31, ఆగస్టు 2024, శనివారం

మత్తయి 25: 14-30

 మత్తయి 25: 14-30

"ఒకడు దూరదేశమునకు ప్రయాణమై పోవుచు సేవకులను పిలిచి, తన ఆస్తిని వారికి అప్పగించెను. వారివారి సామర్ధ్యమును బట్టి ఒకనికి ఐదు లక్షలు వరహాలను, మరియొకనికి రెండు లక్షలు వరహాలను, ఇంకొకనికి ఒక లక్ష వరహాలను ఇచ్చివెళ్లెను. ఐదులక్షల వరహాలను పొందిన వాడు వెంటనే వెళ్లి వ్యాపారముచేసి మరియైదు లక్షలు సంపాదించెను. అట్లే రెండు లక్షలు వరహాలను పొందినవాడు మరి రెండు లక్షలను సంపాదించెను.  కాని ఒక లక్ష వరహాలను పొందినవాడు వెళ్లి నేలను త్రవ్వి తన యజమానుని ద్రవ్యమును దాచెను. చాలకాలము గడిచిన తరువాత ఆ సేవకుల యజమానుడు తిరిగివచ్చి, వారితో లెక్కలు సరిచూచుకొననారంభించేను. ఐదులక్షల వరహాలను పొందిన సేవకుడు మరి ఐదు లక్షల వరహాలనుతెచ్చి , స్వామీ! తమరు  నాకు అయిదు లక్షల వరహాలను ఇచ్చితిరి. ఇదిగో ! మరి ఐదు లక్షలు సంపాదించితిని అనెను. అపుడు ఆ యజమానుడు వానితో మంచిది, నీవు ఉత్తముడవు. నమ్మినబంటువు. స్వల్పవిషయములందు శ్రద్ధవహించితివి. కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. నీ యజమానుని ఆనందములో నీవు పాలుపంచుకొనుము అనెను. రెండు లక్షల వరహాలను  పొందినవాడు వచ్చి, స్వామీ! మీరు రెండు లక్షల వరహాలను ఇచ్చితిరిగదా! ఇదిగో! మరి రెండు లక్షలు సంపాదించితిని అనెను. అప్పుడు ఆ యజమానుడు అతనితో , మంచిది, నీవు ఉత్తముడవు. నమ్మినబంటువు. స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి. కనుక అనేక విషములను నీకు అప్పగింతును. నీ యజమానుని ఆనందములో పాలుపంచుకొనుము అనెను. పిదప ఒక లక్ష వరహాలను పొందిన వాడు వచ్చి, అయ్యా ! నీవు కఠినుడవని నేను ఎరుగుదును. నీవు నాటనిచోట కోయువాడవు. విత్తనములను చల్లనిచోట పంట కూర్చుకొనువాడవు.  కనుక నేను భయపడి, వెళ్లి నీ లక్ష వరహాలను భూమిలో దాచితిని. ఇదిగో నీ ధనమును నీవు తీసికొనుము అని  పలికెను. అపుడు ఆ  యజమానుడు వానితో , ఓరీ దుష్ట సేవకా! సోమరీ! నేను నాటనిచోట పంటకోయువాడననియు, విత్తనములు చల్లనిచోట పంట కూర్చుకొనువాడననియు నీవు ఎరుగుదువు కదా! అట్లయిన నా ధనమును వడ్డీకిచ్చియుండవలసినది. నేను తిరిగివచ్చినపుడు వడ్డీతో సహా సొమ్ము పుచ్చుకొనియుందునుగదా! అని పలికి సేవకులతో ఆ లక్ష వరహాలను వీనినుండి తీసివేసి పది లక్షల వరహాలు కలవానికి ఈయుడు. ఉన్న ప్రతివానికి ఇంకను ఈయబడును. అపుడు అతనికి సమృద్ధికలుగును. లేనివాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. ఈ నిష్ప్రయోజకుడగు సేవకుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడు. అచట జనులు ఏడ్చుచు పండ్లు కోరుకుకొందురు అని పలికెను.  

