1, జులై 2022, శుక్రవారం

14 వ సామాన్య ఆదివారం (2)

 14 వ సామాన్య ఆదివారం 

యెషయా  66: 10-14, గలతి 6: 14-18, లూకా  10: 1-12, 17-20

ఈనాటి దివ్య పఠనాలు దేవుని యొక్క సువార్తను ప్రకటించుట గురించి బోధిస్తున్నాయి. దేవుని యొక్క సువార్తను ప్రకటించుట ద్వారా దైవ రాజ్య స్థాపన జరుగుతుంది, దేవుని యొక్క శాంతి నెలకొల్పబడుతుంది. 

దేవుడు సువార్త సేవకులను ఎన్నుకొన్నది ప్రజల యొక్క జీవితంలో దేవుని యొక్క శాంతిని నెలకొల్పుటకు, వారిని పరలోకం చేర్చుటకు, ప్రజల మీద దేవుని ఆశీర్వాదాలను క్రుమ్మరించుటకు, ప్రభువు సువార్త సేవకులను ఎన్నుకొన్నారు. 

దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎందుకంటే వారు సువార్తను అనగా మంచి వార్తను, సంతోష వార్తను, ప్రకటించేప్పుడు ఆనందంగానే ఉండాలి. మనందరం  జ్ఞానస్నానం పొందిన వారు సువార్త సేవకు అర్హులే. మన యొక్క మాటల ద్వారా, జీవితం ద్వారా ప్రభువును ప్రకటించాలి. 

ఈనాటి మొదటి పఠనంలో దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా ఒక సంతోషకరమైన వార్తను తెలియజేస్తున్నారు. 

బాబిలోనియా బానిసత్వం నుండి యిస్రాయేలు ప్రజలు విముక్తులవుతారని, అధే  విధంగా వారు యెరుషలేముకు తిరిగి వచ్చినప్పుడు శాంతితో , సంతోషముతో ఉంటారని తెలియజేశారు. యిస్రాయేలు ప్రజలు 50 సంవత్సరాల తరువాత క్రీస్తు పూర్వం 587-537 కాలంలో యెరుషలేముకు తిరిగి వచ్చారు. 

అప్పుడే బాబిలోనియా బానిసత్వం నుండి తిరిగి వచ్చిన యిస్రాయేలు ప్రజలను దేవుడు పసికందుతో పోల్చుతున్నాడు. 

తిరిగి వచ్చిన ప్రజలు తమ సొంత ప్రాంతమును మరియు దేవుని నివాస నగరమైన యెరుషలేమును చూసి నిరుత్సహపడ్డారు. శిధిలమైన తమ దేశాన్ని అలాగే కూలిపోయిన తమ యొక్క దేవాలయంను చూసినవారు బాధపడ్డారు. అలాంటి ఒక బాధకరమైన స్థితిలో ఉన్న వారికి దేవుడు సంరక్షణను, ఆనందంను  కలుగజేస్తారని పలుకుచున్నారు. 

ఒక తల్లి -బిడ్డల యొక్క ఉదాహరణతో దేవుడు తన ప్రజల పట్ల ఏ విధంగా మేలుగుతారని ప్రవక్త తెలుపుచున్నారు. ఈ ఉదాహరణలో యావే దేవుడును   యెరుషలేముతో పోల్చబడటం జరిగినది . చంటి బిడ్డను యిస్రాయేలుతో  పోల్చారు. 

11 వ వచనంలో యెరుషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు అని పలుకుచున్నారు. అనగా బిడ్డలైన యిస్రాయేలు ప్రజలందరు కూడా దేవుని ద్వారా పోషించబడతారు. దేవుడు వారికి బలమును ఒసాగుతారు. దేవుడు వారి యొక్క ఎదుగుదలకు కారణం అవుతారని తెలుపుచున్నారు. 

యిస్రాయేలు ప్రజలు పుష్కలమైన దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకొని ఆనందింతురు. అని తెలుపుచున్నారు. 

12 వ వచనంలో దేవుడు, తిరిగి వచ్చిన యిస్రాయేలీయుల యొక్క అభివృద్దికి తోడ్పడుతానని తెలుపుచున్నారు.  వారి యొక్క సంపదలు  పొంగి పొరలినట్లు, వారి యొక్క ఖ్యాతి పేరుగునట్లు  చేస్తానని ప్రభువు  నుడువుచున్నారు. 

యావే దేవుడు తన యొక్క  అమితమైన ప్రేమను, అనురాగంను  యిస్రాయేలు ప్రజలకు  అందజేస్తారు. 

యిస్రాయేలు ప్రజలను చంటి బిడ్డలవలె తన చేతులలోనికి తీసుకొని ముద్దాడతారు. తన ఒడిలో ఒళలాడించేదరు.  యావే దేవుడు యెరుషలేముపై తన శాంతిని ప్రవహింపజేస్తారు, ప్రజలను  ఆనందోత్సాహములతో నింపుతారు. 

