15, మే 2021, శనివారం

క్రీస్తు మోక్షారోహణ మహోత్సవము

       క్రీస్తు మోక్షారోహణ మహోత్సవము

 అ. పో 1: 1-11

 ఎఫెసీ 1: 17-23

 మార్కు 16: 15-26

క్రీస్తు నాధుని యందు ప్రియ సహోదరీసహోదరులారా, ఈ రోజు మనము క్రీస్తు మోక్షరోహణ పండుగ జరుపుకుంటున్నాము. ఇది అత్యంత ముఖ్యమైన పండుగ. క్రైస్తవ జీవితాలకు ఇది మరో మహోన్నతమైన మలుపును దిద్దే పండుగ. ఈ పండుగ మనలను దేవునికి సాక్షులుగా ఉండ ఆహ్వానిస్తుంది.

క్రీస్తు ప్రభువు మరణించిన పిదప, నలువది దినముల పాటు తాను స్వయముగా పలుమారులు శిష్యులకు కనిపించుచు, తాను సజీవుడని వారి సందేహములు తొలగునట్లుగా ఋజువు పరచు కొనెను. వారికి కనబడటమే కాక దేవుని రాజ్యము గూర్చి వారికి బోధించెను. ఈ మాటలు పలికిన పిమ్మట వారు చూచుచుండగా అయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను (అ. పో 1: 3-9). క్రీస్తు ఉత్తానుడైన పిదప నలువది దినములకు ఈ మోక్షరోహణము అపొస్తలుల ఎదుట జరిగింది. అప్పటి నుండి శిష్యులు ఈ గొప్ప రహస్యాన్ని విశ్వసించి ప్రకటించడము ప్రారంభించారు. 


 దైవ సహాయముతో


పవిత్రాత్మ మీపై దిగివచ్చినప్పుడు
, మీరు శక్తిని పొందుతారు. మీరు నా సాక్షులుగా రాజిల్లుతారు. ఈ మాటలు ప్రభువు తన  తండ్రితో పరలోక మహిమలో ప్రవేశించే ముందు పలికిన చివరి
మాటలు.  ఈ మాటలు ఆయన రక్ష సాధన కర్తవ్యాన్ని, ఆయన రక్షణ కార్యానికి సాక్షులుగా నిలవాల్సిన శిష్యుల కర్తవ్య  బాధ్యతను ఎత్తి చూపుతున్నాయి.  వారి కర్తవ్యము, బాధ్యత సువార్తను ప్రకటించడము,  రక్షణ  సువార్తను ఇశ్రాయేలు ప్రజలకే కాక, ప్రపంచములోని అన్ని జాతుల వారికి ప్రకటించడము.  

ఎందుకంటే దేవుని ప్రేమ రక్షణానుగ్రహము ఏ కొందరికో లేక ఏ ఒక్కజాతికో పరిమితమైనది కాదు.  అది ప్రపంచానికంతటికి, అంగీకరించే ప్రతి ఒక్కరికి చెందినది. దేవుని సువార్త అనేది ప్రజలను తమ అపరాధ, పాప బానిసత్వాలనుండి, భారము నుండి విడుదల చేసే దేవుని శక్తి గలది. మనలను స్వస్థపరచి పునరుద్ధరించి పరిపూర్ణులను చేయగల శక్తిమంతమైనది దేవుని వాక్కు. ఆ వాక్కును ప్రకటించడానికి దేవుడు శిష్యులను ఎన్నుకుని వారిలో పవిత్రాత్మను నింపాడు.

 అనునిత్యము ప్రకటించండి

    సువార్త వ్యాప్తి అనేది నిరంతరము కొనసాగించవలసినది. ఎందుకంటే క్రీస్తు ప్రేషిత కార్యము అన్ని కాలాలకు సంభందించినది. అయితే ఈ కర్తవ్య నిర్వహణ బాధ్యత కేవలము అభిషేకము పొందిన కొందరికి మాత్రమే అప్పగింపబడలేదు. క్రీస్తే నిజమైన రక్షకుడని విశ్వసించే అందరికి అప్పగింపబడినది. ఆనాటి క్రైస్తవ సంఘము ఈ ఆజ్ఞను బాగా అర్ధము చేసుకుని, చక్కగా పాటిచింది. కనుకనే సువార్త సందేశము వేగముగా విస్తరించింది. అయితే ఈ నాటి కాలములో సువార్త పరిచర్యలో ఏర్పడిన అధికార కేంద్రీకరణ కారణముగా అది మలుపు తిరిగి కేవలము అభిషిక్తుల ప్రధాన పరిచర్యగా మారిపోయింది.

