18, సెప్టెంబర్ 2021, శనివారం

25 వ సామాన్య ఆదివారము (౩ )

 25 వ సామాన్య ఆదివారము (౩ )

నేటి దివ్య పఠనాలు దేవుని దృష్టిలో గొప్పవారిగా ఉండటానికి దేవుని చిత్తము నెరవేర్చుతూ యేసు క్రీస్తు వలె మనమందరము సేవాభావం కలిగి జీవించాలని బోధిస్తున్నాయి. ధనము, అధికారము, పేరు ప్రతిష్టలను సంపాదించుకుని గొప్పవ్యక్తిగా గుర్తింపుపొందటం కాదు నిజమైన గొప్పతనము. కానీ సేవ చేస్తూ గొప్పవారిగా దేవుని చేత పరిగణించబడాలని నేటి పఠణములు మనకు తెలియపరుస్తున్నాయి. దానికి మనకు పరలోక జ్ఞానము అవసరమని తెలియపరుస్తున్నాయి నాటి పఠనములు.

 ఈనాటి మొదటి పఠనములో నీతిమంతమైన మార్గమును  ఎంచుకుని జీవించమని గ్రంథ రచయిత పలుకుచున్నారు. నీతిమంతుడంటే పడనటువంటి వ్యక్తులు దుష్టులు ఉన్నారు. వారి యొక్క మూర్ఖ బుద్ధి వలన నీతిమంతుని యొక్క మంచితనమును, సేవాభావమును అర్ధము చేసికొనక అయన పీడను వదిలిచుకోవాలనుకుంటున్నారు. దుష్టులు దైవ భయము లేనివారు, దేవుని నియమాలు కానీ చట్టాలు కానీ పాటించని వారు.  ఆయనను ఎందుకు చంపాలనుకుంటున్నారు అంటే, అయన యొక్క కార్యాలు వారికి గిట్టుటలేదు, వారి యొక్క ఆనందాలకు అడ్డుగా ఉంటున్నారు. మాటలు యేసు ప్రభువు యొక్క జీవితానికి అక్షరాలా సరిపోతాయి. అలాగే దేవుని హెచ్చరికను గుర్తు చేసి శ్రమలు పొందిన ప్రతి ప్రవక్తకు వర్తిస్తాయి. అయన యొక్క సేవ కార్యాలు గిట్టనటువంటి వారే ఆయనను  శిక్షకు గురిచేసారు.

ఇది అసూయ వల్ల జరగవచ్చు లేక కోపము, పగ, స్వార్ధము వల్లనైనా అయ్యుండవచ్చు. నీతిమంతునికి మన కార్యాలు నచ్చుటలేదు. ఎందుకంటే దుష్టులు దేవుణ్ణి తెలుసుకొనక ఇంకా పాపములోనే జీవిస్తూ దేవునికి దూరముగా ఉంటున్నారు. అసత్య బోధనలు చేస్తున్నారు, అన్యాయముగా పేదలను దోచుకుంటున్నారు, నీతిమంతముగా జీవించుటలేదు. అందుకే నీతిమంతుడు వారిని హెచ్చరిస్తున్నారు. దానివలననే ఆయనను శిక్షించాలనుకుంటున్నారు. బాప్తిస్మ యోహాను గారు కూడా ఆనాటి హేరోదును, హేరోదియాను హెచ్చరించాడు. అది సహించలేక హేరోదియ అయన ప్రాణము తీసింది. ఇంకొక విషయము ఏమిటంటే దుష్టులు సాక్షాత్తు దేవునికే ఒక పరీక్ష పెడుతున్నారు. ఏమని అంటే నీతిమంతుడిని దేవుడు కాపాడుతారా లేదా అని పలుకుచున్నారు. ఇది మొత్తము యేసు ప్రభుని జీవితములో జరిగిన యధార్థ సంఘటన. ఆయనను హింసించారు, అవమానించారు, పరీక్షించారు, చావుకు గురిచేసారు. చివరికి మూడవనాడు తాను నమ్ముకున్న తండ్రి ఆయనకు పునరుత్తానము దయచేసారు. తండ్రి తన కుమారుని పట్ల చేసిన గొప్ప కార్యము ఇది.

ఈనాటి రెండవ పఠనములో యాకోబు గారు పరలోక జ్ఞానమునకు, భూలోక జ్ఞనమునకు ఉన్న వ్యత్యాసము గురించి తెలియపరుస్తున్నారు. రెండు రకాల వివేకాలు అందరిలోనూ కనిపిస్తాయి, సంఘములలో కూడా ప్రతిబింబిస్తున్నాయి.

