27, ఫిబ్రవరి 2026, శుక్రవారం

19వ సామాన్య ఆదివారం

 19వ సామాన్య ఆదివారం 

రాజుల మొదటి గ్రంథం 19:4-8, ఎఫెసీ 4:30-52 యోహాను 6:41-51

ప్రియ విశ్వాసులారా ఈనాటి మొదటి పఠనంలో ఏలియా ప్రవక్త గురించి   వింటున్నాము. ఏలీయా ప్రవక్త బాలు ప్రవక్తలందరిని చంపినా తరువాత యేసెబేలు రాణి ఏలియాతో నేను నిన్ను చంపిస్తాను అని చెప్పగానే ఆయన దేవుణ్ణి కలుసుకొవడానికీ, తన ప్రయాణము ప్రారంభించి మార్గంలో  దేవునితో  ప్రభూ ఈ బాధ ఇక చాలు! నా ప్రాణమును తీసుకొనుము  అని మోర పెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు ఏలియాను ఆదరించి, ఆకలిని తీర్చిన తరువాత , ఆ శక్తితో  తన ప్రయాణం  నలువది రోజులు నడిచి దేవుని కొండయైన హోరేబు చేరుకున్నాడు. 

ప్రియా విశ్వాసులారా దేవుని వాక్కు ప్రజలకు అందించి ఆత్మబలంతో ఎన్నో గొప్ప కార్యాలు చేసి రోషంతో దేవుని కొరకు జీవించి యావే దేవుడే నిజమైన దేవుడని నిరూపించి, ఎంతో మంది బాలు ప్రవక్తలను చంపి కార్మెల్ కొండపై దేవుని ఘనతను చాటించిన ఏలీయా ప్రవక్త, యేసెబేలు రాణి చంపిస్తుందేమో అని భయపడ్డాడు. మన జీవితాల్లో కూడా మనం ఎన్నో గొప్ప కార్యాలను దేవుడిచ్చే శక్తితో చేస్తూ ఉంటాం. కాని ఎలియా వలె మనం కూడా ఏమైనా కష్టాలు, బాధలు వచ్చినప్పుడు, ప్రభూ  ఇక చాలు నా ప్రాణమును తీసుకొనుము అని అంటూవుంటాం. ప్రియ విశ్వాసులారా మనము దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు నిలబడితే దేవుడు ఎల్లా వేళల మన పక్షమున ఖచ్చితముగా ఉంటూ, మనలను ఆదరిస్తూ, మన ఆకలిని తీర్చుతాడు. మనలను నడిపిస్తుంటాడు. మరి ఈ గొప్ప ప్రేమను దేవుని నడిపింపును అర్ధం చేసుకొనగలుగుతున్నామా లేదా ఆలోచించండి. 

రెండవ పఠనములో వింటున్నాం. మనము దేవుని ప్రియమైన బిడ్డలం కనుక దేవుని పోలి జీవించాలి అని వాక్యంలో స్పష్టంగా చెబుతున్నారు దేవుడు. అదేవిధంగా క్రీస్తు ప్రభువు మనలను ప్రేమించి మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. కాబట్టి క్రీస్తు వలె మనం ప్రేమతో నడుచుకోవాలి అని వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా మన జీవితంలో ఏమి ఉండాలి ఏమి ఉండకూడదు అని తెలియజేస్తుంది. వైరము, మోహము, క్రోధము అనే వాటిని వదలి పెట్టాలి అరుపులుగాని,  అవమానముగాని  ఏ విధమైన ద్వేషభావముగాని,  అసలు మనలో మన కుటుంబాలలోగాని మన మనసులలోగాని ఉండకూడదు. కాని ప్రియా మిత్రులారా ఈలోక  జీవితంలో ప్రేమకు బదులుగా గొడవలు, ప్రతి విషయానికి అరుపులు, కేకలు, అల్లరులు అవమానాలు ఎక్కువై పోతున్నాయి. వీటన్నిటికీ కారణం స్వార్ధం, గర్వం, అసూయ, ఓర్వలేని తనం, అందుకే వాక్యం సెలవిస్తుంది. ఏ విధమైన ద్వేషభావమైన మనలో అసలు ఉండకూడదు.   ఈ లోకంలో స్వార్ధం, నటన, మోసం ఎక్కువగానే కనపడుతుంది, ఈ లోకంలో ఎక్కడ చూసిన స్వార్ధ బుద్దితో ఉన్నవారే ఎక్కువ ఉన్నారు. అన్ని నాకే, అంత నాకే, అన్ని నేనే అనే స్వార్ధం అదేవిధంగా నటన అన్నిటిలో,, అన్ని రంగాలలో అన్ని విధులలో ఎంతో మంది నటిస్తూ నటన జీవితం జీవిస్తున్నారు. అదేవిధంగా ఎక్కువమంది  ప్రజలు ఇతరులను  అవమానిస్తున్నారు, లేదా అవమానింపబడుతున్నారు. 

