండవ వంతు షిమ్యోను వారికి వచ్చినది. అది యుదీయుల వారసత్వ భూమి మద్యలో ఉన్నది. యూదాకు వచ్చిన భాగము చాలా పెద్దది. కనుక షిమ్యోను వారసభూమి యూదా నుండి పంపిణిచేయబడెను. సెబూలూను తెగ : తరువాత చిట్లు వెయ్యగా వచ్చిన మూడవ చీటి సెబూలూనుకు వచ్చినది. వారినేల సరీదు వరకు వున్నది. యిస్సాఖారు: నాలుగవ సారి చీట్లు వేయగా   యిస్సాఖారుకు వచ్చినది. ఆషేరు తెగ:ఐదవ వంతు ఆషేరు తెగకు వచ్చింది. 
నప్తాలి తెగ: ఆరవ వంతు నఫ్తాలి తెగవారికి వచ్చినది. దాను తెగ: ఏడవ వంతు చీటి దాను తెగ వారు పొందారు. దానీయులు వారి భూభాగం కోల్పోవడంచే వారు లెషెము మీద యుద్దము చేసి దానిని స్వాధీనపరుచుకొని దాను పేరును ఆ నగరమునకు పెట్టారు. 

యోహోషువకు కూడా వారు వారసత్వ భూమి ఇచ్చారు . యోహోషువ అడిగినట్లు ఎఫ్రాయీము పీఠభూములలోని తిమ్నాత్ సెరా  పట్టణమును ఇచ్చారు. ఆయన దానిలొనే నివసించాడు. ఆవిధముగా యిస్రాయేలు ప్రజలు వారసత్వ భూమిని పంచుకున్నారు. 

ఆశ్రయ పట్టణాలు 

ముఖ్య నరగరాలు : యావే యోహోషువతో యిస్రాయేలీయులను ఆశ్రయపట్టణములను ఎన్నుకొనమని చెప్పాడు. తెలియక ఎవరినైన చంపినవారు ఈ పట్టణములలో తలదాచుకోవచ్చు. పగ తీర్చుకొనగోరే వారి నుండి ఈ నగరాలు రక్షణ కల్పిస్తాయి. ఇతరులను చంపినవాడు ఇక్కడ శరణు పొందవచ్చు, అతడు మొదట నగరద్వారం వద్ద నుండి అతడు పెద్దలకు ఆ విషయం చెప్పాలి. వారు అతనికి ఆశ్రయం ఇవ్వాలి.  పగ తీర్చకొనేవారు ఎవరైన అతనిని వెదకి వచ్చినట్లయితే మీరు అతనిని పట్టి ఇవ్వరాదు అని చెప్పాడు. అతడు పగతోటి కాక తెలియకనే చంపాడు. ఆ వ్యక్తి  తాను వచ్చినప్పుడు ఉన్న ప్రధాన యాజకుడు మరణించువరకు ఆ నగరమునే ఉండవచ్చు.  తరువాత అతను తన సొంత నగరమునకు కాక నప్తాళి  లోని  కొన్ని నగరాలలో కేదెషు, ఎఫ్రాయీము మున్నేములోని షెకెము, యూదా లోని హెబ్రోను, ఏరికో తూర్పున ఉన్న బేసెరును , రామోత్ గిలాదును, గోలానును    ఆశ్రయపట్టణములుగా నిర్ణయించారు. 

తరువాత లెవీయ పెద్దలు  యోహోషువ, ఎలియెజరు యిస్రాయెలు పెద్దల వద్దకు వచ్చి మేము నివసించుటకు పట్టణములు, మా  గొడ్లు మేపుకొనుటకు గడ్డి బీళ్లను ఇవ్వాలని యావే అజ్ఞాపించిన విధంగా ఇవ్వమని అడగడం జరిగినది. వారికి యిస్రాయెలు ప్రజలు వారి వారి వారసత్వ భూములనుండి లేవీయులకు ఇవ్వడం జరిగినది. 

యొర్దాను అవతలి తెగల వారు వెళ్లిపోవుట - వారికి యెహోషువ సందేశం 
 
యోహోషువ రూబెనియులను గాదియులను , మనశ్శె అర్ధ తెగవారిని యావే సేవకుడు మోషే మీకు ఇచ్చిన ఆజ్ఞలను పాటించారు మీరు ఇన్ని రోజులు ఈ సోదరులను వీడి పోలేదు. మీ సోదరులకు ఇప్పుడు విశ్రాంతి లభించినది. కనుక మీరు మీ నివాసముల ఉన్న యొర్దాను అవతల ఉన్న మీ నివాసములకు వెళ్ళమని, యావే ఇచ్చిన ఆజ్ఞలను పాటింపమని వారికి చెప్పాడు.  అలా తూర్పు తెగలవారిని యెహోషువ పంపించాడు. రూబేనీయులు గాదీయులు, మనస్సే తెగవారు గిలాదు మండలమునకు వెళ్లిపోయారు. 

వారు యొర్దాను నందలి రాళ్ళ గుట్ట వద్ద యిస్రాయేలీయుల వైపున బలిపీఠము ఏర్పాటు చేశారు అది  తెలిసి యిస్రాయేలీయులు షిలో వద్ద నుండి వారి మీద దండెత్తుటకు సిద్ధపడ్డారు. ఎలీయెజెరు కుమారుడైన ఫీనెహాసును పది తెగల నుండి   పదిమందిని పంపగా వారు మీరు యావేమీద తిరుగుబాటు చేయనేలా , పెయోరు వద్ద మనం చేసిన పాపములకు ప్రభువు మనలను అంటురోగములతో పీడింపలేదా, మరల ప్రభువు మనమీద మండి పడడా అని చెప్పడం జరిగినది. యావే బలి పీఠమునకు వ్యతిరేకముగా మరియొక  దానిని ఏర్పాటు చేసి మీ తిరుగుబాటులో మమ్మును భాగస్వాములను చేయవద్దు అని చెప్పడం జరిగింది. అప్పుడు వారు మేము చేసినది  దేవాధిదేవుడైన యావేకు తెలుసు. రేపు మీ సంతతి వారు యిస్రాయేలు దేవుడైన యావేతో మీకు ఏమి సంబంధం అని వాధించవచ్చును, మేము యొర్దాను అవతల ఉంటాము. అప్పుడు ఇది మీ సంతతికి మా సంతతికి సాక్షముగా నిలువగలదు అందుకే దీనిని నిర్మించితిమి కాని ఇక్కడ బలులు, దహన బలులు సమర్పించుటకు కాదు అని చెప్పారు.  ఆ మాటలకు ఫీనెహాసు మరియు యిస్రాయేలీయుల పెద్దలు సంతృప్తి చెందారు. వారు వెళ్లి జరిగినదంతటిని తమ వారికి చెప్పారు. ఆ పీఠము యావే దేవుడు అనుటకు సాక్షముగా ఉండునని దానికి సాక్షము అని పేరు పెట్టారు. 

యెహోషువ ఎడ్లు గడచి వృద్ధుడై యిస్రాయేలీయులలో పెద్దలను నాయకులను న్యాయాధిపతులను, ముఖ్యులను పిలిచి యావే ఎలా వారి శత్రువులను అణగద్రొక్కినది , వారు చూచిన దానిని వారికి జ్ఞప్తికి తెచ్చి, వారి తరుపున యుద్ధము చేసిన యావే గురించి తెలిపి ధర్మశాస్త్రమున వ్రాయబడిన అన్ని నియమాలను ఏ మాత్రము మార్చకుండ పాటించమని చెప్పాడు. ఇతర దేవతలను ఆశ్రయించవద్దని, ఆ జాతులతో కలసిపోవద్దని, వారి దేవతల పేరుమీద ప్రమాణములు చేయడం, పేరు ఉచ్చరించడం, సేవించడం, పూజించడం చేయక యావేనే అంటిపెట్టుకొని  ఉండండి. ఆయనను అంటిపెట్టుకొని ఉండుటవలనే మహాబలముగల గొప్ప జాతులను మీ ఎదుటినుండి వెడల గొట్టాడు. కనుక ప్రభువును పూర్ణ హృదయముతో సేవింపుము అని వారికి చెప్పాడు. అట్లుకాక మీరు వారితో కలసిపోవుదురేని, ప్రభువు వారిని వెడలగొట్టక వారు మీరు చిక్కుకొని గోతులుగా, వలలాగా పరిణమిత్తురు అని చెప్పాడు. యావే మీకు చేసిన వాగ్దానములు అన్ని నెరవేరినవి. ప్రభువు మీతో చేసుకొన్న నిబంధనను మీరుదురేని మీకిచ్చిన నేలమీదనుండి మీరు అడపొడ  కానరాకుండా పోవుదురు అని అతని కోపం మీమీద వస్తుంది అని చెప్పాడు.  

యావే  చేసిన మేలును గుర్తుచేస్తూ  వారిని యావేను ఆజ్ఞలను అనుసరించమని కోరుట 

యెహోషువ యిస్రాయేలు తెగలన్నింటినీ షెకెము వద్ద సమావేశపరచి యావే పలుకులను వారికి వినిపించాడు. పూర్వం అబ్రాహాము,నాహోరు వారి తండ్రి తేరా అన్యదైవములను కొలిచారు, యావే అబ్రాహామును పిలిచి కనాను మొత్తము సంచరించునట్లు చేసి, అతని సంతానాన్ని వృధ్ది చేయుటకు ఇస్సాకును ఇచ్చినది, ఇస్సాకుకు ఏసావు , యాకోబులను ఇచ్చినది, సేయిరు పర్వతమును ఏసావు సంతతికి వారసత్వ భూమిగా ఇచ్చినది. యాకోబు అతని కుమారులు ఐగుప్తుకు వలస పొగ మోషే అహరోనును పిలిచి వారిని ఇక్కడకు తీసుకొని వచ్చిన విషయం చెప్పడం జరిగింది. 

యావే చేసిన అన్ని అద్భుతకార్యములను వివరిస్తూ ప్రభువు చేసిన కార్యములకు వారు  చూచిన విషయం తెలియజేశాడు. ఎలా ప్రభువు వారికి తోడుగా ఉంటూ అన్ని సమకూర్చినది తెలియజేశాడు. ఇవన్నీ తెలియజేసిన తరువాత యెహోషువ వారితో యావేకు భయపడి చిత్తశుద్ధితో ఆయన్ను కొలవండి. అన్యదైవములను విడనాడి యావేను కొలవండి. మీరు యావేను కొలవనిచో ఎవరిని కొలుస్తారో ఇప్పుడే తేల్చుకోండి. నేను నాకుటుంబం మాత్రము యావేను మాత్రమే ఆరాధిస్తాము  అని చెప్పాడు. అప్పుడు వారు ఎంతమాట మాకు ఇంత మేలుచేసిన యావేను విడనాడి వేరు దైవములను ఎలా కొలుస్తామా? మేము కూడా యావేను మాత్రమే సేవింతుము అని చెప్పారు. అప్పుడు యెహోషువ వారితో మీరు యావేను సేవింపజాలరేమో! ఎందుకంటే ఆయన పరమ పవిత్రుడు, అసూయపరుడు. ఆయన  మీ తిరుగుబాటులను సహించడు, మీరు అన్యదైవములకోసం ఆయన్ను పరిత్యజింతురేని మిమ్ములను నాశనం చేయును అని హెచ్చరించగా వారు మేము యావేను మాత్రమే సేవింతుము అని యావేను ఎన్నుకొని, ఆయన ఆజ్ఞలను పాటింతుము అని చెప్పారు. 

యెహోషువ చివరి మాటలు మరియు మరణం 

యెహోషువ అప్పుడు ప్రజలతో నిబంధనచేసి వారికి ఒక శాసనం చేసాడు. యెహోషువ తన అను శాసనములను ధర్మ శాస్త్రంలో రాయించి, పెద్దరాతిని తెప్పించి సింధూర వృక్షం క్రింద దానిని పెట్టి ఈ శిల మనకు సాక్ష్యముగా ఉండును, యావే మనతో చెప్పిన మాటలు అన్ని విన్నది. మీరు యావేను విస్మరిస్తే ఈ శిల మీకు వ్యతిరేఖంగా సాక్ష్యము ఇస్తుంది అని చెప్పిన తరువాత  యెహోషువ మరియు ప్రజలు వెళ్లిపోయారు. తరువాత యెహోషువ నూటపది సంవత్సరాల ప్రాయంలో కన్నుమూయగా అతన్ని తిమ్నాత్ సెరా వద్ద ఖననం చేశారు.  


యోహాను 6 : 22-29

 యోహాను 6 : 22-29 

మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము, అచట ఉన్న ఒకే ఒక చిన్నపడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతోపాటు యేసు వెళ్లలేదనియు,  శిష్యులు మాత్రమే వెళ్ళుటను చూచిరి. అయినను యేసు ధన్యవాదములు సమర్పించి, ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలము చెంతకు తిబెరియా నుండి కొన్ని పడవలు వచ్చెను. అక్కడ యేసుగాని, శిష్యులు గాని లేకుండటను చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలివైపున యేసును కనుగొని "బోధకుడా! మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి?" అని అడిగిరి. "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచికాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత భోజమునకై శ్రమింపుడు. మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసియున్నాడు" అని యేసు సమాధానమిచ్చేను. అప్పుడు "దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలయును? అని వారడుగగా, యేసు "దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు. అదియే దేవుడు  మీ నుండి కోరునది" అని చెప్పెను. 

 ధ్యానం: యేసు ప్రభువును ప్రజలు వెదకుచున్నారు, ఆయనను కనుగొన్న తరువాత ఆయన ఎప్పుడు అక్కడకు వచ్చిన విషయం అడుగుతున్నారు. వారు ఆయనను వెదకుచున్నది కేవలం భౌతిక ఆహారం దొరికినందుకే అని ప్రభువు వారితో అంటున్నారు. యేసు ప్రభువు వారికి భౌతిక అహరం మాత్రమే ఇవ్వలేదు. దానికి ముందు జీవము ఇచ్చే మాటలను వారికి తెలియజేశాడు. కాని దాని గురించి వారు పట్టించుకున్నట్లు లేదు. యేసు ప్రభువు వారి కడుపు నింపిన విషయమునకె  వారు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. యేసు ప్రభువు దృష్టిలో వారు ఈ భౌతిక, ప్రాపంచిక విషయములకంటే ఆయన చెప్పిన జీవము ఇచ్చే, శాశ్వత మైన వాటిగురించి ఎక్కువగా వారు శ్రమించాలి. ఎందుకంటే యేసు ప్రభువు ఇచ్చిన భౌతిక అహరం కంటే ఆయన సూచక క్రియలు చాలా గొప్పవి. యేసు ప్రభువు చూపించిన సూచక క్రియలు ఏమిటి అంటే ఆయన ఇప్పటికే నీటిని ద్రాక్ష రసముగా మార్చాడు. ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పక్షవాత రోగముతో ఉన్నవాడిని కేవలం మాటతో స్వస్థ పరిచాడు. అసహాజముగా నీటిమీద నడిచాడు. తన మాటే క్రియతో సమానం అని తెలియజేశాడు. ఆదిలో దేవుడు సృష్టిని చేసినప్పుడు ఇది మనం పవిత్ర గ్రంధంలో చదువుతాము. ఒక వ్యక్తిని మొట్ట మొదటిసారి చూడగానే ఆమె జీవితం మొత్తం ఆమెకు తెలియజేశాడు. ఎక్కడ దేవున్ని ఆరాధించాలి?, ఎలా ఆరాధించాలి? మరలా జన్మించడం అంటే ఏమిటి ఇటువంటి ప్రశ్నలకు యేసు ప్రభువు సమాధానం చెప్పడం జరిగినది. 