ఒక తల్లి తన కుమారుని ఓదార్చిన విధంగా దేవుడు కూడా యిస్రాయేలు ప్రజలను ఓదార్చుతారు. దేవుడు వారిని అదరిస్తారు. ఆదుకుంటారు. ఏ సమయంలోనైనా దేవుడు వారికి సహాయం చేయుటకు సిద్ధంగా ఉంటారని తెలుపుచున్నారు. 

యావే దేవుడు మరియు యిస్రాయేలు ప్రజల బంధం చాలా గొప్పది. చాలా సన్నిహితమైనది ఎందుకంటే దేవుడు స్వయంగా వారిని తన బిడ్డలుగా చేసుకున్నారు. తన సంరక్షణను కల్పిస్తానన్నారు. వారిని పోషిస్తానన్నారు, అధేవిధంగా వారిని ఆదుకుంటానని మరియు వారికి సంతోషంను, శాంతిని కలుగజేస్తానని ప్రభువు తెలుపుచున్నారు. 

ఈనాటి మొదటి పఠనంలో దేవుడి సేవకుడైన  యోషయా  ప్రవక్త తనకు అప్పజెప్పిన బాధ్యతను సక్రమంగా  నెరవేర్చారు. అంటే ప్రజలకు సందేశంను (యావే దేవుని సందేశం) అందజేయుట. ఒక ఎన్నుకొనబడిన ప్రవక్త చేయవలసిన పనిని యోషయా ప్రవక్త చేశారు. దేవుని ప్రజలకు దేవునికి మధ్య ఉన్న తల్లి బిడ్డల బంధం గురించి తెలిపారు. 

ఈనాటి రెండవ పఠనంలో  పౌలు గారు  గలతీయులకు రాసిన చివరి మాటల గురించి చదువుకుంటున్నాం. 

పౌలు గారు దేవుని చేత తన యొక్క సువార్త -సేవకై ఎన్నుకొనబడిన తరువాత ఆయన సేవలో ఉన్న సిలువ పరమార్ధం గ్రహించి తాను సిలువ యందే ఆనందిస్తున్నా,  అని అన్నారు. 

యేసు ప్రభువు సిలువ మరణం ద్వారా ఈ లోకాన్ని జయించారు, ఈ లోక వ్యామోహలన్నింటిని త్యజించి మనకు రక్షణము ప్రసాదించారు. 

ఆయన సిలువను మోసి తండ్రికి సంపూర్ణ విధేయత చూపించారు. మనయందు ఉన్నటువంటి అపారమైన ప్రేమవలనే క్రీస్తు ప్రభువు సిలువ మీద మరణం పొందారు. 

-సిలువలో రక్షణ ఉందని 

-సిలువలో ప్రేమ ఉందని 

-సిలువలో విజయం ఉందని 

-సిలువలో స్వస్థత ఉందని తెలుసుకున్న పౌలుగారే  సిలువ యందు నేను గొప్పలు చెప్పుకొనుచున్నాను అని పలికారు. 

పౌలుగారు గలతీయుల ప్రాంతం విడిచిపెట్టి  వచ్చినప్పుడు కొంతమంది యూదయ  క్రైస్తవులు యెరుషలేము నుండి గలతీయ ప్రాంతంకు వచ్చి అందరు యేసు ప్రభువు వలె సున్నతి పొందాలి అనే ఒక ఆసత్య ప్రచారం లేక బోధన చేశారు.  ఎందుకంటే యేసు ప్రభువు కూడా సున్నతి పొందారు కాబట్టి మీరు కూడా సున్నతి పొందాలని ప్రకటించారు. దానికి సమాధానంగా వారి యొక్క అసత్య బోధనలను ఖండిస్తూ  పౌలుగారు, యేసు క్రీస్తును విశ్వసించి ఆయన యందు జ్ఞాన స్నానం పొందిన  ప్రతి ఒక్క వ్యక్తి  నూతన సృష్టియే అని తెలిపారు. 

ఒక విధంగా విశ్వాస పరంగా సందిగ్ధతలో ఉన్న గలతీయులకు పౌలు చక్కని భోదన చేశారు. యేసు క్రీస్తునందు జ్ఞాన స్నానం పొందేవారు, దేవుని యొక్క పవిత్రాత్మను పొంది నూతన సృష్టిగా రూపాంతరం చెందుతున్నారని, దేవుని బిడ్డలుగా తయారవుచున్నారని పౌలుగారు తెలిపారు. 