ఉత్తాన ప్రభువు అప్పగించిన ఈ గొప్ప బాధ్యత, శ్రీ సభలోని విశ్వాసులందరికి  చెందినదన్న నిజాన్ని గ్రహించాల్సిన సమయము వచ్చింది. రెండవ వాటికన్ మహాసభ అందించిన, "గృహస్థ క్రైస్తవుల అపోస్తొలిక" అను అధికార పత్రములో తెల్పిన  విధముగా, సువార్త ప్రకటన అనేది బాప్తిస్మము స్వీకరించిన ప్రతి ఒక్కరికి ప్రభువు అప్పగించిన బాధ్యత. క్రైస్తవునిగా జీవించడము అంటేనే ప్రభువుకు సాక్ష్యము పలుకడము. ప్రభువు సువార్తను ప్రకటించడము. పునీత అస్సిసి పూరి ఫ్రాంచీసువారు  చెప్పిన విధముగా మాటలలోనే కాదు, చేతలలోను, జీవిత విధానములో కూడా సువార్తను ప్రకటించవచ్చు.

జీవిత సాక్ష్యము:

సమాజములో ఒక మంచి వ్యక్తిగ పేరు తెచ్చుకున్న ఒక వ్యక్తి, తన వృధాప్యములో తన ముగ్గురు కుమారులను పిలిచి నేను మరణించిన తరువాత మీరు నా పేరును ఎలా నిలబెడతారుఅని అడిగాడు. పెద్ద కొడుకు అందుకు సమాధానము చెబుతూ, మీలో ఉన్న గుణాలను అన్నిటిని వివరిస్తూ ఒక పుస్తకాన్ని ముంద్రించి, అందరికి పంచుతాను. దానిని చదివిన ప్రతి ఒక్కరు మీ గురించి తెలుసుకుంటారు అని అన్నాడు. ఇక రెండవ వాడు తండ్రి గౌరవార్థము నగరము మధ్యలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని, అప్పుడు  అందరికి తండ్రి పేరు ప్రతిష్టలు స్థిరముగా తెలుస్తాయని, అప్పుడు తండ్రి పేరు నగరములో చిరస్థాయిగా నిలుస్తున్నాడని అన్నాడు. కానీ చిన్న కుమారుడు మాత్రము అందరు నన్ను మీ కుమారునిగా గుర్తించే విధముగా మీ అడుగుజాడలలో నడుస్తూ  మంచిగా జీవిస్తాను అని అన్నాడు.
పుస్తకాన్ని ప్రచురించడము ద్వారా, విగ్రహాన్ని ప్రతిష్టించడము ద్వారా కుమారులు తమ  తండ్రికి జీవిత సాక్ష్యాన్ని ప్రదర్శించడము లేదు. కానీ ఆయనలా మంచిగా జీవించడము
ద్వారా ఆయన మంచితనము ఎల్లయెడల వ్యాపిస్తుంది. అదే విధముగా క్రీస్తు సువార్తను 
మనము మాటల ద్వారా, పుస్తకాల ద్వారా, మందిరాల ద్వారా కన్నా, మన జీవిత సాక్ష్యము ద్వారా మరింత స్పష్టముగా తెలియజెప్పిన వారలమవుతాము. కాబట్టి దేవుని  వాక్యాన్ని విందాము, పాటిద్దాము, ఆయన సాక్షులుగా జీవిద్దాము.ఆమెన్