యేసు ప్రభువు చేసిన అన్నీ పనులు ఆయన దేవుడని, దేవుడు నుండి వచ్చిన వారు మాత్రమే ఆయన చేసే పనులు  చేయగలరు అని, అయన జీవ జలము ఇచ్చువారు అని, ఆయన ఇచ్చే జీవ జలము తీసుకున్నట్లయితే ఎప్పటికీ మరలా దప్పిక ఉండదు అని తెలుసుకుంటాం. యోహాను సువిశేషంలో మొదటి  అధ్యాయంలో ఆయనను విశ్వసించే వారికి ఆయన నిత్య జీవం ఇస్తారు అని తెలుసుకుంటాము. యేసు ప్రభువు మాత్రమే ఈ శాశ్వతమైన ఆహరమును, జీవమును ఇస్తారు. దీనికోసం ప్రతి ఒక్కరు శ్రమించాలి. యేసు ప్రభువు మాత్రమే దీన్ని ఇవ్వగలడు ఎందుకంటే తండ్రి ఆయనకు మాత్రమే ఈ అనుగ్రహం ఇచ్చాడు.  ఈ సువిశేషానికి భాగానికి ముందుగా యేసు ప్రభువు ఐదువేల మందికి ఆహారం ఇవ్వడం, నీటి మీద నడవడం,  సమరియా స్త్రీతోటి ఆమె చేసిన అన్ని పనులు చెప్పడం,  ఆమె ఏమి కోరుకోవాలో చెప్పడం, శతాధిపతి కుమారున్నీ చూడకుండా మాట వలనే స్వస్థపరచడం, ముప్ఫై  ఎనిమిది సంవత్సరాలుగా పక్షావాత రోగంతో బాధ పడుతున్న వ్యక్తిని కేవలం మాటతోటి  స్వస్థపరుస్తున్నారు, నీటిని ద్రాక్షరసముగా మారుస్తున్నారు. ఇవి అన్నియేసు ప్రభువు సాధారణ వ్యక్తి కాదని మనకు తెలియజేస్తాయి. ఆయనను మానవుని సమస్యలకు  కేవలం   భౌతికమైన లేక  తాత్కాలికమైన ఉపశమనము ఇచ్చే వానిగా కాకుండా శాశ్వతమైన పరిష్కారం ఇచ్చేవానిగా చూడాలి.  యేసు ప్రభువు చేసిన అన్ని కార్యాలు  ఆయన దేవుడు అనే విషయమును తెలుపుతున్నవి. 

అప్పుడు "దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలయును? అని వారడుగగా, యేసు "దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు. అదియే దేవుడు  మీ నుండి కోరునది" అని చెప్పెను. మేము ఏమి చేయాలి అని అడిగినప్పుడు యేసు ప్రభువు దేవుడు పంపిన వానిని  విశ్వసింపుడు అని చెబుతున్నారు. యేసు ప్రభువును విశ్వసించడం అత్యంత ముఖ్యమైనది. నిత్య జీవం యేసు ప్రభువును విశ్వసించు వారికి ఇవ్వబడుతుంది. ఈ మాట అనేక సార్లు మనం ఈ సువిశేషంలో వింటాము. ప్రభువును మానవులు విశ్వాసించాలి అని తండ్రి  దేవుడు కోరుకుతున్నారు. ప్రభువును విశ్వసించడం వలన మాత్రమే, ఎవరైనా ఆయన ఇచ్చే నిత్యజీవమునకు అర్హులు అవుతారు. యేసు ప్రభువును విశ్వసిస్తె, మనం దేవుని  కార్యములు ఎలా చేసినట్లు అవుతుంది అని ఆలోచిస్తే మనకు అర్ధం అయ్యేది ఏమిటి అంటే యేసు ప్రభువు రూపాంతరికరణ జరిగినప్పుడు తండ్రి దేవుడు ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన మాటలను ఆలకింపుడు అని చెబుతున్నారు. యేసు ప్రభువు మాటలను ఆలకించడం, వాటిని పాటించడం, విశ్వసించడం మానవుడు నిత్యజీవం పొందేలా చేస్తాయి. అంతేకాకుండా తండ్రి చిత్తమును, తండ్రి పనులను చేసినట్లు అవుతుంది. 

ప్రార్ధన: ప్రభువా! మీరు శాశ్వతమైన ఆహరమును ఇచ్చువారు. మా జీవితములో అనేక భౌతిక అవసరాలకోసం, అహరం కోసం, అశాశ్వతమైనవాటి కోసం కష్టపడుతూ, శాశ్వతమైన వాటిని మర్చిపోతున్నాము. నికోదెముకు, సమరియా స్త్రీకి మీరు అశాశ్వతమైన వాటిమీద ఆశ కలిగేలా చేస్తున్నారు. వారు వాటిని కోరుకుంటున్నారు. ప్రభువా! మేము కూడా వారి వలె ఆశాశ్వతమైన వాటిని కాంక్షించే విధంగా ప్రేరేపించండి. ప్రభువా ! మిమ్ములను విశ్వసిస్తూ , తండ్రి కోరుకున్నట్లు మీ మాటలను ఆలకిస్తూ, పాటిస్తూ, మిమ్ములను విశ్వసించి మీరు వాగ్ధానం చేసే ఆ నిత్యజీవం పొందుటకు అర్హులను చేయండి. దానిద్వార తండ్రి యొక్క పనులను మేము చేసేలా, తండ్రి చిత్తమును పాటించేలా మమ్ములను మలచండి. ఆమెన్. 
 

పెంతికొస్తు మహోత్సవం

 యోహాను 20:19-23 

అది ఆదివారము సాయంసమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసికొనియుండిరి. యేసు వచ్చి వారిమధ్య నిలువబడి, "మీకు శాంతి కలుగునుగాక!" అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను, ప్రక్కను చూపగా, ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో, "మీకు శాంతి కలుగునుగాక! నా తండ్రి నన్ను  పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను" అని పలికెను. అటుల పలికి, ఆయన వారి మీద శ్వాస ఊది "పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించినయెడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపనియెడల  అవి క్షమింపబడవు" అని చెప్పెను. 

ప్రియ మిత్రులారా  పెంతికోస్తు  అంటే 50 వ  అని అర్ధం. మనం క్రీస్తు పునరుత్థానము అయిన 7వ ఆదివారం   ఈ పండుగను కొనియాడుతాము. ఇది యేసు ప్రభువు చెప్పిన విధముగా పవిత్రాత్మను తన శిష్యులకు పంపిన రోజు.  యూదులు ఈ పండుగను పాస్క పండుగ అయిన 7 వారములకు అంటే 50 రోజున జరుపుకుంటారు. వారికి ఇది పంట కోయు పండుగ. దీనినే వారాల పండుగ అని కూడా అంటారు. అంతె కాదు ఇది దేవుడు మోషేకు పది ఆజ్ఞలు  ఇచ్చిన రోజును గుర్తు చేసుకొనే రోజు. 

క్రైస్తవులకు ఈ పెంతుకోస్తు  పండుగ చాలా ముఖ్యమైన పండుగ ఎందుకంటే ఈ రోజున యేసు ప్రభువు పవిత్రాత్మను ఆయన శిష్యుల  మీదకు పంపుతున్నారు. ఒక్క సారిగా  అతికొద్దిమందిగా ఉన్న క్రైస్తవులుగా అనేక మంది మారిపోతున్నారు. అపోస్తులుల కార్యాలు 2 వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఒక్కసారిగా 3000 మంది విశ్వాసంలోనికి వస్తున్నారు. యేసు ప్రభువు తండ్రి దగ్గరకు వెళ్ళిన తరువాత తన శిష్యులు కోత పండుగ సంధర్భంగా ఒక చోట గుమికుడారు.  వారు కూర్చన్న ఇంటిని పవిత్రాత్మ అవరించింది. అపో 2:2 . వారు అందరు పవిత్రాత్మతో నింపబడి అనేక భాషలలొ మాట్లాడే విధంగా చేసింది. ఈ అద్భుతం అనేక మందిని ఆకర్షించింది. అప్పడు పేతురు  మారు మనస్సు గురించి, క్రీస్తు సువార్తను గురించి వివరించారు. చివరకు  ఒకే రోజు 3000 వేల మంది క్రీస్తు అనుచరులు అయ్యారు. అపో 2:41. ఇది పెంతికొస్తు రోజు జరిగిన సంఘటన. 

 పవిత్రాత్మను మన జీవితాలలోనికి ఆహ్వానిస్తే   ఆయన ఏమి చేస్తారు ? 

యేసు ప్రభువే పవిత్రాత్మ గురించి కూడా మనకు తెలియజేస్తున్నాడు. కేవలం తెలియజేయడమే కాకుండా ఆ ఆత్మను తన శిష్యులతో ఉండుటకు పంపుతున్నాడు. పవిత్రాత్మ మనతో ఉంటూ,  మనలో పని చేసి, మనలను యేసు ప్రభువువలే మార్చుతున్నది. ఆపో. కార్య 1:8. పవిత్రాత్మ మనకు శక్తిని ఇచ్చి మనం యేసు ప్రభువుకు సాక్షులుగా ఉండేలా చేస్తుంది. పవిత్రాత్మ మనలను సత్యము వైపు నడిపిస్తుంది. 

పవిత్రాత్మ శిష్యుల మీదకు దిగిరావడం చాలా గొప్ప ఘటన. అక్కడ ఉన్నవారందరు పవిత్రాత్మ పొందుతున్నారు. దాని తరువాత వారు అనేకమందికి బోధిస్తున్నారు. వారు యేసు ప్రభువు వలె అవుటకు పవిత్రాత్మ ఎంతగానో ఉపయోగ పడుతుంది.  యేసు ప్రభువు పవిత్రాత్మతో నిండిన వాడై తన ప్రేషిత కార్యమును ప్రారంభించాడు. అనేక అద్భుతాలు చేశాడు. అలానే శిష్యులుకూడా  తమ ప్రేషిత  కార్యమును ప్రారంభిస్తున్నారు. విశ్వాసులందరి జీవితాలలో పవిత్రాత్మ     పెద్ద మార్పు తీసుకు వస్తాడు.  (యోహాను 14:16; 15:26) . పరిత్రాత్మను  మన జీవితాలలోకి అనుమతిస్తే,   అతను మన హృదయాలలో నివాసం ఏర్పరుచుకుంటారు. అందుకే పునీత పౌలు గారు మీరు పవిత్రాత్మ ఆలయాలు అని చెబుతున్నారు. అంటే ఆయన మనలో ఉండి  మనం ఆయన  ఉనికిని తెలుసుకునేలా చేస్తాడు, శక్తిని ఇస్తాడు,  మనలను శుద్ధి చేస్తాడు,  శిష్యులను ఐక్య పరుస్తారు.  మార్గనిర్దేశం చేస్తాడు, బోధిస్తాడు, నూతన జీవాన్ని ఇస్తాడు. అతను విశ్వాసుల హృదయాలు,  క్రీస్తును పోలి ఉండేలా చేస్తాడు.   ఆయనను మన జీవితాలలోనికి ఆహ్వానిస్తే  దేవుని గొప్ప ప్రేమకు  నిజమైన సాక్షులుగా ఉండగలము. అందుకే యేసు ప్రభువు ఆయన నాకు సాక్షమిస్తాడు అని చెబుతారు మరియు మీరు కూడా నాకు సాక్షులుగా ఉంటారు అని చెబుతారు. యోహను 15:25. 

మనం పవిత్రాత్మను ఎలా పొందగలం ? 

పేతురు  వాక్యాన్ని బోధిస్తూ మారుమనసు పొందండి, యేసు క్రీస్తు నామములో జ్ఞాన స్నానం పొంది  పాప క్షమాపణకు పొందండి తద్వారా మీరు పవిత్రాత్మ పొందుతారు అని బోధిస్తారు. అపో 2:38-39 . మనం పవిత్రాత్మను పొందడానికి పెద్ద పెద్ద పనులు చేయనవసరం లేదు. దేవుని కృప వలన ఆయనను విశ్వసించి , జ్ఞాన స్నానం పొందితే మనం పవిత్రాత్మను పొందుతాము. మనం స్వీకరించే ప్రతి దివ్య  సంస్కారం ద్వారా మనం పవిత్రాత్మను పొందుతాము. 

పవిత్రాత్మ వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? 

శిష్యులు ఆత్మతో నింపబడ్డారు-  పునీత పౌలు గారు ఆత్మతో నింపబడితే ఏమి అవుతుందో రాస్తున్నారు. ఎఫెసీయులకు  రాసిన లేఖలో  5 వ అధ్యాయం  18-21 వరకు అందులో వివరించబడింది. " ఆత్మ పూరితులుకండు ఒకరితో ఒకారు కీర్తనలతోనూ , స్తోత్రములతోనూ , పవిత్ర గీతములతోను సంభాషింపుడు. హృదయ పూర్వకముగ పొగడ్తలతో ప్రభువునకు  కీర్తనలను స్తోత్రములను పాడుడు . మన ప్రభువగు  యేసు క్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రియగు దేవునకు సర్వదా కృతజ్ఞతలను అర్పించుకొనుడు. " 

ఆత్మతో నింపబడిన వారు దేవునికి  స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటారు. తరువాత ఆయనకు సర్వదా కృతజ్ఞతలు తెలియ చేస్తారు. పిలిప్పీయులకు రాసిన లేఖ రెండవ అధ్యాయంలో 4 వ వచనం చెబుతుంది పరస్పరం ఒకరికొకరు ఉపకారులై ఉండవలెను అని. అంటే ఇవన్నీ ఆత్మతో నింపబడిన వారు చేస్తారు. అపో కార్యములు 2 వ అధ్యాయం 4 వ వచనం వారందరు పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్చక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలొ మాట్లాడసాగిరి. అంటే పవిత్రాత్మ వారిని దేవుని వాక్కు బోధించడానికి ప్రేరేపిస్తుంది. పవిత్రాత్మ మనం వాక్య పరిచర్య చేయుటకు సహాయ పడుతుంది. పవిత్రాత్మ వారికి ధైర్యాన్ని ఇస్తుంది. శిష్యులు సహజముగా చాలా పిరికివారిగా ఉన్న శిష్యులు దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో ధైర్యంగా ప్రకటిస్తున్నారు. అపో 4:31.

పవిత్రాత్మ  విశ్వాసిని సన్మార్గంలో నడిపిస్తుంది. ఆయన వారికి నూతన జీవాన్ని ఇస్తాడు.  యోహాను 3:5.  మనలను పవిత్రాత్మ  కొత్త సృష్టిగా మారుస్తుంది. 1 కొరి.5:17 . పవిత్రాత్మ క్రీస్తును  మహిమపరుస్తాడు.యోహాను 16:14, పవిత్రాత్మ  మనలను క్రీస్తు కొరకు సాక్షులుగా చేస్తాడు యోహాను15:26; అపొస్తలుల కార్యములు 1:8.  క్రీస్తు బోధనలను మనకు తెలియ పరుస్తాడు. లూకా. 12:11-12. పవిత్రాత్మ   శిష్యులకు    పరిచర్యలో మరియు ఇతర విషయాలలో సహాయకునిగా ఉంటాడు.  అందుకే యేసు ప్రభువు మీకు ఒక ఆదరణ కర్తను పంపుతాను అని చెబుతారు. యోహను.  యోహాను సువార్త 14 నుండి 16 అధ్యాయాలలో పవిత్రాత్మను యేసు ప్రభువు దేవుని సత్యమును తెలిపేవానిగా, యేసు ప్రభువు మాటలను గుర్తుచేసేవానిగా, యేసు ప్రభువు తరుపున మాటలాడే వానిగా, పాపములను క్షమించే వానిగా, భవిష్యవానిని తెలిపేవానిగా తెలియజేస్తున్నాడు. 

 పవిత్రాత్మ ఒక వ్యక్తి పొందాడు అని ఎలా చెప్పగలం ? 

పవిత్రాత్మ ఫలాలు గురించి పౌలుగారు గలతీయులకు రాసిన లేఖలో చెపుతున్నారు. అవి ఏమన ప్రేమ, ఆనందము , శాంతి, సహనము, దయ , మంచితనము, విశ్వసనీయత , సాత్వికత , నిగ్రహము ఇవి మనలో ఉన్నప్పుడు ఖచ్ఛితముగా మనకు పవిత్రాత్మ మనలో ఉంది అని చెప్పగలం.      (గల. 5:22, 23).  క్రైస్తవ ఎదుగుదల, పరిపక్వత అతనిలో ఆత్మ యొక్క ఫలాలు అభివృద్ధి చెందిన తీరును బట్టి తెలుసుకోవచ్చు. 