కోరికలు లౌకిక జ్ఞానమునకు సంబంధిచినవి. పరలోక జ్ఞానము వల్ల మనమందరము ప్రేమతో జీవిస్తాము, స్నేహపూర్వకంగా ఒకరితో ఒకరు మెలుగుతాము. వినయముతో ఉంటాము. అధికార వాంఛలకు వెళ్లము. మనము కొన్ని సార్లు ప్రార్ధించినప్పుడు అవి మనము పొందలేము. ఎందుకంటే అవి దేవుని ప్రణాళికలకు వ్యతిరేకముగా ఉంటాయి కాబట్టి. మనము అడిగే ప్రతి వరము కూడా దేవుణ్ణి మహిమ పరిచే విధముగా ఉండాలి. దేవుని చిత్తము నెరవేర్చే లాగా ఉండాలి. మనము పొందే ఆరోగ్యము వల్ల, వస్తువుల వల్ల, భోజనము వలన, వస్త్రముల వలన మనము దేవునికి దగ్గరగా రావాలి. వాటి ద్వారా దేవుణ్ణి స్తుతించి మహిమ పరిస్తే అప్పుడు దేవుడు మన ప్రార్ధన తొందరగా ఆలకిస్తారు.  లౌకిక జ్ఞానము వలన కలిగిన శారీరక కోరికలు, వ్యామోహములు మనలను మంచి జీవితము నుండి గాడి తప్పిస్తాయి.

సువిశేష పఠనములో యేసు ప్రభువు మరొకసారి తన మరణ ప్రస్తావన తీసుకువస్తున్నారు. తన మరణము గురించి భోదిస్తూ యేసు ప్రభువు తన యొక్క శిష్యులలో అణుకువ, సేవాభావం ఉండాలని బోధిస్తున్నారు. యేసు ప్రభువు తన యొక్క మరణము గురించి చెప్పినప్పుడు శిష్యులలో ఇహలోక కోరికలు మొదలయ్యాయి. యేసు ప్రభువు తరువాత నాయకత్వ భాద్యతలు ఎవరు స్వీకరించాలి. ఎవరు ప్రభువు యొక్క ప్రజలను నడిపించాలని వారి యొక్క ఆలోచనలు, కోరికలు.   శిష్యులు కూడా ఆశతో ఉన్నారు దేవుని రాజ్యము స్థాపించినప్పుడు వారి యొక్క స్థానములు ఎలా ఉంటాయో అని. మత్తయి 19:23-24 .

శిష్యులలో ఎవరు గొప్ప అని చర్చ వచ్చింది ఎందుకంటే వారందరికీ కూడా -ఒక గుర్తింపు కావాలి-ఆదికారం కావాలి, -ధనం కావాలి ,గౌరవం కావాలి ,ఆత్మ సంతృప్తి కావాలి.

మనము కూడా మన కుటుంబములో ఉన్నవారు మరణించేటప్పుడు, తరువాత ఎవరు కుటుంబ బాధ్యతలు స్వీకరించాలని ఆలోచిస్తారు. అలాగే  శిష్యులు కూడా ఆలోచించారు. అప్పటివరకు  యేసు ప్రభువు శిష్యులుగా  ఉండాలంటే , యేసు ప్రభువు సీలువను ఎత్తుకొని  నన్ను  అనుసరించాలన్నారు, అన్నీ వదలి వేసి తనను వెంబడించాలని చెప్పారు కానీ  ఆయన తన  మరణం గురించి చెప్పిన తరువాత శిష్యుల ఆశలు , ఆశయాలు మారుతున్నాయి. అది చూసిన గురువు యొక్క హృదయము ఎంతగా తల్లడిల్లి ఉంటుందో  ఊహించాలి. శిష్యులు ఎవరు గొప్ప అని వారు వాదించుకునేది  వారి యొక్క వ్యక్తిత్వం గురించి కాదు, క్వాలిటీ గురించి కాదు కానీ డబ్బులు గురించి , అధికారము గురించి , పేరు గురించి. దేవుని యొక్క రాజ్య స్థాపనలో వారి యొక్క గొప్ప గొప్ప స్థానాల గురించి ఆలోచనలే.  శిష్యులు ముఖ్యముగా ముగ్గురు వ్యక్తులను చూస్తున్నారు, పేతురు , యోహను , యొకోబు  వీరు ముగ్గురు కూడా ప్రత్యేకం ఎందుకంటే యేసు ప్రభువు చేత ప్రత్యేకంగా గౌరవించబడినవారు.

