28, డిసెంబర్ 2024, శనివారం

తిరు కుటుంబ పండుగ ఆదివారం

 తిరు కుటుంబ పండుగ ఆదివారం 

1 సమూయేలు 1:20-22, 24-28, 1 యోహాను 3:1-2, 21-24, లూకా 2:41-52

ఈనాడు తల్లి శ్రీ సభ తిరు కుటుంబ పండుగను కొనియాడుచున్నది. ఏసు మరియమ్మ మరియు ఏసేపు కుటుంబము ఆదర్శవంతమైన కుటుంబము మరియు పవిత్రమైనటువంటి కుటుంబము అని తెలుపుతూ ఆ యొక్క కుటుంబమును మన అందరి యొక్క కుటుంబములకు ఆదర్శంగా చేసుకొనమని తల్లి శ్రీ సభ ఈనాడు మన నుండి కోరుచున్నది. ఈయొక్క కుటుంబము ఆదర్శము ఎందుకనగా, ముగ్గురు కూడా తండ్రి చిత్తమును ప్రేమిస్తూ దానిని వారి యొక్క జీవితంలో నెరవేర్చారు. పరస్పరము ఒకరిని ఒకరు సహకరించుకుంటూ జీవించారు.

తండ్రికి తమ్ము తాము సమర్పించుకుంటు జీవించారు.

ఏసుక్రీస్తు ప్రభువు దేవుడైనప్పటికీ మానవునిగా ఒక కుటుంబంలో జన్మించారు ఆ కుటుంబంలో బిడ్డలు ఎలా జీవించాలో తెలిపారు. కాబట్టి ఆయన తన తల్లిదండ్రులతో జీవించిన విధానము అందరికీ కూడా ఒక సుమాత్రుకగా ఉండాలి. మరియమ్మ గారు ఏసేపు గారు ఏ విధముగా నైతే పుణ్య దంపతులుగా జీవించారో అదే విధముగా భార్యాభర్తలు జీవించాలి. ఏసేపు మరియమ్మ గారు వారి యొక్క దాంపత్య జీవితంలో అర్థం చేసుకుంటూ, ప్రేమను పంచుకుంటూ జీవింప సాగారు. మరీ ముఖ్యంగా బాల యేసు ప్రభువును ఈ లోకంలోనికి తీసుకొని రావడానికి వారు పొందినటువంటి అనేక శ్రమలు మనకు ఆదర్శం అవ్వాలి. దేవుని యొక్క కుటుంబంలో కూడా కష్టాలు వచ్చాయి కాబట్టి మన కుటుంబాలలో కష్టాలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు మనము పడిపోకుండా ధైర్యముగా నిలబడాలి.

ఈనాటి మొదటి పఠణంలో ఎల్కాన, హన్నా తమ బిడ్డ అయినటువంటి సమూయేలును దేవాలయంలో సమర్పించిన విధానమును చదువుకుంటున్నాము. ఈ భార్య భర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవింప సాగారు ఎందుకనగా వారి యొక్క జీవితంలో హన్నాకు సంతానం లేని సమయంలో భర్త భార్యతో నీవు బాధపడవద్దు పది బిడ్డలకు సమానమైన భర్తను నేనున్నాను కదా అని తన భార్యను ఓదార్చి తనకు అండగా నిలబడ్డాడు. ఈ యొక్క కుటుంబము నిజముగా దేవుని మీద ఆధారపడుతూ జీవించిన కుటుంబం వారి యొక్క బిడ్డను కూడా దేవుని సేవ నిమిత్తము సమర్పించారు. ఈనాటి రెండవ పఠణంలో కూడా మనందరం కూడా దేవుని బిడ్డలం దేవుని యొక్క కుటుంబమునకు చెందిన వారసులమని తెలియజేస్తూ ఉన్నది.

ఈనాటి సువిశేష భాగములో మరియమ్మ గారు ఏసేబుగారు బాల యేసును దేవాలయములో సమర్పించిన విధానము అదేవిధంగా ఆయనను యెరుషలేము దేవాలయంలో కోల్పోయిన విధానము మరలా తిరిగి పొందుటన గురించి వింటున్నాం. ఈ యొక్క  సువిశేష భాగములో వీరిద్దరూ కూడా తమ యొక్క విధులను నెరవేర్చారు. బిడ్డ మీద ఉన్న ప్రేమతో మరల తిరిగి బిడ్డను వెదకుచు ఆయన కోసం తపించి ఉన్నారు ఇది కేవలం ఆయన మీద ఉన్న ప్రేమ వలనే. ఈ యొక్క తిరు కుటుంబము నుండి మనము కూడా గమనించవలసినటువంటి కొన్ని అంశములు ఏమిటనగా 

1. దేవుడిని కలిగి ఉన్న కుటుంబం 

2. దేవునికి విధేయించిన కుటుంబం 

3. నిస్వార్ధమైన కుటుంబం 

4. ప్రేమ కలిగిన కుటుంబం 

5. ఒకరినొకరు అర్థం చేసుకున్న కుటుంబం 

6. వినయము కలిగిన కుటుంబం

7. బాధ్యతలు నెరవేర్చిన కుటుంబం. 

ఈ యొక్క 2024వ సంవత్సర చివరి ఆదివారమున తిరు కుటుంబ పండుగ మన యొక్క కుటుంబాలు కూడా ఈ యొక్క తిరు కుటుంబమును పోలిన విధంగా ఉండాలి అని ఆలోచిస్తూ, మన కుటుంబములను సరిచేసుకుని జీవించటానికి ప్రయత్నం చేయాలి ఎందుకనగా కుటుంబమే బిడ్డలకు మొదటి పాఠశాల వారు అక్కడ నుండి అన్నీ కూడా నేర్చుకుంటారు కాబట్టి కుటుంబం మంచిదైతే సంఘం మంచిదవుతుంది, సంఘం మంచిదైతే ఊరే మంచిదవుతుంది, ఊరు మంచిదైతే రాష్ట్రం మంచిదవుతుంది ఈ విధంగా ఈ ప్రపంచమే మంచిగా అవుతుంది కాబట్టి మన కుటుంబములను సరిచేసుకుని జీవించటానికి ప్రయత్నం చేద్దాం. 

Fr. Bala Yesu OCD

24, డిసెంబర్ 2024, మంగళవారం

క్రీస్తు జయంతి సందేశం"డిసెంబర్ 25

"క్రీస్తు జయంతి సందేశం"డిసెంబర్ 25
ఈనాడు యావత్ ప్రపంచం మొత్తం కూడా క్రీస్తు జయంతి యొక్క పుట్టినరోజు పండుగను కొన్నియాడుచున్నది. ఈ పండుగ కేవలం క్రైస్తవులు మాత్రమే కాకుండా మిగతా వారందరూ కూడా జరుపుకుంటారు ఏదో ఒక విధముగా వారి ఇంటిలో క్రిస్మస్ నక్షత్రమో, చెట్టునో ఉంచుకుంటూ వారి ఈ పండుగను జరుపుకుంటారు. 
1. క్రిస్మస్ పండుగ అందరికీ ఆనందంనిచ్ఛే ఒక పండుగ ఎందుకనగా 
-ఎన్నో వందల సంవత్సరముల నుండి ఎదురుచూస్తున్నటువంటి మెస్సయ్య జన్మించబోతున్నారు, - ప్రవక్తల యొక్క ప్రవచనములు నెరవేరబోతున్నాయి.
- దేవుని యొక్క రాకడ భూమి మీద మన జన్మంలా జరుగుచున్నది. దేవుడు ఈ భూమి మీదకు మనలాగా వచ్చి మన అందరిని కూడా పరలోకము చేర్చాలి అన్నదే ప్రభువు యొక్క కోరిక. ఇంగ్లీషులో ఒక గొప్ప మాట ఈ విధంగా రాయబడినది Jesus became so that we might become what He is. దేవుడు మానవుడు అయినది, మానవుని తనలాగా మార్చుట కొరకే. క్రీస్తు యొక్క జననము ద్వారా మనము మొట్టమొదటిసారిగా చరిత్రలో దేవుణ్ణి కనులారా చూడగలుగుతున్నాము, చెవులారా వినగలుగుతున్నాము. చేతితో తాకగలుగుతున్నాము. ఆయన యొక్క ఉనికిని మనము మన యొక్క జీవితంలో అనుభవించగలుగుతున్నాం. ఇది కేవలం దేవుడు మానవుల మీద ఉన్నటువంటి ప్రేమ వలన మాత్రమే చేసినటువంటి గొప్పదైనటువంటి పని. 
ఎందుకు దేవుడు మానవుడు అయ్యారు అని మనం ఇంకా ధ్యానించినట్లయితే ప్రభువు పతనమైనటువంటి మానవలోకమును రక్షించుట కొరకు, తప్పిపోయిన గొర్రెలను వెదకుట కొరకు, మనందరికీ పరలోక మార్గము చూపుట కొరకు ఆయన మనలాగా మారి మన మధ్యన నివసించారు. ఒక చిన్న సంఘటన మనకు ఇంకా క్లుప్తంగా ఈ అంశం గురించి వివరిస్తుంది. ఒక మంచు కురిసే(మంచు గడ్డ కట్టే స్థలం) ప్రాంతంలో ఒక రోజున కొన్ని పక్షులు ఒక భక్తుడు యొక్క ఇంటి దగ్గర చెట్టు మీద వాలి ఉన్నాయి అయితే బయట చాలా చలిగా, మంచు గడ్డలు కట్టడం వల్ల అక్కడున్నటువంటి పక్షులన్నీ కూడా ఎటు వెళ్లాలో తెలియక దీనస్థితిలో ఉన్నాయి వాటి పరిస్థితిని చూసినటువంటి ఆ భక్తుడు ఎలాగైనా సరే వాటిని రక్షించాలనుకున్నాడు కానీ అది ఎలా అని ఆయనకు తోచలేదు అప్పుడు తన ఇంటి ప్రక్కన ఉన్న ఒక షెడ్డులో కొంచెం మేత పెట్టి వాటిని లోపలికి పిలవటానికి ప్రయత్నం చేశాడు కానీ అక్కడున్న పక్షులు ఆయన మాట విని లోపలికి రాలేకపోయాయి ఎందుకంటే ఆయన స్వరాన్ని అవి గుర్తించలేకపోయాయి అప్పుడు ఆయన తన మనసులో ఈ విధంగా అనుకుంటున్నాడు నేను కూడా ఒక పక్షినైతే ఈ పక్షులన్నీ కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్లి బ్రతికించి ఉండే  వాడినని భావించాడు. ఈ యొక్క విషయము ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే ఎవరైతే ఇతరుల యొక్క స్వభావంలోకి వెళుతుంటారో, ఇతరులు లాగా మారతారు అప్పుడు వారికి అనేక విషయాలు తెలియచేసి వారిని రక్షించవచ్చు. దేవుడు కూడా చేసినటువంటి గొప్ప పని ఇదే మనలాగా వచ్చి మనందరినీ పరలోకం చేర్చాలనుకున్నారు, మనకు అనేక విషయాలు మన స్వభావంలో అర్థమయ్యే విధంగా తెలిపి మనలను మార్చాలనుకున్నారు. ఇది ఒక సంతోషకరమైనటువంటిది మానవాళి ఆనందమునుంచే వార్త.
.2. క్రిస్మస్ పండుగ మార్చే పండుగ అనగా భూలోకాన్ని పరలోకముగా మార్చినటువంటి గొప్ప పండుగ. దేవుడు ఉన్న స్థలము పరలోకం అదే దేవుడు భూలోకమునకు వచ్చి పరలోకంగా మార్చారు. మనకు  పరలోక అనుభూతిని కలుగ చేశారు. ఏసుప్రభు తన యొక్క రాకతో ఎందరినో మార్చారు మరి ఆయన రాకడ మనల్ని మార్చగలుగుతుందా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏసుప్రభు తన మాటల ద్వారా క్రియల ద్వారా సాన్నిధ్యం ద్వారా అనేక మందిని మార్చారు.
3.  క్రిస్మస్ అనగా దేవుడు మానవులకు దగ్గరైన వేళ. దేవుడు మానవులకు ప్రేమను పంచుటకు దగ్గరగ వచ్చారు మరి మనము దేవుని కొరకు రాగలుగుతున్నామా? ప్రభువే తన చిత్తము ప్రకారముగా మన కొరకు తన యొక్క మహిమాన్వితమైనటువంటి స్థలమును విడిచి మన కొరకు వచ్చారు. మనము దేవుని కొరకు దేవాలయానికి వస్తున్నామా?
రక్షకుని యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్న అందరూ కూడా కలిసి ఆనందంగా ఈ పండుగ కొనియాడుతూ, ప్రేమను పంచుతూ, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ దేవుడిని ఆరాధిస్తూ ఈ యొక్క పుట్టినరోజు పండుగను కొనియాడాలి.

Fr. Bala Yesu OCD

21, డిసెంబర్ 2024, శనివారం

ఆగమన కాల నాలుగవ సామాన్య ఆదివారం

ఆగమన కాల నాలుగవ సామాన్య ఆదివారం 
మీకా 5:1-4 హెబ్రీ 10: 5-10 లూకా1:39-45
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు ఏసుప్రభు యొక్క ఆగమనం కోసం ఎదురు చూసే వారందరిలో ఆయన యొక్క జన్మం జరుగుతుంది అనే అంశము గురించి తెలియజేయు చున్నవి. దేవుని ప్రణాళికకు సహకరిస్తూ ఆ ప్రణాళికను వ్యక్తిగత జీవితంలో అమలు చేస్తూ జీవించే ప్రతి ఒక్కరిలో దేవుడు జన్మిస్తారు.  ప్రభువు యొక్క జన్మదినం త్వరగా రాబోవుచున్నది కాబట్టి ఆయన రాక కొరకు ఆధ్యాత్మికంగా తయారవ్వాలి.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు మీకా ప్రవక్త ద్వారా చేసినటువంటి వాగ్దానములను తప్పనిసరిగా నెరవేరుస్తారు అనే విషయమును తెలుపుచున్నారు. బెత్లెహేము నుండి రక్షకుడు ఉదయిస్తాడు అని ప్రవక్త తెలియజేశారు. దీనిలో ఒక అర్థము ఉన్నది. ఎందుకు ప్రత్యేకంగా దేవుడు బెత్లహేముని ఎన్నుకున్నారు రక్షకుని జన్మస్థలంగా? మొదటిగా బెత్లహేము అనగా హౌస్ ఆఫ్  ద బ్రెడ్ అని అదేవిధంగా దేవుని యొక్క నిలయము అని అర్థం కావున అక్కడినుండి రక్షకుడు జన్మిస్తారు. బెత్లహేము లేవీయులకు కేంద్ర స్థానంగా ఉన్నది. బెత్లహేము దావీదు రాజు యొక్క జన్మస్థలం. ఇశ్రాయేలును పరిపాలించే పాలకుడు మరియు దేవుడు పంపబోయే వ్యక్తి క్రీస్తు ప్రభువే ఎందుకంటే దేవుడు మరియమ్మకు ప్రత్యక్షమైన సమయంలో తనతో పలికిన మాటలు ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని అన్నారు.( లూకా 1:33). దేవుడు చిన్నదైనటువంటి బెత్లహేమును ఎన్నుకొని ఆ ప్రదేశమునకు రక్షకుని జన్మస్థలమును అర్థము  ఇస్తున్నారు. ఎఫ్రాతా అనేది ఒక చిన్న గ్రామం దానికి పెద్ద గుర్తింపులేదు అయితే దేవుడు మాత్రము ఆ గ్రామాన్ని ఎంచుకున్నారు. ఆయన ఈ భూలోకానికి రావడానికి ఒక గొప్ప ప్రాంతమును ఎన్నుకొనక కేవలం గుర్తింపు లేని అతి సామాన్యమైన ప్రాంతమున ఎన్నుకొని దానికి ఒక గొప్పదైన అర్థం ఇస్తున్నారు. మన జీవితంలో ప్రముఖమైన స్థలంలో జీవించడానికి ప్రయత్నిస్తాం కానీ దేవుడు మాత్రం ఒక చిన్నదైనటువంటి గుర్తింపు లేని స్థలము ఎన్నుకొని అక్కడ జన్మిస్తున్నారు.
దేవుడు అల్పులైనటువంటి చేపలు పట్టే శిష్యులను ఎన్నుకొని వారిని గొప్పవారిగా తీర్చిదిద్దారు సామాన్యురాలు అయినటువంటి మరియమ్మ గారిని ఎన్నుకొని దేవుని తల్లిగా చేశారు కాబట్టి ప్రభువు అల్పమైనటువంటి ప్రాంతంలో జన్మించి ఆ ప్రాంతములకే కొత్తదైన అర్థం ఇస్తున్నారు ఈ క్రిస్మస్ కాలమున అల్పుల మైనటువంటి మనలో జన్మించి మన యొక్క జీవితమునకు కూడా కొత్త అర్థమును దయ చేస్తారు. 
ఈనాటి రెండవ పఠణంలో ఏసు క్రీస్తు ప్రభువు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు అని తెలియజేశారు. 
ఈనాటి సువిశేష భాగములో మరియమ్మ గారు ఎలిజబెతమ్మను సందర్శించుట గురించి వింటున్నాం దేవదూత వద్ద నుండి శుభ వచనము విన్న మరియ మాత వెంటనే తన చుట్టమైన ఎలిజబెతమ్మను కలుసుకొనుటకు వెళ్ళుచున్నారు. దాదాపుగా నాలుగు రోజుల ప్రయాణం చేసి విసుగు చెందకుండా నజరేతు నుండి యూదయా పట్టణంలో ఉన్న  అయిన్ కరీము అనే ప్రాంతమునకు మరియ తల్లి 130 కిలోమీటర్లు ప్రయాణం చేసి  ఎలిజబెత్తమ్మను కలుసుకున్నారు. ఈ యొక్క సువిశేష పట్టణములో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు.
1. అడగక మునుపే సహాయము చేయుట. మరియ తల్లిని ఎలిజబెత్తమ్మ సహాయము చేయమని పిలవలేదు కానీ మరియమ్మ గారే ఎలిజబెత్ పరిస్థితిని అర్థం చేసుకొని వారికి సహాయం చేయుటకు వెళ్లారు. కానా పల్లెలో కూడా మరియ తల్లియే చొరవ తీసుకొని వారు అడగకమునుపే సహాయం చేశారు. మన క్రైస్తవ జీవితంలో కూడా చాలా సందర్భంలో మనం ఇతరులు మనల్ని అడగాలనుకుంటాం అప్పుడే సహాయం చేస్తాం కానీ మరియ తల్లి యొక్క గొప్పతనం ఏమిటంటే అడగకపోయినా సహాయం చేసే గుణం అని మనం నేర్చుకోవాలి. 
2. ఆనందమును పంచుకొనుట. మరియమ్మ గారు దేవునికి తల్లిగా పిలవబడిన సమయంలో తన యొక్క ఆనందమును తన చుట్టమైన ఎలిజబెత్తమ్మతో పంచుకొనుటకు ఆనందముతో పరిగెడుచున్నారు. దైవ అనుభూతిని కలిగిన మరియమ్మ గారు ఇంకొక వ్యక్తిని సందర్శిస్తూ తన దైవ అనుభూతిని మరియు ఆనందమును ఇతరులకు ఇస్తున్నారు. మనం కూడా క్రైస్తవ జీవితంలో ఇతరులకు ఆనందం నివ్వటానికి ప్రయత్నించాలి. 
3. మరియమ్మ గారి యొక్క వినయం. మరియమ్మ గారు కూడా గర్భము ధరించి ఉన్నారు తాను కూడా ఇతరుల యొక్క సహాయం కావలసిన వారే కానీ తాను తన యొక్క సహాయం చూసుకోకుండా ఇతరులకు సహాయం చేయాలని తనను తాను తగ్గించుకొని ఎలిజబెత్ దగ్గరకు వెళుతుంది. వాస్తవానికి మరియమ్మ గారు దేవునికి తల్లిగా ఉండబోతున్నారు ఎలిజబెతమ్మ ప్రవక్తకు తల్లిగా ఉండబోతున్నారు ఈ సందర్భంలో మరియమ్మ గారి దేవుని తల్లి అయినప్పటికీ తన్ను తాను తగ్గించుకొని సేవాభావంతో ఎలిజబెతమ్మ దగ్గరకు వెళ్లి సేవ చేస్తున్నారు.
4. ఎలిజబెతమ్మ తన వయసులో చిన్నదైనా మరియమ్మ గారికి నమస్కరించి నా దేవుని యొక్క తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించెను అని మరియమ్మ గారిని గౌరవించి నమస్కరించినది మనం కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనకన్నా చిన్న వయసులో ఉన్నటువంటి వారి యొక్క గొప్పతనమును మంచితనము చూసినప్పుడు వారిని కూడా గౌరవించాలి. జీవం పోసిన దేవునికి జీవమునిచ్చుటకు నిన్ను తల్లిగా దేవుడు ఎన్నుకున్నారని ఎలిజబెత్తమ్మ మరియమ్మ గారిని గౌరవించారు.
ఈనాటి ఈ యొక్క దివ్యగంధ పఠణముల ద్వారా మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా దేవుని యొక్క ప్రణాళికను అంగీకరిస్తూ ఆయన యొక్క రాకడ కొరకు ఎదురుచూస్తూ జీవించాలి. మన యొక్క జీవితంలో ప్రభువు కొరకు తయారు చేసుకోవాలి. మరియ తల్లి మరియు ఎలిజబెతమ్మవలే ఇతరులకు సహాయం చేస్తూ, ప్రేమను పంచుతూ జీవించాలి. 
Fr. Bala Yesu OCD

