2, ఏప్రిల్ 2022, శనివారం

తపస్సుకాల 5 వ ఆదివారం

యెషయా 43:16-21, పిలిప్పి 3:8-14, యోహాను 8:1-11
ఈనాటి దివ్య గ్రంధ పఠనాలు  క్షమించుట  ద్వార దేవుడు ప్రసాదించు క్రొత్త జీవితం గురించి  బోధిస్తున్నాయి. దేవుడిచ్చే గొప్ప అవకాశం వల్ల  దేవునికి ప్రీతికరమైన జీవితం జీవించాలి. పశ్చాత్తాప పడిన  ప్రతి యొక్క  విశ్వాసిని దేవుడు క్షమించడానికి ఎప్పుడు సిద్దంగానే ఉంటారు. పాపికి  దేవుడు మరొక అవకాశం దయచేసి క్రొత్త జీవితం జీవించమని తెలియజేస్తారు. 
మన జీవితంలో కూడా ఎదుటి వారు చేసిన తప్పిదములు లెక్క చేయకుండా వారిని క్షమించుకొని జీవించాలి. వారికి ఒక అవకాశం ఇచ్చి చూడాలి. మన యొక్క స్నేహాలు నిలబెట్టుకోటానకి అవకాశం ఇవ్వాలి. ఇతరులు చేసిన తప్పులు క్షమించి మరలా మనతో క్రొత్త జీవితం జీవించడానికి వారికి ఇంకో అవకాశం ఇవ్వాలి. 
దేవుడు మన పట్ల  ఎలాగైతే  క్షమ హృదయాన్ని కలిగి జీవిస్తున్నారో మనం కూడా ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి అధేవిధంగా దేవుడు మానాకోక అవకాశం  ఇచ్చిన విధంగా వేరేవారికి కూడా అవకాశం ఇవ్వాలి. 
ఈ మూడు పఠనాలు కూడా మారని దేవుని ప్రేమగురించి అలాగే ఆయన యొక్క శాశ్వత ప్రేమ గురించి చక్కగా వివరిస్తున్నాయి. 
మన నిజ జీవితంలో ఎవరైన సంపూర్ణంగా  ప్రేమిస్తే వారిని వారి పాపాలు క్షమించడానికి ఎప్పుడు సిద్దంగానే మనం ఉంటాం. దేవుడు తన ప్రజలను సంపూర్ణంగా ప్రేమించారు, కాబట్టియే వారి అనేక పాపాలు క్షమిస్తున్నారు. 

ఈనాటి మొదటి పఠనంలో దేవుడు యిస్రాయేలు ప్రజలకు ప్రసాదించే నూతన జీవితం గురించి భోధిస్తున్నారు. 
యిస్రాయేలు ప్రజలు బాబిలోనియా బానిసత్వంలో ఉన్న సమయంలో యోషయా ప్రవక్త ద్వార పలుకుచున్న సంతోష వాక్కులు వింటున్నాం. బాబిలోనియా బానిసత్వంలో చివరిరోజుల్లో ఉన్న సమయంలో పలికిన ఆనంద మాటలు ఇవి. 

బానిసత్వం నుండి మరొకసారి దేవుడు వారిని బయటకు తీసుకొని వస్తారని, యెరుషలేముకు నడిపిస్తారని తెలుపుచున్నారు. యెరుషలేము దేవాలయం పునరుద్ధరిస్తారని యోషయా ద్వారా తెలియచేసారు. 
మొదటి ప్రారంభ వచనాలలోదేవుడు  ఎలాగ వారికి  సముద్ర మార్గం గుండా దారిని చేశారో తెలుపుచున్నారు. అదే విధంగా జలరాశి గుండా, ఎండిన నేల మీద నడిపించారు. నిర్గ 14:22.  14:29. 
తాను ప్రేమించిన ప్రజలకోసం దేవుడు శత్రు సైన్యంతో  పోరాడారు. నిర్గ 1వ అధ్యాయం 11 వ అధ్యాయం వరకు వారికి 10 అరిష్టాల ద్వారా వారితో పోరాడారు. 
తనను నమ్ముకున్న ప్రజల పట్ల దేవుడు చూపించే కరుణ అలాంటిది. దేవుడు అన్ని సమయాలలో వారితో ఉండేవారు. నిర్గ 3:14. అసాధ్యమైన కార్యములు దేవుడు తన ప్రజల కోసం చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదియు లేదు. లూకా 1:37. తన ప్రజల మీద ఉన్న ప్రేమ వలన అసాధ్యమైనవి దేవుడు సుసాధ్యం చేస్తారు. 

18 వ వచనంలో  ప్రభువు  అంటున్నారు. మీరు పూర్వ సంగతులను గుర్తుంచు కొనక్కరలేదు అని ప్రభువు చెబుతున్నారు. 
వారి  బలహీనతలు గుర్తించుకొనక్కరలేదు అంటున్నారు. వారు దేవుడిని విస్మరించిన క్షణాలు గుర్తుంచుకొనక్కరలేదు.  వారి పాపాలు గుర్తుంచుకొనక్కరలేదు అంటున్నారు. వారి బానిసత్వ బాధలు గుర్తుంచుకొనక్కరలేదు అని అంటున్నారు. 

