11, సెప్టెంబర్ 2021, శనివారం

24వ సామాన్య ఆదివారము(2)

యెషయా 50: 5-9

యాకోబు 2: 14-18 

మార్కు 8: 27-35

నేటి దివ్య పఠనాలు ప్రతి యొక్క విశ్వాసి తన విశ్వాస  జీవితములో నిజముగా దేవుణ్ణి గుర్తించారా లేదా అనే అంశము గురించి బోధిస్తున్నాయి. ఆయన శిష్యులుగా ఉండాలంటే సిలువ శ్రమలు అనుభవించాలని కూడా భోదిస్తున్నాయి. యేసు క్రీస్తు ప్రభువు నిజమైన మెస్సయ్య అని తమ యొక్క అనుదిన జీవితములో ఆయన్ను తెలుసుకుని గుర్తించారా అనే అంశమును ధ్యానించమని తల్లి శ్రీసభ మనలను కోరుతుంది.

ఈనాటి మొదటి పఠనములో బాధామయ సేవకుని యొక్క గీతమును చదువుకుంటున్నాము. యెషయా గ్రంధములో దాదాపు నాలుగు బాధామయ గీతాలు ఉన్నాయి. వాటిలో ఈరోజు మూడవది వింటున్నాము. 40 వ అధ్యాయము నుండి 55 వ అధ్యాయము వరకు నాలుగు బాధామయ సేవకుని గీతాలను యెషయా గ్రంధములో చూస్తున్నాము. ఈ యొక్క గీతము యేసు ప్రభువు యొక్క జీవితమును ఉద్దేశించి వ్రాయబడినది. ఇంకొక విధముగా చెప్పాలంటే ఒక నిజమైన సేవకుడు ఇశ్రాయేలు కోసము తనను తాను ఎలా సమర్పించుకుంటారో తెలుపుతున్నారు. 5వ వచనంలో సేవకుడు ఇలా పలుకుతున్నారు, "నేను అతనికి అడ్డు చెప్పలేదు, అతని మాట పెడచెవిన పెట్టలేదు". ఈ మాటలు యేసు ప్రభువుకు అన్వయించి చెప్పబడినవి ఎందుకంటే క్రీస్తు ప్రభవు తండ్రి చితమునకు, ప్రణాళికకు అడ్డు చెప్పలేదు. వానిని సంపూర్ణముగా నెరవేర్చారు. తండ్రి మాటను పెడచెవిన పెట్టలేదు. వానిని సావధానంగా విని తన యొక్క జీవితములో నెరవేర్చారు.  దేవునికి సంపూర్ణ విధేయత చూపి తండ్రికి ఇష్టమైన పుత్రునిగా జీవించారు. సేవకున్ని ఎంత హేళన చేసినా భరించారు. తనను కొట్టారు. ముఖము మీద ఉమ్మినారు. ఈ సందర్భములో ఆ సేవకుని యొక్క సహనము గురించి ధ్యానించుకోవాలి. తన జీవితములో ఎన్ని నిందలు పాలైనా సరే దేవుని చిత్తము నెరవేర్చుతున్నాననే సంతోషము ఇతనిలో చూస్తున్నాము. 

అదేవిధముగా దేవుని మీద ప్రేమ వలన మరియు పరులు రక్షణ పొందాలన్న ప్రీతీ వలన ఎన్ని రకములైన సమస్యలైనా ఎదుర్కొనుటకు సిద్దపడుతున్నారు. ఈ వాక్యాలలో ఇంకొక విషయము గమనించినట్లయితే ఈ సేవకునికి తన ప్రభువు మీద అపారమైన నమ్మకము. తనను ఆదుకుంటారని, దీవిస్తారని నా ప్రభువు నాకు తోడుగా ఉంటారని పలుకుచున్నారు. ఇదే గొప్ప విశ్వాసము మనందరిలో ఉండాలి. దేవుని కోసము మనము ఎన్ని శ్రమలనైనా ఎదుర్కోవాలి. బాధామయ సేవకుని వలె భరించాలి. కుటుంబములో కష్టాలు, సంఘములో కష్టాలు అన్ని చోట్ల బాధలే అయితే వాటన్నిటిని దేవునిపై మనకు గల ప్రేమతో సహించుకుని జీవితము ముందుకు కొనసాగించాలి. దేవుని చిత్తము నెరవేర్చుటలో కష్టాలు వస్తాయి. అయినప్పటికీ వాటిని ఎదుర్కొనాలి. దేవుడు మనకు తోడుగా ఉంటారనే నమ్మకము ఉండాలి. బాధామయ సేవకుడు తన బాధను మౌనముగా దిగమింగారు(సామెత 10:13, 19:29, 26:3), హేళన చేసినా సహించరు(2సమూ 10:4-5). 