అందుకే మీగతవారు అసూయతో ఎవరు గొప్ప అని ఆలోచించారు. యేసు  ప్రభువు నిజమైన  గొప్పతనము  అంటే సేవ చేయటము అని శిష్యులకు తెలియ పరిచారు. పర లోక జ్ఞానం  కలిగిన వారికి  ఇలాంటి  హృదయము ఉంటుంది. వాషింగ్టన్  ఇర్విన్ అనే  రచయిత  ఒకసారి ఇలా వ్రాశాడు. గొప్ప  మనస్సు గల  వారికి  లక్ష్యాలుంటాయి , చిన్న మనస్సు కలవారికి  కొరికలుంటాయి.  యేసు ప్రభువు  శిష్యుల మనస్సు చిన్నది కాబట్టియే  వారికి కోరికలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన ప్రక్కన గొప్ప స్థానాన్ని ఆశించారు. ప్రభువు దృష్టిలో  గొప్పతననికి వేరొక అర్దము ఉంది.  అణకువతో , ప్రేమతో సేవలు చేసేవారే ఆయన దృష్టిలో  గొప్పవారు, అందుకే ప్రధమ స్థానం ఆశించేవారు అందరికీ  ముందుగా సేవకుడిగా ఉండాలని తెలియపరిచారు. ఇతరుల యొక్క అవసరతలను గుర్తించి వారికి సేవ చేస్తే అందులో నిజమైన గొప్పతనం ఇమిడి ఉంది. మదర్ తెరాసా గారు గొప్ప వ్యక్తిగా పిలువబడినది ఎందుకంటే ఆమె సేవ చేసినది కాబట్టి.  ఆమె ఆదికారం కోసం , పేరుకోసం వేదకలేదు. అవసరంలో ఉన్న వారికి సేవ చేసింది అందుకే ఆమెను మనం గొప్ప వ్యక్తిగా పిలుస్తున్నాం. యేసు ప్రభువు కూడా తాను  తనను తాను తగ్గించుకొని సేవకరూపం దాల్చి శిష్యుల యొక్క పాదాలు కడిగారు. ఆయన ఆస్తులు కావాలనుకోలేదు. పుట్టినప్పుడు మంచి ఇల్లు ఆశించలేదు.  ఆధికారము ఆశించలేదు. పేరు ఆశించలేదు. ఇవేమీ ఆశించకుండా  మనందరి అవసరాలనుబట్టి సేవ చేశారు. 

మనం కూడా దేవుని దృష్టిలో గొప్ప వారిగా ఉండాలంటే  లోక అధికార, ఆశలు వదలిపెట్టి  దేవుని సేవ చేయాలి.  కొన్ని సార్లు దేవుని సేవ  చేసేవారు   కూడా స్థానాలకోసం , ఆధికారం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తారు. ఇది వ్యర్ధము . మనమందరము సేవకుని మనస్సు కలిగి ఉండాలి. సేవకుడు సేవకు మాత్రమే ఎన్నుకోబడినవాడు,మనము కూడా దేవుని సేవ చేయడానికి మాత్రమే పిలువబడ్డాము. ప్రభువు ఇంకొక చక్కని ఉదాహరణ ఇస్తున్నారు. ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని గొప్పవారు కాదలచిన వారు  చిన్న బిడ్డను తీసుకొని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని స్వీకరించువాడు నన్ను స్వీకరించువాడగును అని పలికారు. చిన్న పిల్లవాడిని స్వీకరించుట అంటే ఆయనలో ఉన్న గుణాలను స్వీకరించుట అని అర్దము. 

-చిన్న పిల్లలకు అధికార  వ్యామోహము ఉండదు. 

-చిన్న పిల్లలు నిర్మలమైన మనస్సు కలిగి జీవిస్తారు. 

-వారిలో వినయము ఉంటుంది. 

-సంఘములో చిన్న పిల్లవాడికి  ఎటువంటి అధికారం ఉండదు, పేరు కూడా ఉండదు, ఆయన ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మీదనే ఆధారపడి జీవిస్తాడు. చిన్న పిల్లలకు సంఘములో ఎటువంటి హోదా ఉండదు. కాబట్టి శిష్యులు అలాంటి మనస్సు కలిగి జీవించాలి. 

1. చిన్న పిల్లలను ఆహ్వానించుటలో మనకు వినయము ఉండాలి. ఎందుకంటే పెద్దవారికి నేర్పించుట సులభమే కానీ పిల్లలకు  అన్నీ a to z వరకు మొత్తము నేర్పించాలంటే  నిజంగా  ప్రతి ఒక్కరి లో వినయము ఉండాలి. 

2. పిల్లల్ని ఆహ్వానించుటలో మనకు ధైర్యం ఉండాలి.  చిన్న పిల్లల భాద్యత చాలా గొప్పది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి రిస్క్ తీసుకోవడానికైనా సిద్దముగా ఉండాలి. 