క్రీస్తు నాధుని యందు ప్రియ విశ్వాసులారా ఈనాటి మొదటి పఠనంలో మనము మన జీవితాలను  పరిశీలించుకోవాలి అని ప్రభువు మనకు బోధిస్తున్నాడు. దేవుని పిలుపు పొందక ముందు, దేవుని ప్రజలలాగా మనము ఎన్నుకొనక ముందు, మనం ఎలా ఉన్నాము అని మనము ఆలోచించాలి. మనలో చాల మందిని  చూసినట్లయితే వివేకవంతులు, శక్తివంతులు సాంఘికంగా ఉన్నత జీవనము కలవారము కొందమందిమే. ఇది సత్యం ప్రియా విశ్వాసులారా లోకముచే బలహీనులుగా, అల్పముగా, నీచముగా విలువలేని వారిగా ఉన్న మనలను దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు మనలను తన ప్రేమ చేత  గొప్పవారినిగా చేస్తాడు. చాలా మందిని మనం చూస్తున్నాము, ఎన్నో బలహీనతలు వాటితో పాటు, ఎన్నో పాపకార్యాలు చేస్తూ దేవునికి, కుటుంబానికి దూరంగా జీవిస్తున్నారు. సంఘంలో, కుటుంబంలో చాలా మంది నీచముగా విలువలేని వారీగా జీవిస్తున్నాము. అలాంటి వారి మాటలకు ఏ విలువ ఉండటం లేదు. విలువ లేని జీవితాలు జీవిస్తూ, అల్పులుగా  మారి పోతున్నారు. 

ఈలోక పాప జీవితంలో మ్రగ్గుచున్న వారిని, బలహీనులుగా భావింపబడువారిని ఆయన ఎన్నిక చేసుకొని మనలను క్రీస్తుతో ఏకము చేసి, క్రీస్తు ద్వారా మనలను నీతిమంతులుగా, పరిశుద్దులుగా, విముక్తులుగా దేవుడు చేసాడు. మనం బలహీనులము, అల్పులము, విలువలేని వారము కాబట్టి దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకొనవలదు. గొప్పలు చెప్పదలచినవాడు ప్రభువు చేసిన గొప్ప కార్యాలను గూర్చి చెప్పవలయును. కానీ ప్రియ విశ్వాసులారా ! మనలో చాలామంది  గర్వంతో, స్వార్ధంతో, అవివేకంతో, పొగరుతో దేవుడూ చేసిన గొప్ప కార్యములను మర్చిపోయి జీవిస్తున్నారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా మనం ఎలా ఉన్నాము, దేవుని గూర్చి గొప్పలు చెప్పుకుంటున్నామా!   లేదా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ఈనాటి సువిశేష పఠనంలో ఒక యజమాని తన సేవకులను గురించి తెలియజేస్తున్నాడు. ఆ యజమానుడు తన సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి వారి సామర్ధ్యము బట్టి వారిలో  ఓకనికి  ఐదు లక్షలు, మరియొకనికి రెండు లక్షలు, ఇంకొకనికి ఒక లక్ష వరహాలను ఇచ్చెను. ఈ ఉపమానము ద్వారా  దేవుడు మనకు ఏమి తెలియజేస్తున్నాడు అంటే ప్రభువు కూడా మన మన సామర్ధ్యము  బట్టి, మనకు ఎన్నో గొప్ప బాధ్యతలను, గొప్ప విషయములను మనకు అప్పగిస్తుంటాడు. మనలో ఎంత మందిమి శ్రమించి, కష్టపడి దేవుడిచ్చిన బాధ్యతలను నెరవేర్చుతున్నాము? ఎంత మందిమి ఉత్తముడైన దేవుని నమ్మినబంటుగా స్వల్ప విషయములందు శ్రద్ధ వహించుచున్నాము. చాల మందిమి ఉత్తమ జీవితం జీవించలేక పోతున్నాం. నమ్మకమైన వారీగా ఉండలేక పోతున్నాం, స్వల్ప విషయలందు శ్రద్ధ తీసుకోలేక పోతున్నాం.  

ప్రియ విశ్వాసులారా దేవుడు మన సామర్ధ్యమును బట్టి ఎన్నో  గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తిని మనకు  దయచేస్తున్నాడు.  కాని మనము సోమరితనంతో లేక భయంతో, స్వార్ధంతో గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాం.  శ్రద్దగా జీవించలేకపోతున్నాం. ఎవరైతే దేవుడిచ్చిన వరాలను అనుగ్రహాలను ఉపయోగిస్తారో వాడుకలో ఉంచుతారో వారిని అధికముగా దీవిస్తాడు.  ఉన్న ప్రతి వానికి ఇంకను ఈయబడును, లేనివాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. కాబట్టి ప్రియ విశ్వాసులారా      మనకు ఉన్న ప్రతి దానికి దేవుని కొరకై ఉపయోగించుదాం. అప్పుడు మనకు సమృద్ధి కలుగుతుంది. 