పశ్చాత్తాప పడిన ప్రజలకు, క్షమించమని కోరిన ప్రజలకు దేవుడు నూతన కార్యము చేస్తానంటున్నారు. ఆ నూతన కార్యమేమనగా అది క్రొత్త జీవితమే, క్రొత్త బంధమే, క్రొత్త ఒడంబడికయే, క్రొత్త ఆశీర్వాదమే. యోషయా 65:17, 2 కోరింథీ 5:17. అ. పొ 21:15. 

19 వ వచనంలో ప్రభువు  అంటున్నారు, ఎడారిలో బాటలు వేస్తానని, మరు భూమిలో త్రోవ వేయుదును అని అదే విధంగా 20 వ వచనంలో ఎడారి గుండా నీటిని పారించి నేను ఎన్నుకొన్న ప్రజలకు ఇత్తును అని అంటున్నారు. 

ఎడారిలో దారి సరిగా  వుండదు ప్రభువు అలాంటి ప్రదేశంలో  విశాలవంతమైన ప్రాంతంలో దారులు వేస్తానని పలుకుచున్నారు. యోహా 14:6. ఆయన చెంతకు రావటం వల్లన మనం క్రొత్త  బాటలో  ప్రయాణం చేస్తాం - ముగ్గురు జ్ఞానులు  వేరొక మార్గం అనుసరించారు. మత్త 2:12. 

మార్గం, గమ్యం తెలియకుండా జీవించే మన బ్రతుకులకు దేవుడు దారిని చూపిస్తారు మనకు క్రొత్త జీవితం దయ చేస్తారు. 
మరు భూమిలో త్రోవ  వేస్తారని అంటున్నారు అంటే పనికి రాని నేలను కూడా సక్రమంగా వినియోగిస్తారని తెలుపుచున్నారు. 

ఎడారిలో దేవుడు నీటిని ఒసగటమే కాదు, నదులు, పారిస్తాను అని తెలుపుచున్నారు. నిర్గ 17:1-7. యోషయా 35:6-7. 
ప్రజల యొక్క దాహం తీర్చుతానని ప్రభువు పలుకుచున్నారు. దేవుడు తన ప్రజల కోసం ఎంతటి గొప్ప కార్యమైన చేయుటకు సిద్ధంగా ఉన్నారు. 
ఆయన వారి పాపాలు క్షమించుటయే కాదు ఇంకా వారు సంతోషంగా  జీవించుటకు దేవుడు అవకాశంను ఇస్తున్నారు. 
మన యొక్క జీవితంలో ఎదుటి వారి పాపాలు గుర్తించుకొక  అవసరం లేదు వారికి  రెండో ఛాన్సు ఇచ్చి మంచిగా జీవించేలా చేయాలి. 
రెండవ పఠనంలో పౌలుగారి యొక్క జీవితం గురించి తెలుపుచున్నారు. ఆయన జీవితం మొత్తం కూడా దేవుని కృపను పొందడానికే ప్రయత్నం చేశారు. 
తన యొక్క సువార్త పరిచర్యలో అదే విధంగా క్రీస్తును తెలుసుకొన్న జ్ఞానం వలన ఆయన ఏమంటున్నారంటే ఆయన యొక్క జ్ఞానం పొందుటకు నేను సమస్తమున పూర్తి నష్టముగా పరిగణిస్తున్నాను అని పలుకుచున్నారు. 

దైవ జ్ఞానం  వుంటే దేవుడినే కలిగిఉంటాం. ఆయన కొరకు ఇహలోక జ్ఞానం  అంతా విడిచి పెడతాం. ఆయన కొరకు సమస్తం విడిచి పెడతాం. 
క్రీస్తును  పొందటానికి సమస్తము చెత్తగా భావిస్తున్నాను అని తెలుపుచున్నారు. మనకు దేవుని యొక్క విలువ తెలిసినప్పుడు ఆయన్ను కలిగి ఉండటానికి ఏదైనా విడిచిపెడతాం. 

దేవుని కన్నా ఏ  వస్తువు , మనుషులు మిన్న కాదు అని గ్రహిస్తాం. ఆవిలాపురి తెరేసమ్మ గారు అంటారు HE WHO HAS GOD WANTS NOTHING, GOD ALONE SUFFICES అని దేవుడిని కలిగిన వ్యక్తికి ఈ లోకంలో ఏది అవసరం లేదు, ఆ ప్రభువు మాత్రం చాలు అని . 

అధే విధంగా దావీదు ప్రభువే నాకు కాపరి నాకు ఇక ఏ కొదవయు లేదు అని . కీర్తన 23:1 
వారికి దేవుని యొక్క విలువ తెలిసింది కాబట్టియే దేవుని కొరకు మిగతా ఏదైన వ్యర్ధంగా భావించారు. మనకి కూడా దైవ అనుభూతి , దైవ జ్ఞానం ఉంటే దేవుని కోసం మిగతా అనీ చెత్తగా భావిస్తాం. 

పౌలు గారు యొక్క కోరిక 10 వ వచనంలో తెలుస్తుంది దేవునికి సంభందించిన జ్ఞానం పొందాలనుకుంటున్నారు.అపో 22:3 . దైవ జ్ఞానం మనకు మంచి ఏదో, చెడు ఏదో తెలుపుతుంది. మనం కూడా క్రీస్తుకు సంబందించిన జ్ఞానంను సంపాదించుకోవాలి. అది మనకు పవిత్ర గ్రంధంను చదవటం ద్వారా తెలుస్తుంది. 