3. పిల్లల్ని ఆహ్వానించుటలో మనకు నమ్మకం ఉండాలి. -చిన్న పిల్లవాడు ఎదుగుతాడు , మంచివాడిగా మారతాడు, నేర్చుకుంటాడు, ప్రేమిస్తాడు , అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉండాలి. 

4. చిన్న పిల్లల్ని ఆహ్వానించుటలో సహనం ఉండాలి- పిల్లలకు నేర్పించేటప్పుడు సహనం కోల్పోతే ఏమి చేయలేము. కొన్ని సార్లు నెమ్మదిగా ఉండవచ్చు అయినప్పటికీ నేర్పించేవారు సహనముతో  ఉండాలి. 

5. చిన్న పిల్లల్ని ఆహ్వానించుటలో క్షమ ఉండాలి- అనేక సార్లు పిల్లలు మాట వినకపోవచ్చు అయితే క్షమించాలి. చేసిన తప్పు పదే పదే చేయవచ్చు. అనేక సార్లు పడిపోవచ్చు అయినప్పటికీ క్షమించి జీవించాలి. 

ఒక నీతిమంతుడైన సేవకుడిగా ఇవన్నీ మన జీవితములో పాటిస్తే  దేవుని దృష్టిలో గొప్పవానిగా పరిగణించబడతాము. 

By  Rev Fr. Bala Yesu OCD

 

25వ సామాన్య ఆదివారము

25వ సామాన్య ఆదివారము

సొలొమోను జ్ఞానగ్రంధము 2 : 12 , 17 -20 

యాకోబు 3 : 16  - 4 : 3 

మార్కు  శుభవార్త 9  : 30  - 37 


ఈనాటి దివ్య గ్రంధ పఠనాలు నీతిమంతుడు మరియు దుష్టుడి జీవితం గురించి మాట్లాడుతున్నాయి. క్రీస్తు శిష్యులుగా, క్రైస్తవులుగా మనం నీతిమంతుని జీవితం జీవించి క్రీస్తువలె సేవక రూపం దాల్చాలని  ఆహ్వానిస్తున్నాయి.

మొదటి పఠనాన్ని గమనించినట్లయితే క్రీస్తు పూర్వం 50 వ సంవత్సరములో  అలెగ్జాండర్ పరిపాలన కాలములో ఇశ్రాయేలు ప్రజలను  బానిసలుగా తీసుకొనిపోయినపుడు ఆ ప్రవాస  కాలములో కొంతమంది అక్కడ మిగిలిపోయారు తరువాత కొంతమంది తిరిగి వచ్చారు. మిగిలిపోయినవారు అక్కడ గ్రీకు సంస్కృతికి మరియు తత్వ శాస్త్ర విధానానికి ప్రభావితమై హీబ్రూ సంస్కృతిని విడి  జీవించారు, తిరిగి వచ్చినవారు హీబ్రూ సంస్కృతికి కట్టుబడి ఉన్నారు. ఆలా కట్టుబడిన వారిని నీతిమంతులుగాను, విడనాడిన వారిని దుష్టులు గాను  పరిగణించారు.

​స్వల్పకాలిక జీవిత ఆనందం తో   శోక మయమైన జీవితం మరణం తథ్యం. పూర్వుల సంప్రదాయములు, ధర్మ శాస్త్రానికి  కట్టుబడి దేవుని ఆజ్ఞలను పాటించువారు దేవుని జ్ఞానం కలిగిన వారు.  వారు ఏ విధముగా ఉంటారు అంటే కీర్తన కారుడు చెప్పినట్లు ప్రభువుని ధర్మ శాస్త్రమును ఆనందముతో చదివి ధ్యానించువాడు, అన్యాయమును ఎదిరించువాడు, దుష్టులకు, పీడితులకు ఆశ్రయము, చెడును ద్వేషించువాడు, దైవ ప్రజకు వెన్ను దన్నుగా నిలిచేవాడు.