దేవునికి చెందిన వారిగా ఉండాలంటే కేవలం సున్నతి కాదు అవసరం. ఆయన యందు సంపూర్ణ విశ్వాసం అని పౌలుగారు తెలిపారు, అందుకే నేను సిలువ యందు గొప్పలు చెప్పుకుంటున్నాను అని అన్నారు.  పౌలుగారు పరిసయ్యుల వంశమునకు చెందిన వ్యక్తియైన సున్నతి కలిగిన వ్యక్తి అయినప్పటికి  జ్ఞాన స్నాన విలువను తెలుసుకొని విశ్వాస పాత్రుడిగా జీవించారు. 

ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు తన యొక్క సువార్త సేవకు శిష్యులను పంపించే  విధానం చదువుకుంటున్నాం. 

సువార్త సేవకు  పంపించే ముందు యేసు ప్రభువు శిష్యులకు  కోన్ని సూచనలు వారు చేయబోయే పరిచర్య గురించి ఇస్తున్నారు. 

ఈ సువిశేష భాగంలో మొదటిసారిగా యేసు ప్రభువు 72 మందిని సువార్త పరిచర్యకు నియమించి, వారిని ఇద్దరిద్దరిని చొప్పున, తనకు ముందుగా పంపారని సువార్తికుడు తెలియజేశారు. మత్తయి, మార్కు, సువార్తికులు కేవలం 12 మంది శిష్యుల యొక్క పరిచర్యను గురించి తెలిపితే, లూకా గారు మాత్రము 12 మంది శిష్యులతో పాటు 72 మంది శిష్యుల  పరిచర్యను కూడా వివరిస్తున్నారు. 

70 అనే సంఖ్య యిస్రాయేలు ప్రజల జీవితంలో గుర్తుండిపోయే సంఖ్య ఎందుకంటే , యకొబు యిస్రాయేలు నుండి ఐగుప్తుకు క్రొత్త జీవితం జీవించడానికి వెళ్లేటప్పుడు 70 మందిని తన వంశస్తులను తీసుకొని వెళ్లారు. వారితో ఒక నూతన రాజ్యం స్థాపించుటకు యాకోబుగారు వెళ్లారు. ఆది 46. 

నోవా కాలంలో కూడా 70 దేశములు /రాజ్యముల గురించి తెలుప బడింది. ఆది 10 వ ఆధ్యాయం. మోషే ప్రవక్త దేవుని ప్రజలను నడిపించుటకు 70 మందిని ఎన్నుకుంటున్నారు. వారు దేవుని మహిమను చూస్తున్నారు. నిర్గమ 24:1,9. 

70 మంది యిస్రాయేలు యొక్క నాయకులు /పెద్దలు . సంఖ్యా 11:16 

ఏలీము వద్ద 70 ఖర్జూరపు వృక్షములు వున్నాయి. నిర్గమ 15:17. 

యూదుల యొక్క sanhedrin సభయమండలి 70 మందితో కూడినది. వారే నడిపించేవారు, నిర్ణయాలు తీసుకునేవారు. 

యూదుల యొక్క నమ్మకం ఏమిటంటే అప్పట్లో  కేవలం 70   దేశాలు మాత్రమే ఉన్నాయి అన్నది. 

యేసు ప్రభువుకు అనేక మంది శిష్యులున్నప్పటికి కేవలం ఈ 70/72 మంది మాత్రమే ప్రభువును చాలా దగ్గరగా అనుసరించారు. 

ఇద్దరిద్దరిని పంపిస్తున్నారు ఎందుకంటే, ఇద్దరి సాక్ష్యం ఒక విషయం ఆమోదించుటనికి సహాయ పడుతుంది. ద్వితీయో 19:15, మత్తయి 18:16 , ద్వితీయో 17:6 

అధే విధంగా ఇద్దరు వ్యక్తులు పరస్పరం సహకరించుకొనుటకు, పరస్పరంప్రోత్సాహించుటకును, తోడుగా ఉండుటకు దేవుడు వారిని ఇద్దరిద్దరి చొప్పున పంపిస్తున్నారు. 

ప్రభువు వారిని పంపించింది ఎందుకంటే తన కొరకు మార్గమును సిద్ధం చేయుటకు, తన రాజ్య స్థాపన కొరకు అదే విధంగా దైవ ప్రేమను అందచేసి ప్రజల యొక్క హృదయంలో  శాంతిని నెలకొల్పుటకు  ప్రభువు  వారిని పంపిస్తున్నారు. 

మనల్ని కూడా దేవుడు సువార్త పరిచర్యకు జ్ఞాన స్నానం ద్వారా ఎన్నుకొంటున్నారు. 

ప్రభువు సేవ చేయుట కొరకు పని వారి కోసం ప్రార్ధించమని పలుకుచున్నారు. పంట విస్తారము కాని పనివారు లేరు కాబట్టి పని వారి కోసం ప్రార్ధించమని ప్రభువు పలికారు. విశ్వాసుల సంఖ్య అధికమే కాని సువార్త సేవ చేసే వారి సంఖ్యయే  తక్కువ కాబట్టి వారి కొరకు ప్రార్ధించమని ప్రభువు అంటున్నారు. 