రెండవ పఠనములో పునీత యాకోబు గారు విశ్వాసికి కేవలము విశ్వాసము మాత్రమే కాదు ఉండవలసినది, కానీ దానితో పాటు క్రియలు కూడా అవసరము అని తెలుపుతున్నారు. పునీత యాకోబు గారి మాటలు మనలందిరిని  కూడా ఒక నిజమైన, దేవునికిష్టమైన క్రైస్తవ జీవితము జీవింపుమని తెలుపుతున్నాయి. చాల సందర్భాలలో విశ్వాసము ఉంటే చాలు  అనుకుంటాము, క్రియలు అవసరము లేదని భావిస్తాము. కానీ, క్రైస్తవ విశ్వాసము అంటే కేవలము క్రైస్తవ బోధనలను నమ్మడము కాదు, కానీ క్రీస్తు నందు సంపూర్ణ విశ్వాసము ఉంచి అయన చెప్పినట్లు నడుచుకోవడమే. దేవుని యొక్క ఆజ్ఞలను, ఆదేశాలను అన్నింటినీ పాటిస్తూ ఆపదలో ఉన్నవారికి సహాయము చేయాలి. నిజముగా విశ్వాసము ఉందని జీవించేవారు సేవ మార్గాన్ని అనుసరించాలి. ఎందుకంటే విశ్వసిస్తేనే మనము ఏదైనా చేయగలము. పరలోక రాజ్యము ఉందని విశ్వసిస్తాము కాబట్టి దానిలో ప్రవేశించడానికి మంచి కార్యాలు చేస్తుంటాము. విశ్వసిస్తేనే దాని ప్రకారము నడుచోకోగలము. కార్యాలు లేని విశ్వాసము నిర్జీవము, వ్యర్ధము కాబట్టి, మనమందరము దేవుని యొక్క మాట ప్రకారము నడుచుకోవాలి. అబ్రాహామును విశ్వాసులకు తండ్రి అని పిలుస్తాము. ఎందుకంటే ఆయనలో చాల విశ్వాసము చూస్తున్నాము. అయన కేవలము విశ్వసించుట మాత్రమే కాదు చేసినది. దానితో పాటు దేవుడు చెప్పిన, ప్రేరేపించిన పనిని కూడా చేసారు. విశ్వాసము అదేవిధముగా క్రియలు కూడా ఉన్నాయి. మనలో కూడా చాల విశ్వాసము ఉంది. కానీ పని తక్కువగా  ఉన్నాయి. కాబట్టి విశ్వాసము ఉందని చెప్పుకుంటూ తిరగకుండా వాటితో పాటు క్రియలు కూడా చేస్తూ దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ దేవుని బిడ్డలుగా జీవించుదాము.

సువిశేష పఠనములో యేసు ప్రభువు రెండు ముఖ్యమైన విషయాలను తెలియపరుస్తున్నారు. 1 . తాను నిజమైన దేవుని కుమారుడు, 2 . మనుష్య కుమారుని మరణ, పునరుత్తానము ద్వారా రక్షణ కలుగుతుందని తెలియజేస్తున్నారు. సువిశేష పఠనములో యేసు ప్రభువు రెండు ముఖ్యమైన విషయాలను తెలియపరుస్తున్నారు. యేసుప్రభు కైసరియా ఫిలిప్పు ప్రాంతము చేరినప్పుడు తన శిష్యులను తానెవరిని అడుగుచున్నారు. ఈ ప్రశ్న మనందరినీ అడిగితే మరి మన సమాధానము ఏంటి? క్రీస్తును గురించి నీవేమి అనుకుంటున్నావు? కొందరు క్రీస్తు ప్రభువు స్నేహితుడని, తండ్రి అని, రక్షకుడని, మంచి కాపరి అని, స్వస్థతనిచ్చే  దేవుడని పిలుస్తారు. ఇది వారి యొక్క అనుభవమును బట్టి ఇచ్చిన సమాధానము. ఈ రోజు క్రీస్తును గురించి నీవేమి అనుకుంటున్నావు? అది ముఖ్యమైన విషయము. ఈ ప్రశ్నకు మన సమాధానము మన యొక్క దేవుని అనుభవమే చెబుతుంది. మన జీవితములో దేవుణ్ణి, అయన యొక్క సాన్నిధ్యాన్ని అనుభవిస్తే మనందరమూ కూడా క్రీస్తు ప్రభువు మనకు ఏమవుతారో తెలుసుకోవచ్చు.

