13, ఫిబ్రవరి 2021, శనివారం

6 వ సామాన్య ఆదివారము

 6 వ సామాన్య ఆదివారము

క్రీస్తు నాథుని యందు ప్రియమైన స్నేహితులారా!

దేవుడు మానవులకు ఒసగు వరములలో ముఖ్యమైనది దయ; ఈ దయనే కనికరము, 

జాలి, కరుణ అని అంటుంటాము. ‘వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు 

అక్కరలేదని యేసు ప్రభువు (మత్తయి 9:12) వ వచనములో చెప్పిన మాటలు ఈనాడు 

మనకు గుర్తుకువస్తుంటాయి. మనము ఈరోజు మూడు పఠణాలను చదివినపుడు మనకు 

దేవుడు ఇచ్చు సందేశము ఏమిటి అంటే, శారీరక, మానసిక వ్యాధులతో బాధపడు వారిని 

దేవుడు దయచేత స్వస్థపరుస్తున్నాడని అని అర్థం అవుతుంది. ఈనాటి మొదటి 

పఠనము కుష్ఠ రోగము పొందిన వ్యక్తి యొక్క జీవిత విధానాన్ని చాల క్లుప్తముగా 

వివరిస్తుంది.

 

పాత నిబంధనలో కుష్ఠరోగము ఉన్న వారి పరిస్థితి చాలా ఘోరముగా ఉంటుంది. వారిని 

అశుద్దులుగా పరిగణించేవారు. ఈనాటి మొదటి పఠనములో (లేవి 13 :45) వారికి 

ఉన్ననియమాలు, చిరిగిన బట్టలు, తల విరబోసుకోవాలి. అతడు లేక ఆమె ప్రజల 

మధ్యలోకి రావాలంటే, నేను అశుద్ధుడను, అశుద్ధురాలిని అని కేకలు పెట్టాలి. వారు ఊరి 

బయట జీవించాలి, అటువంటి నియమాలను గూర్చి తెలియజేస్తుంది. రెండవ 

పఠనములో పునీత పౌలు గారు, మీరు ఏమి చేసినను దేవుని మహిమ కొరకై 

చేయవలయునని, ఎవరినీ భాధ పెట్టకుండ, నిస్వార్ధముతో, అందరిని సంతోషచిత్తులను 

చేయ ప్రయత్నిచండి, అని చెబుతూ నేను ఏ విధముగానైతే క్రీస్తును అనుసరించానో 

మీరును నన్ను అనుసరించండి అని నేర్పుతున్నారు.

సువిశేష పఠనములో కుష్టు రోగి ఎంతో వినయముతో చేసిన తగ్గింపు ప్రార్ధన దేవుడు 

ఆలకించి, అయన మీద  జాలి, దయ, కనికరము, ప్రేమ చేత అతనిని తాకి స్వస్థ 

పరిచారు. మార్కు 1: 45 లో చూసినట్లయితే కుష్టు రోగి తాను పొందిన స్వస్థత 

అనుభవాన్నిఎక్కువగా ప్రచారము చేయసాగెను. నలుదెసల నుండి జనులను దేవుని 

యొద్దకునడిపించగలిగాడు.

 