ఈ 72 మంది యొక్క పని మానవుల ప్రణాళికా కాదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుడే వారి ద్వారా పని చేస్తారు. 

ప్రభువు శిష్యులను పంపించె ముందు వారికి గొప్ప గొప్ప వాగ్ధానాలు చేయలేదు వారి జీవితంలో కష్టాలు ఉంటాయని తెలిపారు అందుకే ప్రభువు నేను మిమ్ము తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలవలె  పంపిస్తున్నారు అని పలికారు. లూకా 10:3. 

వాస్తవానికి తోడేళ్లకు గొర్రె పిల్లలకు  ఎటువంటి బంధం లేదు. తోడేళ్ళు గొర్రెలను చంపుకొని తింటాయి, హింసిస్తాయి, గాయ పరుస్తాయి. అధే విధంగా తోడేళ్ల మనస్తత్వం కలిగిన వ్యక్తులు కూడా వుంటారని  ప్రభువు తెలిపారు. అంగీకారం  మరియు తిరస్కారం అన్నీ చోట్ల  ఉంటాయి అని ప్రభువు తెలిపారు. 

సువార్తకు పంపబడిన వారు  కూడా గొర్రె పిల్ల మనస్సు కలిగిఉండాలి. వినమ్రత, హాని చేయకుండుట,  యుద్దం చేయకుండుట (non - combative) లక్షణాలు కలిగి జీవించాలి. అపో 20:28-31 , యోహను 15:20 , యోహను 16:1-4, పిలిప్పీ 1:29, 2 తిమోతి  3:12. 

దేవుని కొరకు ఎన్ని కష్టాలు   అయినా అనుభవించుటకు సిద్ధంగా ఉండాలి దైవ సేవకులు. 

సువార్త సేవకు బయలు -దేరేటప్పుడు వారితో ఏమి తీసుకొని  పోరాదని ప్రభువు తెలుపుచున్నారు. ఎందుకంటే వారు సంపూర్ణంగా దేవుని మీదనే ఆధారపడి జీవించాలి. వారి అనుదిన జీవితంకు సైతం అవసరమైన వస్తువులను  సైతం ప్రభువు పరిత్యజించమని కోరుచున్నారు. దేవుడే వారికి అన్నియు సమకూర్చుతారు. వారి యొక్క ఆలోచనలు ధనం గురించి , అధికారం గురించి మిగతా ఈ లోక విషయాలు గురించి ఉన్నట్లయితే వారు ప్రభువు యొక్క ముఖ్య ఉద్దేశ్యమును మరచి పోతారని ప్రభువు వారిని ఏమి తీసుకొని పోరాదని పలికారు. మొదటిగా దేవుని రాజ్యం వేదకితే అన్నీ ప్రభువే సమకూర్చుతారు. మత్తయి 6:33 . పిలిప్పీ 4:11-13, కీర్తన 37:3,5. సామెతలు 3:5 . 

దేవుని సేవకులు,  ప్రభువు యొక్క శాంతిని ప్రకటించాలి ఆహ్వానించే వారు ఉన్నట్లయితే వారి యొక్క ముఖ్య ఆహ్వానం మన్నించి, ప్రభువు యొక్క రాజ్యం గురించి ప్రకటించమన్నారు. ఆహ్వానించే వారు లేకపోతే పాద దూలిని వదలి అక్కడ నుండి వెళ్ళమని ప్రభువు పలుకు చున్నారు . 

దేవుని చేత పంపబడిన వారు ఆయన యొక్క రాజ్యం గురించి ప్రకటించాలి. అదియే వారి యొక్క ప్రధమ  బాధ్యత. వారి యొక్క పరిచర్య సేవ జీవితంలో ఎల్లప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. 

-దేవుని నుండి అంతా ప్రారంభించాలి 

- దేవుని మీద ఆధారపడి జీవించాలి 

-దేవునికొరకు హింసలు అనుభవించుటకు సిద్దంగా ఉండాలి. 

-దేవుడే వారి జీవితంకు కేంద్రం  కాబట్టి ఆయన కొరకు సమస్తము త్యజించాలి. 

-దైవ ప్రేమను పంచాలి, నిస్వార్ధ సేవ చేయాలి

- రోగులను స్వస్త పరచాలి , దేవుని శాంతిని ప్రకటించాలి. 

-దేవుని  ఉద్దేశం నెరవేర్చుట మరచి పోరాదు 

మనందరం కూడా  దేవుని కొరకు జీవించి దేవుని రాజ్య స్థాపన కోసం కృషి చేద్దాం, దేవుని సాక్షులై జీవించుదాం. 

Rev. Fr. Bala Yesu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...