ప్రేమ :  క్రైస్తవ ప్రేమ అనేది ఈ లోకంలో చూసే ప్రేమకు వ్యత్యాసం ఉంది క్రైస్తవ ప్రేమ పవిత్రాత్మ యొక్క ఫలం.   ఇది మనలను ప్రేమించే వారిని , లేక మనకు ఇష్టం ఉన్న వారిని ప్రేమించే ప్రేమ కాదు. మన శత్రువులను ప్రేమించే ప్రేమ.  

 ఆనందం : . క్రైస్తవ ఆనందం, క్రైస్తవుడు దేవుని  ముఖాముఖీగా చేసేటప్పుడు వుండే ఆనందం. మరియు దేవుని వాక్కును పంచినప్పుడు ఆయన పొందే ఆనందం.  ఇది తాను కష్టలు బాధలు పొందే సమయంలో కూడా తాను  దేవుని చిత్తాన్ని చేస్తున్నాను అని ఉండే ఆనందం.  యేసు ప్రభువు  మోక్ష రోహణం అయిన తరువాత వారు క్రీస్తు కోసం పొందిన కష్టాలలో ఆనందం పొందారు. (రోమా. 5:3).  

 శాంతి:  నిజమైన శాంతి దేవుని నుండి వస్తుంది, “నా శాంతిని మీకు ఇస్తున్నాను” అని యేసు చెప్పాడు. (యోహాను 14:27). కష్టాలు మనకు వచ్చినప్పుడు అతీంద్రియ ప్రశాంతత, దేవుని శాంతి మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది మరియు ఆయనపై నమ్మకం ఉంచుతుంది.  

సహనం: పవిత్రాత్మ మనకు అనుగ్రహించె మరియొక గొప్ప ఫలం ఏమిటి అంటే సహనం. యేసు ప్రభువు వలె సహనం కలిగి జీవించే విధంగా పవిత్రాత్మ చేస్తుంది. అందరు ఆయనను దూషిస్తున్నా ప్రభువు సహనం కోల్పోలేదు. సహనం మనలను ఇతరుల తప్పులను క్షమించకలిగే శక్తివంతులను చేస్తుంది. ఇతరులను అంగీకరించే వారిగా చేస్తుంది.     

దయ : దయ , కనికరం అనేవి క్రైస్తవ సహజ లక్షణాలు. ఇది ప్రేమకు మరియొక రూపం. ఎవరు అయితే వీటిని కలిగి ఉంటారో వారికి అందరు ఆకర్శింపబడుతారు. మదర్ తెరెసా కు అనేక మంది ఆకర్శింప బడ్డారు అంటే కారణం ఆమెకు ఉన్న ఈ దయ హృదయ. ఇది పవిత్రాత్మ ఫలం. ప్రతి క్రైస్తవుడు కలిగిఉండాలి.  

మంచి తనం: ప్రతి వ్యక్తి మంచి వ్యక్తిని ఇష్టపడుతారు, అలా ఉండాలని కోరుకుంటారు. వీరిలో ఎటువంటి చెడు ఉద్దేశ్యాలు , ఆలోచనలు ఉండవు. అందరి మంచిని కోరుకుంటారు. అందరికి సహాయం చేస్తారు. ఇది పవిత్రాత్మ మనకు ఇచ్చే మరియొక ఫలం. 

విశ్వసనీయత:  ఇది విశ్వాసానికి మరియు పవిత్రాత్మకు సంబంధించినది. విశ్వసనీయత మనలను నమ్మదగిన వారిగా చేస్తుంది. మనం దేవునికి మరియు మానవునికి నమ్మదగిన వారినిగా చేస్తుంది. ఎటువంటి అపనమ్మకం లేక అనుమానలకు తావు వుండదు.  

సాత్త్వికత :  ఇది కష్టమైన వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు బాగా అవసరమయ్యే గుణం.  మనలను ఇష్టపడని వ్యక్తుల పట్ల , అదే విధంగా మనలను ద్వేషించే వారి పట్ల కూడా మనం మృదువుగా ఉండగలగటం. 

నిగ్రహణ :  ఈ లోకం యొక్క ఆశలకు , కోరికలకు తలొగ్గక దేవునికి ఇష్ట పూర్వకమైన జీవితం జీవించడం. ఎవరెన్ని శోదనలకు గురిచేసిన యేసు ప్రభువు వలె జీవించగలగడం. ఇది పవిత్రాత్మ ఇచ్చే గొప్ప ఫలం. 

పవిత్రాత్మ దైవ విషయాలను తెలుసుకోవడానికి, దైవ సంబంధవిషయాలలో నిమగ్నం అవ్వడానికి ప్రేరణ ఇస్తుంది. పవిత్రంగా జీవించడానికి ప్రేరణ కలుగజేస్తుంది. పవిత్రాత్మ ఆదిలో సృష్టిని ఏర్పాటుచేసినప్పుడు జలముల మీద తిరుగాడుట మనం చూస్తాము. పవిత్రాత్మ మానవునకి శక్తిని ఇస్తుంది.  దేవుని సంకల్పాన్ని నెరవేర్చుటకు సహాయపడుతుంది. సంసొనును, దావిదును నడిపింది. నిర్గమ కాండంలో పెద్దలకు తోడుగా ఉంటుంది. నూతన నిబంధనలో పవిత్రాత్మను ఎల్లకాకాలం మనకు తోడుగా ఉండుటకు మరియు మనలను నడిపించుటకు మరియు ఆధారణకర్తగా తెలియజేస్తున్నాడు. ఈ ఆత్మ శిష్యులు దేవుని వాక్కును వ్యాపింపజేయుటకు సహాయపడుతుంది. శ్రీ సభ మరియు శ్రీ సభ సభ్యులు  ఈ పవిత్రాత్మ ద్వారా నడిపించబడాలి అనిప్రార్ధించుదాం. 



1 కొరింతి 3:1-9, లూకా 4: 38-44

 1 కొరింతి 3:1-9, లూకా 4: 38-44

పిదప యేసు ప్రార్ధన మందిరమును వీడి, తిన్నగా సీమోను ఇంటికి పోయెను. అపుడు సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో మంచము పట్టియుండెను. వారు ఆమె విషయము ఆయనకు మనవి చేసికొనిరి. అపుడు ఆయన ఆమె చెంత నిలిచి జ్వరమును గద్దింపగా అది విడిచిపోయెను. ఆమె వెంటనే లేచి వారికి పరిచర్య చేయసాగెను. ప్రొద్దుగ్రుంకుచుండగా నానావిధ రోగపీడితులైన వారినందరిని వారి వారి బంధువులు యేసు వద్దకు తీసికొనివచ్చుచుండిరి. అపుడు ఆయన వారిలో ఒక్కొక్కనిమీద తన హస్తమునుంచి వారినందరిని స్వస్థపరచెను. అనేకులనుండి దయ్యములు "నీవు దేవుని కుమారుడవు" అని ఆర్భటించుచు వదలి పోయెను. అవి ఆయన క్రీస్తు అని ఎరిగియుండుట వలన ఆయన వానిని గద్దించి మాటాడనీయలేదు. వేకువనేలేచి యేసు ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్లెను. ప్రజలు ఆయనను వెదకుచు వచ్చి, తమను విడిచిపోవలదని అనగా, ఆయన వారితో "నేను ఇతర పట్టణములలోకూడ దేవుని రాజ్యమును గురించి బోధింపవలసివున్నది. అందులకే నేను పంపబడితిని" అని పలికెను. పిమ్మట యేసు యూదయా ప్రార్ధనా మందిరములలో బోధించుచుండెను. 

ధ్యానము: యేసు ప్రభువు ప్రార్థన మందిరము వీడటం అంటూ జరిగితే అది దేవుని సంకల్పం నెరవేర్చడానికి మాత్రమే ప్రార్థన మందిరమును , లేక ప్రార్థనను వీడుతుంటాడు. ప్రార్ధన అంటే దేవునితో సంభాషించుట, దేవునితో సఖ్యత పడుట, దేవునితో సంభందమును దృఢపరచుకొనుట.యేసు ప్రభువు ప్రార్ధనలో దేవునితో అంటే తన తండ్రితో ఉన్న ఆ బంధమును  దృఢపరచుకొనుట ఎలా అనే విషయం తెలుసుకోవచ్చు. యేసు ప్రభువు వలే ప్రతి రోజు ప్రార్ధన చేసుకోనట్లయితే నాకు దేవునితో ఉన్న ఆ సంభందం దృఢ పడుతుంది. యేసు ప్రభువు ఎల్లప్పుడు దేవుని సంకల్పము నెరవేర్చే పనిలోనే ఉన్నాడు కాబట్టి ఆయనకు తండ్రికి ఉన్న సంభందము ఎప్పుడు సన్నగిల్లలేదు. కాని మానవ జీవితంలో నేను కొలది సమయము మాత్రమే దైవ చింతన గురించి లేక  నా ఆధ్యాత్మిక జీవితం గురించి ఆలోచిస్తున్నాను కనుక నేను ఎక్కువగా దేవునితో సంభందం లేకుండా ఉన్నాను. కాని ప్రతిరోజు ప్రభువు వలె ప్రార్ధిస్తే, తండ్రితో దృఢ బంధం ఏర్పరుచుకుంటే ఎంత బావుండును. అపుడు మన జీతం మొత్తం ప్రభువుతో మిళితం అయ్యివుంటుంది. 

యేసు ప్రభువు ప్రార్ధన మందిరమును వీడి సీమోను ఇంటికి వెళుతున్నాడు. అక్కడ జ్వరముతో బాధపడుతున్న పేతురు గారి అత్తను స్వస్థ పరుస్తున్నారు. యేసు ప్రభువు జీవితం మొత్తం తండ్రి సంకల్పం నెరవేర్చడం మరియు మానవునికి సహాయపడడంతో నిండి ఉన్నది. తండ్రితో సంభాషించిన తరువాత తన జీవితం మొత్తం మానవునికి తోడుపడటమే. అందుకే జ్వరముతో భాదపడుతున్న పేతురు అత్తను గురించి తెలుపగానే ఆయన ఆ జ్వరమును గద్దించాడు. అది వెంటనే తొలగిపోతుంది. యేసు ప్రభువు మనతో ఉంటె మనలో ఉన్న అనారోగ్యాలు, అపవిత్రత అనేవి మననుండి వెళ్లిపోతాయి. యేసు ప్రభువు చెప్పిన వెంటనే అనారోగ్యం వదిలిపోతుంది. మనము కూడ ప్రభువు దగ్గరకు వచ్చి మనకు ఉన్న సమస్యను చెప్పినట్లయితే ప్రభువు ఏమి చేస్తాడో ఈ సువిశేష భాగంలో మనం తెలుసుకుంటున్నాం. 

యేసు ప్రభువు కేవలం పేతురు అత్తగారిని మాత్రమే కాక  అనేక రోగాలతో ఉన్నవారిని ప్రభువు దగ్గరికి తీసుకొనివస్తున్నారు. వారి అందరిని ప్రభువు స్వస్థ పరుస్తున్నారు. ప్రభువు దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని స్వస్థత పొందకుండ వెళ్లనివ్వలేదు. ప్రభువు మాట వినిన తరువాత అందరు కడుపు నింపబడిన తరువాతనే ప్రభువు వారిని పంపుతాడు. అదేవిధంగా వారు అస్వస్థతతో ఉన్నట్లయితే వారు   స్వస్థత పొందిన తరువాతనే ప్రభువు దగ్గర నుండి వెళ్లడం గమనించవచ్చు. ప్రభువు వద్దకు రావడం లేక తీసుకోరాబడటం అంటే మన సమస్యాలు, రోగాలు, ఇబ్బందులు, బానిసత్వాలు వంటి వాటి నుండి విముక్తి పొందడం. అందుకే సాతానుచే పీడించబడేవారు, రోగాలతో ఉన్నవారు అందరు విముక్తి పొందుతున్నారు. తిరిగి వారి ప్రదేశాలను సంతోషంగా ఆరోగ్యంగా వెళుతున్నారు.  ప్రభువు దగ్గరకు వచ్చిన వారి నుండి సాతాను వెళ్ళిపోతుంది. ప్రభువు వాటిని మాటాడనియ్యలేదు. లోకములోని అన్ని శక్తులు కూడా ప్రభువుకు లోబడే ఉంటాయి. మనిషే ప్రభువు మాట మీరి తప్పుచేస్తుంటాడు. 

సంభాషణ : ప్రభువా! మీరు తండ్రితోటి సంభాషించుటకు ఎంతగానో ప్రాముఖ్యత ఇచ్చారు. తండ్రితో మాట్లాడటం మీ దైనందిన జీవితంలో భాగం అయ్యింది. అందుకే కాబోలు మీరు ఎల్లప్పుడు ఆ తండ్రి చిత్తమును నెరవేర్చడము మీ ఆహారము చేసుకున్నారు. మీరు తండ్రితో మాటలాడిన తరువాత ఇతరుల బాగుకోసము పాటు పడ్డారు. మీరు ఎలా మీ జీవితాన్ని తండ్రితోటి బాంధవ్యం   కోసం, మానవ శ్రేయస్సు కోసం ఉపయోగించారో, మీలా జీవించడం మాకు ఎలా సాధ్యపడుతుంది. ప్రభువా! మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి వారికి కావలసిన వాటిని మీరు అందిస్తున్నారు. వ్యాధులు, బాధలు అన్ని కూడా మనుషులను వీడిపోయేలా చేస్తున్నారు. మా జీవితాలలో కూడా ప్రభువా ఇటువంటివి వ్యాధులు, బాధలు వస్తున్నవి. మేము అనేక సార్లు మేము మీ వద్దకు రావడానికి  ప్రయత్నిస్తున్నాము కాని కొన్ని సార్లు మీ  దగ్గరకు రావడానికి ప్రయత్నించినా రాలేక పోతున్నాము.  మేము మీ వద్దకు ఎలా రావాలో నేర్పించండి. ప్రభువా లోకములోని అన్ని శక్తులు మీకు సహకరించాయి. మీ మాటకు అన్ని లోబడుతున్నాయి. 

ప్రార్ధన: ప్రభువా! ఈనాటి సువిశేషంలో మీరు ఎలా ఎప్పుడు తండ్రితోటి సంబంధం కలిగి ఉన్నారో మేము తెలుసుకుంటున్నాము. మీరు ఏవిధంగా అయితే తండ్రితోటి సంబంధం కలిగి ఉన్నారో మేము కూడా మీతోటి తండ్రి తోటి సంబంధం కలిగి జీవించేలా చేయండి. మీ దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీరు వారి వారి సమస్యల నుండి విముక్తిని చేస్తున్నారు. ప్రభువా! మాకు అనేక బాధలు ఉన్నవి, మేము అనేక అలవాటులకు బానిసలుగా ఉన్నాము. మీరు అనేక మందికి విముక్తిని ప్రసాదించిన విధంగా మా సమస్యల నుండి మాకు చేయమని వేడుకుంటున్నాము. ఆమెన్ 

 

మత్తయి 24:37-44

 మత్తయి 24:37-44 

నోవా దినములయందు ఎట్లుండెనో, అటులనే మనుష్య కుమారుని రాకడయు ఉండును. జల ప్రళయమునకు ముందు నోవా  ఓడలో  ప్రవేశించు వరకు  జనులు తినుచు, త్రాగుచు, వివాహమాడుచుండిరి. జల ప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకొనిపోవువరకు వారు ఎట్లు ఎరుగకుండిరో, అట్లే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఆ సమయమున ఇరువురు   పొలములో పనిచేయుచుండ ఒకడు కొనిపోబడును, మరియొకడు విడిచి పెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండగా, ఒకతె కొనిపోబడును, మరియొకతె విడిచిపెట్టబడును. కనుక మీరు జాగరూకులై యుండుడు. ఏలయన, మీ ప్రభువు ఏ దినమున వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన యెడల అతడు మేల్కొనియుండి, తన ఇంటికి కన్నము వేయనీయుడు. కనుక, మీరును సిద్ధముగా ఉండుడు. ఏలయన, మనుష్యకుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. 