కాబట్టి ప్రియా స్నేహితులారా! మనలో చాలామంది, అనేక రకములైన కుష్టు రోగములతో 

బాధపడుతున్నాము. కుళ్ళు, కుతంత్రాలతో మనము కూడా కుష్టు రోగులుగా 

మారిపోతున్నాము. అదే విధముగా కుల, మాత, ప్రాంతీయ, వర్గములుగ విడిపోయి, ఒకరి 

పట్ల ఒకరు ఈర్ష్య, అసూయ, గర్వము, అహంకారములతో కుష్టు రోగులుగా దేవునికి 

దూరముగా, సంఘానికి దూరముగా, కుటుంబానికి దూరముగా జీవిస్తున్నాము. ఎప్పుడైతే 

మనము మన స్థాయిని గమనించి పశ్చాత్తాపపడి, దేవుని యొద్దనుండి, స్వస్థత అడిగితే 

దేవుడు మనలను తాకి స్వస్థపరుస్తాడు. అప్పుడు మన హృదయాంతరంగాలు 

శుద్ధమై పునీత పౌలు గారివలె క్రీస్తును అనుసరించగలము, ఎంతోమందిని దేవుని 

యొద్దకు నడిపించగలము. కాబట్టి దేవుడు మనలను తాకి శారీరకంగాను, మానసికంగానూ 

స్వస్థపరచాలని వినయముతో ప్రార్ధించి దేవుని దయను పొందుదాము. ఆమెన్ 

                By  Br. Suresh kolakaluru OCD 

 


6, ఫిబ్రవరి 2021, శనివారం

ఐదవ సామాన్య ఆదివారము

 
మొదటి పఠనము: యోబు 7:1-4,6-7
రెండవ పఠనము : 1 కొరింతి 9:16-19,22-23
సువిశేష పఠనం : మార్కు 1:29-39
క్రీస్తునాధుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి, సహోదరులారా, ఈ నాడు తల్లి శ్రీ
సభ మనకిచ్చినటువంటి మూడు పవిత్ర గ్రంథ పఠనాలు ఏమని సూచిస్తున్నాయంటే, ఏ విందంగా మనము క్రీస్తు అనుచరులుగా మన యొక్క క్రైస్తవ జీవిత బాధ్యతను స్వీకరించి, కార్య
నిర్వహణలోకి తీసుకొని వస్తున్నాము అని ధ్యానించమని ప్రశ్నిస్తుంది .
క్రైస్తవులుగా మన యొక్క బాధ్యత, మన యొక్క కర్తవ్యం ఏమిటి, అన్నది ఈ
నాటి సువిశేష పఠనము చాలా అర్థవంతంగా తెలియజేస్తుంది. అది ఏమిటి అంటే మన
జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా, దేవునికి ప్రీతికరముగా జీవించి, మన బాథ్యతను
క్రీస్తువలె, పరిపూర్ణంగా నిర్వర్తించడం. పౌలు గారివలె దైర్యంగా, మనకు
అప్పగించినటువంటి క్రీస్తు సువార్తను బోధించడము.
మొదటి పఠనము : మొదటి పఠనములో యోబు గారు మన మానవ ఇహలోకపు జీవితం ఎటువంటిది మరియు మనం పొందే బాధలన్నియు కూడా అశాశ్వతమని , ఇహలోకం నుండి పరలోకపు నిత్యనివాసానికి లేదా నిత్యజీవితానికి ఏ విందంగా సిద్ధపడాలి అని తెలియజేస్తున్నారు.