సువిశేష  పఠనంలో మూడు అంశాలను చూస్తాము అవి 

చివరి గమ్యము 

మొదటి స్థానము 

చిన్నపిల్లల మనస్తత్వము 

యేసు ప్రభువు జెరూసలేముకు ప్రయాణము అంటే చివరి ఘట్టమునకు ప్రయాణము తన సిలువ, మరణ, పునరుత్థానమును  సూచిస్తుంది. ప్రభువు తాను ఈ లోకము నుండి భౌతికంగా వెళ్ళేముందు తన శిష్యుల హృదయాలలో తన సందేశాన్ని ఉంచాలని కోరుకున్నాడు. ఒక నాయకుడు తాను  వెళ్లిపోయిన తరువాత కూడా తన శిష్యులు పాటించడానికి కొన్ని నియమాలను, నిబంధనలను ఇస్తాడు కానీ ప్రభువు వారి హృదయాలలో ఉంచాలని కోరుకున్నారు. అందుకే తన మరణ, పునరుత్థానముల  గురించి చర్చిస్తూ తాను ఈ లోకమునకు వచ్చిన పని నెరవేర్చారా లేదా అని తెలుసుకుంటున్నారు. ఇది ఈలా ఉండగా శిష్యులు మాత్రమూ మొదటి స్థానము గురించి ఎవరు గొప్ప అన్న విషయము గురించి చేర్పించు కొనుచున్నారు. వారి మాటలు విని, వారి  హృదయములను ఎరిగి వారిని అడిగినప్పుడు సిగ్గుతో ఏమి బదులివ్వకుండా నిశ్శబ్దముగా ఉండిపోయారు. అంటే వారు చేర్చించుకొనేది తప్పు అని ఎరిగారు. దీనిని ఎరిగిన ప్రభువు అంటున్నారు ఎవడైతే చిన్నపిల్లల మనసు కలిగి ఉంటారు అట్టి వారు మొదటి వ్యక్తిగా ఉంటారు. నువ్వు సేవకుడిగా ఉండి   చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటే, నువ్వు నీతిమంతునిగా పరిగణించబడాలంటే ఈ యొక్క మనస్తత్వం కలిగి ఉండాలి. చిన్నపిల్లలవలె కపట జీవితము    లేకుండా ఉండాలి.
 By Br. Lukas

11, సెప్టెంబర్ 2021, శనివారం

24వ సామాన్య ఆదివారము(2)

యెషయా 50: 5-9

యాకోబు 2: 14-18 

మార్కు 8: 27-35

నేటి దివ్య పఠనాలు ప్రతి యొక్క విశ్వాసి తన విశ్వాస  జీవితములో నిజముగా దేవుణ్ణి గుర్తించారా లేదా అనే అంశము గురించి బోధిస్తున్నాయి. ఆయన శిష్యులుగా ఉండాలంటే సిలువ శ్రమలు అనుభవించాలని కూడా భోదిస్తున్నాయి. యేసు క్రీస్తు ప్రభువు నిజమైన మెస్సయ్య అని తమ యొక్క అనుదిన జీవితములో ఆయన్ను తెలుసుకుని గుర్తించారా అనే అంశమును ధ్యానించమని తల్లి శ్రీసభ మనలను కోరుతుంది.

ఈనాటి మొదటి పఠనములో బాధామయ సేవకుని యొక్క గీతమును చదువుకుంటున్నాము. యెషయా గ్రంధములో దాదాపు నాలుగు బాధామయ గీతాలు ఉన్నాయి. వాటిలో ఈరోజు మూడవది వింటున్నాము. 40 వ అధ్యాయము నుండి 55 వ అధ్యాయము వరకు నాలుగు బాధామయ సేవకుని గీతాలను యెషయా గ్రంధములో చూస్తున్నాము. ఈ యొక్క గీతము యేసు ప్రభువు యొక్క జీవితమును ఉద్దేశించి వ్రాయబడినది. ఇంకొక విధముగా చెప్పాలంటే ఒక నిజమైన సేవకుడు ఇశ్రాయేలు కోసము తనను తాను ఎలా సమర్పించుకుంటారో తెలుపుతున్నారు. 5వ వచనంలో సేవకుడు ఇలా పలుకుతున్నారు, "నేను అతనికి అడ్డు చెప్పలేదు, అతని మాట పెడచెవిన పెట్టలేదు". ఈ మాటలు యేసు ప్రభువుకు అన్వయించి చెప్పబడినవి ఎందుకంటే క్రీస్తు ప్రభవు తండ్రి చితమునకు, ప్రణాళికకు అడ్డు చెప్పలేదు. వానిని సంపూర్ణముగా నెరవేర్చారు. తండ్రి మాటను పెడచెవిన పెట్టలేదు. వానిని సావధానంగా విని తన యొక్క జీవితములో నెరవేర్చారు.  దేవునికి సంపూర్ణ విధేయత చూపి తండ్రికి ఇష్టమైన పుత్రునిగా జీవించారు. సేవకున్ని ఎంత హేళన చేసినా భరించారు. తనను కొట్టారు. ముఖము మీద ఉమ్మినారు. ఈ సందర్భములో ఆ సేవకుని యొక్క సహనము గురించి ధ్యానించుకోవాలి. తన జీవితములో ఎన్ని నిందలు పాలైనా సరే దేవుని చిత్తము నెరవేర్చుతున్నాననే సంతోషము ఇతనిలో చూస్తున్నాము. 