పునీత సిలువ  యోహను గారు, "మరియమాత దైవ వాక్కును మోసుకుంటూ  మార్గ మధ్యములో  ప్రయాణిస్తుంది. ఆమెను మీ ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నవా? అని అడుగుతారు?" ఈ ఆగమాన కాలంలో మనలో ఉండవలసిన ఒక ఆలోచన ఇదే. నేను యేసు ప్రభువును నా ఇంటిలోనికి ఆహ్వానిస్తున్ననా ? లేదా? ఒక వేళ నేను ఆహ్వానించినట్లయితే నా జీవితం ఏ విధంగా ఉండాలి అని ఈనాటి సువిశేషం చెబుతుంది. 

ఈనాటి సువిశేషంలో మనకు ముఖ్యమైన మాటలుగా స్పురించే, జాగరుకులై యుండుడు, మేల్కొని యుండుడు, సిద్ధముగా ఉండుడు అనే మూడు మాటలను   ప్రత్యేకంగా ధ్యానించాలి. ఎందుకు జాగరుకులై ఉండాలి? దేనికి మేలుకొని ఉండాలి? ఎవరి కోసం మనం సిద్ధంగా ఉండాలి. జాగరుకులై ఎందుకు ఉండాలి అంటే మన దగ్గరకు వచ్చేది  స్వయంగా దేవుని కుమారుడు. ఆయన కోసం మనం చూడకపోతే ఆయన తన దారిన తాను వెళ్ళిపోతాడు. దైవ సాన్నిధ్యం ఎల్లప్పుడు అలానే ఉంటుంది. యేసు ప్రభువు తన బోధనలో కూడా ఈ విషయం వెల్లడి చేస్తున్నారు. మీరు ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు మిమ్ము ఆహ్వానించకపోయినచో మీరు మీ కాలి దూలిని అక్కడనె విదిల్చి వెళ్ళండి అని చెబుతున్నారు. ఆయన నీ దగ్గరకు వస్తారు, నీ తలుపు తట్టుచున్నాడు. ఖచ్ఛితముగా నీవు జాగరూకత కలిగి ఉంటేనే ఆయనను ఆహ్వానించగలవు. 

 ఎవరి కోసం మనం ఎదురుచూస్తున్నాము.  నీవు క్రీస్తు కోసము ఎదురు చూసినటులయితే నీవు ఎటువంటి జీవితం జీవించాలి అని మనం ఆలోచించాలి. నీవు ఎల్లప్పుడు సిద్దముగా ఉండాలి అని ఈనాటి సువిశేషం తెలియజేస్తుంది. ఆయన ఏ ఘడియలో వచ్చునో నీకు తెలియదు కనుక ఎల్లప్పుడు సిద్ధముగానే ఉండాలి.  ఎవరు ఈయన నీవు ఎదురు చూడటానికి ? ఈయన రక్షకుడు, రాజు, ప్రభువు, దేవుడు నీ నిజ స్థితిని తెలియజేసేవాడు. నిన్ను మరల ఈ నిజ స్థితిని కలిగి జీవించేలా చేసేవాడు.  కనుక నీవు ఎదురు చూడాలి. ఆయన అవసరం అవసరం నీకు  ఉంది కనుక ఎదురు చూడాలి. నీవు నిజముగా రక్షణ పొందాలి అని కోరుకున్నట్లయితే నీవు ఎదురు చూడాలి.  నీ జీవితములో ఆయన లేకుంటే  జీవితం పరిపూర్ణం కాదు. ఆయన నీతో ఉన్నట్లయితే నీ జీవితం  పరిపూర్ణత సంతరించుకుంటుంది.   

 ప్రతి సంవత్సరం ఆగమనకాలం వస్తుంది. కాని నిజానికి ఇది ప్రతి సంవత్సరం జరిగే ఒక సాదారణ ప్రక్రియ కాదు. ప్రతి సారి  దీనికి ఒక గొప్ప అర్ధం వుంది, ప్రతి ఆగమానం మనలను యేసు ప్రభువును ఆహ్వానించడానికి, స్వీకరించడానికి ఇది నాంది పలుకుతుంది. ఎల్లప్పుడు  ఆయనతో ఉండటానికి అది ఉపయోగ పడుతుంది. అది మన జీవితాన్ని ప్రతి నిత్యం మార్చుకుంటూ ఉండటానికి ఉపయోగ పడుతుంది.  

దేవుని రాకడ లేక ఆగమానం  - ఆయన మరల వస్తారు అని మనం ఎదురు చూస్తున్నాము.  ఆయన కోసం మనం ఎదురు చూడటం మాత్రమే కాదు,  ఆయనను ఆహ్వానించాలి. యేసు ప్రభువును నీ జీవితం లోనికి ఆహ్వానించాలి. ఆయన నిన్ను ఆహ్వానించాలి అని అనుకోకూడదు. మన కోసం తన మొత్తాన్ని వదులుకొని మనతో ఉండాలి అని మన దగ్గరకు వస్తున్నారు.  దేవుడు తీసుకొచ్చే సంతోషం: ఆగమనకాలం ఏదో బాధలతోనో లేక ప్రాయశ్చితంతోనో గడిపేది కాదు, ఇది ఆనందించే సమయం ఎందుకంటే మన దగ్గరకు రాబోతున్నది స్వయానా దేవుడే. ఆయన మన దగ్గరకు వస్తున్నాడు, రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం ఆనందించాలి. మన జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధముగా ఉండాలి. అది కేవలము ఆయనను ఆహ్వానించడమే కాదు ఆయనతో నడవడం అని మనం గ్రహిస్తాం.  

  తీరు సభ మొదటి నుండి కూడా ఆగమన కాలం జరుపుకోలేదు. ఇది నాలుగవ శతాబ్ధం నుండి మనం జరుపుకుంటున్నాం. చాలా విషయాలు మీరు ఈ పండుగ పూర్వాపరాలు గురించి విని వుంటారు. కాని యూదయ పండుగలలో హనుక్క అనే పండుగ వస్తుంది. అది కిస్లేం అనె నెల 25 వ రోజున వస్తుంది, క్రిస్టమస్ కూడా డిసంబర్ 25 న వస్తుంది. ఏమిటి ఈ హనుక్క పండుగ అంటే అది యెరుషలేము దేవాలమును అంటియొకస్ ఎఫిఫనుస్ ద్వంసం చేసిన తరువాత,  మక్కబియుల గ్రంధంలో  వారు మరల దానిని కట్టి దేవునికి పునఃరంకితం చేసిన రోజునే హనుక్క అనే పండుగ జరుపుకుంటారు. ఈ పండుగకు ఎనిమిది రోజుల ముందు నుండి సిద్ధపడుతూ ప్రతి రోజు ఎనిమిది రోజులు కూడా ఒక్కో క్రొవత్తిని వెలిగించేవారు. ఇక్కడ ఆగమన కాలంలో మనం ప్రతి వారం, వారానికి ఒక క్రొవత్తిని వెలిగించే దానికి మూలం. ఇక్కడ నుండే వస్తుంది. ఇది ఒక రకముగా మనం సిద్ధ పడటం. లేక పునఃరంకితం చేసుకోవడం. మన జీవితం చెడు మార్గమున ఉండి ఉండవచ్చు, లేక మనం పాడుచేసుకొని ఉండవచ్చు అయిన కాని దానిని మరల దేవునికి పునఃరకితం చేయవచ్చు అని అది తెలుపుతుంది హనుక్క అనే పండుగ. ఈ ఆగమానకాలం మరియు క్రిస్మస్ దీన్ని పరిపూర్తి చేస్తుంది. 

ఆగమన కాలం ఆనందించే కాలం, ఇది దేవుడు మన వద్దకు వచ్చే రోజును  తెలుసుకొని దానికి ఆనందంతో ఎదురు చూసేకాలం. ఈ సిద్దపాటు కూడా మనము ఎవరము? మనము ఎవరి వలె ఉండటానికి పిలవబడ్డాము అని తెలుసుకొనుటకు మరియు మరల దేవుని అలయముగా మారిపోవుటకు, మనము ఈ ఆగమన కాలాన్ని ఉపయోగించుకోవాలి, ధ్యానించుకోవాలి. '

 యేసు ప్రభువు ప్రధమ ఆగమమున దిన మానవ రూపం ధరించి తండ్రి ప్రణాళికా నెరవేర్చి  నిత్య రక్షణ ద్వారము మరల  తెరిచారు. ఆయన మరల వచ్చినప్పుడు ఆయన  వాగ్ధానం చేసిన రక్షణ బాహుమనం మనం పొందుతాము అనే ఆశతో , మేలుకువతో ఉత్సాహముతో నిరీక్షించించె మనం ఆయన అపారమైన  ప్రేమను పొందుటకు ఎల్లప్పుడు సిద్దంగా ఉండాలి. 

 క్రీస్తు ప్రభువు తన జనమునకు సిద్ధ పడుచున్న  మనలను ఆనందంతో నింపుతున్నాడు.  అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందంతో ఉన్న మనం, మెళుకువ కలిగి ప్రార్ధించుటలోను అతని స్తుతులను పాడుటలోనూ నిమజ్ఞులమై యేసు ప్రభువును స్వీకరించడానికి సిద్ధం కావాలి.  అంటే మనం  దేవుని వాక్కు అవతరంగా  మారిపోగలగాలి.

క్రీస్తు రాజు మహోత్సవం

 క్రీస్తు రాజు మహోత్సవం 

లూకా 23:35-43 

ప్రజలు అచట నిలుచుండి ఇది అంతయు చూచుచుండిరి. "ఇతడు ఇతరులను రక్షించెను. కాని, ఇతడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించు కొననిమ్ము" అని అధికారులు ఆయనను హేళనచేసిరి. సైనికులు కూడా ఆయనకు దగ్గరగా వచ్చి  పిలిసిన ద్రాక్షరసమును ఇచ్చి , "యూదుల రాజువైనచో, నిన్ను నీవు రక్షించుకొనుము" అని పరిహాసించిరి. "ఇతడు యూదుల రాజు అని ఫలకమున వ్రాసి  శిలువ పైభాగమున ఉంచిరి. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు నీవు క్రీస్తువు గదా అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము. అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వానిని గద్దించుచు నీవు దేవునికి భయ పడవా? నీవు కూడ అదే శిక్ష పొందుచున్నావు కదా!మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగుఫలము అనుభవించుచున్నాము. కాని ఈయన  ఏ తప్పిదము  చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, "యేసు!నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను  జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో నేడే నీవు నాతో కూడ పరలోకమున ఉందువు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. 

ఈ రోజు మనం యేసు క్రీస్తు రాజు  పండుగ జరుపుకుంటున్నాం. ఈ పండుగను 1925 సంవత్సరంలో 11 వ భక్తినాధ పాపు గారు  స్థాపించారు. ఇది నిజమైన శాంతిని పొందడానికి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువును అన్వేశించాలి మరియు ఆయన మాత్రమే శాంతి సమాధానం ఇవ్వగలరు అని తెలియజేసే ఒక పండుగ ఇది.   1918 వ సంవత్సరంలో లో మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత 1920 లో ఎవరు నిజమైన శాంతిని ఇవ్వగలరు అని ఆలోచిస్తూ నిజముగా క్రీస్తు మాత్రమే నిజమైన శాంతి ఇస్తాడు అని చెపుతూ స్థాపించిన పండుగ ఇది. 

ఇదే సమయంలో ఐరోపా మరియు ఇతర ప్రాంతాలలో ప్రజలు లౌకిక వాదం వైపు మొగ్గుచూపుతూ దేవుని యొక్క అవసరం మాకు లేదు అనే  ఆలోచన విధానం పెరిగిపోతున్న సమయం. దేవుని యొక్క అవసరం మాకు లేదు కాని మాకు మేము జీవించగలం, ఆనందంగా ఉండగలం అని మనం అనుకోవచ్చు కాని అది సాధ్యపడదు. యిస్రాయేలు ప్రజలు మనకన్నా ముందుగా ఇలా ఆలోచించి ఇది సాధ్య పడదు అని తెలుసుకున్నారు. 

 యిస్రాయేలీయుల రాజు 

మొదటిగా యిస్రాయేలు ప్రజలకు రాజు లేడు. దేవుడు  వారికి ఒక రాజు ఉండాలి అనిఅనుకోలేదు. ఎందుకు అంటే యిస్రాయేలు ప్రజలకు దేవుడే రాజుగా ఉండేవాడు. రాజు చేసేటువంటి పనులు మొత్తం దేవుడు వారికి చేస్తూనే ఉన్నాడు. వారిని అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తున్నాడు. ప్రభువైన దేవుడు ఆయన అన్నీ జాతులకు రాజు.  యిర్మియా 10,7. యిస్రాయేలును పవిత్ర ప్రజగా ఆయన ఎన్నుకున్నారు. వారి మధ్యలో నివసించారు. కీర్తన 134,3. యోషయా 52:7. నీ ప్రభువు నీ మధ్య నున్నాడు. నీవు సంతసింపుము అని జేపన్యా గ్రంధంలో మనం వింటాం. జఫన్యా 3:14-15.

ఇతర దేశాల రాజులు మరియు రాచరికం 

 పూర్వ కాలంలో రాచరికం, రాజ్యాధికారం దేవునికి సంభందించినవి అని అనుకునేవారు. ఈ ఆలోచన అప్పటి ప్రజల సంస్కృతి , సంప్రదాయాలలో కూడా కనిపించేది.  ఐగుప్తు దేశంలో  ఫరో రాజును హ్ోరోస్ అవతారంలా భావించేవారు.  ఆయన చేసే పనులన్నీ కూడా దేవునికి సంబంధించినవిగా అనుకునేవారు. బాబిలోనియా ప్రజలు తమ రాజును మదురుక్ ప్రతినిధిగా భావించేవారు. రాజును దేవుడు  భూమి, ప్రజలు, సైన్యం, దైవబలి మొదలగు వాటికి  అధిపతిగా చేశాడు అని భావించేవారు. బాబిలోనియా, ఐగుప్తు దేశాల రాజులు, వారి రాచరికం గురించి మనం తెలుసుకున్నప్పుడు, రాజు దేవుని ప్రతినిధి అనే భావన కలుగుతుంది. ఇదే ఆలోచనను తరువాత గ్రీకు మరియు రోమా రాజ్యాలలోనూ ఉంది. ఇది ఇంకా కొంచెం పరిధి దాటి రాజును దేవునిగా చూడటం వారు మొదలు పెట్టారు. 

యిస్రాయేలు ప్రజలు రాచరికం 

యిస్రాయేలు ప్రజలకు మానవ రాజు అనే ఆలోచన అసలు లేదు. కాని వారు ఎప్పుడైతే ఐగుప్తు , బాబిలోనియా దేశాలలో బానిసలుగా ఉన్నారో అప్పుడు వారికి ఈ ఆలోచన కలిగింది. మనకు ఒక రాజు కావాలి అనుకున్నారు. వారు అక్కడ నుండి వచ్చిన తరువాత మిధ్యానియుల నుండి కాపాడిన తరువాత వారు గిద్యొనును తమ మీద రాజుగా వుండమని కోరారు. కాని ఆయన ఒక విషయం స్పష్టం చేశాడు. నేను కాని నా కుమారుడు కాని మిమ్ము పరిపాలింపము. ప్రభువే మిమ్ము పాలించును. దేవుడే మిమ్ములను పాలించును అని వారికి తెలియజేశాడు.  న్యాయాధిపతులు 8:23.  దేవుడు ఒడంబడిక ద్వారా వారిని ఎన్నుకొని వారిని పాలించాడు. కాని తరువాత  అబిమలేకు రాజును కావాలనే ఆశతో  షెకెము వద్ద  కానా తరహా రాచరికాన్ని  స్థాపించాలని  చుసాడు. కాని అది నాశనం అయ్యింది. తరువాత సమూవేలు ప్రవక్త  కూడా మానవ రాచరికానికి వ్యతిరేకముగా ఉన్నాడు. ప్రజలు పదే పదే అడుగుట వలన సమూవేలు ప్రవక్త  వారికి దేవుని ఆజ్ఞ ప్రకారం  సౌలును రాజుగా అభిషేకించారు. సౌలును దేవుడు తన ఆత్మతో నడిపించాడు. కాని సౌలు తరువాత తనకు ఇష్టమైన విధముగా జీవించడం వలన దేవుడు అతన్ని తిరస్కరిస్తున్నాడు. దాని తరువాత దేవుడు దావీదును రాజుగా ఎన్నుకుంటున్నాడు. నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుకు నీ కుటుంబము, రాజ్యము కలకాలము  నా కనుసన్నులలో మన్నును , నీ సింహాసనం నిత్యం, నెలకొని యుండును, అని  వాగ్ధానం చేసాడు. కాని యిస్రాయేలులో చెడు రాజులు ఎక్కువయ్యారు. వారు పొరుగు దేశాలను చూసి వారి వలె విగ్రహారాధన చేశారు. ప్రవక్తలను వ్యతిరేకించారు. హొషేయా ప్రవక్త రాజరికాన్ని ఖండించాడు. కాని  యేషయా ప్రవక్త  భవిష్యరాజు పుట్టుక గురించి చెప్పాడు. దేవుడు వారికి రాజుగా ఉండటం మరియు దావీదు వంశం నుండి రాజు రావడం సాధ్య అవుతుంది యేసు ప్రభువుతోటి. 