మనం ధ్యానించినట్లయితే, యోబు గారు మానవ జీవితపు 3 సత్యాలను గూర్చి
మాట్లాడుతున్నారు.
 1. జననం, 2. ప్రస్తుత జీవిత కాలం, 3. మరణం.
ఈ మూడు సత్యాలను, తన జీవిత అనుభవంతో ఈవిధంగా చెబుతున్నారు. ఈ జీవితం
క్షణికమైనది అంటూ, వీటిని మన జీవిత కాలపు స్థితి లేదా వృత్తి తో పోల్చుతున్నారు.
 అది ఏమిటి అంటే, మన అందరికి తెలిసిన విధంగా మనం కూలి పని కోసం కానీ లేదా ఒకరి
దగ్గర బానిసగా పనిచేయుటకు వెళ్లే సందర్భాన్ని, మన జననంతో పోల్చుతున్నారు.
[Our birth into the world]
 మరి పని చేసే సమయంలో అలసిపోయి, విశ్రాంతి కోసం లేక నీడ కోసం ఆశపడుతూ ఉంటాం.
పని అయిపోయాక మన జీతం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అంటే మనం పని చేసే
సమయాన్ని జననం మరణం మధ్య కాల వ్యవధిలో సాగుచున్నటువంటి ప్రస్తుత లేదా
వర్తమాన కాలపు జీవితం తో పోల్చుతున్నారు.
 మన చేసిన పనికి, వేతనం డబ్బులతో చెల్లించబడుతుంది. కానీ మన జీవన వేతనం ఏమిటీ
అంటే, మన మరణం తర్వాత మనం ఇహలోకం నుండి పరలోకం చేరుటకు కావలసిన పరిశుద్ధపు
అర్హత లేదా నిత్య నరకం. అది మనం జీవన విధానాన్ని, జీవన శైలిని బట్టి ఉంటుంది.
అంటే మన ఇహలోకపు జీవితం ఏ విధంగా ఉన్నది, ఈ జీవితం ఏ విధంగా జీవిస్తున్నాము
అన్నది చాలా ముఖ్యమైనది. ఎప్పుడయితే మనం దేవుని కొరకు జీవిస్తామో ,అప్పుడు
మనకి ఎన్నో సైతాను శోధనలు, బాధలు మరియు దుఃఖాలు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నింటిని
పట్టించుకోకుండా, వాటి గురించి ఆలోచించి మనోభావానికి గురి అవకుండా, ఇవన్నీ
అశాశ్వతం అని తెలుసుకొని జీవించి, దేవుని అనుసరించడమే మన యొక్క జీవన వృత్తి.
యోబు అంటారు, ఈ నా జీవితం శ్వాసంవంటిది, ఈ జీవితం ఒక గాలి వంటిది. ఒక్కసారి
శ్వాస ఆగిపోతే ఇక ఈ జీవితం లేదు అని. ఏ క్షణాన ఎం జరుగుతుందో తెలియదు. ఒకసారి ఈ
జీవితం కోల్పోయినట్లయితే మళ్ళీ తిరిగిరాదు. ఇది అశాశ్వతం. కానీ ఈ జీవితం తర్వాత
తిరిగి నిత్యజీవితాన్ని పొందగలుగుతాం. ఆ లోకానికి ముగింపు ఉండదు.