ప్రియమిత్రులారా ఆలోచించండి మనం ఏవరిని అవమానించకూడదు. ఎవరిని ద్వేషించకూడదు.  క్రీస్తుని బిడ్డలుగా, యేసు క్రీస్తుని విశ్వాసులుగా మనము ఎలా ఉండాలి అంటే పరస్పరము దయను, మృదుత్వమును మరియు క్షమాగుణమును కలిగి ఉండాలి. మన పరలోకపు తండ్రి దయామయుడు. మృదుత్వంకలిగి క్షమించి ప్రేమించే ప్రేమ మయుడు. కాబట్టి మనము పరస్పరం ప్రేమ కలిగి ఉండటానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించుదాం. 

సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు అంటున్నారు. "పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారము నేనే. అది విని  యూదులు గొణగసాగారు. ఈ యూదులు క్రీస్తు ప్రభువును తృణీకరించారు. క్రీస్తును కేవలం ఒక మానవునిగా మాత్రమే వారు చూస్తున్నారు. కాని దేవుని కుమారుడుగా అంగీకరించలేకపోతున్నారు. ఆయనపై నిందలు వేస్తూ వ్యతిరేకిస్తున్నారు. ఆయనను గురించి ప్రశ్నించుకుంటూ గొణుగుతున్నారు. ప్రియ విశ్వాసులారా మనలో చాలామంది యూదుల వలె అపనమ్మకంతో క్రీస్తుని నిజ దేవుడు కాదని అనుమానిస్తుంటాము. కొన్ని సార్లు మనము కూడా గొణుగుకుంటూ దేవుణ్ణి పరీక్షిస్తుంటాం. దేవునిపై మనము కూడా నిందలు వేస్తూ వ్యతిరేకిస్తుంటాము.   

ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము ఎలా ఉన్నాము అందుకే క్రీస్తు ప్రభువు అంటున్నాడు. తనను పంపిన  తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు. మిత్రులారా మనము దేని ద్వారా లేక ఎవరి ద్వారా ఆకర్షింప బడుతున్నాము, ఆలోచించండి. అనేక విధాలుగా మనము ఆకర్షింపబడుతున్నాం. మరి మనము దేవుని ద్వారా ఆకర్షింపబడుతున్నామా! దేవుని వాక్యానికి ఆకర్షింపబడుతున్నామా! ఆలోచించండి. అదేవిధంగా క్రీస్తు ప్రభువు నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందును అని అంటున్నాడు. మనము నిత్య జీవం పొందాలంటే ఏమి చేయాలి అంటే ఆయనను విశ్వసించాలి. ఒక గొప్ప విశ్వాసిగా విశ్వాస జీవితం జీవించాలి. అదే విధంగా క్రీస్తు ప్రభువు అంటున్నాడు ఈలోకము అనగా మనం జీవించుటకు ఆయన ఇచ్చు ఆహారము తన దేహము. అంటే ఎవరైనా క్రీస్తు శరీర రక్తాలను, దివ్యసత్ప్రసాదమును విశ్వాసంతో  స్వీకరిస్తారో, వారు నిరతము జీవిస్తారు. మరి మనము నిజమైం విశ్వాసంతో క్రీస్తుని శరీర రక్తాలను స్వీకరిస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ప్రార్ధన: జీవము గల దేవా, మాకు నీ జీవమును నీ శక్తిని ఇచ్చి నడిపింపుము. ఆనాడు ఏలియా ప్రవక్తను పోషించి, బలపరచి, నడిపించినావు. మమ్ము కూడా అదే విధముగా నడిపించుము. మేము మాలోని చేడు గుణములు విడనాడి నిన్ను పోలి నీ బిడ్డలుగా జీవించే అనుగ్రహం మాకు దయచేయుము. అదేవిధంగా మీ విశ్వాసులుగా పరస్పరం దయను,మృదుత్వమును మరియు క్షమించే గుణములను కలిగి జీవిస్తూ, పరలోకం నుండి దిగివచ్చిన జీవముగల ఆహారం  నీవే అని గుర్తించి, విశ్వసించి, నీ శరీర రక్తాలను విశ్వాసంతో స్వీకరించి నిత్య జీవం పొందే భాగ్యం దయచేయండి. ఆమెన్. 