దేవుడు ఎందుకు వారికి రాజును ఇవ్వాలనుకోలేదు. 

దేవుడు యిస్రాయేలు ప్రజలకు ఒక రాజును ఇవ్వాలని అనుకోలేదు. ఎందుకు అంటే సమూవేలు ప్రవక్త చెప్పిన ప్రకారం ఈ లోక  రాజులు ఈ ప్రజలను బానిసలుగా వాడుకుంటున్నారు, దేవుడు వారిని స్వతంత్రులుగా ఉంచాలి అని అనుకున్నారు, రాజుగా ప్రజల బాగోగులను దేవుడు ఎప్పుడు చూసుకుంటూనే ఉన్నాడు. వారిని ఇతర రాజ్యాలనుండి  కాపాడాడు, వారికి కావలసిన అన్నీ వారికి సమకుర్చాడు.  అన్నీ విధాలుగా వారి మధ్యనే దేవుడు ఉన్నాడు. అందుకే వారిలో ఒక ఆలోచన ఉండేది. మెలెక్  యాహ్వె అని . మెలెక్ అంటే రాజు అని, యాహ్వె అంటే ఉన్నవాడు అని అర్ధం. మెలెక్ యాహ్వె అంటే నిత్యం ఉండువాడు మనకు రాజు  అని, లేక దేవుడు మనకు రాజు అని అర్ధం. అప్పటి నుండి ప్రజలలో దేవుడు మాకు రాజు అనే భావన ఉండేది.  

 యిస్రాయేలు ప్రజలలో  దేవుడు వారి రాజు అనె  భావనలో పూర్తిగా వ్యక్తం కాకపోయినా  ప్రవక్తలు దీని గురించి చాలా నిశ్చితమైన అభిప్రాయంతో ఉండేవారు. వారు దేవున్ని తమ రాజు అని ప్రకటించుకున్నారు. దేవుడు తమ రాజు అని గర్వంగా చెప్పుకునేవారు. మిగిలిన రాజులు కేవలం మానవ మాత్రులు అని ఎగతాళి కూడా చేసేవారు. 

తరువాత కాలంలో యిస్రాయేలు ప్రజలు  మెస్సీయా వారి రాజుగా ఉండాలి అని వారు కోరుకున్నారు. యేసు ప్రభువు యెరుషలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు ప్రజలు ఈ కోరికను వ్యక్త పరిచారు. ఇక్కడ యేసు ప్రభువు విజయోత్సవ రాజు వలె యెరుషలేముకు వస్తున్నాడు. వారు ఆయనను తమ మెస్సీయాగా వారు ఒప్పుకుంటున్నారు. యోహను 6 వ అధ్యాయంలో మనం ప్రజలు ఆయనను బలవంతంగా రాజును చేయబోతున్నారు అని తెలిసి అక్కడ నుండి వెళ్లిపోతున్నారు. మనం  యేసు ప్రభువు సిలువ వేయబడిన సిలువ మీద ఈసూస్ నజారెనుస్  రెక్స్ ఇదయరేయుమ్. నజరతు నివాసి అయిన యేసు యూదుల రాజు అని చదువుతాం.ఇది పూర్తిగా వారి కావాలని కోరుకున్న లేకున్నా దేవుడు వారి రాజుగా ఆయననను అంగీకరిస్తున్నారు. 

 యేసు ప్రభువు ఎటువంటి రాజు ? యేసు ప్రభువును వారు ఏమి కోరుకుంటున్నారు, యేసు ప్రభువునుగురించి  సువిశేషంలో మనం ఏమి తెలుసుకుంటున్నాము?  అంటే వారు యేసు ప్రభువు నందు వారి అవసరాలను తీర్చే రాజును, వారిని పీడించే వారి నుండి  విడిపించేలా చేసే రాజును వారు చూస్తున్నారు. వారి అనారోగ్యాలను తొలగించే వైద్యుడిని వారు చూస్తున్నారు. వారికి స్వేచ్ఛను ఇచ్చే రాజును వారు చూస్తున్నారు. విటన్నింటికంటే వారు స్వతంత్రులుగా ఉండాలి అని అనుకున్నారు.

ఇవి అన్నీ కూడా కేవలం యేసు ప్రభువు ద్వారా మాత్రమే సాధ్యం అవుతాయి అంతే కాదు మనకు నిజమైన శాంతిని ఇచ్చేడి కూడా ప్రభువు మాత్రమే. జీవాన్ని మరియు స్వాతంత్రంను ఇచ్చి మనలను బానిసత్వం నుండి నడిపించే రాజు కనుక ఎల్లప్పుడు ఆ ప్రభువు పాలనలో ఉండాలి అని కోరుకుందాం. 

లూకా 21: 5-19

 లూకా 21: 5-19 


కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు "చక్కని రాళ్ళతోను, దేవునికి అర్పింప బడిన వస్తువులతోను ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు" అని చెప్పుకొనుచుండిరి. అంతట యేసు వారితో "ఈ కట్టడమును మీరు చూచుచున్నారు గదా! ఇచ్చట రాతి పై రాయి నిలువని కాలము వచ్చును. అంతయు నాశనము చేయబడును" అనెను. అప్పుడు వారు "భోదకుడా! ఇవన్నియు ఎప్పుడు సంభవించును? దానికి సూచనయేమి?" అని అడిగిరి. అందుకు, ఆయన "మిమ్ము ఎవ్వరును మోసాగింపకుండునట్లు మెలకువగా ఉండుడు. మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను  అనియు, కాలము సమీపించినది అనియు  చెప్పెదరు. కాని మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్దములను, విప్లవములను గూర్చి వినినపుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నియు జరిగి తీరును. కాని, అంతలోనే అంతము రాదు" అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను: "ఒక జాతి మరియొక జాతిపై, ఒక రాజ్యము మరియొక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్లు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. ఇవి అన్నియు సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి, ప్రార్దనామందిరములకును, చెరసాలలకును అప్పగించి, హింసింతురు. నా నామము నిమిత్తము రాజులయొద్దకు, అధిపతుల యొద్దకు మిమ్ములను తీసుకొనిపోవుదురు. ఇది మీరు సాక్షులుగ ఉండవలసిన సమయము. మీరు అచట చెప్పవలసిన దానిని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకును, మిమ్ములను ఖండించుటకును వీలుకాని వాక్కును, వివేకమును ప్రసాదింతును. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులుకూడ మిమ్మును పట్టిఇచ్చేదరు. మీలో కొంత మందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ములను అందరు ద్వేషింతురు. కాని మీ తలవెంట్రుక కూడ రాలి పోదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. 

కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు "చక్కని రాళ్ళతోను, దేవునికి అర్పింప బడిన వస్తువులతోను ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు" అని చెప్పుకొనుచుండిరి. యెరుషలేము దేవాలయము గురించి యిస్రాయేలు ప్రజలు ఎప్పుడు చాలా గర్విస్తు ఉండేవారు. ఎందుకంటే అది వారి గొప్ప తనానికి సూచనలా వారు భావించేవారు. అంత పెద్ద కట్టడము యెరుషలేములో మరియొకటి  లేదు.   అది వారు దృష్టిలో ఎంత గొప్పదో మనం ఊహించవచ్చు. కేవలం పెద్ద కట్టడము మాత్రమే కాదు అది వారి విశ్వాసానికి, దేవుని మీద వారికి గల ప్రేమకు కూడా గుర్తు.  దావీదు మహారాజు  దేవునికి ఆలయం లేదు, నేను ఇక్కడ రాజప్రసాదంలో ఉంటున్నాను అని భాధ పడి, దేవాలయం కట్టాలని ఎంతో ఆశ పడ్డాడు. కాని దేవుడు మాత్రము ఆయన చేతులు రక్తం చింధించినవి అని, దేవాలయం ఆయన చేత కట్టనివ్వలేదు. తరువాత దేవాలయమును సోలోమోను చెత కట్టించడం జరిగినది. సోలోమోను కట్టించిన దేవాలయము యొక్క గొప్పతనం మనం వింటూ వుంటాం. ఎక్కడెక్కడి నుండో వారు గొప్ప గొప్ప వాటిని తీసుకొని వచ్చి గొప్ప దేవాలయం నిర్మించడం జరిగినది. కాని అది కట్టిన నాలుగు వందల సంవత్సరాల తరువాత, ఆ దేవాలయం బాబిలోనియా రాజు నెబుకద్నేసరు రాజు దండెత్తి వచ్చినప్పుడు దేవాలయం ద్వంసం చేస్తున్నారు. అక్కడి విలువైన వస్తువులను తీసుకొని పోతున్నారు. 

 బాబిలోనియా ప్రవాసం ముగిసిన పిదప యిస్రాయేలు ప్రజలు మరల దేవాలయం కట్టుకున్నారు, ఎజ్రా, నేహామియా ఈ కార్యానికి పూనుకొని వారు గొప్ప దేవాలయం నిర్మించారు. అయితే ఈ దేవాలయం చాలా సంవత్సరాలు కట్టారు, ఇది పూర్తి అయిన  కొద్ది కాలమునకే ఈ దేవాలయం నాశనం చేయ బడింది. ఈ దేవాలయం కట్టిన తరువాత హెరోదు ఆ దేవాలయముకు ఇంకా ఎక్కువ స్థలంలో దానిని పొడిగించాడు, ఆవిధంగా  ఈ దేవాలయం చాలా సుందరముగా చేశారు. 17 ఎకరాలు ఉన్న దేవాలయాన్ని హెరోదు 36 ఎకరాలకు పెంచడం జరిగింది. చాలా ప్రశస్తమైన రాళ్ళతో దేవాలయం కట్టడం చేయడం జరిగింది, దేవాలయం ముఖగోడ  మొత్తం బంగారం పొందుపరచబడింది, బంగారం లేని చోట తెల్లని పాల రాయితో కట్టడం జరిగింది. ఇది యిస్రాయేలు వైభవానికి, ప్రశస్తికి గుర్తుగా ఉండేది. అటువంటి గొప్ప కట్టడం వారి జీవితాలలో ముఖ్యమైన స్థానం కలిగివుంది. వారి జీవితం మొత్తం  ఆ దేవాలయం చుట్టే తిరిగేది. దేవాలయంలో ఉన్న దేవుని సాన్నిధ్యం కంటే వీరి మనసు దేవాలయం అందం మీదే ఎక్కువగా ఉండేది. అందుకే యేసు ప్రభువు వారిని బలి వస్తువులను పవిత్ర పరిచే బలిపీఠం  గొప్పదా ? లేక బలి పీఠం మీద అర్పించబడిన బంగారం గొప్పదా? అని కొన్ని సార్లు మన ఆలోచనలు కూడా అలానే ఉంటాయి. ఏది గొప్పో నిర్ణయించుకోలేక పోతాము.

అంతట యేసు వారితో "ఈ కట్టడమును మీరు చూచుచున్నారు గదా! ఇచ్చట రాతి పై రాయి నిలువని కాలము వచ్చును. అంతయు నాశనము చేయబడును" అనెను. అప్పుడు వారు "భోదకుడా! ఇవన్నియు ఎప్పుడు సంభవించును? దానికి సూచనయేమి?" అని అడిగిరి. ఇంత గొప్ప కట్టడముగా ఉన్న దేవాలయమును యేసు ప్రభువు రాతి మీద రాయి నిలువని రోజు వస్తుంది అని చెబుతున్నారు. ఇది యిస్రాయేలు ప్రజలకు మింగుడు పడని ఒక విషయం ఎందుకు అంటే వారికి కేవలం ఇది ఒక గొప్ప కట్టడం మాత్రమే కాదు, వారి యొక్క సాంఘిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రం. కాని దేవుని అలోచనలు  అర్ధం చేసుకోవడంలో విఫలం చెందారు. కారణం ఏమిటి అంటే వీరి ఆలోచనల ప్రకారం వీరు జీవించారు, ఈ ప్రజల్లో ఉన్న ఒక ఆలోచన ఏమిటి అంటే దేవుడు మనలను ఎన్నుకున్నాడు, మనకు ఇక ఎవరు ఎదురు ఉండరు, అని గర్వంతో నివసించేవారు, కాని ఇటువంటి ఆలోచన ఉన్న అన్నీ సమయాలలో దేవుడు వారి నుండి దూరంగా వెళ్ళేవారు, దాని ద్వారా వారు నాశనం చెందేవారు. ఇస్రాయేలు ప్రజలకు వచ్చిన ప్రతి ఆపద, ప్రతి అవమానం, ప్రతి నాశనం కేవలం దేవుడు వారికి దూరం అవ్వడం వలన మాత్రమే జరిగింది. మేము దేవాలయానికి దగ్గర అయ్యాం అనుకుంటున్నాము,  కాని దేవుని నుండి దూరం అయ్యాము ఏమో అని గుర్తించలేక పోతున్నమా? ఇదే ఇస్రాయేలు ప్రజలకు జరిగింది , మనకు కూడా ఇదే జరుగుతుందా ! ఆలోచించాలి. 

అందుకు, ఆయన "మిమ్ము ఎవ్వరును మోసాగింపకుండునట్లు మెలకువగా ఉండుడు. మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు, కాలము సమీపించినది అనియు  చెప్పెదరు. కాని మీరు వారి వెంట వెళ్ళవలదు. ఇటువంటివి జరిగినప్పుడు మోసపోవద్దు అని యేసు ప్రభువు చెబుతున్నారు. మోసపోకుండా ఉండుటకు మనం ఏమి చేయాలి? మోసగాడు చెప్పే మాటలను నమ్మకుండా ఉండుటకు ఏమి చేయాలి? మనం చేయవలనసినది ఒక్కటే ఆయన చెప్పిన విధముగా మనం జీవించాలి. ఆయన సాన్నిధ్యాన్ని మన మనసులలో పొందుటకు ప్రయత్నించాలి. ఆయన వాక్కును అనుసరించి జీవించాలి. మరి ముఖ్యముగా ఆయన వలె వారు జీవిస్తున్నారా అని చూడాలి, యేసు ప్రభువు ఎవరిని మోసం చేయలేదు, యేసు ప్రభువు ఎవరిని హత్య చేయలేదు, ఎవరిని క్షమించను అనలేదు, ఎవరిని తృణీకరించలేదు, ఎవరి మీద దౌర్జన్యం చేయలేదు, ఆయన పగ, ప్రతీకారం తీర్చుకోలేదు, శారీరక వాంఛలు తీర్చుకోవడానికి ప్రాకులాడలేదు, ఆయన అహంకారిగా ఉండలేదు,  ముఖ్యంగా మనం అంధకారంలో లేకపోతే ఇది తెలుసుకోవడం సాధ్యం అవుతుంది. 