పౌలు గారు కూడా గమాలియేలు దగ్గర నేర్చుకున్నారు ఆయన పొందిన జ్ఞానం వల్లనే క్రీస్తును ప్రకటించ గలుగుతున్నారు. మనం కూడా దైవ అనుభూతి , దైవ జ్ఞానంకలిగి ఉంటే ఆయన గురించి నలుగురికి చాటి చెప్పవచ్చు. దాని కోసం అనుదినం ప్రయత్నం చేయాలి. 

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు  వారు వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని క్షమించి ఆమెకు మంచి జీవితం జీవించుటకు రెండవ అవకాశం గురించి ధ్యానించుకుంటున్నాం. 

యేసు ప్రభువు ఓలివు పర్వతమునకు వెళ్ళేను. తెల్లవారిన తరువాత  యధావిధిగా దేవాలయంకు వెళ్ళినప్పుడు ప్రజలు ఆయన భోదనలు వినటానికి ముందుగానే వచ్చేవారు. లూకా 21:37-38. 
ఇక్కడ ఒక విషయం మనం అర్ధం చేసుకోవాలి. యేసు ప్రభువు చాలా సార్లు దేవాలయంకు ప్రార్ధించుటకు వెల్లుచున్నారు, వాక్యం ప్రకటించుటకు వెల్లుచున్నారు. పాపం , పుణ్యం గురించి ప్రజలకు భోధిస్తున్నారు. అది ప్రభువు చేసే మంచి పని. 

సువార్త ప్రకటన చేసే సమయంలో ప్రభువును కొందరు పరీక్షకు గురిచేస్తున్నారు. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని గురించి ఆయన్ను పరీక్షిస్తున్నారు. 

చాలా సందర్భాలలో తన తప్పులను దాచుకోవడం ఇతరుల తప్పులను వ్రేలెత్తి చూపటం సాధారణంగా మనకు కనిపించే మానవ స్వభావం. 

పరిసయ్యులు, ధర్మ శాస్త్ర భోదకులు ఎదుటివారి తప్పులు గురించే  ఆలోచించారు కానీ తమ తప్పులూ ఆలోచించడం లేదు. వారు తమను తాము సమర్ధించుకొనేవారు. లూకా 18:9-14. 

వారి యొక్క పాపపు జీవితం ఎన్నడూ వారికి గుర్తుకురాలేదు. అందుకే వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని శిక్షించాలనుకున్నారు. వాస్తవానికి మోషే ధర్మ శాస్త్రం ప్రకారం  వ్యభిచారం చేసే వారికి మరణ శిక్ష విధించాలి. లెవీ 20:10, ద్వితీ 22:13-24. 
పరిసయ్యులు యేసుప్రభువును పరీక్షకు గురిచేయాలనుకుంటే దేవుడే వారిని పరీక్షకు గురిచేస్తున్నారు. యూదుల ఆచారం ప్రకారం వారిలో అందరికన్నా పెద్ద మనిషిని ఆమె మీద రాయి విసరమన్నారు కాని అక్కడ ఎవరు ఆ పని చేయలేదు.వారిలో కూడా హృదయ పరివర్తన కలుగుతుంది. వారు కూడా పాపాత్ములమే అని గ్రహిస్తున్నారు. ఒకరి తరువాత ఒకరు వెళ్లి పోవుచున్నారు.ఈ యొక్క సంఘటన లో దేవుని యొక్క గొప్ప కనికరం మనకు కనపడుతుంది. దైవ ప్రేమ మానవ దీన స్థితిని కలిసినప్పుడే దేవుని కనికరం పుడుతుంది.ప్రేమ కలిగిన దేవుడు పడిపోయిన పాపి దిన స్థితిని చూసినప్పుడు కనికరం చూపిస్తున్నారు.యేసు ప్రభువు ఆమెలో కలుగబోయే మార్పును చూసారు. అందుకే ఆమె వైపు కరుణతో చూసారు. ఆమె జీవితంను మార్చుకోమని ప్రభువు చెబుతున్నారు.
వ్యభిచారం లో పట్టుపడిన స్త్రీ పాపం యేసు ప్రభువు సమర్ధించలేదు.పాపం చేసిన ఫర్వాలేదు అని చెప్పలేదు.కాని ఆయన యొక్క వైఖరిలో క్రొత్తధనం ఉంది.నేను నిన్ను ఖండించను, నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను, నీ జీవితంను చక్కబెట్టుకో అని ప్రభువు తనకు అవకాశం ఇస్తున్నారు. ఆమె హృదయ పరివర్తన చెందుటకు, పాపంను విడచి పెట్టుటకు దేవుడు ఆమెకొక అవకాశం ఇచ్చారు.
పరిసయ్యులు ఆమెను శిక్షించాలనుకున్నారు, కాని ప్రభువు ఆమెను రక్షించారు.పరిసయ్యులు ధర్మ శాస్త్ర బోధకులు క్రూరంగా హింసించాలనుకున్నారు. దేవుడు మాత్రం కరుణ చూపించారు. పరిసయ్యులు అధికారాన్ని, నీతిమంతమైన జీవితాన్ని చూపించాలనుకున్నారు, కాని ప్రభువు దైవ ప్రేమ జీవితాన్ని చూపించారు.
ఇప్పటి వరకు చేసిన పాపాలను దేవుడు క్షమించి అవకాశం ఇస్తున్నారు కాబట్టి జీవితం ను బాగు చేసుకోవాలి.
మనం కూడా మన బలహీనతలవల్ల పాపం చేస్తాం. భర్తలు భార్యలను, భార్యలు భర్తలను మోసం చేస్తారు.బిడ్డలు తల్లి తండ్రులను ,తల్లి తండ్రులు బిడ్డలను మోసం చేసి జీవిస్తారు. మనం పాపం చేసి జీవిస్తాం కాబట్టి ఇంకొక అవకాశం ఇచ్చినప్పుడు దానిని సరిగా వినియోగించుకోవాలి.
ఈ సువార్త ద్వారా దేవుడు ఆమె పాపాలను క్షమిస్తూ, ఆమెకు ఒక క్రొత్త జీవితం జీవించుటకు అవకాశం ఇస్తున్నారు, మనం కూడా మన స్నేహితులకు ఒక అవకాశం ఇవ్వాలి.భర్త భార్యకు , భార్య భర్తకు అవకాశం ఇస్తూ , క్షమించుకొని, అంగీకరించుకొని జీవించాలి. 
దేవుని దయ, కనికరం, ప్రేమ చాలా గొప్పవి, ఆయన ఇచ్చిన ప్రతి అవకాశం హృదయ పరివర్తన చెందుటకు, మంచిగా జీవించుటకు వినియోగించుదాం.
ఒకరి పట్ల ఒకరం కనికరం, ప్రేమ, సానుభూతి కలిగి జీవించుదాం.
Rev. Fr. Bala Yesu OCD