అదేవిధముగా దేవుని మీద ప్రేమ వలన మరియు పరులు రక్షణ పొందాలన్న ప్రీతీ వలన ఎన్ని రకములైన సమస్యలైనా ఎదుర్కొనుటకు సిద్దపడుతున్నారు. ఈ వాక్యాలలో ఇంకొక విషయము గమనించినట్లయితే ఈ సేవకునికి తన ప్రభువు మీద అపారమైన నమ్మకము. తనను ఆదుకుంటారని, దీవిస్తారని నా ప్రభువు నాకు తోడుగా ఉంటారని పలుకుచున్నారు. ఇదే గొప్ప విశ్వాసము మనందరిలో ఉండాలి. దేవుని కోసము మనము ఎన్ని శ్రమలనైనా ఎదుర్కోవాలి. బాధామయ సేవకుని వలె భరించాలి. కుటుంబములో కష్టాలు, సంఘములో కష్టాలు అన్ని చోట్ల బాధలే అయితే వాటన్నిటిని దేవునిపై మనకు గల ప్రేమతో సహించుకుని జీవితము ముందుకు కొనసాగించాలి. దేవుని చిత్తము నెరవేర్చుటలో కష్టాలు వస్తాయి. అయినప్పటికీ వాటిని ఎదుర్కొనాలి. దేవుడు మనకు తోడుగా ఉంటారనే నమ్మకము ఉండాలి. బాధామయ సేవకుడు తన బాధను మౌనముగా దిగమింగారు(సామెత 10:13, 19:29, 26:3), హేళన చేసినా సహించరు(2సమూ 10:4-5). 

రెండవ పఠనములో పునీత యాకోబు గారు విశ్వాసికి కేవలము విశ్వాసము మాత్రమే కాదు ఉండవలసినది, కానీ దానితో పాటు క్రియలు కూడా అవసరము అని తెలుపుతున్నారు. పునీత యాకోబు గారి మాటలు మనలందిరిని  కూడా ఒక నిజమైన, దేవునికిష్టమైన క్రైస్తవ జీవితము జీవింపుమని తెలుపుతున్నాయి. చాల సందర్భాలలో విశ్వాసము ఉంటే చాలు  అనుకుంటాము, క్రియలు అవసరము లేదని భావిస్తాము. కానీ, క్రైస్తవ విశ్వాసము అంటే కేవలము క్రైస్తవ బోధనలను నమ్మడము కాదు, కానీ క్రీస్తు నందు సంపూర్ణ విశ్వాసము ఉంచి అయన చెప్పినట్లు నడుచుకోవడమే. దేవుని యొక్క ఆజ్ఞలను, ఆదేశాలను అన్నింటినీ పాటిస్తూ ఆపదలో ఉన్నవారికి సహాయము చేయాలి. నిజముగా విశ్వాసము ఉందని జీవించేవారు సేవ మార్గాన్ని అనుసరించాలి. ఎందుకంటే విశ్వసిస్తేనే మనము ఏదైనా చేయగలము. పరలోక రాజ్యము ఉందని విశ్వసిస్తాము కాబట్టి దానిలో ప్రవేశించడానికి మంచి కార్యాలు చేస్తుంటాము. విశ్వసిస్తేనే దాని ప్రకారము నడుచోకోగలము. కార్యాలు లేని విశ్వాసము నిర్జీవము, వ్యర్ధము కాబట్టి, మనమందరము దేవుని యొక్క మాట ప్రకారము నడుచుకోవాలి. అబ్రాహామును విశ్వాసులకు తండ్రి అని పిలుస్తాము. ఎందుకంటే ఆయనలో చాల విశ్వాసము చూస్తున్నాము. అయన కేవలము విశ్వసించుట మాత్రమే కాదు చేసినది. దానితో పాటు దేవుడు చెప్పిన, ప్రేరేపించిన పనిని కూడా చేసారు. విశ్వాసము అదేవిధముగా క్రియలు కూడా ఉన్నాయి. మనలో కూడా చాల విశ్వాసము ఉంది. కానీ పని తక్కువగా  ఉన్నాయి. కాబట్టి విశ్వాసము ఉందని చెప్పుకుంటూ తిరగకుండా వాటితో పాటు క్రియలు కూడా చేస్తూ దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ దేవుని బిడ్డలుగా జీవించుదాము.

