22, ఏప్రిల్ 2023, శనివారం

3వ పాస్కా ఆదివారం

 

3 పాస్కా ఆదివారం

. పో.  2: 14, 22-28

1 పేతురు 1: 17-21

లూకా 24: 13-35

ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు దేవుడు తనను విశ్వసించే ప్రజలకు ఎప్పుడు చేరువలోనే ఉంటారు అని తెలుపుచున్నాయి. మన జీవితంలో మనం ఎట్టి పరిస్థితులకు లోనైనాకానీ పునరుత్తాన దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. దేవుడి గురించి ఎవ్వరైతే తాపత్రయ పడుతుంటారో, వెదకుతుంటారో, ఆయన సాన్నిధ్యంతో జీవించాలని భావిస్తారో వారికి ప్రభువు అతి సమీపంలోనే ఉంటారు అనే విషయం గురించి మనకు ఈనాటి పఠనాలు బోధిస్తున్నాయి.

ఈనాటి మొదటి పఠనంలో పేతురు గారు చేసిన మొదటి పునరుత్తాన భోధన గురించి వింటున్నాం. అపొస్తలులు యేసు ప్రభువు యొక్క పునరుత్తానం తరువాత అదే విధంగా దేవుని యొక్క పవిత్రాత్మను పొందిన తరువాత సువార్త ప్రకటన చేయుట మనం వింటున్నాం.  పవిత్రాత్మను పొందిన తరువాత వారిలో భయం పోయినది అందుకనే వారు బహిరంగంగా సువార్తను అధికారుల మధ్య సమూహాల మధ్య బోధించారు.

వారు బోధించిన అంశం ఏమిటంటే యేసు ప్రభువును అన్యాయంగా సిలువ మరణంకు గురిచేశారు అయినా కానీ దేవుడు మాత్రం తన కుమారున్నివిడిచి పెట్టలేదు ఆయన్ను మరణమును గెలిచేలా చేశారు.  యేసు ప్రభువు తన యొక్క అద్భుతాలు ద్వారా, మహాత్కారాల ద్వారా తన యొక్క బోధనల ద్వారా తానే యేసయ్య అని తెలిపారు. అయినప్పటికిని అది గ్రహించక ఆయన్ను మీరు సిలువ శిక్షకు గురి చేశారు, ఆయన మరణంకు కారణం అయ్యారు అని తెలిపారు.

యేసు ప్రభువును తన తండ్రి ఎన్నడును విడిచిపెట్టలేదు అని పేతురు గట్టిగా  ప్రకటించారు. తండ్రి తన కుమారున్ని ఎన్నడూ విడిచిపెట్టరు. ఎందుకంటే ప్రభువు అంటున్నారు "తల్లి మరచినా నేను నిన్ను మరువను అని" యెషయా 49 : 15 . మనల్ని మరచిపోని దేవుడు మరి తన కుమారున్నిఏ విధంగా మరువగలడు, మరవడు. సత్యమును గ్రహించిన అపోస్తులు ప్రభువు యొక్క పునరుత్తానం గురించి గట్టిగా ప్రకటించారు.

నాటి మొదటి పఠనంలో పేతురు గారు దేవుడు అందరిని తన ప్రజలుగా స్వీకరిస్తున్నారు అని తెలుపుచున్నారు. మొదటిగా యూదులను మార్చి, తరువాత అన్యులకు సువార్త ప్రకటన చేసి వారిని  తన బిడ్డలుగా స్వీకరిస్తారు అని ప్రభువు పలుకుచున్నారు.  యూదులు యొక్క విశ్వాసాన్ని బలపరచుటకు, వారిని యేసు ప్రభువు వైపు తిప్పుటకు పేతుటకు పేతురు గారు వారిని తన యొక్క పరిచర్య ద్వారా బోధించిన విధానం తెలుసుకుంటున్నాం.