26, మార్చి 2022, శనివారం

తపస్సు కాల 4 వ ఆదివారం

తపస్సు కాల 4 వ ఆదివారం

యెహోషువ 5: 9, 10-12 , 2వ కొరింతి 5: 17-21 , లూకా 15: 1-3, 11-32.

ఈ నాటి ఆదివారమును తల్లి శ్రీసభ ఆనందించు ఆదివారం అని ప్రకటిస్తుంది.

-రాబోయేటటువంటి పునరుత్తానా రోజులను స్మరించుకొని మనందరం సంతోషంతో ఉండాలని ఈ ఆదివారం యొక్క ఉద్దేశం.

-ఈనాటి మూడు దివ్య పఠనాలు కూడా ఆనందించుటను గురించి బోధిస్తున్నాయి.

-తపస్సుకాలపు నాల్గొవ ఆదివారంలోకి ప్రవేశించాం ఇక కొన్ని రోజులలో ప్రభువు యొక్క సిలువ శ్రమలు, మరణ పునరుత్తానం లో బాగస్తులమై జీవించ బోతున్నాం కాబట్టి మనం ఆనందించాలి. 

-మనకు మేలు జరుగుతుందని ఆనందించాలి, మనం రక్షణ పొందే గడియ ఆసన్నమగుచున్నదని ఆనందించాలి.

-ప్రతి ఒక్కరం ఆనందంగా ఉండాలని కోరుకుంటాం అందుకోసం రోజు చాల ప్రయత్నం చేస్తుంటాం.

-మనందరం మన యొక్క కుటుంబాలలో ఆనందంగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ శ్రమలు అనుభవించారు.

-మనము ఈ తప్పస్సుకాలములో దేవునితో మరియు తోటి మానవునితో సక్యపడి జీవించాలి అప్పుడు మనలో నిజమైన సంతోషం ఉంటుంది. 

- ఈనాటి మొదటి పఠనంలో ఇశ్రాయేలు ప్రజలు స్వేచ్ఛతో ఆనందంగా చేసుకున్న పండుగను గురించి చదువుతున్నాం. 

-దేవుడు ఇశ్రాయేలుకు స్వేచ్ఛనిచ్చిన పండుగ వారు ఆనందంగా కొనియాడుచున్నారు.

-మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దత భూమికి ప్రయాణం చేయసాగారు. ఆయన తరువాత ఇశ్రాయేలును వాగ్దత భూమికి నడిపించింది యెహోషువ ప్రవక్తయే.

-మోషే కేవలం ఇశ్రాయేలీయులను వాగ్దత భూమికి దగ్గరకు మాత్రమే వారిని నడిపించారు, కానాను ప్రాంతంలో ఆయన అడుగు పెట్టలేదు. తన శిష్యుడైన యెహోషువ మాత్రమే ప్రజల తోటి అందు ప్రవేశించారు .

-యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దత భూమిలో ప్రవేశించిన ప్రదేశానికి “గిల్గాలు” అనే పేరు వచ్చింది.

-గిల్గాలు అంటే పన్నెండు రాళ్ల వృత్తం అని అర్థం. ఈ పన్నెండు రాళ్లూ యాకుబు యొక్క 12 మంది కుమారులయొక్క జాతులకు చిహ్నం గా ఉన్నవి. యెహోషువ 4 :2 -3 .

-ఈ పన్నెండు రాళ్లతో దేవుని యొక్క బలిపీఠమును నిర్మిస్తున్నారు. ఈ రాళ్లు ఎందుకంటే దేవుడు చేసిన మేలు తలంచు కోవటానికి ఇశ్రాయేలు ప్రజలు దివ్యమందసంతో యోర్దాను నది దాటేటప్పుడు దేవుడి వారికి ఆరిన నేలను చేశారు. నదిలో నడిచి వెళ్ళుటకు దేవుడు మార్గం సిద్ధంచేశారు. ఆయన మేలులు గుర్తుంచుకొనటంకు ఈ బలిపీఠం నిర్మిస్తున్నారు. యెహోషువ 4 :7 .