అందుకే, ఈ జీవితాన్ని చీకటితో, నిత్యా జీవితాన్ని వెలుగుతో పోల్చుతున్నారు.
యోబు అంటారు ఈలోకం నుంచి ఎప్పుడు పరలోకానికి వెళ్తాను అని ఎదురుచూస్తున్నారు.
రెండవ పఠనము: పునీత పౌలు గారు క్రీస్తు దర్శనం కలుగకమునుపు, ఏ విధంగా జీవించాడో
మనఅందరికి తెలుసు. క్రీస్తుని యెరుగకమునుపు, క్రీస్తు అంటే గిట్టనటువంటి వ్యక్తి,
క్రీస్తు అనుచరులను హింసించిన వ్యక్తి, ఇప్పుడు క్రీస్తే నా సర్వము, క్రీస్తే నాలో
జీవించేది అని క్రీస్తును అంటిపెట్టుకొని జీవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన క్రీస్తు
దర్శనం పొందగలిగాడు, క్రీస్తే సత్యమని కనుగొన్నాడు. ఎప్పుడయితే
ప్రవిత్రాత్మతో నింపబడ్డాడో అప్పటినుంచి తనకు అప్పగించినటువంటి క్రీస్తు
సువార్తను ప్రకటించే బాధ్యతను స్వీకరించి, విడనాడకుండా క్రీస్తు సేవను దైర్యంగా
కొనసాగించారు. సత్యానికి అనుగుణంగా జీవిస్తూ, ప్రతిఒక్కరికి సువార్తను బోధిస్తూ,
క్రీస్తు నామములో అందరికి ఒక బానిస వలె, అన్నివిధాలుగా తనను తాను మలచుకొని, తన ఇహలోక బాధ్యతను కొనసాగించాడు అని రెండవ పఠనము లో చూస్తున్నాము. క్రీస్తుకు ఉత్తమమైన
సేవకుడు, అనుచరుడు, అని నిరూపించుకున్నాడు. అందుకు ప్రతిఫలంగా క్రీస్తు ఆయనకు పరలోకపు నిత్యా భాగ్యాన్ని దయచేసారు. క్రీస్తు సువార్తను బోధించకపోతే నేను శిక్షింపబడాలి
అని పౌలు గారు అంటారు. ఎందుకంటే అది క్రీస్తు ప్రభువు తనకిచినటువంటి బాధ్యత.
సువిశేష పఠనము:
యేసు ప్రభువు, ఈ లోకంలో తన యొక్క కర్తవ్యాన్ని గురించి ఈనాటి సువిశేష పఠనం
ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుని కుమారుడు ఈ లోకంలో బానిసవలె, ఒక సేవకునిలాగ
జీవించుటకు వచ్చాడు. ఎందుకు? దేవుని ప్రణాళిక ప్రకారం మనందరికీ రక్షణ తీసుకురావడానికి.
మనం ధ్యానించినట్లయితే ఈనాటి సువిశేషంలో కొన్ని సంఘటనలను చూస్తున్నాము.
 యేసు ప్రభువు సీమోను ఇంటికి విందుకి వెళ్ళినప్పుడు అక్కడ సీమోను అత్త
జ్వరంతో బాధపడుతుంది అని, యేసు దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ప్రభువు
ఆమెను స్వస్థత పరుస్తారు, తరువాత ఆమె కూడా తమ బాధ్యతగా, వారి ఇంటికి
అతిధిగా వచ్చిన వారికి సేవచేయడం ఆరంభిస్తుంది. ఆ తరువాత్త
వేకువజాముననే ప్రార్థన చేసుకొని, ఇతర ప్రదేశాలలో కూడా సువార్తను
ప్రకటించాలి, అదే నా కర్తవ్యం అని శిష్యులతో అంటున్నారు.
 లూకా శుభవార్త 4 :18 - 19 వచనాలలో క్రీస్తు ఈలోకానికి వచ్చిన తన
కర్తవ్యాన్ని గురించి స్పష్టంగా వ్రాయబడింది. పేదవారికి శుభవార్తను
ప్రకటించుటకు, పాపమనే చెరసాలలో ఉన్న వారికి విడుదల చేయుటకు,
అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థత పరుచుటకు మరియు దయామయుడైనటువంటి
దేవుని ప్రేమ రాజ్యాన్ని స్థాపించుటకు పంపబడిఉన్నాడని
తెలియజేస్తుంది. అవే ఈనాడు సువిశేష పఠనములో క్రీస్తు చేసేటటువంటి
కార్యాలు. యేసు ప్రభు తన భూలోక జీవితాన్ని తన తండ్రి చిత్తాను సారంగా పరిపూర్ణంగా
జీవించాడు . అందుకు బహుమానం, మనందరి యొక్క రక్షణ, దేవుని బిడ్డలుగా తన పవిత్ర
రాజ్యంలో బాగస్తులుమవడం. యేసు ప్రభు పేరు ప్రఖ్యాతల కోసం, స్వార్థం కోసం
జీవించలేదు, తండ్రికి వినయ విధేయతలు కలిగి, త్యాగశీలుడిగా మానవాళి కొరకు సేవచేసారు.
యేసు ప్రభు ఈ జీవితంలో ఏ విధంగా సాతాను శోధనలను, బాధలను, దుఃఖాలను ఎదుర్కొని
పాపానికి గురియవకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలిగాడు అంటే, అది కేవలం తన నిరంతర
ప్రార్థన ద్వారానే అని సువిశేషంలో చదువుతున్నాము. అనునిత్యము, ప్రార్థన లో తన
తండ్రితో సంభాషిస్తూ, ఈలోకంలో తాను చేయవలసిన కార్యాన్ని గురించి తెలుసుకుంటూ
అందుకు కావలసిన శక్తిని పొంది, తన బాధ్యతను నిర్వర్తించాడు.