ప్రార్ధన : నీతిమంతుడైన దేవా! మేము బలహీనులము, అవివేకులము విలువలేని వారము  కాని నీ ప్రేమ ద్వారా  మమ్ము నీతిమంతులుగాను, పరిశుద్దులుగాను విముక్తులుగాను చేసి మా సామర్ద్యములను బట్టి మమ్ము దీవించి  వరములను అనుగ్రహములను దయచేసి వాటి ద్వారా మేము ఉత్తమ జీవితం జీవించే భాగ్యం మాకు దయజేసిరివి మాకున్న సమాస్థానాన్ని నీ కొరకు ఉపయోగించే భాగ్యమును  మాకు  దయచేయండి. ఆమెన్ 

24, ఆగస్టు 2024, శనివారం

21వ సామాన్య ఆదివారం

21వ సామాన్య ఆదివారం 
యెహోషువ 24:1-2,15-18, ఎఫేసీ 5:21-32, యోహాను 6: 61-70

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనములు మన యొక్క జీవితంలో తీసుకునే నిర్ణయం గురించి తెలుపుచున్నవి. గత నాలుగు ఆదివారాలుగా ఏసుప్రభువు దివ్యసప్రసాదం యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలుపుచు, దివ్య సత్ప్రసాదమును స్వీకరించుట ద్వారా కలుగు ప్రయోజనములను వివరిస్తూ ఈనాటి ఆదివారములో మనందరికీ కూడా ఈ దివ్య సత్ప్రసాద స్వీకరణను గురించి ఒక నిర్ణయం తీసుకొనమని తెలుపుచున్నారు.
మన యొక్క అనుదిన జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రించే వరకు ఎన్నో రకాలైనటువంటి అంశాల మధ్య మనము నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. ఉదాహరణకు ఏమి తినాలా? ఏమి త్రాగాలా, ఎలాంటి వస్త్రాలు ధరించాలి? ఎవరితో మాట్లాడాలి? ఎలా చదవాలి? ఎలా ప్రయాణం చేయాలి? ఎలా ప్రార్థించాలి?  ఆదివారం దేవాలయానికి వెళ్లాలా? ఈ విధంగా అనేక అంశాల గురించి మనందరం కూడా రోజు వివిధ రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. మనము తీసుకునేటటువంటి నిర్ణయము మీదే మన యొక్క జీవితము ఆధారపడి ఉంటుంది ఎందుకనగా మనము సరియైన నిర్ణయాలు తీసుకుంటే మన జీవితాలు సంతోషంగా ఉంటాయి సరియైనటువంటి నిర్ణయం తీసుకోపోతే జీవితాంతం మనం బాధపడాల్సి వస్తూ ఉంటుంది.
 ఈనాటి మొదటి పఠణంలో యెహోషువా ప్రవక్త న్యాయాధిపతులను, పెద్దలను అందరినీ షెకెము వద్ద సమావేశపరచి ఏ దేవుడిని ఆరాధించాలో నిర్ణయం తీసుకొనమని తెలుపుచున్నారు. అన్య దైవములను పూజించాలా? లేక యావే దేవుడిని ఆరాధించాలా? అనే ఒక ప్రశ్న ఇశ్రాయేలు ప్రజల ముందు యెహోషువ ప్రవక్త ఉంచుతున్నారు. యెహోషువ దేవునితో సంభాషించారు, దేవుని యొక్క అద్భుత కార్యములు కనులారా చూసారు, దేవుడు రక్షించిన విధానమును ఎల్లప్పుడూ గుర్తుంచుకున్నాడు , ఐగుప్తు బానిసత్వం నుండి స్వేచ్ఛను కలిగించిన విధానమును మననం చేసుకున్నారు అందుకనే ఆయన నేను నా కుటుంబమును యెహోవాను మాత్రమే ఆరాధించుదము అని పలికారు. ఆయన తన జీవితంలో ఉత్తమ నిర్ణయం తీసుకున్నాడు. అదే సమయంలో అక్కడి ప్రజలందరూ కూడా  మమ్ము రక్షించినటువంటి యావే దేవుడిని మేము సేవింతుము అని పలికారు. ఈ మొదటి పఠణంలో ఎలాంటి దేవుడిని అనుసరించాలి అని వారు సరి అయినటువంటి నిర్ణయం తీసుకున్నారు. అన్యదైవములకు మరియు నిజమైన దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసంలో వారు నిజ దేవుని యొక్క గొప్పతనమును గ్రహించి యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తాము అని ఒక నిర్ణయం తీసుకున్నారు. 
ఒక నిర్ణయం మన జీవితాన్ని మార్చి వేస్తుంది.
 1. ఆదాము అవ్వ తీసుకున్నటువంటి, పండు తినాలి అని నిర్ణయం వారి జీవితంలో చాలా కోల్పోయేలాగా చేసింది.
2.అబ్రహాము యొక్క మంచి నిర్ణయం తనను విశ్వాసులకు తండ్రిగా చేసింది. 
3. ఏసావు  తప్పుడు నిర్ణయం తన యొక్క అధికారం, దీవెనలు కోల్పోయేలాగా చేసింది.
4. సౌలు యొక్క మూర్ఖ నిర్ణయం తన యొక్క పదవి కోల్పోయేలాగా చేసింది. 
5. మోషే ప్రవక్త యొక్క నిర్ణయం తనను నాయకుని చేసింది. 
6. దానియేలు యొక్క మంచి నిర్ణయం తనను దేవునికి సాక్షిగా చేసింది.
7. మరియ తల్లి తన జీవితంలో తీసుకున్న ఉత్తమ నిర్ణయం ద్వారా మనకు రక్షకుడు తన ద్వారా జన్మించారు.
8. పేతురు తీసుకున్న నిర్ణయం తనను అపోస్తులలకు నాయకునిగా చేసింది. 
9. అననీయ సఫీరాల నిర్ణయం దేవుడిని మోసం చేసేలా చేసింది. 
వారు తీసుకున్నటువంటి నిర్ణయములను బట్టి వారి జీవితాన్ని యొక్క ప్రతిఫలం అనేది నిర్దేశించబడినది.
 చాలా సందర్భాలలో సరియైన నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం కాబట్టి ప్రార్థిస్తూ, దేవుని సహాయం కోరుతూ, మన జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుని యొక్క కుటుంబము విధేయత కలిగిన కుటుంబం లాగా జీవించమని తెలుపుచున్నారు. వారు (భార్యా-భర్తలు) వివాహ రోజున దేవుని ముంగట తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఒకరి ఎడల ఒకరు పరస్పర ప్రేమ కలిగి, విధేయత కలిగి ఒక ఆదర్శవంతమైన దేవుని కుటుంబ జీవితమును ప్రేమానురాగములతో జీవించమని తెలుపుచున్నారు. దేవుని ముంగిట తీసుకున్న నిర్ణయములో వారు ఎల్లప్పుడూ కూడా విశ్వాస పాత్రులుగా ఉండాలి. తీసుకున్న నిర్ణయమునకు కట్టుబడి జీవించాలి.
ఈనాటి సువిశేష భాగములో అనేకమంది ప్రజలు ఏసుప్రభు యొక్క మాటలు విని ఈయన బోధనలు కఠినమైనవి అని పలికి ప్రభువుని విడిచి వెళ్ళిపోయారు. ఏసుప్రభు ఇచ్చిన ఆహారమును భుజించారు, ఆయన యొక్క అద్భుత కార్యములు చూశారు అయినప్పటికీ కూడా వారిలో విశ్వాసము కలగలేదు. అనేకమంది శిష్యులు ఏసుప్రభును విడిచి వెళ్లి మరెన్నడను వెంబడింపరైరి. ఆ సమయములో ఏసుప్రభు తన 12 మంది శిష్యులను మీరు కూడా వెళ్లిపోయిదరా? అని అడగగా పేతురు, ప్రభువు మేము ఎవరి వద్దకు పోగలము "నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు" మేము నిన్నే అనుసరింతుము అని పలికెను. పేతురు తన యొక్క జీవితంలో ఒక సరైన నిర్ణయం తీసుకుంటున్నారు. దేవుని యొక్క శక్తిని గ్రహించిన వ్యక్తి, అద్భుత కార్యములు చూసిన వ్యక్తి, యేసు ప్రభువుని సజీవ దేవుని కుమారుడు ఒక మెస్సయ్య అని గుర్తించినటువంటి పేతురు మేము నిన్ను మాత్రమే అనుసరిస్తాము అని ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు.
మన యొక్క అనుదిన జీవితంలో కూడా అనేక సందర్భాలలో మనం సరైన నిర్ణయం తీసుకోక రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేసే వ్యక్తులుగా ద్వంద స్వభావం కలిగిన జీవితం జీవిస్తూ ఉంటాం. ఇటు క్రైస్తవ సాంప్రదాయాలు పాటిస్తాం అదేవిధంగా అటు ఇతర మతముల యొక్క ఆచారమును కూడా పాటిస్తూ ఉంటా కానీ నేడు ప్రభువు మనల్ని కూడా ఒక సరియైనటువంటి నిర్ణయం తీసుకొని మనం తెలుపుతున్నారు. మనలో నిజముగా దివ్యసప్రసాద అనుభూతి కలిగినట్లయితే మనం కూడా దేవుడిని అంటిపెట్టుకొని జీవించగలుగుతాం, ఆయన యొక్క శక్తిని గ్రహించగలుగుతాం కాబట్టి నా జీవితంలో సరైన నిర్ణయం తీసుకొని దివ్య బలి పూజలో పాల్గొని, దేవుని యొక్క దీవెనలు పొందాలి.
Fr. Bala Yesu OCD

దేవుని ఆజ్ఞలు- బాహ్య ఆచరణ, ఆంతరంగిక శుద్ధి

 మత్తయి 5: 20-26 ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. ...