25, నవంబర్ 2023, శనివారం

34వ సామాన్య ఆదివారం

34వ సామాన్య ఆదివారం
విశ్వవిబుడైన క్రీస్తు రాజు యొక్క మహోత్సవము.
యెహెజ్కేలు 34:11-12, 15-17
1 కొరింతి 15:20-26, 28
మత్తయి 25:31-46

ఈరోజు తల్లి శ్రీ సభ క్రీస్తు రాజు యొక్క మహోత్సవమును కొనియాడుతున్నది, 1925 వ సంవత్సరంలో 11వ భక్తినాధ పాపు గారు  ఈ పండుగను ప్రారంభించియున్నారు. 20వ శతాబ్దంలో యూరప్ దేశములో అధికారుల యొక్క పాలన కఠినంగా ఉండటంవల్ల, అప్పటి అధికారులు ప్రజలకు ప్రాముఖ్యతను వారి యొక్క అధికారంకు ప్రాముఖ్యతనిచ్చి జీవించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదు, జాతుల మధ్య వివక్షతను తీసుకుని వచ్చి ఉన్నారు. అదేవిధంగా కొంతమంది యూదులను బంధించి చెరసాలలో వేసి చంపారు. ఈ విధంగా అధికారములు తమ యొక్క స్వార్థం కొరకై అధికారమును వినియోగించుకునే సందర్భంలో 11వ భక్తనాధ పాపు గారు ఆనాటి  అధికారులకు, ప్రజలందరికీ క్రీస్తు ప్రభువు యొక్క అధికారం  ఏ విధంగా ఉన్నది తెలియజేశారు. ఈ విశ్వమంతటికి క్రీస్తు ప్రభువే రాజు అని ప్రకటించి, మన హృదయ పీఠాలపై క్రీస్తు రాజుని ప్రతిష్టించుకోమని అదే విధముగా మన జీవితాలను ఆయన ఆధీనమునకు అప్పగించుమని పాపుగారు ప్రోత్సహించారు. 
పరిశుద్ధ గ్రంథం మరీ ముఖ్యంగా పాత నిబంధన గ్రంథం క్రీస్తు ప్రభువును రాజుగా చూపిస్తుంది,ఆయన రాజ్యపాలన గురించి ప్రవక్తలు ముందుగానే తెలియచేశారు.
యెషయా 9:6-7, యిర్మీయా 23:5, దానియేలు 7:13-14. అదేవిధంగా నూతన నిబంధన గ్రంథంలో కూడా గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు మరియ తల్లితో 'తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యుగయుగములు యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యముకు అంతమే ఉండదు అని తెలియజేశారు'. పిలాతు కూడా ఏసుప్రభువుతో సంభాషించేటప్పుడు "నీవు యూదుల రాజువా"? అని అడుగారు. నీవే అంటున్నావు కదా అని ఏసుప్రభు తెలిపారు. ఆయన రాజు అని పవిత్ర గ్రంథములో చెప్పబడినది కాబట్టి మనందరం కూడా ఆయన  మన యొక్క రాజు అని గ్రహించి  ఆయన చెప్పిన విధముగా జీవింపసాగాలి.
ఈ లోకంలో ఎంతో మంది రాజుల గురించి మనము చదువు కొని ఉండవచ్చు, విని ఉండవచ్చు. ఏసుప్రభు యొక్క రాజరికం ఈ లోక రాజుల యొక్క పాలనకు భిన్నంగా ఉంటుంది. సిలువయే ఆయన సింహాసనం, ముళ్ళ కిరీటమే ఆయన రాజు కిరీటం, చేతిలోని దండమే తన యొక్క అధికారమునకు గుర్తు. పేద సాధలే తన యొక్క ప్రజలు. పరలోకమే తన రాజ్యం.
 ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎలాంటి పాలన చేసి ఉన్నారో మనందరం గ్రహించాలి, ఆయన మరణము తర్వాత కూడా ఒక తీర్పరి అయిన రాజుగా మనలను పరిపాలన చేస్తారు.
క్రీస్తు ప్రభువు ఎలాంటి రాజు అని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. సేవ భావం కలిగిన రాజు- ఏసుప్రభు ఈ లోకమునకు వచ్చినది సేవ చేయుటకే కానీ సేవింపబడుటకు కాదు. ఈ లోకంలో ఉన్న రాజులు ప్రతినిత్యం కూడా ఎదుటి వారి యొక్క సేవలను అందుకునే వారే, వారి యొక్క సుఖభోగాలు పేరు ప్రతిష్టల కొరకు పాలన చేసేవారు కానీ క్రీస్తు ప్రభువు ప్రతినిత్యం ఇతరులకు సేవ చేస్తూ వారి శ్రేయస్సు కొరకు జీవించారు.
2. ఆయన క్షమించే రాజు- ఏసుప్రభు శిలువ మీద వ్రేలాడే సమయములో తండ్రికి ప్రార్థన చేసినది ఏమనగా 'తండ్రి వీరేమి చేయుచున్నారో, వీరు ఎరుగరు కావున వీరిని క్షమించు' అని ప్రార్థన చేశారు. తన ప్రజలు తనకు విరుద్ధముగా చేసినటువంటి పాపములను క్షమించమని క్రీస్తు రాజు తన తండ్రిని ప్రార్థించారు. ఆయన మనందరి పాపములను క్షమించే రాజు.
3. ప్రేమించే రాజు- నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు అని తెలుపుచు, వారి కొరకు తన ప్రాణమును త్యాగం చేసినటువంటి గొప్ప రాజు క్రీస్తు ప్రభువు. ఆయన ప్రేమ ఎటువంటి భేదము లేనటువంటి ప్రేమ, అవధులు లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ. అంతటి గొప్పదైన ప్రేమతో తన ప్రజలను పరిపాలించారు ఆయన మనందరిని  నిరతము ప్రేమించే రాజు.
4. నడిపించే రాజు- ఒక గొర్రెల కాపరి తన మందకు ముందుగా ఉండి గొర్రెలను ఏ విధముగా నైతే పచ్చిక బయలు వైపు నడిపిస్తారో అదే విధముగా క్రీస్తు రాజు  తన ప్రజలను పరలోకము వైపు నడిపిస్తారు, మంచి వైపు నడిపిస్తారు. మనము ఆయన స్వరమును విని నడుచుకోవాలి.
5. శాంతిని నెలకొల్పే రాజు-ఏసుప్రభు ఈ లోకమునకు వచ్చినది ఎందుకంటే మన అందరి జీవితాలలో శాంతి- సమాధానములు నెలకొల్పుట కొరకై. పాపము చేసిన మానవుడు దేవునికి దూరమైనప్పుడు శాంతి సమాధానము లేకుండా జీవించే సమయంలో మన అందరి కొరకై తన్ను తాను బలిగా సమర్పించుకుని మనలను తండ్రితో సఖ్యపరచి ఉన్నారు దాని ద్వారా ప్రతి ఒక్కరికి శాంతిని దయచేసారు.
6. వినయము కలిగిన రాజు-ఏసుప్రభు తనను తాను రిక్తుని చేసుకొని ఈ లోకంలో మానవునిగా జన్మించి సేవకు రూపం దాల్చి, శిష్యుల యొక్క పాదాలు కడిగి ఎంతో వినయముతో జీవించారు. అయిన పవిత్రుడైనప్పటికీ పాపాత్ములమైన మన మధ్య జీవించారు. ఇది ఆయన యొక్క వినయమునకు గొప్ప నిదర్శనం.
ఈనాడు క్రీస్తు రాజు యొక్క పండుగను జరుపుకునే సందర్భంలో ఆయన ఏ విధముగా జీవించి ఉన్నారో మనందరం కూడా ఆయన రాజ్యమునకు చెందిన వారు అయినట్లయితే ఆయన ఇచ్చే సూచనలు, ఆజ్ఞలు పాటించి జీవించాలి. అప్పుడు మాత్రమే మనందరం పరలోక రాజ్యములో ప్రవేశించగలుగుతాం. క్రీస్తు ప్రభువుని నీ హృదయ రాజుగా అంగీకరిస్తున్నావా? దాని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నావా అని వ్యక్తిగతంగా ఆలోచించి మనందరం కూడా ఆయన వలె జీవించాలి.
Fr. Bala Yesu OCD

18, నవంబర్ 2023, శనివారం

33 వ సామాన్య ఆదివారం

33 వ సామాన్య ఆదివారం

సామెతలు 31:10-13,19-20,30-31

1 తెస్సలోనిక 5:1-6

మత్తయి 25:14-30

ఈనాటి పరిశుద్ధ దివ్య గ్రంథ పఠనములు దేవుని యొక్క రాకడ కొరకై ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహములను సద్వినియోగం చేసుకుని మనందరం కూడా సిద్ధముగా ఉండాలి అని ప్రభువు తెలుపుచున్నారు. క్రీస్తు ప్రభువు యొక్క మరణ పునరుద్ధానం తర్వాత అందరి యొక్క ఆలోచన ఏమిటంటే ఆయన ఎప్పుడెప్పుడు వచ్చును అని. కొంతమంది ఆయన రాక కొరకు ఎంతో ఆశతో ఆనందంతో ఎదురు చూశారు మరి కొంతమంది ఆయన రాక త్వరలో సంభవించును అని అది ఏ గడియలో ఏ విధంగా వస్తుందో ఊహాగానాలు చేస్తూ జీవించారు మరి కొంత మంది ఆయన రాకడ చిన్నగా జరుగును అని భావించి సోమరిపోతులుగా జీవించటం ప్రారంభించారు అలాంటి సమయంలో దేవుడి యొక్క రాక రాత్రి వేళ దొంగ వలె అకస్మాత్తుగా వచ్చును అని ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన రాకడ కొరకై ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలి ఈరోజు మనందరం కూడా ఈ దైవార్చన సంవత్సర చివరి ఆదివారంలో ఉన్నా వచ్చే ఆదివారం క్రీస్తు రాజు యొక్క పండుగను కొనియాడబోతున్నాము కాబట్టి ఆయన రాక కొరకు మనం సిద్ధంగా ఉండాలి.

ఈనాటి మొదటి పట్టణములో రచయిత ఒక ఆదర్శ గృహిణి గురించి తెలుపుచున్నారు ఈమెలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే ఆమె తన జీవితమును అన్నిటికీ సంసిద్ధం చేసుకున్నటువంటిది. ఆదర్శ గృహని అనగా మంచి సుగుణములను కలిగిన వ్యక్తి. ఆమె తన కుటుంబమును మంచి మార్గములో నడిపిస్తుంది. ఆమె పగడముల కంటే విలువైనది అనగా మాణిక్యాల కన్నా విలువైనది అని అర్థం ఆమెను పొందిన వ్యక్తి ఎంతో అదృష్టవంతుడు ఎందుకంటే ఆమె ఇంటికి వెలుగుగా ఉంటూ తన ఇల్లును చక్కదిద్దుకొని తన కుటుంబమును మంచి మార్గంలో నడిపిస్తుంది. ఈ ఆదర్శ గృహిణి తన జీవితములో దేవునికి ఏది ఇష్టమో, భర్తకు ఏది ఇష్టమో కుటుంబమునకు ఏది ఇష్టమో తెలుసుకొని దాని ప్రకారంగా నడుస్తుంది.

తన కుటుంబమును ఒక బంగారు కుటుంబం గా ఏర్పరచుకుంటుంది అలాంటి స్త్రీని భర్త సంపూర్ణంగా విశ్వసిస్తాడు ఆమెను ఎన్నడూ సందేహించడు.

ఈ ఉత్తమ స్త్రీ కుటుంబ పోషణకై తన శాయశక్తులా  ప్రయాసపడుతూ తన భర్తకు తోడుగా ఉంటుంది. ఏ భర్త అయితే ఇలాంటి స్త్రీని భార్యగా పొందుతూ ఉంటాడు అతడికి ఎల్లవేళలా మేలు కలుగును ఎందుకంటే ఈమె భర్తకు మేలును మాత్రమే చేయను ఆయనకు ఎన్నడూ హాని తలపెట్టదు కాబట్టి.

- ఆదర్శ స్త్రీ అనాధలుగా ఉండే వారిని ఆదరిస్తుంది, పేదవారికి సాయం చేస్తుంది దైవభీతితో దేవునికి ఇష్టకరంగా జీవిస్తుంది.

-తన జీవితంలో సౌందర్యమునకు ప్రాధాన్యత నివ్వక కర్తవ్యం మనకు ప్రాధాన్యత నిచ్చి పరోపకారం చేస్తూ ఆధ్యాత్మిక సంబంధమైన సౌందర్యాన్ని కలిగి జీవిస్తూ ఉంటుంది కావున అలాంటి స్త్రీని పొందిన వ్యక్తి చాలా అదృష్టవంతుడు

-ఆదర్శ గృహిణి తన యొక్క భర్తను గౌరవిస్తుంది భర్తకు మంచి పేరును తీసుకుని వస్తుంది.

-ఈ ఉత్తమ స్త్రీ కుటుంబ అభివృద్ధి కొరకై అహర్నిశలు కృషి చేస్తుంది ఆమె వేకువనే నిద్రలేచి తన కుటుంబం కోసం పనిచేస్తుంది సోమరితనమునకు అసలు తావు ఇవ్వదు

ఈనాటి రెండవ పట్టణంలో ప్రభువు యొక్క రాకడ ఊహించని గడియలో జరుగును కావున రాక కొరకై మనందరం కూడా సంసిద్ధత కలిగి జీవించమని తెలియజేస్తున్నారు. ఈనాటి విశేష పట్టణంలో ప్రభువు మరొక్కసారి ఆయన యొక్క రాకడ కోసం విశ్వాసులు అందరు కూడా ఎలాగా సిద్ధపడి జీవించాలి అని తెలుపుచున్నారు. ప్రభువు ఒక్కొక్కరికి తమ యొక్క సామర్ధ్యమును బట్టి ఒకనికి 5 లక్షల వరహాలు ఇంకొకనికి రెండు లక్షల వరహాలు మనకు ఒక లక్ష వరహాలు ఇచ్చి ఉన్నారు అయితే ఇచ్చినటువంటి ఆ వరహాలను ఏ విధముగా వారు సద్వినియోగం చేసుకొని యజమానుడు యొక్క రాక కొరకు సిద్ధంగా ఉన్నారు అని తెలుపుచున్నారు.

ఈ సువిశేష భాగములు యజమానుడు అయిన దేవుడు తన యొక్క ఉదార స్వభావముతో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా తన యొక్క వరములను ఇస్తున్నారు యజమానుడిని ఎవరు అడగలేదు కానీ ఆయనయే తన సేవకులు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో వారికి ఈ వరములను ఇస్తున్నారు. ఆయన కూడా తనలాగే వారు సంతోషంగా ఉండాలి అభివృద్ధి చెందాలి అని అనుకున్నారు కాబట్టే తన దగ్గర ఉన్నది ఉదారంగా ఇవ్వటానికి ఇష్టపడ్డారు. యశమానుడికి ఒక్కొక్క వ్యక్తి యొక్క సామర్థ్యం తెలుసు కాబట్టి వారికి తగిన విధంగా అతడు సహాయం చేస్తున్నారు ఎక్కడ ఆ యజమానుడు వీరు వ్యాపారం చేస్తే నష్టపోతారా అని ఆలోచన చేయలేదు కానీ వారు ప్రయత్నం చేస్తున్నారా లేదా అని ఎదురు చూశాడు. ఐదు లక్షల వరహాలు రెండు లక్షల వరహాలు పొందిన వారు తమ జీవితంలో ఎంత రిస్క్ తీసుకొని అయినా సరే ముందుకు వెళ్లాలనుకున్నారు అందుకనే వారు తమ జీవితంలో అభివృద్ధిని చూడగలిగాను. వీరిద్దరూ కూడా తమ జీవితంలో కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు మనందరికీ కూడా వరహాలు ఇచ్చారు అని తెలుపుతున్నారు (ఎఫేసీ  4:8). మనం ఈ లోకంలో చూసుకుంటే ఏ ఇద్దరు వ్యక్తులకు అన్నింటిలో సరి సమానమైన టాలెంట్స్ ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ఇవ్వబడినది. మనకు ఇవ్వబడిన దానిలో మనము విశ్వాసులుగా ఉండాలి. దేవుడు మన జీవితంలో చూసేది ఏమిటంటే ఎంత మాత్రం మనము విశ్వాస పాత్రులుగా ఉంటున్నా మనము చేసే దానిని బట్టి దేవుడు మనకు తీర్పు చేయను మత్తయి 16: 27. కావున మనము కూడా దేవుడు మనకు అప్పజెప్పినా బాధ్యతగాని లేదా ఆయన మనకు ఇచ్చినటువంటి వరములను గాని సద్వినియోగం చేసుకొని జీవించాలి. లక్ష వరహాలు పొందిన వ్యక్తి తన జీవితంలో ఎటువంటి కష్టం కూడా పడకుండా యజమానుడి యొక్క సొమ్మును భూమిలో దాచి ఉంచాడు ఇతడు సాహసించటానికి వెనుకాడాడు తెగించటానికి భయపడ్డాడు ఒక సోమరిగా తన కాలాన్ని వెల్లబుచ్చాడు. పవిత్ర గ్రంథం మనము సోమరులుగా జీవించకూడదు అని బోధిస్తూ ఉన్నది. రోమీయులు12:11, 2తెస్స 3:11, హెబ్రీ 6:12. మనందరం కూడా పనిచేసే వ్యక్తులుగా జీవించాలి అనగా మన యొక్క బాధ్యతలను మనము సంపూర్ణంగా నెరవేర్చుటటువంటి వ్యక్తులుగా ఉండండి.

దేవుడు మన యొక్క మంచి కొరకే ఇచ్చినటువంటి వరాలను మనము సద్వినియోగం చేసుకోకపోతే అవి మన నుండి తీసుకుంటారు దానికి ముఖ్యమైన నిదర్శనం పాత నిబంధన గ్రంథంలో ఉన్న సౌలు యొక్క జీవితం ఆయనకు దేవుడు రాజు బాధ్యతలు అప్పచెప్పారు కానీ ఆయన దానిని సద్వినియోగం చేసుకోలేదు కావున తన యొక్క గొప్ప పదవిని దేవుడి యొక్క సహకారాన్ని ప్రేమను కోల్పోయారు కాబట్టి మన జీవితంలో దేవుడు మనకు ఇచ్చిన ప్రతి వరాన్ని సద్వినియోగం చేసుకొని ఆయనకు విశ్వాసపాత్రులుగా జీవించాలి.

 Fr. Bala Yesu OCD

11, నవంబర్ 2023, శనివారం

 

32 సామాన్య ఆదివారం

సోలో. జ్ఞాన 6: 12-16

1 తెస్సా 4: 13-18

మత్తయి 25: 1-13

 

క్రీస్తు నాధునియందు ప్రియమయిన దేవుని బిడ్డలారా, ఈనాడు తల్లి శ్రీ సభ దేవుని వాక్యాన్ని ఆలకించి, ధ్యానించి, వాక్యాను సారంగా జీవించమని మనందరినీ 32 సామాన్య ఆదివారములోనికి ఆహ్వానిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని ఆలకించడానికి ప్రయతించుదాం. 

ఈనాటి మూడు పఠనాల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మరియు ముఖ్య సందేశాన్ని ఈనాటి సువిశేష పఠనంలో చూస్తున్నాము. సువిశేష పఠనము ద్వారా యేసుప్రభు మనందరికీ  సందేశాన్ని తెలియపరుస్తున్నారు. అదేమిటంటే   " దేవుని యొక్క రాకడ - మానవ సిద్ధపాటు".

ప్రియమయిన దేవుని బిడ్డలారా యేసుప్రభు తన చివరి గడియాలలో, తన యొక్క పునరాగమనము, రెండవ రాకడ విధంగా ఉంటుందో అని తెలియపరిచారు. మత్తయి  : 24 అధ్యయంలో మనం చూస్తున్నాము .  యేసుప్రభు తన శిష్యులకు ప్రమాణము చేస్తూ " మీరు భయపడవలదు. నేను మరల తిరిగి వస్తాను. రాకడ ఏనాడు వచ్చునో మీరు ఎరుగరు. కావున సిద్ధపడి వుండండి" అని శిష్యులను హెచ్చరిస్తున్నారు. మత్తయి 24 :26 ' దినము గడియ ఎపుడు వచ్చునో తండ్రి తప్ప, దూతలు తప్ప, కుమారుడు తప్ప, మరెవ్వరు ఎరుగరు. నోవా దినములు ఎట్లుండునో, మనుష్య కుమారుని రాకడయు ఉండును.'

ప్రియమయిన విశ్వాసులారా వాక్యాలనింటిని గమనించినట్లయితే దేవుని రాకడ తప్పనిసరిగా ఉంటుంది. యేసుప్రభు దేవుని రాకడ విధంగా ఉంటుందో చెప్పారు కానీ ఘడియలలో వస్తుందో చెప్పలేదు. కనుక శిష్యులను సిద్ధపడి ఉండమని ప్రభువు హెచ్చరిస్తున్నారు. మన తల్లి శ్రీ సభ కూడా క్రెస్తవులయిన మనందరికీ నేర్పిస్తున్నది కూడా ప్రభుని రాకడ గురించే. రాకడ కోసం మనందరమూ ఎదురు చూడాలి మరియు సిద్ధపడాలి అని తెలియజేస్తుంది.

