7, ఆగస్టు 2021, శనివారం

19 వ సామాన్య ఆదివారం

19 వ సామాన్య ఆదివారము

1 రాజులు 19: 4-8 

ఎఫెసీ 4: 30 – 5: 2

యోహాను 6: 41-51

నేటి దివ్య పఠనాలు మరొకసారి దేవుని యొక్క జీవాహారం, ఆ జీవాహారం ఇచ్చే శక్తిని గురించి భోదిస్తున్నాయి. దేవుని యొక్క ఆహరం స్వీకరించడము ద్వారా విశ్వాసుల యొక్క జీవితాలలో అనేక రకాల మేలులు, అద్భుతాలు జరుగుతుంటాయి, దీవెనలు పొందుతారు.

ఈనాటి మొదటి పఠనములో ఏలీయా ప్రవక్త రొట్టెను భుజించి శక్తిని పొందిన విధానము తెలుసుకుంటున్నాము. ఏలీయా ప్రవక్త ఇశ్రాయేలులో ప్రవచించే సమయములో కార్మెల్ కొండమీద 450 మంది బాలు ప్రవక్తలను వధించి నిజదేవుడైన యావే గురించి తెలియజేసారు. అటు తరువాత ఆ విషయము విన్న అన్య జాతికి చెందిన యెసెబెలు రాణి ఇది భరించలేక వెంటనే ఏలీయా ప్రవక్తను చంపాలన్న వార్తను పంపించింది. అది విన్న ప్రవక్త భయముతో ఉన్నారు. హోరేబు కొండవద్దకు వచ్చి ప్రాణాలను కాపాడుకోవాలనుకున్నారు. అప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై ఏలీయా ప్రవక్తను పోషిస్తుంది. ఆయనలో కొత్త ధైర్యము, ఒక నూతన తేజాన్ని నింపుతుంది  

ఇక్కడ మనము అర్ధము చేసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి

  1. రొట్టె భుజించిన తరువాత మార్పు వచ్చింది. అప్పటివరకు బలహీనంగా ఉన్నాడు, ప్రాణభయంతో ఉన్నారు, శారీరక శక్తి నశించిపోతుంది. ఎందుకంటే చాల దూరం అరణ్యములో ప్రయాణము చేసారు. ఒక్కసారి రొట్టెను భుజించిన తరువాత తాను శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తిని పొందాడు. తనలో కొత్త ధైర్యము వచ్చింది, కొత్త విశ్వాసము నమ్మిక పుట్టుకొచ్చాయి. దేవుని యొక్క పని బ్రతికినా, మరణించినా పరిపూర్తి చేయాలనుకున్నారు. మనలో కూడా దేవుని యొక్క జీవాహారము భుజించినప్పుడు  మార్పు రావాలి. మనము పాపులం కావచ్చు, అన్యాయము చేసినవారు కావచ్చు, వివిధ రకాలుగా స్వార్ధపు ఆలోచనలతో జీవించిన వారు కావచ్చు. అయినప్పటికీ దేవుడిని నీ నా హృదయములోనికి పిలిచినప్పుడు స్వీకరించినప్పుడు పాపి పుణ్యాత్ముడుగా మారాలి, స్వార్ధం నిస్వార్ధము అవ్వాలి, అన్యాయము న్యాయము చేసేలా ఉండాలి. మనలో మార్పు వస్తేనే మనము స్వీకరించే దివ్యసత్ప్రసాద స్వీకరణకు ఒక మంచి అర్ధము ఉంటుంది 