ఫా. సురేష్ కొలకలూరి OCD

18వ సామాన్య ఆదివారం

 18వ సామాన్య ఆదివారం 

నిర్గమ 16:2-4,12-15, ఎఫేసీ 4:17,20-24, యోహాను 6:24-35

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు మానవుల కొరకై ఏర్పరచినటువంటి పరలోక విందు గురించి తెలుపుచున్నవి.
ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎడారిలో మన్నాను, పూరేడు పిట్టలను ఇచ్చిన విధానము చదువుకుంటున్నాం. ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాత భూమికి ప్రయాణమైనప్పుడు ఎడారిలో ఆకలిగొనిన సందర్భంలో వారు మోషే ప్రవక్తకు విరుద్ధముగా దేవునికి విరుద్ధముగా నడుచుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఆకలి బాధకు తట్టుకోలేక ఐగుప్తులో వారు భుజించిన మాంసాహార భోజనాన్ని మరియు రొట్టెలను తలచుకొని అచటనే ఉండి దేవుని చేతిలో చనిపోయిన బాగుండేది అని గొణగసాగిరి. అందుకుగాను దేవుడు వారికి స్వయముగా పరలోక దూతలు భుజించే భోజనము ఒసగి ఉన్నారు. ఈ యొక్క మొదటి పఠణంలో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు.
1. ఎడారిలో మన్నా అనేది ఒక విశ్వాస పరీక్ష ఎందుకనగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కావలసినది మొత్తం కూడా ఒక్కసారి సమర్పించవచ్చు కానీ అలాగా చేయలేదు. ఏనాటికి మన్నా ఆనాటికే ప్రభువు ఇచ్చారు అనగా వారు దేవుడి మీద ఆధారపడుతూ దేవుడి యందు విశ్వాసము కలిగి జీవించాలి అనే ఉద్దేశ్యం కొరకు. అదేవిధంగా ఎవరికి ఎంత కావాలో అంతే దేవుడు ఉండేలాగా చేస్తున్నారు
2. దేవుని యొక్క ఉదార స్వభావము. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరుద్ధముగా మాట్లాడినప్పటికీ ప్రభువు వారి యొక్క మాటలను పట్టించుకోకుండా ఇంకా సమయం వేచి ఉండకుండా వెంటనే సహాయము చేస్తూ వారి యొక్క ఆకలిని సంతృప్తి పరుస్తున్నారు. ఎదుటివారు చేసిన తప్పిదమును గుర్తించకుండా వారి యొక్క ఆకలిని తీర్చుట చాలా గొప్పది.
3. ఫిర్యాదు చేయటం. ఇది సర్వసాధారణంగా చాలామంది యొక్క జీవితంలో చూస్తూ ఉంటా. ఇశ్రాయేలు ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు, మార్తమ్మ మరియమ్మ మీద ఫిర్యాదు చేస్తున్నారు అలాగే యోహాను శిష్యులు యేసు ప్రభువు యొక్క శిష్యులు ఉపవాసము ఉండటం లేదని ఫిర్యాదు చేస్తున్నారు ఈ విధంగా చాలామంది దేవునికి ఫిర్యాదు చేస్తూనే ఉంటారు కానీ అది మంచిదా లేక చెడా అని కొంతమంది మాత్రమే గ్రహిస్తారు. మన జీవితంలో ఏదైనా కొరతగా అనిపిస్తే వెంటనే మనము దేవునికి ఫిర్యాదు చేయటానికి ముందుంటాం కానీ ఆయనను అర్థం చేసుకునటానికి ప్రయత్నం చేయము.
4. ఇశ్రాయేలీయుల యొక్క అప నమ్మకం. దేవుడు వారిని ఎర్ర సముద్రం గుండా కాపాడిన విషయం మరచితిరి, ఫరో సైన్యమును నాశనము చేసిన విధానం మరిచితిరి అలాగే దేవుడు వారిని ఆదుకుంటారు అనే విషయంలో కూడా మరచి జీవించారు అందుకే ప్రభువు వారి విశ్వాసాన్ని ఇంకా బలపరచడానికి ఆకాశము నుండి అద్భుత రీతిగా ఈ యొక్క పరలోక భోజనమును ప్రసాదిస్తున్నారు.