తల్లి మరియమాత కూడా, నిరంతర ప్రార్థనఅభ్యాసం ద్వారానే దేవుని ప్రణాళికను
తెలుసుకొని, ఆ ప్రకారం ‘ప్రభుని దాసురాలిగా, దేవునికి తల్లిగా’, తన బాధ్యతను
నిర్వర్తించింది. { లూకా 1:30-38}
ఈ నాడు మనమందరము కూడా ప్రార్థన యొక్క విలువను, శక్తిని తెలుసుకోవాలి.
ప్రార్థన అనేది పరలోకానికి మార్గం. ఈ లోకంనుండి పరలోకం చేరాలంటే ప్రార్థన అనే
మార్గాన్ని ఎన్నుకోవాలి. ప్రార్థన అంటే ఏమిటి అని పునీత అవిలాపురి తెరేసమ్మ గారు
ఈవిధంగా అంటున్నారు. “ప్రార్థన అంటే ఇద్దరి స్నేహితుల మధ్య జరిగే
ప్రేమపూరితమైన సంభాషణ”. ఈ సంభాషణలో దేవుడు మనకి తన ప్రణాలికను తెలియజేస్తాడు.
పవిత్రాత్మ శక్తిని ప్రసాదిస్తాడు. నిరంతర ప్రార్థనఅబ్యాసం ద్వారా దేవుని
చేరుకుంటాము.
మానవుడు దేవుని రూపంలో సృజింపబడ్డాడు. దేవునితోపాటు పవిత్రమైన ప్రేమ
జీవితాన్ని జీవించాడు. కానీ, పాపం ద్వారా ఆ పవిత్రతను కోల్పోయి పాపానికి బానిస
అయ్యాడు. తిరిగి ఆ పవిత్రమైన జీవితం పొందాలంటే, క్రీస్తువలె జీవించాలి. నిరంతర
ప్రార్థన ద్వారా క్రీస్తుని అంటిపెట్టుకుని, ఆయన సువార్తను ప్రకటిస్తూ, ఆయన
చిత్తానుసారంగా జీవించాలి. అందుకు ఉదాహరణ ఈ నాటి రెండవ పట్టణములోని పౌలు గారు.
పునీత పౌలు గారి వాలే ‘క్రీస్తే నా సర్వము, క్రీస్తే నాలో జీవించేది’ అన్న సత్యాన్ని
తెలుసుకొని జీవించి, బోధిస్తూ, సాక్షమివ్వగలగాలి. అందుకు మనం ఏ విధంగా మనకొరకు దేవుడు
మానవ రూపాన్నిదాల్చాడో, ఈనాడు మనం కూడా మన రక్షణ కొరకు, క్రీస్తుకి మనయెడల
ఉన్న ప్రేమ కొరకు, క్రీస్తుకి ఇష్టమైన విధముగా మనలను మలచుకోవాలి, ఆవిధంగా
జీవించాలి.
క్రీస్తు ఈ లోకానికి రక్షణ తీసుకొని వచినప్పటికిని, ఆయన సేవకులమయిన మనందరికీ
ఈలోకంలో తగిన బాధ్యతను ప్రతిఒక్కరికి అప్పగించియున్నాడు. అదియే క్రీస్తు
సువార్తను, ప్రేమను, ప్రతిఒక్కరికి తెలియజేయడం. ముందుగా మన కుటుంబములో, మన
పొరుగువారికి, మన సమాజంలో, దేవుని ఆలయంలో మరియు ప్రపంచమంతటా, దేవుని ప్రేమ,
పవిత్రాత్మ శక్తితో దైర్యంగా మన జీవితం ద్వారా తెలియజేయాలి. అందుకు కావలిసిన శక్తిని దయచేయమని దేవుని ప్రార్థిదాం. ఆమెన్.

by Br. Vijay Talari OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...