  2. ఇక్కడ దేవదూత ఏలీయాతో నీవు చాల దూరము ప్రయాణము చేయాలి అని చెబుతుంది. ఒక జీవితము ప్రారంభించిన తరువాత (క్రైస్తవ జీవితము) మనము కూడా దేవునిలో ప్రయాణము చేయాలి. ప్రయాణము అంటే ముందుకు సాగుట. అది ఎక్కడినుండి అయినా సరే. ముందుకు వెళ్ళుట అని కూడా చెప్పవచ్చు. ఏలీయా నీవు ప్రయాణం చేయాలి అనగా దేవుని యొక్క పనిని పూర్తి చేయుటకు నీవు ప్రయాణం చేయాలి. ఆ పనిలో ముందుకు సాగాలి. దేవుని కీర్తిని వెదజల్లుటలో ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క సాన్నిధ్యం అనుభవించుటలో ముందుకు వెళ్ళాలి. ప్రతి యొక్క ప్రయాణములో దేవుని యొక్క అభయ హస్తమును చవిచూడాలి. ఇశ్రాయేలీయులు తమ ప్రయాణములో దేవుణ్ణి తెలుసుకున్నారు. అలాగే ఏలీయా కూడా తన ప్రయాణములో ఇంకా దేవుణ్ణి తెలుసుకుని అయన కోసం నిలబడాలని దీని అర్ధం. ఏలీయా ఎలాగైతే ప్రయాణము చేసాడో మనము కూడా అలాగే ప్రయాణము చేయాలి. దివ్యసత్ప్రసాదము స్వీకరించిన తరువాత దేవుని వైపు మాత్రమే ప్రయాణము చేయాలి. దేవుని ప్రేమను పంచుటలో ప్రయాణము చేయాలి. దేవుని సాన్నిధ్యము రోజురోజుకి ఎక్కువగా అనుభవించుటకు ముందుకు ప్రయాణము చేయాలి. సమస్యలు అను పర్వతము ఎక్కి మరి ప్రయాణము చేయాలి. అలాగే కుటంబ జీవితము జీవిస్తున్న భార్యాభర్తలు చాలాదూరం అన్యోన్యముగా, ప్రేమగా ప్రయాణము చేయాలి, మంచిగా ఉండాలి.  

  3. దేవుని యొక్క అభయం ఉంటే ఎవ్వరు ఎన్నడును ఒంటరి కాదు. ఎందుకంటే వారికి దేవుడు తోడుగా ఉంటారు. నిస్సహాయుడిగా ఉన్న ఏలీయాకు దేవుడు తోడుగా ఉన్నారు, ఓదార్చారు, నడిపించారు. పడిపోయిన తనను మరల లేవనెత్తుతున్నారు. అలాగే మన బాధల సమయములో మనము ఒంటరి కాదు దేవుడు మనకు తోడుగా ఉంటారు.

  4. మనము విశ్వసించే దేవుడు, సమకూర్చే దేవుడు. ఏలీయా ప్రవక్త తన ప్రయాణములో తాను ఏమి తీసుకువెళ్లకపోయిన దేవుడు ఆహారము ఒసగుతున్నారు, సమకూరుస్తున్నారు.

రెండవ పఠనములో పౌలు గారు క్రీస్తునందు నూతన జీవితము గురించి బోధిస్తున్నారు. క్రీస్తుని అంగీకరించిన తరువాత, స్వీకరించిన తరువాత వారిలో కొత్త జీవితము ఉండాలి. ఆ జీవితములో పరస్పర ప్రేమ, దయ ఉండాలి. క్షమించుకునే మనస్సు ఉండాలి. అయన తన శరీర రక్తాలు మన కోసము ధారపోసి మరణించారు కాబట్టి ఆయనను మనలోకి ఆహ్వానించే సమయములో ఇలాంటి మంచి గుణాలు మనలోకి రావాలి. మొదటి పఠనములో చెప్పిన విధముగా రొట్టె స్వీకరించినప్పుడు మార్పు వచ్చిన విధముగా క్రీస్తుని శరీర రక్తాలు స్వీకరించినపుడు క్షమా, దయ, ప్రేమ అనేవి మనలో పుట్టాలి. మనము మారాలి. ప్రేమతో నడుచుకోవాలి. 