Bro. Ratnaraju Abbadasari OCD

9, మే 2021, ఆదివారం

6 వ పాస్కాకాల ఆదివారము

 అ.పో 10: 25-26, 34-35, 44-48, 

1 యోహాను 4:7-10

యోహాను 15: 9-17

ప్రియ స్నేహితులారా, ఈనాటి మూడు దివ్య గ్రంథ పఠనాలు మనకు చాల ముఖ్యమైన అంశాన్ని తెలియజేస్తున్నాయి. ఆ అంశము ఏమిటంటే, ప్రేమ. ప్రేమ అనే అంశాన్ని నేను చాల ధ్యానించాను. ఎంతో మంది నా స్నేహితులను అడిగి చూసాను. చాల మంది చాల రకాలైన జవాబులు ఇచ్చారు. కానీ, నేను తెలుసుకున్నది ఏమిటంటే "ప్రేమ" అంటే ఇది లేదా అది ఎన్ని కచ్చితంగా ఎవరు చెప్పలేరు. ప్రేమ అనేది దైవ రహస్యము. ఈ ప్రేమ పూర్తిగా రహస్యము కాదు, అదే విధముగా పూర్తిగా వివరించలేము, వర్ణించలేము. ఈ ప్రేమ మన మాటలకు అందనిది. ప్రేమ అనేది అనంతము. కానీ చాలామంది ఈ ప్రేమ అంటే ఏమిటో వివరించడానికి చాల రకాలుగా ప్రయత్నిస్తారు. ప్రేమ రెండు రకాలు అని మనము చెప్పుకోవచ్చు.

1. దైవ ప్రేమ,

2. సహోదర ప్రేమ

ప్రేమించేది ఎందుకు? మనము కలిసి జీవించడానికి. మానవులైన మనము ఒకరికొకరు తోడు నీడగా ఉండటానికి. దేవుడు కూడా మనలను ప్రేమించేది మనము ఆయనతో కలిసి జీవిస్తూ అయన ఆజ్ఞానుసారం జీవించడానికి. కానీ ఆ దేవుని ప్రేమ మనము తెలుసుకోలేకపోతున్నాము. మనము ఎవరినైనా ప్రేమిస్తే వారి యొక్క బాహ్య శారీరక అందాన్ని చూసి లేదా వారు చేసే మంచి పనులు చూసి ప్రేమిస్తాము. లేదా వారి డబ్బును చూసి ప్రేమిస్తాము. కానీ దేవుని ప్రేమ మానవులైన మన ప్రేమ వంటిది కాదు. దేవుని ప్రేమ ఏ షరతులు లేనటువంటిది.

ఈనాడు మొదటి పఠనములో దేవుడు అందరిని సమదృష్టితో చూస్తాడు, అందరిని ఒకేలా ప్రేమిస్తాడు అనే విషయము మనకు అర్థమవుతుంది. క్రీస్తు సేవకులమైన మనము ఎట్టి పక్షపాతము లేకుండా అందరిని సమదృష్టితో చూడాలని అందరిని మనము ఒకేలా ప్రేమించాలని గుర్తుంచుకోవాలి. దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపినది పాపులమైన మనపై ప్రేమ తెలియజేయడానికి. మనలను ప్రేమించి మన పాపములనుండి రక్షించి అందరిని ఒకే ప్రజగా ఒకే కుటుంబముగా మార్చి అందరము ఒకరినొకరు ప్రేమిస్తూ జీవించాలని తెలియజేసాడు. ఈ నాటి మొదటి పఠనములో పునీత పేతురు గారు ప్రసంగించుచుండగా దేవుని యొక్క ఆత్మ అందరిపై దిగివచ్చెను అని చదువుతున్నాము. అంటే దేవుడు అందరిని సమదృష్టితో చూస్తాడు అని అర్ధము(అ.పో 10: 14). క్రీస్తు ప్రభువు తన శ్రమల, మరణ, పునరుత్తానాల ద్వారా తండ్రి ప్రేమను తన ప్రేమను మనకు తెలియజేసి కుల, మత, వర్గ, ప్రాంతీయ, భాషల వారీగా విడిపోయిన మనలను ఒకే కుటుంబముగా మార్చి, మనలను ప్రేమ కలిగి జీవించాలని ఆజ్ఞాపించారు.

