13 వ సామాన్య ఆదివారం
2రాజులు 4: 8-11, 14-16, రోమా 6: 3-4, 8-11, మత్తయి 10: 37-42
బ్రదర్. సుభాష్ ఓ.సి.డి.
మొదటి పఠనం: అతిథి దేవో భవా
షూనేము నగర సంపన్నురాలు ఎలీషా ప్రవక్తచే దీవించబడుట.
మొదటి పఠనంలో షూనేము నగర సంపన్నురాలు ఎలీషా ప్రవక్తని ఒక దైవ భక్తునిగా, దైవ సేవకునిగా, ఒక ప్రవక్తగ స్వీకరించింది, తన ఇంటిలోనికి ఆహ్వానించింది, మరియు అతిధి సత్కార్యాలు చేసింది.
దానికి ప్రతిఫలంగా ఆమె అడగకుండానే ప్రవక్త ఆమె కుటుంబాన్ని దీవించి సంతానం లేని ఆమె ఒక కుమారినికి జన్మనిస్తుంది అని ఆమెను దీవించాడు.
ఎందుకు షూనేము సంపన్నురాలు దీవించబడింది?
ఎందుకంటే ఆమె దేవుని ప్రవక్తను ఆహ్వానించింది, ప్రవక్తలో ఉన్న దైవత్వాన్ని గుర్తించింది. అంతే కాకుండా ప్రవక్తకి, తన కుటుంబంలో ఒకడిగా భావించి, ఒక గదిని ఏర్పాటు చేసి, మంచము, బల్ల, కుర్చీ మరియు దీపమును ఏర్పాటు చేసింది. ప్రవక్తకు అవసరమైనవన్నీ సమకూర్చింది. విందును ఏర్పాటు చేసి వారికి అతిథి సత్కార్యాలు చేసారు.
ఇంకా ఉదాహరణలుగా చెప్పాలంటే
l అబ్రాహాము మరియు సారా దంపతులు ముగ్గురు దేవదూతలు ఆహ్వానించారు, అందుకు గాను దేవదూతలు దేవుని ఆశీర్వాదాన్ని కుమారుని రూపంలో దీవిస్తున్నారు.
l అబ్రాహాము సోదరుడు లోతు కూడా దేవదూతలు ఆహ్వానించారు, దేవుడు దేవదూతలద్వారా లోతు కుటుంబాన్ని రక్షించారు.
l సెరఫాత్ విధవరాలు కూడా ఏలీయా ప్రవక్తకి ఆహరం అందించి అతిథి సత్కార్యాలు చేసింది దేవుని దీవెనలు పొందుకుంది.
వీరందరూ కూడా దేవుని సేవకులను స్వీకరించారు, దేవునికి ప్రీతి కలిగించి, వారు అడగకుండానే అద్భుతాలు చూసారు.
ఈ మొదటి పఠనంలో మనం చూస్తే, షూనేము నగర సంపన్నురాలు నుండి మనము కొన్ని ముఖ్యమైన అంశాలను నేర్చుకోవచ్చు. అవి;
మొదటిగా దైవ సేవకులను ఆహ్వానించాలన్న కోరిక, ఉదారస్వభావం, దైవ భక్తి , అనే లక్షణాలను మనము నేర్చుకోవచ్చు
మరి రెండవదిగా ఎలీషా ప్రవక్త ఒక ఆశీర్వాదంగా మారడాన్ని మనం గమనించవచ్చు.
కాబట్టి ఎలీషా ప్రవక్త వలే దైవ సేవకులు కూడా, పవిత్ర జీవితాన్ని జీవిస్తే , వారిలో కూడా ప్రజలు దైవత్వాన్ని చూడాలి, ఆ సంపన్నురాలి వలే , ఇతడు దేవుని సేవకుడు అని ఇతరులకు చాటి చెప్పాలి. మరియు దైవ సేవకులు కూడా ప్రజలను దీవించే విధంగా, ఒక ఆశీర్వాదంగా ఉండాలి. దేవుని ప్రతిరూపాలుగా ఉండాలి.