ఈనాటి రెండవ పఠనంలో పేతురు గారు మనందరినీ దేవుడి యందు భయభక్తులు  కలిగి జీవించమని కోరుచున్నారు. పేతురు గారు ఆనాటి యూదులను అదే విధంగా హృదయ పరివర్తనం చెందిన అన్యులను దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి  భయభక్తులతో జీవించమని కోరుచున్నారు.

ప్రభువు యొక్క మరణం అనేది దైవ ప్రణాళిక అని పేతురుగారు పలికారు.  ప్రభువు యొక్క రక్తం చేత మనం పాప విముక్తులముగా చేయబడ్డాం. నిష్కళంక గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా మనం పవిత్ర పరచబడ్డాం, స్వతంత్రులముగా చేయబడ్డాం. కావున ఆయన యందు ఎల్లప్పుడూ, విశ్వాసం ఉంచి మంచిగా  జీవించమని పేతురు గారు  పలుకుచున్నారు.

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు ఎమ్మావు మార్గంలో శిష్యులకు ఇచ్చిన దర్శనం గురించి వింటున్నాం. ఇద్దరు శిష్యులు యేసు ప్రభువు యొక్క మరణం తరువాత యెరూషలేము నుండి ఎమ్మావు గ్రామంకు వెళ్లే సమయంలో దేవుడు వారితో పాటు ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం గ్రహించాలి.

1. దేవుడు నీ బాధలో  నీకు తోడుగా వుంటారు. ఇద్దరి శిష్యులు ప్రభువు యొక్క మరణమును తట్టుకోలేకపోయారు, నిరాశలో వున్నారు, రాజును  కోల్పోయాము అనే బాధలో వున్నారు. ఆయన్ను గొప్ప నాయకుడిగా, రాజుగా భావించారు. రోమా చక్రవర్తుల నుండి స్వేచ్ఛను దయచేసి వ్యక్తిగా భావించారు అయితే వారి యొక్క ఆలోచనలకు బిన్నంగా ఆయన మరణించారు. అలాంటి తట్టుకోలేనటువంటి స్థితిలో వున్న వారికి ప్రభువు దర్శనం ఇస్తున్నారు.

-   శిష్యులు యేసు ప్రభువు యిస్రాయేలు ప్రజలను ఉద్ధరిస్తాడని, తన రాజ్యాన్ని స్థాపించి ప్రజలకు శాంతి సమాధానాలు సిరిసంపదలు దయ చేస్తాడని వారు ఎంతగానో ఎదురుచూశారు. అయితే అదేమి జరగలేదు. యేసు మరణంతో శిష్యుల యొక్క ఆశలు వమ్ము అయ్యాయి.

-  అంతా కోల్పోయాము, అంతా అయిపోయింది అని జీవచ్ఛవాలుగా ఎమ్మావు గ్రామానికి వెళ్లుచున్న శిష్యులను ప్రభువు కలుసుకుంటున్నారు.

-   దేవుడు తనను వెంబడించే వారిని విడిచిపెట్టరు. శిష్యులు ఎమ్మావు గ్రామముకు వెళ్లే దారిలో వారి యొక్క సంభాషణ యేసు ప్రభువు గురించియే అందుకే ప్రభువు అంటారు "ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడివుంటారో అక్కడ నేనుంటానని" - మత్తయి 18 : 20 .

- మార్గమధ్యన వారి సంభాషణ అంత దేవుని గురించియే అందుకే వారి మధ్యకు దేవుడు వస్తున్నారు.

- వారు అంతగా  దేవుడి గురించి సంభాషిస్తున్నారంటే ఎంతగా ఆయన్ను miss  అయ్యామని వారు భావిస్తున్నారో మనం అర్ధం చేసుకోవాలి.

- మన జీవితాలలో మన భాదల్లో వున్నప్పుడు దేవుడు మనకు కూడా తోడుగా వుంటారు అది మన యొక్క తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు లేదా ఇతరుల ద్వారా కావచ్చు దేవుడు మనల్ని ఎన్నడు విడిచిపెట్టారు.