14, డిసెంబర్ 2024, శనివారం

ఆగమన కాల మూడవ ఆదివారం

ఆగమన కాల మూడవ ఆదివారం 
జెఫాన్య 3:14-18, ఫిలిప్పీ 4: 4-7 లూకా 3:10-18
ఈనాటి ఆదివారమును తల్లి శ్రీ సభ "ఆనందించు"(Gaudete Sunday)ఆదివారంగా పిలుస్తున్నది ఎందుకనగా ప్రభువు యొక్క జన్మము ఆసన్నమవుతున్నది కాబట్టి మనము సంతోషించాలి. ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు మనకు బోధించుచున్నటువంటి అంశము కూడా ఆనందించుట గురించియే. ఎందుకు మనము ఆనందించాలి అనే అంశమును ధ్యానించినట్లయితే మనకు అనేక విషయములు జ్ఞాపకం వస్తాయి;
- మనలను రక్షించే దేవుడు రాబోతున్నారు కాబట్టి ఆనందించాలి.
- మనతో ఉండే దేవుడు రాబోతున్నారు కాబట్టి ఆనందించాలి.
-  మనల్ని ప్రేమించే దేవుడు రాబోతున్నారు కాబట్టి ఆనందించాలి.
- మనల్ని క్షమించే దేవుడు వస్తున్నాడు కాబట్టి సంతోషించాలి
- మనలను పరలోకం చేర్చే దేవుడు రాబోతున్నారు కాబట్టి ఆనందించాలి ఈ విధంగా దేవుని యొక్క అనేక అంశములను గురించి మనము ఆనందించాలి.
ఏ విధముగానయితే మనము ప్రార్ధించినప్పుడు దేవుడు మనకు దయచేసినప్పుడు మనం ఆనందిస్తామో, అదేవిధంగా చిన్నపిల్లలు తమకు నచ్చిన దానిని వారు పొందుతున్నప్పుడు ఆనందిస్తారు మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా మనలను తండ్రి వైపుకు నడిపించే ప్రభువు రాబోతున్నందుకు మనం కూడా సంతోషించాలి.
ఈనాటి మొదటి పఠణంలో జెఫన్యా ప్రవక్త ఇశ్రాయేలును, యెరుషలేమును సంతోషించమని తెలుపుచున్నారు. ప్రభువు వారి మీద ఉన్నటువంటి నిందలను తొలగించినందుకుగాను అదే విధముగా వారిని శత్రువుల యొక్క భారి నుండి కాపాడినందుకు సంతోషించమని తెలుపుతున్నారు. దేవుడు వారి యొక్క మధ్య ఉన్నందుకు, దేవుడు వారిని క్రింద పడనివ్వకుండా చూసుకుంటున్నందుకు అదే విధముగా వారికి నూతన జీవితమున వసుగుతున్నందుకుగాను ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను, యెరుషలేము వాసులను సంతోషించమని తెలుపుచున్నారు. వాస్తవానికి ఇశ్రాయేలీయులు బానిసత్వమునకు పంపబడిన సమయంలో వారి నుండి స్వేచ్ఛ, ఆనందం తీసివేయబడినది ఇప్పుడు మరొకసారి దేవుడు వారిని విముక్తులను చేస్తూ వారికి ఇవ్వవలసినటువంటి ఆనందమును దయచేస్తున్నారు అందుకే ప్రవక్త ఆనందించండి అని తెలుపుచున్నారు. 
ఈనాటి రెండవ పఠణంలో కూడా పునీత పౌలు గారు ప్రభువు నందు ఆనందించండి మహా ఆనందపడండి అని పలుకుతున్నారు. ప్రభువు యొక్క రాకడ కొరకై విచారింపక హృదయపూర్వకంగా ప్రార్థించమని పౌలు గారు తెలిపారు. పౌలు గారు ఫిలిప్ప ప్రజలకు దేవుని వాక్యము ప్రకటించు సందర్భంలో పరిసయ్యుల వలన పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకొని ఫిలిప్పు ప్రజలను కూడా వారి జీవితంలో ఎదురయ్యే శ్రమలకు చింతింపక దేవునియందు నమ్మకంతో  వారిని హృదయపూర్వకంగా ప్రార్ధించమంటున్నారు వారి శ్రమలు కొద్ది కాలమే అంటున్నారు. ప్రభువు వస్తారు కావున ఆనందించమని అదే విధంగా మహా ఆనందంతో ఉండమని తెలుపుచున్నారు.
ఈనాటి సువిశేష భాగములో బప్తిస్మ యోహాను గారి మాటలు విన్న ప్రజలు వెంటనే హృదయ పరివర్తనమునకు చెందిన క్రియలను చేయుటకు ప్రయత్నం చేస్తున్నారు.ఎవరైతే రెండు అంగీలను కలిగి ఉన్నారో వారు లేని వారికి ఒకటి ఇమ్మని తెలుపుతున్నారు అదేవిధంగా భోజన పదార్థములు కలిగిన వారు లేనివారికి ఇవ్వమని తెలుపుతున్నారు. ఈ మాటలు యొక్క సారాంశం ఏమిటంటే దేవుడు ఇచ్చిన దానిని ఉదారంగా ఇతరులతో పంచుకుని జీవించమని యోహాను గారు తెలుపుతున్నారు. అదేవిధంగా సుంకరులను అధిక సుంకమ వసూలు చేయవద్దంటున్నారు, అలాగే రక్షక భటులు వచ్చి అడిగినప్పుడు ఎవరికి కూడా హాని చేయకుండా న్యాయముగా వారిపట్ల ప్రవర్తించమని బప్తిస్మ  యోహాను గారు తెలిపారు. వాస్తవానికి ఈ మూడు అంశాలు కూడా సంతోషించదగినటువంటి అంశములే ఎందుకంటే వారు హృదయ పరివర్తనము చెంది ఇతరులకు సంతోషించే విధంగా జీవిస్తున్నారు. ఎప్పుడైతే యోహాను గారు వారిని హృదయ పరివర్తనము చెంది దేవుని వైపు మరలి రమ్మంటున్నారో వెంటనే వారిలో ఉన్న పాపమును గ్రహించి  మెస్సయ్యాను స్వీకరించుట కొరకై తగినటువంటి క్రియలు చేయుటకు సిద్ధముగా ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీకి, మీలో పాపము చేయని వ్యక్తి ఈమె మీద మొదటి రాయిని వేయమన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ వారిలో ఉన్న పాపమును గ్రహించి వెంటనే తిరిగి వెళ్ళారు. ఈ యొక్క సువిషేశ భాగములో వున్న వ్యక్తులు కూడా వారి పాపపు జీవితమును సరి చేసుకొనుటకు సిద్ధపడుతున్నారు దాని వలన ఈ సమాజము కూడా సంతోషిస్తూ ఉన్నది. ఈరోజు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే నేను ఇతరులకు సంతోషిస్తున్నానా?. నా వలన నలుగురు సంతోషపడుతున్నారా?. నా రక్షకుని రాకడ కొరకు ఎదురుచూస్తున్నానా? నేను సంతోషంగా జీవిస్తున్నా? అని పరిశీలన చేసుకొని జీవించాలి.
మనం ఆనందంగా ఉండుట కొరకై ప్రభువు వస్తున్నారు కాబట్టి ప్రతినిత్యం కూడా ఆనందంగా జీవించడానికి పాపము లేకుండా పుణ్య క్రియలు చేస్తూ జీవిద్దాం. 
Fr. Bala Yesu OCD

7, డిసెంబర్ 2024, శనివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం 
బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గురించి తెలియజేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఆగమన కాలంలో రెండవ మరియు మూడవ ఆదివారములో బప్తిస్మ యోహాను సందేశమును వింటుంటాం. దేవుని యొక్క రాకడ కొరకై మనందరం కూడా మన జీవితంలో మార్గమును సిద్ధము చేయాలి. ప్రతి ఒక్కరి ప్రయాణమునకు ఒక మార్గము అనేది తప్పనిసరిగా అవసరం ఎందుకంటే మార్గము లేనిదే ప్రయాణము సక్రమంగా జరగదు, గమ్యమును చేరలేము. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాత్మ భూమికి నడిచే సమయములో దేవుడే స్వయముగా వారికి మార్గ సూపరిగా ఉండి వారిని నడిపించారు. మార్గము లేని జీవితము గమ్యము చేరటము కష్టం.
ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు స్వయంగా తన ప్రజల కొరకు బాబిలోనియా నుండి యెరుషలేమునకు మార్గమును సిద్ధం చేస్తారని తెలుపుతున్నారు కనుక బారుకు ప్రవక్త దుఃఖించే ఇశ్రాయేలు ప్రజలను సంతోషించమని తెలుపుచున్నారు. బారుకు ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలను దేవుని చెంతకు తిరిగి రమ్మని ఆహ్వానిస్తున్నారు. వారి యొక్క బానిసత్వం ముగిసిన తర్వాత తిరిగి దేవుని చెంతకు రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఈ యొక్క ఆగమన కాలంలో మనందరం కూడా మన యొక్క పాపపు జీవితమును వదిలి, దేవుని చెంతకు తిరిగి రావాలి అదే ప్రభువు కోరుకుంటున్నారు. ప్రభువు ఇశ్రాయేలు ప్రజల కొరకై తానే స్వయంగా మార్గమును సిద్ధం చేస్తున్నారు లోయలు పుడ్చుతున్నారు. ప్రభువు తన ప్రజలకు ఒక మంచి మార్గమును ఏర్పరిచి వారిని సంతోషంగా ఉండులాగా చేస్తారని బారుకు ప్రవక్త తెలియజేశారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు ఫిలిప్పీయులను దేవుని యొక్క రాకడ కొరకై సంసిద్ధత కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ప్రార్థించుకొనమని తెలియజేస్తున్నారు.
ఈనాటి సువిశేష భాగములో యోహాను గారు ప్రభువు యొక్క రాకడ కొరకై మార్గమును సిద్ధం చేయుడని  వెలిగెత్తి యోర్థను నది తీరమున ప్రకటించుచుండెను. బప్తిస్మ యోహాను ఈ లోకమునకు వచ్చినదే యేసు ప్రభువు కొరకు మార్గమును సిద్ధం చేయుట కొరకు దాని ద్వారా ఏసుప్రభు ఇంకా త్వరగా తండ్రి పరిచర్యను ఈ లోకంలో చేయవచ్చు కాబట్టి.
మన జీవితంలో దేవుని యొక్క రాకడ కొరకు మార్గమును సిద్ధం చేయని యెడల దేవుడు మన ఇంటి గుండా ప్రవేశించరు, మనలోకి ప్రవేశించరు. మన యొక్క జీవితంకు మార్గమును హృదయ పరివర్తన ద్వారా, చెడును విడిచి పెట్టుట ద్వారా ఏర్పరచవచ్చు అప్పుడు దేవుడు మనలోకి ప్రవేశిస్తారు. మార్గమును సిద్ధం చేయుట చాలా కష్టం ఎందుకంటే అడ్డుగా ఉన్నటువంటి ప్రతిది కూడా తొలగించాలి అప్పుడే మార్గము ఏర్పరచగలరు కాబట్టి దేవుని యొక్క రాకడ కొరకు ఏదైతే అడ్డుగా ఉంటుందో మనము దానిని తీసివేయాలి. ప్రభువు కొరకు మార్గమును సిద్ధం చేయమని ఎడారిలో ఒక స్వరము వినబడెను అని యెషయా ప్రవక్త తెలియజేశారు. ఎడారి అనునది దేవుడిని కలుసుకునే ఒక స్థలం, మన జీవితాలు మార్చు స్థలం. మనము ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు మనకు తోడుగా ఉంటారు అని తెలిపే ఒక ప్రదేశం. హాగారు ఎడారిలో ఉండగా దేవుడు ఆమెకు తోడుగా ఉన్నారు. ఏలియా నిర్జన ప్రదేశంలో ఉండగా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నారు కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఎడారి వలె నిరుత్సాహమైనటువంటి సమయములు ఎదురైనప్పుడు మనము దైవ అనుభూతిని పొందగలము. దేవుడు మనకు తోడుగా ఉంటారు.
ప్రతి లోయ పూడ్చబడును అని తెలుపుతున్నారు అనగా మనలో మనలో ఉన్నటువంటి అసమానతలను దేవుడు తన యొక్క వాక్యము ద్వారా దివ్య సంస్కారాలు ద్వారా నింపుతూ సరిసమానం చేస్తారు. అదేవిధంగా పర్వతాలు కొండలు సమము చేయబడాలి అనగా మనలో ఉన్నటువంటి గర్వము, అహము అనేటటువంటి చెడు గుణములను సమానము చేయాలి అనగా వినయము కలిగి జీవించాలి. వక్రమార్గములు సరిచేయాలి అనగా మన యొక్క జీవనశైలిని మార్చుకోవాలి. ప్రభువుకి మన హృదయములో మార్గము సిద్ధము చేయాలంటే మన గర్వమును తగ్గించుకోవాలి, పాపపు జీవితాన్ని విస్మరించాలి. పరిత్యజించుకునే లక్షణము కలిగి ఉండాలి. ఈ యొక్క ఆగమన కాల రెండవ ఆదివారంలో మనందరం కూడా ధ్యానించవలసినటువంటి అంశము ఏమిటంటే దేవుని కొరకు మనము మన జీవితంలో ఎలాంటి మార్గమును సిద్ధం చేస్తున్నాం?. ఆయన కొరకు అడ్డుగా ఉన్నటువంటి పాపమును తొలగించుకుని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా.? హృదయ పరివర్తనం చెందుతున్నామా లేదా? పాపక్షమాపణను కలిగి ఉంటున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
Fr. Bala Yesu OCD

30, నవంబర్ 2024, శనివారం

ఆగమన కాలం మొదటి ఆదివారం

ఆగమన కాలం మొదటి ఆదివారం 
యిర్మీయా 33:14-16, 1 తెస్స3:12,4:2, లూకా 21:25-28,34-36
ఈనాడు తల్లి శ్రీ సభ ఆగమన కాలమును ప్రారంభించినది. ఆగమన కాలంతో ఒక కొత్త దైవార్చన సంవత్సరం ప్రారంభమవుతున్నది. ఈ యొక్క ఆగమన కాలంలో మనము ప్రభువు యొక్క జన్మము కొరకై/రాకడ కొరకై ఎదురుచూస్తూ ఉన్నాం. ఆగమన కాలము ఒక ప్రత్యేకమైన కాలం ఎందుకనగా ఏసుప్రభు యొక్క పుట్టినరోజు కొరకై మనందరం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ యొక్క కాలములో మనము మన హృదయములను పవిత్ర పరచుకొని ఆయన కొరకు ఎదురు చూస్తుంటాం. 
ఏసుప్రభు అనేక విధాలుగా మన మధ్యలోనికి వస్తారు. దివ్య సత్ప్రసాదం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని వాక్యము చదవడం ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా అనేక విధాలుగా ప్రభువు మన మధ్యకు వస్తూ ఉంటారు. ఈ యొక్క ఆగమన కాలంలో దేవుని యొక్క జన్మం మనందరి యొక్క హృదయములలో ప్రత్యేకంగా జరగాలని మనము ఆధ్యాత్మికంగా తయారవుతాం. 
ఈనాటి దివ్య గ్రంథ పఠణములు కూడా ప్రభువు రాకడ గురించి, నిరీక్షించుట గురించి, విశ్వాసముతో ఉండుటను గురించి తెలియజేస్తూ ఉన్నాయి. 
ఈనాటి మొదటి పఠణంలో యిర్మియా ప్రవక్త దేవుని యొక్క రాకడను గురించి తెలియజేస్తున్నారు. యూదా ప్రజలు దేవుడిని మరచి, తన యొక్క ఆజ్ఞలను మీరారు. దేవుని యొక్క ప్రజలను నడిపించే రాజులు కూడా దేవుని ప్రవక్త అయినా యిర్మియా మాటలను వినలేదు అందుకే శిక్ష అనుభవించారు. దేవుని యొక్క శిక్ష అనుభవించిన తర్వాత దేవుడు వారికి ఒక సంతోష వార్తను తెలియజేస్తున్నారు. కరుణ గలిగిన దేవుడు వారిని రక్షించుటకు దావీదు వంశము నుండి ఒక రాజును ఎన్నుకుంటానన్నారు. ఆ రాజు నీతి కలిగిన రాజు. ఆయన అందరికీ న్యాయం చేకూర్చే రాజు. ఆయన ప్రజలకు చేసిన ప్రతి ప్రమాణములను నిలబెట్టుకునే రాజు. 
యావే ప్రభువు ప్రజలకు ఒక ఆదరణ కర్త అయినటువంటి రాజును పంపిస్తూ వారికి కావలసిన స్వేచ్ఛను, స్వతంత్రమును దయ చేస్తారని చెప్పారు.
 దేవుడిచ్చిన వాగ్దానములను నెరవేరుస్తారు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశారు తనని ఆశీర్వదిస్తానని అది నెరవేర్చారు.(ఆది12:1-3)
ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి కాపాడుతానని వాగ్దానం చేశారు దానిని నెరవేర్చారు (నిర్గమ 3:7-8)
దేవుడు రక్షకుడిని పంపిస్తానని ప్రవక్తల ద్వారా తెలియజేశారు దానిని క్రీస్తు జన్మము ద్వారా నెరవేర్చారు కాబట్టి ప్రభువు ఇచ్చిన వాగ్దానములను తప్పక నెరవేరుస్తారని మనము విశ్వసించాలి.
రక్షకుడు వచ్చే కాలం యూదా రక్షణము పొందును అని ప్రవక్త తెలుపుతున్నారు అనగా క్రీస్తు ప్రభువు ద్వారా అందరూ రక్షించబడతారని అర్థం. ఎన్నో సంవత్సరాల నుండి ఇశ్రాయేలు ప్రజలు మెస్సయ్య యొక్క రాకడ కొరకు ఎదురుచూస్తున్నారు అది క్రీస్తు ప్రభువు ద్వారానే నెరవేరుతుందని యిర్మియా ప్రవక్త తెలియజేశారు. దావీదు రాజు ఇశ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప రాజు అదే విధముగా ఆయన వంశము నుండి జన్మింపనున్న రాజు కూడా అదే విధముగా తన ప్రజలను పరిపాలించును. ఆ రాజు ఈ లోకంలో జన్మించిన సందర్భంలో దేవుని యొక్క రక్షణ దినము అనేది రానున్నది, ఆ దినము ప్రజల నుండి భయమును తొలగించును, బానిసత్వమును దూరం చెయ్యను ఇదంతా కేవలం నీతి గల రాజు అయినటువంటి క్రీస్తు ద్వారానే జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆయన కొరకు ఆశతో ఎదురు చూడాలని కూడా ప్రవక్త తన ప్రజలకు తెలియజేశారు. వాస్తవానికి ఎదురు చూడటంలో ఆనందం ఉంది, ఎదురు చూడటంలో ఆశ ఉంది, నమ్మకం ఉంది, సహనం, ప్రేమ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే యిర్మియా ప్రవక్త ప్రజలకు రక్షకుడు వేంచేయు కాలం గురించి ఒక సంతోష వార్తను తెలుపుచున్నారు. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజల్లో పరస్పరమ ప్రేమ పెంచాలని అదేవిధంగా ఒకరి పట్ల ఒకరు ప్రేమను ఎల్లప్పుడూ కనబరుచుకొని జీవించాలని తెలియజేశారు. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా స్వచ్ఛమైన మరియు నిస్వార్ధమైన ప్రేమను చూపించాలని పౌలు గారు తెలియజేశారు. తాను ఏ విధంగానైతే వారి మధ్య మెలిగారో అదే విధముగా ఒకరి ఎడల ఒకరు ప్రవర్తించాలని కోరుకున్నారు. 
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు యొక్క రెండవ రాకడ కొరకై మనలను సంసిద్ధమై ఉండమని తెలియచేస్తున్నారు
ప్రకృతిలో జరుగు మార్పులను గురించి ఏసు ప్రభువే స్వయముగా తెలియచేస్తున్నారు. ఎన్ని విపత్తులు ఎదురైనా మనం దేవుని యందు విశ్వాసం కోల్పోకూడదు ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటారు. ప్రభు అనేక సందర్భాలలో నేను మీకు సర్వదా తోడై యుండును అని తెలియజేశారు కాబట్టి ఆయన మనతో అన్నివేళలా ఉంటారని మనం దృఢముగా విశ్వసించాలి. ఆయన యొక్క రాకడ కోసం మనం ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉండాలి అదియే క్రైస్తవ విశ్వాసం. ఆటంకములకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. బాధ్యత లేకుండా సుఖ సంతోషాలతో శారీరకవాంఛలకు లోనై ఇష్టం వచ్చిన రీతిగా జీవిస్తే దేవుని సంతృప్తి పరచలేము కావున పరిశుద్ధత కలిగి జీవించాలి మన యొక్క జీవితములను మనము ప్రభువు యొక్క రాకడ కొరకై తయారు చేసుకోవాలి. ప్రభువు మన కొరకై, మనలో ఉండుట కొరకై వస్తున్నారు కాబట్టి ఆయన కొరకు మన హృదయమును పవిత్ర పరచుకొని ఆయనను మనలో ఆహ్వానించు కోవాలి.
Fr. Bala Yesu OCD

23, నవంబర్ 2024, శనివారం

34వ సామాన్య ఆదివారం

34వ సామాన్య ఆదివారం
విశ్వవిబుడైన క్రీస్తు రాజు యొక్క మహోత్సవము.
దానియేలు 7:13-14,దర్శన 1:5-8, యోహాను 18:33-34
1 కొరింతి 15:20-26, 28
మత్తయి 25:31-46