-ఈ పన్నెండు జాతులలో దేవుడు తన ప్రజలను నియమించెను, వారిని తన బిడ్డలుగా ఎన్నుకొనెను.

వాగ్దత భూమిలో ఇశ్రాయేలు ప్రజలు ఆనందంతో జరుపుకున్న తోలి పాస్కా పండుగ గురించి వింటున్నాం.

-యావే దేవుడు అంటున్నారు " నాటి అపకీర్తిని నేను మీనుండి తొలగించితిని" అని చెపుతున్నారు.

-వారియొక్క అపకీర్తి ఏమిటంటే సున్నతి పొందక పోవడమే యెహోషువ 5: 4 - 5.

-ఐగుప్తు దాటినా తరువాత ఎడారిలో జన్మించిన వారు సున్నతి పొందలేదు. యూదులు దేవుని బిడ్డలుగా ఉండుటకు సున్నతి చాల అవసరం. ఆది 17 : 10 -11 .

-సున్నతి చేయుట ద్వారా వారందరు అబ్రహం సంతతిగా పరిగణించబడతారు. దీనివలన దేవుని యొక్క మన్ననను   పొందుచున్నారు.

-ఈ అపకీర్తి అంటే ప్రజలయొక్క దురాలోచనలు దేవుడు తొలగించారు. ఎప్పుడెప్పుడు ఐగుప్తుకు తిరిగి వెళ్లాలన్న ఆలోచనలను అన్నింటిని దేవుడు తొలగించారు. ఇంకొక విధంగా చెప్పాలంటే అపకీర్తి అంటే బానిసలుగా వున్నవారికి స్వేచ్ఛనిచ్చి గౌరవించటం .

-దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చి వారికి ఒక గుర్తింపునిచ్చారు. దానివలన వారియొక్క అపకీర్తి అంతా తొలగి పోయింది.

-మన జీవితాలలో ఉన్న అపకీర్తిని కూడా దేవుడు తొలగించి మనల్ని రక్షిస్తాడు.

-వాగ్దత భూమిలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతో ఆనందంగా తోలి పంటను రుచి చూశారు.

-అక్కడ మన్నా ఆగిపోయినది. ఎందుకంటే ఇక వాగ్దత భూమిలో పండించే పంట సమృద్ధిగా ఉంటుంది కాబట్టి దేవుడు మన్నాను ఆపివేశారు . దేవుడు వారికి ఎటువంటి కొరత రాకుండా చూస్తారు. 

-ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆనందం చూస్తున్నాం.

-ఈ నాటి రెండవ పఠనంలో మనం క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి అని పలుకుచున్నారు. 

-మనందరం క్రొత్త వాళ్లమైతే చాల సంతోషంగా, మంచిగా ఉంటుంది. మనయొక్క కుటుంబ సభ్యులకు అలాగే దేవునికి ఆనందంగా ఉంటుంది. 

-మనం నిజంగా క్రీస్తునందు జీవిస్తే నూతన సృష్టిగా చేయబడతాం. కొరింతు సంఘంలోని ప్రజలు దేవుణ్ణి నమ్ముకొని జ్ఞాన స్నానం పొందటం ద్వారా ఒక నూతన సృష్టిగా చేయబడుచున్నారు.  మనం దేవుని యందు ఉంటే మన జీవితాలు కూడా మారుతాయి.

-దానికి నిదర్శనం పౌలు గారి జీవితమే. గలతీ 2 : 20  ఇక నాలో జీవించేది నేను కాదు క్రీస్తుయే అని పౌలు గారు పలుకుచున్నారు.

-క్రీస్తునందు ఎవరైనా ఉండాలంటే ఈ లోకంలో వున్న చెడును విడిచిపెట్టి దేవుడిని వెంబడించాలి.

-క్రీస్తునందు ఉండాలంటే మనలో పరిత్యజించుకునే లక్షణం ఉండాలి. ఆయన యందు ఉండటం కోసం ఏదైనా త్యాగం చేసే గుణం మనలో ఉండాలి.

-క్రైస్తవులుగా మనం క్రొత్తవ్యక్తులుగా మారడానికి మన యొక్క సొంత శక్తి ప్రయత్నం కాదు కానీ తండ్రి దేవుడు మనమీద చూపిన దయవలనే అది కారణం. 

-పౌలు గారు తనకు దేవుడు అప్పచెప్పిన పరిచర్యగురించి కూడా తెలుపుచున్నారు. క్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మానవులతో ఏర్పరిచిన సఖ్యత గురించి భోదించటమే దేవుడిచ్చిన పని అని తెలుపుచున్నారు. 

-సఖ్య పడి జీవించమని పౌలుగారు పలుకుచున్నారు. 2 కొరింతి 5: 20.

సఖ్య పడితే దేవునికి ఇష్టమే మన పొరుగువారికి ఇష్టమే ఇద్దరుకూడా సంతోషంగా ఉండగలరు.

-మనం సఖ్య పడాలంటే దేవుని యందు ఉండాలి. ఆయన యందు లేకపోతె మన జీవితాలు మారవు. 

-మోషే 40 రోజులు దేవుని యందు ఉన్నారు ఆయన ముఖం ప్రకాశవంతంగా మారింది. 

-పేతురు దేవునియందు ఉన్నారు. ఆయన జీవితం మారిపోయింది .

-జక్కయ్య జీవితం, వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ, వీరి జీవితాలు మారిపోయాయి.