5. దేవుడు మనలను పోషిస్తాడు అనే నమ్మకం లేక ఇశ్రాయేలు ప్రజల వలె మనం కూడా ఆకలి దప్పులతో ఉన్నప్పుడు, కష్ట సమయంలో ఉన్నప్పుడు గొణుగుతూ అపనమ్మకంతో జీవిస్తుంటాం. ఈ యొక్క శారీరక సంబంధమైన ఆకలి దప్పులను గురించే ఆలోచిస్తుంటాము గాని దేవుని వైపు మన యొక్క దృష్టి మరల్చి ఆయనపై నమ్మకంతో మన కష్టాలను ఆయన చేతులలో ఉంచడానికి వెనుకంజ వేస్తాం. మన యొక్క భౌతిక భోజనమునకు ఆరాటపడతాం కానీ ఆధ్యాత్మిక భోజనం గురించి చింతించం మన గమ్యాన్ని మరచిపోయి భౌతిక చింతలకే ప్రాధాన్యతనిస్తాం.
  ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు పాత స్వభావమును విడిచి కొత్త స్వభావమును కలిగి జీవించమని తెలుపుచున్నారు. మన యొక్క పాత స్వభావమును విడిచి పెట్టకపోతే మనలో నూతనత్వము ఉండదు.  గోధుమ గింజ భూమిలో పడి నశించకపోతే అది అట్లే ఉండును కానీ నశించిన దానియందు ఒక కొత్త జీవము ఉద్భవించును అలాగే మనలో పాపము ఉన్నంత కాలము మనము క్రీస్తునకు జన్మించలేం మన యొక్క పాపమునకు మరణించిన సందర్భంలో క్రీస్తు ప్రభువు మనకు జన్మించిన వారముగా ఉంటాము. దివ్య సత్ప్రసాద స్వీకరణ ద్వారా క్రీస్తు ప్రభువు మనలోనికి వేంచేసి మన యొక్క జీవితములను నూతన పరచున్నారు. పునీత పౌలు గారు తన యొక్క పాత స్వభావమును విడిచిపెట్టి క్రీస్తు ప్రభువును వెంబడించారు.
ఈనాటి సువిషేశ పఠణంలో ఏసుప్రభు 'నేనే జీవాహారము' అని పలుకుచున్నారు. ఏసుప్రభు 5000 మందికి ఆహారమును వసగిన తర్వాత ఆయన కఫర్నామునకు వెళ్ళినప్పుడు చాలా మంది ప్రజలు ప్రభువును వెంబడించారు ఆ సందర్భంలో అడిగినా ప్రశ్న" ప్రభువా, మీరు ఎప్పుడూ ఇక్కడికి వచ్చితిరి? " ఈ ప్రశ్న వారు ఏసుప్రభు యొక్క బోధనలు వినటానికి అడగలేదు కేవలము వారు పోషింపబడ్డారు కాబట్టి ఏసుప్రభు దగ్గరికి వస్తే మరల వారి యొక్క శారీరక ఆకలి తీరిపోతుంది అనే ఉద్దేశంతో ప్రభువుని ప్రశ్న అడిగారు దానికి గాను ప్రభువు శాశ్వతమైన భోజనము కొరకు శ్రమింపుడు పలికారు. 
ప్రజలు తమ యొక్క పొట్టలను నింపిన రొట్టెలను గురించి  ఆలోచిస్తున్నారు కానీ ఆ పొట్టల నింపినటువంటి దేవుడిని మాత్రము తలంచలేదు. రొట్టెలను రొట్టెలగానే స్వీకరించారు కానీ అవి దేవుని యొక్క వరము అని విశ్వసించలేకపోయారు.
ఏసుప్రభు తానే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము అని తెలుపుచూ ఈ యొక్క ఆహారమును భుజించిన అతడు ఎన్నటికీ ఆకలిగొనడు అని ప్రభువు తెలుపుచున్నారు. మన యొక్క అనుదిన జీవితంలో కూడా దేవుడు మన కొరకై ప్రసాదించిన దివ్య సత్ప్రసాదం మనము ఎప్పుడు స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల పాటు ఈ యొక్క మన్నాను భుజించి వాగ్దాత భూమికి చేరుకున్నారు. మనము కూడా ఏసుప్రభు మన కొరకై వసగిన తన యొక్క దివ్య శరీర రక్తములను భుజించి మన జీవితములను మార్చుకొని పరలోక రాజ్యములో ప్రవేశించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దివ్యసప్రసాదము పట్ల ప్రేమను గౌరవమును అలవర్చుకొని జీవించాలి.
Fr. Bala Yesu OCD

లూకా 5: 33-39

 లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...