నా నిమిత్తము మీరు అనేక హింసలకు మీరు గురి అవుతారు , ఇది యేసు ప్రభువును పూర్తిగా మనం అనుసరించడం మొదలుపెట్టినప్పటి నుండి జరుగుతుంది. ఒకసారి మనం క్రైస్తవ చరిత్ర చూసినట్లయితే ఇది మనకు తెలుస్తుంది. స్తేఫాను గారి జీవితం చూసినట్లయితే ఈ విషయం మనకు తెలుస్తుంది. యేసు ప్రభువును అనుసరించడం తప్ప,  అతని జీవితంలో తప్పు ఏమి లేదు కాని ఆయనను అన్ని విధాలుగా పరీక్షకు గురిచేసి, అన్యాయముగా అతనిని హింసించి చంపడం జరిగినది, ఆయన ఏమి మాటలడడో  ఒకసారి గుర్తు చేసుకోండి ఎక్కడ నుండి వచ్చినది ఆ జ్ఞానం కేవలం దేవుని నుండి అందుకే యేసు ప్రభువు చెబుతున్నారు. ఇవి అన్నియు సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి, ప్రార్దనామందిరములకును, చెరసాలలకును అప్పగించి, హింసింతురు. నా నామము నిమిత్తము రాజులయొద్దకు, అధిపతుల యొద్దకు మిమ్ములను తీసుకొనిపోవుదురు. ఇది మీరు సాక్షులుగ ఉండవలసిన సమయము. మీరు అచట చెప్పవలసిన దానిని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకును, మిమ్ములను ఖండించుటకును వీలుకాని వాక్కును, వివేకమును ప్రసాదింతును. అలా అని అప్పుడే అంతిమ దీనము వచ్చినది అని కాదు అర్ధం. ఇవి అన్నీ జరిగిన తరువాత కాని ఆ దినము రాదు. నిజానికి మనం ఆ దినము గురించి అంతగా ఆలోచించనవసరం లేదు మనం చేయవలసినది, ఎప్పుడు జాగురుకత కలిగి ఉండటం అప్పుడు ఆ రోజు ఎప్పుడు వచ్చిన మనం సిద్ధంగా ఉంటాము. 

నా నామము నిమిత్తము మిమ్ములను అందరు ద్వేషింతురు. కాని మీ తలవెంట్రుక కూడ రాలి పోదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. యేసు ప్రభువు చెప్పిన ఈ మాటలు మనం  మీ శరీరమును నాశనము చేసే వారికి భయ పడకుడు అని చెప్పిన మాట వలె మనం ఆలోచించాలి. ఎందుకంటే క్రైస్తవులను ఒక రకముగా శత్రువులు అన్నట్లుగా చూసారు, హింసించారు, కష్ట పెట్టారు కాని ఎవరు వారి విశ్వాసాన్ని ఏమి చేయలేక పోయారు, అన్నీ కష్టాలు పొందుతూ, హింసకు గురి అవుతూ క్రీస్తుకు సాక్షులుగా జీవించారు, ఎందుకంటె వారి ప్రాణమును వారు నిలబెట్టుకున్నారు. 

సహనం క్రైస్తవులకు ఉండవలసిన ఒక గొప్ప గుణం. ఈ సుగుణం మనలను అన్ని భరించే శక్తిని కలిగేలా చేస్తుంది. మనలను దేవునికి ఇష్టమైన వారిగా మారుస్తుంది. ఒక సారి పునీతుల జీవితాలు పరిశీలించినట్లయితే వారు ఎంత సహనము కలిగి ఉన్నారో మనం తెలుసుకోవచ్చు. యేసు ప్రభువు నుండే వారు ఈ సుగుణాన్ని నేర్చుకుంటున్నారు. ఆయనను ఎన్నో అవమానాలుకు గురి చేసిన తన సహనాన్ని కోల్పోకుండా జీవించాడు. హింసలనుకు సహనంతో భరించాడు. సహనం మనలను శక్తి వంతులను చేస్తుంది. కనుక క్రీస్తును అనుసరిస్తూ ఆయన సుగుణాలను అలవరచుకొనుచు , క్రీస్తు సాక్షులుగా జీవించుదాం. ఆమెన్. 
నిజ క్రైస్తవులుగా జీవించుదాం. 



లూకా 20: 27-38

  లూకా 20: 27-38 

ఆ పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని కొందరు  సద్ధూకయ్యులు  యేసు వద్దకు వచ్చి , బోధకుడా! ఒకడు సంతానము లేక మరణించిన యెడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి, అతనికి సంతానము కలుగజేయవలెనని మోషే లిఖించెనుగదా! అయితే మాలో ఏడుగురు సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే చనిపోయేను. పిమ్మట రెండవ వాడు ఆ పిదప మూడవ వాడు, అట్లే ఏడుగురు ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి. ఆ పిదప ఆమెయు మరణించినది. ఏడుగురును ఆమెను వివాహమాడిరి కదా! పునరుత్థానమునందు ఆమె ఎవరి భార్య అగును? అని అడిగిరి. అందుకు యేసు ఈ జీవితములో వివాహములకు ఇచ్చిపుచ్చుకొనుట జరుగును. కాని పునరుత్థానమునకు యోగ్యులగువారు రానున్న జీవితమున వివాహమునకు ఇచ్చిపుచ్చుకొనరు. పునరుత్థానులగుటచే వారికి ఇక చావులేదు. పునరుత్థాన కుమారులగుట వలన వారు దేవదూతలతో సమానులు. దేవుని కుమారులు. మండు చున్న పోదను గూర్చి మోషే ప్రస్తావించుచు, పునరుత్థాన విషయమై ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఈసాకు దేవుడనియు, యకొబు దేవుడనియు పలికెను. దేవుడు జీవితులకే గాని, మృతులకు దేవుడు కాడు. ఏలయన, ఆయన దృష్టికి అందరు సజీవులే, అని వారికి సమాధానం ఇచ్చెను.

సద్దుకయ్యులు యూద సమాజంలో ఎవరు? ఎలా ఉండేవారు ?

 ఈ సువిశేష భాగంలో కొంత మంది సద్దుకయ్యులు యేసు వద్దకు వచ్చారు, అని మనం వింటున్నాము. ఎవరు ఈ సద్దుకయ్యులు  అని ప్రశ్నించినట్లయితే  ఆనాటి సామాజిక పరిస్తితులను బట్టి వీరు  యూదయ సమాజంలో ఒక ఉన్నత వర్గానికి చెందినవారు. వీరు బైబుల్ లోని మొదటి ఐదు గ్రంధాలను  మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవారు. సమరియులవలే వాటిని మాత్రమే విశ్వసించే వారు.  మిగిలిన గ్రంధాలను ఈ మొదటి గ్రంధాల మీద వ్యాక్యానంగా మాత్రమే చూసేవారు. మొదటి గ్రంధాలలో పునరుత్థానం గురించి విపులంగా లేదు, కనుక పునరుత్థానం అంటే నమ్మేవారు కాదు.   

వీరు చాలా ధనికులు అంతే కాకుండా దేవాలయ అధికారం మొత్తం వీరు చేతులలోనే ఉండేది. యూదయా పెద్దల సమాజం అంటే యూదయ న్యాయస్థానం. దీనిలో ఎక్కువ మంది సభ్యులు సద్దుకయ్యులే ఉండేవారు. వీరిని ప్రజలు చాల నిష్ట పరులుగా పరిగణించేవారు కాని పరిసయ్యుల అంత గౌరవాన్ని పొందలేక పోయెవారు. ప్రధాన యాజకులు ఎక్కువ వీరి నుండే వుండే వారు. కైపా అనే ప్రాధాన యాజకుడు కూడా వీరిలోని వాడే. దేవాలయంలో జరిగే అన్ని రకాల వ్యాపారాలు వీరి ఆధీనంలోనే జరిగేవి. దేవాలయంలో జరిగే  డబ్బులు మార్పు కూడా వీరి ద్వారానే జరిగేవి. ఆకాలంలో ఉన్నటువంటి సామాజిక ఆలోచన విధానంగా చూస్తే వీరు లౌకిక వాదులుగానే ఉండేవారు. వీరి దృష్టిలో పునరుత్థానం  అనేది లేదు. దేవదూతలు లేరు, ఈ లోకమే సమస్తం.  

ఒక వ్యక్తి మరణించిన తరువాత ఇంకా ఏమి ఉండదు, అంతటితో వాని జీవితం ముగుస్తుంది అని నమ్మేవారు. అలా అని వీరు, వారి ఇష్టమైన విధంగా ఏమి జీవించేవారు కాదు. ఈ లోకంలో ఉండగా మనం మంచి జీవితం జీవిస్తే, మనలను  దేవుడు ఆశీర్వదిస్తారు అని చాలా మంచి జీవితం జీవించేవారు. కాని వీరి చేసినటువంటి ఒక పాపం ఏమిటి అంటే వీరు  రోమా సామ్రాజ్యానికి ఒక  రకమైన సామంతులుగా ఉండేవారు. రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకముగా వీరు ఏమి చేసేవారు కాదు. దేవాలయంలో డబ్బులు మార్పుల విషయంలో కూడా వీరు రోమా సామ్రాజ్యానికి ఒక సంధి ఏర్పాటుచేసుకున్నారు. అంతేకాక యూదయా ప్రజలకు సంబంధించిన విషయాలలో వీరే తీర్పు తీర్చవచ్చు.  న్యాయ స్థానంలో  వీరికి ఒక వ్యక్తికి మరణ తీర్పు విధించే హక్కు మాత్రము లేదు, కనుక వీరికి హక్కులేని  విషయాలు మాత్రమే పిలాతు వద్దకు పంపేవారు మిగిలిన విషయాలలో వీరే తీర్పు తీర్చేవారు. 

సద్దుకయ్యులు  ఎందుకు యేసు ప్రభువును ఇష్టపడలేదు?

పరిసయ్యుల వలె సద్దుకయ్యులు కూడా యేసు ప్రభువును ఇష్ట పడలేదు. యేసు ప్రభువు వారి నమ్మకాలను, వారి వ్యాపారాలను, వారి జీవిత విధానాలను తప్పు పట్టారు అని వారు భావించారు.  యేసు ప్రభువు దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు అక్కడ ఉన్నటు వంటి డబ్బులు మార్చే వారిని , బలికి పక్షులను, జంతువులను అమ్మేవారిని అక్కడ నుండి పంపించి వేశాడు.  అంతేకాక నా తండ్రి ఆలయాన్ని దొంగల గుహాగా చేసారు అని వారి  తప్పును ఎత్తి చూపాడు. వారి వ్యాపారాన్ని దెబ్బతీశాడు. కనుక వారికి యేసు ప్రభువు అంటే ఇష్టం లేదు. ఎలాగైన యేసు ప్రభువును కించ పరచాలని అనుకున్నారు. అనేక విధాలుగా వారు యేసు ప్రభువు మీద కక్ష తీర్చుకోవాలి అనుకున్నారు. యేసు ప్రభువు చనిపోవాలి అని ఎక్కువుగా కోరుకున్నవారు కూడా వీరే. అందరి కోసం ఒకరు మరణించడం మంచిది అని చెప్పింది వీరే.  యేసు ప్రభువుకు ధర్మ శాస్త్రం తెలియదు అని చెప్పాలి అని అనుకున్నారు. ఇప్పుడు మనం చదివిన సువిశేషం సందర్భం యేసు ప్రభువుకు ధర్మ శాస్త్రం మీద మరియు వారి నమ్మకాల మీద పట్టు లేదు అని నిరూపించాలి అనుకున్న సందర్భం. 

పరిసయ్యులకు మరియు సద్దుకయ్యులకు ఉన్న వ్యత్యాసం

పరిసయ్యులు పునరుత్థానమును , దేవదూతలను నమ్ముతారు.  బైబుల్ లోని మొదటి పంచ గ్రంధాలు మాత్రమే కాక చారిత్రక గ్రంధాలు , విజ్ఞాన గ్రంధాలు, కీర్తనలు, ప్రవక్తలు అన్ని గ్రంధాలు  వారు నమ్ముతారు. అంతేకాక పరలోక జీవితం ఉంది అని నమ్ముతారు.  అయితే ఈ పరిసయ్యుల కంటే గొప్ప వారము అనే భావన సద్దుకయ్యులకు ఉండేది. పరిసయ్యుల నమ్మకాల గురించి సద్దుకయ్యులు పరిహాసమాడేవారు. యేసు ప్రభువు పరిసయ్యులను నోరు మూయించాడు అని తెలుసుకొని, మేము ఆయనను పరీక్షించి, ఆయన  మీద కక్ష తీర్చు కోవచ్చు, మరియు పరిసయ్యులు  యేసు ప్రభువును పరీక్షించి విఫలం అయ్యారు కనుక వీరు ఇప్పుడు యేసు ప్రభువును పరీక్షించి పరిసయ్యుల కంటే మేము గొప్ప వారిమి అని ప్రకటించుకోవచ్చు, అనుకున్నారు. మరియు వారి వ్యాపారాలను దెబ్బతీసినందుకు తగిన ప్రతీకారం తీర్చుకోవచ్చు అనుకున్నారు. 

యేసు ప్రభువును పరీక్షించుట   

యేసు ప్రభువును పరీక్షించాలి అని  వారు ఒక కథ అల్లుకున్నారు. అది ఏమిటి అంటే ద్వితీయోపదేశకాండం 25 వ అధ్యాయాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రశ్నించారు.  "ఒకడు సంతానము లేక మరణించిన యెడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి, అతనికి సంతానము కలుగజేయవలెనని మోషే లిఖించెనుగదా! అయితే మాలో ఏడుగురు సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే చనిపోయేను. పిమ్మట రెండవ వాడు ఆ పిదప మూడవ వాడు, అట్లే ఏడుగురు ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి. ఆ పిదప ఆమెయు మరణించినది. ఏడుగురును ఆమెను వివాహమాడిరి కదా! పునరుత్థానమునందు ఆమె ఎవరి భార్య అగును? అని అడిగిరి." ఈ  ప్రశ్నను వీరు కేవలం యేసు ప్రభువును అవమానించాలి అనే ఉద్ధేశ్యంతోనే అడిగారు. ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేడని అనుకున్నారు. కాని వారి అమాయకత్వాన్ని, వారికి  ధర్మ శాస్త్రం మీద వున్న  అవగాహన రాహిత్యాన్ని యేసు ప్రభువు ఇక్కడ వెల్లడి చేస్తున్నారు. వారు అనుకుంటున్నట్లుగా వారేమి  అంత తెలివి గలిగినవారో,  లేక ధర్మ శాస్త్ర పరిజ్ఞానం కలిగినవారో,  ఏమి కాదని ప్రభువు ఇక్కడ  తేటతెల్లం చేస్తున్నారు. వీరికి ఉన్న ధనంతో మరియు రోమా సామ్రాజ్యం వీరికి ఇస్తున్న గౌరవంతో, ఇంతకన్నా గొప్ప ఏమి ఉండదు అని వీరు అనుకుంటున్నారు. ఇంతటితోనే జీవితం అనుకున్నారు.

సద్దుకయ్యుల అవివేకం 

యేసు ప్రభువు  వీరిని లేఖనమునలను గాని, దేవుని శక్తినిగాని ఎరుగక  మీరు పొరబడుచున్నారు, అని మత్తయి సువార్త 22: 29 వ వచనంలో చెబుతున్నారు. ఎందుకు వీరు పొరబడుచున్నారో యేసు ప్రభువు చెప్పారు. మొదటిగా వారికి ధర్మ శాస్త్రము అనిన పూర్తిగా అవగాహన లేదు. ఎందుకంటే వీరు  ఏనోకును దేవుడు తనతో తీసుకెళ్ళాడు అని నమ్మేవారు. ఏనోకు కయీను కుమారుడు ఆదికాండమునకు సంభందించినవాడు. అంటే ఆయన దేవునితో పాటు ఉన్నాడు అని కూడా వీరు నమ్మరా? అంటే వారి అవివేకం అంతగా పెరిగిపోయింది. అంతే కాదు, మోషేకు దేవుడు మండుచున్న పొదలో సాక్షాత్కారం ఇచ్చినప్పుడు, దేవుడు మోషే ఏమి చేయాలో చెప్పిన తరువాత కూడా ఆయనకు అనేక సందేహాలు ఉన్నాయి.