సువిశేష పఠనములో యేసు ప్రభువు రెండు ముఖ్యమైన విషయాలను తెలియపరుస్తున్నారు. 1 . తాను నిజమైన దేవుని కుమారుడు, 2 . మనుష్య కుమారుని మరణ, పునరుత్తానము ద్వారా రక్షణ కలుగుతుందని తెలియజేస్తున్నారు. సువిశేష పఠనములో యేసు ప్రభువు రెండు ముఖ్యమైన విషయాలను తెలియపరుస్తున్నారు. యేసుప్రభు కైసరియా ఫిలిప్పు ప్రాంతము చేరినప్పుడు తన శిష్యులను తానెవరిని అడుగుచున్నారు. ఈ ప్రశ్న మనందరినీ అడిగితే మరి మన సమాధానము ఏంటి? క్రీస్తును గురించి నీవేమి అనుకుంటున్నావు? కొందరు క్రీస్తు ప్రభువు స్నేహితుడని, తండ్రి అని, రక్షకుడని, మంచి కాపరి అని, స్వస్థతనిచ్చే  దేవుడని పిలుస్తారు. ఇది వారి యొక్క అనుభవమును బట్టి ఇచ్చిన సమాధానము. ఈ రోజు క్రీస్తును గురించి నీవేమి అనుకుంటున్నావు? అది ముఖ్యమైన విషయము. ఈ ప్రశ్నకు మన సమాధానము మన యొక్క దేవుని అనుభవమే చెబుతుంది. మన జీవితములో దేవుణ్ణి, అయన యొక్క సాన్నిధ్యాన్ని అనుభవిస్తే మనందరమూ కూడా క్రీస్తు ప్రభువు మనకు ఏమవుతారో తెలుసుకోవచ్చు.

ప్రభువు కైసరియా ఫిలిప్పులోనే ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారంటే దానికి ఒక అర్ధము ఉంది. కైసరియా ఫిలిప్పు అను పట్టణము అన్యుల మతమునకు చెందినది. అన్యుల యొక్క మత చరిత్రను కలిగి ఉన్నటువంటి ప్రాంతము ఇది. బాలు దేవతలను ఆరాధించుటకు, పూజించుటకు ఈ ప్రాంతము ఒక కేంద్రముగా ఉంటుంది. ఇక్కడ దాదాపుగా 14 దేవాలయాలు ఉండేవి. ఈ ప్రాంతములో గ్రీకు దేవుడు 'పాను' జన్మించాడని అక్కడి ప్రజల యొక్క విశ్వాసము. ఆ దేవుని పేరుగా ఈ ప్రాంతమును 'పానీయాసు' అంటారు. తరువాత హేరోదు కుమారుడు ఫిలిప్పు సీజర్ తిబెరిస్ పేరు మీదుగా ఒక దేవాలయమును నిర్మించారు. అదే విధముగా ఆ ప్రాంతము యొక్క పేరు కూడా కైసరయి అని దానికి తోడుగా ఫిలిప్పు అని జత చేసాడు. దానితో ఆ ప్రాంతమును కైసరియా ఫిలిప్పు అని అంటారు. ఈ ప్రాంతములో వారు కైసరను, అన్యదైవములను కొలిచేవారు. అందుకే క్రీస్తు ప్రభువు, అన్యులు పూజించే కైసరు లేక వేరే దేవుళ్ళు కాదు, తాను నిజమైన మెస్సయ్య అని తెలియజేయుటకు ఇలా అడుగుతున్నారు. యేసు ప్రభువు నిజముగా దేవుడని శిష్యులు గుర్తించారా లేదా అని తెలిసికొనుటకు ఈ ఇధముగా అడిగారు. కొందరు బాప్తిస్మ యోహాను అన్నారు, ఎందుకంటే ప్రభువు జీవితము యోహాను గారి జీవితము ఒకే విధముగా ఉన్నది. ఇద్దరు కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడినవారే. దేవుని కొరకు జీవించినవారే. అందుకనే ఆ పోలికలో చెప్పారు.