మనం కూడా క్రీస్తునందు జీవిస్తే మనం కూడా మారతాం. కానీ మనం ఎక్కువగా క్రీస్తునందు జీవించము. ఆయన యొక్క సాన్నిధ్యం మనలను మార్చివేస్తుంది. పౌలుగారి యొక్క జీవితమును మార్చివేసింది. 

-క్రీస్తునందు జీవించాలంటే ఇహలోక వాంఛలకు దూరంగా ఉండాలి అప్పుడు దేవునియందు మనం ఉండగలం. 

-ధనికుడైన యువకుడు క్రీస్తులో ఉండకుండా ధనం వెంబడి పోయాడు. యేసు ప్రభువుయొక్క శిష్యులు తనతో ఉన్నారు, కాబట్టి సామాన్యులైన వారి జీవితాలు చాలా మారిపోయాయి.

-క్రీస్తునందు మనం కూడా జీవిస్తే మనం నూతన వారిగా చేయబడతాం. పాతవి నశించి క్రొత్తవి ఏర్పడతాయి. కాబట్టి క్రీస్తునందు జీవిస్తే నూతన జీవితం, నూతన ఆలోచనలు, మాటలు అన్ని ఉంటాయి.

-ఈనాటి సువిశేష పఠనంలో దేవుని యొక్క గొప్ప ఆనందం గురించి వింటున్నాం.

కేవలం తండ్రియొక్క ఆనందం మాత్రమే కాదు ఇక్కడ మనం చూసేది తప్పిపోయిన కుమారుడి ఆనందం కూడా ఎందుకంటే నిరాకరించిన తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి కుమారుణ్ణి ఏమి అనకుండా ఆయన్ను స్వీకరించారు, అందుకు కుమారుడు చాల ఆనందంగా ఉన్నారు. 

-లూకా సువార్త 15 వ అధ్యాయం మొత్తం కూడా తప్పిపోయిన వాటిగురించి భోదిస్తుంది.

-తప్పిపోయిన గొర్రె 

-తప్పిపోయిన నాణెము 

-తప్పిపోయిన కుమారుడు.

-తప్పిపోయిన గొర్రె, నాణెముల ఉపమానములు తప్పిపోయిన కుమారిని ఉపమానంకు ఒక వ్యత్యాసం ఉంది.

-తప్పిపోయిన గొర్రె, మరియు నాణెముల ఉపమానాలతో స్వయంగా దేవుడే, యజమానుడే వాటిని వెదకుచున్నారు కానీ తప్పి పోయిన కుమారుని యొక్క ఉపమానంలో తండ్రి కుమారుని వెదకటం లేదు, కుమారునికి స్వేచ్ఛనిచ్చారు. తనయొక్క స్వేచ్ఛ జీవితంలో కుమారుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్నారు. మిగతా వాటికన్నా మానవుణ్ణి దేవుడు ఎక్కువగా ప్రేమించారు. అందుకే స్వేచ్ఛనిచ్చి ఎప్పుడు తన చెంతకు పశ్చాత్తాప పడి తిరిగి వస్తాడని ఎదురు చూశారు, తండ్రి. 

-ఈ సువార్త పఠనంలో చాల విషయాలు మనం ధ్యానించుకోవచ్చు దేవుని యొక్క గొప్ప దయా హృదయం మనకు ఇక్కడ అర్థమగుచున్నది దేవుడు మనలను ఎంతగా క్షమిస్తారో తెలుస్తుంది.

తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానంలో మూడు ముఖ్యమైన పాత్రలున్నాయి. 

-తండ్రి- అనంత ప్రేమ కలిగిన తండ్రి 

-చిన్నకుమారుడు -తప్పిపోయిన కుమారుడు.

-పెద్దకుమారుడు -నటించే పెద్దకుమారుడు 

-కొన్ని సందర్భాలలో ఈ ముగ్గురు వ్యక్తులు పోలినవారంగా మనందరం ఉంటాం. 

-ఈ ఉపమానం ప్రభువు తెలుపుటకు కారణం ఏమిటంటే పరిసయ్యులు సద్దుకయ్యలు తాము నీతిమంతులమని చెప్పుకొనుచు పశ్చాత్తాప పడకుండా ఇతరులను హీనంగా చూస్తున్నారు కాబట్టి దేవుడు పాపులను సుంకరులను ఎలాగా ఆదరిస్తారో ఈ యొక్క ఉపమానం ద్వారా తెలియచేస్తున్నారు. 

-ఆ నాటి యుద్ధ సమాజంలో అలాగే నేటి ఆధునిక యుగంలో మూడు వర్గాల ప్రజలను సూచిస్తున్నాయి ఈ మూడు పాత్రలు. 

తమ పాపాలకు పశ్చాత్తాప పడి దేవుని చెంతకు తిరిగి వచ్చిన పాపాత్ములు -చిన్న కుమారునికి సూచనగా ఉన్నారు. 

-పశ్చాత్తాపంతో తన చెంతకు తిరిగి వచ్చి క్షమించమని కోరినప్పుడు వెంటనే క్షమించి తన చెంత చేర్చుకోవటానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్న దేవుణ్ణి -తండ్రికి సువార్తలో సూచనగా ఉంది.

-మూడవ పాత్ర దారులు - మేము మాత్రమే నీతిమంతులమని చెప్పుకొనే యూదులు పెద్దకుమారునికి సూచనగా ఉన్నాయి. యూదులు ఎప్పుడు కూడా విమర్షించే వారే దేవుని దయను, ప్రేమను సరిగా అర్థం చేసుకోకుండా ఆయన్ను విమర్షించారు, నిందించారు.