 మోషే దేవున్ని తన సందేహం తీర్చుకోవడం కోసం, తన ప్రజలకు దేవుని గురించి చెప్పడం కోసం, దేవున్ని ఒక వేళ ప్రజలు  ఆయన ఎవరు ? ఆయన పేరు ఏమిటి ? అని అడిగితే నేను ఏమి చెప్పాలి అని దేవున్ని అడుగుతున్నప్పుడు దేవుడు మోషేతో నేను “ఉన్న వాడను” అని చెబుతున్నాడు. గతంలో ఉన్నవాడను, భవిష్యత్తులో ఉండేవాడను, నిత్యం ఉండేవాడను అని దీని అర్ధం. కాని మనం అనిత్యులం, ఈ రోజు ఉంటాము,  రేపు ఉండము, గతంలో లేము. దేవుడు ఎల్లప్పుడు ఉండేవాడు. ఇంకో విధంగా చెప్పాలి అంటే ఆయన జీవం మనము  జీవిస్తున్నాం. ఈ జీవం మన నుండి పోయినప్పుడు మనం మరణిస్తాము కాని దేవుడు అలా కాదు. ఆయనే జీవం.  దేవుని దృష్టిలో  ఆయనకు అందరు జీవితులే. అందుకే దేవుడు నేను అబ్రహాము దేవుడను, యకొబు దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెబుతున్నారు.

 దేవుడు ఎంతో ప్రేమించిన మోషేను, తన ప్రజలను వాగ్ధాన భూమికి తీసుకురావడానికి వాడుకున్న దేవుడు, మోషే అన్ని కష్టాలు పడి ప్రజలను వాగ్ధాన భూమికి తీసుకు వచ్చిన మోషే దానిలో అడుగు పెట్టకుండానే చనిపోతున్నాడు. కేవలం ఈ లోకమే సమస్తం అయితే మోషే జీవితానికి అర్ధం ఏముంది.  అటువంటి అప్పుడు సద్దుకయ్యులు నమ్మినట్లుగా మొత్తం ఈ లోకమే అని అనుకోవడానికి వీలు లేదు. దేవుడు తన పని చేసిన వారికి ఇచ్చే బాహుమనం కోసం  పరలోకం ఉండాలి.  అందుకే యేసు ప్రభువు వారికి చెబుతున్నాడు. మీకు దేవుని శక్తి గురించి కాని లేక ధర్మ శాస్త్రం గురించి కాని వారికి అంత అవగాహన లేదు అని తెలియ పరుస్తున్నాడు. ఇటువంటి ప్రశ్న అడగడం వలన యేసు ప్రభువును ఇబ్బంది పెట్టాలి అని అనుకున్న సద్దుకయ్యుల అవివేకాన్ని వెల్లడిచేసుకున్నారు.

పునరుత్థానములో మానవుని స్థితి 

ఈ సందర్భంగా యేసు ప్రభువు పునరుత్థానం  అయిన తరువాత మానవుని స్థితి ఏమిటి అని తెలియచేస్తున్నాడు. పునరుత్థానాన్ని పరిసయ్యులు నమ్మేవారు కాని వారికి పునరుత్థానం అంటే ఇప్పుడు మనం ఎలా ఈ భౌతిక దేహం కలిగి ఉన్నామో  అలానే భౌతిక దేహాలతో పునరుత్థానం అవుతాము అని అనుకునేవారు. ఒక వేళ ఒక వ్యక్తికి ఏదైనా లోపం ఈ లోకంలో ఉండగా ఉన్నట్లయితే, పునరుత్థానం అయిన తరువాత కూడా అదే లోపంతో ఉంటారు అనే నమ్మకంలో ఉండేవారు. వాటి అన్నింటిని యేసు ప్రభువు తీసివేస్తున్నారు. పునరుత్థానం అయిన తరువాత మనలో ఆ లోపాలు ఏమి ఉండవు అని తెలియచేస్తున్నారు. పునరుత్థానం అయిన వారు దేవదూతల వలె ఉంటారు అని చెబుతున్నారు. దేవదూతలు ఆత్మలు వారికి శరీరం ఉండదు, పునరుత్థానం నందు మనకు ఉండేది ఆధ్యాత్మిక శరీరం, భౌతిక శరీరమునకు ఉన్న అన్ని ఆటంకములు ఈ శరీరమునకు ఉండవు.

పునరుత్థానము నందు పెళ్లి అనేది లేదు. వివాహ ధ్యేయం భార్య భర్తల శ్రేయస్సు, మరియు సంతానం. కాని ఇవి రెండు కూడా పునరుత్థానంలో ఉత్పన్నం కావు ఎందుకంటే, పునరుత్థానములో మనం పరలోకంలో ఉంటాము. దేవుని దగ్గర ఉండుట కంటే శ్రేయస్సు ఏమి లేదు. సంతానం లేక పునరుత్పత్తి అనే సమస్య ఉండదు. అక్కడ మరణం అనేది ఉండదు. సద్దుకయ్యులు అడిగిన ప్రశ్న తప్పు ఎందుకంటే మోషే ఇచ్చిన ఆజ్ఞలో చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబం అంతం అయిపోకుండా ఉండటానికి మరల పెళ్లి చేసుకోవాలి అని ఉంది. ద్వితీ 25:6. కాని పునరుత్థానంలో మరణం అనేది ఉత్పన్నం కాదు. 

దేవుడు జీవితులకే గాని, మృతులకు దేవుడు కాడు. ఏలయన, ఆయన దృష్టికి అందరు సజీవులే, అని యేసు ప్రభువు చెబుతున్నారు.  మానవ ఆకాంక్షకు , మరియు ఈ లోకంలో ఉండగా మనం పొందే   కష్టాలకు, బాధలకు, సౌక్యాలకు మన జీవితా నికి అనేక సార్లు పోలిక ఉండదు. ఎందుకు నేను ఇవి అనుభవించాలి అని మనకు అనేక సార్లు ప్రశ్నలు వస్తుంటాయి. ఇన్ని అనుభవిస్తూ   నైతికంగా జీవిస్తున్నాము అంటే ఖచ్ఛితముగా పరలోకం ఉండాలి. వీటి అన్నింటికీ సరియైన విధంగా తీర్పు తీర్చే దేవుడు కావాలి.  కాని మన ఇంటిలో లేక మనకు కావలసిన వారి ఇంటిలో లేక మనం ఎక్కువుగా ప్రేమించిన వారి ఇంటిలో  అకాల మరణం మరణం సంభవించిన ప్రతి సమయంలో మనకు కూడా పునరుత్థానం మీద ప్రశ్న వస్తుంది. నిజముగా ఈ జీవితం ఇంతటితో ఆగిపోయినట్లేనా లేక నేను విశ్వసించే విధముగా దేవుని దగ్గర ఉన్నారా? అని  ఈనాటి సువిశేషం మనకు ఇటువంటి అనుమానాలు అవసరం లేదు అని చెబుతుంది. ఎందుకంటే దేవునికి మృతులు ఎవరు లేరు, అందరు ఆయనకు సజీవులే. ఆయన దృష్టిలో అందరు సజీవులే. యేసు ప్రభువు ఈ మాట చెప్పడం వలన యిస్రాయేలు ప్రజలు ఇప్పటి వరకు వారు నమ్మిన విషయాలు నిజం అని తెలుసుకుంటున్నారు. మక్కబియుల గ్రంధంలో మనం చూసే ఏడుగురు అన్నదమ్ములు, వారు పునరుత్థానము మీద నమ్మకం ఉంచి అందరు మరణించడానికి సిద్ధ పడ్డారు.

పునరుత్థానం అయిన వారు దేవదూతలతో సమానం మరియు దేవుని కుమారులు అని ప్రభువు చెబుతున్నారు. దేవదూతలతో సమానం అని చెప్పారు కాని దేవదూతలు అని చెప్పలేదు ఎందుకంటే దేవదూతలు దేవుని కుమారులు కాలేరు. అవి కేవలం దేవుని సృష్టిగానే ఉండిపోతారు. మనిషి మాత్రం దేవుని కుమారులు అవుతారు. అందుకే పునీత పౌలు గారు 1 కోరింథీ 6:3 వచనంలో మనము దేవదూతలకు సహితము తీర్పు తీర్చేదము అని చెబుతాడు.

ఈ సువిశేష భాగం ద్వార దేవుడు మానవుని తన పొలికను మాత్రమే ఇవ్వలేదు. తనతో పాటు ఉండుటకు తన వలె జీవించుటకు మరియు తన సృష్టి మొత్తం మీద అధికారం ఇచ్చిఉన్నారు. జీవితం కేవలం ఈ లోకానికి మాత్రమే సంబంధించినది అని, మనకు ఉన్న సంపదను, అనుగ్రహాలును ఇక్కడ సుఖముగా జీవించుటకు మాత్రమే అని కాక మనకు మరణం తరువాత కూడా జీవితం ఉంది అని తెలుసుకొని , ఎటువంటి అపనమ్మకం లేకుండా జీవించాలి అని తెలియజేస్తుంది. పునరుత్థానం ద్వారా మనం దైవ బిడ్డలము అవుతాము అని తెలుపుతున్నది. మరియు దేవుని దృష్టిలో మృతులు ఎవరు లేరు అందరు ఆయనకు సజీవులే అని ఆయన జీవం గల దేవుడు కనుక మనకు ఆ జీవం ఇస్తారు అని తెలుపుతుంది.

 

జక్కయ్య యేసు ప్రభువు కలుసుకొనుట

 జక్కయ్య యేసు ప్రభువు కలుసుకొనుట 

లూకా 19: 1-10 

యేసు యెరికో పట్టణమున ప్రవేశించి దానిగుండ వెళ్ళుచుండెనుఅక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండెనుఅతడు యేసును చూడవలెనని యత్నించేనుకాని పొట్టివాడగుటచేతనుజనసమూహాము  ఎక్కువగా ఉండుటచేతను  చూడలేకపోయెనుకనుక అతడు ముందుకు పరుగుదీసి  దారిన పోవనున్న యేసును చూచుటకైఒక మేడి చెట్టును ఎక్కెనుయేసు అచటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో "జక్కయ్యత్వరగా దిగిరమ్ము దినము నేను నీ ఇంటిలోనుండ తలంచితినిఅని చెప్పెనుఅతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెనుఇది చూచిన వారందరు "ఈయన పాపియొద్దకు అతిధిగా వెళ్ళెనుఅని సణుగుకొనసాగిరిజక్కయ్య నిలబడి యేసుతో, "ప్రభూనేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదునునేను ఎవనికైనను అన్యాయము చేసినచో నాలుగు రెట్లు అతనికి ఇచ్చివేయుదునుఅని చెప్పెనుఅందుకు యేసు "నేడు  ఇంటికి రక్షణ వచ్చినదిఏలయనఇతడును అబ్రహాము కుమారుడేమనుష్యకుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు"అని అతనితో చెప్పెను.  

ఎవరు  జక్కయ్య ?

జక్కయ్య అంటే నీతిమంతునిగా పరిగణింపబడినవాడు అని అర్ధంమొదటిగా తన పేరుకు తగిన వాడిగా జీవించకపోయినప్పటికి తరువాత తన నామ సార్ధకం చేసుకున్నవాడు  అతను ఒక  సుంకరిమరియు ధనవంతుడు అనేక మంది సుంకం వసూలు చేసే వారికి ఒక అధిపతి లాంటి వాడుఅటువంటి వాడు యేసు ప్రభువుకోసం తన ధనం దానం చేసినవాడుఆస్తి అంతస్తులు కోసం మోసం చేయడంఎక్కువ పన్నులు వసూలు చేయడం వృత్తిగా ఎంచుకున్న వ్యక్తికాని తన ఆస్తిపాస్తులను తృణప్రాయంగా యేసు కోసం వదులుకున్నాడు అంటే యేసు ప్రభువును అతను ఎంతగా అభిమానించాడోప్రేమించాడో  మనం తెలుసుకోవచ్చుఊహించవచ్చు.    జక్కయ్య యేసుప్రభువును కలుసుకోవడానికిఆయన మాటలను వినటానికి  తనకు వచ్చే అన్ని ఆటంకములను అదిగమించిధృడ నిశ్చయంతో యేసు ప్రభువును చూసిన వ్యక్తియేసు ప్రభువు తన ఇంటికి వస్తాను అనగానే ఎంతో ప్రేమగా విందు తన ఇంటికి  తీసుకువెళ్లాడుతనకు తన కుటుంబమునకు రక్షణ తెచ్చుకున్నాడుతన జీవితంలో యేసు ప్రభువు కంటే ఏమి గొప్పది కాదు అని తన దాతృత్వాన్ని బాహాటంగా ప్రకటించిన వ్యక్తి తన ఆస్తిని ఇతరులకు  దానం చేసిన వ్యక్తికాని మొదటి నుండి ఆయన అటువంటి వాడు కాదుయేసు ప్రభువు రాకతోటి తన జీవితాన్ని మార్చుకొని యేసు అనుచరునిగా జీవించిన వ్యక్తి.

యెరికో పట్టణ ప్రాముఖ్యత ఏమిటి?

యేసు ప్రభువు యెరికో పట్టణము మీదుగా యెరుషలేము వెళుతున్నారుయేసు ప్రభుని చివరి ప్రయాణం ఇదిఆయన యెరుషలేము పోవాలనే నిర్ణయంతో ఉన్నారుఅక్కడ రక్షణ కార్యాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకొని వున్నారుమరల ఇక్కడకు రాకపోవచ్చుయెరికో యెరుషలేముకు సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుందికనుక త్వరగా అక్కడనుండి వెళ్ళాలి అని  ప్రభువు అనుకొనుచున్నాడుయెరికో నగరమునకు   యేసు ప్రభువు వచ్చారని తెలుసుకొని చాలా మంది అక్కడకు వచ్చారువారిలో ఒకరు జక్కయ్య అనే ఒక సుంకరి.

ఏమిటి యెరికో యొక్క ప్రాముఖ్యత అంటే అది యిస్రాయేలు మొట్ట మొదటిగా కైవసం చేసుకున్న వాగ్దాన భూమిలో భాగంఇక్కడ నుండి వారు మిగిలిన ప్రాంతమును కైవసం చేసుకున్నారుయేసు ప్రభువు కాలంలో కూడా  ప్రాంతం చాలా ముఖ్యమైనది ప్రాంతం వేసవి కాలంలో రోమా పౌరులలో ధనవంతులకు  నగరం విడిది ప్రదేశంగా ఉండేదివాణిజ్య పరంగా యెరికో చాలా ముఖ్యమైన పట్టణం ఎందుకంటే  జేరికో నుండే , అక్కడ ఉన్నటునవంటి ఓడరేవు ద్వారా ఎన్నో రకాలుగా ఉత్పత్తులను ఎగుమతి చేసేవారు.  మరియు అక్కడ ఉన్నటువంటి మూడు ప్రధాన పన్నులు వసూలు చేసే కేంద్రాలలో యెరికో ఒకటిఇక్కడ ఉండేటువంటి జక్కయ్య  పరిసర ప్రాంతాలలో ఉండేటువంటి సుంకరులకు నాయకుడుమరియు  పట్టణములోని ఒక ప్రముఖ ధనవంతుడుఆవిధంగా ఆయన యెరికోలో ప్రముఖుడు  యెరికో చాలా ముఖ్యమైన గొప్ప నగరముగానే కాక యిస్రాయేలు చరిత్ర ప్రకారముగా కూడా ముఖ్యమైనది కనుక  వారు ఎలా మొదటగా వాగ్ధాన భూమిలో అడుగుపెట్టి యెరికోలో మొదటి విజయం పొందారో యేసు ప్రభువు మొదటిగా యెరుషలేములో రక్షణ కార్యం పూర్తి చేసేముందుగాఒక తప్పి పోయిన వానిని వెదకి రక్షించడం ద్వారా తాను  లోకంలోనికి వచ్చిన పనికి  యెరుషలేము వెళ్ళే ముందుగానే మొదటి విజయమును జక్కయ్య రక్షణ ద్వారా చూస్తున్నారు  

ఒక సుంకరికి ప్రజలు ఇచ్చే గౌరవం ఏమిటి

సుంకరి యేసు ప్రభువు దగ్గరకు రావడం చాలా  అరుదుగా జరుగుతుందిఎందుకంటే అతడు పన్నులు వసూలు చేసేవాడుప్రజలు అందరు యేసు ప్రభువును చూడటానికి , ఆయన మాటలు వినడానికి వస్తుంటారుఅప్పుడు అక్కడ సుంకరిని చూసినట్లయితే వారిని అగౌరవంగా చూస్తారుకనుక చాలా అవసరం అయితేనే వారు ఇతరులను కలవడానికి , మరి ముఖ్యంగా పది మందిలో కలవడానికి సిద్ధపడుతారు తప్ప అవసరం లేకుండా ఎవరిని కలువరు సుంకరులు సాధారణంగా ధనికులుఆస్తిపాస్తుల కోసం ఎటువంటి పనులనైన చేయడానికి సిద్ధంగా ఉండేవాడుసంపాదనే ధ్యేయంగా జీవించే ఒక వ్యక్తులువీరిని దేశద్రోహులుగా చూసేవారువీరు రోమా సామ్రాజ్యం తరుపున  చాలా కఠినముగా పన్నులు వసూలు చేసేవారుపేదవారు , విధవరాలు అని కూడా చూడకుండాదయకనికరం లేకుండా పన్నులు వసూలు చేసేవారురోమా సామ్రాజ్యం వారికి ఎంత వసూలు చేయాలో ముందుగా ముందుగానే వారికి ఒక లక్ష్యం పెడుతుందిఇది వారు ముందుగానే కత్తి తరువాత వారికి ఇష్టమైన విధంగా  వారు వసూలు చేస్తూనే వుండేవారు విధంగా వీరు ధనికులు అయ్యారని ప్రజలను పీడిస్తున్నారని , వీరి మీద ప్రజలకు కోపం ఉండేది అటువంటి ఒక వ్యక్తులకు నాయకుడు అయిన జక్కయ్య యేసు ప్రభువును చూడటానికి వస్తున్నాడు.