ఏలీయా అంటున్నారు ఎందుకంటే మలాకి 4:5 లో మెస్సయ్యకు ముందుగా ఏలీయా వస్తాడని చెప్పారు. చాల మంది క్రీస్తును ప్రవక్తగా, గొప్ప వ్యక్తిగా, అద్భుతాలు చేసే వానిగా మాత్రమే చూసారు. అందుకే ప్రభువు నిజముగా తాను దేవుడనని గుర్తించారా లేదా అని తెలుసుకొనుటకే ఈ విధముగా అడిగారు. పేతురు గారు ఎటువంటి సందేహము లేకుండా వెంటనే,"నీవు సజీవుడగు దేవుని కుమారుడని చెబుతున్నారు". మెస్సయ్య అని పలుకుచున్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు తన జీవితములో తన కుటుంబములో తన సంఘములో చేసిన అనేక అద్భుతాలను చూసారు. క్రీస్తు ప్రభువు ఎవ్వరు చెయ్యసాధ్యముకాని ఎన్నింటినో చేసారు. అందుకే పేతురు గారు  దృఢముగా నమ్మారు అయన మెస్సయ్య అని. కాని ఇక్కడ పేతురు గారికి కూడా మెస్సయ్య గురించి సరైన అవగాహన లేదు. మిగతా వారి వలె మెస్సయ్యను పేద ప్రజలకు న్యాయము చేసే ఒక రాజకీయ నాయకునిగా, ఒక విప్లవ పోరాటం చేసే వానిగానే చూసారు, కాని అయన ప్రజల కోసము మరణించే మెస్సయ్య అని కనుగొనలేకపోయారు. సువిశేష రెండవ భాగములో క్రీస్తు ప్రభువు తన శిష్యునకు ఉండవలసిన 3 షరతులను వివరిస్తున్నారు. 

  1. ఆత్మ పరిత్యాగము 

  2. సిలువ శ్రమలు అనుభవము 

  3. క్రీస్తు బాటలో నడచుట

  1. ఆత్మ పరిత్యాగము 

తన యొక్క ఆశలను త్యజించుకోవాలి. తన ఇష్టాలు త్యజించుకోవాలి, తన ప్రణాళికలు త్యజించుకోవాలి. మనము సమస్తమును త్యజించుకొని క్రీస్తు ప్రభువును వెంబడించాలి. ఈ రోజుల్లో త్యజించుకోవడము, వదులుకోవడము చాలా కష్టము. ఎందుకంటే బానిసత్వములో ఉన్నాము, బానిసలుగా ఉన్నాము కాబట్టి మనము బయటకు రాలేకపోతున్నాము. క్రీస్తు ప్రభువు అంటున్నారు తనను తాను త్యజించుకుంటేనే అయన శిష్యునిగా పిలువబడుతారు అని. ఆత్మ త్యాగముతో దేవుని కొరకు మన దేహాలను, జీవితాలను ఇష్ట పూర్తిగా సమర్పించుకునేందుకు సిద్ధపడాలి. దుష్ట స్వభావాలను త్యజించుకొని మనం హృదయాలను దేవునితో నింపుకొని జీవించాలి. మనల్ని మనం త్యజించుకోకుండా దేవుడిని వెంబడించుట కష్టం.

  1. సిలువ శ్రమలు అనుభవించాలి:

సిలువ అంటే కష్టాలు, బాధలు దానితో పాటు సిలువ అంటే ప్రేమ. మనం జీవితంలో ఎదురయ్యే శ్రమలు ప్రేమతో స్వీకరించి క్రీస్తుని అనుసరించాలి. సిలువ శ్రమలు అనుభవిస్తేనే సంతోషం ఉంటుంది. శ్రమలు అనుభవించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, ఇష్టపడి ఉండాలి. కొన్ని సార్లు మన సిలువలు మన శత్రువులే, మన సహోదరి సహోదరులే వారందరిని ప్రేమతో స్వీకరించి ముందుకు సాగాలి. మనం మన కష్టాలు, బాధలను ఆయనతో కలిసి భరిస్తూ మనలో స్వార్ధ చింతనకు మరణించి ఇతరులకు నిస్స్వార్ధంగా సేవలందించి జీవించాలి.

  1. క్రీస్తును అనుసరించుట: 

ఆయన యొక్క ప్రేమ ఆజ్ఞకు విధేయత చూపి ఆయన మాట ప్రకారం నడుచుకొనుటయే క్రీస్తును అనుసరించుట. దేవుని బాటలో నడవాలి. వాక్యం వినాలి, విన్న వాక్యం ప్రకారం జీవించాలి. మొదటి పఠనంలో విన్న బాధామయ సేవకుడు ప్రభువు మాటకు కట్టుబడి ప్రభువు మార్గంను అనుసరించి జీవించారు. మనం కూడా క్రీస్తు బాటలో నడిస్తే ఆయనకు ప్రియమైన శిష్యులుగా పిలవబడతాం. మనందరం మనం విశ్వాస జీవితంలో క్రీస్తు ప్రభుని గుర్తించి, ఆయన్ను అనుసరించి జీవించుదాం. విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండేటట్లు మనందరం ప్రయాస పడదాం.

ఆమెన్…

By Rev. Fr. Bala Yesu OCD

  

నిత్య జీవము ఎలా వస్తుంది

 యోహాను 6: 22-29  మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము అచటనున్న  ఒకే ఒక చిన్న పడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యే...