2. మన దేవుడు ప్రయాణించే దేవుడు: పూర్వ నిబంధన గ్రంధంలో యావే దేవుడు యిస్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విముక్తులను చేసి, వారితో పాటు ఎడారి గుండా 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసే సందర్భంలో ఆయన మహిమను, స్వభావమును వెల్లడిచేశారు. ఆయన యొక్క సాన్నిధ్యమును అనుభవించేలా చేశారు.

- అదే విధంగా ఈనాటి సువిశేషంలో యేసు ప్రభవు కూడా శిష్యులతో పాటు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణంలో వారికి అనేక విషయాలు తెలుపుచున్నారు.

- ప్రభువు తన ప్రజలతో నడుస్తూ తన యొక్క  గొప్పతనమును వెల్లడించుకుంటున్నారు.

-  సృష్టి  ప్రారంభంలో దేవుడు ఆదాము, అవ్వతో నడిచారు. దేవుడు నోవాతో నడిచారు, ఏనోకుతో నడిచారు. ప్రభువు వారితో నడిచే సందర్భంలో అది సామాన్యమైన నడకకాదు అది. యొక్క నడక వారిని బలపరిచే నడక, నేర్పించే నడక, ధైర్యం నింపే నడక కావున మన కూడా గ్రహించవలసిన సత్యం ఏమిటంటే దేవుడు కూడా మనతో పాటు నడుస్తుంటారు. ఆయన సర్వమును గుర్తించి ఆయన మాట ప్రకారం మనం జీవించాలి.

3. మన దేవుడు మన యొక్క అవసరతలను పట్టించుకునే దేవుడు.

-   ఆయనకు ప్రతి ఒక్కరి అవసరతలు తెలుసు అందుకే వారిని ఆదుకుంటారు.

-  గ్రుడ్డివారిని అవసరతలు తెలుసు

-  పక్షవాత రోగి అవసరం తెలుసు

-  అనారోగ్యుల అవసరాలు తెలుసు

-  విశ్వాసులు అవసరాలు తెలుసు

అందుకే వారిని ఆదుకుంటారు. అదే విధంగా ఇద్దరి శిష్యుల అవసరం కూడా తెలుసు అందుకే వారిని ఆదుకుంటారు.

4. మన దేవుడు ఐక్య పరిచే దేవుడు: ఇద్దరి శిష్యులను మిగతా శిష్యులతో దేవుడు ఐక్యపరుస్తున్నారు.

- ప్రభువును రొట్టె విరుచుట యందు గుర్తించిన శిష్యులు వెంటనే మిగతా శిష్యుల వద్దకు పరుగెత్తుకొని వెళ్లారు.

- యేసు ప్రభువు మరణంతో మనల్ని తండ్రితో ఐక్య పరిచారు.

- ప్రభువు తొలి సంఘస్థులను ఐక్య పరుస్తున్నారు. అలాగే దేవుడు వివాహం ద్వారా స్త్రీ పురుషులను ఐక్యం చేస్తున్నారు.

5. మన దేవుడు కనువిప్పు కలుగచేసే దేవుడు.

- ఇద్దరి శిష్యులు మొదట్లో యేసు ప్రభువును గుర్తించలేదు కానీ ఆయన స్థాపించిన దివ్య సత్ప్రసాదస్థాపన రోజున చేసిన కార్యమును శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. వారి కనువిప్పుకు కారణం అయ్యారు.

- తప్పిపోయిన కుమారుడి కనువిప్పు అయ్యేలా చేశారు.  యొక్క రోజున దేవుడు అన్ని సమయాలలో మనకు తోడుగా ఉంటారని గుర్తించి ఆయన్ను విశ్వసించాలి.

 Fr. Balayesu OCD

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...