ఈ మూడు పాత్రలను గురించి తెలుసుకుందాం. 

చిన్నకుమారుడు- చిన్న కుమారుణ్ణి మనం తప్పి పోయిన కుమారునిగా పిలుస్తున్నాం. 

చిన్నకుమారుడు తండ్రి నుండి స్వేచ్ఛను కోరుకొని తన తండ్రి సంపదనుండి  తన హక్కుగా రావలసిన మూడవ వంతు వాటాను బలవంతంగా పంచుకొని వెళ్ళాడు.

-తండ్రియొక్క విలువను, ప్రేమను, ఆయన చూపించే ఆ యొక్క ఆదరణను గ్రహించలేకుండా చిన్న కుమారుడు తండ్రితో వున్న భందమును తెంచుకొని తన యొక్క సొంత ఆనందాలు అనుభవించటానికి దూరంగా వెళ్లుచున్నాడు, తండ్రి ప్రేమను తిరస్కరించి వెళ్తున్నాడు. 

-జల్సా చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతూ, తన ఆస్తినంతా పోగొట్టుకొని చివరికి ఒక హీనమైన పని చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. ఎవ్వరుకూడా ఏమి ఇవ్వలేదు అంత దురదృష్టకరమైన స్థితి 15 : 16 .

-తనకు ధనమున్న క్షణంలో ఏమి గుర్తుకు రాలేదు. తన తండ్రి కూడా గుర్తుకు రాలేదు. కానీ అన్ని కోల్పోయిన్నప్పుడు తండ్రి గుర్తుకు వస్తున్నాడు. 

-మనజీవితంలో కూడా చాలా మందికి డబ్బున్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. చిన్న కుమారుని వలే జీవిస్తాం. 

తనయొక్క హీన స్థితిలో కను విప్పు కలిగెను అని 17 వ వచనంలో చెప్పబడింది. 

-ఈ కనువిప్పు మనలో కూడా కలగాలి. నేను ఎలాంటి తప్పు చేశానని కనువిప్పు కలిగింది . కనువిప్పు అంటే చేసిన తప్పు తెలుసుకోవడమే.

-చేసిన తప్పు మనస్సుకు గుర్తుకు వచ్చి చిన్న కుమారుడు పశ్చాత్తాప పడుచున్నాడు. తన తండ్రి యొక్క ప్రేమను గుర్తించుకుంటున్నారు, ఆయన చేసిన పాపలు క్షమించాలని కోరుకుంటానని ఆలోచన చేస్తున్నాడు. 

-మనజీవితంలో తండ్రిని కాదని స్వేచ్ఛగా జీవించాలనుకుంటే మన జీవితాలు కూడా దారుణంగా మారతాయి. చిన్న కుమారుడి జీవితం తండ్రితో వున్నప్పుడు ఒక విధంగా ఉంది తండ్రితో లేనప్పుడు ఇంకొక విధంగా ఉంది. ఆయన ఆకలితో అలమటించారు. తండ్రి దగ్గర అంతా సమృద్ధిగా పొందాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి విలువ తెలుసుకోలేదు. 

-ఈ చిన్న కుమారుడు తానూ పాపం చేశానని గ్రహించి తండ్రి చెంతకు వెళ్లుచున్నాడు.

18 వ వచనంలో "వాడు లేచి " తండ్రి వద్దకు వెళ్లాలనుకున్నాడు మనం నడవాలంటే ముందుగా కూర్చున్న స్థలం నుంచి లేవాలి. 

-మనం ఎక్కడ నుండి లేవాలంటే మన పాపపు స్థితి, వ్యసనాల నుండి లేవాలి. మనయొక్క చెడు గుణాలనుండి లేవాలి . పొరుగు వారితో సఖ్య పడటానికి కూడా లేచి నడవాలి, మనయొక్క దీన స్థితి నుండి లేవాలి అప్పుడు దేవునితో పొరుగు వారితో సక్యపడి మంచి జీవితం జీవించాలి.

చిన్న కుమారునికి తండ్రి మీద ఉన్న నమ్మకం వల్లనే ఆయన చెంతకు తిరిగి రావాలను కున్నాడు. మనం కూడా తిరిగి రావాలి. తిరిగి రావాలంటే 

-దేవునితో కలిసి ఉండటానికి తిరిగి రావాలి

-కుటుంబ సభ్యులతో కలిసి ఉండుటకు తిరిగి రావాలి 

-భార్య, భర్తతో, కలిసి ఉండటానికి తిరిగి రావాలి. 

అందుకే దేవుడు ఇప్పుడైనా తిరిగి రమ్మంటున్నారు. యావేలు 2 : 12 -13 .

-చిన్న కుమారుడు- తప్పిపోయాడు -తన యొక్క సొంత ఆలోచనలవల్ల, జల్సాల వల్ల తప్పిపోయాడు. తండ్రిని అర్థం చేసుకోవడంలో తప్పిపోయాడు -తండ్రిని ప్రేమించుటలో తప్పిపోయాడు, తండ్రని గౌరవించుటలో తప్పిపోయాడు. తనయొక్క బాధ్యతలు నిర్వహించుటలో తప్పిపోయాడు- విధేయత చూపటంలో తప్పిపోయాడు. 