  ప్రియమయిన విశ్వాసులారా ఈనాటి పది మంది కన్యకలు ఉపమానంలో పెండ్లి కుమారుడు - యేసుప్రభువును, మరియు కన్యకలు శ్రీ సభలో వున్నా సభ్యులను సూచిస్తూవున్నది. అధేవిధంగా కన్యకలు యొక్క కన్యాత్వము పరిశుద్ధతను సూచిస్తూవున్నది. అంటే ప్రభువు యొక్క రాకడకు అందరూ పవిత్రంగా, పరిపూర్ణంగా, మరియు పరిశుద్ధంగా మన హృదయాలను సిద్దపడి  ఉంచాలని  యేసుప్రభు అదేవిధంగా తల్లి శ్రీ సభ బోధిస్తూవున్నది. 

ప్రభుని రాకడ విధంగా  ఉంటుంది అంటే అకస్మాత్తుగాను, ఎవరు ఊహించని సమయానన, ఎవరు అనుభవించని పరిస్థితున దేవుని రాకడ వస్తుంది. అటువంటి రాకడకు ఏవిధంగా మనం సిద్ధపడాలి అని ఇదిగో ప్రభువు నేర్పిస్తున్నారు.

ముందుగా సిద్దపటుకు కావలిసింది వివేకము లేక జ్ఞానము. సువిశేషంలో చూసినట్లయితే వివేకంతో అన్ని సిద్ధపరిచిన ఐదుగురు కన్యకలని మాత్రమే  పెండ్లికుమారుడు ఆహ్వానించాడు. అదేవిధంగా అవివేకంతో వున్నవారిని ఆహ్వానించలేదు. వారిని గెంటివేశారు. ప్రియమయినా విశ్వాసులారా వివేకంతో సిద్ధపడిన వారికీ మాత్రమే ప్రభుని రాజ్యము దొరుకుతుంది. కావున సిద్ధపాటుకి కావలిసింది జ్ఞానము . జ్ఞానం గురించే మొదటి పఠనము మనకు వివరిస్తూ వున్నది. మొదటి పఠనము మనకు ఏమి భోధిస్తుందిఅంటే జ్ఞానం కోసం అన్వేషించాలి అని. మనందరము జ్ఞానం వెతికే వారాలుగా ఉండాలి అని, జ్ఞానాన్ని ప్రేమించే వారాలుగా ఉండాలి అని, జ్ఞానాన్ని అభిలషించే వారాలుగా వుండాలిఅని భోదిస్తూవున్నది.

అధేవిధంగా ఎలా ఎదురు చూడాలి అని రెండవ పఠనము వివరిస్తుంది, అది ఏమిటంటే, ప్రభువు యొక్క రాకడకై ' నిరీక్షణతో ఎదురు చూడాలి.'  పునీత పౌలు గారు తేస్సలోనికా  ప్రజల యొక్క ఆత్యాద్మిక స్థితి ఎలా వున్నదో అని తెలుసుకొని వచ్చుటకు తిమోతిని పంపించారు. ప్రియమయిన విశ్వాసులారా తెస్సలొనీక ప్రజల మధ్య వున్నా కీలకమయిన సమస్యల గురించి, సందేశాల గురించి, మరి ముఖ్యముగా ప్రభు యొక్క రాకడ గురించిన విషయాలు పునీత పౌలు గారు ఈనాటి రెండవ పఠనంలో తెలియపరుస్తున్నారు. ప్రభువు యొక్క రాకడ సమయమున విశ్వాసము, నమ్మకము కలిగి నిరీక్షణతో ఎదురు చూడాలి అని తెలియపరుస్తున్నారు.

కావున ప్రియమయిన దేవుని బిడ్డలారా ప్రభువు యొక్క రాకడకు జ్ఞానము కలిగి విశ్వాసంతో, నమ్మకంతో సిద్ధపడి నిరక్షణతో ఎదురు చూడాలి అని ఈనాటి పఠనాలు బోధిస్తున్నాయి.

 

బ్రదర్. సన్నీ దామాలా. ఓ సి డి

 

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...