సువిశేషములో మరొకసారి దివ్యసత్ప్రసాదము గురించి చేసిన ప్రభోదం గురించి వింటున్నాము. యేసు ప్రభువు తాను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారముగా అంటున్నారు. చాల మందికి అర్ధం కాని విషయం ఇది. ఎందుకంటే ఎలాగా ఒకరు పరలోకము నుండి దిగివస్తారని మానవ ఆలోచన. అందుకే వారు విశ్వసించలేదు. దేవుడిని విశ్వసించాలన్న, దేవుని యొక్క మాటలు అంగీకరించాలన్నా మనలో దేవుని యొక్క ఆత్మ ఉండాలి. దేవుని యొక్క ఆత్మకు మనము సహకరించాలి. యేసు ప్రభువు ఎన్నో అద్భుతాలు చేసారు. ఎవ్వరుకూడా చేయనటువంటి గొప్ప కార్యాలు చేసారు. అయినా సరే వారు అంగీకరించలేదు. ఎందుకంటే వారు ఆయనలో తప్పును మాత్రమే వెదికారు. కొందరు మాత్రమే ఆయనను రక్షకునిగా అంగీకరించారు. వారి హృదయాలు కఠినమైనవి. వారి విశ్వాసము కన్నా వారి తర్కము వారిని ఎక్కువగా ప్రభావితము చేసింది. దేవుని విషయాలు మనము విశ్వాసము ద్వారా అర్ధము చేసుకోవాలి. యేసు ప్రభువే జీవాహారము. మన ఆత్మలకు జీవము. మనయొక్క ఆత్మలను పోషించేవారు కాబట్టి ప్రభువును ఎపుడు స్వీకరించాలి.

దేవుని యొక్క దివ్య సత్ప్రసాదం స్వీకరించుట ద్వారా కలుగు ఆశీర్వాదాలు .

1.మనం నిత్య జీవం పొందుతాముద

2.దేవుని ఐక్యమై ఉంటాం (యోహాను 6 :57 )

3.మనకు ధైర్యం ఇస్తుంది

4.మనకు శక్తిని ఇస్తుంది

5.అనారోగ్యాలను బాగు చేస్తుంది

6.హృదయ పరివర్తనకు దారి తీస్తుంది

7.పరలోక ద్వారాలను తెరుస్తుంది

8.దేవుని యొక్క తోడునిస్తుంది.ఆమెన్

By Rev. Fr. Bala Yesu OCD

31, జులై 2021, శనివారం

18 వ సామాన్య ఆదివారం

18 వ సామాన్య ఆదివారం

నేనే జీవాహారము 

నిర్గమఖాండము;16 ;2 -4 , 12 -16 .

ఎఫెసీయులు;4 -17 , 20 -24 .

యోహాను;6 ; 24 -35 .


క్రీస్తు నాధుని యందు ప్రియా సహోదరి సహోదరులారా ఈనాడు మనం 18 వ సామాన్య ఆదివారం లోనికి ప్రవేశించియున్నాం.

ఈనాడు పఠనములు మనకు తెలియచేసేది ఏమిటంటే- మీరు అశాశ్వతమైన ఆహారం కోసంకాకుండా శాశ్వతమైన ఆహారం కోసం, మరియు శాశ్వత మైన వాటి కొరకు శ్రమించండి, అని బోధిస్తున్నాయి.

మొదటి పఠనంలో దేవుడు ఇశ్రాయేలీయులను పరీక్షిస్తున్నాడు, ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు దేశము నుండి మోషే, అహరోనులతో నడిపించుకుని వస్తున్న సమయంలో వారు ఆకలికి తట్టుకోలేక, మేము ఐగుప్తు మంచిగా ఉండేది అని, యావే దేవుడిని మరియు ఆ మోషే, అహరోను ప్రవక్తలను నిందిస్తున్నారు. 

నిర్గమ: 16 : 11  వ వచనంలో చూసినట్లయితే, యావే ప్రభువు మోషే తో నేను ఇశ్రాయేలీయులు సణుగుకొనుట వింటిని కాబట్టి, ఇదిగో నేను ఆకాశము నుండి వారికీ  ఆహారం కురిపింతును అని చెప్పెను.

ఆవిధంగా యావే దేవుడు వారికీ మన్నాను మరియు పూరేలి పిట్టలను  వారికీ ఆహారంగా దయచేసాడు. కానీ వారు శారీరక ఆహారం కొరకు తపించుచున్నారు, దేవుని తెలుసుకోలేక పోతున్నారు.