-మనం కూడా చాలా విషయాలలో తప్పిపోతున్నాం;

-ప్రార్థించుటలో తప్పిపోతున్నాం.

-ఈ లోక కోరికలకు తప్పిపోతున్నాం. 

-దేవుని సన్నిధికి రావటంలో తప్పిపోతున్నాం. ఇంకా చాలా విషయాలలో తప్పిపోతున్నాం.

-చిన్న కుమారునిలో వున్నా గొప్ప లక్షణం ఏమిటంటే తండ్రి చెంతకు తిరిగి రావాలనుకోవడం, సఖ్య పడి క్షమించమని అడగటం. మనకు నచ్చిన విధంగా మనం జీవించి పాపము చేసిన సందర్భంలో పాపాలకు పశ్చాత్తాప పడి దేవుని చెంతకు తిరిగి వచ్చి క్రొత్త జీవితం జీవించాలి. 

-చిన్నవాని వలే మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకొని మన జీవితమును సరిచేసుకొని జీవించాలి. మనలో ఎలాంటి మార్పు అవసరమో అని మనకు తెలిస్తే మన జీవితాలు మనం మార్చుకోవచ్చు.

2. తండ్రి - దేవుడు 

-తనను కాదని వెళ్లిపోయిన కుమారున్ని తండ్రి క్షమించాడు ఆదరించాడు. 

-తండ్రియొక్క సహనంకు, ప్రేమకు ఎలాంటి హద్దులు లేవు తన కుమారునికి మేలిమి వస్త్రాలు ఇవ్వమని చెప్పుచున్నారు. 

-తన కూమారుని పట్ల అనంతమైన ప్రేమను దయను చూపిస్తున్నారు ఆయన దయ కుమారుని యొక్క అన్ని పాపాలను మరచి పోతుంది. 

-తండ్రి కూమారునికి స్వేచ్ఛనిచ్చారు, ఆస్తిని పంచిపెట్టారు, కుమారుడు ఏది కావాలన్నా తండ్రి ఇచ్చారు, అది ఆయన యొక్క గొప్పతనం. 

-తండ్రి కుమారుని యొక్క రాక కోసమై, కూమారుని హృదయ పరివర్తన కోసమై ఎంతో ఎదురు చూశారు. తన బిడ్డలయెడల ఆయన ప్రేమ అలాంటిది. 

-తండ్రి ప్రేమ అర్థం చేసుకునే ప్రేమ -దేవుని ప్రేమ క్షమించే ప్రేమ -దేవుని మనస్సు స్వీకరించే మనస్సు.

-కుమారుడు పలికినది ఒకే ఒకమాట "తండ్రి నీకును పరలోకంకు విరుద్ధంగా పాపం చేశాను అన్నాడు. అది కూడా తండ్రి సరిగ్గా విన్నాడో లేదో కానీ కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తనను బిడ్డలాగే స్వీకరించి ఆయన్ను గౌరవించి విందు చేస్తూ ఆనందమును వ్యక్తం చేస్తున్నారు.

-మనం కూడా దేవునివలె మంచి మనస్సు ఉండాలి. క్షమించమని అడిగిన వారిని క్షమించి స్వీకరించాలి.


3. పెద్ద కుమారుడు - ఆయన నటించే కుమారుడు 

వాస్తవానికి ఆయన తండ్రి దగ్గర రోజు గడిపినప్పటికీ తండ్రి హృదయం తెలుసుకోలేక పోయాడు. 

-తమ్ముడు యొక్క రాకను అంగీకరించలేక పోయాడు. ఆయన అనుకోని వుండవచు, మళ్లి   ఆస్తి తీసుకొని పోవటానికి వచ్చాడని. తమ్ముడి పట్ల ఈర్ష జీవిస్తున్నాడు. జీవిస్తున్నాడు.

-పెద్దవానికి తండ్రి పట్లగాని, తమ్ముడి పట్ల గాని నిజమైన ప్రేమలేదు అతడు ఇద్దరినీ నిందించాడు. ఇద్దరి మీద కోపపడుచున్నాడు. కనీసం ఇంటిలోకి రావటానికి కూడా ఇష్టం లేకున్నాడు. 

-పెద్దకుమారుడు తండ్రి దగ్గర ఒకే ఇంటిలో జీవించిన తండ్రి మనస్సుకు దూరంగా ఉన్నాడు.

-పరిసయ్యులు సద్దుకయ్యలు అందరుకూడా దేవుని చేత ఎన్నుకొనబడి ప్రజలని దేవుని ఇష్టమైన బిడ్డలని చెప్పుకునే వారే. వాస్తవానికి వారు దేవుని హృదయానికి దూరంగా జీవించేవారే, ఇతరులను అంగీకరించకుండా జీవించేవారు.

-మన సమాజంలో కూడా ఇలాంటి మూడు పత్రాలు కలిగిన వారిని మనం చూస్తున్నాం. మరి ఈనాడు మనం ఎవరిని పోలి జీవిస్తున్నాం ?

-క్షమించే తండ్రినా?

-చేసిన తప్పులు తెలుసుకొని తిరిగి వచ్చిన చిన్నవాడినా?

-తండ్రిని అర్థం చేసుకోకుండా నిందించే పెద్దవాడినా?

-మనం దేవుని చెంతకు మరలి వస్తే, సఖ్య పడి జీవిస్తే, హృదయం పరివర్తనం చెందితే అందరూ ఆనందిస్తారు.


Rev. Fr. Bala Yesu OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...