ఎందుకు జక్కయ్య యేసు ప్రభువును చూడాలి అని అనుకుంటున్నాడు

జక్కయ్య యేసు ప్రభువు గురించిఆయన సుంకరులను కూడా చేరదీయడం గురించి విని వుంటాడుయేసు ప్రభువు యొక్క అద్భుతాలను గురించి విని ఉంటాడుతాను కూడా పాపిని అనితాను ఆయన దగ్గరకు వెళితేతనను అంగీకరిస్తాడో లేదోఒకసారి ఆయన మాటలను విని ఆయనను  కలవడానికి  వెళ్లాలాలేదా అని నిర్ణయించుకోవడానికి వెళ్ళి వుండవచ్చుఒకసారి తనను కలసి తన పాప స్థితి గురించి చెప్పితనను క్షమించమని వేడుకోవడానికి వెళ్ళి వుండవచ్చు. తాను దేవుని నుండి దూరముగా ఉన్నానుఇక  పాప జీవితం జీవించలేను అని తనకు పాప క్షమాపణ ఇవ్వమని అడగడానికి వెళ్ళి ఉండవచ్చు.

జక్కయ్య యేసు ప్రభువును కలువుటకు గల ఆటంకములు ఏమిటి

జక్కయ్య ఇటువంటి ఆలోచనలతో యేసు ప్రభువును కలవాలి అని వెళుతునప్పటికి ఆయన యేసు ప్రభువును వెంటనే  కలవలేక పోతున్నాడుఆయనకు చాలా ఆటంకములు ఎదురు అవుతున్నాయివాటిలో కొన్ని ఏమిటి అంటే మొదటిగా తన పొట్టితనం పెద్ద ఆటంకం అవుతుందిజక్కయ్య  పొట్టివాడు కావడం వలన యేసు ప్రభువును చూడటానికి అది పెద్ద ఆటంకం అయ్యిందితనలో యేసు ప్రభువును చూడాలి అనే ఆశ ఇంకా ఎక్కువ అవడం వలన తన పొట్టితనంను అధిగమించడానికి ఆయన మెడి  చెట్టును ఎక్కుచున్నాడుతన పొట్టితనమును పట్టించుకోవడం లేదుదీనిని అధిగమించడానికి ఒక ఆయుధముగా చెట్టును చూస్తున్నాడువెంటనే  చెట్టును ఎక్కుచున్నాడుతనకు ఉన్న మరో ఆటంకం ఏమిటి అంటే అక్కడ ఉన్న సమూహంప్రజలు అందరు ఒక గుంపుగా ఉండుట వలనముందుకు వెళ్లలేక పోయాడు గుంపులో ఉన్నవారు ఎవరు అంటే వారు కూడా యేసు ప్రభువును చూడాలనుకున్న వారేవీరు అందరు జక్కయ్య కంటే ముందు ఉన్నారుఅనేక సార్లు యేసు ప్రభువును చూడాలిఆయనతో మాట్లాడాలి అనుకున్నవారు లేక ఆయనతో వున్నవారే ఆయనను కలవటానికి ఇతరులకు ఆటంకం అవుతున్నారు ఇంకా ఉన్న ఆటంకములు ఏమిటి అంటే తనకు ఉన్న పేరు ప్రఖ్యాతలుఒక వేళ యేసు ప్రభువు దగ్గరకు ఇంత ధనవంతునిగా ఉండిఒక సాదారణ వ్యక్తిలా ఆయనను  చూడటం కోసం చెట్లు ఎక్కడం ఏమిటి ? అని ఇతరులు అనుకుంటారు ఏమో అనే భావన కూడా ఒక ఆటంకంతన బంధువులు స్నేహితులు తన గురించి ఏమి అనుకుంటారో అని ఆటంకం ఇంకా మనకు కనపడే మరియొక ఆటంకం ఏమిటి అంటే తాను సుంకరి కాబట్టి తనను చూచిన ప్రజలు తనను హేళన చేస్తారు అని ఆయనకు భయం ఉండి ఉండవచ్చు ఇవి అన్ని జగ్గయ్యకు ఉన్నటువంటి ఆటంకములేకాని జక్కయ్య  ఆటంకాలు మొత్తం అధిగమించి యేసు ప్రభువును కలుస్తున్నారు.  

మన జీవితంలో యేసు ప్రభువును కలుసుకోవడానికి గల ఆటంకములు ఏమిటి?

మన జీవితములో యేసు ప్రభువును కలువటకు మనకు ఉన్నటువంటి ఆటంకం ఏమిటి అని మనం గుర్తించి దానిని అధిగమించి ఆయనను కలుసుకోవాలిఅది ఎంత వరకు మనం చేశాముఒక సారి ఆత్మ పరిశీలన చేసి చూసుకోవాలి ఆటంకాలను అధిగమిస్తూ ప్రభువును కలుసుకొనుటకు ప్రయత్నించాలిమనలను ప్రభువు దగ్గరకు పోవుటకు  ఏమి ఆటంక పరుస్తుందో ముందుగా మనం గ్రహించాలిఎప్పుడైతే మనం అది తెలుసుకుంటామోఅప్పుడు దానిని  అధిగమించుటకు సులువుగా ఉంటుంది. 

జక్కయ్య గొప్పతనం

జక్కయ్య యేసుప్రభువు తన ఇంటికి వస్తాను అని అన్నందుకు చాలా ఆనందపడుతున్నాడుయేసు ప్రభువును చూడాలి అని మాత్రమే అనుకున్న వ్యక్తికిచాలా గొప్ప అవకాశం  వచ్చినందుకు దానిని సద్వినియోగం చేసుకోవాలని  జక్కయ్యఆయన  ఏమి చేయబోతున్నాడో మొత్తం చెబుతున్నాడుతన ఇంటికి వచ్చిన వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు అని ఆయనకు తెలుసుతనను అందరు అసహ్యంగా చూస్తున్నారు అని తెలిసి అటువంటి వ్యక్తి ఇంటికి వచ్చిన యేసు ప్రభువుకు తాను ఎవరినైన మోసము చేసినట్లయితే వానికి నాలుగు రేట్లు ఇస్తాను అని చెబుతున్నాడుతన ఆస్తిలో సగం పేదవారికి ఇస్తాను అని అంటున్నాడుతన దగ్గరకు వచ్చినది రక్షకుడు అని రక్షణ పొందటానికి జక్కయ్య తనను అర్హునిగా చేసుకుంటున్నాడు.

ప్రభువు ఎందుకు  లోకానికి వచ్చారుఆయన ఏమి చేస్తున్నారు

యేసు ప్రభువును చూచుటకు జక్కయ్య చేసిన అన్ని పనులను ప్రభువు గమనిస్తున్నాడుఅందుకే జగ్గయ్యతో, ‘జక్కయ్య దిగిరమ్ము నేను మీ ఇంట  రోజు ఉండదలచాను’ అని అంటున్నాడు. “మనుష్యకుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడుఅని అతనితో చెప్పెను. అంటే యేసు ప్రభువు జక్కయ్య కోసం వచ్చాడుజక్కయ్య లాంటి వారికోసం వచ్చాడునీకోసం నాకోసం వచ్చాడు. “మనుష్యకుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు మాటలు  సువిశేష భాగంలోనే కాదుబైబిల్ మొత్తంలో కూడా చాలా ముఖ్యమైనవిఎందుకంటే యేసు ప్రభువు  లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశ్యం గురించి చెపుతున్నాయి.  దేవుడు ఎవరో మనకు తెలియపరుస్తున్నాడుదేవుడు మనలను వేదకుతున్నారుమనలను కనుగొన్నప్పుడు ఆయన ఎంతో ఆనందపడుతున్నాడు.  దేవుడు వెదకటం ఆరంభిచిన తరువాత మనం ఆయనను వెదకుతున్నాము కనుక ఆయనను వెదికే వారికి ఆయన దర్శనం ఇస్తారు. 

వివేకవంతుడు అవుతున్న జక్కయ్య

జక్కయ్య యొక్క జీవితం ఒకసారి మనం చూడాలి ఎందుకంటే జక్కయ్య యేసు ప్రభువు తన ఇంటికి వచ్చిన తరువాత కొన్ని మాటలు చెపుతున్నాడుఅవి ఏమిటి అంటే నేను ఎవరినైన మోసం చేసినట్లయితే వారికి నాలుగు రేట్లు ఇస్తానుమరియు నా ఆస్తిలో సగం పేదవారికి ఇస్తాను అని చెబుతున్నాడుఎందుకు  మార్పు వచ్చింది అతనిలో  అంటే ఆయన ఎప్పటికీ ఊహించని సంఘటన తన జీవితంలో జరుగుతుందిఅది ఏమిటి అంటే అందరిని ఎంతో ప్రేమతో ఆదరించే వ్యక్తిపాపులను క్షమించే వ్యక్తితన లాంటి సుంకరిని మత్తయిని తన శిష్యుడుగా చేసుకున్న వ్యక్తిఅనేక మంది పాపులను క్షమించిన వ్యక్తి అందరు శిక్షించమని చెబుతున్న కానినేను నిన్ను శిక్షించను అని చెప్పిన ప్రభువుమరణించిన వారిని కూడా మరల జీవమిచ్చిన ప్రభువుఅందరు ఆయనను ముట్టుకున్న చాలు ఆనుకొని చాలా మంది ప్రజలు ఉండగా కరుణామయుడు నా యింటికి వచ్చాడు అనే ఆనందముతోమరియు తాను పాపి అని సుంకరి అని అందరిచేత ద్వేషింపబడే వాడినైన  నా యింటికి ప్రభువు వచ్చాడు అని ఆనందముతో నాకు ఇక సంపదలు లోక సౌఖ్యలు అన్నిటికంటే విలువైన ప్రభువు మార్గం కనుగొన్నాను అనే ఆనందముతో జక్కయ్య  మాటలు చెబుతున్నాడు. 

పశ్చాతాపం మనలను ఎలా మారుస్తుందిపశ్చాతాపం మనకు ఎలా కలుగుతుంది?

పశ్చాత్తాపం అంటే హృదయ పరివర్తనం. హృదయ పరివర్తనం మన జీవిత విధానం మరియు, లోకాన్ని మనం చూసే విధానంలో మార్పు తీసుకువస్తుంది. పౌలు గారి జీవితంలో ఇదే జరుగుతుంది, జక్కయ్య జీవితంలో ఈ మార్పు మనం చూస్తాము.   పశ్చాత్తాపం పొందిన ప్రతి వ్యక్తి జక్కయ్యలానే ప్రవర్తిస్తాడుఎందుకంటే పశ్చాత్తాపం మనిషికి ఏది ముఖ్యమో తెలియచేస్తుందిఏది విలువైనాదోఏది విలువ లేనిదో తెలియజేసివిలువైన దానిని  పొందడం కోసం ఎంతటి దానినైన  కోల్పోవడానికైనా సిద్ధ పడేలా చేస్తుందిఇక్కడ క్రీస్తు కోసంరక్షణ కోసం తన సంపదను తృణప్రాయంగా భావిస్తున్నాడు జక్కయ్యఇది జక్కయ్య యేసు ప్రభువు తనకు ఇచ్చిన రక్షణకుప్రేమకు బదులుగా చేస్తున్నాడుపశ్చాత్తాప పడటం లేక మారు మనస్సు పొందడం అనేదిప్రతి నిత్యం క్రీస్తుకు అనుకూలముగా మనలను మనము సంస్కరించు కోవడంక్రీస్తు ప్రేమకు అనుకూలముగా జక్కయ్య తనను తాను సంస్కరించుకుంటున్నాడుమనకు మార్గం చూపుతున్నాడుక్రీస్తు ప్రేమకు జక్కయ్య వలె మనము కూడా అదే విధంగా స్పందించాలిప్రతి నిత్యం మనల్ని మనం సంస్కరించుకోవాలి.

రక్షణ యొక్క ఫలాలు మన నిజ స్థితిని తెలియజేస్తాయా?

నేడు  ఇంటికి రక్షణ వచ్చినదిఏలయనఇతడును అబ్రహాము కుమారుడే." యేసు ప్రభువు జక్కయ్యను ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని అంటున్నాడుఇది జక్కయ్యకు చాలా గొప్ప ప్రశంస ఎందుకంటే సుంకరులను యూదులు ఎంత ఘోరముగా చూసేవారంటే హంతకులువ్యభిచారులు కంటే సుంకరులే ఘోరమైన పాపులుగా వారినిగా చూసేవారుఅటువంటి వ్యక్తిని యేసు ప్రభువు ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని అనటం గొప్ప ప్రశంస అబ్రహాము కుమారుడు అనడం అనే మాటకు చాలా ప్రాముఖ్యత ఉన్నదియోహను సువిశేషంలో 8: 39  వచనంలో యేసు ప్రభువు మీరు అబ్రహాము కుమారులు అయినచో ఆయన పనులే మీరు చేసేవారు అని చెబుతున్నాడుఅబ్రహాము కుమారులు లేక కుమార్తె అంటే మనం ఆయన వలె విశ్వాసం కలిగిఅబ్రహాము వలె దేవునికి చెందిన పనులువిశ్వాస జీవితపు పనులు చేయడం అవి మనలను అబ్రహాము బిడ్డలను చేస్తాయిఇప్పుడు జక్కయ్య తన పశ్చాత్తాపం ద్వారం తన ఆస్తిని దానం చేయడం ద్వారా తాను మోసం చేసిన వారికి  నాలుగు రేట్లు ఇవ్వడం ద్వారాయేసు ప్రభువు చేత అబ్రహాము కుమారుడు అని అనిపించుకుంటున్నాడు. మనం నిజ జీవితం ఇదే మనం దేవునికి చెందిన వారముఆయన బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నిద్దాం.

హెరోదు పదవి కాంక్ష - పసిబిడ్డల హత్యలు

  హెరోదు పదవి కాంక్ష - పసిబిడ్డల హత్యలు  మత్తయి 2:13-18  వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత  యోసేపునకు కలలో కనిపించి, "శిశువును చంపుటకు హెరో...