ఈరోజు తల్లి శ్రీ సభ క్రీస్తు రాజు యొక్క మహోత్సవమును కొనియాడుతున్నది, 1925 వ సంవత్సరంలో 11వ భక్తినాధ పాపు గారు  ఈ పండుగను ప్రారంభించియున్నారు. 20వ శతాబ్దంలో యూరప్ దేశములో అధికారుల యొక్క పాలన కఠినంగా ఉండటంవల్ల, అప్పటి అధికారులు ప్రజలకు ప్రాముఖ్యతను వారి యొక్క అధికారంకు ప్రాముఖ్యతనిచ్చి జీవించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదు, జాతుల మధ్య వివక్షతను తీసుకుని వచ్చి ఉన్నారు. కొంతమంది దేవుడంటే విశ్వాసము లేకుండా అవిశ్వాసముతో జీవించే వారు, అదేవిధంగా కొంతమంది యూదులను బంధించి చెరసాలలో వేసి చంపారు. ఈ విధంగా అధికారులు తమ యొక్క స్వార్థం కొరకై అధికారమును వినియోగించుకునే సందర్భంలో 11వ భక్తనాధ పాపు గారు ఆనాటి  అధికారులకు, ప్రజలందరికీ క్రీస్తు ప్రభువు యొక్క అధికారం  ఏ విధంగా ఉన్నది తెలియజేశారు. ఈ విశ్వమంతటికి క్రీస్తు ప్రభువే రాజు అని ప్రకటించి, మన హృదయ పీఠాలపై క్రీస్తు రాజుని ప్రతిష్టించుకోమని అదే విధముగా మన జీవితాలను ఆయన ఆధీనమునకు అప్పగించుమని పాపుగారు ప్రోత్సహించారు. 
పరిశుద్ధ గ్రంథం మరీ ముఖ్యంగా పాత నిబంధన గ్రంథం క్రీస్తు ప్రభువును రాజుగా చూపిస్తుంది,ఆయన రాజ్యపాలన గురించి ప్రవక్తలు ముందుగానే తెలియచేశారు.
యెషయా 9:6-7, యిర్మీయా 23:5, దానియేలు 7:13-14. అదేవిధంగా నూతన నిబంధన గ్రంథంలో కూడా గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు మరియ తల్లితో 'తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యుగయుగములు యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యముకు అంతమే ఉండదు అని తెలియజేశారు'. పిలాతు కూడా ఏసుప్రభువుతో సంభాషించేటప్పుడు "నీవు యూదుల రాజువా"? అని అడుగారు. నీవే అంటున్నావు కదా అని ఏసుప్రభు తెలిపారు. ఆయన రాజు అని పవిత్ర గ్రంథములో చెప్పబడినది కాబట్టి మనందరం కూడా ఆయన  మన యొక్క రాజు అని గ్రహించి  ఆయన చెప్పిన విధముగా జీవింపసాగాలి.
ఈ లోకంలో ఎంతో మంది రాజుల గురించి మనము చదువు కొని ఉండవచ్చు, విని ఉండవచ్చు. ఏసుప్రభు యొక్క రాజరికం ఈ లోక రాజుల యొక్క పాలనకు భిన్నంగా ఉంటుంది. సిలువయే ఆయన సింహాసనం, ముళ్ళ కిరీటమే ఆయన రాజు కిరీటం, చేతిలోని దండమే తన యొక్క అధికారమునకు గుర్తు. పేద సాధలే తన యొక్క ప్రజలు. పరలోకమే తన రాజ్యం.
 ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎలాంటి పాలన చేసి ఉన్నారో మనందరం గ్రహించాలి, ఆయన మరణము తర్వాత కూడా ఒక తీర్పరి అయిన రాజుగా మనలను పరిపాలన చేస్తారు.
క్రీస్తు ప్రభువు ఎలాంటి రాజు అని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. సేవ భావం కలిగిన రాజు- ఏసుప్రభు ఈ లోకమునకు వచ్చినది సేవ చేయుటకే కానీ సేవింపబడుటకు కాదు. ఈ లోకంలో ఉన్న రాజులు ప్రతినిత్యం కూడా ఎదుటి వారి యొక్క సేవలను అందుకునే వారే, వారి యొక్క సుఖభోగాలు పేరు ప్రతిష్టల కొరకు పాలన చేసేవారు కానీ క్రీస్తు ప్రభువు ప్రతినిత్యం ఇతరులకు సేవ చేస్తూ వారి శ్రేయస్సు కొరకు జీవించారు.
2. ఆయన క్షమించే రాజు- ఏసుప్రభు శిలువ మీద వ్రేలాడే సమయములో తండ్రికి ప్రార్థన చేసినది ఏమనగా 'తండ్రి వీరేమి చేయుచున్నారో, వీరు ఎరుగరు కావున వీరిని క్షమించు' అని ప్రార్థన చేశారు. తన ప్రజలు తనకు విరుద్ధముగా చేసినటువంటి పాపములను క్షమించమని క్రీస్తు రాజు తన తండ్రిని ప్రార్థించారు. ఆయన మనందరి పాపములను క్షమించే రాజు.
3. ప్రేమించే రాజు- నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు అని తెలుపుచు, వారి కొరకు తన ప్రాణమును త్యాగం చేసినటువంటి గొప్ప రాజు క్రీస్తు ప్రభువు. ఆయన ప్రేమ ఎటువంటి భేదము లేనటువంటి ప్రేమ, అవధులు లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ. అంతటి గొప్పదైన ప్రేమతో తన ప్రజలను పరిపాలించారు ఆయన మనందరిని  నిరతము ప్రేమించే రాజు.
4. నడిపించే రాజు- ఒక గొర్రెల కాపరి తన మందకు ముందుగా ఉండి గొర్రెలను ఏ విధముగా నైతే పచ్చిక బయలు వైపు నడిపిస్తారో అదే విధముగా క్రీస్తు రాజు  తన ప్రజలను పరలోకము వైపు నడిపిస్తారు, మంచి వైపు నడిపిస్తారు. మనము ఆయన స్వరమును విని నడుచుకోవాలి.
5. శాంతిని నెలకొల్పే రాజు-ఏసుప్రభు ఈ లోకమునకు వచ్చినది ఎందుకంటే మన అందరి జీవితాలలో శాంతి- సమాధానములు నెలకొల్పుట కొరకై. పాపము చేసిన మానవుడు దేవునికి దూరమైనప్పుడు శాంతి సమాధానము లేకుండా జీవించే సమయంలో మన అందరి కొరకై తన్ను తాను బలిగా సమర్పించుకుని మనలను తండ్రితో సఖ్యపరచి ఉన్నారు దాని ద్వారా ప్రతి ఒక్కరికి శాంతిని దయచేసారు.
6. వినయము కలిగిన రాజు-ఏసుప్రభు తనను తాను రిక్తుని చేసుకొని ఈ లోకంలో మానవునిగా జన్మించి సేవకు రూపం దాల్చి, శిష్యుల యొక్క పాదాలు కడిగి ఎంతో వినయముతో జీవించారు. అయిన పవిత్రుడైనప్పటికీ పాపాత్ములమైన మన మధ్య జీవించారు. ఇది ఆయన యొక్క వినయమునకు గొప్ప నిదర్శనం.
7. మనందరినీ తన బాగా మార్చే రాజు. క్రీస్తు ప్రభువు మనందరం కూడా తనలాగా మారాలని కోరుతున్నాను అందుకని ఈ భూలోకమునకు వచ్చి మనకు అనేక రకములైన విషయములు తెలియజేశారు. దేవుని యొక్క ప్రతిరూపమున జన్మించిన మనందరం ఆయనను పోలినటువంటి వ్యక్తులుగా జీవించినవి అని ప్రభువు కోరుకున్నావు. ఏ అధికారి కూడా తనున్న స్థానంలో వేరే వారు ఉండటానికి ఇష్టపడరు కానీ క్రీస్తు రాజు మనందరం కూడా తన రాజ్యంలో ఉండాలి అలాగే తనలా ఉండాలని కోరుకున్నారు. 12 మంది శిష్యులను పిలిచి వారు తనలాగా మారాలని కోరుతున్నటువంటి ప్రభువు మన క్రీస్తు రాజు.
ఈనాడు క్రీస్తు రాజు యొక్క పండుగను జరుపుకునే సందర్భంలో ఆయన ఏ విధముగా జీవించి ఉన్నారో మనందరం కూడా ఆయన రాజ్యమునకు చెందిన వారు అయినట్లయితే ఆయన ఇచ్చే సూచనలు, ఆజ్ఞలు పాటించి జీవించాలి. అప్పుడు మాత్రమే మనందరం పరలోక రాజ్యములో ప్రవేశించగలుగుతాం. క్రీస్తు ప్రభువుని నీ హృదయ రాజుగా అంగీకరిస్తున్నావా? దాని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నావా అని వ్యక్తిగతంగా ఆలోచించి మనందరం కూడా ఆయన వలె జీవించాలి. క్రీస్తు రాజును మన యొక్క హృదయములను పరిపాలించే విధముగా మనము ఆహ్వానించాలి. ఆయన మన హృదయములను పరిపాలించిన యెడల మనందరం సన్మార్గంలో నడవగలం.
Fr. Bala Yesu OCD

16, నవంబర్ 2024, శనివారం

33 వ సామాన్య ఆదివారం

33 వ సామాన్య ఆదివారం 
దానియేలు 12:1-3, హెబ్రీ10:11-14,18 మార్కు 13:24-32
ఈనాటి పరిశుద్ధ గ్రంథములు దేవుని యొక్క రెండవ రాకడను గురించి తెలియజేస్తున్నాయి. ఆయన యొక్క రాకడ కొరకై మనందరం కూడా సంసిద్ధులై జీవించాలి. అదేవిధంగా దేవుడు తనను విశ్వసించే వారితో ఎల్లప్పుడూ ఉంటారని కూడా తెలియచేస్తూ ఉన్నాయి. ప్రభువు మన యొక్క కష్ట కాలములో, అంత్య దినములలో మనతోనే ఉంటారు ఎందుకనగా ఆయన ఇమ్మానుయేలు ప్రభువు, మనతో ఉండే దేవుడు. 
ఈనాటి మొదటి పఠణంలో దానియేలు ప్రవక్తకు కలిగిన నాలుగవ దర్శనము గురించి వింటున్నాము. మానవులు మరణించి సమాధి చేయబడిన తర్వాత మట్టిలో నిద్రించే చాలా మంది సజీవులవుతారని చెబుతున్నారు. 
ఆనాడు విశ్వాస పాత్రులుగా జీవిస్తున్న యూదులను నాల్గవ అంతెయోకు(Antioch. IV)  రాజు అన్యాయంగా వారిని యూదులను శిక్షకు గురిచేసి చంపారు. ఈ యొక్క రాజు ఆయన యూదా ప్రజల మీద అనేక రకములైన ఆంక్షలు విధించి వారు గ్రీకు మతస్తుల ఆచారాలను, పద్ధతులను అనుసరించాలని ఒత్తిడి చేశారు. యూదా ప్రజల సున్నతిని తిరస్కరించాడు, దేవాలయాలను ధ్వంసం చేశాడు దేవాలయంలో ఉన్న విలువైన వస్తువులను నాశనం చేశారు అది మాత్రమే కాకుండా వారికి విలువైన పవిత్ర గ్రంథం "తోరా" యొక్క ముఖ్య భాగాలను కాల్చివేశాడు. ఇలాంటి ఒక కష్టతరమైన పరిస్థితిలో ఉన్న సమయంలో ప్రవక్త దేవుని యొక్క అభయంను /రక్షణ వినిపించారు. దేవుని యెడల విశ్వాసము కలిగిన యూదులు కూడా మరణించిన తర్వాత శరీరంతో పునరుత్థానం చెందుతారని తెలిపారు. దేవుని యందు విశ్వాసము మరియు నిరీక్షణ కలిగి జీవించాలని కూడా ప్రవక్త వారిని ప్రోత్సహించారు. దానియేలు ప్రవక్త ప్రజలు అనుభవించే బాధలను చూసి వారికి ఊరటనిస్తున్నారు. దేవుడు ఎప్పుడూ తన ప్రజలకు చేరువలోనే ఉంటారని తెలియజేశారు. దానియేలు గ్రంధం 11: 21-39 వచనములు చదివినట్లయితే ఇక్కడ సిరియా రాజు అయినా నాలుగవ అంతియోక్ యొక్క దురాలోచనలు, ఆయన అహం, స్వార్థం ఆయన చేసే హింసలు అర్థమవుతాయి. ఎన్ని విపత్తులు ఎదురైనా సరే ప్రజలలో ఒక విధమైన ఆశను నమ్మకాన్ని ప్రవక్త కలుగ చేశారు. వారి జీవిత అంత్య దినములు సంభవించినప్పుడు దేవుని కోసం ఎలాగ జీవిస్తున్నాం అన్నది ముఖ్యం. క్రైస్తవ విశ్వాసము మరియు యూదుల యొక్క విశ్వాసము ఏమిటనగా అంతిమ దినమున అందరు కూడా సజీవులుగా లేపబడతారని. యెహెజ్కేలు గ్రంథంలో ఎండిన ఎముకలకు దేవుని వాక్యము ప్రవచించగానే అవి శరీరమును పొందుకొని జీవము కలిగి ఉన్నాయి. యెహెజ్కేలు 37:13. చనిపోయిన వారు దేవుని కృప వలన సజీవులవుతారని ఈ యొక్క వాక్యము తెలుపుతుంది. మక్కబీయులు గ్రంథంలో ఏడుగురు సోదరులు ప్రాణత్యాగము చేశారని వింటున్నాం ఎందుకంటే వారికి పునరుత్థానమునందు విశ్వాసము ఉన్నది అందుకని వారు తమ ప్రాణాలను దేవుని కొరకు త్యాగం చేశారు.(2 మక్కబీయులు 7:9) ఈ యొక్క మొదటి పఠణం ద్వారా మనము గ్రహించవలసిన సత్యం ఏమిటంటే దేవుని యందు విశ్వాసము, నిరీక్షణ కలిగి మనము జీవించాలి. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన యందు విశ్వాసము కోల్పోకుండా జీవించాలి.
ఈనాటి రెండవ పఠణం యేసు క్రీస్తు ప్రభువు యొక్క యాజకత్వమును గురించి తెలుపుచున్నది. ఈ యొక్క భాగములో ప్రత్యేక విధముగా ఏసుప్రభువు సమర్పించిన బలికి మిగతా యాజకులు సమర్పించిన బలికి ఉన్నటువంటి వ్యత్యాసమును తెలియజేస్తున్నారు. పూర్వ నిబంధన ప్రధాన యాజకులు ఒకే రకమైన బలులు అర్పించినప్పటికీ ప్రజల పాపాలు తొలగించలేకపోయారు కానీ క్రీస్తు ప్రభువు తన యొక్క బలిద్వారా అందరి పాపాలను ఒక్కసారిగా మన్నించారు. ఆయన సమర్పించిన బలిలో రక్షణ సామర్థ్యం ఉంది. ప్రభువు సమర్పించిన బలి విశ్వాసులను దేవుని ఎదుట నీతిమంతులుగా చేస్తుంది శుద్ధికరిస్తుంది అదేవిధంగా అందరూ రక్షణ పొందుటకు సహాయపడుతుంది.  పాత నిబంధన గ్రంథంలో వారు సమర్పించిన బలులన్నీ కేవలము క్రీస్తు ప్రభువు యొక్క బలితో పరిపూర్ణమయ్యాయి. 
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు యొక్క రెండవ రాకడను గురించి తెలియజేస్తున్నది. క్రీస్తు శకం 69 వ సంవత్సరంలో రోమీయులు క్రైస్తవులను మరియు క్రైస్తవ మతం స్వీకరించిన యూదులను అనేక రకాల హింసలకు గురి చేశారు అలాంటి సమయంలో తన యొక్క ప్రజల విశ్వాసాన్ని బలపరుచుటకు దేవుడు మరలా వస్తాడని నమ్మకమును కలిగిస్తూ మార్కు సువార్తికుడు ఈ యొక్క మాటలను రాస్తున్నారు. తనకు కలిగినటువంటి దర్శనం వలన మనుష్య కుమారుని రాకడ ద్వారా ప్రపంచంలో కొన్ని ప్రకృతి మార్పులు జరుగుతాయని మార్కు గారు తెలియజేశారు. వాస్తవానికి నిజమైన విశ్వాసులకు అవన్నీ భయపెట్టే సంకేతాలు కావు ఎందుకనగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం గా జీవించిన వారికి ఎల్లప్పుడూ మేలు కలుగును ప్రభు వారందరినీ రక్షించును. ఏసుప్రభు అత్తి చెట్లనుండి ఒక గుణపాఠం ను నేర్పిస్తున్నారు. ఈ యొక్క అత్తి చెట్ల ఆకులు వసంత రుతువు చివరిలోనే చిగురిస్తాయి అవి అలా కనిపించినప్పుడు ఒక కొత్త కాలం సంభవించునదని మనకు తెలుస్తుంది ఆ కాలంకు తగిన విధంగా మనం కూడా తయారవ్వాలి. ఆకులు రాలిపోయాయి అంటే చెట్టు చనిపోయినది అని కాదు అర్థం, కొత్త ఆకులు వస్తాయని అర్థం. అదే విధముగా దేవుని యొక్క రెండవ రాకడ జరిగినప్పుడు కూడా క్రొత్తకాలం ప్రారంభమవుతుంది కాబట్టి మనం దానికి తగిన విధంగా జీవించటానికి ప్రయత్నం చేయాలి. మనలో ఉన్న పాపము, స్వార్థము, అహం అన్నింటిని చంపేయాలి అప్పుడే దేవునితో క్రొత్త జీవితం ప్రారంభించగలం.
 దేవుని యొక్క రాకడ కొరకు మనము ఎప్పుడూ సంసిద్ధముగా ఉండాలి. ఆయన యొక్క రాకడ ఎప్పుడు ఎలాగా వచ్చునో ఎవరికీ తెలియదు కాబట్టి ప్రతినిత్యం కూడా మనము మనల్ని తయారు చేసుకుంటూ జీవించాలి. చివరిగా ఈ యొక్క పఠణముల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు.
1. నిరీక్షణ కలిగి ఉండుట 
2. విశ్వాసము కలిగి జీవించుట 
3. దేవుని యొక్క రాకడకు సంసిద్ధత కలిగి జీవించుట 
4. ప్రభువుకు సాక్షులై ఉండుట. 
5. దేవునికి అనుగుణంగా జీవించుట.

Fr. Bala Yesu OCD

15, నవంబర్ 2024, శుక్రవారం

అంత దినములు ఎలా ఉండును

 అంత దినములు ఎలా ఉండును 

లూకా 17: 26-37 

నోవా దినములయందు ఎట్లుండెనో, మనుష్య కుమారుని దినములందును అట్లే ఉండును. జల ప్రళయమునకు  ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు, త్రాగుచు, వివాహమాడుచు ఉండిరి. జలప్రళయము వారిని నాశనము చేసినది. ఇట్లే లోతు కాలమున కూడ జరిగినది. ప్రజలు తినుచు, త్రాగుచు, క్రయవిక్రయములు చేయుచు, సేద్యము చేయుచు, గృహములను నిర్మించుకొనుచు ఉండిరి. కాని లోతు సొదొమనుండి విడిచిపోయిన దినముననే ఆకాశము నుండి అగ్ని గంధకము వర్షింపగా అందరు నాశనమైరి. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమునను ఇటులనే ఉండును. ఆ నాడు మిద్దె మీద ఉన్నవాడు సామగ్రి కొరకు క్రిందికి దిగిరాకూడదు. పొలములో  ఉన్నవాడు ఇంటికి మరలిపోరాదు. లోతు భార్యను గుర్తు చేసుకొనుడు. తన ప్రాణమును కాపాడుకొన యత్నించువాడు దానిని కోల్పోవును. తన ప్రాణమును కోల్పోవువాడు దానిని కాపాడుకొనును. ఆ రాత్రి ఒకే పడకమీద ఉన్న యిద్దరిలో ఒకడు కోనిపోబడును. ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండ, ఒకరు కొనిపోబడును. మరియొకరు విడిచి పెట్టబడును." "ప్రభూ! ఇది ఎక్కడ జరుగును?" అని శిష్యులు ప్రశ్నించిరి. కళేబరమున్న చోటనే రాబందులు చేరును" అని యేసు చెప్పెను. 

అంతదినములు ఎలా ఉండును? అని ప్రభువు ఈ సువిశేషభాగంలో  చెబుతున్నారు. ఒకసారి నోవా దినములను, లోతు దినములను గుర్తు చేస్తున్నారు. నోవా రోజులలో అందరు తినుచు త్రాగుచు ఉన్నారు.  అందరు వారి వారి రోజు వారి పనులలో నిమగ్నమై ఉండగా ఎటువంటి హెచ్చరిక లేకుండా, హఠాత్తుగా జలప్రళయము వచ్చింది, లోతు కాలంలో ప్రజలు వారి వారి పనులలో ఉన్నారు. ఆసమయంలోనే   ఆకాశం నుండి గంధకము వర్షించినది.  ప్రభువు రోజు ఎప్పడు మనకు ఇష్ఠమైనపుడు, మనం కోరుకున్నప్పుడు  రాదు.

 ప్రభువురోజు ఎటువంటి హెచ్చరిక లేకుండా వస్తుందా? ప్రభువు అనేక రోజులకు ముందుగానే హెచ్చరిస్తారు.  నోవా కాలంలో, మరియు లోతు కాలంలో కూడా  ప్రభువు ప్రజలను హెచ్చరించాడు.  అప్పటినుండి నోవా , లోతు ఆ రోజు కోసం సిద్ధపడ్డారు. నోవా  దేవుని ఆజ్ఞ ప్రకారం ఒక ఓడను తయారు చేసాడు. మిగిలిన ప్రజలు వారి వారి పనులలో నిమగ్నమై ఉన్నారు కాని ప్రభువు మాటను పట్టించుకోలేదు.   నోవా మాత్రము వారితో  కలవకుండా తనకు దేవుడు చెప్పినట్లుగా  చేసాడు. జలప్రళయము వచ్చింది నోవా కుటుంబము మాత్రమే రక్షించబడింది. మిగిలిన వారు మాత్రము ప్రాణములను కోల్పోయారు. లోతు కాలములో కూడా ప్రభువు ప్రజలను హెచ్చరించాడు , కాని వారు చేసే పనులలోనే వారు ఆనందం వెదుకుకున్నారు . అందరు వారి వారి పనులలో నిమగ్నం అయిపోయారు.  లోతు కుటుంబము  మిగిలిన వారి వలే కాకుండా జీవించడం జరిగింది.  లోతు కుటుంబం రక్షించబడింది. 

దేవుడు మనలను హెచ్చరించినప్పుడు మనం సిద్ధపడాలి, అలా కాకుండా అంత సవ్యముగా ఉన్నది అనే అపోహలో ఉండి క్షమాపణ పొంది, రక్షించబడే అవకాశం కోల్పోతారు.  నోవా కుటుంబం రక్షించబడింది, కాని లోతు కుటుంబంలో అందరు రక్షించబడలేదు. లోతు భార్య దేవుడు చెప్పినట్లు చేయకుండా ఆ పట్టణమునకు ఏమి జరుగుతుందో చూడాలనుకుంది, వెనకకు తిరుగుతుంది. ఉప్పు స్థంభం వలె మారిపోతుంది. మన కుటుంబంలో దేవుడు ప్రేమించే వ్యక్తి ఉన్నంత మాత్రమున మన కుటుంబం మొత్తం రక్షించబడాలని లేదు. ప్రతి వ్యక్తి కూడా తాను పరివర్తన చెంది మారితే దేవుని అనుగ్రహమునకు పాత్రుడవుతాడు. వారి కుటుంబంలో మంచి వారు ఉండటం కొంత వరకు మాత్రమే వారికి ఉపయోగపడుతుంది కాని వారి వ్యక్తిగత జీవితం కూడా ప్రభువు ఆజ్ఞలకు లోబడి ఉండాలి. 

ప్రభువుని రాక సమయంలో కూడా ఇలానే జరుగును అని దేవునివాక్కు చెబుతుంది. ఇది ప్రతి ఒక్కరు వారి వారి జీవితములను సరిచూసుకుని జీవించాలి. ఆ రోజు ఎవరు అయితే సిద్ధపాటు కలిగి ఉంటారో వారు రక్షించబడతారు. ఎవరి జీవితం మరియొకరి జీవితం మీద ఆధారపడి ఉండదు. ఎవరి జీవితమునకు వారే బాధ్యత వహించాలి. ఇది భయపడే రోజు ఏమి కాదు, ప్రతి  నిత్యం సిద్దపడి ఉంటె అది ప్రభువు సాక్షాత్కారం అయ్యేరోజు. సరియైన సిద్ధపాటు లేకపోతే అది భయపడవలసిన రోజే అవుతుంది. 