ప్రభువు కైసరియా ఫిలిప్పులోనే ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారంటే దానికి ఒక అర్ధము ఉంది. కైసరియా ఫిలిప్పు అను పట్టణము అన్యుల మతమునకు చెందినది. అన్యుల యొక్క మత చరిత్రను కలిగి ఉన్నటువంటి ప్రాంతము ఇది. బాలు దేవతలను ఆరాధించుటకు, పూజించుటకు ఈ ప్రాంతము ఒక కేంద్రముగా ఉంటుంది. ఇక్కడ దాదాపుగా 14 దేవాలయాలు ఉండేవి. ఈ ప్రాంతములో గ్రీకు దేవుడు 'పాను' జన్మించాడని అక్కడి ప్రజల యొక్క విశ్వాసము. ఆ దేవుని పేరుగా ఈ ప్రాంతమును 'పానీయాసు' అంటారు. తరువాత హేరోదు కుమారుడు ఫిలిప్పు సీజర్ తిబెరిస్ పేరు మీదుగా ఒక దేవాలయమును నిర్మించారు. అదే విధముగా ఆ ప్రాంతము యొక్క పేరు కూడా కైసరయి అని దానికి తోడుగా ఫిలిప్పు అని జత చేసాడు. దానితో ఆ ప్రాంతమును కైసరియా ఫిలిప్పు అని అంటారు. ఈ ప్రాంతములో వారు కైసరను, అన్యదైవములను కొలిచేవారు. అందుకే క్రీస్తు ప్రభువు, అన్యులు పూజించే కైసరు లేక వేరే దేవుళ్ళు కాదు, తాను నిజమైన మెస్సయ్య అని తెలియజేయుటకు ఇలా అడుగుతున్నారు. యేసు ప్రభువు నిజముగా దేవుడని శిష్యులు గుర్తించారా లేదా అని తెలిసికొనుటకు ఈ ఇధముగా అడిగారు. కొందరు బాప్తిస్మ యోహాను అన్నారు, ఎందుకంటే ప్రభువు జీవితము యోహాను గారి జీవితము ఒకే విధముగా ఉన్నది. ఇద్దరు కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడినవారే. దేవుని కొరకు జీవించినవారే. అందుకనే ఆ పోలికలో చెప్పారు.

ఏలీయా అంటున్నారు ఎందుకంటే మలాకి 4:5 లో మెస్సయ్యకు ముందుగా ఏలీయా వస్తాడని చెప్పారు. చాల మంది క్రీస్తును ప్రవక్తగా, గొప్ప వ్యక్తిగా, అద్భుతాలు చేసే వానిగా మాత్రమే చూసారు. అందుకే ప్రభువు నిజముగా తాను దేవుడనని గుర్తించారా లేదా అని తెలుసుకొనుటకే ఈ విధముగా అడిగారు. పేతురు గారు ఎటువంటి సందేహము లేకుండా వెంటనే,"నీవు సజీవుడగు దేవుని కుమారుడని చెబుతున్నారు". మెస్సయ్య అని పలుకుచున్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు తన జీవితములో తన కుటుంబములో తన సంఘములో చేసిన అనేక అద్భుతాలను చూసారు. క్రీస్తు ప్రభువు ఎవ్వరు చెయ్యసాధ్యముకాని ఎన్నింటినో చేసారు. అందుకే పేతురు గారు  దృఢముగా నమ్మారు అయన మెస్సయ్య అని. కాని ఇక్కడ పేతురు గారికి కూడా మెస్సయ్య గురించి సరైన అవగాహన లేదు. మిగతా వారి వలె మెస్సయ్యను పేద ప్రజలకు న్యాయము చేసే ఒక రాజకీయ నాయకునిగా, ఒక విప్లవ పోరాటం చేసే వానిగానే చూసారు, కాని అయన ప్రజల కోసము మరణించే మెస్సయ్య అని కనుగొనలేకపోయారు. సువిశేష రెండవ భాగములో క్రీస్తు ప్రభువు తన శిష్యునకు ఉండవలసిన 3 షరతులను వివరిస్తున్నారు. 