రెండవ పఠనములో మనము తెలుసుకున్నది ఏమిటంటే ప్రేమించువాడు దేవుని బిడ్డ. ఎందుకంటే మన తండ్రి దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమామయుడు. ఆ ప్రేమ కలిగిన తండ్రి దేవుడు మనలను ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించారు. ఎందుకంటే మనలను మన పాపముల నుండి రక్షించడానికి( యోహాను 3: 16).  మనము మన జీవితాంతము గుర్తుంచుకోవలసిన విషయము ఏమిటంటే 1 యోహాను 3: 17-18 వ వచనంలో ప్రభువు పలికినట్లుగా ఏ వ్యక్తి అయినను ధనికుడై ఉండి కూడా అవసరములలో ఉన్న తన సోదరుని చూసియు తన హృదయ ద్వారములను మూసివేసినచో దైవ ప్రేమ తనలో ఉండి అని ఎట్లు చెప్పగలడు? కాబట్టి మనము ఆయనను విశ్వసించి ఆయన నేర్పించిన ప్రేమ మార్గములో నడవాలి. ప్రేమ కలిగి జీవించాలి.

సువిశేష పఠనములో మనము గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు జీవితము ప్రేమకు ప్రతిబింబము. క్రీస్తు ప్రభువు మనలను ఎన్నుకున్నది అయన ప్రేమకు సాక్షులుగా ఉండడానికి అయన ప్రేమలో జీవించడానికి. క్రైస్తవత్వము మొత్తము రెండు ప్రధాన ఆజ్ఞలపై ఆధారపడియుంది. అవి ఏమిటంటే దైవ ప్రేమ, సోదర ప్రేమ. ఈ ప్రేమ మనకు దైవాజ్ఞ మాత్రమే కాదు. మన యొక్క భాద్యత. క్రీస్తు ప్రభువు మనలను అయన ప్రేమలో నెలకొని ఉండవలెనని ఆహ్వానిస్తున్నారు. మనము అయన ప్రేమలో నెలకొని ఉండాలంటే అయన ఏ విధముగా తండ్రి ఆజ్ఞలను పాటించి తండ్రి ప్రేమలో నెలకొని ఉన్నాడో మనము కూడా క్రీస్తు ప్రభుని ఆజ్ఞలను పాటిస్తూ ఆ క్రీస్తుని ప్రేమలో నెలకొని ఉండగలము. యోహాను 15:17 వ వచనంలో క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నాడు, "మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. అదే విధముగా యోహాను శుభవార్త 15: 12 వ వచనంలో నేను మిమ్ము ప్రేమించునట్లు మీరును ఒకరినొకరు ప్రేమిచుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ అని క్రీస్తు ప్రభువు పలుకుచున్నాడు. ఎప్పుడైతే మనము ఇతరులను ఏ భేదాలు, తారతమ్యాలు లేకుండా ప్రేమిస్తామో అప్పుడు మన జీవితములో దేవుడు ఇచ్చే ప్రేమను ఆనందాన్ని సంపూర్ణముగా అనుభవించగలము. అయన ఇచ్చు జీవముతో సంతోషముగా జీవించగలము. (యోహాను 10: 10)

కాబట్టి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. దేవుని ప్రేమ పొందిన మనము మానవత్వముతో, ప్రేమ్మతో జీవిస్తున్నాము లేదా! నేడు మనము చూస్తే మానవులు అయిన మనము సృష్టి వస్తువులను ప్రేమిస్తున్నాము. మనుషులను మన యొక్క స్వార్దాలకు ఉపయోగించుకుంటున్నాము. అలా కాకుండా దేవుని ప్రేమిద్దాము, దేవుని పోలికలో ఉన్న తోటి వారిని ప్రేమిద్దాము. ఈ సృష్టిని అందులో ఉన్న వస్తువులను ప్రేమతో కాపాడుకుంటూ మన స్వార్ధము కోసము కాకుండా ప్రేమతో జీవిద్దాము. ఆమెన్

Bro. Suresh Mathew OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...