సిద్ధపాటు 

ప్రభువు రాకడకు ఆయన అనుచరులు ప్రతి నిత్యం సిద్దమై ఉండాలి.  ఎందుకు  ప్రభువు రోజు కోసం ప్రతినిత్యం  అప్రమత్తముగాను, సిద్ధముగాను ఉండాలి అంటే ఆ రోజు ఎలా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందరు వారి వారి పనులలో ఉన్నప్పుడు, అప్రమత్తంగా లేనప్పుడు వస్తుంది. దేవుని ఆజ్ఞలకు ఎవరు అయితే బద్ధులై ఉంటారో వారికి అది ఎప్పుడు వచ్చిన భయ పడవలసింది ఏమి ఉండదు.  ఎందుకంటే వారు ఆ రోజు కోసం సిద్ధంగా ఉన్నారు. జలప్రళయము వచ్చినప్పుడు దేవుని మాట ప్రకారం జీవించిన నోవా కుటుంబం రక్షించబడింది, లోతు రక్షించబడ్డాడు. దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించడమే దానికి సిద్దపడటం. 

ప్రార్ధన : రక్షకుడవైన ప్రభువా! మీ రాకడకు నేను ఎప్పుడు సిద్ధముగా ఉండుటకు నోవా,లోతుల వలె మీ ఆజ్ఞలకు ఎప్పుడు బద్ధుడనై జీవించే విధంగా నన్ను మలచమని  వేడుకుంటున్నాను. నా జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకుండా మీ ఆజ్ఞలను నేర్చుకుంటూ, మీ మాటను పాటించుటకు కావలసిన అనుగ్రహాలు దయచేయండి. నా జీవితమును పవిత్రీకరించుకొనుటకు మీ అనుగ్రహాలు దయచేమని వేడుకుంటున్నాను. ఆమెన్ 


14, నవంబర్ 2024, గురువారం

లూకా 17: 20-25

దేవుని రాజ్యము 

దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా  యేసు ఇట్లు సమాధానము ఇచ్చెను: "దేవుని రాజ్యము కంటికి  కనబడునట్లు  రాదు. 'ఇదిగో! ఇక్కడ ఉన్నది. లేక అదిగో! అక్కడ ఉన్నది' అని ఎవ్వడును చెప్పజాలడు. ఏలయన, అది మీ మధ్యనే ఉన్నది." యేసు మరల తన శిష్యులతో ఇట్లు చెప్పెను: "మీరు మనుష్యకుమారుని కాలములో ఒక దినమునైనను చూడగోరుదురు. కాని  మీరు చూడరు. ఇదిగో! అతడు ఇక్కడ ఉన్నాడు. లేక  అదిగో! అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు. కాని మీరు వెళ్ళవలదు. వారి వెంట పరుగెత్తవలదు. ఏలయన మెరపుమెరసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించునట్లు మనుష్య కుమారుని రాకడ ఉండును. ముందుగా  అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరమువారిచే నిరాకరింపబడవలెను. 

 దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా  యేసు ఇట్లు సమాధానము ఇచ్చెను: "దేవుని రాజ్యము కంటికి  కనబడునట్లు  రాదు. 'ఇదిగో! ఇక్కడ ఉన్నది. లేక అదిగో! అక్కడ ఉన్నది' అని ఎవ్వడును చెప్పజాలడు. ఏలయన, అది మీ మధ్యనే ఉన్నది."పరిసయ్యులు అడిగిన ప్రశ్నలకు యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం ఇది. పరిసయ్యులు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. లేదా యిస్రాయేలు ఎప్పుడు స్వతంత్ర రాజ్యాంగ అవతరిస్తుంది అని అడుగుతున్నారు.  యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం వారు కోరుకున్నది కాదు. కాని వారికి ఒక నూతన సత్యాన్ని ప్రభువు వారికి తెలియజేస్తున్నారు. అది ఏమిటిఅంటే దేవుడు రాజ్యం కంటికి కనపడునట్లుగా రాదు. మరియు అది మీలో ఉన్నది అని ప్రభువు చెబుతున్నాడు. ఇది ఎందుకు కంటికి కనపడదు? దేవుని రాజ్యం అనుభవించాలి, అది ప్రభువు వద్ద నుండి క్షమాపణ పొందడం వలన, ఆయన ప్రేమను పొందడం వలన అనుభవిస్తుంటాం. దేవుని రాజ్యం బహ్యమైనది. అది అంతరంగికమైనది. అది మనలో ఉన్నది. నాలో మరియు నీలో ఉన్నది. నాలో ఉన్న ఆ దేవుని రాజ్యమును ఎలా అనుభవించగలం.

యేసు ప్రభువు దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అని చెబుతున్నాడు. కాని ఎందుకు మనము దానిని అనుభవించలేకపోతున్నాము? మనము యేసు ప్రభువు క్షమా , ప్రేమ కరుణ అను గుణాలు మనలో లేకపోవడం వలన దేవుని రాజ్యమును అనుభవించలేకపోతున్నాము. యేసు ప్రభువు ప్రజలును దేవుని రాజ్యమునకు సిద్ధపరస్తూ మరు మనస్సు పొందమని, క్షమ, ప్రేమ, కరుణ గుణాలు కలిగిఉండమని చెబుతారు. ఇవి మానవుణ్ణి దేవుని రాజ్యం అనుభవించడానికి అర్హుడని చేస్తాయి. ఈ గుణాలు మనిషిని అంతరంగికంగా మారుస్తుంటాయి. నూతన జీవితం జీవించేలా చేస్తాయి.  దేవుని రాజ్యం అనుభవించేలా చేస్తాయి. ప్రభువు ప్రేమ కరుణ, క్షమ ద్వారా ఆయనను అనుభవించకుండా ఆయన అక్కడ ఉన్నాడు లేక ఇక్కడ  ఉన్నాడు అనే మాటలను నమ్మవద్దు అని ప్రభువు చెబుతున్నారు.

 ఎందుకు దేవుని రాజ్యము ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది అని ఎవ్వడు చెప్పజాలడు అని ప్రభువు అంటున్నాడు. మరియు మనుష్య కుమారుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని మనుషులు అంటారు కాని మీరు వెళ్ళవద్దు అని ప్రభువు ఎందుకు చెబుతున్నారు. దేవుని రాజ్యము మనలో ఉంది కనుక దానిని ఇంకా ఎక్కడో వెదకనవసరం లేదు. మనలోనే దానిని పొందవచ్చుకనుక సంఘంలో, కుటుంబంలో మన మనసులో ప్రభువుని గుణాలు పెంపొందినప్పుడు దానిని అనుభవించగలుగుతాం. ప్రభువును, దేవుని రాజ్యమును వేరు చేసి చూడలేము. ప్రభువును పొందినప్పుడు మనము దేవుని రాజ్యమును కూడా పొందుతాము. ప్రభువును పొందటం అంటే సమస్తమును పొందటమే అది దేవుని రాజ్యమునుకూడా.  ప్రభువును చూచుట కొరకు ఎక్కడకు వెళ్లనవసరం లేదు, ఆయన మన మధ్యనే ఎప్పుడు ఉంటాడు. దివ్య సత్ప్రసాదంలో ప్రతిరోజు ఆయనను కలుసుకోవచ్చు. దేవుని వాక్కు ద్వారా  ఆయనను  కలుసుకోవచ్చు, ప్రేమను పంచుకొనుట ద్వారా ఆయనను కలుసుకోవచ్చు. మన ఆత్మలో ఆయనను కలుసుకోవచ్చు. 

ప్రభువును మనం ఆత్మలో ఎలా కలుసుకోవచ్చు? పునీత ఆవిలాపురి తెరెసామ్మ గారు దీని గురించి వివరిస్తూ దేవుడు మన ఆత్మలో ఆసీనుడై ఉన్నాడు. మన అంతరాత్మలోకి మనం ప్రవేశించినట్లయితే అక్కడ ఉన్న ప్రభువును కలుసుకోవచ్చు. కాని మనం ఆత్మలోనికి ప్రవేశించాలంటే చాలా ఓపికతో మరియు సాహసంతో కూడిన ప్రయాణం చేయాలి. మనలోనికి మనము ప్రవేశించే సమయంలో మన నిజరూపం మనకు తెలుస్తుంది కొన్ని సార్లు మనమీద మనకు ఏహ్యభావం కలుగవచ్చు ఎందుకంటే మనలో ఉన్న చెడు మనకు తెలుస్తుంది. వీటన్నిటి  తరువాత మన అంతరాత్మలో ప్రభువును కలుసుకోవచ్చు. కాని ఈ ప్రయాణంలో మనం అనేక ఆటంకాలు పొందవచ్చు. వాటిని అధిగమిస్తేనే ప్రభువును మనం కలుసుకోగలం. ఈ ప్రయాణము ప్రార్థన, వినయముతో పాటు విశ్వాసము,నమ్మిక ప్రేమ అను సుగుణాల ద్వారా కొనసాగించాలి. 

ప్రార్ధన: ప్రభువా! మీరు మా మధ్యలో ఉన్నారు అనే విషయాన్ని అనేకసార్లు మర్చిపోయి మిమ్మును ఎక్కడెక్కడో వెదకడానికి ప్రయత్నిస్తున్నాను. మిమ్మలను కలుసుకొనుటకు మీరు మాకు ఎప్పుడో మార్గమును చెప్పారు. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుటను చూచి మీరు నా శిష్యులు అని లోకం తెలుసుకుంటుంది అని మీరు చెప్పారు. మీ ప్రేమను వ్యక్త పరచడం, మీ కరుణను చూపడం ద్వారం మీ క్షమను పంచడం  ద్వారా మిమ్ములను  కలుసుకోవచ్చు అని తెలుసుకున్నాము అలా జీవించుటకు కావలసిన అనుగ్రహము దయచేయండి. ప్రభువా మీరు నాలో ఉన్న విషయాన్ని తెలుసుకొని మిమ్ములను కలుసుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ సుగుణాలను అలవరుచుకొని మీ రాజ్యములో పాల్గొనుటకు అర్హులను చేయండి. ఆమెన్ 

13, నవంబర్ 2024, బుధవారం

లూకా 17:11-19

 సమరియుని కృతజ్ఞత 

యేసు సమరియా, గలిలియా ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగనే పదిమంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలుచుండి,  గొంతెత్తి, " ఓ  యేసు ప్రభువా! మమ్ము కనికరింపుము" అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి "మీరు వెళ్లి యాజకులకు కనిపింపుడు" అని చెప్పెను. వారు మార్గ మధ్యముననే  శుద్ధిపొందిరి. అపుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి, ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగివచ్చి, యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరియుడు. అపుడు యేసు "పదిమంది శుద్ధులు కాలేదా? మిగిలిన తొమ్మిదిమంది ఎక్కడ? తిరిగి వచ్చి దేవుని  స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా?" అనెను. పిదప యేసు అతనితో "నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది. లేచి వెళ్లుము" అనెను. 

ఈ సువిశేష భాగంలో  కృతజ్ఞత, విశ్వాసం మరియు దేవుని కృపను గురించి చూస్తున్నాము. పది మంది కుష్టురోగులు అద్భుతమైన స్వస్థతను అనుభవిస్తున్నారు.    వారిలో ఒకరు మాత్రమే కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వస్తున్నారు. దేవుని యొక్క అనుగ్రహాలు  అనేక విషయాలలో పొందుతూనే ఉంటాము. కాని దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడములో మాత్రము విఫలం అవుతుంటాము. దేవుని దగ్గరకు వచ్చి  కృతజ్ఞత తెలియజేయుటము,  ఒక వ్యక్తిని  దేవునికి దగ్గర చేస్తుంది. దేవునితో సఖ్యత ఏర్పాటు చేస్తుంది. మరియు దేవునితో అనుభంధమును ఏర్పరచి మనలను ఆయనకు ఇష్టులను చేస్తుంది. 

విశ్వాసం మరియు విధేయత

పది మంది కుష్టు రోగులు యేసు ప్రభువునకు ఎదురయ్యారు, దూరంగానే ఉండి, ప్రభువా మమ్ము కరుణింపుము అని వేడుకుంటున్నారు. ప్రభువు  కరుణ మీద వారికి ఎంతో విశ్వాసం ఉన్నది. ఆయనకు తమ సమస్య తెలిపితే వారికి స్వస్థత దయచేస్తాడు అని వారు నమ్మారు.   యేసు ప్రభువు వారిని వెళ్లి  యాజకులకు తమను తాము చూపించుకోమని చెప్పినప్పుడు వారు వెళ్లిపోతున్నారు. యాజకుడు మాత్రమే  కుష్టు రోగంతో బాధ పడేవారిని స్వస్థత పొందిన తరువాత వారు స్వస్థులైన విషయాన్నీ ధ్రువీకరించగలరు. అందుకే యేసు ప్రభువు వారిని పోయి యాజకుడిని కలవమని చెబుతున్నారు. యేసు ప్రభువు ఇతర సమయాలలో వలె వారిని తాకలేదు. వెళ్లి యాజకుడిని కలవమని చెప్పాడు. వీరు మమ్ములను తాకమని అడుగలేదు. ప్రభువు మాటకు విధేయించి వెళుతున్నారు. ప్రభువు చెప్పినట్లు చేయగానే వారు మార్గ మద్యంలో ఉండగానే వారు స్వస్థత పొందుతున్నారు. ఇక్కడ గమనించవలసినది,  ప్రభువు పొమ్మని చెప్పినవెంటనే వారికి  స్వస్థత కలుగలేదు, అయినప్పటికీ ప్రభువు చెప్పగానే వారు యాజకుని కలువడడానికి వెళుతున్నారు. ప్రభువు మాట  మీద వారికి ఉన్న నమ్మకం తెలియజేస్తుంది. ప్రభువు మాటను విధేయించడం ద్వారా వారు స్వస్థత పొందుతున్నారు. ప్రభువు మాటను మారు మాటాడకుండా   విధేయించిన తీరు ప్రభువు మాటకు వారు ఇచ్చిన గౌరవం మరియు ఆతని మీద ప్రగాఢమైన నమ్మకం తెలియజేస్తుంది.  వారి విధేయతకు తగినట్లే మార్గ మధ్యములోనే వారు స్వస్థత పొందుతున్నారు. 

సమరియుని ప్రత్యేకత 

అందరు స్వస్థత పొందుతున్నారు. కాని తనలో వస్తున్నా మార్పును గమనించగలిగినది ఒక సమరియుడు మాత్రమే. కృతజ్ఞత కలిగిన వారు ప్రభువు ద్వారా తమ జీవితంలో జరిగిన ప్రతి మార్పును గమనించగలుగుతాడు. కృతజ్ఞతచెల్లిస్తాడు. దేవుని అంతులేని అనుగ్రహాలకు పాత్రుడవుతాడు. యేసు ప్రభువునకు కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వచ్చిన వ్యక్తి కేవలం ఒక సమరియుడు మాత్రమే.యూదులు సమరియులతో ఏ పొత్తు ఉండకూడదు అనుకుంటారు. సమరియులు దేవుని ఆజ్ఞలను పట్టించుకోలేదు అని వారిని దూరం పెట్టారు. వారిని విదేశీయులుగానే భావించేవారు. కాని దేవుడు అందరికి తన దయను కరుణను చూపిస్తూనే ఉంటాడు. మానవునిలా ఒకరిని దూరం పెట్టేవాడు కాదు ప్రభువు.  ప్రభువులోని ఈ గుణం మనం అనేక సార్లు చూస్తాము. సమరియును కృతజ్ఞత ప్రభువు తనకు చేసిన మేలును గుర్తు చేస్తుంది. అంతేకాక సమాజం తనను చూసిన విధంగా కాకుండా దేవుడు తనను నూతన సృష్టిగా చూస్తున్నాడు అన్న విషయం తనకు తెలుస్తుంది.  

యేసు ప్రభువు ఆ సమరియునితో పది మంది శుద్ధులు కాలేదా? మిగిలిన తొమ్మిది మంది ఎక్కడ? అని అడుగుతున్నాడు? ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని అనుగ్రహాలు పొందుతాము కాని కృతజ్ఞత తెలుపుటకు మాత్రము  వెళ్లము. కృతజ్ఞత తెలుపడం అంటే  దేవున్ని స్తుతించటం. మన కృతజ్ఞత దేవుని మహిమను, కీర్తిని  వెల్లడి చేస్తుంది. అంతేకాక ఈ కృతజ్ఞత ఇతరులు ప్రభువును తెలుసుకొనుటకు ఉపయోగపడుతుంది. మనం దేవునికి చెల్లించే కృతజ్ఞత దేవుడు చేసిన మేలుకు సాక్ష్యంగా ఉంటుంది. 

 ప్రార్థన

కరుణామయుడైన ప్రభువా! మీ కరుణ అనంతం. ఎవరు మీ వద్దకు వచ్చి మిమ్ము కరుణించమని అడిగిన వారిని కరుణించారు. వారి జీవితాలలో లేమిని తీసివేసి వారికి కావలసిన వాటిని ఇచ్చి వారిని  సమృద్ధిగలవారీగా, బలవంతులుగా, ఆరోగ్యవంతులుగా చేశారు. అనేకసార్లు నా జీవితంలో కూడా సాంఘికంగా, ఆర్ధికంగా, నైతికంగా బలహీనంగా ఉన్న సమయాలలో సమాజం కుష్టువానిని బయట పెట్టినట్లు, నన్నును బయట పెట్టిన నీవు కరుణచూపించావు. నన్ను హత్తుకొనుటకు సంకోసించలేదు. నేను నీకు చెందినవాడినని ధృవీకరించావు.  అయినప్పటికీ  మీరు చేసిన మేలును గుర్తించకుండ ఉన్నాను. ప్రభువా! మీ మేలును గుర్తించకుండా,  మీకు కృతజ్ఞత తెలప కుండా ఉన్న సందర్భాలలో నన్ను క్షమించండి. మీరు చేసిన ప్రతి మేలును గుర్తు చేసుకొని, కృతజ్ఞత తెలియజేస్తూ, మీకు కీర్తిని,  మహిమను కలిగిస్తూ , మీ మేలులకు సాక్షులుగా జీవించేలా చేయండి. ఆమెన్. 

9, నవంబర్ 2024, శనివారం

32 వ సామాన్య ఆదివారం

32 వ సామాన్య ఆదివారం 
1 రాజుల 17:10-16, హెబ్రీ 9:24-28, మార్కు 12:38-44
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు మనము ఉదారముగా ఉండిన యెడల దేవుని యొక్క దీవెనలు పొందుతాము అనే అంశమును గురించి తెలియజేస్తున్నాయి. ఇంకొక విధముగా చెప్పుకోవాలంటే దేవునికి ఉదాహరణగా సమర్పించే అర్పణ గురించి ఈనాటి పఠణంలో తెలియచేస్తున్నాయి. దేవుని యొక్క దీవెనల వలన పొందిన ప్రతిదీ దేవునికి మరియు పొరుగు వారికి సమర్పించుటకు మనందరికీ మంచి హృదయము ఉండాలి. దేవుని యొక్క శక్తి మీదే ఆధారపడుతూ మనకు ఉన్నదంతా సమర్పించుకుని జీవించిన ఎడల ఇంకా మనము అధికముగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాం. 
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఏలియా ప్రవక్తను సారె ఫతు దగ్గరకు పంపిస్తున్నారు. ఈమె ఒక అన్యురాలైనప్పటికీ దేవుని యొక్క కృపను పొందుకున్నది. ఈ మొదటి పఠణం యొక్క సన్నివేశం మనం గమనించినట్లయితే ఆహాబు రాజు యెసబేలు రాణి మరియు మిగతా ప్రజలు అన్య దైవముల ఆరాధించే సమయంలో దాదాపు మూడున్నర సంవత్సరముల పాటు ఆ దేశమున కరువు సంభవిస్తుందని ఏలియా ప్రవక్త తెలియజేశారు ఈ కరువు కాల సమయంలో దేవుడు ఏలియాను సారెఫతుకు పంపిస్తున్నారు. ఒక క్లిష్ట సమయంలో దేవుడు ధనమున్న వారిని వదిలివేసి కేవలము అద్భుతము చేయుటకు ఒక పేద వితంతువును, అది కూడా అన్యురాలను ఎంచుకుంటున్నారు. బహుశా ఆమె మంచి వ్యక్తి అయి ఉండవచ్చు, ప్రార్థన పరిరాలయుండవచ్చు సోదర ప్రేమ కలిగిన వ్యక్తి ఉండవచ్చు అందుకని దేవుడు ఆమె యొక్క జీవితమును రక్షించుట నిమిత్తమై ఏలియా ప్రవక్తను అచటకు పంపిస్తున్నారు. 
ఏమి జీవితంలో మనము కొన్ని విషయములను ధ్యానం చేసుకుని మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి నేర్చుకోవాలి. 
1. ఆమె యొక్క గొప్ప విశ్వాసం: ఏలియా ప్రవక్త  తన కోసం రొట్టెను కాల్చుకొని రమ్మని పిలిచిన సందర్భంలో వెంటనే దేవుని యందు ఉన్న విశ్వాసము వలన ఆమె ఏలియా కోరిన విధంగా చేశారు. మార్కు 9:23. విశ్వాసము వలన దేవుడు అద్భుతం చేస్తారని నమ్మారు. అబ్రహాము విశ్వసించారు కాబట్టే జాతులకు జ్యోతిగా దీవించబడ్డారు, మోషే విశ్వసించారు కాబట్టే ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఉత్తమ నాయకునిగా చేయబడ్డాడు, కననీయ స్త్రీ విశ్వసించినది కావున దేవుని యొక్క వరము పొందినది, యాయీరు దేవుని విశ్వసించారు కాబట్టి తన యొక్క కుమార్తెను పొందగలిగాడు. విశ్వాసము ఉంటేనే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతము చేస్తారు ఈ యొక్క పేద వితంతువు కూడా తానున్నటువంటి పరిస్థితుల్లో కేవలము దేవుని యందు ఆచంచలమైన విశ్వాసము కలిగి ఉన్నది కావున దేవుడు ఆమె జీవితమును దీవించారు. 
2. ఉదాహరణగా ఇచ్చే మనసు- ఈ వితంతువు తన జీవితంలో తనకు సహాయం చేసే వారు ఎవరు లేకపోయినా కానీ తనకు ఉన్న దానిలో తాను ఉదారంగా ఇచ్చే మనసు కలిగి ఉన్నది. ఆమె ఏలియాతో నేను ఇవ్వను అని చెప్పి ఉండవచ్చు కానీ తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకోవడంలోనే నిజమైన సంతోషం, ప్రేమ దాగి ఉన్నవని ఆమె భావించినది. ఉదారంగా ఇస్తే దేవుడి దీవిస్తారని భావించింది. లూకా6:38, ఉదారంగా ఇస్తే దేవుడు వారిని ప్రేమిస్తారని నమ్మినది. 2 కొరింతి 9:6-7 ఈ యొక్క పేద వితంతువు ఉదారంగా ఇచ్చారు కాబట్టి ఆమె జీవితంలో ఎటువంటి కొరత లేకుండా సమృద్ధిగా దీవెనలు పొందింది. 
3. త్యాగం చేసే గుణం- ఈ వితంతువు పేదరికంలో ఉన్నప్పటికీ ఎప్పుడు వర్షాలు వస్తాయో లేదో తెలియనప్పటికీ ఆమె తన యొక్క ఆహారమును వేరే వారికి త్యాగం చేస్తున్నారు. ఈమె దగ్గర ఉన్నది కొద్దిగా మాత్రమే అది తిని వారు కూడా చనిపోదామనుకున్నారు ఆ పిండి కేవలం ఒక్కరికి మాత్రమే సరిపోతుంది అయినా ఆమె త్యాగం చేసింది. అంత బాధ అయిన పరిస్థితుల్లో ఉన్న ఆమె త్యాగం చేసినది కావున ఆమె యొక్క త్యాగమును ప్రభువు దీవించారు. మనకు ఉన్న దానిలో త్యాగం చేసుకుని దేవునికి సమర్పించు జీవిస్తే తప్పనిసరిగా అది పెద్ద సమర్పణ. చాలా సందర్భాలలో దేవుడు మెచ్చుకునే సమర్పణ ఏమిటంటే దేవునికి ఉదారంగా ఇచ్చుట. ప్రభువు పేద వెధవరాలి కానుకను మెచ్చుకున్నారు. తొలి క్రైస్తవ సంఘ జీవితమును మెచ్చుకున్నారు అలాగే ఈ సారెఫతు వితంతువు జీవితమును మెచ్చుకుంటూ ఆమె త్యాగముకు ప్రతిఫలంగా ఆహారం సమృద్ధిగా ఇచ్చారు. 
4. ఆమె యొక్క సంపూర్ణ విధేయత- ఈమెలో దేవుని యొక్క ప్రవక్త పట్ల విధేయత చూపినటువంటి అంశమును చూస్తున్నాం. ప్రవక్త చెప్పిన వెంటనే ఆమె దేవుని యొక్క మాటలకు విధేయత చూపించి జీవించినది. ఎవరైతే విధేయత చూపిస్తారో వారి జీవితములు నిండుగా దీవించబడతాయి. పవిత్ర గ్రంథంలో అబ్రహాము, మోషే, యెహోషువ ఇంకా చాలామంది వ్యక్తులు దేవుడికి విధేయుత చూపించి దీవెనలు పొందారు అదే విధంగా ఈ వితంతువు కూడా దేవుడి యెడల విధేయత చూపించి ప్రభువు యొక్క కృపను పొందుకున్నది. 
ఈనాటి సువిశేష భాగములో పేద వితంతువు యొక్క కానుకను దేవుడు అభినందించిన విధానం మనం చదువుకుంటున్నాం. కానుకల పెట్టె దగ్గర ప్రతి ఒక్కరూ కానుకలను ప్రభువు పరిశీలించారు. చాలామంది ధనవంతులు వారు కానుక వేసేటప్పుడు అది అందరికీ కనబడాలి అని విసిరి వేస్తుంటారు. ధర్మశాస్త్ర బోధకులు కూడా అలాగే అందరికీ కనబడేలా వారు కానుకలు పెట్టెలో ధనం వేసేవారు. వారికి ఉన్న సమృద్ధిలో నుంచి కొంతగా దేవునికి సమర్పించేవారు కానీ ఈ యొక్క పేద వితంతువు తనకు ఉన్నది మొత్తము కూడా దేవునికి సమర్పించుకుని జీవించారు. ఆమె దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగినది. తన యొక్క జీవిత మనుగడ కొరకు దేవుని యొక్క శక్తి మీదే ఆధారపడి ఉంది. మనకు ఉన్న దానిలో దేవునికి ఇస్తే దానిలో గొప్ప త్యాగం ఏమీ లేదు కానీ మనకి ఉన్నది మొత్తం కూడా దేవునికి ఇస్తే అది గొప్ప త్యాగమే. ఈ యొక్క పేద వితంతువు తాను సమర్పించినది కొద్దిదైనప్పటికీ తన దగ్గర ఉన్న మొత్తము సమర్పించినది కావున ఆమె దేవుని శక్తి మీద ఆధారపడి ఉన్నది అందుకనే ప్రభువు ఆమెకు న్యాయం చేశారు. ఈనాటి ఈ యొక్క పరిశుద్ధగా గ్రంధ పఠణముల నుండి మనం కూడా త్యాగ గుణము, ఉదార స్వభావం, విశ్వాసము కలిగి జీవించుట అనే అంశములను అలవర్చుకొని జీవించటానికి ప్రయత్నం చేయాలి.
Fr. Bala Yesu OCD

8, నవంబర్ 2024, శుక్రవారం

లూకా 16: 1-8

 లూకా 16: 1-8

యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను: "ఒక ధనవంతునివద్ద  గృహనిర్వాహకుడు  ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృథా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. యజమానుడు అతనిని పిలిచి, 'నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము. ఇకపై నీవు గృహనిర్వాహకుడుగా ఉండ వీలుపడదు' అని చెప్పెను. అతడు లోలోపల ఇట్లు అనుకొనెను: 'ఇపుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తిలేదు. బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది. గృహనిర్వాహకత్వమునుండి తొలగింపబడినపుడు అందరివలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్లు చేసెదను' అని యజమానుని ఋణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి, మొదటివానితో 'నీవు నా యాజమానునికి ఎంత ఋణపడి ఉన్నావు? అని అడిగెను. వాడు 'నూరు మణుగుల నూనె' అని చెప్పెను. అపుడు అతడు వానితో 'నీ ఋణపత్రము తీసికొని, వెంటనే దానిపై ఏబది అని వ్రాసికొనుము' అని చెప్పను. అంతట అతడు రెండవ వానితో 'నీవు ఎంత ఋణపడి వుంటివి?' అని అడిగెను. వాడు నూరుతూముల గోధుములు' అని  బదులుపలికెను. అపుడు వానితో 'నీ ఋణపత్రము తీసికొని, ఎనుబది అని వ్రాసికొనుము'  అనెను. ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలయన, ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులగు ప్రజలకంటే యుక్తిపరులు. 

యేసు ప్రభువు ఒక అవినీతి పరుడైన ఒక  గృహ నిర్వాహకుడి గురించి ఒక ఉపమానం చెప్పాడు. ఒక గృహ నిర్వాహకుడు తన భవిష్యత్తు కొరకు ఎలా ముందుచూపుతో వ్యవహరిస్తున్నాడో,  తన ఉద్యోగం పోయినట్లయితే తను  ఎలా జీవించాలో ఎంతో ముందు చూపు కలిగి ఉన్నాడో ప్రతి ఒక్కరు ఆత్మకు సంబంధించి ఈ  లోకానికి చెందిన వారు ఈ లోకమునకు చెందిన జీవితం గురించియే ఇంత ముందు చూపు కలిగి ఉంటె వెలుగు పుత్రులు పరలోక జీవితం  పొందాలనుకునేవారు ఇంక ఎంత ముందు చూపు కలిగి ఉండాలో తెలియజేస్తున్నాడు ప్రభువు.  ఒక సంపన్న యజమాని తన సంపదను నిర్వహిస్తున్నా గృహ నిర్వాహకుడు తన సంపదను వృథా  చేస్తున్నాడు అని తెలుసుకొని తనని పని నుండి తీసివేయ నిశ్చయించుకున్నాడు. గృహనిర్వాహకుడిని  యజమాని తీసివేయదలుచుకున్నది, తనలో నిజాయితీ లేదు అని మరియు తన సంపదను వృథా చేస్తున్నాడని,  నిజాయితీ లేకపోవడం, వృథా చేయడం, ఆ పనికి అతడు సరికాదు అని తెలుపుతున్నవి. దేవుడు మనకు ఇచ్చిన ప్రతి పని కూడా ఈ కోవలోనికే వస్తుంది. ప్రతి వ్యక్తికీ  దేవుడు ఇచ్చిన బాధ్యత నిజాయితీగా ఉండటం మరియు  దేవుడు  ఇచ్చిన ఏ సంపదను కాని ప్రతిభను కాని వృథా చేయకుండా మన ఉన్నతికి మరియు  ఇతరుల ఉన్నతికి వాడాలి. 

 యజమాని గృహ నిర్వాహకున్ని తొలగించే ముందు అతని పనికి సంబంధించిన లెక్కలను  కోరుతున్నాడు. ప్రభువు ప్రతి వ్యక్తిని కూడా లెక్కను అడుగుతాడు. ఇక్కడ గృహనిర్వాహకుడు  త్వరలో ఉద్యోగం నుండి తీసివేయబడుతుందని  గ్రహించి, తన భవిష్యత్తు కోసం ఒక తెలివైన ప్రణాళికను రూపొందించుకున్నాడు. అది ఏమిటంటే తన యజమానునికి ఋణపడి ఉన్న వారిని పిలిచి వారి ఋణములను తగ్గించాడు దానిద్వారా ఈ ఋణస్థుల నుండి లభ్ది పొందవచ్చని అనుకుంటున్నాడు. గృహ నిర్వాహకునకు  తన గురించి తనకు  మంచి అవగాహన ఉంది, తాను ఎవరిని యాచించలేడని, మరియు శ్రమించుటకు శక్తిలేనివాడనని తెలుసుకున్నాడు. అప్పుడు తన భవిష్యత్తు కోసం  ఒక ప్రణాళిక వేసుకుంటున్నాడు. మన జీవితం గురించి కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. నా భవిష్యత్ ఏమిటి, నా ధ్యేయం ఏమిటి?  క్రీస్తు అనుచరునిగా నేను పరలోకం పొందటం నా ధ్యేయం.  

ఈ ఉపమానములో  ఆసక్తిని రేకెత్తించేది ఏమిటంటే, యేసు ప్రభువు ఆ గృహ నిర్వాహకునికి   మెచ్చుకొంటున్నాడు.  యేసు ప్రభువు గృహ నిర్వాహకుని నిజాయితి లేకపోవడాన్ని మెచ్చుకోవడం లేదు. తాను  ఉద్యోగం కోల్పోతే ఎలా బ్రతకాలో ముందుగానే ఆలోచించి యుక్తిగా ప్రవర్తించడాన్ని మెచ్చుకుంటున్నాడు.  ఈ లోకపు వ్యక్తులు  వెలుగుకు చెందిన వ్యక్తుల కంటే  వారి భవిష్యత్తు గురించి భరోసా కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.  యేసు ప్రభువు తన అనుచరులను కూడా వారి జీవితాలు పరిశీలించుకోవాలని  ఈ లోకానికి చెందిన విషయాలయందే ఇన్ని జాగ్రత్తలు తీసుకొనే వీరికంటే, పరలోక విషయాలను కోరుకునే వారు ఎక్కువగా తమను తాము పరిశీలించుకుంటూ, సంస్కరించుకుంటూ, పరలోకానికి అర్హులుగా మరాలని కోరుకుంటున్నాడు. 

ఈ ఉపమానం మనకు ఇవ్వబడిన సమయాన్ని, ప్రతిభను మరియు ఇతర అనుగ్రహములను  దేవుని చిత్తమునకు  అనుగుణంగా ఉపయోగించామో లేదో  పరిశీలించమని అడుగుతుంది. పూర్తిగా ప్రభువు చిత్తమునకు అనుకూలంగా వాడకపోయినట్లయితే ఒకసారి ఈలోక వ్యక్తులను చూసి, అల్పమైన వాటికోసమే ఎంతగానో ప్రణాళికలు వేసుకునే వారిని చూసి , నిత్య జీవం ఇచ్చే ప్రభువును పొందడం కోసం తగిన ప్రణాళిక వేసుకోమని చెప్తుంది. క్రీస్తు అనుచరులుగా ఆయనను పొందుటకు  ప్రణాళికబద్దంగా జీవిస్తూ,  జాగరూకత కలిగి నిజాయితితో కూడిన జీవితం జీవిస్తూనే, ఆధ్యాత్మిక సంపదను సంపాదించుటకు పాటుపడుదాం. 

ప్రార్ధన: ప్రభువా! మిమ్ములను తెలుసుకొని, మీరు మాకు ఇచ్చే గొప్ప అనుగ్రహాలు పొందుకుంటూ   వాటిని సరియైన విధంగా వాడుకోలేకుండా ఉన్నాము. మీరు ఇచ్చిన సమయాన్ని, ప్రతిభను  దుర్వినియోగం చేస్తున్నాము. అటువంటి సందర్భాలలో మమ్ము క్షమించండి. మీ అనుగ్రహాల విలువ తెలుసుకొని వాటిని మీ చిత్తము కొరకు వాడే వారినిగా మమ్ము దీవించండి.  అనేకసార్లు అవివేకంతో ధ్యేయం లేకుండా జీవిస్తున్నాము. అటులకాకుండ మిమ్ములను పొందాలని, మీ పరలోకంలో స్థానము పొందేందుకు ప్రణాళికతో జీవించేలా దీవించమని వేడుకొంటున్నాము. ఆమెన్. 

2, నవంబర్ 2024, శనివారం

31 వ సామాన్య ఆదివారము

31 వ సామాన్య ఆదివారము 
ద్వితియెపదేశకాండము 6:2-6
హెబ్రీయులు 7:23-28
మార్కు 12:28-34
            ప్రియా దేవుని బిడ్డలరా ఈ రోజు మనమందరము కూడా 31వ ఆదివారంలోనికి ప్రవేశించి యున్నాము. ఈనాటి మూడు పఠనలు కూడా మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తాయి అదేమిటంటే దేవుని పట్ల భయభక్తులను  చూపించటం, యేసు క్రీస్తు ద్వారా క్షమాపణ పొందటం మరియు జీవిత కాలం ప్రేమతో జీవించడం వంటి వాటి గురించి తెలియజేస్తుంది. ఈ ప్రేమ మరియు భక్తి మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందంటే మనము దేవుని దగ్గరకు  మరింతగా చేరడానికి, ఆయన అనుగ్రహంలో నివసించడానికి ఉపయోగపడతాయి.

 మొదటిపఠనములో ద్వితియెపదేశకాండం గురించి మనం వింటున్నాం. దేవుడు మానవులయినటువంటి మనందరికి కూడా  అయన ప్రేమనిచ్చి, ఆయన ఆజ్ఞలను ఎల్లపుడు మన జీవితాలలో  పాటించాలని పిలుపునిచ్చాడు. ఎందుకంటే దేవుని వాక్యం నీ  దేవుడైన యావేను   నీ పూర్ణ హృదయంతో , ఆత్మతో ప్రేమించుము అని చెబుతున్నాడు, దీని ద్వారా మనమందరమూ కేవలం హృదయం గానీ లేదా మనసు గానీ కాకుండా సంపూర్ణంగా దేవుని పట్ల ప్రేమను చూపించాలని చెప్పబడుతుంది. ఈ ప్రేమ మనం పాటించేటువంటి ఆజ్ఞల ద్వారా, మన ప్రేమ దేవుని దగ్గర వ్యక్తమవుతుంది. మనం దేవుని వాక్కును లేదా అయన మాటలను మన హృదయాలలో నిలిపి, ప్రతి సందర్భంలో ఆయనను అనుసరించడంలో మన బలాన్ని పెంచుకోవాలని  ఈ మొదటిపఠనం తెలియజేస్తుంది.

      రెండొవ పఠనములో హెబ్రియులకు వ్రాసిన లేఖలో యేసు క్రీస్తు మనకందరికూడా ఒక గొప్ప శాశ్వత యాజకుడు అని. ఆయన మన కొరకు తన జీవితన్నే  శాశ్వతంగా త్యాగం చేసి, దేవుని దగ్గర లేదా అయన సన్నిధిలో మనకు ప్రత్యక్ష ప్రతినిధిగా ఉంటాడని, అంటే అయన యాజకత్వం వలన మనకు శాంతి మరియు విముక్తి లభిస్తుంది. క్రీస్తుప్రభువు  యొక్క త్యాగం ద్వారా మన జీవిత పాపాలకు నిరంతర క్షమాపణను మరియు మన రక్షణకు మార్గం చూపిస్తుందని రెండొవ పఠనము తెలియజేస్తుంది. 

                  చివరిగా సువిశేష పఠనములో రెండు ఆజ్ఞలా గురించి  అందరికి క్లుప్తంగా వివరిస్తున్నాడు, అ రెండు ఆజ్ఞలు ఏమిటంటే దేవుని పట్ల ప్రేమ మరియు సాటి మనువుని పట్ల ప్రేమ.

   ముందుగా మొదటిది దేవుని పట్ల ప్రేమను మనం చుసినట్లయితే, దేవుని పట్ల సంపూర్ణ ప్రేమను చూపించటం యేసు మొదటగా చెప్పిన ఆజ్ఞ, ఎందుకంటే నీ దేవుని సంపూర్ణ హృదయంతో, ఆత్మతో మరియు బలంతో ప్రేమించుము అని అంటున్నారు. ఏ విధంగానంటే ఇది మనము  దేవుని పట్ల కలిగి ఉండాల్సిన భక్తి మరియు విధేయతను సూచిస్తుంది. దేవునితో ప్రేమ బంధం అనేది మన జీవితంలో కలగలిపి ఉండాలి. ఈ ప్రేమతో మనం దేవుని ఆజ్ఞలను గౌరవిస్తూ, ఆయన మార్గంలో నడవగలుగుతాము. అంతే కాకుండా యేసు క్రీస్తు చెప్పినటువంటి ఈ ప్రేమ కేవలం మాటలలోనే కాకుండా మన  జీవితాలలో కూడా ఉండాలని అంటున్నారు. ఇది మొదటి ఆజ్ఞ.
మరి రెండొవ ఆజ్ఞ ఏమిటంటే మానవుని పట్ల ప్రేమ: ఈ ఆజ్ఞ అనేది మన చుట్టూ ఉన్నవారిని, మనలను ఇష్టపడేవారిని లేదా మనలను ఇష్టపడని వారిని, మన స్నేహితులకే కాకుండా ప్రతీ ఒక్కరిని ప్రేమించడం అనేది క్రైస్తవుల జీవితంలో మరియు ధర్మంలో ప్రధానమైనది. మనము ఏ  విధంగానైతే దేవుని ప్రేమను అనుభవిస్తామో అదే విధమైనటువంటి ప్రేమను ఇతరులకు పంచడంలోనే ఈ ఆజ్ఞ అనేది ఉంటుంది.

      కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా ఈ మూడు పఠనలు కూడా క్రైస్తవులమైనటువంటి మనకి దైవభక్తిని, యేసు యొక్క శాశ్వత యాజకత్వాన్ని మరియు మానవుని జీవితంలో ప్రేమను ఒక దేవుని పోలి  అనుసరించడానికి ఆహ్వానిస్తున్నాయి. దేవుని ప్రేమలో జీవిస్తూ, యేసు ద్వారా శాంతి పొందుతూ, మన హృదయంలోని ప్రేమను ఇతరులకు పంచుకోవడం ద్వారా మనం నిజమైన క్రైస్తవులమని  నిరూపించవచ్చు.

ఫా.  జ్వాహాన్నెస్  OCD 

31 వ సామాన్య ఆదివారం

31 వ సామాన్య ఆదివారం 
ద్వితియోపదేశకాండము 6:2-6, హెబ్రీ 7:23-28 మార్కు 12:28-34
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించుట మరియు ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అనే అంశములను తెలుపుచున్నవి. 
ఈనాటి మొదటి పఠణంలో మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించమని తెలుపుచున్నారు. ప్రభువు యొక్క ఆజ్ఞలను పాటించుట ద్వారా వారి యొక్క జీవితంలో అనేక రకములైనటువంటి మేలులు కలుగుతాయి అనేటటువంటి అంశమును కూడా ప్రవక్త తెలిపారు. ప్రభు యొక్క ఆజ్ఞలు పాటించిన యెడల ఇశ్రాయేలు ప్రజలు కలకాలము బ్రతుకుతారు అదే విధముగా ఆయన ఆజ్ఞలు పాటించుట ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో క్షేమములు కలుగును మరియు పాలు తేనెలు ప్రవహించే నేల మీద వారు బహు గొప్పగా వృద్ధి చెందుతారు అదే విధముగా ప్రభువు యొక్క ఆజ్ఞలను పాటించుట ద్వారా దేవుడు వారిని వేయి తరముల వరకు ఆశీర్వదిస్తారు(నిర్గమ 20:6). ఈ యొక్క ఆజ్ఞలు ప్రేమకు సంబంధించినవి. ప్రభువైన యావేను పూర్ణహృదయముతోనూ, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను ప్రేమింపవలెను అని ప్రభువు కోరుకున్నారు. ప్రజల యొక్క మనసులు ఇక వేరే దైవముల మీద ఉండకుండా కేవలము యావే దేవుని మాత్రమే ఆరాధించి ప్రేమించాలి కాబట్టి ప్రభువు ఈ యొక్క ఆజ్ఞను ఇచ్చారు. ప్రేమ ఉండిన యెడల ప్రతి ఒక్కరి జీవితంలో ఏది అయినా పాటించవచ్చు ఎందుకనగా ప్రేమ ఉంటే ఆజ్ఞలను తు:చ తప్పకుండా నెరవేరుస్తారు. మన యొక్క అనుదిన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలలో యావే దేవుడిని మాత్రమే కాకుండా మిగతా దైవములను కూడా విశ్వసిస్తారు దీనిని ప్రభువు ఖండిస్తూ ఆయన ఒక్కరే నిజమైన దేవుడు అని తెలుపుచూ ఇక వేరే అన్యదైవములను విశ్వసించవద్దని మోషే ప్రవక్త ద్వారా తెలిపారు. యావే దేవుడు మోషే ద్వారా ఇచ్చిన పది ఆజ్ఞలను రెండుగా విభజించినట్లయితే మొదటి మూడు ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి మిగతా ఏడు ఆజ్ఞలు తోటి మానవులకు సంబంధించినవి ఈ రెండిటిని కలిపి పది ఆజ్ఞలు అని పిలుస్తారు ఇందులో దైవము మానవులు ఇద్దరు ఉన్నారు కాబట్టి దైవ - మానవ ప్రేమలు విడదీయునటువంటివి. ఈ రెండు ఎప్పుడూ కలసి ప్రయాణం చేయాలి. రైలు పట్టాలు ఏ విధంగానైతే కలిసి పోతుంటాయి అదే విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రెండు అంశాలు పాటిస్తూ జీవించాలి. ఏ ఒక్కటి తక్కువైనా అది నిజమైన సంపూర్ణ క్రైస్తవ జీవితం కాదు.
ఈనాటి రెండవ పఠణంలో ఏసుప్రభు యొక్క యాజకత్వమును గురించి బోధిస్తూ ఉన్నది. ఆయన ప్రజల పక్షమున మనవి చేయుట కొరకై శాశ్వత జీవియై ఉన్నారు. ఆయన దైవ ప్రేమ మానవ ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టే మన కొరకు తన యొక్క ప్రాణములను సమర్పించారు. ఆయన యొక్క యాజకత్వము గొప్పది. ఎందుకనగా ఎటువంటి పాపము చేయని నిష్కళంక గొర్రెపిల్ల మన కొరకు తన రక్తమును చిందించి తనను తానే దేవునికి మన పాపముల నిమిత్తము సమర్పించుకున్నారు.
ఈనాటి సువిశేష భాగములో ఒక మంచి ధర్మశాస్త్ర బోధకుడు ఏసు ప్రభువుని, ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏమిటని అడుగుచున్నారు అందుకుగాను ప్రభువు మొదటిగా దేవుడిని ప్రేమించమని తెలిపి, ఆ ప్రేమను ఇతరులలో వ్యక్తపరచమని కోరారు. ఈ ధర్మశాస్త్ర బోధనకునికి ప్రధాన ఆజ్ఞ తెలుసుకోవాలనిపించింది ఎందుకనగా యూదులు యావే దేవుడిచ్చిన పది ఆజ్ఞలను 613 ఆజ్ఞలుగా మార్చారు అందుకుగాను ప్రజలు ఆచరించడానికి కష్టంగా ఉన్నటువంటి ఇన్ని ఆజ్ఞలలో ఏది ప్రధానమైనదో తెలుసుకోవాలని ప్రయత్నం చేశాడు అందుకే యేసు ప్రభువును అడిగారు. ఏసుప్రభు దైవ ప్రేమ మానవ ప్రేమ రెండు వేరు పరపలేనటువంటివి అని తెలిపారు. ఒకే నాణేనికి రెండు ప్రక్కలు ఉన్నట్లే ఒకే ఆజ్ఞకు దైవ ప్రేమ, సోదర ప్రేమ అను రెండు అంశాలున్నాయి. దైవ ప్రేమ లేనిది సోదర ప్రేమ లేదు అలాగే సోదర ప్రేమ లేనిదే దైవ ప్రేమ లేదు. దైవ ప్రేమ నుండి సోదర ప్రేమ ఉద్భవిస్తుంది. మన అందరికీ దేవుడు తండ్రి కాబట్టి మనము ఆయన యొక్క బిడ్డలం కావున మన జీవితంలో దైవ ప్రేమ సోదర ప్రేమ కలిగి జీవించాలి. దేవుని యెడల ప్రేమ కలిగి జీవించటం అందరికీ సాధ్యమైనది ఎందుకనగా ఆయన మీద ఉన్న ప్రేమ వలన దేవాలయానికి వస్తాం, పరిచర్యలు చేస్తాం, దేవాలయ నిమిత్తమై ఎంతైనా ఉదారంగా అందజేస్తాం కానీ మన ప్రేమను మన పొరుగు వారితో పంచుకోలేం. పొరుగు వారిని ప్రేమించుట కొంతమందికి చాలా చాలా కష్టం. దేవుడిని ప్రేమించే వ్యక్తి తన తోటి వారిని ప్రేమించకపోతే అట్టి వ్యక్తి అసత్య వాది అని యోహాను గారి తెలిపారు. (1 యోహాను 4:20-21) కాబట్టి మనం మన యొక్క శత్రువులను ప్రేమించాలి, మిత్రులను ప్రేమించాలి, మన యొక్క నాశనమును కోరు వారిని ప్రేమించాలి. ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలను పాటించిన యెడల మనందరి యొక్క జీవితములో ఎంతో సంతోషంగా ఉంటాయి అలాగే ఈ భూలోకమే పరలోకంగా మారుతుంది. మనము ఏ పని చేసినా దానిని ప్రేమతోనే చేయాలి కాబట్టి ప్రేమ అనేది మన యొక్క క్రైస్తవ జీవితానికి పునాది లాగా ఉండాలి తద్వారా మనందరం మంచి క్రైస్తవ విశ్వాస జీవితమును జీవించగలుగుతాం. 
 Fr. Bala Yesu OCD

26, అక్టోబర్ 2024, శనివారం

30వ సామాన్య ఆదివారం

30వ సామాన్య ఆదివారం 
యిర్మియా 31:7-9, హెబ్రీ 5:1-6, మార్కు 10:46-52
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని నమ్ముకుని ఆయన మీద ఆధారపడినటువంటి వారికి చేసేటటువంటి మేలులను తెలియజేస్తున్నాయి. మానవ శక్తి మీద, ఆలోచన మీద కాక సంపూర్ణముగా దేవుడి మీద ఆధారపడితే ప్రభువు వారిని ఆశీర్వదిస్తారు. 
ఈనాటి మొదటి పఠణంలో యిర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు సంతోషకరమైన వార్తను తెలియజేస్తున్నారు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం నుండి 34వ అద్యాయాలను ఓదార్చేపుస్తకమని, ప్రశాంత పరిచే పుస్తకమని అదేవిధంగా ఇశ్రాయేలీయులను తిరిగి తమ వారితో ఐక్యపరిచుటను తెలియచేయు పుస్తకమని అంటారు. ఎందుకనగా ఈ నాలుగు అధ్యాయాలలో ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు సంతోషకరమైనటువంటి మాటలను తెలియజేశారు.యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అస్సిరీయుల బానిసత్వం నుండి వారి యొక్క సొంత భూమికి తీసుకొని వెళతారు అనే సంతోషకరమైన విషయం తెలుపుచున్నారు. ఈ యొక్క అస్సిరీయులు, ఇశ్రాయేలును పూర్తిగా ధ్వంసం చేసి అక్కడివారిని బానిసలుగా కొనిపోయారు. ఇలాంటి ఒక బాధకరమైన సమయంలో యిర్మియా ప్రవక్త దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానము మరువడని, ఆయన దయ కలిగిన దేవుడని, ప్రజల యొక్క పాపములను క్షమించి మరలా వారిని తన చెంతకు చేర్చుకుంటారని ప్రవచించారు. దేవుడు ఎవరిని మరువకుండా, విడిచిపెట్టకుండా, కుంటి వారిని, గ్రుడ్డివారిని ఏ విధముగా గర్భవతులను సైతము అందరిని కూడా సొంత భూమికి తీసుకొనివస్తారని వాగ్దానం చేశారు. ప్రభువు ఇస్రాయేలు ప్రజల పట్ల ఎల్లప్పుడూ విశ్వాసనీయుడుగానే ఉన్నారు ఆయన సీనాయి పర్వతం దగ్గర చేసినటువంటి వాగ్దానమును ఎన్నడూ మరువలేదు. ప్రభువు వారిని విముక్తులను చేసినందుకుగాను ప్రతిఫలముగా ఇశ్రాయేలు ప్రజలు ప్రభువునకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థనలు సమర్పిస్తారన్నారు. అదే విధముగా దేవుడే స్వయముగా తన ప్రజలను నడిపిస్తారని తెలిపారు అలాగే వారు పడిపోకుండా, మార్గము తప్పిపోకుండా ఆయనే ఒక మార్గ చూపరిగా ఉంటూ తమ యొక్క సొంత ప్రాంతమునకు నడిపించారు అని యిర్మియా ప్రవక్త ఆనాటి ప్రజలకు ఈ యొక్క సంతోషకరమైన అంశమును తెలియజేశారు. తండ్రి తన బిడ్డలను చూసుకున్న విధముగా దేవుడు కూడా ఇశ్రాయేలును తన సొంత బిడ్డల వలె కాచి కాపాడుతూ వారి వెన్నంటి ఉంటారని పలికారు. 
ఈనాటి రెండవ పఠణంలో  యాజకత్వమును గురించి తెలుపుచున్నది. ప్రతి యాజకుడి యొక్క యాజకత్వము దేవుడి నుండి వచ్చినదని తెలుపుతూ వారు బలహీనులైనప్పటికీ తమ కొరకు తాము, తన పాపముల కొరకు అదేవిధంగా ఇతరుల యొక్క పాపముల కొరకు బలిని అర్పింపవలెనని తెలిపారు. యాజకత్వము అనే దైవ పిలుపు ప్రభువునుండే స్వయముగా వచ్చినది. దేవుడే ప్రతి ఒక్క యాజకుడిని నియమించారు. తండ్రి కుమారుడను నియమించిన విధముగా మనలను దేవుడు యాజకులుగా నియమిస్తున్నారు. 
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు బర్తిమయి అను గుడ్డివానికి దృష్టిని బసగిన అంశమును చదువుకుంటున్నాము. ఈయన యొక్క జీవితంలో మనము గ్రహించవలసినటువంటి కొన్ని అంశములు;
1. గ్రుడ్డివాడు గ్రహించగలిగాడు. బర్తి మయి అనే బిక్షకుడు తనకు చూపు లేకపోయినా యేసు ప్రభువు యొక్క దైవత్వమును గ్రహించగలిగాడు. ఎందరికో కన్నులున్నప్పటికీ వారు ఏసుప్రభు యొక్క కార్యములను చూసి గుర్తించలేకపోయారు కానీ ఈ బర్తిమయి కేవలం యేసు ప్రభువును గూర్చి విని ఆయన గొప్పతనం గ్రహించ గలిగాడు. వినుట వలన విశ్వాసము కలుగును.
2. విశ్వాసము కలిగి దేవుడిని ఆశ్రయించారు. బర్తిమయి ప్రభువు నందు ఆచంచలమైన విశ్వాసము కలిగి ఉన్నాడు కాబట్టే ప్రభువు తన చెంతకు వచ్చిన వెంటనే తనకు చూపునివ్వమని విశ్వాసముతో ప్రార్థించాడు. 
3. బర్తిమయి ప్రభువును తనకు ఏది ముఖ్యమో దాని కొరకు మాత్రమే ప్రార్థించారు. ఆయన ప్రభువుని దానం చేయమని అడగలేదు, తన యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని అడగలేదు కానీ తనకు చూడటానికి చూపును ఇవ్వమని కోరాడు. తన యొక్క జీవితంలో చూపు అనేది ముఖ్యము కాబట్టి దాని కొరకే బర్తిమయి ప్రార్థించాడు. బహుశా ఆయన కూడా ప్రభువుని చూడాలని ఆరాటపడి ఉండవచ్చు అందుకే కేవలం చూపు అని మాత్రమే ప్రసాదించమని అడిగాడు.
4. బర్తిమయి పట్టుదల - తన తోటి వారు తనను ఎంత నిశ్శబ్దముగా ఉండాలని ప్రయత్నం చేసిన  బర్తిమయి పట్టుదలతో ఎవరి మాటను పట్టించుకోకుండా ఆయన అనుకున్నది సాధించడానికి గొంతెత్తి మరి ప్రభువుని పిలిచారు. 
5. బర్తిమయి ప్రభువు యొక్క కనికరము కొరకు ప్రార్థించారు. ఆనాటి కాలంలో ఎవరికైనా ఏదైనా లోపం(అనారోగ్యం) ఉంటే దానిని దేవుని శిక్షగా భావించేవారు అందుకే ఒకవేళ ఆయన మీద దేవుని శిక్ష ఉండిన యెడల దానిని తీసివేయమని, కరుణతో క్షమించమని ప్రభువు కరుణ కొరకు వేడుకున్నాడు. 
6. ప్రభువుని అనుసరించుట- బర్తిమయి ఏసుప్రభు తన జీవితంలో చేసిన మేలులు తలంచుకొని ప్రభువుని వెంబడిస్తున్నారు. మేలులు పొంది తిరిగిపోయిన వారి కన్నా, మేలు చేసినటువంటి దేవుడిని వెంబడించినటువంటి గొప్ప వ్యక్తి ఈ బర్తిమయి.
7. ప్రభువు మన చెంతకు వచ్చినప్పుడు ఆయనను మనము భర్తిమయి వలే గుర్తించాలి. అనేక సందర్భాలలో దేవుడు దివ్య బలి పూజ ద్వారా, ప్రార్థన ద్వారా మన చెంతకు వస్తారు ఆయనను మనము గుర్తించి కలుసుకున్నప్పుడు మన యొక్క జీవితంలో భర్తిమయి వలె మేలులు కలుగును.
8. దేవుడి మీద ఆధారపడుట- బర్తిమయి సంపూర్ణముగా దేవుని యొక్క శక్తి మీదే ఆధారపడ్డాడు కాబట్టి ప్రభువు ఆయన్ను దీవించారు. 
మన యొక్క అనుదిన జీవితంలో కూడా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుతూ, విశ్వాసముతో ప్రార్థిస్తూ, దేవుని యొక్క కరుణ కోరుకుంటూ ఆయన యొక్క దీవెనలు పొందాలి. 
Fr. Bala Yesu OCD.

19, అక్టోబర్ 2024, శనివారం

ఇరవై తోమ్మిదవ సామాన్య ఆదివారము

ఇరవై తోమ్మిదవ 
సామాన్యకాలపు ఆదివారము 

యెషయా 53:10-11
హెబ్రీయులకు 4:14-16
మార్కు 10:35-45

క్రీస్తునాధునియందు ప్రియ దేవుని బిడ్డలరా, ఈనాడు మనమందరము సామాన్య కాలపు ఇరవై తోమ్మిదవ ఆదివారంలోనికి ప్రవేశించి యున్నాము, ఈనాటి మూడు పఠనలు కూడా ఒకే తీరు మాటల గురించి మాట్లాడుతున్నాయి: అవి ఏమిటంటే త్యాగం, సేవ, మరియు విముక్తి అనే అంశాల గురించి మనకు వివరిస్తున్నాయి.
               ముందుగా మొదటి పఠనములో యెషయా గ్రంధములో మనము గమనించవలసిన అంశం చుసినట్లయితే యెషయా ప్రవక్త యేసు క్రీస్తు గూర్చి ముందుగా ప్రజలందరికి కూడా వివరిస్తున్నాడు. ఏవిధంగానంటే బాధామయ  సేవకుని జీవితంలో ఏవిధంగానైతే బాధలు అనుభవిస్తాడో అదేవిధమైనటువంటి బాధలను క్రీస్తు ఎదుర్కొంటాడు  అనే దానిని క్లుప్తంగా వివరిస్తున్నాడు. ఎందుకంటే, దేవుడు  తన సేవకున్నీ  బాధలు అనుభవింపచేల చేస్తున్నాడు . అందుకనే సేవకుడు తన ప్రాణాన్ని పాప బలిగా ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు, దేవుడు ఆయనకు తగిన ప్రతిఫలముగా సేవకుని మహిమపరుస్తాడు. ఎందుకంటే ఈ దుఃఖం, బాధ, వేదన ద్వారా దేవుడు తన ప్రణాళికను తన సేవకుని ద్వారా నెరవేర్చాడు. మన పాపాల కోసం క్రీస్తు తన జీవితాన్ని మరియు తన సర్వస్వాన్నీ ఇచ్చేందుకు వెనుకంజ వేయలేదు, అది దేవుని ప్రేమ, కృపా  సారాంశం. క్రీస్తు తన ప్రాణాన్ని అర్పించి, మన పాపాలను తుడిచివేశాడు మరియు తన అర్పణకు ప్రతిఫలంగా దేవుడు ఆయనకు విజయాన్ని ఇచ్చాడు. యేసు మన పాపాల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి, బాధను అనుభవించాడు. ఆయన త్యాగం ద్వారా మనకు విముక్తి మరియు క్షమాపణ లభించాయి.
       రెండొవ పఠనని గ్రహించినట్లయితే హెబ్రీయులకు వ్రాసిన లేకలో, యేసు మన ప్రధానయాజకుడిగా మన బలహీనతలను మరియు మనలో ఉన్న నైపుణ్యాలను అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే ఆయన కూడా ఒక మానవునివలె మన మాదిరిగా ఈ లోకానికి వచ్చి అన్ని పరీక్షల్ని, అవమానలను అనుభవించి కూడా ఏ  పాపం చేయలేదు. అందువల్ల,  ఆయనను ఆశ్రయించి, ఆయన వద్దకు వచ్చినవారికి ఆయన కృప తోటి సహాయపడతాడు. ఈ వచనాలు మనలను ఆయన  కాపాడే కృపను, అయన యొక్క దయను తెలుపుతున్నాయి. మనకు అయన కృపను అందించే ప్రయత్నం చేస్తాడు. ఆయన త్యాగం మనకు ధైర్యం, ఆశ కలిగిస్తుందని రెండొవ పఠనం మనకు పూర్తిగా వివరిస్తున్నాయి.
              చివరిగా సువిశేష పఠనములో యేసు ప్రభు ఒక నిజమైన సేవకుడిగా తన జీవితాన్ని త్యాగం చేయడం ద్వారా ఇతరులకు అయన ఒక ఉదాహరణ ఉంటున్నారు ఎందుకంటే మానవుల యొక్క బలహీనతలను అర్థం చేసుకుంటు, ఆయన కూడా మనవుని మాదిరిగా శరీరాన్ని  ధరించి అన్ని కష్టాలను, పరీక్షల్ని  అనుభవించాడు, కానీ అయన మాత్రం మనలాగా పాపం చేయలేదు. అందువల్ల,  ఆయనను ఆశ్రయించి, అయన యొక్క కృప మరియు దయను పొందేందుకు,  ఆయన దగ్గరకు వచ్చినవారికి ఆయన సహాయపడతాడు. ఈ వాక్యాలు అన్ని కూడా మనకు ఆయన  కృపను మరియు దయను తెలుపుతున్నాయి. యేసయ్య తన ప్రాణాన్ని అనేకమందికి రక్షణగా మరియు విముక్తిగా ఇచ్చాడు, ఇది క్రైస్తవ జీవితంలో అనుసరించాల్సిన మార్గాన్ని అయన మనకు ఒక ఉదాహరణగా తన జీవితం ద్వారా చూపిస్తున్నాడు.

           కాబ్బటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ, త్యాగం, మరియు సేవ మన జీవితాలలో కీలకమైనవి అని ఈయొక్క మూడు పఠనలు కూడా మనకు వివరిస్తున్నాయి. అందుకని మనము దేవునికి ఇష్టనుసరంగా జీవించలని మనం ఈ దివ్య బలి పూజలో ప్రార్దించుకుందాము.

Fr. Johannes OCD

29 వ సామాన్య ఆదివారం


యెషయా 53:10-11, హెబ్రి 4:14-16,మార్కు 10:35-45
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు ప్రభువుని అనుసరించేవారు సేవక రూపం కలిగి జీవించాలి అనే అంశమును, అదేవిధంగా అధికారం ఉన్నటువంటి వారు సేవకులు వలె తమ యొక్క అధికారమును సద్వినియోగపరుచుకోవాలని వినయంతో సేవ చేయాలని కూడా  తెలుపుతున్నాయి.
ఈనాటి మొదటి పఠణంలో  బాధామయ సేవకుని యొక్క జీవితం గురించి తెలుపుచున్నది ఈ యొక్క బాధామయ సేవకుడు మరెవరో కాదు క్రీస్తు ప్రభువే ఆయన అందరి కోసం అనుభవించేటటువంటి శ్రమలను గురించి యెషయా ప్రవక్త తెలియజేశారు. క్రీస్తు ప్రభువు యొక్క మరణము పాప పరిహార బలి అయ్యింది. అందరి యొక్క పాపముల నిమిత్తమై ప్రభువు మరణించారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి కొందరికి సంతోషంగా ఉన్న సమయంలో శ్రమలు వస్తాయి, కొందరికి జీవితం యధావిధిగా సాగించే సమయంలో శ్రమలు వస్తుంటాయి. కొంతమందికి శ్రమలు అప్పుడప్పుడు మరి కొంతమందికి శ్రమలు తరచుగా వస్తాయి. కొంతమంది శ్రమలు తట్టుకొని జీవిస్తే మరి కొంతమంది శ్రమలను తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటారు. మరికొందరు విశ్వాసాన్ని కూడా కోల్పోతారు.
కొన్ని కొన్ని సందర్భాలలో మనము ఇతరులకు మేలు చేయుట కొరకు శ్రమలు అనుభవించవచ్చు. పునీత చిన్న తెరెసమ్మ గారు తన యొక్క జీవితంలో కొన్ని సందర్భాలలో తాను తప్పు చేయనప్పటికీ దానిని అంగీకరించుకొని ఆ యొక్క బాధలను పాపుల యొక్క హృదయ పరివర్తనం కొరకై సమర్పించేవారు. ఈనాటి మొదటి పఠణంలో బాధామయ సేవకుడు ఎటువంటి తప్పిదము చేయనప్పటికీ కేవలము ఇతరుల యొక్క శ్రేయస్సు కొరకై, రక్షణ కొరకై తన యొక్క ప్రాణములను త్యాగం చేశారు. ఈనాటి రెండవ పఠణంలో హెబ్రీలకు రాయబడిన లేఖలో రచయిత యేసు ప్రభువు యొక్క యాజకత్వమును గురించి తెలుపుచున్నారు. ఆయన మనవలె శోధింపబడినప్పటికీ పాపము చేయనటువంటి ప్రధాన యాజకుడు కాబట్టి ఆయన చెంతకు చేరి ఆయన కృపను పొందుదుమని తెలుపుచున్నారు. ఆయన ప్రధాన యాజకుడిగా ఉంటూ తానే ఒక బలిగా ఇతరుల కొరకు సమర్పించుకున్నారు.
ఈనాటి సువిశేష భాగములు యేసు ప్రభువు యొక్క శిష్యులు యోహాను యాకోబులు, ప్రభువు స్థాపించబోయే రాజ్యంలో అగ్రస్థానాల కొరకై ఆశపడ్డారు ఆయన రాజ్యాన్ని ఇహలోక సంబంధమైన రాజ్యముగా, సిరిసంపదలతో కూడిన రాజ్యముగా, శాంతిభద్రతలతో తులతూగే ఒక గొప్ప రాజ్యంగా భావించారు అట్టి రాజ్యములో వీరికి ముఖ్యమైనటువంటి స్థానములను ఇవ్వమని ప్రభువును అడుగుచున్నారు. యోహాను, యాకోబులకు దేవుడు మొదటి స్థానం పేతురుకు ఇచ్చారు అని తెలుసు తరువాత రెండవ- మూడవ స్థానములను యోహాను యాకోబులకు ఇవ్వమని వారు అధికారం కోసం అడుగుచున్నారు. అనేక సందర్భాలలో యోహానును యాకోబును ఏసుప్రభు తనతో తీసుకుని వెళ్లారు. పేతురు అత్త అస్వస్థతతో ఉన్న సమయంలో వీరిద్దరిని తనతో పాటు తీసుకెళ్లారు, యాయీరు కుమార్తె అస్వస్థతతో ఉన్న సమయంలో వీరిద్దరూ ప్రభువుతో ఉన్నారు, దివ్యరూపధారణ సమయంలో కూడా మీరు ఏసుప్రభు తోనే ఉన్నారు. కాబట్టి వీరు కూడా ప్రభువు మాకు ప్రాముఖ్యతనిచ్చారు అయినప్పటికీ అధికారం కొరకు ఆశించారు.
ఇక్కడ ఏసుప్రభు నిజమైన అధికారమంటే పెత్తనం చెలాయించటం కాదు సేవ చేయటం అని తెలియపరుస్తున్నారు. ఈ సువిశేష భాగములో మనము గ్రహించవలసినటువంటి కొన్ని విషయాలు. 
1. ప్రతి శిష్యుడు/ అధికారి సేవకు రూపం దాల్చాలి. దేవుడిని వెంబడించేటటువంటి సమయములో ఎటువంటి పదవులను ఆశించకుండా కేవలము సేవకుని వలె దేవుడి యొక్క బాధ్యతను నెరవేర్చాలి. 
2. ఇచ్చిన అధికారమును వినయముతో నెరవేర్చాలి. కొన్ని సందర్భాలలో అధికారము వచ్చిన తర్వాత అనేక మందికి గర్వం వస్తూ ఉంటుంది కాబట్టి ప్రభువు చెప్పే అంశం ఏమిటంటే వినయంతో అధికారమును వినియోగించుకోవాలి అని తెలుపుచున్నారు. తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క గొప్పతనము చాటి చెప్పాలి.
3. ప్రతి అధికారంలో త్యాగపూరితమైన ప్రేమ ఉండాలి అనగా ఇతరులకు మేలు చేయు సమయంలో తాను (అధికారంలో ఉన్న వ్యక్తి)ఎన్ని బాధలైనా పొందవలసి వస్తే పొందటానికి సిద్ధముగా ఉండాలి. 
4. ప్రతి సేవకుడిలో/అధికారి వినయం ఉండాలి ఎందుకంటే ఏసుప్రభు నేను ఈ లోకంలో సేవ చేయడానికి వచ్చాను సేవింపబడుటకు రాలేదు అని తెలిపారు. కాబట్టి ఏసుప్రభుని వెంబడించే ప్రతి ఒక్క శిష్యుడు- శిష్యురాలు ఆయన వలె వినియం కలిగి జీవించాలి. 
5. నిస్వార్థ సేవను చేయాలి. ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా ప్రభువు యొక్క సేవ చేయాలి.
6. ఏసుప్రభు వలై నిస్సహాయులను అనాధలను స్వీకరించి వారికి మేలు చేయాలి. 
ప్రతి క్రైస్తవుడు అధికారాన్ని సేవగా భావించి క్రీస్తు వలే కష్టాలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. సమాజములో జరుగుతున్నటువంటి అన్యాయమును ఎదుర్కొని న్యాయం కొరకు పోరాడాలి. పేదల పట్ల బలహీనుల పట్ల దయా కనికరము కలిగి వారి కొరకు పోరాడటానికి ప్రయత్నించాలి. 

Fr. Bala Yesu OCD

12, అక్టోబర్ 2024, శనివారం

28 వ సామాన్య ఆదివారం


సొలోమోను జ్ఞాన గ్రంధం 7:7-11
హెబ్రీ 4:12-13, మార్కు 10:17-30
ఈనాటి పరిశుద్ధ గ్రంథములో మన యొక్క జీవితములో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి, ఆయనను కలిగి ఉండుట కొరకు దేనినైనా వదులుకుని జీవించాలి అనే అంశమును గురించి తెలుపుచున్నవి. ప్రతి ఒక్కరి యొక్క అనుదిన జీవితంలో రోజు ఈ లోక సంబంధమైనటువంటి విషయములతో ప్రాముఖ్యతను ఇచ్చి జీవిస్తారు. కొందరికి బంగారము అంటే విలువ ఎక్కువ, అందరికీ వెండి అంటే ఇష్టం, మరికొందరికి పదవులు ఇంకొందరికి సుఖ భోగాలు, గౌరవ మర్యాదలు ఇష్టం అందుకని వాటికి ప్రాముఖ్యతను, విలువనిచ్చి అవి కలిగి ఉండుట కొరకు ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈనాటి మొదటి పఠణంలో సొలోమోను తన యొక్క జీవితంలో ఏది ముఖ్యమైనది అని తెలుసుకొని దానికి విలువనిచ్చి ఆ యొక్క వరము కొరకు ప్రార్థించాలి. సొలోమోను దైవ భక్తుడిగా, నీతిమంతుడు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు, ఆయనయే స్వయంగా తెలుపుతున్నటువంటి మాటలు ఏమిటంటే నేను ప్రార్థించినప్పుడు వివేక వరము నాకు లభించినది. దేవుడిని ప్రార్ధించినది వివేకము కొరకు. జ్ఞానము తాను సంపాదించినట్లయితే ఇంక తన జీవితంలో ఏదీ కూడా అవసరం లేదు అని సొలోమోను గ్రహించాడు కాబట్టి జ్ఞానమును సంపాదించుట కొరకు దేవుని ప్రార్థించారు. మన యొక్క అనుదిన జీవితంలో కూడా మనం దేనికొరకు ప్రార్థిస్తున్నాము అని మనము ఒకసారి పరిశీలించుకోవాలి. సొలోమోను రాజు ఆయన తన యొక్క వివేకము ద్వారా తెలుసుకున్న సత్యమేమిటంటే ఈ లోక పదవుల కన్నా, సంపదల కన్నా, సింహాసనములకన్నా, రాజు దండనముకన్నా విలువైనది జ్ఞానము అని తెలుసుకున్నారు అందుకని దానిని పొందుట కొరకై దేనినైనా సరే వదులుకొనుటకు సిద్ధపడుతున్నారు. సొలోమోను యొక్క విజ్ఞానము వలన తెలుసుకున్న విషయం ఏమిటంటే ఈ లోక సంపదలు ఏవి కూడా జ్ఞానముతో సరిపోవని తెలిపారు. జ్ఞానముతో పోల్చినప్పుడు బంగారమంతా వట్టి ఇసుక ముద్ద, వెండి అనేది మట్టి పెళ్లతో సమానం. ఆయన తన యొక్క జీవితంలో ఆరోగ్యము కంటే సౌందర్యం కంటే ఎక్కువగా జ్ఞానమునే పొందాలని ఆశించాడు. మన యొక్క జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనకి ఏది కావాలో అనే అవగాహన లేదు. కొన్ని సందర్భాలలో సంపదలకే ఎక్కువ విలువ ఇస్తాము, కానీ సొలోమోను మాత్రం విజ్ఞానమునకు మొదటి స్థానమును ఇచ్చారు ఎందుకనగా విజ్ఞాన ద్వారా అంతా కూడా సంపాదించవచ్చు. ఆయనకు ఉన్నటువంటి విజ్ఞానమును బట్టి షెభారాణి కూడా ఆయనను చూడటానికి వచ్చారు. ఇంగ్లీష్ లో ఒక సామెత one idea can change your life ఇది ఎలా సాధ్యమంటే మనకు విజ్ఞానం ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే. మనము కూడా విజ్ఞానమును దేవుని యొక్క కృప వలన పొందాలి. విజ్ఞానము కొరకు ప్రార్థించాలి ఈ యొక్క విజ్ఞానముతో మన యొక్క జీవితములో ఏది ఉత్తమమైనదో అది తెలుసుకొని దాని ప్రకారంగా జీవింప సాగాలి. విజ్ఞానము మనకు నేర్పిస్తుంది మన జీవితంలోను సరి చేస్తూ ఉన్నది కావున సొలోమోను ఏ విధముగానయితే దేవుని యొక్క జ్ఞానమునకు ప్రధాన స్థానమును ఇచ్చి దానిని సర్వస్వంగా భావించి దానిని పొందుట కొరకై దేవుడిని ప్రార్థించి వేడుకున్నాడో అదేవిధంగా మనం కూడా దేవుడిని ప్రార్థించి విజ్ఞానాన్ని పొంది మంచి విశ్వాసులుగా జీవించాలి. 
ఈనాటి రెండవ పఠణంలో దేవుని యొక్క వాక్కు సజీవమైనది చైతన్యవంతమైనది అని తెలుపుచున్నది. ఆయన యొక్క వాక్కు మన జీవితంలో ఉన్నటువంటి చెడును తొలగిస్తుంది మనలో హృదయ పరివర్తన కలుగచేస్తుంది. ఆ విలువైనటువంటి దేవుని యొక్క వాక్కు కొరకు మనము తపించాలి. మన జీవితములను సరిచేసుకోవాలి. 
ఈనాటి సువిశేష పఠణములో ఒక యువకుడు నిత్యజీవితము పొందుటకు నేనేమి చేయాలి అని ప్రభువుని అడుగుతున్నారు. అందుకు తనను, ఏసుప్రభు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించమని తెలుపుతున్నారు ఆ యువకుడు అవి అన్నియు చిన్ననాటి నుండే పాటిస్తున్నాడని తెలిపారు. అప్పుడు ప్రభువు ఆయనకు తన దగ్గర ఉన్నటువంటి ధనము పేదలకు దానం చేసి ఇవ్వమని తెలిపారు కానీ అతడు దానికి ఇష్టపడలేదు. ఈ యువకుడు యొక్క ఉద్దేశ్యము నిత్య జీవము పొందుట మరి ఆ ఉద్దేశం కొరకు ఎందుకు ఆయన తన దగ్గర ఉన్నటువంటి ధనమును విడిచిపెట్టలేదు? ఈ యువకుడు ధనమే ముఖ్యమని భావించాడు. ధనము ఉన్న ఎడల తనకు మంచి గౌరవము అదే విధముగా తన భవిష్యత్తు బాగుంటుందని భావించాడు అందుకే ధనానికి ప్రాముఖ్యతను ఇచ్చి దానిని విడిచిపెట్టడానికి సిద్ధపడలేదు. వాస్తవానికి ధనపేక్ష అన్నది సర్వ అనర్ధాలకు మూలం. ఈ యువకుని యొక్క హృదయం ధనాశతో నిండి ఉన్నది కాబట్టి దానిలో దేవునికి స్థానము ఇవ్వలేదు. ధనాపేక్ష అతని పట్టి పీడిస్తుంది. ఈయొక్క ధనం వలనే ఆయన ఉదార స్వభావిగా జీవించి లేకపోయాడు. ఈ యొక్క యువకుడు తన యొక్క జీవితంలో ధనం కన్నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని భావించినట్లయితే ఆయన మీద ఆధారపడి జీవించేవాడు, ఆయనకు నిత్యజీవం లభించేది కానీ ఈ యొక్క యువకుడు దేవుని కన్నా ధనానికే ప్రాముఖ్యతనిచ్చి జీవించాడు అందుకనే విలువైన నిత్య జీవితాన్ని కోల్పోయాడు. ఈ యువకునికి దేనికి ప్రాముఖ్యత నివ్వాలో, దేనిని కలిగి జీవించాలో తెలుసుకోలేక పోయాడు అందుకే తన జీవితంలో సరి అయిన నిర్ణయం తీసుకోలేకపోయాడు. ఏసుప్రభు తన కొరకు ఎవరైతే సమస్తము విడిచిపెడతారో వారు నూరంతలుగా ఆశీర్వాదం పొందుతారని తెలిపారు (మార్కు 10:28-31). ఈ విషయాన్ని ఆ యువకుడు మరిచిపోయారు. మన యొక్క జీవితంలో దేవునికి విలువ నుంచి జీవించాలి అప్పుడు దేవుడు మనకు సమస్తము కూడా సమకూర్చును.
Fr. Bala Yesu OCD

ఇరవై ఎనిమిదవ ఆదివారము


సొలొమోను జ్ఞానం గ్రంధం 7:7-11
హెబ్రియులు 4:12-13
మార్కు 10:17-30 

క్రీస్తునాదునియాందు ప్రియా సహోదరి సహోధులరా, ఈనాడు మనమందరం కూడా సామాన్య కాలపు ఇరవై ఎనిమిదవ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈనాటి మూడు పఠనలను శ్రద్దగా గమనించినట్లయితే, మూడు పఠనలు కూడా ఆధ్యాత్మిక జీవితంలో నిజమైన సంపద, జ్ఞానం మరియు దేవుని వాక్యానికి సంబంధించిన గొప్పతనాన్ని గురించి వివరిస్తాయి. ఎందుకంటే సొలొమోను జ్ఞానగ్రంధంలో జ్ఞానాన్ని భౌతిక సిరి సంపదల కంటే గొప్పగా భావించడం చూస్తున్నాము, రెండవ పఠనంలో హీబ్రీయులకు వ్రాసిన లేఖలో దేవుని వాక్యం, మన జీవితాలను మర్చి పరిశీలించగల శక్తి గురించి చూపిస్తుంది. చివరిగా సువిశేష పఠనములో యేసు ధనవంతులకున్న సవాళ్లను ప్రస్తావించి, *వారినందరిని కూడా హెచ్చరిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో సంపదకు నిర్బంధం వద్దని* తెలియజేస్తున్నాడు. ముందుగా మొదటిపఠనమును ద్యానించినట్లయితే, సొలొమోను జ్ఞానగ్రంధంలో చూస్తున్నాము, సొలొమోను తన జీవితంలో జ్ఞానాని ఏవిధంగా దేవుని దగ్గరనుండి పొందడో మరియు దాని విలువ ఎంత గొప్పదో చెప్పే వాక్యాలను చూస్తున్నాము. ఈ గ్రంథంలోని ఈ యొక్క భాగం మనకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక గుణ పాఠాన్ని నేర్పిస్తుంది. సత్యమైన జ్ఞానం లేదా బుద్ధి అనేది దేవుని నుండి లభించేది, మరియు అది భౌతిక సంపదల కంటే చాలా ఇలువైనది మరియు చాలా గొప్పది. ఎందుకంటే, 7:7 లో సొలొమోను జ్ఞానం కోసం ప్రార్థించాను అని చెబుతుంటాడు. దీనిలోని సారాంశం ఏమిటంటే మనం నిజమైన జ్ఞానాన్ని పొందడానికి దేవుని మీద ఆధారపడి జీవించాలి, ఆవిధంగానైతే సొలొమోను తనను తాను తగ్గించుకొని దేవుని మందట మొకరించి భక్తి విశ్వాసలా తోటి జ్ఞానం కోసం, దేవుని దగ్గర ప్రార్థించడం వలన దేవుడు అతని ప్రార్థనను ఆలకించి, తన యొక్క కృపను అయనపై కుమ్మరించి దివించటం చూస్తున్నాము. సొలొమోను తాను పొందినటువంటి జ్ఞానాన్ని గురించి ఎంతో విలువైనదిగా చెప్పడం చూస్తున్నాము, ఎందుకంటే బంగారమును జ్ఞానముతో సమానంగా చూడలేము, సొలొమోను సంపద మరియు భౌతిక వసతులకంటే అయన పొందినటువంటి జ్ఞానం చాలా గొప్పదిగా మరియు విలువైనదిగాను స్పష్టం చేసి యున్నాడు. దీనిని మనం ఒక ఉదాహరణగా  తీసుకుంటె మన జీవితంలో నిజమైన సంపద అనేది దేవుని జ్ఞానములోనే ఉందని గుర్తుచేస్తుంది.

రెండొవ పఠనములో హెబ్రీయులకు వ్రాసిన లేఖలో 4:12-13 రెండు వాక్యాలు, దేవుని వాక్యానికి మరియు దాని శక్తికి సంబంధించినవిగా కనిపిస్తున్నాయి. ఈ వాక్యాలు మన ఆధ్యాత్మిక జీవనంలో గంభీరమైన ప్రభావాన్ని చూపుతాయి.
ఇది కేవలం ఒక మానవ జ్ఞానానికి సంబంధించినది కాదు, దేవుని వాక్యం మన హృదయంలో ఉన్న అత్యంత ఆంతరంగిక భావాలను కూడా పరిశీలించగలిగేది. ఇది మన ఆత్మను మరియు మన జీవితాన్ని పరిశీలించి దేవుని ముందు మన జీవితం ఏవిధంగా ఉందొ తెలియజేస్తుంది. ఎందుకంటే 
దేవుని దృష్టిలో ఏది కూడా దాచబడదు, ఎందుకంటే మనకు దేవుని న్యాయ స్థానం ముందు, మనం ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలో స్పష్టతనిస్తుంది. పాపమును మనం దాచుకోవాలనుకున్నా, దేవుని కళ్లకు అది దాగదని ఈ వాక్యం గట్టిగా హెచ్చరిస్తుంది. కాబట్టి, దేవుని ముందు మనము నిజాయితీగా, పవిత్రంగా ఉండేలా మన మనసును పరిశీలించుకోవాలి.
దేవుని వాక్యం మనలోని లోతులు, మనసు, ఆత్మ, మరియు ఆలోచనలను పరిశీలించుకోవడానికి ఒక పిలుపుగా ఉన్నాయి.

చివరిగా సువిశేష పఠనము మార్కు 10:17-30 వచనలలో యేసు మరియు ఒక ధనవంతుడు మధ్య సంభాషణను గురించి చూస్తున్నాము. ఒక ధనవంతుడు యేసు వద్దకు వచ్చి నేను నిత్యజీవం పొందడానికి ఏం చేయాలి? అని ఆడిగినప్పుడు. యేసు ముందుగా ఇచ్చినటువంటి సమాధానం ఆజ్ఞలను పాటించాలని చెబుతాడు, కానీ ధనవంతుడు అన్నీ పాటించానని అంటాడు. దీంతో యేసు అతనికి తన ధనాన్ని పేదలకు ఇచ్చి, స్వర్గంలో నిధులు సొంతం చేసుకోవాలని చెప్పాడు. అయితే, ఆ ధనవంతుడు తన ఆస్తిని విడిచిపెట్టలేక బాధతో వెళ్ళిపోయాడు. ఇక్కడ యేసు ధనవంతులకు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టం అని చెబుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలరా మన జీవితంలో ఇది భౌతిక సంపదలను మనం ఎక్కువగా ప్రేమ చూపిస్తే, ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టడం కష్టం అవుతుందని సూచిస్తుంది. ఆస్తి మన మనసును దేవుని నుండి దూరం చేయగలదని తెలియజేస్తుంది. ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా గమనించలి ఎందుకంటే పేతురు మరియు ఇతర శిష్యులు తమ జీవితాలను యేసు కోసం విడిచిపెట్టినట్లు అని యేసుతో చెప్పినప్పుడు, యేసు వారికి ఒక గొప్ప భరోసాను ఇస్తున్నాడు, అదేమిటంటే ఇహలోకంలోనే వారు ఆశీర్వాదాలు పొందుతారు అని మరియు పునరుత్థానంలో నిత్యజీవం వారికి ఉంటుందని చెప్పారు. 
ప్రియా దేవుని బిడ్డలరా మన జీవితాలలో కూడా దేవుని జ్ఞానం, వాక్యం మరియు నిత్య జీవితం అనేవి ఎంతో గొప్పవి కాబట్టి మనం వాటి కొరకై దేవునితో సంఖ్యత కలిగి జీవించాలని ఈ పూజ బలిలో ప్రార్దించుకుందాము. 
Fr. Johannes OCD

5, అక్టోబర్ 2024, శనివారం

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము 
ఆదికాండము 2:18-24
హెబ్రీయులకు 2:9-11
మార్కు 10:2-16

క్రీస్తునాధునియందు ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుని బిడ్డలరా, ఈనాటి మూడు దివ్య గ్రంథ పఠనలను మనం గ్రహించినట్లయితే, మూడు పఠనాలు కూడా మనకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక బోధనలు లేదా అంశాలను అందజేస్తున్నాయి. 
ఈ మూడు పఠనలు కలిసి మనకు దేవుని త్యాగం, సంకల్పం మరియు శాంతి జీవనానికి కొన్ని గొప్ప మార్గదర్శకత్వలను ఇస్తున్నాయి. 
          త్యాగం అంటే ఏమిటి బైబిల్ ప్రకారం మనం చుసినట్లయితే త్యాగం అనేది. బైబిల్లో దేవుని త్యాగం అనేది మానవ జాతి పట్ల అయన మహోన్నతమైన ప్రేమ, కరుణ, మరియు రక్షణకు సంబంధించిన ఒక మహత్తర అంశం. ఈ త్యాగం ఎవరైతే పాపం మరియు దేవుని నుండి దూరమైనా మానవుని తిరిగి దేవుని చెంతకు తీసుకురావడం కోసం చేయబడింది. దేవుని త్యాగం అనేది ప్రధానంగా యేసు క్రీస్తు ద్వారా పరిపూర్ణతకు చేరింది. ఎందుకంటే అత్యంత పావనమైన మరియు పవిత్రమైన అంశం కాబట్టి. యేసు క్రీస్తు తన జీవితాన్ని మన కోసం అ సిలువపై అర్పించడం ద్వారా మనకు నిత్యజీవం పొందే మార్గాన్ని ఏర్పరచాడు. అయన త్యాగం ద్వారా మనకు దేవుని ప్రేమను, క్షమను, మరియు అనంతమైన రక్షణను తీసుకోని వచ్చియున్నాడు. ముందుగా మొదటి పఠనములో చుసినట్లయితే దేవుడు తన త్యాగం, ప్రేమ ద్వారా మానవుని ఆవిధంగా సృష్టించరో మనమందరము కూడా మొదటి పఠనంలో చూడవచ్చు. 

ఆదికాండము 2:18-24 వచనలలో దేవుడు సృష్టించినటువంటి సృష్టి యొక్క ముఖ్యమైనటువంటి భాగాన్ని మనం చూస్తాము. దేవుడు మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్పియున్నారు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనుషుల మధ్య ఉండవలసిన్నటువంటి సంబంధాలను, మరి ముఖ్యంగా దాంపత్య జీవితానికి లేదా బంధానికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తున్నారు.
 దేవుడు ఆదామునకు కావలసినటువంటి తోడుని లేదా తనలో సగం భాగంగా ఉండవలసినటువంటి సహాయకురాలిని సృష్టించాలని దేవుడు నిర్ణయించుకున్నారు. దేవుడు సృష్టించిన ప్రతి జీవిని ఆదాముకు జతగా చుస్తే, ఆడాముకు అంటే ఆయనకు ఒక సహచరుడిగా ఎవరూ సారిపోలేదు. ఇక్కడ నుండి మనం నేర్చుకోవలసినది ఏమిటంటే మన జీవితంలో ఉన్న సంబంధాలు దేవుని సంకల్పం ప్రకారం ఉండాలి, అవి మనకీ సమానంగా ఉండాలి. ఆలా ఉండాలి కాబ్బటే దేవుడు ఆదాముని నిద్రించలాగా చేసి అతని శరీరం నుండి ఒక ఎముక తీసి స్త్రీని సృష్టించారు. ఇక్కడ, స్త్రీను పురుషుని ఎముక నుండి తీసుకోవడం యొక్క అర్థం ఏమిటంటే, స్త్రీ మరియు పురుషుడు ఒకరికి ఒకరు సమానంగా ఉండాలని. ఇద్దరూ ఒకరిని ఒకరు కలిసినప్పుడు ఏక శరీరముగా ఉండటం అనేది దేవుని యొక్క సంకల్పం. ఎందుకంటే దేవుడు వీరిద్దరిని కూడా ఒక్కటిగా చేసెను అని చెప్పడానికి గుర్తు. వివాహం అనేది కేవలం శారీరక సంబంధం కాదని అది ఒక ఆత్మీయమైన, ఆధ్యాత్మికమైన కలయిక అని అర్ధం చేసుకోవాలి. ఈ వచనల ద్వారా మనం ప్రధానమైనటువంటి విషయాలను గ్రహీంచాలి.

1. పురుషునికి సహాయకురాలి అవసరం ఉండాలి.
2. ఇద్దరి మధ్య సమానత్వం అనేది ఉండాలి.
3. ఇద్దరు కూడా ఒక్కటిగా జీవించాలి.

అందువల్ల ఈ వాక్యం ద్వారా సృష్టి యొక్క గొప్పతనం, బంధం యొక్క పవిత్రత, అనుబంధం యొక్క ప్రాముఖ్యతను గురించి మనకు మొదటి పఠనం తెలియజేస్తుంది.
            రెండొవ పఠనము హెబ్రీయులకు వ్రాసిన లేఖ 2:9-11 వచనలలో యేసు ప్రభువు మన కోసం త్యాగాన్ని స్వీకరించినట్లు మనకు తెలియజేస్తుంది. యేసు దేవుని మహిమతో ఉన్నప్పటికీ, తనను తానే తాగించుకొని,ఈ యొక్క లోకానికి వచ్చి, మన కోసం మానవ రూపాన్ని ధరించి, ఆయన మన పాపాలను తన బుజాలపై మోసి, మనకు శాశ్వతమైన విముక్తిని అందించడానికి సిలువపై అవమానకరమైనటువంటి మరణాని మరనించాడు. ఈ త్యాగం ద్వారా మనం దేవుని కుటుంబంలో ఒక భాగమయ్యాము. అందువల్ల, ఈ వాక్యం మనకు యేసు ప్రేమ మరియు కరుణను గురించి తెలియజేస్తుంది అని రెండొవ పఠనం చెబుతుంది.
                చివరిగా సువిశేష పఠనమును ద్యానించ్చినాట్లయితే మార్కు 10:2-16 వచనలలో యేసు వివాహం మరియు పిల్లల విషయంలో ముఖ్యమైనటువంటి సూత్రాలను ప్రజలకు బోధిస్తున్నాడు. యూదులలో విడాకుల ప్రస్థావన వచ్చినప్పుడు యేసు దేవుని ఆరంభ సంకల్పం వైపు దృష్టి తీసుకెళ్ళి, వివాహం అనేది దైవిక కట్టుబాటుగా, స్త్రీ పురుషులు విడిపోకూడని సంబంధంగా చెబుతున్నాడు. ఎందుకంటే పెళ్లి అనే బంధం దేవుని ఆశీస్సులతో ప్రారంభమవుతుంది, కాబట్టి దానిని పవిత్రంగా ఉంచుకోవాలని క్రీస్తు ప్రభు అంటున్నారు. అదేవిదంగా పిల్లల విషయానికి వస్తే, యేసు పిల్లలను దగ్గరగా తీసుకోని, వారి మనస్సు వాలే దేవుని రాజ్యానికి చేరాలి అని చెప్పాడు. పిల్లల ద్రుష్టి, శ్రద్ధ మరియు నమ్మకాన్ని గుర్తించి, మనం కూడా దేవుని వైపు పిల్లలవలే విశ్వాసంతో నడవాలని గుర్తుచేస్తున్నాడు.
        కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా మన జీవితాలలో బంధం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది కాబట్టి దేవునికి ఇష్టనుసరంగా జీవించాలని భక్తి విశ్వాసల్లతోటి ప్రార్థించుకుందాము. 

---

ఈ మూడు వచనాలు కలిసి మనకు దేవుని సంకల్పం, త్యాగం, మరియు శాంతియుత జీవనానికి సంబంధించిన గొప్ప మార్గదర్శకతలను అందిస్తాయి.
Fr. Johannes OCD 

27 వ సామాన్య ఆదివారం

27 వ సామాన్య ఆదివారం 
ఆది కాండం 2:18-24, హెబ్రీ 2:9-11, మార్కు 10:2-16
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు "పరిశుద్ధ వివాహం" గురించి బోధిస్తున్నాయి. కుటుంబం అనేది ప్రభువును యొక్క ఉద్దేశంలో సృష్టి ప్రారంభం నుండి ఉన్నది. దేవుడు ఏర్పరచినటువంటి దివ్య సంస్కారాలలో మొదటిగా ఏర్పరచిన దివ్య సంస్కారము ఈ యొక్క వివాహ జీవితం ఎందుకనగా సృష్టి ఆరంభంలోనే స్త్రీ పురుషులు ఇద్దరిని సృష్టించి వారిని 
పవిత్ర వివాహము ద్వారా ఒకటి చేశారు. 
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఆదాముకు అవ్వమ్మను తోడుగా ఇచ్చిన అంశమును చదువుతున్నాం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఆయనకి తోడుగా ఉండుటకు, సహాయం చేయుటకు, తన కష్ట కాలములో, సంతోష సమయంలో, అండగా -నీడగా నిలబడటం నిమిత్తమై ఆదాము కొరకు అవ్వను ప్రభువు ఇస్తున్నారు. దేవుడు ఈ సృష్టిలో ఒక కుటుంబమునకు ప్రాముఖ్యత నుంచి ఆ కుటుంబమును ఏర్పరచుటకు సిద్ధపడ్డారు ఎందుకనగా కుటుంబమే అన్నిటికీ ప్రధానం. కుటుంబం నుండి అందరూ (గురువులైన, కన్య స్త్రీలైనా రాజకీయ నాయకులైనా, వైద్యులైనా ......) వస్తారు కాబట్టి ఆ కుటుంబం మంచిదైన యెడల ఈ ప్రపంచమే మంచిదిగా మారును అనే ఉద్దేశంతో ప్రభువు  బహుశా ఈ నిర్ణయం తీసుకున్నారేమో. దేవుడు సృష్టించినటువంటి ఆది తల్లిదండ్రులు ఇద్దరు ఒకరితో ఒకరు సగభాగమై, కలిసిమెలిసి జీవించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఆదాము యొక్క ప్రకటి ఎముకను తీసుకొని అవ్వను చేసిన సందర్భంలో ఆదాము ఈ విధంగా అంటున్నారు ఈమె నా ఎముకలో ఎముక, నాదేహంలో దేహం ఈమె నా వంటిదైనది అని పలికారు. దాంపత్య జీవితంలో ఇద్దరు వేరు వేరు చోట్ల జన్మించినటువంటి వారు ఒకటిగా అవ్వాలి అన్నది దాంపత్య జీవితం ప్రణాళిక. ప్రతి భార్య తన భర్త లాగా మారాలి అదేవిధంగా ప్రతి భర్త తన భార్య లాగా మారాలి. అందుకే ప్రభువు అంటున్నారు వివాహ బంధం ద్వారా భిన్న శరీరులుగా ఉన్న ఇద్దరూ ఏక శరీరులై జీవించబోతున్నారు. వివాహ బంధం అన్నది దేవుడు ఏర్పరిచిన బంధం. ఒక స్త్రీకి భర్తను అదే విధంగా ఒక పురుషుడికి భార్యను జత చేసేది దేవుడే ఎందుకనగా సృష్టి ప్రారంభంలోనే ఆదాముకు అవ్వే భార్యని దేవుడు వారిద్దరినీ జత చేసారు. ఆది తల్లిదండ్రులకు అంతయు క్రొత్తగా ఉన్నప్పటికీ వారిద్దరూ చివరి వరకు కలిసిమెలిసి జీవించారు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ప్రభువే స్వయంగా పలికారు ఎందుకన ఒంటరితనం బాధిస్తుంది, ఒంటరితనం మగవారు తట్టుకోలేరు అందుకే చాలా సందర్భాల్లో చూస్తాం ఒక భర్త చనిపోయినప్పుడు భార్య జీవించగలదు కానీ ఒక భార్య చనిపోయినప్పుడు భర్త దాన్ని తట్టుకొని జీవించటం చాలా కష్టం.
వివాహ జీవిత ముగింపు అనేది కేవలం మరణం ద్వారా సంభవించాలి కానీ విడాకులు అనేవి వివాహ జీవితంలో లేవు అని ప్రభువు స్పష్టం చేశారు. పరిసయ్యులు ఏసుప్రభువుని "భార్యను భర్త పరిత్యజించుట ధర్మమా అని ప్రశ్నించారు" ఎందుకంటే మోషే వారికి భార్యను పరిత్యజించే నియమము ఇచ్చారు కాబట్టి. మోషే చట్టం ప్రకారము ఒకవేళ భార్య అపరిశుద్ధముగా ఉన్నట్లయితే విడాకులు ఇవ్వవచ్చని రాయబడి ఉన్నది ఇక్కడ అ పరిశుద్ధత అంటే ఒక విధముగా భార్య వ్యభిచారిని అయ్యి ఉండవచ్చు రెండవదిగా అపరిశుద్ధత అనగా భార్య తన జీవితంలో భర్త మాట వినకపోవడం, వంట సరిగా చేయకపోవడం, పరాయి పురుషులతో మాట్లాడటం, భర్త యొక్క బంధువులతో అమర్యాదగా మాట్లాడటం ఇవన్నీ కూడా ఆమె యొక్క అపరిశుద్ధతకు సూచనగా ఉన్నాయి. ఇలాంటి విపరీతార్ధాలు ఉండటం వలన యూదా ప్రజలలో విడాకులు ఎక్కువైనాయి. భర్తలు,భార్యలపై ఏదో ఒక సాకుమోపి విడాకులిచ్చేవారు వైవాహిక జీవితం ఇట్టి దుస్థితికి దిగజారి పోవటం వలన వివాహ జీవితం అద్వానంగా మారేది అందుకని స్త్రీలు వివాహమాడుటకు వెనుకంజ వేసేవారు. 
ఏసుప్రభు మాత్రము వివాహ బంధము విడదీయని బంధము అని స్పష్టము చేశారు అందుకే ప్రభువు అంటున్నారు దేవుడు జతపరిచిన జంటను మానవమాత్రుడు వేరుపరపరాదని. దేవుని దృష్టిలో విడాకులకు తావులేదు కానీ మానవులే స్వార్థం కోసం బలహీనత వలన విడాకులు తీసుకుని దైవ ప్రణాళికకు విరుద్ధంగా జీవిస్తున్నారు.
వివాహ జీవితంలో కష్టాలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి బాధలు ఉంటాయి కానీ అన్ని సందర్భంలో ఒకరికి ఒకరై తోడై ఉండాలి అది దేవుడు వివాహ జీవితం ద్వారా నేర్పిస్తున్న అంశం. వివాహం రోజున భార్యాభర్తలిద్దరూ కూడా దేవుని ముంగిట కష్టములోనూ సుఖములోనూ వ్యాధి లోను సౌఖ్యములోనూ నేను నీకు ప్రామాణికంగా ఉందునని ఇద్దరు కూడా ప్రమాణం చేస్తారు. కాబట్టి ఆ ప్రమాణం యొక్క అర్థమును ఎప్పుడూ కూడా గ్రహించి ఇద్దరు కూడా కలిసిమెలిసి చివరి వరకు జీవించాలి. వివాహ బంధము పరలోకమునకై ఏర్పరచబడినది. Marriages are not made in heaven but marriages are made for heaven. ఈ సత్యమును గ్రహించి దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు ఒకరి ఎడల ఒకరు విశ్వాస పాత్రులుగా జీవిస్తూ, పరస్పరం క్షమించుకుంటూ, అర్థం చేసుకుంటూ, ప్రేమించుకుంటూ జీవిస్తే వారు చివరి వరకు సంతోషంగా ఉంటారు.
Fr. Bala Yesu OCD

28, సెప్టెంబర్ 2024, శనివారం

సామాన్యకాలపు ఇరవై ఆరోవ ఆదివారం

సామాన్యకాలపు ఇరవై ఆరోవ ఆదివారం 
సంఖ్యకాండము 11:25-29, యాకోబు 5:1-6 
మార్కు 9:38-43, 45, 47-48.
క్రీస్తునాధునియయందు ప్రియ సహోదరి  సహోదరులారా మరియు  ప్రియమైనటువంటి భక్తులరా, ఈనాటి మూడు పఠణాలను మనం గ్రహించి ధ్యానిస్తే,  మూడు పఠణాలు కూడా మనకు తెలియజేస్తున్నా అంశం ఏమిటంటే, మూడు  ప్రధానమైనటువంటి విషయలను గురించి మనకు క్లుప్తంగా వివరిస్తున్నాయి, అవి ఏమిటంటే దేవుని కృప, అయన తీర్పు మరియు మన తప్పులను సరిదిద్దుకోని. దేవుని బాటలో ప్రయాణిస్తూ, మనం చేసినటువంటి పాపాలను వదలిపెట్టి, ఇతరులను ప్రేమతో దేవుని చెంతకు తీసుకోని రావాలని ఆహ్వానిస్తున్నాయి.
ముందుగా దేవుని కృప, తీర్పు మరియు మన తప్పులను సరిదిద్దుకోవడం అంటే ఏమిటి అని మనం ముందుగా గ్రహించాలి. అసలు దేవుని కృప అంటే ఏమిటి.
దేవుని కృప అనేది మనం సాదించుకోలేని, సంపాదించుకోలేని దివ్యమైనటువంటి లేదా పవిత్రమైనటువంటి వరం. ఈ వరం  మనకందరికీ కూడా దేవుని ప్రేమ, కరుణ మరియు పాపముల నుండి విముక్తి పొందే వరం. బైబిల్ గ్రంథ ప్రకారం దేవుని కృపకు సంబంధించిన ఎన్నో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు ఉన్నాయి. వాటి ద్వారా మనం దేవుని కృప ఏ విధంగా మన  జీవితాలను మారుస్తుందో అర్థం చేసుకోవచ్చు.
 రో్మీయులకు వ్రాసిన లేక 5:8 వచనంలో చూస్తున్నాము.మనము పాపులమై యుండగా క్రీస్తు మన కోసము చనిపోయెను. ఈ వాక్యము మనకు దేవుని కృపను ఆవిధంగా మనపై ఉందొ తెలియజేస్తుంది. మనం పాపులమై ఉండి దేవుని నుండి దూరంగా ఉన్నప్పటికీ కూడా క్రీస్తు మనకోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనందరి కోసం తాను ప్రాణత్యాగం చేశాడు. ఈ కృప మన బలహీనతల మధ్యన, దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మనతో ఉందని గుర్తుచేస్తుంది. అందుకే 
2 కొరింథీయులకు  వ్రాసిన లేక 12:9 వచనంలో క్రీస్తు ప్రభు అంటున్నారు. నా కృప నీకు సరిపడును. అంటే ఈ వాక్యము దేవుని కృపను మరింత స్పష్టంగా వివరిస్తుంది. మన బలహీనతలలోనూ, సమస్యలలోనూ, దేవుని కృప మనకు ఆధారంగా నిలుస్తుంది. అది మనకు అర్హత లేకున్నా కూడా దేవుడు మన మీద చూపించే దయ మరియు అయన కృప మన పాపాలకు క్షమాపణ ఇచ్చి కొత్త జీవితని అందిస్తుంది. దేవునితో సన్నిహిత సంబంధాన్ని అందిస్తుంది. అదే నిజమైన క్రైస్తవుని యొక్క జీవితం.
 మొదటి పఠనని చుసినట్లయితే దేవుడు ఇజ్రాయెల ప్రజలను ఏవిధంగా బానిసత్వ జీవితం నుండి దేవుడు తన ప్రజల పట్ల చూపించినటువంటి కృపను తెలియజేస్తుంది. వారు చేసినటువంటి తప్పులను క్షమించి వారిపై తన కృపను ఎంతగానో చూపిస్తూ, వారిని అన్ని కష్టాలనుండి కాపాడుతు, వారికీ వచ్చినటువంటి కష్టాలను దూరం చేస్తూ, వారికీ అన్ని మేలులను దయచేస్తున్నారు. ఏ విధంగా అంటే తన ఆత్మ శక్తిని వారిపై పంపి తన కృపను అందజేస్తున్నాడు. అదేవిధంగా మన జీవితాలలో కూడా కష్టాలు వచ్చినప్పుడు, మనం కూడా అందరిలాగా దేవునిపై కోపం చూపించకుండా ఓపికతో ఎదురుచూసినట్లుతే అయన కృప ఎప్పుడు మనతో ఉంటుందని మొదటి పఠనం మనకు తెలియజేస్తుంది.
రెండొవ పఠనము యాకోబు వ్రాసిన లేక 5:1-6 లో దేవుడు ధనికులను హెచ్చరించడం గురించి చూస్తున్నాము అది ఏ విధంగా అంటే నీకు ఉన్నా సంపాదలను ని స్వార్ధం కొరకు ఉపయోగించకుండా ఇతరులకు మేలు చేసే విధంగా ఉపయోగించమని ఆలా ఉపయోగించడం ద్వారా దేవుని చేత ఆశీర్వాడింపబడతావని లేకపోతే దేవుని నుండి శిక్షను పొందుతావని మనకందరికి కూడా తెలియజేస్తున్నాడు, ఇక్కడ ఒక క్రైస్తవునిగా మనం చూడవలసిందేమిటంటే, మనం సర్వస్వాన్ని సంపాదించినా, అది దేవుని యోగ్యమైన విధంగా వాడకపోతే అది వ్యర్థమేనని చూసిస్తుంది. అది ఆవిధంగా అంటే లోకమంత సంపాదించి ఆత్మను కోల్పోయిన  లాభము ఉండదో అలాగే మనకు ఎన్ని ఆస్తిపాస్తులున్న అది దేవునికి ఇష్టనుసారంగా లేకపోతె ప్రయోజనము లేదు. ఎందుకంటే పాపాలు, అత్యాశ, ఇతరుల బాధలను పట్టించుకోకపోవడం వంటివి అన్నీ కూడా దేవుని ఖండనకు దారితీస్తాయి. కాబట్టి మన సంపదలను న్యాయంగా ఉపయోగించాలి, ఇతరుల పట్ల మనము దయ చూపించి ప్రేమను నా అనుకోని చూపించాలని రెండొవ పఠనం మనకి నేర్పిస్తుంది. 
చివరిగా సువిశేష పఠనని గమనించినట్లయితే, క్రీస్తు ప్రభు 
 శిష్యులకు నేర్పించినటువంటి కొన్ని సత్యాలు మరియు ముఖ్యమైనటువంటి గుణపాఠాల గురించి  తెలియజేస్తుంది. అప్పుడైతే యోహాను యేసు దగ్గరకు వచ్చి యేసుతో మాట్లాడడో అప్పుడే, యేసు తన శిష్యులకు కొన్ని ముఖ్యమైన మరియు కీలకమైన సందేశాల్ని అందించాడు.  అది ఆవిధంగా అంటే పాపం ఎంత హానికరమో, దానితో మెలగడంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో పూస గుచ్చినట్లు స్పష్టంగా వివరించాడు.
మొదటిది ఇతరులను అంగీకరించడం ఎందుకంటే యోహాను యేసు దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు, ఒక వ్యక్తి మీ పేరిట దయ్యాలను వెళ్లగొడుతున్నాడు, అతను మనతో ఉండలేదు కాబట్టి మేము అతడు చేసేటువంటి పనిని మేము ఆపివేసితిమి అని చెప్పినప్పుడు. అందుకు క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం మనకందరికి కూడా అత్యునతమైన గుణపాఠాన్ని నేర్పిస్తుంది. యేసు అన్నాడు, ఎందుకంటే క్రీస్తు ప్రభు అంటున్నారు నన్ను విరోధించడం లేనివాడు మనకు అనుకూలం అని. ఇది మనకు ఏమి నేర్పిస్తుంది అంటే ఇతరులు దేవుని పట్ల చేసేటువంటి సేవాలను మనస్ఫూర్తిగా అంగీకరించడం అంతే కాకుండా వాళ్లు మన తోటి వారు కాకపోయినా దేవుని సేవ చేయడానికి వారిని మనం అంగీకరించడం ముఖ్యమని తెలియజేస్తుంది. మరి రెండొవది పాపం పట్ల దూరంగా ఉండటం (9:42-48) అంటే యేసు మనకు నేర్పిస్తున్నారు పాపం మన జీవితాలను ఏవిధంగా  నాశనం చేస్తుందో తెలియజేస్తున్నాడు. ఎలాగంటే నీ చెయ్యి నీకు పాపం చేయడానికి దారితీస్తే దానిని తెగనరుకుము, నీ కాలు లేదా కన్ను  నీకు విరుద్ధముగా పాపానికి దారితీస్తే దానిని తీసివెయుము అని అంటున్నారు యేసు ప్రభు. ఇక్కడ యేసు ఇచ్చిన సందేశం మనకు ఎంత ప్రాముఖ్యమైనదిగా గుర్తించాలి. ఎందుకంటే మొదటిగా పాపం మనకు ఆనందాని కలిగించవచ్చు, కానీ అది మన ఆత్మను మరియు మనకు దేవునితో ఉన్నటువంటి సన్నిహితని దూరం చేస్తూ, నాశనం చేస్తుంది. కాబట్టి యేసు చెప్పిన విధంగా మన జీవితంలో పాపం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని. మనకు ఎన్ని సోదనలు, కష్టాలు వచ్చినప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉండి అయన బాటలో నడవడానికి, అయన చేపినటువంటి మాటలను అలకిస్తూ జీవించాలని సువిశేష పఠనం మనలను హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రియా సహోదరి సహోదలారా, ఈ నాటి మూడు పఠనలను కూడా మనం గుర్తుచేసుకుంటూ దేవుడు ఆవిధమైనటువంటి సందేశని మనకు ఇస్తున్నాడని మనం గ్రహించాలి. ఒక క్రైస్తవునిగా మనం జీవిత విధానం ఆవిధంగా ఉంది దేవునికి ఇస్టనుసారంగా ఉందా లేకపోతే మనకు ఇష్టమొచ్చినట్లు మనం జీవిస్తునామా అని ఆలోసించుకోవాలి. ఎందుకంటే దేవుని కృపను, అయన ప్రేమను పొందుకోవాలంటే. మనం అందరము కూడా దేవుని దారిలో నడుస్తూ, మన పాపాలను విడిచిపెట్టి దేవునికి దగ్గరగా అవాలని ప్రార్ధించుకుందాము.
Fr. Johannes OCD 

తపస్సుకాలపు రెండొవ ఆదివారము

తపస్సుకాలపు రెండొవ ఆదివారము ఆదికాండము 15:5-12, 17-18 ఫిలిప్పీయులు 3:17-4:1 లూకా 9:28-36           క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియ  దేవుని ...