  1. ఆత్మ పరిత్యాగము 

  2. సిలువ శ్రమలు అనుభవము 

  3. క్రీస్తు బాటలో నడచుట

  1. ఆత్మ పరిత్యాగము 

తన యొక్క ఆశలను త్యజించుకోవాలి. తన ఇష్టాలు త్యజించుకోవాలి, తన ప్రణాళికలు త్యజించుకోవాలి. మనము సమస్తమును త్యజించుకొని క్రీస్తు ప్రభువును వెంబడించాలి. ఈ రోజుల్లో త్యజించుకోవడము, వదులుకోవడము చాలా కష్టము. ఎందుకంటే బానిసత్వములో ఉన్నాము, బానిసలుగా ఉన్నాము కాబట్టి మనము బయటకు రాలేకపోతున్నాము. క్రీస్తు ప్రభువు అంటున్నారు తనను తాను త్యజించుకుంటేనే అయన శిష్యునిగా పిలువబడుతారు అని. ఆత్మ త్యాగముతో దేవుని కొరకు మన దేహాలను, జీవితాలను ఇష్ట పూర్తిగా సమర్పించుకునేందుకు సిద్ధపడాలి. దుష్ట స్వభావాలను త్యజించుకొని మనం హృదయాలను దేవునితో నింపుకొని జీవించాలి. మనల్ని మనం త్యజించుకోకుండా దేవుడిని వెంబడించుట కష్టం.

  1. సిలువ శ్రమలు అనుభవించాలి:

సిలువ అంటే కష్టాలు, బాధలు దానితో పాటు సిలువ అంటే ప్రేమ. మనం జీవితంలో ఎదురయ్యే శ్రమలు ప్రేమతో స్వీకరించి క్రీస్తుని అనుసరించాలి. సిలువ శ్రమలు అనుభవిస్తేనే సంతోషం ఉంటుంది. శ్రమలు అనుభవించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, ఇష్టపడి ఉండాలి. కొన్ని సార్లు మన సిలువలు మన శత్రువులే, మన సహోదరి సహోదరులే వారందరిని ప్రేమతో స్వీకరించి ముందుకు సాగాలి. మనం మన కష్టాలు, బాధలను ఆయనతో కలిసి భరిస్తూ మనలో స్వార్ధ చింతనకు మరణించి ఇతరులకు నిస్స్వార్ధంగా సేవలందించి జీవించాలి.

  1. క్రీస్తును అనుసరించుట: 

ఆయన యొక్క ప్రేమ ఆజ్ఞకు విధేయత చూపి ఆయన మాట ప్రకారం నడుచుకొనుటయే క్రీస్తును అనుసరించుట. దేవుని బాటలో నడవాలి. వాక్యం వినాలి, విన్న వాక్యం ప్రకారం జీవించాలి. మొదటి పఠనంలో విన్న బాధామయ సేవకుడు ప్రభువు మాటకు కట్టుబడి ప్రభువు మార్గంను అనుసరించి జీవించారు. మనం కూడా క్రీస్తు బాటలో నడిస్తే ఆయనకు ప్రియమైన శిష్యులుగా పిలవబడతాం. మనందరం మనం విశ్వాస జీవితంలో క్రీస్తు ప్రభుని గుర్తించి, ఆయన్ను అనుసరించి జీవించుదాం. విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండేటట్లు మనందరం ప్రయాస పడదాం.

ఆమెన్…

By Rev. Fr. Bala Yesu OCD

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...