రెండవ పఠనంలో పునీత పౌలుగారు ఈవిధంగా బోధిస్తున్నారు, మీరు మీ పూర్వ జీవితమును, స్వభావమును మార్చుకొనుడు. ఎందుకంటే మీ జీవితాలు మోసపూరితమైనవి, భ్రష్టుబట్టిపోయినవి. 23 వ వచనంలో చుస్తే మీ మనస్తత్వమును నూతనత్వము గావించుకొనుడు. నీతిని, పరిశుద్ధతను కలిగి కొత్త స్వభావమును ధరించండి, అని పౌలు గారు ఆ యొక్క ఎఫెసీ ప్రజలకు భోదించారు.

సువిశేష పఠనంలో చుస్తే ప్రజలు క్రీస్తు ప్రభువు యొద్దకు వచ్చారు. క్రీస్తు వారితో, మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందువలన నన్ను వెదకుచున్నారు, నా అద్భుత  కార్యములను చూసికాదు అని అన్నారు. అదే విధంగా ఆయన తన గొప్ప రహస్యాన్ని, వాగ్దధానాన్ని వారికిఇచ్చారు. అది ఏమిటంటే 27 వ వచనంలో మనం చూస్తున్నాం; మీరు అశాశ్వతమైన భోజనముకై శ్రమింపవలదు, నిత్య జీవితము చేకూర్చు శాశ్వత భోజనముకై శ్రమింపుడు, దానిని నేను మీకు ఒసగెదను.  

మనం గమనించినట్లయితే; క్రీస్తుప్రభుని ప్రజలు వెదకుచు వచ్చారు అని మనం వింటున్నాం. క్రీస్తుని వెంబడించిన  వారు 5 రకాల మనుషులు.

1 . తిండికోసం- భుక్తికోసం వెంబడించినవారు 

మత్తయి; 14 ; 13 -21 ( 5 రొట్టెలు 2 చేపలు )

మత్తయి ; 15 ; 32 -39 (7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు)

ఫిలి; 3 ; 19  వారి కడుపు వారికీ దేవుడు.

2 . రెండవ రకం 

అద్భుతములు చూసి వెంబడించారు.

మత్తయి; 11 ;21  అద్భుతాలు చూసారు కానీ నమ్మలేదు. 

3 . స్వస్థత కొరకు వెంబడించినవారు 

లూకా 17 ; 11 -19  పది మంది కుష్టురోగులు.

లూకా 11 ; 23 -26 దెయ్యముల నుండి  వెడలగొట్టబడినవారు.

4 . యేసు బోధనలను తప్పు పట్టడానికి  వెంబడించినవారు. 

లూకా20 ; 1 -8 శాస్త్రులు మరియు పరిసయ్యులు.

5 యేసుని మనస్ఫూర్తిగా నమ్మినవారు.

సమారియా స్త్రీ; యోహాను 4 : 6 -42 .

జక్కయ్య ; లూకా 19 ; 1 -10 .

క్రీస్తు ప్రభుని మనం మనస్ఫూర్తిగా విశ్వసించేవారిగా మనం ఉండాలి. మన దృష్టివలన కాకా విశ్వాసం వలన నడుచుకోవాలని క్రీస్తు మనకు తెలియాచేస్తున్నారు. 

క్రీస్తుప్రభువుని, ఆ నిత్యజీవితాన్ని, ఆ యొక్క శాశ్వత భోజనాన్ని మనం పొందాలంటే, మనం ఏమి చేయాలంటే, క్రీస్తుప్రభుని విశ్వసించాలి, విశ్వాసంతో జీవించాలి. విశ్వాసిగా మారి క్రీస్తులో ఐక్యం కావాలి. 

ప్రజలు దేవుడు ఇచ్చిన రొట్టెలను మాంసాలను చూశారేగాని దానిని ప్రసాదించిన దేవుడిని మాత్రం మరిచిపోయారు. 

కాబట్టి ప్రియా స్నేహితులారా, క్రీస్తుప్రభువు; నేనే జీవాహారమును, నన్ను భుజించువారు, నిత్య  జీవితమును పొందుతారు అని తెలియచేస్తున్నారు. క్రీస్తు ప్రభువు మత్తయి;6;31 లో చెబుతున్నారు, ముందు మీరు దేవుని రాజ్యాన్ని వెదకండి, అపుడు మీకు అన్ని అనుగ్రహించబడతాయి.

_బ్ర. సురేష్ కొలకలూరి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...