రెండవ పఠనం : క్రీస్తు అనబడే ఆశీర్వాదం ద్వారా మనకు నూతన జీవితం
పునీత పౌలు గారు, రెండవ పఠనంలో క్రీస్తుప్రభుని ఒక ఆశీర్వాదంగా మనకు చూపిస్తున్నారు. ఎందుకంటే క్రీస్తు ద్వారా మనము దేవుని బిడ్డలుగా పిలవబడుతున్నాం. జన్మ పాపంతో ఉన్న మానవాళికి, జ్ఞాన స్నానంద్వారా దేవుడు నూతన జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు. జ్ఞాన స్నానంద్వారా , పవిత్రాత్మ మనపైకి వేంచేసి, దేవుని సాన్నిధ్యాన్ని మనలో నింపుకుంటున్నాం. నిత్యజీవితాన్ని పొందుకుంటున్నాం.
క్రీస్తు మరణంలో భాగస్తులమై, పాపాన్ని విడిచిపెట్టి, ఆయన ఉత్తానములో మనము పాపము అనే మరణమును కూడా జయించాము అని, ఆయన మరణ పునరుత్తానములోనే మనకు రక్షణ అని పునీత పౌలు గారు ఈ రెండవ పఠనంలో తెలియ చేస్తున్నారు.
రోమా: 8 : 1-3 . వ వచనంలో మనం చూస్తున్నాం, " 1. క్రీస్తు యేసుతో ఏకమై జీవించువారికి ఇప్పుడు ఈ దండనయు లేదు. 2. ఏలయన, క్రీస్తు యేసుతో మనకు జీవమిచ్చెడి ఆత్మ యొక్క చట్టము, పాపమును మృత్యువును కలిగించు చట్టము నుండి నాకు విముక్తిని ప్రసాదించెను. 3. మానవ స్వభావము బలహీనమైనందున ధర్మ శాస్త్రము చేయజాలని దానిని, దేవుడు చేసెను. తన కుమారుని పంపుట ద్వారా మానవ ప్రకృతి యందలి పాపమును ఆయన ఖండించెను. ఆ కుమారుడు పాపమును తొలగించుటకై మానవుని పాప స్వభావం వంటి స్వభావంతో వచ్చెను."
కాబట్టి క్రీస్తు ప్రభువు మానవాళి నంతటికి ఒక అనుగ్రహముగా, ఒక ఆశీర్వాదముగా ఈ లోకానికి దేవునిచేత పంపబడ్డారు.
సువిశేషము
మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపినవానిని స్వీకరించుచున్నాడు. నా శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకనికి ఎవడేని ఒక గ్రుక్కెడు మంచి నీరొసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
అంటే మనము దైవ సేవకులను స్వీకరించాలి వారికి ఆతిధ్యమివ్వాలని ప్రభువు పలుకుతున్నారు.
క్రీస్తును స్వీకరించినవారు ఆయన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్టే. (యోహాను 10:30). క్రీస్తు శిష్యులను స్వీకరించినవారు క్రీస్తును స్వీకరించినట్టే. శిష్యులు క్రీస్తు పంపిన ప్రతినిధులు. (మత్తయి10: 1-42), (అపో. కార్యములు 9:1-5). మనం దీన్ని నిజంగా విశ్వసిస్తే క్రీస్తు శిష్యులకు సహాయం చేసేందుకు వెనుకంజ వేయము.
ఎందుకు క్రీస్తు ప్రభువు ఈ మాటలు పలుకుతున్నాడు ?
గర్వంతో ఉన్న కొంతమంది యూదా ప్రజలను మరియు క్రీస్తుని, ఆయన శిష్యులని అంగీరించని వారిని ఉద్దేశించి ఈ మాటలను పలుకుతున్నాడేమో.
సాధారణంగ యూదా ప్రజలు, వారు దేవుని చే ఎన్నుకొబడ్డవారని, రక్షణ వారికి మాత్రమేనని, క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు కాదని, యూదులకు వ్యతిరేకంగా ఉన్నాడని, యూదా ప్రజలు క్రీస్తుని తిరస్కరించారు. దేవుని రక్షణకు దూరమవుతున్నారు.
వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెపుతున్నారు, కానీ క్రీస్తుని గుర్తించుటలేదు, ద్వేషిస్తున్నారు. అంతేకాక వారు దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నాం అంటున్నారు, పొరుగు వారిని ప్రేమించటం లేదు. ఆపదలలో, పేదరికంలో ఉన్న సహోదరులను తిరస్కరిస్తున్నారు, పాపాత్ములు అంటున్నారు.
అందుకు గాను మత్తయి సువార్తికుడు క్రీస్తు ప్రభువు యూదా ప్రజలను, వారి కఠినత్వాన్ని ఉద్దేశించి, ఈ మాటలను పలికారని తెలియచేస్తున్నారు.
ఉదాహరణకు
· జక్కయ్య క్రీస్తు ప్రభుని ఆహ్వానించారు, విందును ఏర్పాటు చేసి, అతిధి సత్కార్యాలు చేసాడు. దేవుని రక్షణను పొందాడు .
· శతాధిపతి క్రీస్తుని ఆహ్వానించారు, ఒక్క మాటతో నే తన సేవకుడు స్వస్థత పొందాడు.
· పేతురు క్రీస్తుని విందునకు ఆహ్వానించాడు, జ్వరంతో భాదపడుతున్న ఆయన అత్తకు స్వస్థత కలిగింది.
ఈనాటిసువిశేషములోచూస్తున్నాం,"37. తన తండ్రినిగాని, తల్లినిగాని నా కంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారునిగాని, కుమార్తెనుగాని, నా కంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. 38. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరించువాడు నాకు యోగ్యుడు కాడు."
గురువులు కన్యాస్త్రీలు, దైవ సేవకులు, వారి కుటుంబాలను, బంధువులను, సన్నిహితులను, మరియు ఈ లోకపు జీవితాన్ని కూడా త్యాగం చేసి, దేవుని సేవకై, దేవుని వాక్యాన్ని ప్రజలకు భోధించుటకై, వారు సుమారు 14 లేదా 15 సంవత్సరాల పాటు శిక్షను పొంది వస్తున్నారు. వారు దేవునిచే ఎన్నుకోబడి అభిషక్తులయ్యారు. కేవలం ప్రజలకి దేవుని ఆశీర్వాదాలు ఇవ్వడానికి, దేవుని రూపంలో ప్రజలను దీవించడానికి. అలాంటివారిని మనందరం కూడా గౌరవించాలి, ఆదరించాలని, ఈ నాటి మూడు పఠనాలు మనకు తెలియచేస్తున్నాయి.
కావునా, మనంకూడా క్రీస్తుని, వాక్యరూపములో, ప్రార్థన రూపంలో, గురువులు, దైవ సేవకుల రూపములో , మన జీవితాలలోకి , మన కుటుంభాలలోకి ఆహ్వానించాలి.
అప్పుడే మనలో ఉన్నటువంటి భాదలు, సమస్యలు తీసివేసి మనలను మనకుటుంబాలను ఆశీర్వదిస్తారు. మనము క్రీస్తుని ఆహ్వానించకపోతే ఎటువంటి మేలులు దీవెనలు పొందుకోలేము.
అధేవిధంగ దైవ సేవకులు కూడా ప్రజలకు, నిజంగా దైవ సేవకులు అనిపించేలా జీవించాలి . షూనేము నగర సంపన్నురాలివలె " ఇతనిలో దేవుడున్నాడు, దైవభక్తుడు" అని ఇతరులకు చాటిచెప్పే విధంగా ఉదాహరణ జీవితాన్ని జీవించాలి. దేవుని ఆశీర్వాదాన్ని ప్రజలకు ఇచ్చే మధ్యవర్తిగా వ్యవహరించాలని, ఈ పఠనాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. కావున మనందరం కూడా ఆ షూనేము నగర సంపన్నురాలివలే దైవ భక్తితో, దైవ సేవకులను, మనకుటుంబాలలోకి, ఎలాంటి కుల, మత, భేదాభిప్రాయాలు లేకుండా ఆహ్వానిద్దాం, వారిని కూడా మనకుటుంబములో ఒకరిలా చూసుకుంటూ, గురువులు, దైవ సేవకుల ద్వారా దేవుని దీవెనలు పొందుదాం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి